Telugu: Unlocked Literal Bible for 1 Chronicles, 1 Corinthians, 1 John, 1 Kings, 1 Peter, 1 Samuel, 1 Thessalonians, 1 Timothy, 2 Chronicles, 2 Corinthians, 2 John, 2 Kings, 2 Peter, 2 Samuel, 2 Thessalonians, 2 Timothy, 3 John, Acts, Amos, Colossians, Daniel, Deuteronomy, Ecclesiastes, Ephesians, Esther, Exodus, Ezekiel, Ezra, Galatians, Genesis, Habakkuk, Haggai, Hebrews, Hosea, Isaiah, James, Jeremiah, Job, Joel, John, Jonah, Joshua, Jude, Judges, Lamentations, Leviticus, Luke, Malachi, Mark, Matthew, Micah, Nahum, Nehemiah, Numbers, Obadiah, Philemon, Philippians, Proverbs, Psalms, Revelation, Romans, Ruth, Song of Solomon, Titus, Zechariah, Zephaniah

Formatted for Translators

©2022 Wycliffe Associates
Released under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
Bible Text: The English Unlocked Literal Bible (ULB)
©2017 Wycliffe Associates
Available at https://bibleineverylanguage.org/translations
The English Unlocked Literal Bible is based on the unfoldingWord® Literal Text, CC BY-SA 4.0. The original work of the unfoldingWord® Literal Text is available at https://unfoldingword.bible/ult/.
The ULB is licensed under the Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
Notes: English ULB Translation Notes
©2017 Wycliffe Associates
Available at https://bibleineverylanguage.org/translations
The English ULB Translation Notes is based on the unfoldingWord translationNotes, under CC BY-SA 4.0. The original unfoldingWord work is available at https://unfoldingword.bible/utn.
The ULB Notes is licensed under the Creative Commons Attribution-ShareAlike 4.0 International License.
To view a copy of the CC BY-SA 4.0 license visit http://creativecommons.org/licenses/by-sa/4.0/
Below is a human-readable summary of (and not a substitute for) the license.
You are free to:
The licensor cannot revoke these freedoms as long as you follow the license terms.
Under the following conditions:
Notices:
You do not have to comply with the license for elements of the material in the public domain or where your use is permitted by an applicable exception or limitation.
No warranties are given. The license may not give you all of the permissions necessary for your intended use. For example, other rights such as publicity, privacy, or moral rights may limit how you use the material.

ఆదికాండం

Chapter 1

విశ్వ సృష్టి

1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.2భూమి 1 నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ2 ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

3దేవుడు <<వెలుగు కలుగు గాక>> అన్నాడు. వెలుగు కలిగింది.4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది- మొదటి రోజు3 .

6దేవుడు <<మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక>> అన్నాడు.7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది.8దేవుడు ఆ విశాల ప్రదేశానికి <<ఆకాశం>> అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది- రెండవ రోజు.

9దేవుడు <<ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి>> అన్నాడు. అలాగే జరిగింది.10దేవుడు ఆరిన నేలకు <<భూమి>> అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు <<సముద్రాలు>> అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.

11దేవుడు <<వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి>> అన్నాడు. అలాగే జరిగింది.12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.13రాత్రి అయింది, ఉదయం వచ్చింది- మూడవ రోజు.

14దేవుడు <<రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.15భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి>> అన్నాడు. అలాగే జరిగింది.

16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.17భూమికి వెలుగు ఇవ్వడానికీ,18పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.19రాత్రి అయింది. ఉదయం వచ్చింది- నాలుగో రోజు.

20దేవుడు <<చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి>> అన్నాడు.21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

22దేవుడు <<మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి>> అని వాటిని దీవించాడు.23రాత్రి అయింది. ఉదయం వచ్చింది- ఐదో రోజు.

24దేవుడు <<వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి>> అన్నాడు. అలాగే జరిగింది.25దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

26దేవుడు ఇలా అన్నాడు. <<మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి>> అన్నాడు.27దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

28దేవుడు వాళ్ళను దీవించి <<మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి>> అని చెప్పాడు.29దేవుడు ఇంకా ఇలా అన్నాడు. <<చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.

30భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి>> అన్నాడు. అలాగే జరిగింది.31దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది- ఆరవ రోజు.


1 1:2 అస్తవ్యస్తం గా
2 1:2 లేక దేవుని ప్రభావం, లేక దేవుని వాయువు. హీబ్రూ- రువాః.
3 1:5 యూదులకు ఒక దినం అంటే సాయంత్రం నుండి మరుసటిరోజు సాయంత్రం వరకు.

Chapter 2

1ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ1 పూర్తి అయ్యాయి.2ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు.3దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

సృష్టి రెండవ కథనం

4దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,5భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.6కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు2 పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.

7దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.8దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.

9దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.10ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
11మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది.12ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి.
13రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా3 దేశమంతటా ప్రవహిస్తున్నది.14మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.
15దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.16దేవుడైన యెహోవా <<ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు.17కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు>> అని మనిషికి ఆజ్ఞాపించాడు.
18దేవుడైన యెహోవా <<మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను>> అనుకున్నాడు.19దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.20అప్పుడు ఆదాము4 పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
21అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.22ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.
23ఆదాము <<ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.
మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి>> అన్నాడు.

24ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.25అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.


1 2:1 సమూహమంతా
2 2:6 దీనికి పొగ మంచు లేక ఆవిరి అని కూడా అర్థం ఉంది.
3 2:13 కూషు దేశం అంటే ప్రస్తుత ఇతియోపియా దేశం. సూడాన్లో కొద్ది భాగం కూడా కూషు దేశంలో ఉంది.
4 2:20 అంటే మనిషి.

Chapter 3

మానవ అవిధేయత, పాపం ప్రవేశం.

1దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో <<నిజమేనా? <ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు> అని దేవుడు చెప్పాడా?>> అన్నాడు.2స్త్రీ ఆ సర్పంతో <<ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు.3కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో <మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు> అని దేవుడు చెప్పాడు>> అంది.

4పాము స్త్రీతో <<మీరు చావనే చావరు.5ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు>> అన్నాడు.6స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

7అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.8సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.

9దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ <<నువ్వెక్కడ ఉన్నావు?>> అన్నాడు.10అతడు <<నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను>> అన్నాడు.11దేవుడు <<నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?>> అన్నాడు.
దేవుడిచ్చిన శిక్ష

12ఆదాము <<నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను>> అన్నాడు.13దేవుడైన యెహోవా స్త్రీతో <<నువ్వు చేసిందేమిటి?>> అన్నాడు. స్త్రీ <<సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను>> అంది.
14అందుకు దేవుడైన యెహోవా పాముతో <<నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.15నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు>> అన్నాడు.

16ఆయన స్త్రీతో <<పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు>> అని చెప్పాడు.
17ఆయన ఆదాముతో <<నువ్వు నీ భార్య మాట విని <తినొద్దు> అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.18నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు.19నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు>> అని చెప్పాడు.

20ఆదాము తన భార్యకు హవ్వ1 అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.21దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
ఆదాము హవ్వలను దేవుడు ఏదేను నుండి వెళ్ళగొట్టడం

22దేవుడైన యెహోవా <<ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు>> అన్నాడు.23దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.24కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.


1 3:20 హవ్వ అంటే జీవం

Chapter 4

కయీను, హేబెల్

1ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె <<యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను>> అంది.2తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.

3కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు.4హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.5కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.

6యెహోవా కయీనుతో <<ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు?7నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి>> అన్నాడు.

8కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు1 . వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.9అప్పుడు యెహోవా కయీనుతో <<నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?>> అన్నాడు. అతడు <<నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?>> అన్నాడు.
10దేవుడు <<నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు 2 మొరపెడుతూ ఉంది.11ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు.12నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు>> అన్నాడు.

13కయీను <<నా శిక్ష నేను భరించలేనిది.14ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు>> అన్నాడు.

15యెహోవా అతనితో <<అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను>> అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
కయీను సంతతి

16కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.17కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.

18హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి.19లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా.

20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.21అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు.22సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.

23లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. <<ఆదా, సిల్లా, నా మాట వినండి.
లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి.
నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను.
కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
24ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.>>
షేతు, ఎనోషు

25ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి <<కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు>> అంది.26షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను 3 ఆరాధించడం ఆరంభించారు.


1 4:8 పొలానికి వెళదాం పద అన్నాడు.
2 4:10 ప్రతీకారం కోసం.
3 4:26 అక్షరాలా యెహోవా పేరెత్తి పిలవడం మొదలు పెట్టారు.

Chapter 5

ఆదాము సంతతి
1 దిన 1:1-4

1ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.2వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.

3ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.4షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.5ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.

6షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.7ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.8షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.

9ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.10కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.11ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

12కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.13మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.14కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.

15మహలలేలుకు1 అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.16యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.17మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

18యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.19హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.20యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.

21హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.22మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.23హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.24హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.

25మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.26మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.27మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.

28లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.29<<భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు>> అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.

30లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.31లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.

32ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.


1 5:15 అంటే దేవునికి స్తుతి

Chapter 6

మానవ దుష్టత్వం

1మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు2దైవ కుమారులు1 మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.3యెహోవా <<జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు>> అన్నాడు.

4దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.

5మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.6తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.

7కాబట్టి యెహోవా <<నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను>> అన్నాడు.
నోవహు

8అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.

9నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.10షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.

11దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.12దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.

13దేవుడు నోవహుతో <<మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.14కోనిఫర్ కలపతో నీ కోసం ఒక 2 ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.15నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.

16ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి.17విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.

18కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు.19నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.

20అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి.21తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి>> అని చెప్పాడు.22దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.


1 6:2 పరలోక ఆత్మలు
2 6:14 పెద్ద పెట్టె

Chapter 7

జలప్రళయం

1యెహోవా <<ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి.2శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు,3ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.

4ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను>> అని నోవహుతో చెప్పాడు.5తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.

6ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.7నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు.

8దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో,9మగ, ఆడ, జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి.10ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.

11నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.12నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది.

13ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.14వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి.

15శ్వాస తీసుకోగలిగి, శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేశించాయి.16ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు.

17ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది.18నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది.

19ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి.20ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు1 ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.

21పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు.22పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి.

23మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి.24నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.


1 7:20 బైబిల్ మూర అంటే 7 మీటర్లు, లేక 22 అడుగులు

Chapter 8

జలప్రళయం అంతం

1దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.2అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది.3అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.

4ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.5పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.

6నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి7ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది.

8నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు.9భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు.

10అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.11సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.12అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.

13ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.14రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.

15అప్పుడు దేవుడు నోవహుతో,16<<నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.17పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి>> అని చెప్పాడు.

18కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు.19ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.
నోవహు యెహోవాకు బలి అర్పించడం

20అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు.21యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి <<వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.22భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు>> అని తన హృదయంలో అనుకున్నాడు.

Chapter 9

నోవహుతో దేవుని నిబంధన

1దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. <<మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.2అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.

3ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.4కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.

5మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను.6దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.7మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి>> అని వాళ్ళతో చెప్పాడు.

8దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,9<<వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,10మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.

11నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు>> అన్నాడు.

12దేవుడు <<నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే,13మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.

14భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది.15అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.

16ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను>> అన్నాడు.17దేవుడు <<నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే>> అని నోవహుతో చెప్పాడు.
నోవహు, అతని కుమారులు

18ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.19వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.

20నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు.21ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.

22అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు.23అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.

24అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.

25<<కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు>> అన్నాడు.
26అతడు <<షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక.

కనాను అతనికి సేవకుడవుతాడు గాక.

27దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక.

అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు.

అతనికి కనాను సేవకుడవుతాడు>> అన్నాడు.

28ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు.29నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.

Chapter 10

నోవహు కుమారుల సంతతి
1 దిన 1:5-23

1నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.

2యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.3గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.4యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.5వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.

6హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.7కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.

8కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.9అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి <<యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే>> అనే నానుడి ఉంది.10షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు1 , ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.

11ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,12నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.

13మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,14పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.

15కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,16హివ్వీ, అర్కీయు, సినీయ,17అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.18ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.

19కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.20వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.

21యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.22షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.23అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.

24అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.25ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.

26యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,27హదోరము, ఊజాలు, దిక్లా,28ఓబాలు, అబీమాయెలు, షేబ,29ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.

30వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.31వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.

32తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.


1 10:10 బబులోను

Chapter 11

బాబెల్ గోపురం

1అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.2వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు1 ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.

3వాళ్ళు ఒకరితో ఒకరు <<మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి>> అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.4వాళ్ళు <<మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి>> అని మాట్లాడుకున్నారు.

5యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.6యెహోవా <<ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.7కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి>> అనుకున్నాడు.

8ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.9అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
షేము సంతతి

10షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.11షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.

12అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.13అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

14షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.15షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

16ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.17ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.

18పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.19పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.

20రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.21రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.

22సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.23సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.

24నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.25నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
తెరహు వంశం

26తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.

27తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.28హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.

29అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.30శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.

31తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.32తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.


1 11:2 షీనారు అని రాసిన చోటల్లా బబులోను అని అర్థం

Chapter 12

అబ్రాముకు దేవుని పిలుపు

1యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. <<నీ దేశం నుంచి, నీ బంధువుల1 దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.2నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.3నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.>>

4యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.5అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.

6అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు.7యెహోవా అబ్రాముతో <<నీ వారసులకు2 ఈ దేశాన్ని ఇస్తాను>> అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.

8అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.9అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.
అబ్రాము, శారయి ఐగుప్తులో

10అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు.11అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో <<చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు,12ఐగుప్తీయులు నిన్ను చూసి, <ఈమె అతని భార్య> అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు.13నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు>> అన్నాడు.

14అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు.15ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు.16ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.

17అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు.18అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి <<నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?19ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు>> అని చెప్పాడు.20తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.


1 12:1 లేక నీవు పుట్టిన స్థలం.
2 12:7 లేక సంతానానికి

Chapter 13

అబ్రాము, లోతు ఒకరి నుండి ఒకరు వేరై పోవడం

1అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు.2అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి.

3అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు.4అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు.

5అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, 1 పరివారం ఉన్నాయి.6వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది.7ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.

8కాబట్టి అబ్రాము <<మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు.9ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను>> అని లోతుకు చెప్పాడు.

10లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది.11కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు.

12అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు.13సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.
అబ్రాము హెబ్రోనుకు పోవడం

14లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా <<నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు.15నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.
16నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు.17నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను>> అని అబ్రాముతో చెప్పాడు.18అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.


1 13:5 అక్షరాలా గుడారాలు

Chapter 14

అబ్రాము లోతును రక్షించడం

1షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో2ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమేబెరుతో, బెల (దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు) రాజుతో యుద్ధం చేశారు.

3వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.4ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.5పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,6శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు.

7తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు.

8అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో9ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు.

10ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు.11అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు.12ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు.

13ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు, ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు.14తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు.

15రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు.16అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు.
మెల్కీసెదెకు అబ్రామును దీవించడం

17అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు.18అంతేగాక 1 షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.

19అతడు అబ్రామును ఆశీర్వదించి <<ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక.20నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక>> అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.

21సొదొమ రాజు <<మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో>> అని అబ్రాముతో అన్నాడు.22అబ్రాము <<దేవుడైన యెహోవా అబ్రామును ధనవంతుణ్ణి చేశాను, అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టీ అయినా నీ వాటిలోనుండి తీసుకోను.23ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను.24ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు>> అని సొదొమ రాజుతో చెప్పాడు.


1 14:18 అంటే యెరూషలేము

Chapter 15

దేవుడు అబ్రాముతో నిబంధన చెయ్యడం

1ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. <<అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని>> అన్నాడు.2అబ్రాము <<ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా!3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు>> అన్నాడు.

4యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి <<ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు>> అన్నాడు.5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి <<నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు>> అని చెప్పి <<నీ సంతానం కూడా అలా అవుతుంది>> అని చెప్పాడు.

6అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన 1 అతనికి నీతిగా పరిగణించాడు.7యెహోవా <<నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే>> అని చెప్పినప్పుడు8అతడు <<ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?>> అన్నాడు.

9ఆయన <<మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా>> అని అతనితో చెప్పాడు.10అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు.11ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.

12చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది.13ఆయన <<దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.

14వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు.15కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు.16అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో>> అని అబ్రాముతో చెప్పాడు.

17సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి.18ఆ రోజున యెహోవా <<ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.19కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను,20హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను,21అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను>> అని అబ్రాముతో నిబంధన చేశాడు.


1 15:6 ఇక్కడ నీతి నే మాట మొదటి సరి కనిపిస్తున్నది. గలతి 3:6; రోమ్ 4:3; యాకోబు 3:26 చూడండి

Chapter 16

హాగరు, ఇష్మాయేలు

1అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు.2శారయి అబ్రాముతో <<ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో>> అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.

3అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది.4అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.

5అప్పుడు శారయి అబ్రాముతో <<నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు>> అంది.6అందుకు అబ్రాము <<ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో>> అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.

7షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు.8ఆమెతో <<శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?>> అని అడిగాడు. అందుకామె <<నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను>> అంది.
9అప్పుడు యెహోవా దూత <<నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు>> అన్నాడు.10యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. <<నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను>> అని ఆమెకు చెప్పాడు.
11తరువాత యెహోవా దూత <<ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి 1 ఇష్మాయేలు అనే పేరు పెడతావు.12అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ 2 తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు>> అని ఆమెకు చెప్పాడు.
13అప్పుడు ఆమె <<నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!>> అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు <<3 నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే>> అనే పేరు పెట్టింది.14దీన్ని బట్టి ఆ నీటి ఊటకి <<4 బెయేర్‌ లహాయి రోయి>> అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.

15తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు.16అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.


1 16:11 అంటే దేవుడు వింటాడు.
2 16:12 ప్రతి ఒక్కరికీ విరోధంగా అని కూడా అర్థం ఉంది.
3 16:13 లహాయి రోయి
4 16:14 నన్ను చూస్తున్న దేవుని బావి

Chapter 17

సున్నతి నిబంధన

1అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై <<నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.2అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను>> అని చెప్పాడు.

3అబ్రాము సాష్టాంగపడి తన ముఖాన్ని నేలకు వంచుకుని ఉన్నాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు. <<చూడు, నేను నీతో నిబంధన చేశాను.4నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు.5ఇకపైన నీ పేరు 1 అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు 2 అబ్రాహాము అవుతుంది.6నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు.
7నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.8నీకూ నీ తరువాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.>>
9దేవుడు మళ్ళీ అబ్రాహాముతో ఇలా చెప్పాడు. <<నీ వరకూ నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే గాక, నీ తరువాత నీ సంతానం తమ తరతరాల్లో నా నిబంధన పాటించాలి.10నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి.11అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది.
12నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది.13నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది.14సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి 3 బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.>>
15దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు. <<నీ భార్య అయిన శారయిని ఇకనుండి శారయి అని పిలువవద్దు. ఇకనుండి ఆమె పేరు శారా16నేను ఆమెను ఆశీర్వదించి, ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను. ఆమె అనేక జాతులకు తల్లి అవుతుంది. ఆమె నుండి అనేక జాతుల రాజులు వస్తారు.>>
17అప్పుడు అబ్రాహాము తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకుని <<ఒక మనిషికి నూరేళ్ళ వయస్సులో పిల్లలు పుడతారా? తొంభై ఏళ్ల శారా పిల్ల వాణ్ని కంటుందా?>> అని మనస్సులో అనుకున్నాడు.18అబ్రాహాము <<నీవు ఇష్మాయేలును చల్లగా చూస్తే నాకదే పదివేలు>> అని దేవునితో అన్నాడు.
19అప్పుడు దేవుడు ఇలా అన్నాడు. <<అలా కాదు. నీ భార్య అయిన శారా కచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధనను స్థిరం చేస్తాను. అతని తరువాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.20ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. చూడు, నేను అతణ్ణి ఆశీర్వదిస్తాను. అతని సంతానాన్ని అత్యధికం చేస్తాను. అతడు అత్యధికంగా విస్తరిచేలా చేస్తాను. అతడు పన్నెండు జాతుల రాజులకు మూలపురుషుడు అవుతాడు. అతణ్ణి ఒక గొప్ప జాతిగా చేస్తాను.21కాని వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా ద్వారా నీకు పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధననను స్థిరపరుస్తాను.>>
22అబ్రాహాముతో మాట్లాడటం ముగిసిన తరువాత దేవుడు అతని దగ్గరనుండి పైకి వెళ్ళిపోయాడు.23అప్పుడు అబ్రాహాము అదే రోజు తన కుమారుడు ఇష్మాయేలునూ, తన ఇంట్లో పుట్టిన వారినందర్నీ, అలాగే తాను వెల ఇచ్చి కొన్న వారందరినీ తన ఇంట్లోని ప్రతి మగవాణ్ణీ తీసుకుని వారందరికీ వారి మర్మాంగం పైచర్మాన్ని సున్నతి చేశాడు.
24అబ్రాహాము మర్మాంగం పైచర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది ఏళ్ళు.25అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి పదమూడేళ్ళు.26అబ్రాహామూ అతని కుమారుడు ఇష్మాయేలూ ఒక్కరోజే సున్నతి పొందారు.27అతని ఇంట్లో పుట్టినవారూ, విదేశీయుల దగ్గర వెల ఇచ్చి కొన్నవారూ, ఇంకా అతని ఇంట్లో మగవాళ్ళంతా సున్నతి పొందారు.


1 17:5 మహా పితరుడు
2 17:5 అనేక జాతులకు మహా పితరుడు
3 17:14 తొలగించి వేయాలి, కొట్టివేయాలి. అలాటి వాడు ఇకపై నాకు చెందిన వాడు కాదు.

Chapter 18

అబ్రాహాము, శారాలకు వాగ్దానం

1మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.2అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.

3<<ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.4నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.5మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.>> అందుకు వారు <<నువ్వు చెప్పినట్టే చెయ్యి>> అన్నారు.
6అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి <<నువ్వు త్వరగా 1 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి>> అన్నాడు.7తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.8తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
9వారు అతణ్ణి <<నీ భార్య ఎక్కడ?>> అని అడిగారు. అతడు <<అదిగో, గుడారంలో ఉంది>> అన్నాడు.10అప్పుడు 2 ఆయన <<తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు>> అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
11అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది.12శారా <<నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా>> అనుకుని తనలో తాను నవ్వుకుంది.
13అప్పుడు యెహోవా అబ్రాహాముతో <<శారా <ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా> అనుకుని ఎందుకు నవ్వింది?14యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు>> అన్నాడు.15అప్పుడు శారా భయపడి <<నేను నవ్వలేదండీ>> అంది. దానికి ఆయన <<అలా అనకు, నువ్వు నవ్వావు>> అని జవాబిచ్చాడు.
16అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.17కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. <<అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.18అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?19అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.>>
20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. <<సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక21నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.>>
అబ్రాహాము సొదొమకోసం విన్నపం చెయ్యడం
22ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.23అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. <<దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
24ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?>>26దానికి యెహోవా <<సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను>> అన్నాడు.
27అందుకు అబ్రాహాము <<అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.28యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?>> అని మళ్ళీ అడిగాడు. అందుకాయన <<అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను>> అన్నాడు.
29అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ <<ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో>> అన్నాడు. దానికి ఆయన <<ఆ నలభై మంది కోసం నాశనం చేయను>> అని చెప్పాడు.30అతడు మళ్ళీ <<ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో>> అన్నాడు. అప్పుడాయన <<ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను>> అన్నాడు.31అందుకు అతడు <<నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో>> అన్నాడు. అప్పుడు ప్రభువు <<ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను>> అన్నాడు.
32చివరిగా అతడు <<ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో>> అన్నాడు. అప్పుడు ప్రభువు <<పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను>> అన్నాడు.33అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.


1 18:6 పాత అనువాదంలో మూడు మానికలు అని ఉంది.
2 18:10 యెహోవా

Chapter 19

లోతు సొదొమనుండి బయటికి రావడం

1ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు.2వారితో ఇలా అన్నాడు <<నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.>> అన్నాడు. అందుకు వాళ్ళు <<అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.>> అన్నారు.3కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.

4అయితే వాళ్ళు నిద్రపోయే ముందే ఆ పట్టణ మనుషులు అంటే సోదొమలోని యువకులూ, వృద్ధులూ పట్టణం నలుమూలల నుండీ వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.5వాళ్ళు లోతును పిలిచారు. <<ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరీ? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా>> అన్నారు.
6దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు.7<<సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు.8చూడండి. పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిధులు>>అన్నాడు.
9కానీ వాళ్ళు <<నువ్వు అవతలికి పో>> అన్నారు. ఇంకా వాళ్ళు <<వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం>> అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు.
10అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసేశారు.11అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకూ ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెదికీ వెదికీ విసిగిపోయారు.
12అప్పుడు ఆ దూతలు లోతుతో <<ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా.13మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు>> అన్నారు.
14అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. <<త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు>> అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు.15ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. <<రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు>> అన్నారు.
16అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు.17ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తరువాత వాళ్ళలో ఒకడు <<మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి>> అని చెప్పాడు.
18అప్పుడు లోతు <<ప్రభువులారా, అలా కాదు.19మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో.20చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను>> అన్నాడు.
21అప్పుడు ఆయన <<అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను.22నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను>> అన్నాడు. కాబట్టి ఆ ఊరికి 1 సోయరు అనే పేరు వచ్చింది.
సొదొమ గొమొర్రాల వినాశనం
23లోతు సోయరు చేరేటప్పటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు.24అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.25ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.
26కానీ లోతు వెనుకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
27ఉదయమైంది. అబ్రాహాము లేచి తాను అంతకుముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు.28అక్కడి నుండి సొదొమ, గొమొర్రాల వైపు, ఆ మైదాన ప్రాంతం మొత్తాన్నీ చూశాడు. కొలిమిలోనుండి లేచే పొగ లాగా ఆ ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది.
29ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.
30అయితే లోతు సోయరులో ఉండటానికి భయపడ్డాడు. తన ఇద్దరు కూతుళ్ళనూ తీసుకుని పర్వత ప్రాంతానికి వెళ్లిపోయాడు. అక్కడ తన ఇద్దరు కూతుళ్ళతో కలసి ఒక గుహలో నివసించాడు.
లోతు, అతని కుమార్తెలు
31ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో <<నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరిక సంబంధం పెట్టుకోడానికి ఏ పురుషుడూ లేడు.32నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం. తరువాత అతనితో శారీరిక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం, పద>> అని చెప్పింది.33ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తరువాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
34మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది. <<నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తరువాత నువ్వు లోపలి వెళ్లి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం>> అంది.35ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్ళి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియలేదు.
36ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళూ తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు.37అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు.38లోతు రెండో కూతురు కూడా ఒక కొడుకుని కని వాడికి <<బెన్ అమ్మి>> అనే పేరు పెట్టింది. నేటి అమ్మోనీయులకు అతడే మూలపురుషుడు.


1 19:22 చిన్న ఊరు

Chapter 20

అబ్రాహము, అబీమెలెకు

1అబ్రాహాము అక్కడ నుండి బయలుదేరి దక్షిణదేశానికి తరలి వెళ్ళాడు. అలా కాదేషుకూ, షూరుకూ మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాడు. కొంతకాలం గెరారులో పరదేశిగా ఉన్నాడు.2అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి <<ఈమె నా చెల్లి>> అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.3కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరికికు కనబడి అతనితో<<చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య>> అని చెప్పాడు.

4అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు<<ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా?5<ఈమె నా చెల్లి> అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా <అతడు నా అన్న> అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను>> అన్నాడు.
6అందుకు దేవుడు అతనికి కలలో కనబడి <<అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు.7కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో>> అని చెప్పాడు.

8తెల్లవారకముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు.9అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు<<నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు>> అన్నాడు.
10అబీమెలెకు అబ్రాహామును చూసి <<నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?>> అని అడిగాడు.

11అబ్రాహాము <<ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను12అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది.
13దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో <మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే> అని చెప్పాను>> అన్నాడు.14అబీమెలెకు గొర్రెలనూ ఎద్దులనూ దాసులనూ దాసీలనూ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు.

15తరువాత అబీమెలెకు <<చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో>> అని అబ్రాహాముతో అన్నాడు.16తరువాత అతడు శారాతో <<చూడు, నీ అన్నకు నేను వెయ్యి వెండి నాణాలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్నవారందరి ఎదుట ఈడబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుటా నీకు న్యాయం జరిగింది>> అన్నాడు.
17అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు.18ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.

Chapter 21

1యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.2అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.3అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.4దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.

5ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.6అప్పుడు శారా <<దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు>> అన్నది.7ఆమె ఇంకా <<శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా>> అన్నది.
8ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.9అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.
10ఆమె అబ్రాహాముతో ఇలా అంది. <<ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.>>11ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు.
12అయితే దేవుడు <<ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.13అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను>> అని అబ్రాహాముతో చెప్పాడు.
హాగరును పంపి వేయడం
14కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.15ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.16<<ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు>> అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా 1 ఏడ్చింది.
17దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. <<హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.18నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను>> అని ఆమెకు చెప్పాడు.
19అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది.20దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.21అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
22ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. <<నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.23నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు>> అన్నాడు.24అందుకు అబ్రాహాము <<నేను వాగ్దానం చేస్తాను>> అన్నాడు.
25అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు <<ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.26నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది>> అన్నాడు.27అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.
28తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు.29అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో <<నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?>> అని అడిగాడు.30దానికి అబ్రాహాము <<ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి>> అన్నాడు.
31అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి <<2 బెయేర్షెబా>> అనే పేరు వచ్చింది.32బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.
33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.


1 21:16 లేక ఆ పిల్లవాడు ఏడ్చాడు.
2 21:31 ఒప్పందం బావి, లేక 7 బావులు.

Chapter 22

దేవుడు అబ్రాహామును పరీక్షించాడు

1ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన <<అబ్రాహామూ>> అని పిలిచినప్పుడు అతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.2అప్పుడు ఆయన అబ్రాహాముతో <<నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు>> అన్నాడు.3కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.

4మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు.5తన పనివాళ్ళతో <<మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం>> అని చెప్పాడు.
6అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.
7ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును <<నాన్నా>> అని పిలిచాడు. దానికి అబ్రాహాము <<ఏం నాయనా>> అన్నాడు. అప్పుడతడు <<చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?>> అని అడిగాడు.8దానికి అబ్రాహాము <<కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు>> అన్నాడు.
9దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు.10తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు.
11అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత <<అబ్రాహామూ, అబ్రాహామూ>> అని పిలిచాడు. దానికతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.12అప్పుడు ఆయన <<ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది>> అన్నాడు.
13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు.14అబ్రాహాము ఆ చోటును <<1 యెహోవా యీరే>> అని పిలిచాడు. కాబట్టి <<యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు>> అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
15యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు16<<నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.>>19తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు.
నాహోరు సంతతి
20ఆ సంగతులన్నీ జరిగిన తరువాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది.21ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు,22కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.
23అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు.24అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.


1 22:14 అంటే యెహోవా చూసుకుంటాడు.

Chapter 23

శారా మరణం, సమాధి

1శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.2కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.

3తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,4<<నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి>> అన్నాడు.
5దానికి హేతు వారసులు ఇలా అన్నారు <<అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు.6మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్ఠమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు.>>
7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు.8<<చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.9అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి>> అన్నాడు.

10ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.11<<అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.>>
12అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు.13<<నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను>> అని అందరికీ వినపడేలా చెప్పాడు.
14దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు.15<<అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో>> అన్నాడు.16అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం 1 నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
17ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా18ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.
19ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు.20ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.


1 23:16 సుమారు నాలుగున్నర కిలోలు.

Chapter 24

ఇస్సాకు రిబ్కాల కళ్యాణం

1అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్దుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు.2అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలనూ ఇంటి విషయాలనూ నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు. <<1 నీ చెయ్యి నా తొడ కింద ఉంచు.3నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా4నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో <భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు> అని ప్రమాణం చేయిస్తాను>> అని అతనితో అన్నాడు.

5దానికి ఆ దాసుడు <<ఒకవేళ ఆమె నాతో కలసి ఈ దేశం రావడానికి ఇష్టపడక పొతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా?>> అని ప్రశ్నించాడు.6అప్పుడు అబ్రాహాము <<ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు.7నా తండ్రి ఇంటి నుండీ, నా 2 బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి <నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను> అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు.
8అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు>> అని చెప్పాడు.9కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు.
10ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకు వెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి 3 ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు.11అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్ళు తోడుకోడానికి వచ్చే సమయమది.
12అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు. <<నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాముపట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యం సఫలం చెయ్యి.13ఇదిగో చూడు, నేను ఈ నీళ్ళ బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్ళు తోడుకోవడం కోసం వస్తున్నారు.14ఇది ఈ విధంగా జరగనియ్యి. <నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి> అని నేను అంటే <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను> అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను>> అన్నాడు.
15అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకూ అతని భార్య అయిన మిల్కాకూ పుట్టిన కుమారుడు.16ఆ అమ్మాయి చాలా అందకత్తె, కన్య. పురుష స్పర్శ ఎరగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్ళు నింపుకుని పైకి వచ్చింది.
17అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. <<దయచేసి నీ కుండలో నీళ్ళు తాగడానికి నాకు పోస్తావా?>> అని ఆమెను అడిగాడు.18దానికామె <<అయ్యా, తాగండి>> అంటూ చప్పున కుండ చేతిమీదికి దించుకుని అతడు తాగడానికి నీళ్ళు ఇచ్చింది.
19ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత <<మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను>> అని చెప్పి20త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్ళు కుమ్మరించి తిరిగి నీళ్ళు తోడటానికి బావి దగ్గరికి పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడి పోసింది.
21ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు22ఒంటెలు నీళ్ళు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు.23ఆమెను <<నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు.
24దానికి ఆమె <<నేను నాహోరుకూ మిల్కాకూ కొడుకైన బెతూయేలు కూతుర్ని>> అంది.25ఇంకా ఆమె <<మా దగ్గర చాలా గడ్డీ, మేతా ఉన్నాయి. రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది>> అంది.
26ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు.27<<అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతనూ, తన విశ్వసనీయతనూ చూపడం మానలేదు. నన్నయితే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు>> అన్నాడు.
28అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది.29ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలూ ముక్కుకు ఉన్న పుడకనూ చూశాడు. అలాగే <<ఆ వ్యక్తి నాతొ ఇలా చెప్పాడు>> అంటూ తన సోదరి చెప్పిన మాటలూ విన్నాడు.30అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు.
31అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు. <<యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను>> అన్నాడు.32ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు.
33భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కానీ అతడు <<నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పే వరకూ నేను భోజనం చేయను>> అన్నాడు. అందుకు <<చెప్పండి>> అన్నాడు.34అప్పుడు అతడు ఇలా చెప్పాడు. <<నేను అబ్రాహాము దాసుణ్ణి.35యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలనూ, పశువులనూ, వెండీ బంగారాలనూ, దాసులనీ, దాసీలనూ అనుగ్రహించాడు.
36నా యజమాని భార్య శారా. ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు.37నా యజమాని నాతో ఇలా చెప్పాడు, <నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిల్లో ఎవర్నీ నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయవద్దు.38నువ్వు నా తండ్రి ఇంటికీ, నా రక్త సంబధికుల దగ్గరకూ వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకు రావాలి> అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు.
39దానికి నేను <ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే?> అని నా యజమానిని అడిగాను.40అతడు <నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు.41అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు> అన్నాడు.
42నేను ఈ రోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను. <నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే43నేను ఈ నీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు తోడుకోడానికి వచ్చిన అమ్మాయితో నేను, <<దయచేసి నీ కుండలో నీళ్ళు కాసిన్ని నాకు తాగడానికి ఇవ్వు>> అని అడిగితే44<<మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను>> అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.>
45నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకుని బావి దగ్గరికి వచ్చి ఆ బావి లోకి దిగి నీళ్ళు తోడుకుని వచ్చింది. అప్పుడు నేను నాకు తాగడానికి నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను.46ఆమె వెంటనే కుండ దించి <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను> అంది. నేను ఆ నీళ్ళు తాగాను. ఆమె ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టింది.
47అప్పుడు నేను <నువ్వు ఎవరి అమ్మాయివి?> అని అడిగాను. ఆమె <నేను మిల్కా నాహోరుల కొడుకు బెతూయేలు కూతురుని> అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడకా చేతులకు కడియాలూ పెట్టాను.48నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకు వెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తలవంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను.
49కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయనూ నమ్మకాన్నీ చూపించ దల్చుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను>> అన్నాడు.
50అప్పుడు లాబానూ, బెతూయేలూ ఇలా జవాబిచ్చారు. <<ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో, చెడో మేమేమి చెప్పగలం?51చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకు వెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక!>>
52అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.53తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు.
54అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు <<నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి>> అని అడిగాడు.55ఆమె సోదరుడూ, ఆమె తల్లీ <<మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండనీయి. తరువాత ఆమెను తీసుకు వెళ్ళవచ్చు>> అన్నారు.
56కానీ అతడు <<యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి>> అన్నాడు.57అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం58అని రిబ్కాను పిలిచారు. <<ఈ వ్యక్తి తో నువ్వు వెళ్తావా?>> అని అడిగారు. దానికామె <<వెళ్తాను>> అంది.
59కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడూ, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు.
60అప్పుడు వాళ్ళు రిబ్కాతో <<మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి.
నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!>> అంటూ ఆమెను దీవించారు.
61రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు.
62ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్‌ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు.
63ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి.64రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది.65<<మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?>> అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు <<ఆయన నా యజమాని>> అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది.
66అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు.67అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.


1 24:2 ఇది ఆ కాలంలో శపథం చేసే పధ్ధతి.
2 24:7 నా జన్మ భూమి.
3 24:10 అంటే మెసపుటేమియా. ప్రస్తుత ఇరాక్ ప్రాంతం.

Chapter 25

అబ్రాహాము ఇతర సంతతి
1 దిన 1:32-33

1అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.2ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.3యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.4మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.

5వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.6అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
అబ్రాహాము మరణం, సమాధి

7అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.8అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.

9అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.10అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.11అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్‌ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు.
ఇష్మా యేలు వంశావళి

12ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది.

13ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,14మిష్మా, దూమానమశ్శా,15హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.16ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.

17ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.18వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు 1 విరోధంగా జీవించేవారు.

19అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.20ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
ఏశావు, యాకోబుల జననం

21ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.22ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె <<నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?>> అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.

23అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు.
<<రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి.

రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి.

ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది.

పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.>>

24ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.25మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి 2 ఏశావు అనే పేరు పెట్టారు.26తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
ఏశావు తన జేష్టత్వం హక్కు వదులుకోవడం

27ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.28ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.

29యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.30ఏశావు యాకోబును <<దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను>> అని అడిగాడు. అందుకే అతనికి 3 ఏదోము అనే పేరు వచ్చింది.

31అందుకు యాకోబు <<ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి>> అన్నాడు.32అప్పుడు ఏశావు <<చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?>> అన్నాడు.33యాకోబు <<ముందు ప్రమాణం చెయ్యి>> అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.34యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.


1 25:18 తూర్పు దిక్కున
2 25:25 అంటే ఒళ్లంతా వెంట్రుకలు గల వాడు.
3 25:30 అంటే ఎర్రని

Chapter 26

గెరారులో ఇస్సాకు

1అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.

2అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. <<నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు.3ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.

4నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.5ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు>> అని అతనికి చెప్పాడు.

6కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.7అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు <<ఆమె నా చెల్లి>> అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు.8అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.

9అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి <<చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?>> అని అడిగాడు. దానికి ఇస్సాకు <<ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను>> అన్నాడు.10అందుకు అబీమెలెకు <<నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!>> అన్నాడు.11కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ <<ఈ వ్యక్తిని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు>> అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.

12ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు.13కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు.14అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.

15అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు.16అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో <<నువ్వు మాకంటే బలవంతుడివి. కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్లి పో>> అన్నాడు.17కాబట్టి ఇస్సాకు అక్కడనుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు.

18అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.

19ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది.20అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో <<ఈ నీళ్ళు మావే>> అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి <<1 ఏశెకు>> అని పేరు పెట్టాడు.

21తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి <<2 శిత్నా>> అనే పేరు పెట్టాడు.22అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు <<యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం>> అంటూ ఆ స్థలానికి 3 రహబోతు అనే పేరు పెట్టాడు.

23అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు.24ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. <<నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.>>25ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.
ఇస్సాకు, అబీమెలెకు ఒప్పందం

26ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు.27వారితో ఇస్సాకు <<మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు?>> అని వారిని అడిగాడు.

28అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. <<యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం.29మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.>>

30కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు.31పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు.

32అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు.33ఆ బావికి ఇస్సాకు <<4 షీబా>> అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే.
ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకోవడం

34ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతునూ, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళి చేసుకున్నాడు.35వీరు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.


1 26:20 జగడం
2 26:21 వైరం
3 26:22 విశాలమైన
4 26:33 శపథం

Chapter 27

ఇస్సాకు యకోబును దీవించడం

1ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో <<నా కొడుకా>> అని పిలిచాడు. అతడు <<చిత్తం నాన్నగారూ>> అన్నాడు.2అప్పుడు ఇస్సాకు <<చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు.

3కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా.4దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను>> అన్నాడు.

5ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు.6అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో <<జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో7<నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా> అన్నాడు.

8కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి.9నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.10నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళు>> అంది.

11దానికి యాకోబు తన తల్లితో <<నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.12ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది>> అన్నాడు.

13కానీ అతని తల్లి <<కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా>> అని చెప్పింది.14కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది.

15రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.16ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.17తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది.

18అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు <<కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?>> అని అడిగాడు.19దానికి యాకోబు <<నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు>> అన్నాడు.

20అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో <<నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?>> అన్నాడు. దానికి యాకోబు <<నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది>> అన్నాడు.21అప్పుడు ఇస్సాకు <<నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా>> అన్నాడు.

22యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. <<స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే>> అన్నాడు.23యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు.

24<<నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?>> అని అడిగాడు. యాకోబు <<అవును నేనే>> అన్నాడు.25అప్పుడు ఇస్సాకు <<ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను>> అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.

26అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు <<నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు>> అన్నాడు.27యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు.
<<చూడు, నా కొడుకు సువాసన,
యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది.
28ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ,
భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ,
ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!
29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక!
జాతులు నీ ముందు సాగిలపడతారు గాక!
నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు.
నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక!
నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక!
నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.>>

30ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.31అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. <<నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు>> అని తండ్రితో అన్నాడు.

32అతని తండ్రి అయిన ఇస్సాకు <<నువ్వు ఎవరివి?>> అని అడిగాడు. అతడు <<నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని>> అన్నాడు.33దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. <<అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.>>

34ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో <<నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు>> అన్నాడు.35ఇస్సాకు <<నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు>> అన్నాడు.

36ఏశావు ఇలా అన్నాడు. <<1 యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.>> ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని <<నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?>> అని అడిగాడు.37అందుకు ఇస్సాకు <<చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?>> అన్నాడు.

38ఏశావు తన తండ్రితో <<నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు>> అంటూ గట్టిగా ఏడ్చాడు.

39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు.
<<చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది.

పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.

40నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు.

నీ తమ్ముడికి దాసుడివి అవుతావు.

కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.>>

41యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. <<నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.>>42తన పెద్దకొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిపించింది. అతనితో <<చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు.

43కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో.44నీ అన్న కోపం చల్లారే వరకూ కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు.45నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి, నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకూ అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్క రోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవడం ఎందుకు?>> అంది.

46రిబ్కా ఇస్సాకుతో <<ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?>> అంది.


1 27:36 అంటే మడిమ పట్టుకుని లాగే వాడు. మోసగాడు.

Chapter 28

యాకోబు వెళ్ళిపోవడం

1ఇస్సాకు యాకోబును పిలిపించి <<నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.2నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో

3సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా4ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక>> అని దీవించి పంపివేశాడు.
5అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ.

6ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు <<నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు>> అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.7యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ,
8ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు.9అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు.
బేతెల్ దగ్గర యాకోబు కల

10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ11ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.
12అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.13యెహోవా దానికి 1 పైగా నిలబడి <<నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

14నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.15ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను>> అని చెప్పాడు.

16యాకోబు నిద్ర మేలుకుని <<నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు>> అనుకున్నాడు.17అతడు భయపడి <<ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
18పరలోకద్వారం ఇదే>> అనుకున్నాడు.

తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.

19అతడు ఆ స్థలానికి 2 బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.
20అప్పుడు యాకోబు <<నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,21తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.22అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను>> అని మొక్కుకున్నాడు.


1 28:13 యాకోబుకు సమీపంగా నిలబడి.
2 28:19 దేవుని ఇల్లు.

Chapter 29

యాకోబు రాహేలును కలుసుకోవడం

1యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు.2అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది.3అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు.

4యాకోబు వారిని చూసి <<సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?>> అని అడగ్గా వారు <<మేము హారాను వాళ్ళం>> అన్నారు.5అతడు <<నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?>> అని వారిని అడిగితే వారు <<అవును, మాకు తెలుసు>> అన్నారు.6<<అతడు క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగినప్పుడు వారు <<క్షేమంగానే ఉన్నాడు, అదిగో, అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది>> అని చెప్పారు.

7అతడు <<ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్ళు పెట్టి, పోయి వాటిని మేపండి>> అని చెప్పినప్పుడు,8వారు<<మందలన్నిటినీ మళ్ళించే దాకా అది మా వల్ల కాదు. బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం>> అన్నారు.

9అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకువచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది.10యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు.
11యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ,12రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది.
13లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు.14అప్పుడు లాబాను <<నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ>> అన్నాడు.

యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత,

15లాబాను <<నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు>> అని యాకోబును అడిగాడు.16లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు.17లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది.18యాకోబు రాహేలును ప్రేమించి <<నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను>> అన్నాడు.

19అందుకు లాబాను <<ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు>> అని చెప్పాడు.20యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.
లాబాను కూతుళ్ళను యాకోబు పెళ్లి చేసుకోవడం

21తరువాత యాకోబు <<నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేను నా భార్య దగ్గరికి పోతాను, ఆమెను నాకివ్వు>> అని లాబానును అడిగాడు.22లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగుచేసి విందు చేశాడు.
23రాత్రి వేళ తన పెద్ద కూతురు లేయాని అతని దగ్గరికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు.24లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు.

25తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకుని లాబానుతో <<నువ్వు నాకు చేసిందేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది? ఎందుకు నన్ను మోసపుచ్చావు?>> అన్నాడు.
26అందుకు లాబాను <<పెద్దదాని కంటే ముందుగా చిన్నదానికి పెళ్ళి చేయడం మా దేశమర్యాద కాదు.27ముందు ఈమె ఏడు నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే, అందుకు ప్రతిఫలంగా రెండో ఆమెను కూడా నీకిస్తాం>> అని చెప్పాడు.
28యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తరువాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు.29లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చాడు.30యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి ఏడు సంవత్సరాలు సేవ చేశాడు.

31అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది.32లేయా గర్భవతి అయ్యి, కొడుకును కని <<యెహోవా నా కష్టాన్నిచూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు>> అనుకుని అతనికి <<రూబేను>> అని పేరు పెట్టింది.
33ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకును కని <<నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు>> అనుకుని అతనికి <<షిమ్యోను>> అని పేరు పెట్టింది.

34ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకుని కని <<చివరికి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటాడు. ఎందుకంటే అతనికి ముగ్గురు కొడుకులను కన్నాను>> అనుకుని అతనికి <<లేవి>> అని పేరు పెట్టింది.
35ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని<<ఈసారి యెహోవాను స్తుతిస్తాను>> అనుకుని అతనికి <<యూదా>> అని పేరు పెట్టింది. తరువాత ఆమె కానుపులు ఆగిపోయాయి.

Chapter 30

1రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో <<నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను>> అంది.2యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు <<నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?>> అన్నాడు.

3అందుకు ఆమె <<నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు>> అని చెప్పి4తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.

5అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది.6అప్పుడు రాహేలు <<దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు>> అనుకుని అతనికి <<దాను>> అని పేరు పెట్టింది.
7రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.8అప్పుడు రాహేలు <<దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను>> అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

9లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.10జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది.11అప్పుడు లేయా <<ఇది అదృష్టమే గదా>> అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది.
12లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.13లేయా <<నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా>> అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.

14గోదుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో 1 మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు <<నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు>> అని లేయాతో అంది.15అందుకామె <<నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా>> అంది. అందుకు రాహేలు <<అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు>> అని చెప్పింది.

16ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి <<నువ్వు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను>> అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు.17దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.18లేయా <<నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు>> అనుకుని అతనికి <<2 ఇశ్శాఖారు>> అని పేరు పెట్టింది.
19లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.20అప్పుడు లేయా <<దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు>> అనుకుని అతనికి <<3 జెబూలూను>> అని పేరు పెట్టింది.21ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది.

22దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.23అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని <<దేవుడు నా నింద తొలగించాడు>> అనుకుంది.24ఇంకా ఆమె <<యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక>> అనుకుని అతనికి <<యోసేపు>> అనే పేరు పెట్టింది.

25రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో <<నన్ను పంపివెయ్యి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను.26నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా>> అని చెప్పాడు.
27అందుకు లాబాను అతనితో <<నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను.28నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను>> అన్నాడు.

29యాకోబు అతణ్ణి చూసి <<నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు.30నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?>> అన్నాడు.

31అప్పుడు లాబాను <<నేను నీకేమివ్వాలి?>> అని అడిగాడు. అందుకు యాకోబు <<నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను.32ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.
33ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు>> అన్నాడు.34అందుకు లాబాను <<మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు>> అన్నాడు.

35ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు.36తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు.

37యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు.38మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు.

39అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.40యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.
41మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు.42మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి.

43ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.


1 30:14 ఈ మూలిక సువాసనలీనుతూ ఉంటుంది. తిన్న వారిలో లైంగిక సామర్థ్యం పెంచుతుందని, స్త్రీలలో గర్భం ధరించే సామర్థ్యం పెంచుతుందని భావిస్తారు.
2 30:18 ప్రతిఫలం
3 30:20 ప్రతిష్ట

Chapter 31

యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకుని వెళ్ళిపోవడం

1లాబాను కొడుకులు <<యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకుని, దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు>> అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.2అంతే గాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు.

3అప్పుడు యెహోవా <<నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను>> అని యాకోబుతో చెప్పాడు.

4యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలునీ లేయానీ పిలిపించి వారితో,5<<ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.6నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు.
7మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.

8అతడు, <పొడలు గలవి నీ జీతమవుతాయి> అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. <చారలు గలవి నీ జీతమవుతాయి> అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి.9ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు.
10మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.

11ఆ కలలో దేవుని దూత <యాకోబూ> అని నన్ను పిలిచినప్పుడు నేను <చిత్తం, ప్రభూ> అన్నాను.
12అప్పుడు ఆయన <నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను.13నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు> అని నాతో చెప్పాడు>> అన్నాడు.

14అందుకు రాహేలు, లేయాలు <<ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?15అతడు మమ్మల్ని అమ్మివేసి, మాకు రావలసిన సొమ్మంతటినీ పూర్తిగా తినేశాడు.16దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి>> అని అతనికి జవాబు చెప్పారు.

17యాకోబు తన కొడుకులనూ తన భార్యలనూ ఒంటెల మీద ఎక్కించి18తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకు కనాను దేశానికి బయలుదేరాడు.
19లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది.20యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది.21అతడు తనకు కలిగినదంతా తీసుకు పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు.
లాబాను యాకోబును తరమడం

22యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది.23అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకుని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు.
24ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి <<నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా>> అని అతనితో చెప్పాడు.25చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు.

26అప్పుడు లాబాను యాకోబుతో <<ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు?27నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే.28నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు.

29నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, <జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు> అని నాతో చెప్పాడు.30నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి?>> అన్నాడు.

31అందుకు యాకోబు <<నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను.32ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో>> అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు.
33లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు.

34రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.35ఆమె తన తండ్రితో <<తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను>> అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు.

36యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ <<నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి?37నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు.
38ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు.39క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు.40నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.

41నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు.42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు>> అని అన్నాడు.

43అందుకు లాబాను <<ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను?44కాబట్టి నువ్వూ నేనూ ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకూ, నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది>> అని యాకోబుతో అన్నాడు.
45అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు.46<<రాళ్ళు పోగుచేయండి>> అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు.47లాబాను దానికి <<1 యగర్‌ శహదూతా>> అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి <<2 గలేదు>> అని పేరు పెట్టాడు.
యాకోబు, లాబాను ఒడంబడిక

48లాబాను <<ఈ రోజు ఈ కుప్ప నాకూ నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది>> అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అనే పేరు వచ్చింది.49ఇంక <<మనం ఒకరి కొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకూ నీకూ మధ్య జరిగేది కనిపెడతాడు>> అని చెప్పాడు కాబట్టి దానికి <<3 మిస్పా>> అని కూడా పేరు పెట్టారు.50తరువాత లాబాను <<నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్ళి చేసుకున్నా, చూడు, మన దగ్గర ఎవరూ లేకపోయినా, నాకూ నీకూ మధ్య దేవుడే సాక్షి>> అని చెప్పాడు.

51అదీ గాక లాబాను <<నాకూ నీకూ మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్నీ, ఈ రాళ్ళ కుప్పనీ చూడు.52నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ కుప్ప, ఈ స్తంభమూ సాక్షి.53అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయం తీరుస్తాడు>> అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు.

54యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు.55తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలనూ తన కుమార్తెలనూ ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.


1 31:47 ఈ అరమేయిక్ పదానికి సాక్ష్యం గుట్ట (లేక కుప్ప) అని అర్థం.
2 31:47 ఇది పైనున్న పదానికి సమానమైన అర్థం ఇస్తున్నది గానీ వేరొక యాస.
3 31:49 ఎత్తైన ప్రదేశం. మెరక ప్రదేశం. తరువాతి కాలంలో కావలి గోపురం అనే అర్థం స్థిర పడింది.

Chapter 32

1యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు.2యాకోబు వారిని చూసి <<ఇది దేవుని సేన>> అని చెప్పి ఆ చోటికి 1 మహనయీము అని పేరు పెట్టాడు.

3యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి,4<<మీరు నా ప్రభువైన ఏశావుతో, <ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను.5నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు> అని చెప్పండి>> అని వారికి ఆజ్ఞాపించాడు.

6ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగివచ్చి <<మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు>> అని చెప్పారు.7అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై,8<<ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు>> అనుకుని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు.
9అప్పుడు యాకోబు <<నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, <నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను> అని నాతో చెప్పిన యెహోవా,10నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను.
11నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.12నాతో, <నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను> అని నువ్వు సెలవిచ్చావు కదా>> అన్నాడు.

13అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు.14అతడు రెండువందల మేకలూ ఇరవై మేక పోతులూ రెండువందల గొర్రెలూ ఇరవై పొట్టేళ్ళూ15ముప్ఫై పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసుకు మందమందను వేరు వేరుగా ఉంచాడు.16వాటిని అతడు తన దాసులకు అప్పగించి <<మీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి>> అని వారితో చెప్పాడు.

17వారిలో మొదటివాడితో <<నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, <నీవెవరి వాడివి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ముందు ఉన్నవి ఎవరివి?> అని నిన్ను అడిగితే18నువ్వు, <ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కోసం అతడు పంపిన కానుక. అదిగో అతడు మా వెనక వస్తున్నాడు> అని చెప్పు>> అని ఆజ్ఞాపించాడు.
19<<నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతనిని శాంతింపజేసిన తరువాత నేను అతనికి కనబడతాను. అప్పుడతడు ఒకవేళ నా పైన దయ చూపుతాడేమో.20కాబట్టి మీరు ఏశావును చూసి, <ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనకాలే వస్తున్నాడు> అని చెప్పాలి>> అని వారికి చెప్పాడు. రెండవ గుంపుకు, మూడవ గుంపుకు, మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ అతడు ఇదే విధంగా ఆజ్ఞాపించాడు.21అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు.
యాకోబు దేవునితో పోరాటం

22ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ తన ఇద్దరు దాసీలనీ తన పదకొండు మంది పిల్లలనూ తీసుకు యబ్బోకు రేవు దాటిపోయాడు.23యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు.
24యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.25తాను గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడ్డం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది.26ఆయన <<తెల్లవారుతున్నది, నన్ను పోనియ్యి>> అన్నప్పుడు, యాకోబు<<నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ్యను>> అన్నాడు.

27ఆయన <<నీ పేరేమిటి?>> అని అడిగాడు. అతడు <<యాకోబు>> అని చెప్పాడు.28అప్పుడాయన <<నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు 2 ఇశ్రాయేలు, యాకోబు కాదు>> అని చెప్పాడు.
29అప్పుడు యాకోబు <<దయచేసి నీ పేరు చెప్పు>> అన్నాడు. అందుకాయన <<నా పేరు ఎందుకు అడుగుతావు?>> అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు.30యాకోబు <<నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది>> అని ఆ స్థలానికి <<3 పెనూయేలు>> అని పేరు పెట్టాడు.

31అతడు పెనూయేలు నుండి బయలుదేరి నప్పుడు సూర్యోదయం అయ్యింది. అతడు తొడ కుంటుతూ నడిచాడు.32ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరంపై కొట్టి గూడు వసిలేలా చేసాడు కాబట్టి ఈనాటి వరకూ ఇశ్రాయేలీయులు తొడ గూటి మీద ఉన్న తుంటినరాన్ని తినరు.


1 32:2 చుట్టుముట్టిన ప్రదేశం
2 32:28 దేవునితో పోరాడిన వాడు.
3 32:30 దేవుని ముఖం

Chapter 33

యాకోబు ఏశావు కలుసుకున్నారు

1యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.2అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.3తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకూ ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.

4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.5ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి <<వీరు నీకేమౌతారు?>> అని అడిగాడు. అతడు <<వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే>> అని చెప్పాడు.

6అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.7లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.8ఏశావు<<నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?>> అని అడిగాడు. అతడు <<నా ప్రభువు దయ నా మీద కలగడానికే>> అని చెప్పాడు.
9అప్పుడు ఏశావు <<తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో>> అని చెప్పాడు.10అప్పుడు యాకోబు <<అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.11నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది>> అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని
12<<మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను>> అని చెప్పగా13అతడు <<నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.14నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను>> అని అతనితో చెప్పాడు.
15అప్పుడు ఏశావు <<నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను>> అనగా అతడు <<అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు>> అన్నాడు.16ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.17అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి <<సుక్కోతు>> అనే పేరు వచ్చింది.
యాకోబు షెకెము చేరుకోవడం

18ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.19అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.20అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి <<1 ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు>> అని పేరు పెట్టాడు.


1 33:20 అంటే దేవుడు, ఇశ్రాయేలు వారి దేవుడు, ప్రభావ శాలి

Chapter 34

దీనా, షెకెము ప్రజ

1యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది.2ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు.3అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు.

4షెకెము తన తండ్రి హమోరును <<ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి>> అని అడిగాడు.5అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకూ నెమ్మదిగా ఉన్నాడు.
6షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు.7యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది.

8అప్పుడు హమోరు వారితో <<షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి.9మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి.10ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి>> అని చెప్పాడు.
11అతడింకా <<నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాన్ని నేనిస్తాను.12ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి>> అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు.13అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.

14వారు <<మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకోని వాడికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం.15అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం.16ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకుని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము చేసుకుని, మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం.17మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకు వెళ్ళిపోతాం>> అన్నారు.

18వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి.19ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.

20హమోరూ అతని కుమారుడు షెకెమూ ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ,21<<ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకోనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా, మనం వారి పిల్లలను చేసుకుని మన పిల్లలను వారికి ఇద్దాం.

22అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకుని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు.23వారి మందలూ వారి ఆస్తీ వారి పశువులూ అన్నీ మనవవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు.>>
దీనా అన్నల పగ

24హమోరు, అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు.25మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకు అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు.26వారు హమోరునీ అతని కొడుకు షెకెమునీ కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు.
27తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు.28వారి గొర్రెలనూ పశువులనూ గాడిదలనూ ఊరిలో గానీ పొలంలో గానీ29వారి ఆస్తి అంతా తీసుకు, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు.

30అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి <<మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం>> అన్నాడు.31అందుకు వారు <<మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా?>> అన్నారు.

Chapter 35

దేవుడు బేతెల్ లో దీవించడం

1దేవుడు యాకోబుతో<<నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు>> అని చెప్పాడు.2యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో <<మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.3మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను>> అని చెప్పాడు.

4వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.5వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.

6యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.7అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి 1 ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.8రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి 2 అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.

9యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.10అప్పుడు దేవుడు అతనితో <<నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు>> అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
11దేవుడు <<నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.12నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను>> అని అతనితో చెప్పాడు.13దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.

14దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.15తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
బెన్యామిను జననం, రాహేలు మరణం

16వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.17ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో <<భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు>> అంది.18రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె <<వీడి పేరు 3 బెనోని>> అంది. కాని అతని తండ్రి అతనికి 4 బెన్యామీను అని పేరు పెట్టాడు.19ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.20యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.

21ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.22ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.

23యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.24యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.25రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
26లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.27అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
ఇస్సాకు మరణం

28ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.29ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.


1 35:7 బేతేలు దేవుడు.
2 35:8 ఒక విధమైన సింధూర వృక్షం. దీనికి ఏడుపు వృక్షం.
3 35:18 నా యాతన పుత్రుడు.
4 35:18 నా కుడి చేతి పుత్రుడు.

Chapter 36

ఏశావు వంశావళి
1 దిన 1:34-37

1ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.2ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,3ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.

4ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.5అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.
6ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.7వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.8కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.
శేయీరు జాతులు

9శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.10ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.11ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.12ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు.

13రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.14ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు.

15ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,16కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
17ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు.

18ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.19వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.

20ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,21దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.

22లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
23శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.24సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో 1 ఉష్ణధారలు కనుగొన్నాడు.

25అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.26దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,27ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.28దీషాను కొడుకులు ఊజు, అరాను.

29హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,30దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.
ఎదోము రాజులు
1 దిన 1:43-54

31ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,32బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.33బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.
34యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.35హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.36హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.

37శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.38షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు.39అక్బోరు కొడుకు బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు.

40వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,41అహొలీబామా, ఏలా, పీనోను,42కనజు, తేమాను, మిబ్సారు,43మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.


1 36:24 అడవి గాడిదలు

Chapter 37

యోసేపు కలలు

1యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు.2యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు.

3యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు.4అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

5యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు.6అతడు వారితో ఇలా చెప్పాడు. <<నేను కన్న ఈ కల మీరూ వినండి.
7అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.>>8అందుకు అతని సోదరులు <<నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా>> అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.

9అతడింకొక కల కని తన సోదరులతో<<ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి>> అని చెప్పాడు.10అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో <<నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?>> అని అతణ్ణి గద్దించాడు.11అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు.
యోసేపును అన్నలు అమ్మివేయడం

12యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు.13అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో <<నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా>> అన్నప్పుడు అతడు <<అలాగే>> అని చెప్పాడు.14అప్పుడు యాకోబు <<నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా>> అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు.

15యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి <<దేని గురించి వెదుకుతున్నావు?>> అని అడిగాడు.16అందుకతడు <<నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు.17అందుకు ఆ మనిషి <<వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు <దోతానుకు వెళ్దాం పదండి> అని చెప్పుకోవడం నేను విన్నాను>> అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు.

18అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.19వారు <<అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు.20వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, <ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది> అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం>> అని ఒకరి కొకరు చెప్పుకున్నారు.

21రూబేను ఆ మాట విని <<మనం వాణ్ణి చంపకూడదు>> అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు.22ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి <<రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి>> అని వారితో చెప్పాడు.
23యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి,24అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట.

25వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.26అప్పుడు యూదా <<మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?
27ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు>> అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు.28ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 1 ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.

29రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.30అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి <<చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?>> అన్నాడు.
31వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.32వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి <<ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు>> అన్నారు.33అతడు దాన్ని గుర్తుపట్టి <<ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది>> అన్నాడు.

34యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు.35అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. <<నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను>> అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

36మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.


1 37:28 230 గ్రాముల వెండి, ఒక యువ బానిస ఖరీదు.

Chapter 38

యూదా, తామారు

1ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.2అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు.

3ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు.4ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది.5ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.

6యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.7యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు.
8అప్పుడు యూదా ఓనానుతో <<నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు>> అని చెప్పాడు.9ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.10అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు.
11అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి <<నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు>> అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.

12చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు.13తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.14షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.

15యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,16ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక <<నీతో సుఖిస్తాను, రా>> అని పిలిచాడు. అందుకు ఆమె <<నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?>> అని అడిగింది.
17అందుకు అతడు <<నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను>> అన్నాడు. ఆమె <<అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే>> అని అంది.18అతడు <<ఏమి తాకట్టు పెట్టమంటావ్?>> అని ఆమెను అడిగాడు. ఆమె <<నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర>> అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.

19అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.20తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.

21కాబట్టి అతడు <<ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?>> అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు <<ఇక్కడ వేశ్య ఎవరూ లేదు>> అని అతనికి చెప్పారు.22కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి <<ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు>> అన్నాడు.23యూదా <<మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు>> అని అతనితో అన్నాడు.

24సుమారు మూడు నెలలైన తరువాత <<నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది>> అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా <<ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి>> అని చెప్పాడు.25ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి <<ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి>> అని చెప్పించింది.26యూదా వాటిని గుర్తు పట్టి <<నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది>> అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.

27నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.28ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి <<వీడు మొదట బయటికి వచ్చాడు>> అని చెప్పింది.
29వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె <<నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?>> అంది. అందుచేత వాడికి <<1 పెరెసు>> అని పేరు పెట్టారు.30ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి <<2 జెరహు>> అని పేరు పెట్టారు.


1 38:29 ఛేదించుకుని. బద్దలు చేసుకుని.
2 38:30 ప్రకాశ మానమైన ఎరుపు రంగు. జేగురు రంగు.

Chapter 39

యోసేపు, పొతీఫరు భార్య

1యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.2యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు.

3యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.4యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.

5అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది.6అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.

7ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. <<నాతో సుఖపడు>> అని అతనిని అడిగింది.8అయితే అతడు తిరస్కరించి <<నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు.9ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?>> అని తన యజమాని భార్యతో అన్నాడు.

10ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు.11అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు.12అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని <<నాతో పండుకో>> అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.
13అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవడం ఆమె చూసి,14తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి <<చూడండి, పోతీఫరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను.15నేను పెద్దగా కేకవేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు>> అని వారితో చెప్పింది.

16అతని యజమాని ఇంటికి వచ్చే వరకూ ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది.17ఆమె తన భర్తతో ఇలా వివరించింది. <<నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.18నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.>>
19<<నీ దాసుడు నాకిలా చేశాడు>> అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.

20యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు.
21అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు.22చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు.23యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.

Chapter 40

యోసేపు, రాజోద్యోగులు

1ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు.2తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు.3వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు.

4ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు.

వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత

5వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు.

6ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు.7అతడు <<మీరెందుకు విచారంగా ఉన్నారు?>> అని వారిని అడిగాడు.8అందుకు వారు <<మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు>> అన్నారు. యోసేపు వారితో <<అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి>> అన్నాడు.
9అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో <<నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది.10ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి.11ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను>> అని చెప్పాడు.
12అప్పుడు యోసేపు <<దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు.13ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.
14అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకుని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు.15ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు>> అన్నాడు.

16రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో <<నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి.17పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి>> అన్నాడు.
18యోసేపు <<దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు.19ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి>> అని జవాబిచ్చాడు.
20మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు.21గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు.22యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు.23అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.

Chapter 41

ఫరో కలలు

1రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.2పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.3వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.

4అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు.5అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది.6తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.

7అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు.8ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.

9అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు <<ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది.10ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.11ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము.
12అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు.13అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు>> అని ఫరోతో చెప్పాడు.

14ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.

15ఫరో యోసేపుతో <<నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను>> అన్నాడు.16యోసేపు <<అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు>> అని ఫరోతో చెప్పాడు.

17అందుకు ఫరో <<నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.18బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
19నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు.20చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి.21అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను.
22నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.23తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.24ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు>> అని అతనితో చెప్పాడు.

25అందుకు యోసేపు <<ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు.26ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు.
27కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు.28నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు.29ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.
30వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.31దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.32ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.

33కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి.34ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.
35వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి.36కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది>> అని ఫరోతో చెప్పాడు.

37ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది.38ఫరో తన పరివారంతో <<ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?>> అన్నాడు.
39ఫరో, యోసేపుతో <<దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.40నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను>> అన్నాడు.41ఫరో <<చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను>> అని యోసేపుతో చెప్పాడు.
42ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.43తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ <<నమస్కారం చేయండి>> అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.

44ఫరో యోసేపుతో <<నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు>> అన్నాడు.45ఫరో, యోసేపుకు <<జఫనత్ పనేహు>> అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
46యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.47సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.
48ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.49యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవడం మానుకున్నారు.

50కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.51అప్పుడు యోసేపు <<దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు>> అని తన పెద్దకొడుక్కి <<1 మనష్షే>> అనే పేరు పెట్టాడు.52<<నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు>> అని రెండో కొడుక్కి <<2 ఎఫ్రాయిము>> అనే పేరు పెట్టాడు.
53ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి.54యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.

55ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో <<మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి>> అని ఐగుప్తీయులందరితో చెప్పాడు.56ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది.57ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.


1 41:51 మరచిపోయేలా.
2 41:52 ద్విగుణీకృతము. రెండింతలు చెయ్యడం.

Chapter 42

యోసేపు అన్నలు ఐగుప్తుకు పోవడం

1ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకుని <<మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి?>> అని తన కొడుకులతో అన్నాడు.2<<చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం చావకుండా బతికేలా మీరు అక్కడికి వెళ్ళి మన కోసం అక్కడనుంచి ధాన్యం కొనుక్కురండి>> అన్నాడు.

3యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళారు.4అయితే యాకోబు <<అతనికి ఏదైనా హాని సంభవిస్తుందేమో>> అని యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు.

5కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనడానికి వచ్చిన వారితో ఇశ్రాయేలు కొడుకులు కూడా వచ్చారు.6అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు.

7యోసేపు తన అన్నలను చూసి వారిని గుర్తు పట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి <<మీరెక్కడనుండి వచ్చారు?>> అని అడిగాడు. అందుకు వారు <<ఆహారం కొనడానికి కనాను దేశం నుండి వచ్చాము>> అన్నారు.8యోసేపు తన అన్నలను గుర్తు పట్టాడు గాని వారు అతణ్ణి గుర్తు పట్టలేదు.

9యోసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కలలను గుర్తుకు తెచ్చుకుని <<మీరు గూఢచారులు. ఈ దేశపు గుట్టు తెలుసుకోడానికి వచ్చారు>> అన్నాడు.10వారు <<లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము.11మేమంతా ఒక తండ్రి కొడుకులం. మేము నిజాయితీగల వాళ్ళం. నీ దాసులమైన మేము గూఢచారులం కాదు>> అని బదులిచ్చారు.
12అయితే అతడు వారితో <<కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకోడానికి మీరు వచ్చారు>> అన్నాడు.13అందుకు వారు <<నీ దాసులమైన మేము పన్నెండుగురు అన్నదమ్ములం. కనాను దేశంలో ఉన్న ఒక తండ్రి కొడుకులం. ఇదిగో, అందరిలో చిన్నవాడు ఈ రోజు మా నాన్న దగ్గర ఉన్నాడు. ఒకడు లేడు>> అన్నారు.

14అయితే యోసేపు <<కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢచారులే.15మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది. ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడనుంచి వెళ్ళరు.16మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకణ్ణి పంపండి. అప్పటి వరకూ మీరు ఇక్కడ బందీలుగా ఉంటారు. మీలో నిజముందో లేదో మీ మాటల్లో తెలుస్తుంది. లేకపోతే ఫరో జీవం తోడు, మీరు గూఢచారులే>> అని చెప్పి17వారిని మూడు రోజులు చెరసాలలో వేయించాడు.

18మూడవ రోజు యోసేపు వారిని చూసి <<నేను దేవునికి భయపడే వాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి.19మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి.

20మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు>> అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు.
21అప్పుడు వారు ఒకడితో ఒకడు <<మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనలను బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు.>>22రూబేను <<ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది>> అని వారితో అన్నాడు.

23వారి మాటలు యోసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు, ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు.24యోసేపు వారి దగ్గరనుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరికి తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు.25తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమనీ, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమనీ, ప్రయాణం కోసం భోజనపదార్ధాలు వారికివ్వాలనీ తన పనివారికి ఆజ్ఞాపించాడు.
26వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయారు.
యోసేపు అన్నలు కనానుకు తిరిగి రావడం

27అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి.28అప్పుడతడు <<నా డబ్బు నాకే ఉంది. చూడండి, నా సంచిలోనే ఉంది>> అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు <<ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు?>> అనుకున్నారు.

29వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు.30<<ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు.31అప్పుడు మేము, <అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు.32పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు> అని అతనితో చెప్పాము.
33అందుకు ఆ దేశాధిపతి, మాతో <మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి.34నా దగ్గరికి ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు> అని చెప్పాడు>> అన్నారు.

35వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు.36అప్పుడు వారి తండ్రి యాకోబు <<మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి>> అని వారితో అన్నాడు.
37అందుకు రూబేను <<నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను>> అని చెప్పాడు.38అయితే అతడు <<నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు>> అన్నాడు.

Chapter 43

అన్నలు రెండవ సరి ఐగుప్టు ప్రయాణం

1కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది.2వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి <<మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి>> అని వారితో అన్నాడు.

3యూదా <<అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు.4కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము.5నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు>> అన్నాడు.

6అందుకు ఇశ్రాయేలు <<మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?>> అన్నాడు.7వారు <<అతడు <మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?> అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. <మీ తమ్ముణ్ణి తీసుకు రండి> అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?>> అన్నారు.
8యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో <<ఆ చిన్నవాణ్ని నాతో పంపు. మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వూ మా పిల్లలూ చావకుండా బతుకుతాం.9నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకువచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను.10మాకు ఆలస్యం కాకపోతే ఈపాటికి రెండవ సారి వెళ్లి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే>> అన్నాడు.

11వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో <<అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి.12రెండింతల డబ్బు తీసుకు వెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేత పట్టుకుని వెళ్ళండి. బహుశా అది పొరబాటు కావచ్చు.
13మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి.14అతడు మీ అన్ననూ బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు, అతని ముందు మిమ్మల్ని కరుణించు గాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను>> అని వారితో చెప్పాడు.15వాళ్ళు ఆ కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసుకు ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు.

16యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో <<వీరిని ఇంట్లోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు>> అని చెప్పాడు.17యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు.
18తమను యోసేపు ఇంటికి తీసుకువెళ్ళినందుకు వారు భయపడి <<మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనలను బంధించి, దాసులుగా చెరపట్టి, మన గాడిదలను తీసుకోవచ్చు>> అనుకున్నారు.19వారు యోసేపు గృహనిర్వాహకుని దగ్గరికి వచ్చి, ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి,20<<అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము.
21అయితే, మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే, చూడండి, మా అందరి డబ్బు మొత్తం, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము.22ఆహారం కొనడానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు>> అని చెప్పారు.

23అందుకతడు <<మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది>> అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు.
24గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు.25అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు.

26యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు.27అప్పుడు <<మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?>> అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు,
28<<నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు>> అని చెప్పి వంగి సాగిలపడ్డారు.29అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి <<మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?>> అని అడిగి <<బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక>> అన్నాడు.
30అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు.31అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని <<భోజనం వడ్డించండి>> అని చెప్పాడు.

32అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం.33పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.34అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.

Chapter 44

సంచిలో వెండి గిన్నె

1యోసేపు <<వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,2చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు>> అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.

3తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు.4వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో <<నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, <మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?5నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం> అని వారితో చెప్పు>> అన్నాడు.
6అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు.7వారు <<మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.

8చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?9నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం>> అని అతనితో అన్నారు.10గృహ నిర్వాహకుడు <<మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు>> అని చెప్పాడు.
11అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు.12ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.13వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.

14అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు.15అప్పుడు యోసేపు <<మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా>> అని వారితో అన్నాడు.
16యూదా <<మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం>> అన్నాడు.17యోసేపు <<అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి>> అని చెప్పాడు.
బెన్యామిను కోసం యూదా వేడికోలు

18యూదా అతని సమీపించి <<ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా.19నా యజమానులైన మీరు, <మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?> అని తమ దాసులను అడిగారు.
20అందుకు మేము, <మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు> అన్నాము.21అప్పుడు తమరు, <నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి> అని తమ దాసులతో చెప్పారు.

22అందుకు మేము, <ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు> అని నా యజమానులైన మీతో చెప్పాము.
23అందుకు తమరు, <మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు> అని తమ దాసులతో చెప్పారు.24కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము.25మా తండ్రి, <మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి> అని చెబితే26<మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము> అని చెప్పాము.

27అందుకు తమ దాసుడైన నా తండ్రి, <నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.28వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు.29మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు> అని మాతో చెప్పాడు.

30కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే31మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము.32తమ సేవకుడినైన నేను, <ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది> అని చెప్పాను.
33కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి.34ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది>> అని చెప్పాడు.

Chapter 45

యోసేపు తానెవరో వెల్లడి పరచుకోవడం

1అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక <<అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి>> అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు.2అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు.3అప్పుడు యోసేపు <<నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?>> అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.

4అప్పుడు యోసేపు <<నా దగ్గరికి రండి>> అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు <<ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే.5అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.6రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

7మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.8కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.
9మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో <నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు- దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు.10నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి.11ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను> అన్నాడని చెప్పండి.
12ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి.

13ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి>> అని తన సోదరులతో చెప్పాడు.
14తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు.15అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
16<<యోసేపు సోదరులు వచ్చారు>> అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.17అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు <<నీ సోదరులతో ఇలా చెప్పు, <మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి18మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు.
19మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి.20ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు> >> అన్నాడు.
21ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు.22అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 1 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.23అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు.
24అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే <<దారిలో పోట్లాడుకోవద్దు>> అని వారితో చెప్పాడు.

25వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి26<<యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు>> అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది.
27అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.28అప్పుడు ఇశ్రాయేలు <<ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను>> అన్నాడు.


1 45:22 మూడున్నర కిలోలు

Chapter 46

యాకోబు ఐగుప్తు ప్రయాణం

1ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.2అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు <<యాకోబూ, యాకోబూ>> అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.3ఆయన <<నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.4నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.>>

5యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.6యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.7అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.

8ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.

9యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

10షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.

11లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.

12యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.

13ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.

14జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.

15వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.

16గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.

17ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.18లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.

19యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.

20యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.

21బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.22యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.

23దాను కొడుకు హుషీము.

24నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.25లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.
26యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.27ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.

28యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.29యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో <<నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను>> అని చెప్పాడు.

31యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో <<నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, <కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు.32వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు> అని అతనితో చెబుతాను.
33కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, <మీ వృత్తి ఏంటి?> అని అడిగితే34<మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.> మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.>>

Chapter 47

యాకోబు ఐగుప్తులో స్థిరపడడం

1యోసేపు వెళ్ళి ఫరోతో <<మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు>> అని తెలియచేసి,2తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు.

3ఫరో, అతని సోదరులను చూసి <<మీ వృత్తి ఏంటి?>> అని అడిగితే వారు <<నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం>> అని ఫరోతో చెప్పారు.4వారు <<కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి>> అని ఫరోతో అన్నారు.
5ఫరో యోసేపును చూసి <<మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు.6ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు>> అని చెప్పాడు.

7యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు.8ఫరో <<నీ వయసెంత?>> అని యాకోబును అడిగాడు.9యాకోబు <<నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు>> అని ఫరోతో చెప్పి,10ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.

11ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు.12యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
ఐగుప్తులో కరువు

13కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి.14యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు.
15ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి <<మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది>> అన్నారు.

16అందుకు యోసేపు <<మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను>> అని చెప్పాడు.17కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు.
18ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి <<మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు.19మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి>> అని అడిగారు.

20ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది.21అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను 1 దాసులుగా చేశాడు.22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.
23యోసేపు <<ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి.24నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి>> అని ప్రజలతో చెప్పాడు.
25వారు <<నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం>> అని చెప్పారు.26అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.
యాకోబు అవసానదశ

27ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు.28యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
29ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి <<నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు.30నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు>> అని అతనితో చెప్పాడు.31అందుకు యోసేపు <<నేను నీ మాట చొప్పున చేస్తాను>> అన్నాడు. ఇశ్రాయేలు <<నాతో ప్రమాణం చెయ్యి>> అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.


1 47:21 వారిని వివిధ ప్రదేశాల్లో స్థిరపడేలా చేశాడు.

Chapter 48

యోసేపు కొడుకులను యాకోబు దీవించడం

1ఈ సంగతులైన తరువాత <<ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు>> అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.2<<ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు>> అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు.

3అతడు యోసేపుతో <<కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి4<ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను> అన్నాడు.
5నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే.6వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి.

7పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను>> అని యాకోబు చెప్పాడు.
8ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి <<వీరెవరు?>> అని అడిగాడు.9యోసేపు <<వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు>> అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు <<నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా>> అన్నాడు.10ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.

11ఇశ్రాయేలు యోసేపుతో <<నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు>> అన్నాడు.12యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు.13తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని, వారిద్దరిని అతని సమీపంగా తీసుకు వచ్చాడు.
14ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.

15ఇశ్రాయేలు యోసేపును దీవించి
<<నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో
ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు,
16సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక.
నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక.
లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక>> అన్నాడు.

17యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి,18<<నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు>> అని చెప్పాడు.
19అతని తండ్రి ఒప్పుకోక <<నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు>> అన్నాడు.20ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. <<ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, <ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక> అని మీ పేరెత్తి దీవిస్తారు>> అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు.
21ఇశ్రాయేలు <<ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు.22నేను నీ సోదరులకంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దాన్ని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను>> అని యోసేపుతో చెప్పాడు.

Chapter 49

యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు

1యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. <<మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.

2యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.

మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.

3రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,

నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.

4పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.

ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు.

నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.

5షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.

నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది.

కోపంలో వారు మనుషులను చంపారు.

సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.

7వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.

అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను.

ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.

8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.

నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.

నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.

9యూదా సింహం పిల్ల.

నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు.

అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు.

సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు.

అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?

10షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.

అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు.

రాజ్యాలు అతనికి లోబడతాయి.

11ద్రాక్షావల్లికి తన గాడిదనూ,

మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి,

ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.

12అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,

అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.

13జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.

అతడు ఓడలకు రేవుగా ఉంటాడు.

అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.

14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
15అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.

బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.

16దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
17దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
18యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
19దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది.
రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
అతనికి అందమైన పిల్లలుంటారు.
22యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
23విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి.
ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన,
ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
25నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు,
కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి.
అవి యోసేపు తల మీద ఉంటాయి.
తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
27బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
అతడు ఉదయాన ఎరను మింగి,
దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.>>
యాకోబు మరణం, సమాధి

28ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.29తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. <<నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.30హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.

31అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.32ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు>> అన్నాడు.33యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.

Chapter 50

1యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు.2యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు.3అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఖించారు.

4అతని గురించి దుఃఖించే రోజులు అయిపోయిన తరువాత, యోసేపు ఫరో ఇంటి వారితో మాటలాడి <<మీ దయ నా మీద ఉంటే నా పక్షంగా ఫరోతో5<మా నాన్న నాతో ప్రమాణం చేయించి <<ఇదిగో, నేను చనిపోతున్నాను, కనానులో నా కోసం తవ్వించిన సమాధిలో నన్ను పాతిపెట్టాలి అని చెప్పాడు కాబట్టి అనుమతిస్తే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తాను అని యోసేపు అన్నాడు>> అని చెప్పండి> >> అన్నాడు.6అందుకు ఫరో <<అతడు నీ చేత చేయించిన ప్రమాణం ప్రకారం వెళ్ళి మీ నాన్నను పాతిపెట్టు>> అన్నాడు.

7కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులంతా ఐగుప్తు దేశపు పెద్దలంతా8యోసేపు ఇంటివారంతా అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారు వెళ్ళారు. వారు తమ పిల్లలనూ తమ గొర్రెల మందలనూ తమ పశువులనూ మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టారు.9రథాలు, రౌతులు అతనితో వెళ్ళాయి. అది చాలా పెద్ద గుంపు అయింది.
10వారు యొర్దానుకు అవతల ఉన్న ఆటదు కళ్ళం వచ్చినపుడు చాలా పెద్దగా ఏడ్చారు. యోసేపు తన తండ్రిని గురించి ఏడు రోజులు విలపించాడు.11ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి <<ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం>> అని చెప్పుకున్నారు. అందుకే దానికి <<1 ఆబేల్‌ మిస్రాయిము>> అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది.
12యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు.13అతని కొడుకులు కనాను దేశానికి అతని శవాన్ని తీసుకుపోయి మమ్రే దగ్గరున్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము పొలంతో పాటు గుహను శ్మశానం కోసం కొన్నాడు. అతడు దాన్ని హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు.14యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడు, అతని సోదరులు, అతని తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఐగుప్తుకు వచ్చారు.
యోసేపు తన అన్నలను మరో మారు క్షమించడం

15యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి <<ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో>> అనుకున్నారు.16కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు.17<<మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, <నీ సోదరులు నీకు కీడు చేశారు. వారిని, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు> అని చెప్పమన్నాడు>> అని అతనితో చెప్పారు.

18అతని సోదరులు పోయి అతని ముందు సాగిలపడి <<ఇదిగో మేము నీకు దాసులం>> అన్నారు.19యోసేపు <<భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా?20మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.21కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను>> అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు.
యోసేపు అవసానదశ, మరణం

22యోసేపు, అతని తండ్రి కుటుంబం వారూ ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 ఏళ్ళు బతికాడు.23యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరం పిల్లలను చూశాడు. మనష్షే కొడుకయిన మాకీరు పిల్లలను కూడా చూశాడు. వారిని యోసేపు ఒడిలో ఉంచారు.

24యోసేపు తన సోదరులను చూసి <<నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు>> అని చెప్పాడు25అంతే గాక యోసేపు <<దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకుపోవాలి>> అని చెప్పి ఇశ్రాయేలు కొడుకులతో ప్రమాణం చేయించుకున్నాడు.26యోసేపు 110 ఏళ్ల వయసువాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.


1 50:11 ఐగుప్తీయుల సంతాపం

నిర్గమకాండం

Chapter 1

ఇశ్రాయేలు ప్రజల దురవస్థ

1యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,2దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.3యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది.4యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో5వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు.

6యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు.7ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది.
8కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.

9అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు <<ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు.10వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో>> అన్నాడు.

11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.12ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు.
13ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.14బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.

15ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా.16<<మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి>> అన్నాడు.17అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు.
18ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి <<మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?>> అని అడిగాడు.

19అప్పుడు ఆ మంత్రసానులు <<హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు>> అని ఫరోతో చెప్పారు.
20మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.21ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.22అప్పుడు ఫరో <<వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి>> అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.

Chapter 2

మోషే పుట్టుక

1లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.2ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది.

3ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది.4పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.

5ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.6పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. <<వీడు హెబ్రీయుల పిల్లవాడు>> అంది.
7అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో <<నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?>> అని అడిగింది.8ఫరో కూతురు <<వెళ్లి తీసుకు రా>> అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది.
9ఫరో కూతురు ఆమెతో <<ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను>> అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.

10ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె <<నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు 1 మోషే>> అని చెప్పింది.
మోషే మిద్యాను పలాయనం

11మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు.12అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.

13తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు.14అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో <<నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?>> అని అడిగాడు. అందుకు అతడు <<మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?>> అన్నాడు.

ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు.

15ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.

16మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు.17అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.

18వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు <<మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?>> అని అడిగాడు.19అందుకు వాళ్ళు <<ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు>> అన్నారు.20అతడు తన కూతుళ్ళతో <<అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి>> అని చెప్పాడు.

21మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు.22వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే <<నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను>> అనుకుని తన కొడుక్కి <<గెర్షోము>> అని పేరు పెట్టాడు.

23ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.24దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు.25దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.


1 2:10 నీటిలో నుండి తీసిన.

Chapter 3

మండుతున్న పొద దగ్గర మోషే

1మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ 1 దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.2అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.

3అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.
4దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు <<మోషే, మోషే>> అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.5అందుకు ఆయన <<దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది>> అన్నాడు.6ఆయన ఇంకా <<నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి>> అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.

7యెహోవా ఇలా చెప్పాడు. <<ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.8కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న 2 చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
9నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను.10నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.>>

11అప్పుడు మోషే దేవునితో <<ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?>> అని అన్నాడు.12దేవుడు <<నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన>> అన్నాడు.
13మోషే <<నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు <ఆయన పేరేమిటి?> అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?>> అని దేవుణ్ణి అడిగాడు.
దేవుని పేరు వెల్లడి

14అందుకు దేవుడు <<నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి , అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు>> అని మోషేతో చెప్పాడు.15దేవుడు మోషేతో ఇంకా <<మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.

16నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి <మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.17ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను> అని చెప్పాడని వారితో చెప్పు.18వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి.

19ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు.20అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు.21మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను.22ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు>> అన్నాడు.


1 3:1 పవిత్ర పర్వతం.
2 3:8 పాలు తేనెలు ప్రవహించే.

Chapter 4

మోషేకి దేవుడిచ్చిన అద్భుత శక్తి

1అప్పుడు మోషే <<వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. <యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు> అంటారేమో>> అని జవాబిచ్చాడు.

2యెహోవా <<నీ చేతిలో ఉన్నది ఏమిటి?>> అని మోషేను అడిగాడు. అతడు <<కర్ర>> అన్నాడు.

3అప్పుడు దేవుడు <<ఆ కర్రను నేల మీద పడవెయ్యి>> అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.

4అప్పుడు యెహోవా <<నీ చేత్తో దాని తోక పట్టుకో>> అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.

5ఆయన <<దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు>> అన్నాడు.

6తరువాత యెహోవా <<నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో>> అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.

7తరువాత ఆయన <<నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో>> అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.

8అప్పుడు దేవుడు <<వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు.9ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి>> అన్నాడు.

10మోషే <<ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి>> అన్నాడు.

11అప్పుడు యెహోవా <<మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా.12కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను>> అని మోషేతో చెప్పాడు.

13మోషే <<ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు>> అన్నాడు.
14అందుకు యెహోవా మోషే మీద కోపపడి <<లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు.15నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను.16అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క.17ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి>> అని చెప్పాడు.
మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం

18ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. <<నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను>> అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు.19అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో <<నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు>> అని చెప్పాడు.20మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు.

21అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు<<నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు.22అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, <ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు.23నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు> అని అతనితో చెప్పాలి>> అన్నాడు.

24ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు.25మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే 1 పాదాల దగ్గర పడేసింది. <<నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి>> అని చెప్పింది.26అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె <<ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు>> అంది.

27మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు.28అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు.

29తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు.30మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు.31యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.


1 4:25 మూల భాషలో ఇక్కడున్న దానికి మోషే మర్మాంగం దగ్గర తాకించింది అని అర్థం వస్తుంది.

Chapter 5

మోషే అహరోనులు ఫరో ఎదుట

1ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి <<ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు: ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు>> అని చెప్పారు.2అందుకు ఫరో <<యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను>> అన్నాడు.

3అప్పుడు ఆ ఇద్దరూ <<హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి మా దేవుడు యెహోవాకు బలి అర్పిస్తాం, లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో>> అన్నారు.

4ఐగుప్తు రాజు <<మోషే, అహరోనూ, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డు పడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి.5మా దేశంలో హెబ్రీయుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు>> అని వాళ్ళతో అన్నాడు.

6ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారి పైఅధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు.7<<ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇకనుండి మీరు ఇవ్వకండి. వాళ్ళే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి.8అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు <మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి> అని కేకలు వేస్తున్నారు.9అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు>> అన్నాడు.

10కాబట్టి పర్యవేక్షకులు, పై అధికారులు వెళ్లి ప్రజలతో <<మేము మీకు గడ్డి ఇయ్యము.11మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి. అయితే మీ పని ఏమాత్రం తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు>>అన్నారు.
12అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు.13అంతేకాదు, ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ <<గడ్డి ఇస్తున్నప్పటి లాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి>> అని బలవంతపెట్టారు.

14ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. <<ఇది వరకూ లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?>> అని అడిగారు.

15ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. <<తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?16తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే>> అని మొర పెట్టుకున్నారు.

17అప్పుడు ఫరో <<మీరు సోమరిపోతులు, వట్టి సోమరిపోతులు. అందుకే <మేము వెళ్లి యెహోవాకు బలులు అర్పించాలి> అని అనుమతి అడుగుతున్నారు.18మీరు వెళ్లి పని చెయ్యండి. మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు.
19మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి>> అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు.

20వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ, వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే, అహరోనులను కలుసుకున్నారు.21వాళ్ళు <<యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి, మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు>> అన్నారు.
22మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి <<ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు?23నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చేయలేదు>> అన్నాడు.

Chapter 6

యెహోవా తన ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు

1అందుకు యెహోవా <<ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్ఠమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు.>>

2ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు <<నేనే యెహోవాను.3నేను <1 సర్వశక్తి గల దేవుడు> అనే పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని, యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు.4వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను.5ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.

6కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.7మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
8అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.>>

9మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకు పోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్ట లేదు.
10యెహోవా మోషేతో <<నువ్వు రాజు ఆస్థానం లోకి వెళ్లి,11ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు>> అన్నాడు.

12అప్పుడు మోషే <<ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు 2 వాక్చాతుర్యం లేదు>> అని యెహోవా సముఖంలో చెప్పాడు.
మోషే అహరోనుల వంశావళి

13అప్పుడు యెహోవా మోషే అహరోనులతో <<ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి>> అని ఆజ్ఞాపించాడు.

14వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.

15షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు.

16లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.

17గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.

18కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.

19మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.

20అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.

21ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.

22ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

23అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

24కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు.

25అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.

26ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే.

27ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే.
మోషే అహరోనుల విధేయత

28ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు.29<<నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.>>30అందుకు మోషే <<నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?>> అని యెహోవా సముఖంలో అన్నాడు.


1 6:3 ఎల్ షద్దాయ్
2 6:12 అక్షరాలా సున్నతి లేని పెదవులు.

Chapter 7

యెహోవా మోషేతో చెప్పిన మాట

1యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు.2నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు.

3అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను.4అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను.5నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>
అహరోను కర్ర పాముగా మారిపోవడం

6మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు.7వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు.
8యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. <<మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే9నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.>>10మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.

11అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు.12వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.13అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.
మొదటి తెగులు

14తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు.15ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు.
16అతనితో, <ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకు ముందు నువ్వు మా మాట వినలేదు.17ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు18నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్ళు తాగలేకపోతారు> అని యెహోవా చెబుతున్నాడు.>>

19యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<నువ్వు అహరోనుతో ఇలా చెప్పు. నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ళ మీద అంటే, వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీదా నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది.>>
20యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.

21నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది.22ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
23జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.24అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు.25యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.

Chapter 8

రెండవ తెగులు. కప్పలు

1యెహోవా మోషేతో <<నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, <నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.2నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.3నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.4ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి> అని యెహోవా చెబుతున్నాడు.>>

5యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. <<నువ్వు అహరోనుతో <నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు> అని చెప్పు>> అన్నాడు.6అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.7ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.

8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను>> అని చెప్పాడు.9అందుకు మోషే <<ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే>> అన్నాడు. అప్పుడు ఫరో <<రేపే ఆ పని చెయ్యి>> అని బదులిచ్చాడు.
10అందుకు మోషే <<మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.11కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి>> అన్నాడు.

12మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.
13యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.14ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.15ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.
మూడవ తెగులు. చిన్న దోమలు

16అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు>> అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.17అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.
18మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు19మాంత్రికులు <<ఇది దేవుడైన యెహోవా వేలు>> అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.
నాలుగవ తెగులు. ఈగలు

20కాబట్టి యెహోవా మోషేతో <<నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.21నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.

22భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.23నా ప్రజలను నీ ప్రజల నుండి 1 ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు>>అన్నాడు.24యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.

25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి>> అని వాళ్ళతో చెప్పాడు.26అందుకు మోషే <<అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.27అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం>> అని చెప్పాడు.

28ఫరో <<మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి>> అన్నాడు.29అందుకు మోషే <<నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు>> అని చెప్పి
30ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.

31యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.32అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.


1 8:23 విడిపిస్తాను

Chapter 9

ఐదవ తెగులు. పశు సంపద హతం

1అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. <నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.>2నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే,3యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది.

4అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు.
5దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు>> అని చెప్పాడు.

6తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు.7ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
అరవ తెగులు. కురుపులు

8అప్పుడు యెహోవా <<మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి.9అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది>> అని మోషే అహరోనులతో చెప్పాడు.

10మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి.
11ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.12అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.

13తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.14భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను.
15ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి.
ఏడవ తెగులు. వడగండ్లు

16నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి.17నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు.
18ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.

19అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.>>
20యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు.21యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు.
22యెహోవా <<నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి>> అని మోషేతో చెప్పాడు.

23మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు.24ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు.
25ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి.26అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.

27ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం.28ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను>> అని వాళ్ళతో చెప్పాడు.
29మోషే అతనితో <<నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు.30అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు>> అన్నాడు.

31ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి.32గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు.33మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.

34అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.35యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

Chapter 10

ఎనిమిదవ తెగులు. మిడతలు

1యెహోవా మోషేతో <<ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను.2నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి>> అని చెప్పాడు.

3మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. <<హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.4నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.
5నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.6మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు>> అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.

7అప్పుడు ఫరో సేవకులు ఫరోతో <<ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?>> అన్నారు.8కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో <<మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?>> అని అడిగాడు.
9అందుకు మోషే <<మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం>> అని బదులిచ్చాడు.

10అందుకు ఫరో <<యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.11కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా>> అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.
12అప్పుడు యెహోవా మోషేతో <<మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి>> అని చెప్పాడు.13మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.

14తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు.15ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.

16కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. <<నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.17దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి>> అన్నాడు.18మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు.

19అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.20అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
21అప్పుడు యెహోవా మోషేతో <<ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది>> అని చెప్పాడు.
తొమ్మిదవ తెగులు. చీకటి

22మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.23ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.

24ఫరో మోషేను పిలిపించాడు. <<మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు>> అన్నాడు.25అందుకు మోషే <<మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది.26మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి>> అని చెప్పాడు.

27అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.28అప్పుడు ఫరో <<బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు>> అన్నాడు.29అందుకు మోషే <<సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను>> అన్నాడు.

Chapter 11

పదవ తెగులు. ఐగుప్తు వారి ఇళ్ళలో ప్రథమ సంతానం మరణం

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు.2కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.>>

3యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు.
4మోషే ఫరోతో ఇలా అన్నాడు<<యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను.5ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.

6అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.7యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు.8అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, <నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి> అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను>> అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.

9అప్పుడు యెహోవా <<ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు>> అని మోషేతో చెప్పాడు.10మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.

Chapter 12

మొదటి పస్కా

1మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు.2<<నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట.

3ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.

4ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.

5మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.6ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి.7కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.

8ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.
9దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి.10తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.

11మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని 1 త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు 2 పస్కా బలి.

12నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో 3 తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.13మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.
పొంగని రొట్టెల పండగ

14కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
15ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి.16ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే.

17ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది.18మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి.
19ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి.20మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.>>
మొదటి పస్కా పండగ ఆచరణ

21అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. <<మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి.22తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి.
23యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.

24అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది.25యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి.
26మీ కొడుకులు <మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?> అని మిమ్మల్ని అడిగితే,27<ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు> అని చెప్పాలి>> అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.28అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
పదవ తెగులు-ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణం

29ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి.30ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది.

31ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో <<మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి.32మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా>> అన్నాడు.33ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.
ఇశ్రాయేలీయుల నిర్గమనం- రామెసేసునుండి సుక్కోతుకు

34ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు.35అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు.36ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు.

37తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది.38అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి.39తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.

40ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.
41ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి.42ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.
పస్కా గురించిన ఆదేశాలు

43తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. <<ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు.44మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు.
45వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు.46ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.

47ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి.48మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు.
49స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.>>

50యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు.51ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.


1 12:11 అంటే ప్రయాణానికి సిద్ధమై తినాలి.
2 12:11 పస్కా అంటే, ఐగుప్టు వారి మొదటి సంతానాన్ని వధించడానికి సంహార దూత బయలు దేరినప్పుడు అతడు ఇశ్రాయేల్ వారిని దాటిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్న పండగ.
3 12:12 ఐగుప్తు దేవుళ్ళు అందరూ నిజమైన దేవుళ్ళు కారని రుజువు చేస్తాను.

Chapter 13

ఇశ్రాయేల్ ప్రథమ సంతానం ప్రతిష్ట

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.2<<ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.>>

పొంగని రొట్టెల పండగ

3అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. <<మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.4అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు.5కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే 1 పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.

6మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి.7ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.

8ఆ రోజు మీ పిల్లలకు <నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను> అని చెప్పాలి.9యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.
ప్రథమ సంతానాన్ని యెహోవాకు ప్రతిష్టించడం

10అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి.
11యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత12మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.

13ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను 2 ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి.
14ఇకముందు మీ కొడుకులు <ఇలా ఎందుకు చెయ్యాలి?> అని అడిగితే, వాళ్ళతో, <ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.15ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను> అని చెప్పాలి.16యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.>>
అగ్ని స్థంభం, మేఘ స్థంభం

17ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. <<ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో>> అనుకున్నాడు.18అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ 3 గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.

19మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు <<దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి>> అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.20వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు.

21పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.22దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.


1 13:5 సారవంతమైన
2 13:13 గాడిదను అర్పించడం ఆమోదం కాదు. అందుకని గొర్రె పిల్ల అర్పణ ఆమోదయోగ్యం.
3 13:18 అంటే సిద్ధపడి వెళ్లారు, ఆయుధాలు పట్టుకుని కాదు. వారు గోత్రాల వారిగా క్రమ పద్ధతిలో బయలు దేరారు అని భావం.

Chapter 14

ఎర్ర సముద్రం దాటడం

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,2<<ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకూ, సముద్రానికీ మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు3ఫరో, <ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు> అనుకుంటాడు.

4నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>5ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. <<మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?>> అని చెప్పుకున్నారు.

6అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంట బెట్టుకుని బయలుదేరాడు.7అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకు పోయాడు.8యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు.9బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు.

10ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు.11అప్పుడు వాళ్ళు మోషేతో <<ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా?12మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది>> అని నిష్టూరంగా మాట్లాడారు.

13అందుకు మోషే <<భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు.14మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు>> అని ప్రజలతో చెప్పాడు.

15యెహోవా మోషేతో <<నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? <ముందుకు కొనసాగండి> అని ప్రజలతో చెప్పు.16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు.17చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను.18నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>

19అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది.20అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది.
21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు.22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.

23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు.24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు.25ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు <<రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు>> అని చెప్పుకున్నారు.
తరుముతున్న ఐగుప్తు సైన్యం మునిగిపోయారు

26యెహోవా మోషేతో <<ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు>> అని చెప్పాడు.27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు.28నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు.

29అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి.30ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు.31తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.

Chapter 15

మోషే మిర్యాముల కీర్తన

1అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. <<యెహోవాను గురించి పాడతాను.ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,

సముద్రంలో ముంచి వేశాడు.

గొప్ప విజయం సాధించాడు.

2యెహోవాయే నా బలం, నా గానం,

నా రక్షణకర్త. ఆయన నా దేవుడు,

ఆయనను స్తుతిస్తాను.

ఆయన నా పూర్వీకుల దేవుడు,

ఆయనను ఘనపరుస్తాను.

3యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.

4ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు.

సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.

5రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.

6యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది.

యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.

7నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు.

నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు.

8నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి.

ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి.

సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి.

9<వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను> అని శత్రువు అనుకున్నాడు.

10నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.

11పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు?

పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు?

స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు,

అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?

12నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.

13నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.

14ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది.

వాళ్ళు భయపడతారు.

అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.

15ఎదోము అధిపతులు భయపడతారు.

మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు.

కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,

16భయ భీతులు వారిని ఆవరిస్తాయి.

యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.

17నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు.

18యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.>>

19ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.20అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.21మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.
మిర్యాము కీర్తన

<<యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి,

ఆయన ఘన విజయం సాధించాడు,

శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచి వేశాడు.>>

22మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత 1 మారాకు చేరుకున్నారు.23మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.

24ప్రజలు మోషే మీద సణుగుతూ <<మేమేమీ తాగాలి?>> అన్నారు.25మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,26<<మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.>>

27తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.


1 15:22 అంటే చేదు

Chapter 16

పరలోకం నుండి ఆహారం

1తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.2అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.3ప్రజలు వారితో <<మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు>> అన్నారు.

4యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజూ ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను.51 ఆరవ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి.>>

6మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. <<మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.7ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.>>

8మోషే వాళ్ళతో <<మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?>> అన్నాడు.

9మోషే అహరోనులతో యెహోవా <<ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.>>10అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.

11అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను.12వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.>>
13అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.14నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.15ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక <<ఇదేంటి?>> అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

16మోషే వాళ్ళతో <<ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ 2 ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.>>17ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.

18వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.
19అప్పుడు మోషే <<ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు>> అని వాళ్ళతో చెప్పాడు.

20అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.21కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.

22ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు.23అందుకు మోషే <<యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.>>
24మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.25అప్పడు మోషే <<ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు.
26మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు>> అని చెప్పాడు.27ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.

28అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు<<మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?29వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.>>30అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.

31ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి <<మన్నా>> అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.32మోషే ఇలా చెప్పాడు<<యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.>>
33అప్పుడు మోషే అహరోనుతో <<నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు>> అని చెప్పాడు.

34యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా 3 శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.35తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు.36ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.


1 16:5 అంటే శుక్రవారం.
2 16:16 వ. 36 చూడండి
3 16:34 సాక్షపు పెట్టె, లేక ఒడంబడిక మందసం. 25:10-12 చూడండి.

Chapter 17

బండ నుండి నీరు

1యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు.2దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ <<మాకు తాగడానికి నీళ్లియ్యి>> అన్నారు. అప్పుడు మోషే <<మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?>> అన్నాడు.3ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ <<ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?>> అన్నారు.

4అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. <<ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో>> అన్నాడు.5అప్పుడు యెహోవా <<ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు.6నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి>> అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు.7అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు <<యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?>> అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి <<1 మస్సా>> అనీ <<2 మెరీబా>> అనీ పేర్లు పెట్టాడు.
అమాలేకీయులతో యుద్ధం

8తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.9మోషే 3 యెహోషువతో <<మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను>> అన్నాడు.

10యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు.
11మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు.12మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు.13ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.

14అప్పుడు యెహోవా మోషేతో <<చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను>> అన్నాడు.15తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి <<4 యెహోవా నిస్సీ>> అని పేరు పెట్టాడు.16అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక <<యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు>> అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.


1 17:7 పరీక్ష
2 17:7 కలహం
3 17:9 యెహోషువా ఇశ్రాయేల్ వారి సేనాని. 33: 11 చూడండి.
4 17:15 యెహోవా నా జెండా.

Chapter 18

మోషే దగ్గరికి యిత్రో రాక

1యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి, మోషేకు, అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు జరిగించినదంతా మిద్యానులో యాజకుడైన మోషే మామ యిత్రో విన్నాడు.2మోషే మామ యిత్రో మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను,3ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకడి పేరు 1 గెర్షోము. ఎందుకంటే మోషే <<నేను అన్య దేశంలో పరాయివాణ్ణి>> అన్నాడు.4రెండో వాడి పేరు 2 ఎలియాజరు. ఎందుకంటే <<నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం. ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు>> అని అతడు అన్నాడు.

5మోషే మామ యిత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యనూ వెంటబెట్టుకుని ఎడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోషే దగ్గరికి వచ్చాడు.6<<నీ మామ యిత్రో అనే నేనూ నీ భార్య, ఆమెతో కలసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరికి వస్తున్నాము>> అని మోషేకు కబురు పంపాడు.
7మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు.

8తరువాత యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరోకు, ఐగుప్తీయులకు చేసినదీ మార్గంలో తమకు సంభవించిన కష్టాలూ వాటి నుండి యెహోవా తమను విడిపించిన విషయం మోషే తన మామకు వివరంగా చెప్పాడు.
9యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ళు విని యిత్రో సంతోషించాడు.10యిత్రో <<ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగు గాక.11యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్టు వారి వశంనుండి ఆయన తన ప్రజలను రక్షించాడు>> అన్నాడు.

12మోషే మామ యిత్రో హోమబలి, ఇతర బలులు దేవునికి అర్పించాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు మోషే మామతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు.
13మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ ప్రజలు మోషే దగ్గర బారులు తీరి నిలబడ్డారు.
న్యాయాధికారుల నియామకం
ద్వితీ 1:9-18

14ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో <<నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడివే తీర్పరిగా కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి?>> అని అడిగాడు.
15మోషే <<దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు.16వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను>> అని తన మామతో చెప్పాడు.

17అందుకు మోషే మామ అతనితో <<నీవు చేస్తున్న పని మంచిది కాదు.18ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది.19నా మాట విను. నేను నీకొక ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి.20ప్రజలకు దేవుని చట్టాలూ ధర్మశాస్త్ర నియమాలూ బోధించాలి. వాళ్ళు నడుచుకోవలసిన మార్గాలను, చేయవలసిన పనులనూ వాళ్ళకు తెలియజెయ్యాలి.

21నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులుకాని సమర్ధులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వాళ్ళను నియమించు.22వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు. పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరికి తీసుకు వస్తారు. చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్ళే పరిష్కరిస్తారు. ఆ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది.23ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు>> అని చెప్పాడు.
24మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు.

25మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు.26వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయాధికారులుగా ఉన్నారు. చిన్న చిన్న తగాదాలు తమకు తాము పరిష్కరించేవాళ్ళు. కఠినమైన తగాదాలు మోషే దగ్గరికి తెచ్చేవారు.27తరువాత మోషే తన మామను సాగనంపాడు, అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు.


1 18:3 పరదేశి
2 18:4 నా దేవుడు సహాయకుడు

Chapter 19

ఇశ్రాయేల్ ప్రజా సీనాయి కొండకు చేరుకోవడం

1ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.2వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.

3మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో <<నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.

4<నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.5ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.6మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.> నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే>> అన్నాడు.

7మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు.8అందుకు ప్రజలంతా <<యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం>> అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.9యెహోవా మోషేతో <<ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు>> అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.

10అప్పుడు యెహోవా మోషేతో <<నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని11మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.

12నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, <మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.13ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి> అని చెప్పు>> అన్నాడు.

14అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.15అప్పుడు మోషే <<మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.>> అని చెప్పాడు.
16మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు.17దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.

18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. 1 ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
19ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.20యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.

21అప్పుడు యెహోవా మోషేతో <<ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు.22ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు>> అన్నాడు.

23అందుకు మోషే యెహోవాతో <<ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా>> అన్నాడు.24అప్పుడు యెహోవా <<నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు>> అని చెప్పాడు.25మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.


1 19:18 ప్రజలంతా వణికిపోయారు

Chapter 20

పది ఆజ్ఞలు
ద్వితీ 1:1-21

1దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు,2నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.

3నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.

4పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.

5ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.

6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.

7నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.

8విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి.9నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి.10ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.

11ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

12నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.

13హత్య చెయ్యకూడదు.

14వ్యభిచారం చెయ్యకూడదు.

15దొంగతనం చెయ్యకూడదు.

16నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

17నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
ప్రజల భయభీతులు

18ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో,19<<దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం>> అన్నారు.

20అందుకు మోషే <<భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు>> అని ప్రజలతో చెప్పాడు.

21ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.
22యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్షులు.23మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు.
బలిపీఠం

24మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమబలులూ, శాంతిబలులూ, మీ గొర్రెలూ, ఎద్దులూ అర్పించాలి. నా పేరు గుర్తుంచుకొనేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలం లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.25ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది.26అంతేకాదు, నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నత్వం కనిపించకూడదు కాబట్టి మెట్ల మీదుగా ఎక్కకూడదు.>>

Chapter 21

హెబ్రీ బానిసల గురించిన చట్టాలు
ద్వితీ 15:12-18

1నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చెయ్యాలి.

2మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,3ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్లవచ్చు. భార్యతో కలసి వస్తే వాడి భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు.4ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ పుట్టినట్టయితే ఆ భార్య, పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు, వాడు ఒంటరిగానే వెళ్లిపోవాలి.

5అయితే ఆ దాసుడు <<నేను నా యజమానిని, నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను, వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను>> అని తేటగా చెబితే6వాడి యజమాని అతణ్ణి న్యాయాధిపతి దగ్గరకి తీసుకు రావాలి. తరువాత ఆ యజమాని వాణ్ణి తలుపు దగ్గరికి గానీ, గుమ్మం దగ్గరికి గానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి.

7ఒకడు తన కూతురిని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్లిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు.8ఆమెను భార్యగా ఉంచుకోదలచే ఆమె యజమానికి ఆమె నచ్చక పోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి. యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు.

9యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి.10ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు.11ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు.
హింసాత్మక చర్యల గురించిన చట్టాలు

12ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.13అయితే ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను.14అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో, కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి.
15తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.

16ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా, తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.17తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.
18ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే,19తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.

20ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి, దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు.21అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము.
22ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి.

23తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం,24కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,25వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.

26ఒకడు తన దాసుణ్ణి గానీ, దాసిని గానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.27తన దాసుడి, దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.

28ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ పొడిచి చంపితే ఆ ఎద్దును కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. ఈ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు.29అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయక పోవడం వల్ల దాని ద్వారా పురుషుడు గానీ, స్త్రీ గానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి.30మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి.
31ఆ ఎద్దు చిన్న పిల్లవాణ్ణి గానీ చిన్న పిల్లనుగానీ పొడిచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది.32ఎద్దు దాసుణ్ణి గానీ, దాసిని గానీ పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని 1 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

33ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు గానీ, గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచక పోవడం వల్ల గానీ దానిలో వేరొకరి ఎద్దు గానీ, గాడిద గానీ పడి చనిపోతే34ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది.

35ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి.36అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి, చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.


1 21:32 342 గ్రాముల వెండి.

Chapter 22

ఆస్తిపాస్తుల సంరక్షణ

1<<ఎవరైనా ఒకడు ఎద్దును గానీ, గొర్రెను గానీ దొంగిలించి వాటిని అమ్మినా, లేదా చంపినా ఒక ఎద్దుకు బదులు ఐదు ఎద్దులు, ఒక గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు చెల్లించాలి.2ఎవరైనా దొంగతనం చేస్తూ దొరికిపోతే వాణ్ణి చనిపోయేలా కొట్టినప్పుడు కొట్టిన వాళ్ళ మీద నేరం ఉండదు.3సూర్యుడు ఉదయించిన తరువాత దొంగతనానికి వచ్చిన వాణ్ణి కొట్టిన వ్యక్తి పై హత్యానేరం ఉంటుంది. దొంగిలించిన సొత్తు తిరిగి చెల్లించాలి. దొంగ దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాణ్ణి బానిసగా అమ్మివేయాలి.4దొంగిలించిన ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ ఏదైనా సరే, ప్రాణంతో దొరికితే వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.

5ఒకడు తన పశువును మేత మేయడానికి తన పొలం లోకి గానీ, ద్రాక్ష తోటలోకి గానీ వదిలినప్పుడు అది వేరొక వ్యక్తి పొలంలో మేస్తే ఆ పొలం యజమానికి తన పంటలో, ద్రాక్షతోటలో శ్రేష్ఠమైనది తిరిగి చెల్లించాలి.
6నిప్పు రాజుకుని ముళ్ళకంపలు అంటుకోవడం వల్ల వేరొకరి పంట కుప్పలైనా, పొలంలో పైరులైనా, పొలమైనా తగలబడి పోతే నిప్పు అంటించిన వాడు జరిగిన నష్టాన్ని పూడ్చాలి.

7ఒక వ్యక్తి సొమ్మును గానీ, సామాన్లు గానీ జాగ్రత్త చెయ్యమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టయితే ఆ దొంగ దొరికిన పక్షంలో వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.8ఒకవేళ ఆ దొంగ దొరకని పక్షంలో ఆ ఇంటి యజమాని తన పొరుగువాడి వస్తువులు తీసుకున్నాడో లేదో పరిష్కారం చేసుకోవడానికి 1 న్యాయాధికారుల దగ్గరికి రావాలి.9ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, దుస్తులు వంటి ప్రతి విధమైన వాటి అపహరణ గూర్చిన ఆజ్ఞ ఇదే. పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, అవి నావి అని వాదించినప్పుడు ఆ విషయంలో పరిష్కారం కోసం 2 న్యాయాధికారుల దగ్గరికి రావాలి. న్యాయాధిపతి ఎవరి మీద నేరం రుజువు చేస్తాడో వాడు తన పొరుగువాడికి రెండు రెట్లు చెల్లించాలి.

10ఒకడు గాడిద, ఎద్దు, గొర్రె, మరి ఏ జంతువునైనా కాపాడమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు, అది చనిపోయినా, గాయపడినా, లేదా ఎవరూ చూడకుండా ఎవరైనా వాటిని తోలుకు పోయినా,11అ వ్యక్తి తన పొరుగువాడి సొమ్మును తాను దొంగిలించలేదని యెహోవా నామం పేరట ప్రమాణం చెయ్యాలి. ఆ ప్రమాణం వారిద్దరి మధ్యనే ఉండాలి. ఆస్తి స్వంత దారుడు దానికి సమ్మతించాలి. జరిగిన నష్టపరిహారం చెల్లించనక్కర లేదు.12ఒకవేళ అది నిజంగా అతని దగ్గర నుండి ఎవరైనా దొంగిలిస్తే అతడు స్వంత దారుడికి పరిహారం చెల్లించాలి.13లేదా ఒకవేళ మృగాలు దాన్ని చీల్చివేస్తే రుజువు కోసం దాన్ని తీసుకురావాలి. అలా చనిపోయినప్పుడు దాని నష్టం చెల్లించనక్కర లేదు.

14ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకుంటే, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, లేదా అది చనిపోయినా ఆ నష్టాన్ని తప్పకుండా పూరించాలి.15దాని యజమాని దానితో ఉన్నట్టయితే దాని నష్టం చెల్లించనక్కర లేదు. ఒకవేళ అది కిరాయికి తెచ్చినదైతే దాని కిరాయి డబ్బు యజమానికి చెల్లించాలి.
సమాజంలో బాధ్యతలు

16ఒకడు పెళ్లి నిర్ణయం కాని ఒక కన్యను లోబరచుకుని ఆమెతో తన వాంఛ తీర్చుకుంటే ఆమె కోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి.17ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికిచ్చేందుకు నిరాకరిస్తే వాడు కన్యల కట్నం ప్రకారం సొమ్ము చెల్లించాలి.

18మంత్రగత్తెను బతకనివ్వకూడదు.

19జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలి.

20యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి, వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు.

21పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.

22విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు.23వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను.24నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.

25నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.26మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి.27వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.

28నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.

29నీ మొదటి కోత అర్పణలు ఇవ్వడంలో ప్రథమ ఫలాలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. నీ కొడుకుల్లో మొదటివాణ్ణి నాకు ప్రతిష్టించాలి.30అదే విధంగా నీ ఎద్దులు, గొర్రెలు అర్పించాలి. మీరు ప్రతిష్ఠించినవి మొదటి ఏడు రోజులు తమ తల్లి దగ్గర ఉన్న తరువాత ఎనిమిదవ రోజు నాకు ప్రతిష్ఠించాలి.31మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.>>


1 22:8 అక్షరాలా, దేవుళ్ళ దగ్గరికి.
2 22:9 అక్షరాలా, దేవుళ్ళ దగ్గరికి.

Chapter 23

జాలి, కరుణల గురించిన చట్టాలు

1పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు.2దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.3ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు.

4నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి.5నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.

6దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు7అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను.8లంచాలు తీసుకోవద్దు. 1 చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.

9విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
విశ్రాంతి దినం, సంవత్సరం గురించిన చట్టం

10ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి.11ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.

12ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి.13నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.
వార్షిక పండగలు
నిర్గమ 34:18-26; ద్వితీ 16:1-17

14సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి.15పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.

16మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి.17సంవత్సరంలో మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో సమకూడాలి.

18నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయం దాకా నిలవ ఉండకూడదు.19నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
కనానుకు నడిపిస్తానని వాగ్దానం

20నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను.21ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే 2 ఆయనకు నా పేరు పెట్టాను.22మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.

23ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను.24మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి 3 వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.

25మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.
26మీ దేశంలో గర్భస్రావాలు ఉండవు. సంతాన సాఫల్యత లేని వాళ్ళు మీ దేశంలో ఉండరు. మీరు జీవించే రోజుల లెక్క పూర్తి చేస్తాను.27నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.

28మీకు ముందుగా పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాను. అవి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాయి.29అయితే ఒక్క సంవత్సరంలోనే వాళ్ళను వెళ్లగొట్టను. ఎందుకంటే దేశం పాడైపోతుంది. క్రూరమృగాలు విస్తరించి మీకు ప్రమాదకరంగా మారతాయి.
30మీరు వృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దాకా వాళ్ళను కొంచెం కొంచెంగా మీ ఎదుట నుండి వెళ్ళగొడతాను.

31ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు.32మీరు వాళ్ళతో గానీ, వాళ్ళ దేవుళ్ళతో గానీ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు.33వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. 4 వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.


1 23:8 అధికారులను, లేక న్యాయాధికారులను.
2 23:21 ఆయనకు పూర్తి అధికారం ఇచ్చాను.
3 23:24 ఆ దేవుళ్ళను.
4 23:33 వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే, అని కూడా అర్థం వస్తుంది. అంటే ఆ దేశంలో విగ్రహ పూజ జరగకూడదు అని అర్థం.

Chapter 24

రక్త నిబంధన

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.2మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.>>

3మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం>> అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.4మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.
5తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.

6అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు.
7తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం>> అన్నారు.8మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. <<ఇది 1 నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే>> అని చెప్పాడు.
దేవునితో కొండపై

9ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.10అక్కడ వారికి ఇశ్రాయేలీయుల దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆయన పాదాల కింద మెరిసిపోతున్న నీలాలు అలికినట్టున్న వేదిక ఉంది. అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.11ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.
సీనాయి కొండపై మోషే

12అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.>>13మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు.

14మోషే ఇశ్రాయేలు పెద్దలతో <<మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేంత వరకూ ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి>> అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు.

15మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది.
16యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు.

17యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.18అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.


1 24:8 ఈ విషయాలన్నింటిలో యెహోవా మీతో చేసిన తన నిబంధన ఇదే.

Chapter 25

సన్నిధి గుడారం కోసం కానుకలు
నిర్గమ 35:4-9

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.2<<నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.

3మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.4నీలం, ఊదా రక్త వర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.5ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.6మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,7ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు.

8నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.9నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.
నిబంధన మందసం
నిర్గమ 37:1-9

10వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర11దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.
12దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.

13తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి14వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.
15ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.16ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.

17నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.18సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.
19ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.20ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.21నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
22అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.
సన్నిధి రొట్టెల బల్ల కోసం సూచనలు
నిర్గమ 37:10-16

23నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.24మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.
25దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.26దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.27బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.
28ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.

29నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.30నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.
దీపం
నిర్గమ 37:17-24

31నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.32దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.
33ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.34దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.
35దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.36వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.
37నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.38దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.39ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.40కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.>>

Chapter 26

సన్నిధి గుడారం

1<<నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.2ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.

3ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి.
4తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.5ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.6ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.

7మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.8ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే.9ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.
10తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.

11ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
12ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి.13గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.14ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.

15మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి.16పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి.17ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి.18నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.

19ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి.20మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున21ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.

22పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.23ఆ వెనక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చెయ్యాలి.24అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి.25పలకలు ఎనిమిది. వాటి వెండి దిమ్మలు పదహారు. ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలుండాలి.

26తుమ్మచెక్కతో అడ్డ కర్రలు చెయ్యాలి. మందిరం ఒక వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు,27మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి.28ఆ పలకల మధ్య ఉండే అడ్డ కర్ర ఈ చివరి నుండి ఆ చివరి వరకూ ఉండాలి.
29ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి.30కొండ మీద నీకు చూపించిన దాని నమూనా ప్రకారం మందిరాన్ని నిలబెట్టాలి.

31నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి.32తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి.33ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.

34అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.35అడ్డతెర బయట బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం ఉత్తర దిక్కున దీప వృక్షాన్ని ఉంచాలి.
36నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.37ఆ తెరకు ఐదు స్తంభాలను తుమ్మ చెక్కతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి కొక్కేలు బంగారువి. వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోత పోయాలి.>>

Chapter 27

దహన బలిపీఠం

1<<నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు.2దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి.

3దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.

4దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి.
5ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి.6బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.
7ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి.8పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.
ఆవరణం తెరలు
నిర్గమ 38:9-20

9నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.10దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
11అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.12పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది.13తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.
14ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.15రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.16ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు.
17ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి.18ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి.19మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.
దీపాల కోసం నూనె
లేవీ 24:1-4

20దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.21సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకూ నిత్య శాసనం.>>

Chapter 28

యాజకుల దుస్తులు

1<<నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.2అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి.3అహరోను నాకు యాజక సేవ జరిగించేలా నీవు అతణ్ణి ప్రత్యేక పరచడం కోసం అతని దుస్తులు కుట్టించాలి. నేను జ్ఞానాత్మతో నింపిన నిపుణులు అందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి.

4వారు కుట్టవలసిన దుస్తులు ఇవి. వక్ష పతకం, ఏఫోదు, నిలువుటంగీ, రంగు దారాలతో కుట్టిన చొక్కా, తల పాగా, నడికట్టు. అతడు నాకు యాజకుడై యుండేలా వారు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు ప్రతిష్ఠిత దుస్తులు కుట్టించాలి.5కళాకారులు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణాలు గల నూలును సన్ననారను దీనికి ఉపయోగించాలి.
ఏఫోదు

6బంగారం నీల ధూమ్ర రక్త వర్ణాల ఏఫోదును పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చెయ్యాలి.7రెండు భుజాలకు సరిపడేలా రెండు పై అంచుల్లో కూర్చిన పట్టీలు దానికి ఉండాలి.8ఏఫోదుపై ధరించడానికి పనితనంతో చేసిన నడికట్టు ఏకాండంగా ఉండి, బంగారంతో, నీల, ధూమ్ర, రక్త వర్ణాల నూలుతో, పేనిన సన్ననారతో కుట్టాలి.9నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున
10ఒక రత్నం మీద ఆరు పేర్లు, రెండవ రత్నం మీద తక్కిన ఆరు పేర్లను చెక్కించాలి.11ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.12అప్పుడు ఇశ్రాయేలీయులకు స్మారక సూచకమైన ఆ రెండు రత్నాలను ఏఫోదు1 భుజాలపై నిలపాలి. ఆ విధంగా అహరోను తన రెండు భుజాలపై యెహోవా సన్నిధిలో జ్ఞాపక సూచనగా ఆ పేర్లను ధరిస్తాడు.
న్యాయనిర్ణయ (వక్ష)పతకం

13బంగారు కుదురులను తయారు చెయ్యాలి.14మేలిమి బంగారంతో రెండు అల్లిక గొలుసులను చెయ్యాలి. ఆ అల్లిక పనికి అల్లిన గొలుసులను తగిలించాలి.
15కళాకారుని నైపుణ్యంతో న్యాయనిర్ణయ పతకాన్ని చెయ్యాలి. ఏఫోదు పని లాగా దాన్ని చెయ్యాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణాల నూలుతో పేనిన సన్ననారతో దాన్ని చెయ్యాలి.16నలుచదరంగా ఉన్న ఆ పతకాన్ని మడత పెట్టాలి. దాని పొడవు జానెడు, వెడల్పు జానెడు ఉండాలి.

17దానిలో నాలుగు వరసల్లో రత్నాలుండేలా రత్నాల కుదుర్లు చెయ్యాలి. మొదటి వరస మాణిక్యం, గోమేధికం, మరకతం.18రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం.19మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం.20నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి.

21ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి.22ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.23పతకానికి రెండు బంగారు రింగులు చేసి24ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి.
25అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు కుదురులకు తగిలించి ఏఫోదు ముందు వైపు భుజాలపై కట్టాలి.

26నీవు బంగారంతో రెండు రింగులు చేసి ఏఫోదు ముందు భాగంలో పతకం లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలించాలి.
27నీవు రెండు బంగారు రింగులు చేసి ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుపై దాని ముందు వైపు కింది భాగంలో ఏఫోదు రెండు భుజాలకు వాటిని తగిలించాలి.28అప్పుడు పతకం ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుకు పైగా ఉండేలా బిగించాలి. అది ఏఫోదునుండి విడిపోకుండా ఉండేలా వారు దాని రింగులను నీలి దారంతో కట్టాలి.

29ఆ విధంగా అహరోను పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళినప్పుడల్లా అతడు తన రొమ్ము మీద న్యాయనిర్ణయ పతకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ధరించాలి.30నీవు ఈ న్యాయనిర్ణయ పతకంలో 2 ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడల్లా అవి అతని రొమ్ముపై ఉంటాయి. అతడు యెహోవా సన్నిధిలో తన రొమ్ముపై ఇశ్రాయేలీయుల న్యాయనిర్ణయాలను నిత్యం భరిస్తాడు.
యాజకుల కోసం ఇతర దుస్తులు

31ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి.32దాని మధ్య భాగంలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చినిగి పోకుండా మెడ కవచం లాగా దాని రంధ్రం చుట్టూ నేతపని గోటు ఉండాలి.
33దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణాల దానిమ్మ కాయ ఆకారాలను, వాటి మధ్యలో బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించాలి.34ఒక్కొక్క బంగారు గంట, దానిమ్మకాయ ఆ నిలువుటంగీ కింది అంచున చుట్టూరా ఉండాలి.35సేవ చేసేటప్పుడు అహరోను దాని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధస్థలం లోకి ప్రవేశించేటప్పుడు అతడు చావకుండేలా వాటి చప్పుడు వినబడుతూ ఉండాలి.

36నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై <యెహోవాకు పరిశుద్ధం> అనే మాట చెక్కాలి.37పాగాపై ఉండేలా నీలి దారంతో దాన్ని కట్టాలి. అది పాగా ముందు వైపు ఉండాలి.38ఇశ్రాయేలీయులు అర్పించే పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో వాటిలో ఇమిడి ఉన్న దోషాలను అహరోను భరించేలా అది అహరోను నుదిటిపై ఉండాలి. వారికి యెహోవా సన్నిధిలో ఆమోదం ఉండేలా అది నిత్యం అతని నుదుటిపై ఉండాలి.

39సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి.
40నీవు అహరోను కుమారులకు చొక్కాలు కుట్టించాలి. వారికి నడికట్లు తయారు చెయ్యాలి. వారి ఘనత, వైభవాలు కలిగేలా వారికీ టోపీలు చెయ్యాలి.41నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి.

వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి.

42వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి.43వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.>>


1 28:12 యాజకుడు తొడుక్కునే పైవస్త్రం
2 28:30 ఇవి యాజకులు దైవ చిత్తాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే రంగు రాళ్లు, లేక రత్నాలు.

Chapter 29

యాజకుల ప్రతిష్ట, నియామకం
లేవీ 8:1-36

1<<నాకు యాజకులయ్యేలా వాళ్ళను ప్రతిష్ట చేయడానికి నువ్వు ఈ విధంగా చెయ్యి.2ఒక కోడెదూడను, లోపం లేని రెండు పొట్టేళ్లను తీసుకో. పొంగకుండా కాల్చిన రొట్టెను, పొంగకుండా వండిన నూనెతో కలిసిన వంటకాలను, నూనె పూసిన పలచని అప్పడాలు తీసుకో.

3వాటిని గోదుమపిండితో చెయ్యాలి. వాటిని ఒక గంపలో ఉంచి ఆ గంపను, ఆ కోడెదూడను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకు రావాలి.

4అహరోనును అతని కొడుకులను సన్నిధి గుడారం గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి.
5అహరోనుకు దుస్తులు తొడిగి ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదు వక్షపతకాన్ని వేసి, అల్లిక పని గల నడికట్టును అతనికి కట్టాలి.61 అతని తలమీద పాగా పెట్టి ఆ పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి.7తరువాత అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అతణ్ణి అభిషేకించాలి.

8తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.9అహరోనుకు, అతని కొడుకులకూ నడికట్లు కట్టి వారికి టోపీలు పెట్టాలి. ఈ విధంగా అహరోనును, అతని కొడుకులను ప్రతిష్టించాలి. యాజకత్వ నిర్వహణ పదవి వారికి చెందుతుంది. 2 ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కట్టుబాటు.

10నువ్వు సన్నిధి గుడారం ఎదుటికి ఆ కోడెదూడను తెప్పించాలి. అహరోను, అతని కొడుకులు ఆ కోడెదూడ తలపై తమ చేతులు ఉంచాలి.11సన్నిధి గుడారం ద్వారం దగ్గర యెహోవా సన్నిధానంలో ఆ కోడెదూడను వధించాలి.
12వధించిన ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకుని నీ వేలుతో బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. మిగిలిన రక్తమంతా బలిపీఠం కింద పారబోయాలి.

13దాని పేగులకు, కాలేయానికి, రెండు మూత్రపిండాలకు పట్టిన కొవ్వు అంతటినీ తీసివేసి బలిపీఠంపై కాల్చివెయ్యాలి.14ఆ దూడ మాంసం, చర్మం, దాని పేడ అంతటినీ శిబిరం బయట కాల్చివెయ్యాలి. అది పాప పరిహారం కోసం అర్పించే బలి.
15నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచాలి.16ఆ పొట్టేలును వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ రక్తాన్ని చల్లాలి.

17తరువాత ఆ పొట్టేలును దాని అవయవాలను దేనికి అది విడదీసి దాని పేగులు, కాళ్ళు కడిగి, దాని అవయవాలను, తలను మొత్తంగా పేర్చాలి.18పోట్టేలులోని ఆ భాగాలన్నిటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.

19తరువాత రెండవ పొట్టేలును తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిన తరువాత20ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసుకుని అహరోను కుడి చెవి అంచు మీద, అతని కొడుకుల కుడి చెవుల అంచుల మీద, వాళ్ళ కుడి చెయ్యి, కుడి కాలు బొటన వేళ్ళపై చిలకరించి మిగిలిన రక్తం బలిపీఠం మీద చుట్టూ చిలకరించాలి.

21బలిపీఠంపై ఉన్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో కొంచెం తీసుకుని అహరోను మీదా, అతని వస్త్రాల మీదా, అతని కొడుకుల మీదా, వాళ్ళ వస్త్రాల మీదా చిలకరించాలి. అప్పుడు అతడూ అతని వస్త్రాలూ, అతని కొడుకులూ వాళ్ళ వస్త్రాలూ పవిత్రం అవుతాయి.

22ఆ పొట్టేలు సేవ కోసం ప్రతిష్ఠితమైనది గనక దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులపై ఉన్న కొవ్వునూ, కాలేయం, రెండు మూత్రపిండాల చుట్టూ ఉన్న కొవ్వునూ, కుడి తొడను వేరు చెయ్యాలి.23వాటితోపాటు యెహోవా ఎదుట ఉన్న పొంగకుండా కాల్చిన గుండ్రని రొట్టెను, నూనెతో వండిన వంటకాలను, ఒక పలచని అప్పడాన్ని తీసుకోవాలి.
24అహరోను, అతని కొడుకుల చేతుల్లో వాటినన్నిటినీ ఉంచాలి. కదలించే నైవేద్యంగా యెహోవా సన్నిధిలో వాటిని కదిలించాలి.

25తరువాత వాళ్ళ చేతుల్లోనుంచి వాటిని తీసుకుని బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.

26అహరోను సేవా ప్రతిష్ట కోసం నియమించిన ఆ పొట్టేలు బోరను తీసుకుని యెహోవా సన్నిధిలో కదిలించే అర్పణగా దాన్ని కదిలించాలి. ఆ భాగం నీది అవుతుంది.27ప్రతిష్టించిన ఆ పొట్టేలులో అంటే అహరోను, అతని కొడుకులకు చెందిన దానిలో కదిలించే బోరను, ప్రతిష్ఠితమైన తొడను నాకు ప్రతిష్ఠించాలి.28ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.

29అహరోను ధరించిన ప్రతిష్ఠిత వస్త్రాలు అతని తరువాత అతని కొడుకులకు చెందుతాయి. వాళ్ళ అభిషేకం, ప్రతిష్ట జరిగే సమయంలో వారు ఆ వస్త్రాలను ధరించాలి.30అహరోను కొడుకుల్లో అతనికి బదులుగా యాజక వృత్తి ఎవరు చేపడతాడో అతడు పవిత్ర స్థలం లో సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళే సమయానికి ముందు ఏడు రోజులపాటు ఆ వస్త్రాలు ధరించాలి.

31నువ్వు ప్రతిష్ట అయిన పొట్టేలును తీసుకుని పవిత్రమైన చోట దాని మాంసం వండాలి.32అహరోను, అతని కొడుకులు సన్నిధి గుడారం గుమ్మం దగ్గర ఆ పొట్టేలు మాంసాన్నీ, గంపలో ఉన్న రొట్టెలనూ తినాలి.33వారిని ప్రతిష్ఠ చేయడానికీ, పవిత్రపరచడానికీ వేటి ద్వారా 3 ప్రాయశ్చిత్తం జరిగిందో వాటిని వాళ్ళు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి యాజకుడు కానివాడు వాటిని తినకూడదు.

34సేవ కోసం ప్రతిష్ఠి అయిన మాంసంలో గానీ, రొట్టెల్లో గానీ ఉదయం దాకా ఏమైనా మిగిలిపోతే వాటిని కాల్చివెయ్యాలి. అది ప్రతిష్ట అయినది గనక దాన్ని తినకూడదు.
35నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.

36వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి.37ఏడు రోజులపాటు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ బలిపీఠం అతి పవిత్రంగా ఉంటుంది. బలిపీఠానికి తగిలేదంతా పవిత్రం అవుతుంది.
అనుదిన అర్పణలు
సంఖ్యా 28:1-8

38బలిపీఠం మీద ఎప్పుడూ అర్పణలు జరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న రెండు గొర్రెపిల్లలను ప్రతి రోజూ అర్పించాలి.39ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల అర్పించాలి.
40ఉదయం అర్పించే గొర్రెపిల్లతోబాటు దంచి తీసిన నూనెతో కలిపిన ఒక కిలో పిండిని, పానార్పణగా లీటరు ద్రాక్షరసాన్నీ అర్పించాలి.

41ఉదయం అర్పించినట్టు సాయంత్రం కూడా చెయ్యాలి. యెహోవాకు అర్పణనూ, పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉండే ఇష్టమైన హోమం.42ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధి గుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకు అర్పించవలసిన హోమబలి. నేను అక్కడకు వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడతాను.
43అక్కడ ఇశ్రాయేలు ప్రజలను కలుసుకుంటాను. ఆ స్థలం నా మహిమా ప్రకాశం వల్ల పవిత్రం అవుతుంది.

44నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేస్తాను. నాకు యాజకులుగా ఉండేందుకు అహరోనును, అతని కొడుకులను పరిశుద్ధ పరుస్తాను.
45నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను.46వాళ్ళ మధ్య నివసించడానికి తమను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ దేవుడైన యెహోవాను నేనే.>>


1 29:6 28:36 చూడండి.
2 29:9 యాజకత్వం అనేది శాశ్వతంగా నిలిచి ఉండే ఆజ్ఞ.
3 29:33 పాప క్షమాపణ.

Chapter 30

పరిమళ ధూప వేదిక
నిర్గమ 37:25-28

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.2దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.

3దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.

4దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
5తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి.6వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.

7అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.8అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.

9దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.

10అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.>>

11యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,12<<నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.

13జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ 1 అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.

14ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.

15విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.

16ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.>>
ఇత్తడి గంగాళం

17యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. <<నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి.18సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.
19ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

20వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.

21వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.>>
అభిషేక తైలం, ధూపద్రవ్యం

22యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,23<<నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 2 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,24నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి.25పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.

26ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని,27సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని,28హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి.
29అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.

30అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.

31నీవు ఇశ్రాయేలు ప్రజలతో, <ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి.
32దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి.33దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి> అని చెప్పు.>>

34యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు<<నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి.35పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.

36దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.

37నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.38దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.>>


1 30:13 గేరా అనేది అన్నిటికన్నా చిన్న కొలత. ఇది దాదాపు అర గ్రాము.
2 30:23 సుమారు 6 కిలోలు.

Chapter 31

బెసలేలు, అహోలియాబు
నిర్గమ 35:30

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,2<<యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు.

3అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.4అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.5నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.

6దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.7నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సన్నిధి గుడారం, సాక్ష్యపు మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠాన్ని, గుడారపు సామగ్రిని తయారు చెయ్యాలి.8సన్నిధి బల్ల, దాని సామగ్రి, నిర్మలమైన దీపవృక్షం, దాని సామగ్రి తయారు చెయ్యాలి.9ధూపవేదిక, దహన బలిపీఠం, దాని సామగ్రి, గంగాళం, దాని పీట,
10యాజక ధర్మం నెరవేర్చే అహరోనుకు, అతని కొడుకులకు ప్రతిష్టించిన దుస్తులు సిద్ధం చెయ్యాలి.11పరిశుద్ధ స్థలం కోసం అభిషేక తైలాన్ని, సుగంధ ధూప ద్రవ్యాలను సిద్ధం చెయ్యాలి. ఇవన్నీ నేను నీకు ఆజ్ఞాపించినట్టు జరగాలి.>>
విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు

12యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.13మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది.14అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.

15ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి.
16ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం.17నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.>>

18ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.

Chapter 32

బంగారం దూడ
ద్వితీ 9:6-29

1మోషే కొండ దిగి రావడం ఆలస్యం కావడం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. <<లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియడం లేదు>> అన్నారు.

2అప్పుడు అహరోను <<మీ భార్యల, కొడుకుల, కూతుళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసి నా దగ్గరికి తీసుకు రండి>> అని చెప్పాడు.
3ప్రజలంతా తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను దగ్గరికి తెచ్చారు.4అతడు వాటిని తీసుకుని దూడ రూపం అచ్చుతో పోత పోసి బంగారం దూడను తయారు చేయించాడు. అప్పుడు ప్రజలు<<ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే>> అని కేకలు వేశారు.

5అహరోను దాన్ని చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. తరువాత అహరోను <<రేపు యెహోవాకు పండగ జరుగుతుంది>> అని చాటింపు వేయించాడు.6తరువాతి రోజు ప్రజలు ఉదయాన్నే లేచి హోమబలులు, శాంతిబలులు సమర్పించారు. తరువాత ప్రజలు తినడానికి, తాగడానికి కూర్చున్నారు. నాట్యం చేయడం మొదలు పెట్టారు.

7అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకు వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.8వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోత పోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి <ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే> అని చెప్పుకుంటున్నారు.>>

9యెహోవా ఇంకా ఇలా అన్నాడు. <<నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను. వాళ్ళు 1 కఠిన హృదయులయ్యారు.10నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. వాళ్ళను దహించివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను.>>11అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. <<యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.
12ఐగుప్తీయులు <వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు> అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు.13నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు>> అన్నాడు.

14అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.
15దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ పలకలపై రెండువైపులా దేవుడు నియమించిన ఆజ్ఞలు రాసి ఉన్నాయి.16ఆ పలకలు దేవుడు తయారు చేశాడు. ఆ పలకలు పట్టుకుని మోషే కొండ దిగి వచ్చాడు.

17శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. <<మన శిబిరంలో యుద్ధ ధ్వని వినబడుతోంది>> అన్నాడు.18మోషే <<అది జయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత వాయిద్యాల శబ్దం నాకు వినబడుతోంది>> అన్నాడు.
19అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.20ప్రజలు తయారు చేసుకున్న ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేశాడు. ఆ పొడిని నీళ్లలో కలిపి ఇశ్రాయేలు ప్రజల చేత తాగించాడు.

21అప్పుడు మోషే <<ఈ ప్రజల మీదికి ఈ గొప్ప అపరాధం వచ్చేలా చేయడానికి వీళ్ళు నిన్ను ఎలా ప్రేరేపించారు?>> అని అహరోనును అడిగాడు.22అహరోను <<నా ప్రభూ, నీ కోపం రగులుకోనియ్యకు. ఈ ప్రజలు దుర్మార్గులు అనే విషయం నీకు తెలుసు.23వాళ్ళు <మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకు వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియడం లేదు> అన్నారు.24అప్పుడు నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది>> అని చెప్పాడు.

25ప్రజలు తమ శత్రువుల ఎదుట నవ్వులపాలు కావడానికి అహరోను కారకుడయ్యాడు. ప్రజలు విచ్చలవిడితనంగా తిరగడం మోషే గమనించాడు.26అప్పుడు మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి <<యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళంతా నా దగ్గరికి రండి>> అన్నాడు. లేవీయులంతా అతని దగ్గరికి వచ్చారు.

27అతడు వాళ్ళను చూసి <<మీలో ప్రతి ఒక్కరూ మీ కత్తులు నడుముకు కట్టుకోండి, శిబిరంలో గుమ్మం నుండి గుమ్మానికి వెళ్తూ ప్రతి ఒక్కరూ తమ సోదరుణ్ణి, తమ స్నేహితుణ్ణి, తమ పొరుగువాణ్ణి సంహరించండి>> అన్నాడు.
28లేవీయులు మోషే మాట ప్రకారం చేసారు. ఆ రోజున ప్రజల్లో సుమారు మూడు వేల మంది హతమయ్యారు.

29మోషే లేవీయులతో <<మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ట చేసుకోండి. మీలో ప్రతి ఒక్కరూ మీ కొడుకులనూ, సోదరులనూ చంపి యెహోవా ఆశీర్వాదాలు పొందారు>> అన్నాడు.
30మరుసటి రోజు మోషే ప్రజలతో<<మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో>> అన్నాడు.

31మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. <<అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు.32అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు>> అని బతిమాలుకున్నాడు.

33అందుకు యెహోవా <<నాకు విరోధంగా ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తొలగిస్తాను.34నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను>> అని మోషేతో చెప్పాడు.35ప్రజలు అహరోను చేత చేయించిన దూడను బట్టి యెహోవా వాళ్ళను బాధలకు గురి చేశాడు.


1 32:9 తలబిరుసు, మొండి, మెడవంచని మనుషులు

Chapter 33

సీనాయి పర్వతం వదిలి వెళ్ళమని ఆజ్ఞ.

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నీవూ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చిన ప్రజలూ బయలుదేరి, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి ఇస్తానని చెప్పిన 1 పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి.2నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆ దూత కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అక్కడినుండి వెళ్ళగొడతాడు.3మీరు నాకు 2 అవిధేయులయ్యారు కనుక నేను మీతో కలసి రాను. ఒకవేళ మార్గమధ్యంలో మిమ్మల్ని చంపేస్తానేమో.>>

4ఆ దుర్వార్త విని ప్రజలు దుఃఖించారు. ధరించిన ఆభరణాలన్నీ పక్కనబెట్టారు.

5అప్పుడు యెహోవా మోషేతో <<నీవు ఇశ్రాయేలు ప్రజలతో <మీరు అవిధేయులైన ప్రజలు. ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని హతం చేస్తాను. మీరు ధరించుకొన్న ఆభరణాలన్నీ తీసివెయ్యండి. అప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చూస్తాను> అని చెప్పు>>అన్నాడు.

6ఇశ్రాయేలు ప్రజలు హోరేబు కొండ దగ్గర తమ నగలు తీసివేశారు.
7అప్పుడు మోషే శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఒక గుడారం వేశాడు. దానికి 3 సన్నిధి గుడారం అని పేరు పెట్టాడు. యెహోవాను కనుగొనాలనుకున్న ప్రతివాడూ శిబిరం బయట ఉన్న సన్నిధి గుడారానికి వచ్చాడు.

8మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడల్లా తమ గుడారాల్లో ఉన్న ప్రజలు లేచి నిలబడి అతడు గుడారం లోకి వెళ్ళేదాకా అతని వైపు నిదానంగా చూస్తూ ఉండేవాళ్ళు.9మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి ఆ గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు.

10ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు.11ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు.
మోషే ప్రార్థన

12మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. <<ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక <నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను> అని నాతో చెప్పావు కదా.13అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.>>

14అందుకు ఆయన <<నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను>> అన్నాడు.15మోషే <<నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు.16నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం>> అని ఆయనతో అన్నాడు.

17అప్పుడు యెహోవా <<నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను>> అని మోషేతో చెప్పాడు.18మోషే <<దయచేసి నీ మహిమను నాకు చూపించు>> అన్నాడు.
19ఆయన <<4 నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను>> అన్నాడు.

20ఆయన ఇంకా <<నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు>> అన్నాడు.
21యెహోవా <<ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు.22నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను.23నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు>> అని మోషేతో చెప్పాడు.


1 33:1 సారవంతమైన
2 33:3 కఠిన హృదయులు
3 33:7 ప్రత్యక్ష గుడారం.
4 33:19 నా మహిమ. అంతా.

Chapter 34

మోషే కొత్త రాతి పలకలు తయారు చేశాడు.
ద్వితీ 10:1-5

1యెహోవా మోషేతో <<మొదటి పలకల్లాంటి రాతి పలకలు మరో రెండు చెక్కు. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను.2తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి.

3ఏ మనిషీ నీతోబాటు ఈ కొండ దగ్గరికి రాకూడదు, ఏ మనిషీ ఈ కొండ మీద ఎక్కడా కనబడకూడదు. ఈ కొండ పరిసరాల్లో గొర్రెలు గానీ, ఎద్దులుగానీ మేత మేయకూడదు>> అని చెప్పాడు.

4కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కాడు.
5యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.

6యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ<<యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు.7ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు>> అని ప్రకటించాడు.

8మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు.9<<ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు 1 మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు>> అన్నాడు.
నిబంధన వినూత్నం
నిర్గమ 23:14-15; ద్వితీ 7:1-5; 16:1-17

10అందుకు ఆయన <<ఇదిగో, నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకూ భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి.11ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించు. నేను మీ ఎదుట నుండి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను.

12మీరు వెళ్లబోయే ఆ పరదేశపు నివాసులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అలా గనక చేసుకుంటే అవి మీకు ఉరిగా మారవచ్చు.13అందువల్ల మీరు వాళ్ళ బలిపీఠాలను విరగగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళ ప్రతిమలను పగలగొట్టాలి, వాళ్ళ దేవతా స్తంభాలను పడదోయాలి.14మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను <రోషం గల దేవుడు> అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.

15ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి.16మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పెళ్లి చేసుకోకూడదు. అలా గనక చేస్తే వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా ప్రలోభ పెడతారేమో.17పోత పోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు.

18పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.

19జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది.20గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.

21ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా.22మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకుని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి.
23సంవత్సరంలో మూడుసార్లు పురుషులంతా ఇశ్రాయేలియుల దేవుడు, ప్రభువు అయిన యెహోవా సముఖంలో కనబడాలి.

24మీరు సంవత్సరంలో మూడు సార్లు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సమకూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీ భూమిని స్వాధీనం చేసుకోరు. ఎందుకంటే నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్లగొట్టి నీ సరిహద్దులు విస్తరించేలా చేస్తాను.

25నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. పస్కా పండగలో అర్పించిన ఎలాటి మాంసమైనా ఉదయం దాకా నిలవ ఉండకూడదు.26నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్టకూడదు.>>

27యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు<<ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.>>
ప్రకాశిస్తున్న మోషే ముఖం

28మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు.
29మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు.

30అహరోను, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు వచ్చారు. ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతణ్ణి సమీపించడానికి భయపడ్డారు.31మోషే వాళ్ళను పిలిచాడు. అహరోను, సమాజంలోని పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడాడు.
32అ తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు.

33మోషే వాళ్ళతో ఆ విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
34కానీ మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానం లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడల్లా యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాడు.35ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖం చూసినప్పుడు అది కాంతిమయమై ప్రకాశిస్తూ ఉంది, మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేవరకూ తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు.


1 34:9 తలబిరుసు మనుషులు.

Chapter 35

విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు

1మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. <<యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.

2మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.

3విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.>>
సన్నిధి గుడారం నిర్మాణం
నిర్గమ 25:1-9

4మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. <<యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే,5మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,6నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర,7దీపాలు వెలిగించడానికి నూనె,8అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు,9ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.

10ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి.11ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు.

12మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర,

13సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు,

14వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.

15ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.

16బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.

17ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.

18నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.

19పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.>>
సన్నిధి గుడారం కోసం అర్పణలు

20ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు.21తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.

22తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.

23ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.

24వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.

25నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.

26నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.

27నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు,28అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.

29మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.
బెసలేలు, అహోలీయాబు
నిర్గమ 31:1-11

30మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు,31<<వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.32రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.33అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.
34అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.

35వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.>>

Chapter 36

1మోషే <<పవిత్ర స్థలం లో జరిగే సేవ కోసం అన్నిరకాల పనులు చేయడానికి బెసలేలు, అహోలీయాబు మొదలైన ప్రతిభావంతులను నియమించాము. ఈ పనులు చేయడానికి యెహోవా వాళ్లకు జ్ఞానం, వివేకం ప్రసాదించాడు. వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినట్టు పనులు జరిగిస్తారు>> అన్నాడు.

2బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.
గుడారం నిర్మాణం కోసం స్వేచ్చార్పణలు

3వాళ్ళు వచ్చి పవిత్ర స్థలం లో సేవ జరగడానికి, పవిత్ర స్థలం కట్టించడానికి ఇశ్రాయేలు ప్రజలు తీసుకువచ్చిన సామగ్రి అంతటినీ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మోషే దగ్గరికి కానుకలు తెస్తూనే ఉన్నారు.4అప్పుడు పవిత్ర స్థలానికి చెందిన వేరు వేరు పనులు చేసే నిపుణులందరూ తాము చేస్తున్న పని వదిలిపెట్టి మోషే దగ్గరికి వచ్చారు.
5<<సేవ జరిగించడానికి యెహోవా చేయమని చెప్పిన పని కోసం ప్రజలు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా తీసుకు వస్తున్నారు>> అని మోషేతో చెప్పారు.

6మోషే <<ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు>> అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది.7ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు.
గుడారం నిర్మాణం
నిర్గమ 26:1-37

8ఆ పని చేసినవాళ్ళలో నిపుణులైన వారంతా నీలం, ఊదా, ఎర్రని రంగులతో నేసిన సన్నని దారాలతో దైవ సన్నిధి గుడారం కోసం కెరూబు నమూనాతో పది తెరలు చేశారు. ఇది అత్యంత నైపుణ్యం గల బెసలేలు చేతి పని.9ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటి కొలతలు ఒక్కటే.10ఐదు తెరలు చొప్పున రెండు జతలుగా ఒక దానితో ఒకటి కూర్చారు.

11ఒక తెరల కూర్పు చివరి తెర అంచున నీలం రంగు నూలుతో ఉంగరాలు చేశారు. రెండవ కూర్పు బయటి తెర అంచుకు కూడా అదే విధంగా చేశారు.12మొదటి కూర్పులో ఒక తెరకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో ఉన్న తెర అంచుకు ఏభై ఉంగరాలు చేశారు. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.

13ఏభై బంగారు గుండీలను సిద్ధం చేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది దైవ సన్నిధి మందిరంగా నిలిచింది.
14దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.

15ఒక్కో తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు.16ఆ పదకొండు తెరల కొలతలు ఒక్కటే. ఐదు తెరలను ఒక కూర్పుగా, ఆరు తెరలను ఒక కూర్పుగా చేశారు.17మొదటి కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు ఏర్పాటు చేశారు.

18వాటిని ఒక గుడారంగా కలపడానికి ఏభై యిత్తడి గుండీలు ఉపయోగించారు.19ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కప్పునూ, గండుచేప తోళ్ళతో దానికి పైకప్పునూ సిద్ధం చేశారు.

20దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు.21ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర.22ప్రతి పలకకు ఒకదాని కొకటి సమానమైన నిడివిలో రెండు కుసులు చేశారు. అదే విధంగా పలకలన్నిటికి అమర్చారు.

23మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు.
24ఒక్కొక్క పలక చొప్పున ఇరవై పలకల కింద రెండు కుసులకు రెండు దిమ్మలు, మొత్తం నలభై వెండి దిమ్మలు చేశారు.

25మందిరం రెండవ వైపు, అంటే ఉత్తరం వైపు ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను,26ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.

27పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు.28వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు.
29ఆ పలకలు కింది భాగంలో నిలిపి మొదటి ఉంగరం దాకా ఒకదానితో ఒకటి అంచు దాకా కలిపారు. అలా రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశారు.

30ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి అమర్చిన వెండి దిమ్మలు పదహారు. ప్రతి పలక అడుగునా రెండు దిమ్మలు ఉన్నాయి.
31తుమ్మకర్రతో వాటికి అడ్డకర్రలు చేశారు. మందిరం ఒకవైపు పలకలకు ఐదు అడ్డకర్రలు,32రెండో వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, పడమటి వైపు మందిరం వెనుక వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు చేశారు.

33పలకల మధ్యలో ఉన్న ముఖ్యమైన అడ్డకర్ర ఈ అంచు నుండి ఆ అంచు వరకూ కలిసి ఉండేలా చేశారు.34ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించారు. వాటి అడ్డకర్రలు ఉండే గుండ్రని కమ్మీలు బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించారు.

35నీలం ఊదా ఎర్రని రంగులు గల సన్నని నారతో పేని అడ్డతెరను సిద్ధం చేశారు. కెరూబు రూపాలను నైపుణ్యం గల పనితనంతో చేశారు.36దాని కోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు సిద్ధం చేసి వాటికి బంగారు రేకులు పొదిగించారు. వాటి బంగారపు కొక్కేల కోసం నాలుగు వెండి దిమ్మలు పోతపోశారు.

37గుడారం ద్వారం కోసం నీలం, ఊదా, ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో, అడ్డ తెరను నేయించారు.38దాని ఐదు స్తంభాలూ, వాటి కొక్కేలూ తయారు చేశారు. ఆ స్థంభాలకూ, వాటి కొక్కేలకూ, వాటి పెండె బద్దలకూ బంగారం రేకులు పొదిగించారు. వాటికి ఉన్న ఐదు దిమ్మలు ఇత్తడివి.

Chapter 37

నిబంధన మందసం తయారీ
నిర్గమ 25:10-22

1బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,

2దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.

3దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.

4అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.

5మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు.

6అతడు స్వచ్ఛమైన బంగారంతో 1 కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర.

7బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.

8రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.

9ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.
సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల
నిర్గమ 25:23-30

10అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు మూరన్నర.

11అతడు దాని పైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించి, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.

12దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు రేకు అమర్చాడు.

13బల్ల కోసం బంగారంతో నాలుగు గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల నాలుగు కాళ్ళ మూలలకు వాటిని బిగించాడు.

14బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి.

15బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.

16బల్లమీద ఉండే సామగ్రి, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయ అర్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.
దీప స్తంభం.

17అతడు దీప స్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాన్నీ, దాని అడుగు భాగాన్నీ, నిలువు భాగాన్నీ బంగారు రేకుతో అలంకరించాడు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు.

18దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.

19దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఒక్కో కొమ్మకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఉన్నాయి.

20దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.

21దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.

22వాటి మొగ్గలు, కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించాడు.

23దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.

24దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ 2 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు.
ధూపవేదిక
నిర్గమ 30:1-5

25అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. దాని పొడవు, వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి.

26దాని కప్పుకు, నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకులు పొదిగించి దానికి పై అంచు చుట్టూ బంగారం అలంకరించాడు.

27ఆ అలంకారం కింద వేదికకు రెండు గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని రెండు పక్కలా రెండు మూలల్లో బంగారం అలంకారం చేశాడు.

28దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు.
అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యాలు
నిర్గమ 30:22-38

29పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.


1 37:6 ఇది నిబంధన మందసం మూత.
2 37:24 ఒక తలాంతు

Chapter 38

హోమ బలిపీఠం
నిర్గమ 27:1-8

1అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.

2దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.

3బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.

4బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.

5ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.

6ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.

7ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.

8గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
ఆవరణం
నిర్గమ 27:9-19

9అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.

10ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.

11ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.

12పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.

13తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.

14ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

15ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

16ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.

17స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.

18ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.

19వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.

20వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.
గుడారం కోసం సామగ్రి
నిర్గమ 38:24

21మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.

22యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.

23దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.

24పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 1 29 తలాంతులు, 730 షెకెల్.

25జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1,775 షెకెల్.

26ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.

27అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.

281,575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.

29అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2,400 తులాలు.

30అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.

31ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.


1 38:24 ఒక షెకెల్ సుమారు 20 గ్రాములు. ఒక తలాంతు 35 కిలోలు.

Chapter 39

1యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పవిత్ర స్థలం లో నిలిచి చేసే సేవ కోసం నీలం ఊదా ఎర్రని రంగుల సేవా వస్త్రాలు అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు.

2అతడు బంగారంతో, నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో ఏఫోదు చేశాడు.

3ఏఫోదు కోసం నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో, సన్నని నారతో నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగెలుగా కత్తిరించారు.

4ఏఫోదుకు రెండు భుజ ఖండాలు చేసి రెండు అంచులలో నిలబెట్టారు.

5దానికి బంగారంతో నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో పేనిన అందమైన అల్లిక ఏకాండంగా రెండు వైపులా కుట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

6బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.

7అవి ఇశ్రాయేలు ప్రజల జ్ఞాపకార్ధంగా ఉండేలా ఆ ముద్రలను ఏఫోదు భుజాల మీద ఉంచారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

8అతడు బంగారంతోనూ నీలం ఊదా ఎర్ర దారాలతోను పేనిన సన్న నారతో ఏఫోదును చేసినట్టు నైపుణ్యంగా ఒక వక్షపతకం తయారుచేశాడు.

9దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. ఆ పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది.

10వారు దానిలో నాలుగు వరుసలుగా రత్నాలు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్న రత్నాలు,11రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంత మణులు ఉన్న రత్నాలు,12మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,13నాలుగవ వరుసలో ఎర్ర రంగు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతాలు ఉన్న రత్నాలు క్రమ పద్ధతిలో పొదిగించారు.
14ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.

15వక్షపతకం కోసం దారాలు అల్లినట్టు స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు అల్లారు.16వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు.
17అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను వక్షపతకం అంచులలో ఉన్న రెండు గుండ్రని కొంకీలలో వేశారు.18అల్లిన ఆ రెండు గొలుసుల అంచులు ఆ రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు.

19బంగారంతో రెండు గుండ్రని కొంకీలు చేసి ఏఫోదు ఎదురుగా ఉన్న వక్షపతకం లోపలి అంచు రెండు కొనలకు తగిలించారు.20బంగారంతో మరో రెండు గుండ్రని కొంకీలు ఏఫోదు అల్లిక పైగా దాని రెండవ కూర్పు దగ్గర దాని ఎదురుగా, ఏఫోదు రెండు భుజఖండాలకు కింది భాగంలో వేశారు.

21వక్షపతకం ఏఫోదు అల్లిక కట్టు మీద ఉండేలా, ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేలా ఆ పతకాన్ని దాని గుండ్రని కొంకీలకూ ఏఫోదు కొంకీలకూ నీలం రంగు దారంతో కట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

22అతడు ఏఫోదు అంగీ కేవలం నీలం రంగు దారంతో అల్లిక పనిగా చేశాడు. ఆ అంగీ మధ్య ఉన్న రంధ్రాన్ని మూసి ఉంచే కవచం ఏర్పాటు చేశారు.23ఆ రంధ్రం చిరిగి పోకుండా ఉండేందుకు రంధ్రం చుట్టూ కవచం ఉంచారు.24అంగీ అంచుల మీద నీలం ఊదా ఎర్రని రంగుల గల నూలుతో పేని దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు.

25స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి ఆ దానిమ్మపండ్ల ఆకారాల మధ్యలో, అంటే అంగీ అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్లవంటి వాటి మధ్యలో ఆ గంటలను పెట్టారు.

26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సేవ జరిగించడానికి ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండు వంటి ఆకారాన్ని అంగీ అంచుల మీద చుట్టూ తగిలించారు.

27యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అహరోనుకు, అతని కొడుకులకు సన్నని నారతో అల్లిక పని చేసి అంగీలు నేశారు. సన్నని నారతో తలపాగాలను చేసారు.28సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.29నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.

30స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద <<యెహోవాకు పవిత్రం>> అని చెక్కించారు.
మందిరం నిర్మాణం సంపూర్తి
నిర్గమ 35:10-19

31ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
32ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.

33దైవ నివాసాన్ని, దానిలో సామగ్రి మొత్తాన్నీ అంటే, దాని కొక్కేలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,34ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, గండుచేప తోళ్ల పైకప్పు, పైకప్పు తెర,35శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం,
36సన్నిధి బల్ల, దాని సామగ్రి, సన్నిధి రొట్టెలు,37పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,38బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,39ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి మొత్తం, గంగాళం, దాని పీట,
40ప్రహరీ తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ప్రహరీ ద్వారానికి తెర, దాని తాళ్ళు, మేకులు, సన్నిధి గుడారం మందిర సేవ కోసం కావలసిన సామగ్రి అంతా,41పవిత్ర స్థలం లో సేవ చేసే యాజకుడైన అహరోనుకూ, అతని కొడుకులకూ యాజక పరిచర్య పవిత్ర వస్త్రాలు సిద్ధం చేసి వాటన్నిటినీ మోషే దగ్గరికి తీసుకు వచ్చారు.

42యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.43వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.

Chapter 40

సన్నిధి గుడారం గురించిన అంతిమ ఆదేశాలు

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.2<<మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి.

3అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.4బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి.
5శాసనాల పెట్టె ఎదురుగా బంగారు ధూపవేదికను ఉంచి, మందిర ద్వారానికి తెర తగిలించాలి.

6సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి.7సన్నిధి గుడారం, హోమ బలిపీఠం మధ్యలో ఒక గంగాళం పెట్టి, దాన్ని నీళ్ళతో నింపాలి.

8తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి.

9అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.10హోమ బలిపీఠాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠం పవిత్రం అవుతుంది.11గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.

12తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి.13అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

14తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి.15వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.>>

16మోషే ఆ విధంగా చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతా జరిగించాడు.
17రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ నివాస మందిరం నిలబెట్టాడు.18యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు.19యెహోవా మందిరం పైన గుడారం పరిచాడు. గుడారానికి పైకప్పు వేశాడు.

20యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు.
21మందసాన్ని యెహోవా మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు.

22సన్నిధి గుడారంలో, దైవ సన్నిధి మందిరం ఉత్తర దిక్కున, అడ్డతెరకు బయట బల్లను ఉంచాడు.23యెహోవా సన్నిధి ఎదుట బల్ల మీద రొట్టెలను క్రమంగా పేర్చాడు.
24యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు.25యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.

26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచాడు.27ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు.

28మందిర ద్వారానికి తెర ఏర్పాటు చేశాడు. అతడు దైవ సన్నిధి గుడారం ద్వారం దగ్గర హోమపీఠం ఉంచాడు.29యెహోవా హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు.

30యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు.
31అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.32వాళ్ళు యెహోవా గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.

33మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు.
యెహోవా సన్నిధి మహిమ మేఘం
సంఖ్యా 9:15-23

34అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.35ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు.

36మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు.37ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి.

38ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.

లేవీకాండం

Chapter 1

దహనబలి

1యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు.2<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.

3ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి.4దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.

5తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు.6తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.

7తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి.8అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి.9కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.

10గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.11బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.

12అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి.13దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.

14ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి.15యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.

16తరువాత దాని 1 పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి.17అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.>>


1 1:16 జీర్ణ కోశం, పేగులు మొదలైనవి.

Chapter 2

ధాన్య నైవేద్యం

1ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధాన్య నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోదుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి, సాంబ్రాణి వేయాలి.2అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.3ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.

4మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి.5ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.

6అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి.7ఒకవేళ నీ నైవేద్యం వంట పాత్రలో వండినదైతే దాన్ని సన్నని పిండీ, నూనే కలిపి తయారు చేయాలి.

8ఈ పదార్ధాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకు వస్తాడు.9తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోడానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.10ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకీ, అతని కొడుకులకీ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.

11మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యం లోనూ పొంగజేసే పదార్ధం ఉండకూడదు. ఎందుకంటే తేనెనూ, పొంగజేసే పదార్ధం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు.12వాటిని ప్రథమఫలంగా యెహోవాకి సమర్పించవచ్చు. కానీ బలిపీఠం పైన కమ్మని సువాసన కలగజేయడానికి వాటిని వాడకూడదు.13నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికీ ఉప్పు కలపాలి. నీ దేవుని 1 నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి.

14నువ్వు యెహోవాకి ప్రథమ ఫలం నైవేద్యాన్ని అర్పించాలంటే పచ్చని కంకుల్లోని 2 కొత్త ధాన్యాన్ని వేయించి పిండి చేసి అర్పించాలి.15తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే.16తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై పిండీ, నూనే, సాంబ్రాణిల్లో కొంత భాగం తీసుకుని వాటిని దహిస్తాడు. అది యెహోవా కోసం అగ్నితో చేసిన అర్పణ.


1 2:13 దేవునితో ప్రజలకు ఉన్న ఒడంబడిక రుచికరమైనదిగా, చెడిపోకుండా నిలిచి ఉండాలి.
2 2:14 తాజా

Chapter 3

శాంతిబలి

1<<ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి.2అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.

3అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.4వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి.5అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.

6ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి.7తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి.8తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.

9ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.10అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి.11వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి.

12అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి.13ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.14తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.

15అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి.16వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది.17మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.>>

Chapter 4

పాపం కోసం బలి

1యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు.2<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.3నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ 1 అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.

4అతడు ఆ కోడెని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. ఆ కోడె తలపైన తన చెయ్యి ఉంచి, తరువాత యెహోవా ఎదుట దాన్ని వధించాలి.5అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారానికి తీసుకు రావాలి.

6తరువాత ఆ యాజకుడు తన వేలు ఆ రక్తంలో ముంచి అతి పరిశుద్ధ స్థలం తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి.7తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

8తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.9అలాగే దాని రెండు మూత్ర పిండాలనూ, వాటిపై పేరుకుని ఉన్న కొవ్వునూ, దాని మూత్రపిండాలకు దగ్గర కాలేయం పైన ఉన్న కొవ్వునూ కోసి వేరు చేయాలి.10శాంతిబలి కోసం వధించే ఎద్దు నుండి తీసినట్టే యాజకుడు దీని నుండి కూడా తీయాలి. తరువాత యాజకుడు వీటిని దహన బలిపీఠం పైన దహించాలి.

11అతడు ఆ కోడె దూడలో ఇంకా మిగిలి ఉన్న భాగాలైన దాని చర్మం, మాంసం, తల, కాళ్ళు, దాని అంతర్భాగాలూ, పేడ, మిగిలిన భాగాలన్నిటినీ శిబిరం బయటకు తీసుకుపోవాలి.12బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెల పైన వాటిని దహించాలి.

13ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే14తరువాత వారు చేసిన పాపం వారికి తెలిసినప్పుడు, సమాజం ఒక కోడెదూడని పాపం కోసం బలిగా అర్పించాలి. దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి.15సమాజానికి పెద్దలుగా ఉన్నవాళ్ళు యెహోవా సమక్షంలో దాని తలపై తమ చేతులుంచాలి. ఆ తరువాత యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి.

16అప్పుడు అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలి.17తరువాత యాజకుడు ఆ రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.

18తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాలి.19తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి.

20ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికీ చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది.21ఆ కోడెను శిబిరం బయటకు తీసుకుని వెళ్ళి మొదటి కోడెను దహించినట్టుగానే దీన్నీ దహించాలి. ఇది సమాజ పాపం కోసం చేసే బలి అర్పణ.

22ఒక అధికారి పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.23తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.

24అతడు ఆ మేక తలపై చెయ్యి ఉంచి దాన్ని యెహోవా సమక్షంలో దహనబలి అర్పించే చోట వధించాలి. ఇది పాపం కోసం చేసే బలి.25పాపం కోసం వధించిన దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

26దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.

27సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.28తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక ఆడ మేకను బలి అర్పణగా తీసుకుని రావాలి. ఆ మేక లోపం లేనిదై ఉండాలి.

29పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.30దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.

31తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.

32ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకు రావాలి.33అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.

34అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.35తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.>>


1 4:3 ప్రధాన యాజకుడు.

Chapter 5

1<<ఒక వ్యక్తి తాను చూసిన దాన్ని గానీ, విన్న దాన్ని గానీ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పకుండా పాపం చేస్తే దానికి ఆ వ్యక్తే బాధ్యత వహించాలి.2ఇంకా ఒక వ్యక్తి దేవుడు అపవిత్రమని నిర్దేశించిన ఏ అశుద్ధ జంతువు కళేబరాన్ని గానీ, పశువు కళేబరాన్ని గానీ, పాకే జంతు కళేబరాన్ని గానీ తెలియక తాకితే ఆ వ్యక్తి అపవిత్రుడూ, అపరాధీ అవుతాడు.

3ఒక వ్యక్తిని అపవిత్రం చేసిన వాటిని అది ఏదైనా సరే, తాకిన వ్యక్తి ఆ అపవిత్రతను తాకానని తెలుసుకున్న తరువాత అపరాధి అవుతాడు.4అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా, చెడైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా ఆ తరువాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు.

5వీటిలో ఏ విషయంలోనైనా అతడు అపరాధి అయితే తాను ఎలాంటి పాపం చేశాడో దాన్ని ఒప్పుకోవాలి.6తాను చేసిన అపరాధం కోసం బలి అర్పణను యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. దానికోసం తన మందలోనుండి ఆడమేకనైనా, ఆడగొర్రెనైనా పాపం కోసం బలిగా అర్పించాలి. అతని పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు.

7ఒకవేళ అతనికి గొర్రెని తెచ్చే స్తోమత లేకపోతే తన పాపం కోసం అపరాధ బలి అర్పణగా రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తీసుకు రావచ్చు. వాటిలో ఒకటి పాపం కోసం చేసే అర్పణ, మరొకటి దహనబలి కోసం.8అతడు వాటిని యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపం కోసం బలిగా అర్పిస్తాడు. అతడు దాని తలను తుంచి వేస్తాడు కానీ పూర్తిగా వేరు చేయడు.9అతడు కొంత రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున కుమ్మరించాలి. ఇది పాపం కోసం చేసే బలి.

10తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.

11ఒకవేళ అతనికి రెండు గువ్వలను, రెండు పావురం పిల్లలను కొని తెచ్చే స్తోమతు లేకపోతే, అతడు తన పాపం కోసం అర్పణగా ఒక 1 కిలో సన్నని గోదుమ పిండిని తీసుకురావాలి. అది పాపం కోసం చేసే అర్పణ కాబట్టి దాని మీద నూనె పోయకూడదు, ఎలాంటి సాంబ్రాణి వేయకూడదు.

12అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ.13పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది.>>
అపరాధ బలి

14తరువాత యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు.15<<ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకు రావాలి. అతడు తన 2 అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణీ అయ్యే వెండితో నిర్ణయించాలి.16పరిశుద్ధమైన వస్తువు విషయంలో తాను చేసిన తప్పుకు నష్ట పరిహారం చెల్లించాలి. దానికి ఐదో వంతు చేర్చి దాన్ని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు అపరాధ బలి అర్పణ అయిన పొట్టేలుతో అతని కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.

17ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే, అది పొరపాటుగా చేసినా అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు.18అతడు తన అపరాధ బలి అర్పణగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకు రావాలి. దాని ప్రస్తుత వెల నిర్ణయం జరగాలి. దాన్ని అపరాధ బలి అర్పణగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు పొరపాటుగా ఆ వ్యక్తి చేసిన పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.19అది అపరాధబలి. అతడు నిజంగానే యెహోవా ఎదుట దోషి అయ్యాడు.>>


1 5:11 ఒక ఎయిఫా.
2 5:15 దోషం కోసమైన బలి. పరిహారం చెల్లించే బలి.

Chapter 6

1యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.2<<ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా3అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది.4ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి.

5తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.6తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి.7యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.>>
దహనబలి

8ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.9<<నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి.

10యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి.11తరువాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకు వెళ్ళాలి.

12బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని పైన కట్టెలు వేస్తూ ఉండాలి. దాని పైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దాని పైన దహించాలి.13బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.
నైవేద్య అర్పణ

14ఇక నైవేద్య అర్పణ గూర్చిన చట్టం ఇది. దీన్ని అహరోను కొడుకులు యెహోవా సమక్షంలో బలిపీఠం ఎదుట అర్పించాలి.15యాజకుడు నైవేద్య అర్పణ నుండి గుప్పెడు పిండినీ, కొంత నూనెనూ, దాని పైనున్న సాంబ్రాణినూ తీసి వాటిని యెహోవా మంచితనాన్ని స్మరించుకోడానికి బలిపీఠం పైన దహించాలి. అది ఆయనకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.

16అర్పించగా మిగిలిన దాన్ని అహరోనూ, అతని కుమారులూ భుజించాలి. పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి.17దాని తయారీలో పొంగజేసే పదార్ధం కలపకూడదు. నాకు అర్పించే దహనబలుల్లో వాళ్ళ భాగంగా దాన్ని నేను ఇచ్చాను. పాపం కోసం చేసే బలి అర్పణగానూ, అపరాధం కోసం చేసే బలి అర్పణ గానూ ఇచ్చాను. అది అతి పరిశుద్ధం.18మీ రాబోయే అన్ని తరాల్లోనూ అహరోను వారసుడైన ప్రతివాడూ యెహోవాకు దహనబలిగా అర్పించిన దానిలోనుండి దాన్ని తన భాగంగా భావించి తిన వచ్చు. వాటికి తగిలిన ప్రతిదీ పవిత్రం అవుతుంది.>>

19ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.20<<అహరోనుకూ, అతని కొడుకులకూ ఒక్కొక్కరికీ అభిషేకం జరిగిన రోజున వాళ్ళు చెల్లించాల్సిన అర్పణ ఇది. మామూలు నైవేద్య అర్పణలాగే వాళ్ళు సుమారు ఒక కిలో సన్నని గోదుమ పిండిని ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.

21దాన్ని నూనెతో పెనం పైన కాల్చాలి. అది చక్కగా కాలిన తరువాత తీసుకురావాలి. దాన్ని ముక్కలు చేసి యెహోవాకు కమ్మని సువాసనగా నైవేద్య అర్పణ చేయాలి.22యాజకుని కొడుకుల్లో, అభిషేకం పొంది అతడి స్థానంలో కొత్తగా యాజకుడైన వ్యక్తి అలాగే అర్పించాలి. ఆజ్ఞ ప్రకారం దాన్ని యెహోవా కోసం పూర్తిగా దహించాలి.23యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్నూ పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు.>>
పాపం కోసం చేసే బలి

24ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.25<<నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ మాట్లాడి ఇలా చెప్పు, పాపం కోసం చేసే అర్పణ చట్టం ఇది. దహనబలి అర్పణ పశువుని వధించిన చోటే పాపం కోసం చేసే బలి అర్పణ పశువునూ యెహోవా సమక్షంలో వధించాలి. అది అతి పరిశుద్ధం.26ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి.

27దాని మాంసానికి తగిలిన ప్రతిదీ పరిశుద్ధం అవుతుంది. దాని రక్తం బట్టల పైన చిందితే రక్తం చిమ్మిన ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలం లో శుభ్రం చేయాలి.28దాన్ని మట్టి కుండలో ఉడకబెడితే, ఆ కుండని పగలగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో ఉడకబెడితే దాన్ని తోమి నీళ్ళతో శుభ్రం చేయాలి.

29అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు.30కానీ పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారం లోకి తీసుకు రావడం జరిగితే, ఆ పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చి వేయాలి.>>

Chapter 7

అపరాధబలి

1<<1 అపరాధం కోసం చేసే బలి అర్పణ సంగతులు. అది ఎంతో పరిశుద్ధం.2దహనబలి కోసం పశువులను వధించే స్థలం లోనే అపరాధబలి పశువులను కూడా వధించాలి. దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ అన్ని వైపులా చిమ్మాలి.3దాని కొవ్వు పట్టిన తోకనూ, దాని అంతర్భాగాల్లోని కొవ్వునూ,4రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, ఇలా దానిలోని కొవ్వు అంతటినీ తీసి అర్పించాలి.

5యాజకుడు యెహోవాకి దహనబలిగా వీటిని బలిపీఠం పైన దహించాలి. అది అపరాధం కోసం చేసే బలి. యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దీన్ని తినవచ్చు.6ఇది అతి పరిశుద్ధం. కాబట్టి పరిశుద్ధ స్థలం లోనే దీన్ని తినాలి.

7పాపం కోసం చేసే బలి అపరాధం కోసం చేసే బలిలానే ఉంటుంది. ఈ రెంటికీ పాటించాల్సిన చట్టం ఒకటే. ఆ బలుల్లో మిగిలిన మాంసం వాటితో పరిహారం చేసే యాజకుడికే దక్కుతుంది.8దహనబలి పశువు చర్మం ఆ దహనబలిని అర్పించిన యాజకుడికి చెందుతుంది.

9పొయ్యి మీద కుండలోనైనా, పెనం మీదనైనా వండిన లేదా కాల్చిన నైవేద్యం అంతా యాజకుడికే చెందుతుంది.10అది పొడి నైవేద్యమైనా, నూనె కలిపినది అయినా అదంతా అహరోను సంతానం వాళ్ళు సమానంగా పంచుకోవాలి.
శాంతి బలి

11ప్రజలు యెహోవాకు అర్పించే శాంతి బలిని గూర్చిన చట్టం ఇది.12ఎవరైనా కృతఙ్ఞత అర్పణగా దాన్ని అర్పించదలిస్తే దానితో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా నూనె కలిపి చేసిన రొట్టెలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ, సన్నని పిండిలో నూనె బాగా కలిపి చేసిన రొట్టెలూ అర్పించాలి.

13వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించడానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్ధంతో చేసిన రొట్టెను అర్పించాలి.14ఈ వేరు వేరు అర్పణల్లో నుండి ఒక దాన్ని యెహోవాకి అర్పించాలి. శాంతిబలి కోసం బలిపీఠం పైన రక్తాన్ని చిలకరించిన యాజకునికి అది చెందుతుంది.

15కృతజ్ఞతలు చెల్లించే ఉద్దేశ్యంతో శాంతిబలిని అర్పించే వ్యక్తి బలిపశువు మాంసాన్ని బలి అర్పించే రోజే తినాలి. దాంట్లో దేన్నీ తరువాత రోజు కోసం ఉంచుకోకూడదు.16అయితే మొక్కు చెల్లించడం కోసం గానీ, స్వేచ్ఛార్పణ చెల్లించడం కోసం గానీ బలి ఇస్తే ఆ పశువు మాంసాన్ని బలి అర్పణ రోజే తినాలి. కానీ ఏదన్నా మిగిలితే దాన్ని రెండోరోజు కూడా తినవచ్చు.

17మూడో రోజుకి ఇంకా మిగిలి ఉన్న మాంసాన్ని కాల్చి వేయాలి.18ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని ఏ కొంచెమైనా మూడోరోజు కూడా తింటే ఆ బలి అంగీకారానికి నోచుకోదు. ఆ బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు.

19అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని తిన కూడదు. దాన్ని కాల్చివేయాలి. మిగిలిన మాంసం పవిత్రులైన వాళ్ళు తినవచ్చు.20యెహోవాకు అర్పించే శాంతిబలి పశువు మాంసాన్ని ఎవరైనా అపవిత్రుడిగా ఉండి కొంచెం తిన్నా అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.

21మనుష్యుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన, అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతిబలి పశువు మాంసం తింటే అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.>>
కొవ్వును, రక్తాన్ని తినకూడదు

22ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.23<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ మీరు తిన కూడదు.24అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వునూ, అడవి మృగాలు చీల్చి వేసిన పశువు కొవ్వునూ ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

25యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి.26అలాగే పక్షి రక్తం గానీ, జంతువు రక్తం గానీ మీ ఇళ్ళల్లో తినకూడదు.27ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.>>

28ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.29<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, యెహోవాకి శాంతిబలి పశువును అర్పించే వాడు దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి.30యెహోవాకు దహనబలిగా అర్పించే వాటిని అతడు స్వయంగా తీసుకు రావాలి. అతడు రొమ్ము భాగాన్నీ, దానితో ఉన్న కొవ్వునీ తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అర్పణగా పైకెత్తి కదిలించడానికి రొమ్ము భాగాన్ని తీసుకుని రావాలి.
యాజకులు భాగము

31యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.32శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి.

33అహరోను వారసుల్లో శాంతిబలి పశువు రక్తాన్నీ, కొవ్వునూ అర్పించే యాజకుడికి ఆ పశువు కుడి తొడ భాగం చెందుతుంది.34ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్నీ, తొడనూ నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనుకీ, అతని వారసులకీ ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేల్ వారు అనుసరించవలసిన శాశ్వత నియమం.

35ఇది యాజకులుగా యెహోవాకి సేవ చేయడానికి వీరిని మోషే నియమించిన రోజు నుండి అహరోనుకూ అతని వారసులకూ యెహోవాకు అర్పించే దహనబలుల్లో ఏర్పాటైన వాటా.36వారిని యాజకులుగా యెహోవా అభిషేకం చేసిన రోజున వారికి ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వాలని యెహోవా ఖాయం చేసిన వాటా. ఇది అన్ని తరాల్లో వారి వాటాగా ఉంటుంది.>>

37ఇవి దహనబలిని గూర్చీ, అపరాధం కోసం చేసే బలిని గూర్చీ, నైవేద్య అర్పణ బలిని గూర్చీ, పాపం కోసం చేసే బలిని గూర్చీ, ప్రతిష్టార్పణ బలిని గూర్చీ, శాంతిబలిని గూర్చీ వివరించే చట్టం.38ఈ ఆజ్ఞలను యెహోవా సీనాయి పర్వతం పైన మోషేకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి అరణ్యంలో యెహోవాకు అర్పణలు చెల్లించాలని ఆదేశించాడు.


1 7:1 పరిహారం చెల్లించే బలి.

Chapter 8

అహరోనునూ, అతని కొడుకులను ప్రతిష్టించడం

1యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.2<<నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.3సమాజంలో ప్రజలందర్నీ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి సమకూర్చు.>>

4మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు.5అప్పుడు మోషే వాళ్ళందరితో <<ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు>> అన్నాడు.

6తరువాత మోషే అహరోనునూ, అతని కొడుకులనూ తీసుకు వచ్చి వాళ్లకి స్నానం చేయించాడు.7తరువాత అహరోనుకు చొక్కా తొడిగి, అతనికి నడికట్టు కట్టాడు. అంగీ ధరింపజేసి ఏఫోదుని వేశాడు. అందంగా అల్లిన నడికట్టుని ఏఫోదు పైగా వేసి బిగించి కట్టాడు.

8అతనికి వక్షపతకం కట్టి దానిలో ఊరీమును, తుమ్మీమును ఉంచాడు.9అతనికి తలపాగా పెట్టాడు. ఆ పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇదంతా చేశాడు.

10తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్నీ, మందిరంలో ఉన్న సమస్తాన్నీ అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు.11తరువాత ఆ నూనెలో కొంత బలిపీఠంపై ఏడుసార్లు చిలకరించాడు. బలిపీఠం దానికి సంబంధించిన పాత్రలను, గంగాళాన్నీ, దాని పీటనూ శుద్ధీకరణం చేసి వాటిని అభిషేకించాడు.

12తరువాత అతడు ఆ అభిషేకం చేసే నూనెలో కొంత తీసి అహరోనుని ప్రతిష్టించడానికి అతని తల పైన పోసి అభిషేకించాడు.13తరువాత మోషే యెహోవా తనకు ఆదేశించిన విధంగా అహరోను కొడుకులను తీసుకు వచ్చి వారికి పొడవాటి చొక్కాలు వేశాడు. వారికి నడికట్లు కట్టి, వారి తలల చుట్టూ నార బట్టలు కట్టాడు.

14ఆ తరువాత మోషే పాపం కోసం బలి అర్పణ చేయడానికి ఒక కోడెదూడని తీసుకు వచ్చాడు. అహరోనూ అతని కొడుకులూ పాపం కోసం బలి అర్పణ కాబోతున్న ఆ కోడె దూడ తలపై తమ చేతులుంచారు.15మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దాని కోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్టించాడు.

16అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలనూ వాటిపైని కొవ్వునూ తీసి అంతా బలిపీఠంపై దహించాడు.17అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.

18ఆ తరువాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకు వచ్చాడు. అహరోనూ, అతని కొడుకులూ ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు.19అప్పుడు మోషే దాన్ని వధించిన తరువాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.

20అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ఆ ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.21అతడు దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి.

22ఆ తరువాత మోషే రెండో పొట్టేలుని తీసుకు వచ్చాడు. ఇది అహరోనుని సేవకై ప్రతిష్టించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తల పైన అహరోనూ, అతని కొడుకులూ తమ చేతులుంచారు.23మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు.

24మోషే అహరోను కొడుకులను కూడా తీసుకు వచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెల పైనా, కుడి చేతుల బొటనవేళ్ళ పైనా, కుడి కాళ్ళ బొటన వేళ్ళ పైనా పూసాడు. తరువాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు.

25తరువాత మోషే దాని కొవ్వునూ, కొవ్వు పట్టిన దాని తోకనూ, దాని అంతర్భాగాల పైని కొవ్వునూ, కాలేయం పైని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కుడి తొడ భాగాన్నీ వేరు చేశాడు.26యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టలో నుండి ఒక రొట్టెనూ, నూనె రాసి చేసిన ఒక రొట్టెనూ, ఒక అప్పడాన్నీ తీసి వాటిని కొవ్వు పైనా, కుడి తొడ భాగం పైనా పెట్టాడు.27వాటిని అహరోను చేతుల్లోనూ, అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూఇటూ కదిలించి చూపాడు.

28తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.29తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.

30తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైనా అతని బట్టల పైనా, అతని కొడుకుల పైనా, వాళ్ళ బట్టల పైనా చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనునూ, అతని బట్టలనూ, అతని కొడుకులనూ, వాళ్ళ బట్టలనూ అభిషేకించాడు.

31ఆ తరువాత మోషే అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు. <<ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్నీ, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెనూ మీరు తినాలి. అహరోనూ, అతని కొడుకులూ దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి.32మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి.33మీ ప్రతిష్ఠ రోజులు ముగిసే వరకూ అంటే ఏడు రోజులు మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ ఏడు రోజులూ యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు.

34ఈ రోజు ఎలా జరిగిందో మీ కోసం పరిహారం చేయడానికి అలాగే జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు.35మీరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు నిలిచి యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నాకు అలా ఆజ్ఞ ఇచ్చాడు.>>36కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ, అతని కొడుకులూ చేశారు.

Chapter 9

యాజకులు వారి పనిని ఆరంభించడం

1ఎనిమిదో రోజు మోషే అహరోనునూ, అతని కొడుకులనూ, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలనూ పిలిచాడు.2అహరోనుతో ఇలా అన్నాడు. <<పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడనీ, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలునూ యెహోవా సమక్షంలోకి తీసుకు రా.

3నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పాలి. యెహోవాకి అర్పించడానికి పాపం కోసం బలిగా లోపం లేని మేకపోతునూ, దహనబలి కోసం ఒక్క సంవత్సరం వయసున్న లోపం లేని ఒక దూడనూ, ఒక గొర్రెపిల్లనూ, తీసుకు రండి.4అలాగే యెహోవాకి శాంతిబలి అర్పించడానికి ఒక ఎద్దునూ, ఒక పొట్టేలునూ, నూనె కలిపిన నైవేద్యాన్నీ తీసుకు రండి. ఎందుకంటే ఈ రోజు మీకు యెహోవా దర్శనమిస్తాడు>>5కాబట్టి వాళ్ళు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకు వచ్చారు. ఇశ్రాయేలు సమాజమంతా వచ్చి యెహోవా సమక్షంలో నిల్చున్నారు.

6అప్పుడు మోషే ఇలా అన్నాడు. <<యెహోవా మీకు ఆజ్ఞాపించింది ఇదే. మీరిది చేస్తే ఆయన తేజస్సు మీకు కనిపిస్తుంది>>.7తరువాత మోషే అహరోనుకి ఇలా చెప్పాడు. <<బలిపీఠం దగ్గరికి రా, యెహోవా ఆజ్ఞాపించినట్టు నీ పాపం కోసం అర్పించాల్సిన బలినీ, నీ కోసం దహనబలినీ అర్పించి నీ కోసం, ప్రజల కోసం పరిహారం చెయ్యి. ప్రజల కోసం బలి అర్పించి వాళ్ళ కోసం పరిహారం చెయ్యి.>>

8కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. తన పాపాల కోసం బలి అర్పణగా దూడను వధించాడు.9అతని కొడుకులు దాని రక్తాన్ని అతని దగ్గరికి తీసుకు వచ్చారు. అహరోను ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల పైన పూశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు.

10అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు దహనబలిగా దాని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, బలిపీఠం పైన దహించాడు.11దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.

12ఆ తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. ఆ రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు.13తరువాత వాళ్ళు అతనికి దహనబలి పశువును ముక్కలు చేసి ఆ ముక్కలనూ, తలనూ ఇచ్చారు. అతడు వాటిని బలిపీఠం పైన దహించాడు.14దాని అంతర్భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి బలిపీఠం పై ఉన్న దహనబలి అర్పణలపై ఉంచి వాటిని కూడా దహించాడు.

15తరువాత అహరోను ప్రజల కోసం బలి అర్పించాడు. మేకను పట్టుకుని ప్రజల పాపం కోసం బలి అర్పణగా దాన్ని వధించాడు. మొదటి మేకను వధించినట్టుగానే దీన్ని కూడా పాపాల కోసం వధించాడు.16తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు.17దాని తరువాత నైవేద్యాన్ని తెచ్చి దానిలోనుంచి ఒక పిడికెడు తీసి బలిపీఠంపై దాన్ని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.

18తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన శాంతిబలి అర్పణగా ఎద్దునూ, పోట్టేలునూ వధించాడు. అహరోను కొడుకులు వాటి రక్తాన్ని అతనికి అందించారు. దాన్ని అతడు బలిపీఠం చుట్టూ చిమ్మాడు.19అయితే వాళ్ళు ఆ ఎద్దు కొవ్వునూ, పొట్టేలు కొవ్వునూ, కొవ్వుపట్టిన తోకనూ, వాటి అంతర్భాగాల్లోని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పై అంటి ఉన్న కొవ్వునూ అతని కిచ్చారు.

20వాళ్ళు వీటిని ఆ పశువుల రొమ్ము భాగం పైన ఉంచారు. అప్పుడు అహరోను ఆ కొవ్వును బలిపీఠంపై దహించాడు.21మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్నీ, కుడి తొడ భాగాన్నీ యెహోవా సమక్షంలో పైకెత్తి అర్పణగా ఆయనకు అర్పించాడు.

22ఆ తరువాత అహరోను పాపం కోసం బలినీ, దహనబలినీ, శాంతిబలినీ అర్పించి, తన చేతులను ప్రజల వైపు ఎత్తి వాళ్ళను దీవించాడు. తరువాత దిగి వచ్చాడు.23మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళారు. తిరిగి వచ్చి ప్రజలను దీవించారు. అప్పుడు యెహోవా మహిమ తేజం ప్రజలందరికీ కన్పించింది.24యెహోవా సమక్షం లోనుండి అగ్నిజ్వాలలు బయలుదేరి బలిపీఠం పైన ఉన్న దహనబలి సామగ్రినీ, కొవ్వునీ కాల్చి వేశాయి. అది చూసి ప్రజలంతా ఉత్సాహంగా కేకలు పెట్టారు. సాష్టాంగ నమస్కారం చేశారు.

Chapter 10

నాదాబు అబీహులు మరణం

1నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు.2దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.

3అప్పుడు మోషే అహరోనుతో <<నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే>> అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.4అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మీషాయేలునూ, ఎల్సాఫానునూ పిలిపించి వాళ్ళకిలా చెప్పాడు. <<మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటకు తీసుకుపొండి.>>

5వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటకు వీళ్ళని మోసుకు వెళ్ళారు.6అప్పుడు మోషే అహరోనుతో అతని కొడుకులైన ఎలియాజరు, ఈతామారులతో <<మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా మీరు మీ తలల పైని జుట్టు విరబోసుకోకూడదు. మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు, ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు.7యెహోవా అభిషేకపు నూనె మీపైన ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు>> అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు.

8తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు.9<<నువ్వూ నీతో ఉండే నీ కొడుకులూ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గానీ, ఇంకే మత్తు పానీయాలు గానీ తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు.10మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి.11యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.>>

12అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. <<యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.13దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలం లో తినాలి. ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణల్లో అది నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను.

14తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటినీ నువ్వూ, నీ కొడుకులూ, నీ కూతుళ్ళూ తినాలి. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతిబలుల్లో నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం.15కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.>>

16అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు.17<<మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.18చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలం లోకి తీసుకు రాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలం లో కచ్చితంగా తినాల్సిందే>> అని మందలించాడు.

19అప్పుడు అహరోను మోషేతో <<చూడు, ఈ రోజు వీళ్ళు పాపం కోసం తమ బలులూ, దహన బలులూ యెహోవా ఎదుట అర్పించారు. అయినా ఈ రోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలిమాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా?>>అన్నాడు.20మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు.

Chapter 11

శుద్ధమైనవి, ఆశుద్ధమైనవి ఆహారం

1ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.2<<మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.

3చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు.4అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.

5పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.6అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.7ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.8వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.

9జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.10సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.

11అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి.12నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.

13పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,14గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ,15కాకి జాతిలోని ప్రతి పక్షీ,16కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.

17ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,18తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,19కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.

20రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.21అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు.22అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.23అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

24వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు.25ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.

26రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చీలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాటి వాటిని తాకిన వాడు అపవిత్రుడు అవుతాడు.27నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్న వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.28ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.

29నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ,30తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.

31పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.32ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.33వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టిపాత్రను పగలగొట్టాలి.

34పవిత్రమూ తినదగినదీ అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రం అయిన ఆ మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆ ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.35వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.

36నీళ్ళు చేదుకునే పెద్ద తొట్టిలో గానీ, ఊటలో గానీ అలాంటి కళేబరం పడినా ఆ నీళ్ళు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు.37ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు.38కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి.

39మీరు తిన దగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునే వాడు ఆ సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు.40ఆ కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి.

41నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.42నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.

43ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు.44ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.45మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలో నుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.>>

46ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం.47ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.

Chapter 12

పిల్లలు పుట్టిన తరువాత శుద్ధీకరణ

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.2<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగ పిల్లాణ్ణి కంటే ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది.3ఎనిమిదో రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి.

4ఆమె తన రక్తస్రావం నుండి శుద్ధి జరగడానికి ముప్ఫై మూడు రోజులు పడుతుంది. తన రక్తశుద్ధి రోజులు పూర్తయే వరకూ ఆమె పరిశుద్ధమైన దాన్ని దేన్నీ ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలం లో ప్రవేశింపకూడదు.5ఆమె ఒకవేళ ఆడపిల్లని కంటే ఆమె రెండు వారాలు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. ఆమె రక్తశుద్ధికి అరవై ఆరు రోజులు పడుతుంది.

6కొడుకైనా, కూతురైనా వాళ్ళ కోసం ఆమె శుద్ధి రోజులు పూర్తయ్యాక ఆమె ఒక సంవత్సరం వయస్సున్న గొర్రె పిల్లని దహనబలిగా తీసుకురావాలి. అలాగే పాపం కోసం అర్పణగా ఒక గువ్వనుగానీ, ఒక తెల్ల పావురం పిల్లని గానీ తీసుకు రావాలి. వీటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తెచ్చి యాజకుడికి ఇవ్వాలి.

7అప్పుడు అతడు యెహోవా సమక్షంలో వాటిని అర్పించి ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె తన రక్తస్రావం విషయంలో ఆమెకు శుద్ధి కలుగుతుంది. ఇది మగపిల్లాణ్ణి గానీ ఆడ పిల్లను గానీ కనినప్పుడు స్త్రీ విషయంలో విధించిన చట్టం.8ఆమెకు ఒకవేళ గొర్రె పిల్లని తీసుకువచ్చే స్తోమత లేకపోతే, ఆమె రెండు తెల్ల గువ్వలనైనా రెండు పావురం పిల్లలనైనా తీసుకు రావాలి. వాటిలో ఒకటి దహనబలిగా, మరొకటి పాపంకోసం బలి అర్పణగా తీసుకు రావాలి. యాజకుడు ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె శుద్ధురాలు అవుతుంది.>>

Chapter 13

చర్మ వ్యాధులు గురించిన ఆదేశాలు

1యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు.2<<ఒక వ్యక్తి చర్మం పైన వాపు గానీ, ఎండిన పొక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉండి అది చర్మ వ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గానీ, యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గానీ తీసుకు రావాలి.

3అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.4ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.

5ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.6ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు.

7అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత ఆ మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి.8అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.

9ఎవరికైనా చర్మంపైన పొడలా కన్పిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరకి తీసుకురావాలి.10యాజకుడు ఏదన్నా వాపు చర్మంపైన తెల్లగా కన్పిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి, ఆ వాపు రేగి పుండులా కన్పిస్తుందేమో చూడాలి.11ఈ సూచనలు కన్పిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు.

12ఆ చర్మ వ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తలనుండి కాలి వరకూ వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి.13ఆ చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు.14ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు.

15యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి.16అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.17యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు.

18ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే19ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగానీ, నిగనిగలాడే మచ్చ గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కన్పిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి.20ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్నచోటే అది కన్పిస్తే అది అంటురోగం.

21యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.22తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది ఒక అంటు వ్యాధి.23నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి.

24చర్మంపైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చ కానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగానీ ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి.25ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.

26అయితే యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకపోయినా, మచ్చ లోతుగా లేకుండా గాయం మానినట్టు కన్పిస్తున్నా అతణ్ణి ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.27ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.28అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కన్పిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్థారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే.

29మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా తలలో గానీ, గడ్డంలో గానీ ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి.30అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పించినా, లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడనీ, అశుద్ధురాలనీ నిర్థారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాది.

31ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని ఏడు రోజుల పాటు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.

32ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి.33వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.

34ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.

35ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి.36ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే.37అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి.

38మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా చర్మం పైన నిగనిగలాడే తెల్లని మచ్చలు ఏర్పడితే యాజకుడు వాళ్ళని పరీక్షించాలి.39ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు.

40మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే.41ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే.

42అయితే ఒక వ్యక్తి బట్టతలపై గానీ, నొసటిపైన గానీ ఎరుపు చాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి.43అతని బట్టతలపై గానీ నొసటిపై గానీ వ్యాధి వచ్చిన ప్రాంతంలో ఏర్పడిన వాపు చర్మంలో అంటువ్యాధిని సూచిస్తుందేమో యాజకుడు పరీక్షించాలి.44ఆ వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడుగా ప్రకటించాలి.

45ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని <అశుద్ధుణ్ణి! అశుద్ధుణ్ణి!> అని కేకలు పెట్టాలి.46ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి.
బూజు గురించిన ఆదేశాలు

47ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా నార బట్టలైనా,48లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా49వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి, వ్యాపిస్తే అది బూజు, తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి.

50యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని ఏడురోజుల పాటు వేరుగా ఉంచాలి.51ఏడో రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కన్పిస్తే అది హానికరమైన తెగులు. అది అశుద్ధం.52కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి.

53అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో, తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపొతే54యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి.55ఆ తరువాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా, ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి.

56ఒకవేళ ఆ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి.57ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి.58నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే ఆ వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది.

59ఉన్ని బట్టల పైనో, నార బట్టలపైనో, పడుగుపైనో, పేకపైనో తోలు వస్తువులపైనో బూజూ, తెగులూ కన్పించినప్పుడు వాటిని అశుద్ధం అనో శుద్ధం అనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.>>

Chapter 14

చర్మ వ్యాధుల శుద్ధీకరణ

1యెహోవా మోషేకి ఇలా చెప్పాడు.2<<చర్మవ్యాధి ఉన్న వ్యక్తి శుద్ధీకరణ జరిగే రోజుకి సంబంధించిన చట్టం ఇది. అతణ్ణి యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.

3చర్మానికి కలిగిన అంటురోగం మానిందీ లేనిదీ పరీక్షించడానికి యాజకుడు శిబిరం బయటకు వెళ్ళాలి. యాజకుడు అతణ్ణి చూసినప్పుడు అతని చర్మవ్యాధి నయం అయితే4శుద్ధీకరణ కావాలని కోరే ఆ వ్యక్తిని యాజకుడు జీవించి ఉన్న, లోపం లేని రెండు పక్షులనూ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు చెట్టు రెమ్మనూ తీసుకు రమ్మని ఆదేశించాలి.5తరువాత యాజకుడు ఆరెండు పక్షుల్లో ఒకదాన్ని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చంపమని ఆదేశించాలి.

6అప్పుడు యాజకుడు బతికి ఉన్న రెండో పక్షినీ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ తీసుకుని వాటిని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చనిపోయిన పక్షి రక్తంలో ముంచాలి.7చర్మవ్యాధి నయమై శుద్ధీకరణ కోసం చూసే వ్యక్తి పైన యాజకుడు ఆ నీళ్ళని ఏడు సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు అతడు శుద్ధుడని ప్రకటించాలి. అప్పుడు యాజకుడు జీవించి ఉన్న రెండో పక్షిని ఎగిరి పోయేట్టు బయట మైదానంలో వదిలి వేయాలి.

8అప్పుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తన జుట్టు కత్తెర వేసుకోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. తరువాత అతడు శిబిరంలోకి వచ్చి తన గుడారం బయట ఏడు రోజులు ఉండిపోవాలి.9ఏడో రోజున అతడు తన తలపై జుట్టునంతా క్షౌరం చేసుకోవాలి. తరువాత తన గడ్డాన్నీ, కనుబొమలను కూడా క్షౌరం చేసుకోవాలి. తన జుట్టు అంతా క్షౌరం చేసుకున్న తరువాత తన బట్టలు ఉతుక్కుని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు.

10ఎనిమిదో రోజు అతడు లోపం లేని రెండు మగ గొర్రె పిల్లలనూ, ఏడాది వయస్సున్న లోపం లేని ఒక ఆడ గొర్రె పిల్లనూ యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. వాటితో పాటు నైవేద్యం కోసం నూనె కలిసిన మూడు కిలోల మెత్తని పిండినీ, అర లీటరు నూనెనూ తీసుకు రావాలి.11శుద్ధీకరణ చేసే యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తినీ ఈ సామగ్రినీ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరఉంచాలి.

12యాజకుడు వాటిలో ఒక మగ గొర్రెపిల్లనూ, నూనెనూ తీసుకుని వాటిని అపరాధం కోసం చేసే బలిగా అర్పిస్తాడు. వాటిని యెహోవా సమక్షంలో కదలించే అర్పణగా పైకెత్తి కదిలిస్తాడు.13పాపం కోసం బలి పశువునూ, దహనబలి పశువునూ వధించే పరిశుద్ధ స్థలం లోనే ఈ మగ గొర్రెపిల్లని వధించాలి. పాపం కోసం చేసే అర్పణలాగే అపరాధం కోసం చేసే అర్పణ కూడా యాజకుడికే చెందుతుంది. ఎందుకంటే అది అతి పరిశుద్ధం.

14తరువాత యాజకుడు అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలిపైనా, కుడి కాలి బొటన వేలిపైనా పూయాలి.15తరువాత యాజకుడు అరలీటరు నూనె లో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.16ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.

17తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మె పైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన ఉన్న అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి.18మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన రాయాలి. ఆ విధంగా యాజకుడు యెహోవా సమక్షంలో ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి.

19అప్పుడు యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి పాపం కోసం బలిని అర్పించి పరిహారం చేయాలి. ఆ తరువాత యాజకుడు దహనబలి పశువును వధించాలి.20యాజకుడు దహనబలినీ, నైవేద్యాన్నీ బలిపీఠం పైన అర్పించాలి. ఆవిధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు.

21అయితే ఆ వ్యక్తి పేదవాడై ఈ అర్పణలన్నీ చెల్లించే స్తోమత అతనికి లేకపోతే తన పరిహారం కోసం అతడు యెహోవా ఎదుట కదలిక అర్పణగా ఒక మగ గొర్రె పిల్లనూ, నూనెతో కలిపిన కిలో గోదుమ పిండినీ, అర లీటరు నూనెనూ తీసుకుని రావాలి.22వీటితో పాటు తన స్తోమతుకు తగినట్టు రెండు గువ్వలను గానీ రెండు తెల్ల పావురాలను గానీ తీసుకు రావాలి. వాటిలో ఒకటి పాపం కోసం బలి అర్పణగా మరొకటి దహనబలి అర్పణగా తీసుకురావాలి.23ఎనిమిదో రోజు అతడు తన శుద్ధీకరణ కోసం వాటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.

24అప్పుడు యాజకుడు అపరాధం కోసం బలి అర్పణకై తెచ్చిన గొర్రెపిల్లనూ నూనెనూ తీసుకుని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో వాటిని కదిలించాలి.25తరువాత అతడు అపరాధం కోసం బలి అర్పణగా తెచ్చిన గొర్రెపిల్లని వధించాలి. అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన పూయాలి.

26తరువాత యాజకుడు అరలీటరు నూనెలో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.27ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.

28తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడి కాలి బొటన వేలిపైన అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి.29మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన యెహోవా సమక్షంలో రాయాలి.

30తరువాత అతడు తన స్తోమత కొద్దీ తెచ్చిన రెండు గువ్వల్లో, లేదా రెండు తెల్లని పావురం పిల్లల్లో ఒక దాన్ని పాపం కోసం బలిగా మరో దాన్ని దహనబలిగా అర్పించాలి.31తానర్పించే నైవేద్యంతో పాటుగా వీటిని అర్పించాలి. తరువాత శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కోసం యాజకుడు యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. ఆ విధంగా యాజకుడు అతని పాపాలు కప్పివేస్తాడు.32చర్మంలో వచ్చిన అంటువ్యాధి శుద్ధీకరణ కోసం నిర్ధారించిన బలులు సమర్పించుకోలేని వ్యక్తి విషయంలో విధించిన చట్టం ఇది.>>
బూజు నుండి శుద్ధీకరణ

33తరువాత యెహోవా, మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.34<<నేను మీకు వారసత్వంగా ఇచ్చే కనాను దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఏదైనా ఇంట్లో నేను బూజునూ, తెగులునూ కలిగిస్తే,35ఆ యింటి యజమాని యాజకుడి దగ్గరికి వచ్చి, <నా ఇంట్లో బూజు వంటిదేదో ఉన్నట్టు నాకన్పిస్తుంది> అని చెప్పాలి.

36అప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా అశుద్ధం కాకుండా ఉండటానికి యాజకుడు వెళ్ళి ఆ ఇంటిని చూడాలి. దానికి ఎదుట యాజకుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించాలి. ఆ తరువాత యాజకుడు ఆ ఇంటిని చూడటానికి వెళ్ళాలి.37అతడు ఆ బూజుని చూడాలి. అది ఇంటి గోడల పైన పాకిందేమో చూడాలి. అది ఇంటి గోడలపైన ఎర్ర గీతలా గానీ, పచ్చ గీతలా గానీ ఉండి గోడ పగుళ్ళలో ఉంటే38యాజకుడు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఆ ఇంటిని ఏడు రోజులపాటు మూసి ఉంచాలి.

39ఏడో రోజు యాజకుడు తిరిగి వచ్చి మళ్ళీ పరీక్షించాలి. గోడపైన బూజు వ్యాపించిందేమో పరిశీలించాలి.40ఒకవేళ అది వ్యాపిస్తే, ఆ బూజు పట్టిన రాళ్ళను గోడలోంచి తీసి పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయమని యాజకుడు ఆదేశించాలి.

41ఆ తరువాత ఆ యింటి లోపల చుట్టూ గోడలను గీకించాలి. అలా గీకించిన తరువాత మాలిన్యం అంటిన పెళ్లలను పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయాలి.42వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి.

43అతడు ఆ రాళ్లను ఊడదీసి, ఆ ఇల్లు గీకించి, కొత్త అడుసు పూసిన తరువాత మళ్ళీ బూజు కన్పిస్తే యాజకుడు వచ్చి చూడాలి.44ఆ ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కన్పిస్తే అది హానికరం. ఆ ఇల్లు అశుద్ధం.

45కాబట్టి ఆ ఇంటిని కూల్చి వేయాలి. ఆ ఇంటి రాళ్ళనూ, కలపనూ, అడుసునూ తీసి పట్టణం బయట ఉన్న అశుద్ధమైన ప్రాంతంలోకి మోసుకు వెళ్ళి పారవేయాలి.46దీనికి తోడు ఆ ఇల్లు మూసి ఉన్న సమయంలో ఎవరైనా దానిలో ప్రవేశిస్తే వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధంగా ఉంటారు.47ఆ ఇంట్లో నిద్రించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అలాగే ఆ ఇంట్లో భోజనం చేసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి.

48ఒకవేళ యాజకుడు కొత్త అడుసు పూసిన తరువాత ఆ ఇంట్లో బూజు వ్యాపించేదేమో పరీక్షించడానికి వచ్చినప్పుడు, బూజు కన్పించకుంటే ఆ ఇంటిని శుద్ధమైనది గా ప్రకటించాలి.

49అప్పుడు యాజకుడు ఆ యింటిని శుద్ధీకరణ చేయడానికి రెండు పక్షులనూ, ఒక దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ తీసుకోవాలి.50పారే నీళ్ళపైన ఒక మట్టి పాత్రలో ఒక పక్షిని వధించాలి.51ఆ దేవదారు కర్రనూ, హిస్సోపు రెమ్మనూ, ఎర్రని నూలునూ, బతికి ఉన్న పక్షినీ తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోనూ, పారే నీళ్ళలోనూ వాటిని ముంచాలి. వాటితో ఆ ఇంటిపైన ఏడు సార్లు చిలకరించాలి.

52ఆ విధంగా పక్షి రక్తంతో, పారే నీళ్ళతో, బతికి ఉన్న పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపు రెమ్మతో, ఎర్రని నూలుతో ఆ ఇంటిని శుద్ధి చేయాలి.53అయితే బతికి ఉన్న పక్షిని పట్టణం బయట మైదానాల్లో వదిలివేయాలి. ఈ విధంగా ఆ ఇంటి కోసం పరిహారం చేయాలి. అప్పుడు ఆ ఇల్లు శుద్ధి అవుతుంది.

54అన్ని రకాల చర్మ సంబంధిత అంటు వ్యాధులకూ, పొక్కులకూ55వస్త్రంలో గానీ, ఇంట్లోగానీ ఏర్పడిన బూజూ,56వాపూ, చర్మం రేగి కలిగే మచ్చలూ, నిగనిగలాడే మచ్చలూ వీటికి సంబంధించిన చట్టం ఇది.57వీటిలో దేని మూలంగా ఒక వ్యక్తి ఎప్పుడు అశుద్ధుడు అవుతాడో, ఎప్పుడు శుద్ధుడు అవుతాడో ఈ చట్టం వివరిస్తుంది. ఇది చర్మానికి కలిగే అంటువ్యాధులకూ తెగులూ, బూజులకు సంబంధించిన చట్టం.>>

Chapter 15

శరీరంలో స్రావాలు జరుగుట అది అశుద్ధము

1యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు.2<<మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు.3అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే.

4అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది.5అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు.

6శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.7రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

8అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.9స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది.

10అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.11స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.12స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి.

13స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు.14ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.15యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.

16ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.17అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి.18స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.

19ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.20ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది.

21ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.22ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.23ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

24ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది.

25ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది.26ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది.27వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

28ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది.29ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.30యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.

31నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి.

32శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ,33బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.>>

Chapter 16

ప్రాయశ్చిత్త దినం

1అహరోను ఇద్దరు కొడుకులూ యెహోవా సమక్షంలోకి వెళ్ళి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.2<<నువ్వు నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, అతడు పరిహార స్థానమైన నిబంధన మందసం మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలం లోకి అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు. ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను.

3అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడనూ, దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకుని పవిత్ర స్థలం లోకి రావాలి.4అతడు ప్రతిష్ట చేసిన సన్న నార చొక్కాయి వేసుకోవాలి. సన్న నారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్న నారతో చేసిన నడికట్టు కట్టుకుని, సన్న నారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ట చేసిన పవిత్ర వస్త్రాలు. కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి.5అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా రెండు మేక పోతులనూ దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకురావాలి.

6తరువాత అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని మొదట తన కోసం అర్పించి తనకూ తన కుటుంబానికీ పరిహారం చేయాలి.7ఆ తరువాత ఆ రెండు మేకపోతులను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి.

8అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను ఆ రెండు మేకల పైన వేయాలి.9యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి.10ఏ మేకమీద <విడిచి పెట్టాలి> అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి.

11అప్పుడు అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని తీసుకు వచ్చి తన కోసం, తన కుటుంబం కోసం పరిహారం చేసుకోవాలి. దాని కోసం అహరోను ముందు తన పాపంకోసం బలిగా ఆ కోడె దూడని వధించాలి.

12ఆ తరువాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళెం తీసుకుని దాన్ని బలిపీఠం పైన ఉన్ననిప్పులతో పూర్తిగా నింపి, రెండు గుప్పిళ్ళలో పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి.13యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూత పైగా ధూమం కమ్ముకునేలా సాంబ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.

14తరువాత అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని ఆ మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో ఆ మూత పైన ఏడు సార్లు చిలకరించాలి.

15అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకు రావాలి. కోడె దూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుటా దాని పైనా చిలకరించాలి.16ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టీ, వారి తిరుగుబాటును బట్టీ, వారందరి పాపాలన్నిటిని బట్టీ పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి.

17అతి పవిత్ర స్థలం లో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయడం ముగించి బయటకి వచ్చేంత వరకూ ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు.18తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ములకు పూయాలి.19ఆ రక్తాన్ని ఏడు సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్ర పరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి.

20అతడు అతి పవిత్ర స్థలానికీ, ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేసి ముగించిన తరువాత బతికి ఉన్న మేకని తీసుకు రావాలి.21అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన రెండు చేతులూ ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి.22ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకు వెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి.

23తరువాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలం లోకి వెళ్లే ముందు తాను ధరించిన నార వస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి.24అతడు పవిత్ర స్థలం లో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకుని బయటకు రావాలి. అప్పుడు తన కొరకూ, ప్రజల కొరకూ దహనబలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి.

25పాపం కోసం చేసే బలి పశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి.26విడిచిపెట్టే మేకని వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు.

27పవిత్ర స్థలం లో పాపాల కోసం బలి చేసిన ఏ కోడె దూడ రక్తం, ఏ మేక రక్తం అతి పవిత్ర స్థలం లోకి తెచ్చారో ఆ కోడె దూడ, మేకల కళేబరాలను ఒకవ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలనూ, మాంసాన్నీ, పేడనూ మంట పెట్టి కాల్చి వేయాలి.28వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు.

29మీరు ఏడో నెల పదో రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పనీ చేయకూడదు. స్థానిక ప్రజలకీ, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకీ ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం.30ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీ కోసం పరిహారం జరిగింది.31అది మీకు మహా విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఎలాంటి పనీ చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం.

32తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకుని ప్రతిష్ఠి చేసిన నార బట్టలు వేసుకోవాలి.33అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి. ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేయాలి. యాజకుల కొరకూ, సమాజంలోని ప్రజలందరి కొరకూ పరిహారం చేయాలి.

34ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం.>> యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేసాడు.

Chapter 17

రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం నిషేధం

1యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.2<<నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట3ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గానీ, మేకని గానీ, గొర్రె పిల్లని గానీ పట్టుకుని శిబిరం లోపలైనా, బయటైనా చంపి,4దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకు రాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు, కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.

5ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతిబలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి.6యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి.

7ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకు ముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం.

8నువ్వు వాళ్లకి ఇంకా ఇలా చెప్పు. ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా దహనబలిని గానీ, మరింకేదైనా బలి అర్పణ గానీ చేసి9దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకు అర్పించడానికి తీసుకు రాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి.

10ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను.11ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.

12కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను.13అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.

14కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి <మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను> అని ఆదేశించాను.

15స్థానికుడైనా, మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే, అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.16ఒకవేళ అతడు బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు.>>

Chapter 18

చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.2<<నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.3మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు.

4మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.5మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను.

6మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.

7నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

8నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు.

9నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

10నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే.

11నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

12నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

13నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.

14నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.

15నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

16నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.

17ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.

18నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.

19ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

20నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.

21నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

22స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.

23ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.

24వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.25ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.

26కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా27మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.28నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.

29అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.30కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.>>

Chapter 19

వేరు వేరు చట్టాలు

1యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు.2<<మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని.3మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

4మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

5మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి.6మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా, మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.7మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.8మూడో రోజున దాన్ని తినేవాడు తన దోషశిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్ర పరిచాడు కదా. వాడిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి.

9మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు.10నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.

11నేను మీ దేవుడైన యెహోవాను.

మీరు దొంగతనం చేయకూడదు.

అబద్ధం ఆడకూడదు.

ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

12నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.

నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

13నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు.

అతణ్ణి దోచుకోకూడదు.

కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.

14చెవిటివాణ్ణి తిట్ట కూడదు.

గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు.

నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.

15అన్యాయ తీర్పు తీర్చకూడదు.

బీదవాడని పక్షపాతం చూపకూడదు.

గొప్పవాడని అభిమానం చూపకూడదు.

నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.

16నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు.

1 ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.

17నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.

నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.

18పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

19మీరు నా శాసనాలను పాటించాలి.

నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు.

నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు.

రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.

20ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు.21అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.22అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.

23మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.24నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు.25నేను మీ దేవుడైన యెహోవాను.

26రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు.

శకునాలు చూడకూడదు.

మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.

27విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.

28చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

29నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.

30నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.

31చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.

32తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.

33మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు,34మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.

35కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.36న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.

37మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.>>


1 19:16 ప్రాణం నిలపడానికి చూడాలి.

Chapter 20

పాపాలకు శిక్షలు

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. <<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు.2ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోగాని ఎవరైనా తన పిల్లలను మోలెకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణ శిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.

3అతడు తన సంతానాన్ని మోలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను.4ఆ వ్యక్తి తన సంతానాన్ని మోలెకుకు ఇస్తుండగా మీ దేశ ప్రజలు చూసి కూడా కళ్ళు మూసుకుంటే, వాణ్ణి చంపక పొతే5అప్పుడు నేనే వాడికి, వాడి వంశానికి విరోధినై వాణ్ణి ప్రజల్లో లేకుండా చేస్తాను. మోలెకుతో వేశ్యరికం చెయ్యడానికి వాడి వెంటబడి వ్యభిచారం చేసే వారందరినీ ప్రజల్లో లేకుండా చేస్తాను.

6చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.7కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.
8మీరు నా శాసనాలను పాటించి వాటి ప్రకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని పవిత్ర పరచే యెహోవాను.

9ఎవడు తన తండ్రినిగానీ తన తల్లినిగానీ దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధించాలి. వాడు తన తండ్రినో తల్లినో దుర్భాషలాడాడు గనక అతడు దోషి, మరణ శిక్షకు పాత్రుడు.

10వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి- ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.

11తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు.

12ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు. మరణ శిక్షకు పాత్రులు.

13ఒకడు స్త్రీతో పెట్టుకున్నట్టు పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరూ అసహ్య కార్యం చేశారు గనక వారికి మరణశిక్ష విధించాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.

14ఒకడు స్త్రీని పెళ్ళాడి ఆమె తల్లిని కూడా పెళ్లాడితే అది దుర్మార్గం. అతణ్ణి, ఆ స్త్రీలను సజీవ దహనం చెయ్యాలి. ఆ విధంగా మీ మధ్యనుండి దుర్మార్గత తొలిగిపోతుంది.

15ఎవరైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుంటే వాడికి తప్పక మరణ శిక్ష విధించాలి. ఆ జంతువును చంపాలి.

16జంతువుతో ఒక స్త్రీ లైంగికంగా కలవడం కోసం దాని దగ్గరికి పోతే ఆ స్త్రీని ఆ జంతువును చంపాలి. ఆమెకు దానికి తప్పక మరణ శిక్ష పడాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.

17ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన దోష శిక్షను తాను భరించాలి.

18ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆమె రక్త స్రావాన్ని, రక్తధారను బట్టబయలు చేసాడు. ప్రజల్లో నుండి వారిద్దరినీ లేకుండా చేయాలి.

19నీ తల్లి సోదరితో గాని నీ తండ్రి సోదరితో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే నీవు నీ దగ్గర బంధువును హీన పరిచావు. నీ దోషశిక్షను భరించాలి.

20బాబాయి భార్యతో గానీ మేనమామ భార్యతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు తన దగ్గర బంధువును హీనపరిచాడు. వారు తమ పాపశిక్షను భరించాలి. వారు పిల్లలు లేకుండా చనిపోతారు.

21ఒకడు తన సోదరుని భార్యను పెళ్లాడితే అది అశుద్ధం. ఎందుకంటే వాడు తన సోదరుని వివాహబంధాన్ని మీరాడు. వారు సంతాన హీనులుగా ఉంటారు.

22కాబట్టి మీరు నివసించాలని నేను ఏ దేశానికి మిమ్మల్ని తీసుకు పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు నా శాసనాలన్నిటిని, నా విధులన్నిటిని పాటించాలి.

23నేను మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.

24నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. 1 పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.

25కాబట్టి మీరు శుద్ధ జంతువులకు, అశుద్ధ జంతువులకు, శుద్ధ పక్షులకు, అశుద్ధ పక్షులకు అంతరం తెలుసుకోవాలి. అశుద్ధమైనదని నేను మీకు వేరు చేసి చెప్పిన ఏ జంతువు మూలంగా గానీ ఏ పక్షి మూలంగా గానీ, నేల మీద పాకే దేని మూలంగా గానీ మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకోకూడదు.
26మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.

27పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.>>


1 20:24 సారవంతమైన

Chapter 21

యాజకులు కోసం నియమాలు

1యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<యాజకులైన అహరోను కొడుకులతో ఇలా చెప్పు. మీలో ఎవరూ మీ ప్రజల్లో శవాన్ని ముట్టుకుని తనను అపవిత్రం చేసుకోకూడదు.2అయితే తన రక్త సంబంధులు, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, సోదరుడు,3తన ఇంట్లో నివసిస్తున్న పెండ్లి కానీ కన్య అయిన సోదరి గానీ చనిపోతే ఆ శవాన్ని తాకడం వల్ల తనను అపవిత్ర పరచుకోవచ్చు.

4యాజకుడు తన భార్య తరుపు బంధువుల కోసం తనను అపవిత్ర పరచుకుని మైల పడకూడదు.

5యాజకులు బోడిగుండు చేసుకోకూడదు. గడ్డం పక్కలను క్షవరం చేసుకో కూడదు. కత్తితో శరీరాన్ని గాట్లు పెట్టుకోకూడదు.6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్ట పాలు చెయ్యకూడదు. ఎందుకంటే వారు తమ దేవునికి <నైవేద్యం> అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించే వారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి.

7వారు వేశ్యను గానీ చెడిపోయిన దాన్ని గానీ పెళ్లాడకూడదు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

8అతడు నీ దేవుడికి <నైవేద్యం> అర్పించే వాడు గనక నీవు అతణ్ణి పరిశుద్ధపరచాలి. మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవా అనే నేను పవిత్రుణ్ణి గనక అతడు మీ దృష్టికి పవిత్రుడుగా ఉండాలి.

9యాజకుని కూతురు వేశ్యగా తనను అపవిత్రపరచు కున్నట్టైతే ఆమె తన తండ్రికి అప్రదిష్ట తీసుకువస్తుంది. ఆమెను సజీవ దహనం చెయ్యాలి.

10సోదరుల్లో ప్రధాన యాజకుడు కావడానికి ఎవరి తలమీద అభిషేక తైలం పోస్తారో, ప్రధాన యాజక దుస్తులు ధరించడానికి ఎవరు ప్రతిష్ట అవుతారో అతడు తన జుట్టు విరబోసుకోకూడదు. తన బట్టలు చింపుకోకూడదు.11అతడు శవం ఉన్న చోటికి పోకూడదు. తన తండ్రి శవం మూలంగా గానీ తన తల్లి శవం మూలంగా గానీ మైల పడకూడదు.

12ప్రధానయాజకుడు పరిశుద్ధమందిరాన్ని విడిచి వెళ్లకూడదు. తన దేవుని పరిశుద్ధ మందిరాన్ని మైల పడేలా చెయ్యకూడదు. ఎందుకంటే తన దేవుని అభిషేక తైలం వల్ల అతడు ప్రధాన యాజకునిగా అభిషేకం పొందాడు. నేను యెహోవాను.

13అతడు కన్యను మాత్రమే పెళ్ళాడాలి.14వితంతువును గానీ విడాకులు తీసుకున్న స్త్రీని గానీ వేశ్యను గానీ అలాటి వారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి.15అతడు ఈ నియమాలు పాటించాలి. యెహోవా అనే నేను అతణ్ణి పవిత్రపరిచే వాణ్ణి గనక అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్ర పరచకూడదు.>>

16యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.17<<నీవు అహరోనుతో ఇలా చెప్పు. నీ సంతానంలో ఎవరికైనా కళంకమేదైనా కలిగితే అతడు తన దేవుడికి నైవేద్యం అర్పించడానికి సమీపించ కూడదు.
18ఎందుకంటే ఎవరిలో కళంకం ఉంటుందో, అంటే వాడు గుడ్డి వాడైనా, కుంటివాడైనా, వికృత రూపి అయినా,19కాలు గానీ చెయ్యి గానీ అవిటితనం ఉన్నా,20గూనివాడైనా, మరుగుజ్జువాడైనా, కంటి దోషం లేక జబ్బు ఉన్నవాడైనా, గజ్జి, పక్కు ఉన్నవాడైనా వృషణాలు నలిగినవాడైనా అలాంటివాడు సమీపించకూడదు.

21యాజకుడైన అహరోను సంతానంలో అవిటితనం గలవారెవరూ యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించడానికి దగ్గరికి రాకూడదు. అతడు అవిటి వాడు. అలాటి వాడు తన దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరికి రాకూడదు.
22అతి పరిశుద్ధమైనవిగాని, పరిశుద్ధమైనవిగాని, తన దేవునికి అర్పించే ఏ ఆహార వస్తువులైనా అతడు తినొచ్చు.23మొత్తం మీద అతడు అవిటితనం గలవాడు గనక అడ్డతెర ఎదుటికి అతడు రాకూడదు. బలిపీఠం సమీపించకూడదు.24నా పరిశుద్ధ స్థలాలను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పు.>> మోషే ఈ విధంగా అహరోనుతో, అతని కొడుకుల తో ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పాడు.

Chapter 22

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.2<<అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.3నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.

4అహరోను సంతానంలో ఎవరికైనా కుష్టువ్యాధి గానీ, శరీరం నుండి రసి లాంటిది కారడం గానీ ఉంటే అలాటి వాడు పవిత్రుడయ్యే వరకూ ప్రతిష్ఠితమైన వాటిలో దేనినీ తినకూడదు. శవాన్ని తాకడం వల్లా, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవడం వల్లా, వీర్యస్కలనం చేసిన వాణ్ణి తాకడం వల్లా,5అపవిత్రమైన పురుగును, లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవడం వల్లా, అలాటి అపవిత్రత తగిలినవాడు సాయంత్రం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.6అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకూ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు.
7సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా.

8అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను.9కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.

10ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని, సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు.11అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు.
12యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు.13యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు.

14ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి.

15ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు.16నేను 1 అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.>>
అంగీకరింపదగని బలులు

17యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.18<<నీవు అహరోనుతో, అతని కొడుకులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో గానీ ఇశ్రాయేలీయుల్లో నివసించే పరదేశుల్లోగాని యెహోవాకు దహన బలి అర్పించదలిస్తే అది స్వేచ్ఛార్పణగానివ్వండి, మొక్కుబడి గానివ్వండి19ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గానీ, గొర్రె మేకల్లో నుండి గానీ దోషంలేని మగదాన్ని అర్పించాలి.
20కళంకం ఉన్న దాన్ని అర్పించ కూడదు. అది అంగీకారం కాదు.21ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు.
22గుడ్డిదాన్ని గానీ కుంటిదాన్ని గానీ, పాడైపోయిన దాన్ని గానీ, గడ్డలు, గజ్జి, కురుపులు ఉన్న దాన్ని గానీ యెహోవాకు అర్పించకూడదు. అలాంటివి దేన్నీ బలివేదికపై యెహోవాకు హోమం చేయకూడదు.

23అంగవైకల్యం గల కోడెదూడనైనా గొర్రెల మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు గానీ మొక్కుబడిగా మాత్రం అది అంగీకారం కాదు.

24గాయపడిన, నలిగిన, మృగాలు చీల్చిన, వృషణాలు చితక గొట్టిన జంతువును యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటివి అర్పించకూడదు.252 విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.>>

26యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు.27<<దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.
28అయితే అది ఆవైనా గొర్రె మేకలైనా మీరు దాన్ని, దాని పిల్లను ఒక్క నాడే వధించకూడదు.29మీరు కృతజ్ఞత బలిగా ఒక పశువును వధించినప్పుడు అది మీ కోసం అంగీకారం అయ్యేలా దాన్ని అర్పించాలి.30ఆనాడే దాని తినెయ్యాలి. మరుసటి రోజు దాకా దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను.

31మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను.32నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను.33నేను మీకు దేవుడనై ఉండేలా ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పు.>>


1 22:16 లేక ప్రజలను.
2 22:25 కనానీయ ప్రజలు తాము పెంచే జంతువుల వృషణాలు చితక గొడతారు. అందుకని వారి దగ్గర కొన్న జంతువులను దేవునికి అర్పించ కూడదు.

Chapter 23

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.2<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మీరు చాటించ వలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి.

విశ్రాంతి దినం

3ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం.
4ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి.
పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ

51 మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.6ఆ నెల పదిహేనో రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. ఏడు రోజుల పాటు మీరు పొంగని వంటకాలే తినాలి.
7మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.8ఏడు రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. ఏడవ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదని వారితో చెప్పు.>>
మొదటి పంటలు

9యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు10<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.11యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి.
12మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి.13దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక 2 లీటర్ ద్రాక్షారసం.14మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు, మొదలైనవి ఏమీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం.
పెంతెకొస్తు పండుగ

15మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలు కుని ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండాలి.16ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి.
17మీరు మీ ఇళ్ళలో నుండి తూములో రెండేసి పదివంతుల పిండితో చేసిన రెండు రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోదుమపిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమఫలాల అర్పణం.

18మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది.
19అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపపరిహార బలిగా అర్పించి రెండు ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి.20యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి.21ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.

22మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.>>
బూరలూదే పండుగ

23యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.24<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి.25ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.>>
ప్రాయశ్చిత్తం చేసే రోజు

26యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.27<<ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి.
28ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం.29ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
30ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను.31ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.32అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.>>
పర్ణశాలల పండగ

33యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.34<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.
35వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధసంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.36ఏడు రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. ఎనిమిదో రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.

37ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి.38యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం.
39అయితే ఏడో నెల పదిహేనో రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు ఏడు రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటిరోజు, ఎనిమిదవ రోజు విశ్రాంతి దినాలు.

40మొదటి రోజున మీరు దబ్బ కాయలు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి.41అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి.
42నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి.43నేను మీ దేవుడైన యెహోవాను.>>

44ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు.


1 23:5 ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది.
2 23:13 నిర్గమ 29:౪౦ చూడండి.

Chapter 24

రొట్టెలు, ఒలీవ నూనె నిత్యమూ దేవుని సన్నిధిలో ఉండాలి

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.2<<దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

3ప్రత్యక్ష గుడారంలో 1 శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం.4అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి.

5నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి.6యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి.
7ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం.8యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.9ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.>>
దైవదూషణకు రాళ్ల శిక్ష

10ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు.11ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు.12యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు.
13అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.

14<<శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి.
15నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి.16యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.

17ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి.18జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి.
19ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి.20ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.

21జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి.హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి.
22మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు>> అన్నాడు.

23కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో <<దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి>> అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు.


1 24:3 నిబంధన మందసం తెర

Chapter 25

విశ్రాంతి సంవత్సరం

1యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు2<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి.

3ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు.

4ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు.
5బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం.6అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకు, నీ సేవకుడికి, నీ దాసికి, నీ జీతగాడికి, నీతో నివసిస్తున్న పరదేశికి ఆహారంగా ఉంటుంది.7నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది.
ఏభైయవ సంవత్సరం (సునాద కాలం)

8ఏడు విశ్రాంతి సంవత్సరాలను, అంటే ఏడేసి సంవత్సరాలను లెక్క బెట్టాలి. ఆ ఏడు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది.9ఏడో నెల పదవ రోజు మీ దేశమంతటా కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఆ బూర ఊదాలి.
10మీరు ఆ సంవత్సరాన్ని, అంటే ఏభైయవ సంవత్సరాన్ని పరిశుద్ధ పరచి మీ దేశంలో ఉన్న వారందరికి విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు 1 సునాదం. అప్పుడు మీలో ప్రతివాడూ తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకోవాలి. ప్రతివాడూ తన కుటుంబానికి తిరిగి రావాలి.

11ఆ సంవత్సరం, అంటే ఏభైయవ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్ల కూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగు చేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు.12అది సునాద కాలం. అది మీకు పవిత్రం. చేలో దానంతట అదే పండిన పంటను మీరు తింటారు.
13ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి.

14నీవు నీ పొరుగు వాడికి అమ్మిన దాని విషయంలో గానీ నీ పొరుగు వాడి దగ్గర నీవు కొనుక్కున్న దాని విషయంలో గానీ మీరు ఒకరినొకరు బాధించుకోకూడదు.
15సునాద సంవత్సరం అయిన తరువాత జరిగిన సంవత్సరాల లెక్క ప్రకారం నీ పొరుగు వాడి దగ్గర నీవు దాన్ని కొనాలి. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మాలి.16ఆ సంవత్సరాల లెక్క పెరిగిన కొద్దీ దాని వెల పెంచాలి. ఆ సంవత్సరాల లెక్క తగ్గిన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే పంటవచ్చిన సంవత్సరాల లెక్క చొప్పున అతడు దాని ఖరీదు కట్టాలి గదా.17మీరు ఒకరి నొకరు బాధించుకో కుండా నీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

18కాబట్టి మీరు నా శాసనాలను నా విధులను పాటించి వాటి ననుసరించి నడుచుకోవాలి.19అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు. ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు తృప్తిగా తిని దానిలో సురక్షితంగా నివసిస్తారు.
20ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము? మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు గదా అనుకుంటారేమో.21నేను ఆరో సంవత్సరం నా దీవెన మీకు కలిగేలా ఆజ్ఞాపిస్తాను. ఆ సంవత్సరం మూడేళ్ళకు సరిపడిన పంట పండుతుంది.22మీరు ఎనిమిదో సంవత్సరాన విత్తనాలు చల్లి తొమ్మిదో సంవత్సరం వరకూ పాత పంట తింటారు. కొత్త పంట వచ్చేదాకా పాత దాన్ని తింటారు.

23భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు.24నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి.25నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు.

26అయితే ఒకడు సమీప బంధువు లేకపోయినా తన ఆస్తిని విడిపించుకోడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకుంటే27దాన్ని అమ్మిన సమయం నుండి గడచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్న వాడికి ఆ డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు.28అతనికి దాని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన డబ్బు దొరక్క పోతే అతడు అమ్మిన ఆస్తి సునాద సంవత్సరం వరకూ కొన్న వాడి స్వాధీనంలో ఉండాలి. సునాద సంవత్సరంలో అది విడుదల అవుతుంది. అప్పుడతడు తన ఆస్తిని తిరిగి పొందుతాడు.

29ఎవరైనా ప్రాకారం ఉన్న ఊరిలోని తన సొంతిల్లు అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకుని సంవత్సరంలోగా దాన్ని విడిపించుకోవచ్చు. ఆ సంవత్సరమంతా దాన్ని విడిపించుకునే అవకాశం అతనికి ఉంది.30అయితే ఆ సంవత్సరం నిండే లోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్న వాడికే తరతరాలకు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు.

31ప్రాకారం లేని గ్రామాల్లోని ఇళ్ళను మాత్రం దేశంలోని పొలాలతో సమానంగా ఎంచాలి. వాటిని తిరిగి విడిపించుకోవచ్చు. అవి సునాదకాలంలో విడుదల అవుతాయి.32అయితే లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళను వారు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు.

33లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న ఆ లేవీయుల ఆస్తి గనక ఎవరైనా లేవీయుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అది లేవీయులకు పిత్రార్జితంగా వచ్చిన పట్టణంలో అమ్మిన ఇల్లు. అది సునాద సంవత్సరంలో విడుదల అవుతుంది.34లేవీయులు తమ పట్టణ ప్రాంతం భూములను అమ్ముకోకూడదు. అవి వారికి శాశ్వత ఆస్తి.

35నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి.36అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి.37డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహారపదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు.38నేను యెహోవాను. మీకు దేవుడుగా ఉండడానికి ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించి, మీకు కనాను దేశాన్ని ఇచ్చిన వాణ్ణి.

39నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు.40వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకూ నీ దగ్గర సేవకుడుగా పని చేస్తాడు.41అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలు దేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి.
42ఎందుకంటే వారు నాకే సేవకులు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్టు వాళ్ళను అమ్మకూడదు.43నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు.

44మీ చుట్టుపక్కల ఉన్న జాతుల్లోనించి దాస దాసీలను కొనుక్కోవచ్చు.
45మీ మధ్య నివసించే పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన పరాయి వారిని కొనవచ్చు. వారు మీ ఆస్తి అవుతారు.46అలాటి బానిసలను మీ తరవాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలౌతారు. కానీ మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు.

47పరదేశిగానీ మీ దగ్గర తాత్కాలికంగా నివసించేవాడు గాని ధనికుడై, నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు పేదవాడై ఆ పరదేశికైనా ఆ పరదేశి కుటుంబంలో ఎవరికైనా తనను అమ్ముకున్నాడనుకోండి.48నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు అమ్ముడుబోయిన తరువాత అతణ్ణి విడిపించ వచ్చు. అతడి బంధువుల్లో ఎవరైనా అతణ్ణి విడిపించవచ్చు.

49అతని బాబాయిగాని బాబాయి కొడుకు గాని అతని వంశంలోని రక్తసంబంధిగాని అతణ్ణి విడిపించవచ్చు. అవసరమైన విడుదల వెల అతనికి దొరికితే అతడు తనను తాను విడిపించుకోవచ్చు.

50అప్పుడు అతడు తనను కొనుక్కున్న వాడితో బేరమాడాలి. తాను అమ్ముడుబోయిన సంవత్సరం నుండి సునాద సంవత్సరం వరకూ సంవత్సరాలు లెక్క బెట్టాలి. తనను కొనుక్కున్న వాడి దగ్గర ఎంతకాలం పనిచేశాడు అనే దాన్ని బట్టి అతని విడుదల వెల లెక్కగట్టాలి. ఆ వెలను జీతానికి పెట్టుకున్న సేవకునికి ఇచ్చే దాని ప్రకారం లెక్కించాలి.

51సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, ఆ సంవత్సరాల లెక్క ప్రకారం తన విడుదల వెల తిరిగి చెల్లించాలి.52సునాద సంవత్సరానికి ఇక కొద్ది కాలమే ఉంటే కొన్న వాడితో లెక్క చూసుకుని మిగిలిన సంవత్సరాల లెక్కచొప్పున చెల్లించాలి.
53సంవత్సరాల లెక్క ప్రకారం జీతంపై పని చేసే వాడి లాగా వాడతని దగ్గర పని చెయ్యాలి. అతని చేత కఠినంగా సేవ చేయించకుండా మీరు చూసుకుంటూ ఉండాలి.

54అతడు ఈ విధంగా విడుదల పొందకపోతే సునాద సంవత్సరంలో అతడు తన పిల్లలతో సహా విడుదల పొందుతాడు.55ఎందుకంటే ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నేను ఐగుప్తుదేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడైన యెహోవాను.>>


1 25:10 అక్షరాలా పొట్టేలు కొమ్ము బూర ఊదడం. ఈ సంవత్సరంలో అన్నిటికీ పూర్వస్థితి వస్తుంది.

Chapter 26

విధేయతకు ప్రతిఫలము

1<<మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.2నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను.

3మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.

4వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి.
5మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.6ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకొనేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూరమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు.

7మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు.8మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు.
9ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను.

10మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది.

11నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు.12నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు.13మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను.
ఆవిధేయతకు శిక్ష

14ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా15నా శాసనాలను నిరాకరిస్తూ, నా ఆజ్ఞలన్నిటినీ నిరాకరిస్తూ నా నిబంధనను ఉల్లంఘిస్తూ నా తీర్పులను త్రోసిపుచ్చుతూ ఉంటారేమో.
16అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు.

17మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు.
18నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.19మీ బల గర్వాన్ని భంగపరచి, ఆకాశాన్ని ఇనుములాగా భూమిని ఇత్తడిలాగా చేస్తాను.20మీ భూమి ఫలించదు. మీ దేశంలోని చెట్లు ఫలించవు. మీ బలం వృథాగా ఇంకి పోతుంది.

21మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను.22మీ మధ్యకు క్రూరమృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమై పోతాయి.
23ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే24నేను కూడా మీపై కోపంగా నడుచు కుంటాను. నేనే మీ పాపాలను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.

25మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు.26నేను మీ ఆహారాన్ని, అంటే మీ ప్రాణాధారం తీసేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు రొట్టెలు చేసి కొలత ప్రకారం మీకు ఇస్తారు. మీరు తింటారు గాని తృప్తి పొందరు.

27నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే28నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
29మీరు మీ కొడుకుల మాంసం తింటారు, మీ కుమార్తెల మాంసం తింటారు.30నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.

31నేను మీ ఊళ్ళను పాడు చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాలను పాడుచేస్తాను. మీ సువాసన గల అర్పణలును వాసన చూడను.

32నేనే మీ దేశాన్ని పాడు చేసిన తరువాత దానిలో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు.33జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.
34మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడుబడి ఉన్న కాలమంతా అది తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుంది.

35అది పాడై ఉండే దినాలన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందలేకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినాల్లో అనుభవిస్తుంది.36మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు.
37తరిమేవాడు ఎవరూ లేకుండానే వారు కత్తిని చూసినట్టుగా ఒకడి మీద ఒకడు పడతారు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేక పోతారు.38మీరు జనంగా ఉండకుండాా నశించి పోతారు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినేస్తుంది.

39మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశాల్లో తమ దోషాలను బట్టి క్షీణించిపోతారు. వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషాలను బట్టి క్షీణించిపోతారు.
40వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని,41నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించాననీ ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతి దండన అనుభవించామని ఒప్పుకుంటే,42నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను.
43తమ దేశాన్ని వారు విడిచిపెట్టి పోగా పాడైపోయిన వారి దేశం తన విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది. వారు నా తీర్పులను తిరస్కరించి నా శాసనాలను అసహ్యించుకున్నారు. ఆ కారణం చేతనే వారు తమ పైకి వచ్చిన దోషశిక్ష న్యాయమని ఒప్పుకొంటారు.
44అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరించను. నా నిబంధనను భంగపరచి వారిని బొత్తిగా నశింపజేయడానికి వారిపై అసహ్యపడను. ఎందుకంటే నేను వారి దేవుడైన యెహోవాను.

45నేను వారికి దేవుడనై ఉండేలా వారి పూర్వికులను వివిధ జాతులు చూస్తుండగా ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను, అని చెప్పు>> అన్నాడు.
46యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు, ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన శాసనాలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే.

Chapter 27

దేవునివి విడిపించడం

1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.2<<నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.

3నీవు నిర్ణయించవలసిన వెల ఇది. ఇరవై ఏళ్ళు మొదలు అరవై ఏళ్ల వయస్సు వరకూ పురుషుడికి 1 పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం ఏభై తులాల వెండి నిర్ణయించాలి.

4స్త్రీకి ముప్ఫై తులాలు నిర్ణయించాలి.
5ఐదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ల లోపలి వయస్సు గల పురుషుడికి ఇరవై తులాల వెలను, స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.6ఒక నెల మొదలు ఐదేళ్ళ లోపు వయస్సుగల పురుషుడికి ఐదు తులాల వెండి వెలను స్త్రీకి మూడు తులాల వెండి వెలను నిర్ణయించాలి.
7అరవై ఏళ్ల వయసు దాటిన పురుషుడికి పదిహేను తులాల వెలను స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.8ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేద వాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి.

9యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రతిదాన్నీ యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచాలి.10దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి బదులు మంచిదాన్ని గానీ మంచిదానికి బదులు చెడ్డదాన్ని గానీ ఒక దానికి బదులు మరొక దాన్నిగానీ ఇయ్యకూడదు. మొక్కుకున్న జంతువుకు బదులు వేరొక జంతువును మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినదీ కూడా ప్రతిష్ఠితం అయిపోతుంది.

11ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి.12అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెలను నిర్ణయించాలి. యాజకుడివైన నీవు నిర్ణయించిన వెల ఖాయం.

13అయితే ఎవరైనా అలాటి జంతువును విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి.
14ఎవరైనా తన ఇల్లు యెహోవాకు సమర్పించడానికి దాన్ని ప్రతిష్ఠించినట్టయితే అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెల నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించిన వెల ఖాయం అవుతుంది.

15తన ఇల్లు దేవునికి అర్పించిన వాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదవుతుంది.
16ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే దానిలో 2 చల్లే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. పది తూముల బార్లీ విత్తనాలకు ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
17అతడు సునాద సంవత్సరం మొదలు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీవు నిర్ణయించే వెల ఖాయం.

18సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున, అంటే మరుసటి సునాద సంవత్సరం వరకూ ఉన్న సంవత్సరాలను బట్టి వెలను నిర్ణయించాలి. నీవు నిర్ణయించిన వెలలో దాని అంచనాను తగ్గించాలి.
19పొలాన్ని ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతును అతడు దానితో కలపాలి. అప్పుడు అది అతనిదవుతుంది.20అతడు ఆ పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించడం వీలు కాదు.21ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదల అయితే అది ప్రతిష్ఠించిన పొలం లాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది.

22ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే23యాజకుడు సునాద సంవత్సరం వరకూ నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమించాలి. ఆ రోజునే నీవు నిర్ణయించిన వెల చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లించాలి.
24సునాద సంవత్సరంలో ఆ భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే ఆ పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి.

253 నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం వెల చొప్పున నిర్ణయించాలి. ఒక తులం ఇరవై చిన్నాలు.
26జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనక ఎవరూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు అయినా గొర్రెమేకల మందలోనిదైనా యెహోవాదే.27అది అపవిత్ర జంతువైతే వాడు నీవు నిర్ణయించే వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపించవచ్చు. దాని విడిపించకపోతే నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మాలి.

28అయితే మనుషుల్లోగాని జంతువుల్లోగాని సొంత పొలంలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్టించినట్టయితే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించ కూడదు. ప్రతిష్ఠించిన ప్రతిదీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది.29మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనా విడిపించకుండా చంపి వేయాలి.

30ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.31ఒకడు తాను చెల్లించవలసిన దశమభాగాల్లో దేనినైనా విడిపించుకోవాలి అనుకుంటే దానిలో ఐదో వంతును దానితో కలపాలి.
32ఆవుల్లోగాని, గొర్రె మేకల్లోగాని, కాపరి కర్రతో తోలే వాటన్నిటిలో దశమభాగం ప్రతిష్ఠితం అవుతుంది.33అది మంచిదో చెడ్డదో పరీక్ష చెయ్యకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితాలు అవుతాయి. అలాటి దాన్ని విడిపించ కూడదు అని చెప్పు.>>

34ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.


1 27:3 ఇది ఆలయంలో వాడకం కోసం మతాధికారులు నియమించిన ప్రత్యేకమైన కొలత. ఇది ఒకషెకెల్ 6 కిలోలు.
2 27:16 లేక పంట కోతలో లభించే ధాన్యం.
3 27:25 నిర్గమ 30:13 చూడండి.

సంఖ్యాకాండం

Chapter 1

జనాభా లెక్కలు

1యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.2<<ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.3ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.

4మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.5మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,6షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,

7యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,8ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు9జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.

10యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,

12దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,13ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,14గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు15నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.>>

16వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు 1 పెద్దలుగానూ ఉన్నారు.

17ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.18వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.19అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.

20ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.21అలా రూబేను గోత్రం నుండి 46,500 మందిని లెక్కించారు.

22షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.23అలా షిమ్యోను గోత్రం నుండి 59,300 మందిని లెక్కించారు.

24గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.25అలా గాదు గోత్రం నుండి 45,650 మందిని లెక్కించారు.

26యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.27అలా యూదా గోత్రం నుండి 74,600 మందిని లెక్కించారు.

28ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.29అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54,400 మందిని లెక్కించారు.

30జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.31అలా జెబూలూను గోత్రం నుండి 57,400 మందిని లెక్కించారు.

32యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.33అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40,500 మందిని లెక్కించారు.

34మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.35అలా మనష్షే గోత్రం నుండి 32,200 మందిని లెక్కించారు.

36బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.37అలా బెన్యామీను గోత్రం నుండి 35,400 మందిని లెక్కించారు.

38దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.39అలా దాను గోత్రం నుండి 62,700 మందిని లెక్కించారు.

40ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.41అలా ఆషేరు గోత్రం నుండి 41,500 మందిని లెక్కించారు.

42నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.43అలా నఫ్తాలి గోత్రం నుండి 53,400 మందిని లెక్కించారు.

44ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.45ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.46వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.

47కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.48ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.49<<లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.

50వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.

51గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.52ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.

53నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.>>54ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.


1 1:16 వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు.

Chapter 2

ప్రయాణాలు కోసం, గోత్రాలు మకాం చేసే ఏర్పాటు

1యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.2<<ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.

3యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.4యూదా దళంలో నమోదైన వారు 74,600 మంది పురుషులు.

5యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.6నెతనేలుతో ఉన్న సైన్యంలో 54,400 మంది పురుషులు నమోదయ్యారు.

7ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.8అతని దళంలో నమోదైన వారు 57,400 మంది పురుషులు.

9యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.

10దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.11అతని సైన్యంలో నమోదైన వారు 46,500 మంది పురుషులు.

12రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.13అతని దళంలో నమోదైన వారు 59,300 మంది పురుషులు.

14తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.15అతని సైన్యంలో నమోదైన వారు 45,650 మంది పురుషులు.

16కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,51,450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.

17సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.

18ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.19ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40,500 మంది పురుషులు.

20మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.21అతని సైన్యంగా నమోదైన వారు 32,200 మంది పురుషులు.

22మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.23అతని సైన్యంగా నమోదైన వారు 35,400 మంది పురుషులు.

24కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.

25దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.26దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62,700 మంది పురుషులు.

27అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.28అతని సైన్యంగా 41,500 మంది పురుషులు నమోదయ్యారు.

29ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.30నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53,400 మంది పురుషులు.

31కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,57,600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.>>

32ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.33అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.

34ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.

Chapter 3

లేవీ గోత్రం

1యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.2అహరోను పెద్ద కొడుకు నాదాబు. ఆ తరువాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

3ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్టించారు.4కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు.

5తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా.6వారిని అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతనికి సహాయకులుగా ఉండాలి.

7వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.8సన్నిధి గుడారంలోని అలంకరణలూ, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్లకి సహాయం చేయాలి.

9కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.10నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.>>

11యెహోవా మోషేతో ఇంకా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.12<<ఇశ్రాయేలు ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోడానికి బదులుగా నేను లేవీయులను తీసుకున్నాను. వారు నా వారు.13మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.>>

14సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.15<<లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.>>16మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు.

17లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.18గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.19కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.20మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు.

21గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.22వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7,500 మంది ఉన్నారు.23గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి.

24గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి.25గెర్షోను వంశం వారు సన్నిధి గుడారంలో మందిరానికీ, పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికీ, పైకప్పుకీ, సన్నిధి గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉండే తెరలకీ బాధ్యత వహించాలి.26మందిరమూ, బలిపీఠమూ ఉండే ఆవరణ అడ్డతెరలకూ, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకూ వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారం లోని తాళ్లకీ దానిలో ఉన్న సమస్తానికీ వారు బాధ్యత వహించాలి.

27కహాతు నుండి అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు28వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8,600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి.29కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.

30కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.31వీరు మందసం, బల్ల, దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధస్థలం తెర ఇంకా పరిశుద్ధస్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి.32లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి.

33మెరారి నుండి రెండు తెగలు కలిగాయి. అవి మహలీయులు, మూషీయులు. ఇవి మెరారి తెగలు.34వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6,200 మంది ఉన్నారు.35మెరారీ తెగలకు అబీహాయిలు కొడుకు సూరీయేలు నాయకత్వం వహించాలి. వారు మందిరానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.

36మెరారి వంశస్తులు మందిరపు పలకలకూ, దాని అడ్డకర్రలకూ, దాని స్తంభాలకూ, దాని మూలాలకూ, దాని స్థిర సామగ్రికీ, ఇంకా దానికి సంబంధిన వాటన్నిటికీ,37అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి.

38మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.39యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు.

40తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు<<ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.41నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.>>

42యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.43ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22,273 అయింది.

44తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు.45<<ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22,273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను.

46ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.47పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.48ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.>>

49కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు.50ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1,365 తులాలు సేకరించాడు.51మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.

Chapter 4

కహాతు వంశస్తులు

1యెహోవా మోషే అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.2<<లేవీ గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్తుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి.3వారిలో ముప్ఫై ఏళ్ల వయస్సు నుండి యాభై ఏళ్ల వరకూ ఉన్న వారిని లెక్క పెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవలో చేరాలి.4సన్నిధి గుడారంలో నా కోసం జరగాల్సిన అతి పరిశుద్ధమైన పరిచర్యలకు కహాతు వంశస్తులు బాధ్యత తీసుకోవాలి.

5ప్రజలు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అహరోనూ, అతని కుమారులూ గుడారంలోకి వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలానికీ అతి పరిశుద్ధ స్థలానికీ మధ్యలో ఉన్న అడ్డ తెరలను దించాలి. ఆ తెరలతో నిబంధన శాసనాలున్న మందసం పెట్టెను కప్పాలి.6దానిపైన 1 డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. ఇంకా దానిపైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని మోసుకు వెళ్ళడానికి పెట్టెకు ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి.

7సన్నిధి బల్ల పైన నీలం రంగు బట్టను పరచి దాని పైన గిన్నెలను, గరిటెలను, పాత్రలను, నీళ్ళు పోయడానికి కలశాలను ఉంచాలి. దాని పైన రొట్టె ప్రతినిత్యం ఉండాలి.8దాని పైన ఎర్రటి బట్టను పరచాలి. తిరిగి దాని పైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి.

9తరువాత వారు నీలం రంగు బట్టను తీసుకుని దానితో ఏడు దీపాల స్తంభాన్నీ, దాని దీపాలను, కత్తెరనూ కత్తెర పళ్ళాలను, దీపాల్లో పోసే నూనె పాత్రలనూ కప్పాలి.10ఏడు దీపాల స్తంభాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి.11తరువాత బంగారు బలిపీఠం పైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి.

12తరువాత పరిశుద్ధ స్థలంలో సేవకు ఉపయోగించే పరికరాలన్నిటి పైనా నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి.13బలిపీఠం పైన బూడిదను తీసివేసి దానిపై ఊదా రంగు బట్ట పరచాలి.14బలిపీఠం దగ్గర సేవకై ఉపయోగించే పరికరాలన్నిటినీ మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రలపైన ఉంచాలి. ఈ పరికరాలేవంటే నిప్పు తెచ్చే పాత్రలూ, ముళ్ళ గరిటెలూ, పారలూ, గిన్నెలూ. బలిపీఠాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి.

15అహరోనూ అతని కొడుకులూ పరిశుద్ధ స్థలాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ సంపూర్ణంగా కప్పిన తరువాత ప్రజలు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కహాతు వంశస్తులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. అయితే వారు పరిశుద్ధ పరికరాలను ముట్టుకుంటే చనిపోతారు. సన్నిధి గుడారంలోని పరికరాలను మోసుకు వెళ్ళడం కహతు వంశస్తుల బాధ్యత.16యాజకుడు అహరోను కొడుకు ఎలియాజరు దీపాల్లో నూనె ఉందో లేదో చూసుకోవాలి. అలాగే అతడు పర్యవేక్షించాల్సిన బాధ్యతలు, పరిమళ సాంబ్రాణి, నైవేద్యం, అభిషేకానికి వాడే నూనె, మొత్తం మందిరం, దానిలోనివన్నీ, పరిశుద్ధ పరికరాలు, వస్తువులు- వీటన్నిటికీ అతడు బాధ్యత వహించాలి.>>

17తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.18<<మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు.19వారు పరిశుద్ధమైన వాటిని సమీపించి చావకుండా వారిని పరిరక్షించండి.20వారు పరిశుద్ధ స్థలంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్తే వారు చనిపోతారు. అహరోనూ, అతని కొడుకులూ లోపలికి వెళ్ళాలి. ఆ తరువాత కహాతు వారిలో ఒక్కొక్కరికీ వారు చేయాల్సిన పనినీ, వారి ప్రత్యేక విధులను అప్పగించాలి.>>
గెర్షోను వంశస్తులు

21తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.22<<గెర్షోను వంశస్తులను కూడా వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి.23వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి.

24గెర్షోను తెగల వారు చేయాల్సిన సేవలూ, వారు మోయాల్సిన బరువులూ ఇవి.25వారు సన్నిధి గుడారాన్నీ, మందిరం తెరలను, దాని పైకప్పునూ దాని పైన కప్పి ఉన్న గండుచేప చర్మాన్నీ, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర ఉన్న తెరలనూ మోసుకు వెళ్ళాలి.26మందిరానికీ, బలిపీఠానికీ సమీపంగా ఉండే ఆవరణలోని తెరలను, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలను వాటి తాళ్లనూ, వాటి సేవకి సంబంధించిన పరికరాలన్నిటినీ వారు మోసుకు వెళ్ళాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ వారు చేయాలి.

27గెర్షోను తెగల ప్రజలు చేయాల్సిన సేవల విషయంలో, వారు మోయాల్సిన బరువుల విషయంలో వారిని అహరోనూ అతడి కొడుకులూ నిర్దేశించాలి. వారి బాధ్యతలను వాళ్లకు మీరు అప్పగించాలి.28సన్నిధి గుడారం దగ్గర గెర్షోను తెగల ప్రజలు జరిగించాల్సిన సేవ ఇది. యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతి కింద వారు తమ సేవ జరిగించాలి.
మెరారి వంశస్తులు

29మెరారి వంశస్తులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి.30వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి.

31సన్నిధి గుడారంలో వారు తమ బాధ్యతగా జరిగించాల్సిన సేవలు ఇవి. వారు మందిరం చట్రాన్నీ, దాని అడ్డ కర్రలను, స్తంభాలను, దాని దిమ్మలను చూసుకోవాలి.32వీటితో పాటు మందిరం చుట్టూ ఉన్న ఆవరణలోని స్తంభాలను, వాటి దిమ్మలను, మేకులను, వాటి తాళ్లనూ, వాటికి సంబంధించిన సామగ్రినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మోసుకు వెళ్ళాల్సిన బరువులను పేర్ల వరుసలో రాసి ఉంచాలి.

33మెరారి తెగల ప్రజలు సన్నిధి గుడారంలో యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతికింద చేయాల్సిన సేవ ఇది.>>
లేవీ గోత్రంలోని మూడుతెగల వారిని లెక్కించుట

34అప్పుడు మోషే, అహరోనూ, సమాజంలోని నాయకులూ కహాతు తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.35వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు.36వారి తెగల ప్రకారం 2 750 మంది మగ వారిని లెక్క పెట్టారు.

37కహాతు తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.

38గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.39వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారందర్నీ లెక్క పెట్టారు.40వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 2,630 మంది పురుషులను లెక్కపెట్టారు.

41గెర్షోను తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.

42మెరారి తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.43వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు.44వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 3 200 మంది పురుషులను లెక్కపెట్టారు.

45మెరారి తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.

46ఈ విధంగా మోషే, అహరోనూ, ఇశ్రాయేలు ప్రజల నాయకులూ లేవీ గోత్రం వారిందర్నీ వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.47వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, మందిరంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ, సన్నిధి గుడారంలో బరువులు మోసే వారిని లెక్కించారు.48అలా మొత్తం 8,580 మంది మగ వారిని లెక్క పెట్టారు.

49యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే వారిని లెక్కించాడు. వారిలో ప్రతి ఒక్కడూ తాను చేసే సేవల ప్రకారం, మోసే బరువుల ప్రకారం నమోదయ్యారు. ఈ విధంగా మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు విధేయత చూపారు.


1 4:6 నిర్గమ 25:5

Chapter 5

శిబిరంలో ఆదేశాలు

1తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు.2<<ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి.3వారు ఆడవారైనా మగవారైనా శిబిరం నుండి బయటకు పంపించి వేయాలి. వారు శిబిరాన్ని కలుషితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను శిబిరంలో వారి మధ్య నివసిస్తున్నాను.>>4ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అలాంటి వారిని శిబిరం బయటకు వెళ్ళగొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విధేయత చూపారు.

పాపాలకు పరిహారం

5యెహోవా మరోసారి మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు.6పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.7అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.

8ఆ అపరాధ చెల్లింపుని తీసుకోడానికి ఆ వ్యక్తికి దగ్గర బంధువు ఎవరూ లేకుంటే అతడు ఆ సొమ్మును యాజకుడి ద్వారా నాకు చెల్లించాలి. దాంతోపాటు ఒక పొట్టేలును తన పరిహారం కోసం అర్పించాలి. ఆ సొమ్ముతో పాటు పొట్టేలు కూడా యాజకునిదవుతుంది.9ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది.10ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.>>
ద్రోహం చేసిన భార్యకు పరీక్ష

11యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.12<<ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు. ఎవరైనా ఒకడి భార్య దారి తప్పి అతడికి ద్రోహం చేసినప్పుడు,
13అంటే వేరే వ్యక్తి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఆమె అపవిత్రం అయినట్టే. ఆ విషయాన్ని ఆమె భర్త చూడకపోయినా, అతనికి తెలియక పోయినా, ఆ కార్యం చేస్తుండగా ఎవరూ పట్టుకోకపోయినా, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె పట్టుబడదు.14కానీ ఆ భర్త మనస్సులో రోషం పుట్టి తన భార్య అపవిత్రమైన సంగతి గ్రహిస్తే, లేదా ఆమె అపవిత్రం కాకపోయినా అలాంటిదే అనుమానం అతని మనస్సులో కలిగితే అతడు చేయాల్సింది ఇది.>>

15అలాంటి విషయంలో ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఆమెతో పాటు తూమెడు యవల పిండిలో పదో వంతు కూడా తీసుకు రావాలి. దానిమీద నూనె పోయకూడదు. సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోషాన్ని సూచించే నైవేద్యం. పాపాన్ని సూచించడానికి చేస్తున్న నైవేద్యం.

16యాజకుడు ఆమెను యెహోవా సమక్షానికి తీసుకురావాలి.17తరువాత యాజకుడు మట్టికుండలో పవిత్రజలం తీసుకోవాలి. మందిరం నేలపైనుండి కొంత ధూళి తీసుకుని ఆ నీళ్ళలో కలపాలి.

18తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో ఆ స్త్రీని నిలబెట్టాలి. ఆ స్త్రీ తలపై ముసుగుని తీసి ఆమె జుట్టు జడలు విప్పాలి. రోషం కారణంగా చేసిన నైవేద్యాన్ని అంటే పాపానికి సూచనగా ఉన్న నైవేద్యాన్ని యాజకుడు ఆమె చేతుల్లో ఉంచాలి. ఇది రోషం కారణంగా చేసిన నైవేద్యం. ఆ సమయంలో శాపాన్ని కలిగించే చేదు నీళ్ళు యాజకుడి చేతిలో ఉండాలి.19అప్పుడు యాజకుడు ఆ స్త్రీతో ఒట్టు పెట్టించి ఇలా చెప్పాలి. <<ఏ పురుషుడూ నీతో లైంగికంగా కలవక పొతే, నువ్వు దారి తప్పి అపవిత్ర కార్యం చేయకపోతే శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళు నీపై ప్రభావం చూపించవు.

20కానీ భర్త ఆధీనంలో ఉన్న నువ్వు దారి తప్పి ఉంటే, అపవిత్రురాలివైతే, వేరే వ్యక్తి నీతో సంబంధం పెట్టుకుంటే>>21ఇక్కడ యాజకుడు ఆమె పైకి శాపం వచ్చేట్లు ఆమెతో ఒట్టు పెట్టించాలి. తరువాత తన మాటలు కొనసాగించాలి. <<యెహోవా నీ ప్రజల్లో అందరికీ తెలిసేలా నిన్ను శాపానికి గురిచేస్తాడు గాక. నీ తొడలు బలహీనమై నీ కడుపు ఉబ్బిపోతుంది.22శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి వెళ్లి 1 నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేసి నీ తొడలను బలహీనం చేస్తాయి.>> యాజకుడు ఇలా చెప్పిన తరువాత ఆ స్త్రీ <<నేను దోషినైతే అలాగే జరగాలి>> అని చెప్పాలి.

23యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.

24తరువాత యాజకుడు శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళని ఆమెతో తాగించాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలో చేదును పుట్టిస్తాయి.25తరువాత యాజకుడు రోషం కారణంగా అర్పించిన నైవేద్యాన్ని ఆమె చేతిలోనుండి తీసుకుని యెహోవా సమక్షంలో పైకి ఎత్తి, ఊపి దాన్ని బలిపీఠం దగ్గరకి తీసుకురావాలి.26తరువాత యాజకుడు ఆ నైవేద్యంలో నుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.

27యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది.28ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.

29అనుమానం గురించిన చట్టం ఇది. భర్త ఆధీనంలో ఉన్న ఏ స్త్రీ అయినా దారి తప్పి అపవిత్రురాలైనప్పుడు పాటించాల్సిన చట్టం ఇది.30ఒకవేళ భర్తకు తన భార్యపై అనుమానం కలిగినా ఇదే చట్టం పాటించాలి. 2 అతడు ఆమెను యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. ఈ అనుమానం గురించిన చట్టం వివరించిన వాటన్నిటినీ యాజకుడు ఆమె విషయంలో జరిగించాలి.

31అప్పుడు ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరకి తీసుకు వచ్చిన నేరం నుండి విముక్తుడవుతాడు. ఆ స్త్రీ ఏదన్నా అపరాధం చేస్తే ఆ శిక్ష భరించాలి.


1 5:22 నీవు ఎన్నటికీ పిల్లలను కనలేవు.
2 5:30 యాజకుడు కూడా కావచ్చు.

Chapter 6

నాజీరు వారు

1తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.2<<ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని 1 నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు.3ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు.4నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.

5అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.

6అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు.7తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు.8అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.

9ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.

10ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.11అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.

12తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.

13నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి.14అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి.15అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.

16అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి.17పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.

18అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.

19అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి.20తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.

21మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.>>
యాజకుడు ప్రజలను దీవించే విధానం

22యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.23<<అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.

24యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!

25యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!

26యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!

27ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.>>


1 6:2 యెహోవా పని కోసం ప్రత్యేకించబడిన.

Chapter 7

దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన అర్పణలు

1మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.2ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల నాయకులు, తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు బలులు అర్పించారు. వీరు తమ తమ గోత్రాల ప్రజలను నడిపిస్తున్నవారు. జనాభా లెక్కలను పర్యవేక్షించింది వీరే.3వీరు తమ అర్పణలను యెహోవా సమక్షంలోకి తీసుకు వచ్చారు. వీరు ఆరు గూడు బళ్ళూ, పన్నెండు ఎద్దులను తీసుకు వచ్చారు. ఇద్దరు నాయకులకు ఒక బండినీ, ఒక్కొక్కరికీ ఒక ఎద్దునీ తీసుకు వచ్చారు. వీటిని మందిరం ఎదుటికి వారు తీసుకు వచ్చారు.

4అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.5<<వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.>>

6మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు.7వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు.8యాజకుడు అహరోను కొడుకు ఈతామారు పర్యవేక్షణ లో పనిచేసే మెరారి వంశస్తులకి వారు చేసే సేవను బట్టి నాలుగు బళ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు.

9అయితే కహాతు వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వారి సేవ అంతా మందిరంలోని సామగ్రికీ వస్తువులకీ సంబంధించింది. వాటిని వారు తమ భుజాలపై మోసుకు వెళ్ళాలి. కాబట్టి వారికి బళ్ళు ఇవ్వలేదు.

10మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.11యెహోవా మోషేకి <<బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు>> అని ఆదేశించాడు.

12మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.13అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.14వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు.

15ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.16పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు.17రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం.

18రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.19అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన సన్నని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.

20అతడింకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను ఇచ్చాడు.21దహన బలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.22పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.23అలాగే అతడు శాంతిబలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది సూయారు కొడుకు నెతనేలు తెచ్చిన అర్పణం.

24మూడో రోజు జెబూలూను వంశస్తులకు నాయకుడూ హేలోను కొడుకూ అయిన ఏలీయాబు తన అర్పణ తీసుకు వచ్చాడు.25అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.26ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

27ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు.28పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.29శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం.

30నాలుగో రోజు రూబేను వంశస్తుల నాయకుడూ, షెదేయూరు కొడుకూ అయిన ఏలీసూరు తన అర్పణ తీసుకు వచ్చాడు.31అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.32ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

33అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు.34పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు.35ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం.

36ఐదో రోజు షిమ్యోను వంశస్తుల నాయకుడూ, సూరీషదాయి కొడుకూ అయిన షెలుమీయేలు తన అర్పణం తీసుకు వచ్చాడు.37అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెను, 70 తులాల బరువున్న వెండి పాత్రను, సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.38ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

39ఇతడు దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రె పిల్లనూ తీసుకువచ్చాడు.40ఒక మేకపోతును పాపం కోసం చేసే బలిగా ఇచ్చాడు.41ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది సూరీషదాయి కొడుకు షెలుమీయేలు అర్పణం.

42ఆరో రోజు గాదు వంశస్తులకు నాయకుడూ, దెయూవేలు కొడుకు ఎలీయాసాపా తన అర్పణ తీసుకువచ్చాడు.43అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.44ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

45అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.46పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.47ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం.

48ఏడో రోజు ఎఫ్రాయిము వంశస్తులకు నాయకుడూ, అమీహూదు కొడుకూ అయిన ఎలీషామా తన అర్పణ తీసుకువచ్చాడు.49అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.50ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

51అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.52పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.53ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణం.

54ఎనిమిదో రోజు మనష్శే వంశస్తుల నాయకుడూ, పెదాసూరు కొడుకూ అయిన గమలీయేలు తన అర్పణ తీసుకువచ్చాడు.55అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.56ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్ర ఒకదాన్ని తీసుకువచ్చాడు.

57అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.58పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.59ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది పెదాసూరు కొడుకు గమలీయేలు అర్పణం.

60తొమ్మిదో రోజు బెన్యామీను వంశస్తులకి నాయకుడూ, గిద్యోనీ కొడుకూ అయిన అబీదాను తన అర్పణ తీసుకు వచ్చాడు.61అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.62ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

63అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.64పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.65ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.

66పదో రోజు దాను వంశస్తులకి నాయకుడూ, అమీషదాయి కొడుకూ అయిన అహీయెజెరు తన అర్పణ తీసుకు వచ్చాడు.67అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.68ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

69అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.70పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.71ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం.

72పదకొండో రోజు ఆషేరు వంశస్తుల నాయకుడూ, ఒక్రాను కొడుకూ అయిన పగీయేలు తన అర్పణ తీసుకు వచ్చాడు.73అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.74ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.

75అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.76పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.77ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఒక్రాను కొడుకు పగీయేలు అర్పణం.

78పన్నెండో రోజు నఫ్తాలీ వంశస్తులకి నాయకుడూ, ఏనాను కొడుకూ అయిన అహీరా.79అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.80ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.

81అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.82పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.83ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఏనాను కొడుకు అహీరా అర్పణం. బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణలు ఇవి. వెండి గిన్నెలు పన్నెండు, వెండి ప్రోక్షణపాత్రలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు, ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫై తులాల బరువు ఉంది.

84మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.85ప్రతి వెండి గిన్నే 130 తులాలు, ప్రతి పాత్రా 70 తులాల బరువైనవి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం మొత్తం వెండి పాత్రలన్నీ 2,400 తులాల బరువు ఉన్నాయి.86సాంబ్రాణితో నిండిన బంగారు పాత్రలు పన్నెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం ఒక్కొక్కటి పది తులాల బరువుంది. మొత్తం బంగారం 120 తులాలుంది.

87దహనబలి కింద వారు పన్నెండు ఎద్దులను, పన్నెండు పొట్టేళ్లనూ ఒక సంవత్సరం వయసున్న పన్నెండు మగ గొర్రెలను ప్రతిష్టించారు. తమ నైవేద్య అర్పణ అర్పించారు. పాపం కోసం బలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. పశువులన్నీ పన్నెండు కోడెలు, పొట్టేళ్లు పన్నెండు, ఏడాది గొర్రెపిల్లలు పన్నెండు, వాటి నైవేద్యాలు పాపపరిహారం కోసం మగ మేక పిల్లలు పన్నెండు, సమాధానబలి పశువులు ఇరవై నాలుగు కోడెలు,88వారి పశువులన్నిటిలో నుండి 24 ఎద్దులను, 60 పొట్టేళ్లనూ 60 మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న 60 మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా అర్పించారు.

89యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.

Chapter 8

దీపాల స్తంభాని అహరోను వెలిగించుట

1తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.2<<నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.>>

3అహరోను అలాగే చేశాడు. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టే దీపాల కాంతి ఆ ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా వాటిని వెలిగించాడు.4దాని అడుగు నుండి పైన పువ్వుల వరకూ ఆ దీప స్తంభాన్ని సాగగొట్టిన బంగారంతో చేశారు. దాన్ని ఎలా చేయాలో యెహోవా మోషేకి చూపించాడు.
లేవీ గోత్రం వారిని వేరు చేయుట

5యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.6<<ఇశ్రాయేలు ప్రజల్లోనుండి లేవీ వారిని వేరు చెయ్యి. తరువాత వారిని పవిత్రం చెయ్యి.

7వారిని పవిత్రం చేయడానికి ఇలా చెయ్యి. పరిహారం కోసం వారిపై పవిత్రజలాన్ని చిలకరించు. వారిల్లో ప్రతి ఒక్కడూ మంగలి కత్తితో తన శరీరం పై ఉన్న జుట్టు అంతటినీ నున్నగా కత్తిరించుకుని, తన బట్టలు ఉతుక్కుని, తనను పవిత్రం చేసుకోవాలి.8తరువాత వారు ఒక కోడెదూడను, దాని నైవేద్య అర్పణగా నూనె కలిపిన సన్నని గోదుమ పిండినీ తీసుకు రావాలి. పాపాల కోసం చేసే బలిగా మరో కోడెని తీసుకు రావాలి.

9తరువాత నువ్వు వారిని సన్నిధి గుడారం ఎదుటకి తీసుకు రావాలి. ఇశ్రాయేలు సమాజాన్నంతా సమావేశ పరచాలి.10లేవీ వారిని యెహోవా నైన నా ఎదుట నిలబెట్టు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారిపైన తమ చేతులుంచాలి.11లేవీ వారిని అహరోను నా ఎదుట సమర్పించాలి. ఇశ్రాయేలు ప్రజల తరపున వారిని కదలిక అర్పణగా నా ఎదుట కదిలించాలి. లేవీ వారు నాకు సేవ చేయడానికి అతడు ఈ విధంగా చేయాలి.

12లేవీ వారు ఆ కోడెదూడల తలలపై తమ చేతులుంచాలి. లేవీ వారి కోసం పరిహారం చేయడానికి పాపం కోసం అర్పణగా ఒక ఎద్దునూ దహనబలిగా మరొక ఎద్దునూ నువ్వు నాకు అర్పించాలి.13వారిని అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా హాజరు పరచి నాకు కదలిక అర్పణగా నా ఎదుట నిలబెట్టాలి.

14ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజల నుండి లేవీ వారిని వేరు చేయాలి. లేవీ వంశం వారు నాకు చెందిన వారుగా ఉంటారు.15ఇదంతా అయ్యాక లేవీ వారు సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళాలి. నువ్వు వారిని పవిత్ర పరచాలి. వారిని నాకు కదలిక అర్పణ గా నా ఎదుట వారిని ఎత్తి పట్టుకోవాలి.

16ఇలా తప్పకుండా చెయ్యి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లోనుండి వీరు సంపూర్ణంగా నా వారు. ఇశ్రాయేలు సంతానంలో గర్భం నుండి బయటకు వచ్చే ప్రతి మొదటి మగ పసికందు స్థానాన్ని వీరు తీసుకుంటారు. లేవీ వారిని నేను తీసుకున్నాను.17ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి మొదటి సంతానం నాదే. ఇది మనుషులకీ, పశువులకీ వర్తిస్తుంది. ఈజిప్టులో మొదటి సంతానాన్ని నేను సంహరించినప్పుడు వీరిని నాకోసం ప్రత్యేకించుకున్నాను.

18మొదటి సంతానానికి బదులుగా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేవీ వారిని తీసుకున్నాను.19వారిని అహరోనుకీ అతని కొడుకులకీ ఒక బహుమానంగా ఇచ్చాను. సన్నిధి గుడారంలో ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడానికి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు వాళ్లకి ఎలాంటి తెగులు హాని చేయకుండా వారి కోసం పరిహారం చేయడానికి నేను వీరిని నియమించాను.>>

20అప్పుడు మోషే, అహరోనూ, ఇశ్రాయేలు సమాజమంతా అలాగే చేశారు. లేవీ వారి విషయంలో యెహోవా మోషేకి ఆదేశించింది అంతా అమలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు లేవీ వాళ్లకి ఇదంతా చేశారు.21లేవీ వారు తమ బట్టలు ఉతుక్కుని పవిత్రం అయ్యారు. వారిని పవిత్రం చేయడానికి అహరోను వారిని యెహోవా ఎదుట సమర్పించి వారి కోసం పరిహారం చేశాడు.

22తరువాత లేవీ వారు అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా సన్నిధి గుడారంలో తమ సేవ చేయడానికి వెళ్ళారు. లేవీ వారిని గురించి యెహోవా మోషేకి ఆదేశించిన దాని ప్రకారం ఇది జరిగింది. లేవీ వాళ్లకందరికీ ఇలాగే జరిగించారు.

23యెహోవా తిరిగి మోషేతో మాట్లాడాడు.24<<ఇరవై ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న లేవీ వాళ్లందరికీ ఇలాగే చేయాలి. వారు సన్నిధి గుడారంలో సేవ చేయడం కోసం చేరాలి.

25అయితే వాళ్లకి యాభై ఏళ్ళు వచ్చాక ఈ విధంగా చేసే సేవ నుండి విరమించాలి. వారు అక్కడితో ఆగిపోవాలి.26సన్నిధి గుడారంలో పని చేసే తమ సోదరులకు వారు సహాయం చేయవచ్చు గానీ సేవ నుండి మానుకోవాలి. ఈ విషయాలన్నిటిలో నువ్వు వాళ్లకి మార్గ దర్శనం చేయాలి.>>

Chapter 9

పస్కా పండుగ

1యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు.2<<ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి.3దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.>>

4కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు.5దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు.

6కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు.7ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి <<మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?>> అని అడిగారు.8దానికి మోషే <<కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.>> అని జవాబిచ్చాడు.

9అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.10<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. <మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.>

11వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి.12మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.

13అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే.14మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.>>
మందిరం పైగా మేఘం కనిపించుట

15మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.16అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది.17గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.

18యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు.19ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.

20కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు.21కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.

22ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు.23యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.

Chapter 10

వెండి బాకాలు

1యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.2<<రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.

3సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.4యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.5మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.

6మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.7సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.8యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.

9మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.

10మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.>>
ఇశ్రాయేలు ప్రజలు సీనాయిని వదిలిపెట్టడం

11రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.12కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.13యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు.

14యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.15ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.16జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.

17గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.18తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.19షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.20గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు.

21కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.22ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.23మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.24బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.

25చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.26ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు.27నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు.28ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి.

29మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో <<యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు>> అని చెప్పాడు.30దానికి అతడు <<నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను>> అన్నాడు.

31అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. <<నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి.32నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.>>

33వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది.34వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.

35నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే <<యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు>> అనేవాడు.36నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే <<యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా>> అనేవాడు.

Chapter 11

యెహోవా దగ్గర నుండి అగ్ని

1ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది.2అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి.3యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి <<1 తబేరా>> అనే పేరు వచ్చింది.

యెహోవా దగ్గర నుండి పూరేడు పిట్టలు

4కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ <<తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?5ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.6ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు>> అని చెప్పుకున్నారు.

7ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది.8ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.

9రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.10ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.

11అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. <<నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.12ఈ జనాన్నంతా నేను కన్నానా? <తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో> అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?

13ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. <మేము తినడానికి మాంసం ఇవ్వు> అంటున్నారు.14ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.15నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.>>

16అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.17అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.

18నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. <మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది> అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.19ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.20ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. <ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?> అన్నారు.>>

21దానికి మోషే <<నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో <ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను> అంటున్నావు.22ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?>> అన్నాడు.23అప్పుడు యెహోవా మోషేతో <<నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు>> అన్నాడు.

24మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.25అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.

26ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.27అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి <<ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు>> అని చెప్పాడు.

28మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ <<మోషే, నా యజమానీ, వారిని ఆపు>>అన్నాడు.29దానికి మోషే <<నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక>> అని అతనితో చెప్పాడు.30అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.

31అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.32కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.

33ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.34మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి <<2 కిబ్రోతు హత్తావా>> అనే పేరు కలిగింది.35ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.


1 11:3 తగలబడిపోవడం.
2 11:34 అత్యాశ స్మశానం.

Chapter 12

మోషేకి వ్యతిరేకంగా మిర్యాము, అహరోను

1మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు.2<<యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?>> అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు.3మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు.

4వెంటనే యెహోవా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. <<మీరు ముగ్గురూ ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకి రండి>> అన్నాడు. ఆ ముగ్గురూ అక్కడికి వెళ్ళారు.5అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చాడు. గుడారం ద్వారం దగ్గర నుండి అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళారు.

6యెహోవా ఇలా అన్నాడు.

<<మీరు ఇప్పుడు నా మాటలు వినండి.

మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను.

కలల ద్వారా అతనితో మాట్లాడతాను.

7నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు.

అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.

8నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను.

ముఖాముఖీగా మాట్లాడతాను.

అతడు నా స్వరూపాన్ని చూస్తాడు.

అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?>>

9యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు.10గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు.

11అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. <<అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం.12తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.>>

13కాబట్టి మోషే యెహోవాకు మొర పెట్టాడు. <<దేవా, దయచేసి ఈమెను బాగు చెయ్యి>> అని ప్రార్ధించాడు.14అప్పుడు యెహోవా మోషేతో <<ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మి వేస్తే ఆ అవమానం ఆమె ఏడు రోజులు భరిస్తుంది కదా. ఆ ఏడు రోజులూ ఆమెని శిబిరం బయట ప్రత్యేకంగా ఉంచు. ఆ తరువాత ఆమెని తిరిగి శిబిరంలోకి తీసుకు రా>> అన్నాడు.15కాబట్టి మిర్యాము ఏడు రోజులు శిబిరం బయటే గడిపింది. మిర్యాము తిరిగి శిబిరంలోకి వచ్చే వరకూ ప్రయాణం చేయకుండా ప్రజలు నిలిచిపోయారు.

16ఆ తరువాత ప్రజలు హజేరోతు నుండి ప్రయాణం చేసి పారాను అరణ్యంలో ఆగారు.

Chapter 13

కనాను దేశాన్ని పరీక్షించడానికి

1ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.2నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.

3మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు.4వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ,

5షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,6యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,7ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.8ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ,

9బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,10జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,11యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,12దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,

13ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,14నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,15గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.16ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.

17వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. <<మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.18ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి.19వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?20అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.>> అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.

21కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.22వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.

23వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.24ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి <<1 ఎష్కోలు లోయ>> అనే పేరు పెట్టారు.
పరీక్షించిన కనాను దేశం నుంచి సమాచారం

25వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు.26పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.

27వారు మోషేకి ఇలా చెప్పారు. <<నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.28కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.29దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.>>

30అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. <<మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది>> అన్నాడు.31కాని అతనితో వెళ్ళిన మిగతా వారు <<అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.>> అన్నారు.

32ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. <<మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.33అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం>> అన్నారు.


1 13:24 గుత్తి, గెల

Chapter 14

ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు

1ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు.2ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు.3ఆ సమాజమంతా వారితో <<ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?>> అన్నారు.

4వారు <<మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి>> అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.5అప్పుడు మోషే, అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు.

6అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని,7ఇశ్రాయేలీయుల సర్వజన సమూహంతో మాట్లాడుతూ <<మేము సంచారం చేసి పరిశీలించి చూసిన ప్రదేశం ఎంతో మంచి ప్రదేశం.8యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.

9కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు>> అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.10అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది.

11యెహోవా మోషేతో <<ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?12నేను వారి మీద తెగులుపంపిస్తాను. వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను>> అన్నాడు.

13మోషే యెహోవాతో <<అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.14యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.

15కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు16<ప్రమాణ పూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారినిచేర్చడానికి శక్తిలేక, యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు> అని చెప్పుకుంటారు.
17<యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు.18దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు> అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక.19ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు>> అన్నాడు.
20యెహోవా <<నీ కోరిక ప్రకారం నేను క్షమించాను.21కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు,22ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు.
23కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు.24నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను.25అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి>> అన్నాడు.

26ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ,27<<నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.

28నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను.29మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు.30యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.

31కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు.32మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి.33మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి.

34మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి.35నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు>> అన్నాడు.

36మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు,37అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు.38అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు.

39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు.40వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి <<మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం>> అన్నారు.
41కాని మోషే <<మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు?42దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు.43ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు>> అని చెప్పాడు.

44కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు.45అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.

Chapter 15

వివిధ అర్పణలకు నియామాలు

1తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ,2<<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, <యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు,3యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి.

4యెహోవాకు ఆ అర్పణ అర్పించే వాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి.5ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి.
6పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి7ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.

8మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే,9దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి.10ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి.

11లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి.12మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి.13దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి.

14మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి.15సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి.16మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి> >> అన్నాడు.

17యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ <<ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు,18నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత19మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.

20మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి.21మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి>> అన్నాడు.
పొరపాటున చేసిన పాపాలకు అర్పణలు

22<<యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే23యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,24సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.

25యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.26అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.

27ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి.28పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు.29ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.

30కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,31అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు>> అన్నాడు.
విశ్రాంతి దినాన పని చేసిన వారికి శిక్ష

32ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు.33అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు.34అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.

35తరువాత యెహోవా మోషేతో <<ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.36సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి>> అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.
బట్టలు కుచ్చులు

37ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ,38<<నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి.39మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.

40మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి.41నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.>>

Chapter 16

కోరహు, దాతాను, అబీరాము

1లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి2ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి3మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. <<మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?>> అన్నారు.

4మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,5<<ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.

6కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.7అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు>>అన్నాడు.

8ఇంకా మోషే కోరహుతో <<లేవీ కొడుకులారా వినండి,9తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?10ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.11దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు>> అన్నాడు.

12మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.13కాని వారు <<మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని 1 పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?14అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము>> అన్నారు.

15అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ<<నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు>> అన్నాడు.16అప్పుడు మోషే కోరహుతో<<నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.17మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి>> అని చెప్పాడు.

18కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.19కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.

20అప్పుడు యెహోవా <<మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.21తక్షణమే నేను వారిని కాల్చేస్తాను>> అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,22వారు సాగిలపడి<<దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?>> అని యెహోవాను వేడుకున్నారు.

23అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,24<<సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి>> అన్నాడు.
25అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.26అతడు <<ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి>> అని ఆ సమాజంతో అన్నాడు.27కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.

28అప్పుడు మోషే <<ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.29మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.30కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది>> అన్నాడు.

31మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.32భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.

33వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు.34వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని <<భూమి మనలను కూడా మింగేస్తుందేమో>> అనుకుంటూ పారిపోయారు.35అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.

36అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.37ఆ నిప్పుని దూరంగా చల్లు.38పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.>>

39అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,40కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.

41తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ <<మీరు యెహోవా ప్రజలను చంపారు>> అని చెప్పి,42సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.43మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,

44యెహోవా మోషేతో <<మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,45తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను>> అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.46అప్పుడు మోషే <<నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది>> అని అహరోనుతో చెప్పాడు.

47మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.48అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.

49కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14,700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.50ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.


1 16:13 సారవంతమైన

Chapter 17

అహరోను చేతికర్ర చిగిర్చడం

1యెహోవా మోషేతో మాట్లాడుతూ,2<<నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.

3లేవీ చేతికర్ర మీద అహరోను పేరు రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క పితరుల వంశాల నాయకునికి ఒక్క చేతికర్రే ఉండాలి.4నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని 1 నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.5అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో, అతని కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా చేస్తున్న ఫిర్యాదులు నాకు వినిపించకుండా ఆపేస్తాను>> అన్నాడు.

6కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి నాయకులందరూ తమ తమ పితరుల వంశాల్లో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కర్ర ప్రకారం 12 కర్రలు అతనికిచ్చారు. అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్యలో ఉంది.7మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.

8తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది.9మోషే యెహోవా సన్నిధిలోనుంచి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు.

10అప్పుడు యెహోవా మోషేతో <<అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది>> అన్నాడు.11అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు.

12అయితే ఇశ్రాయేలీయులు మోషేతో <<మేము ఇక్కడ చనిపోతాం. మేమందరం నశించిపోతాం!13యెహోవా మందిరాన్ని సమీపించిన ప్రతిఒక్కరూ చనిపోతారు. మేమందరం చావాల్సిందేనా?>> అన్నారు.


1 17:4 నిబంధన మందసం. సంఖ్యా 17:4 చూడండి. నిర్గమ అధ్యా. 31 మొ. చూడండి.

Chapter 18

లేవీవారి, యాజకుల భాధ్యతలు

1యెహోవా అహరోనుతో <<పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వూ, నీ కొడుకులూ, నీ వంశం జవాబుదారులు. నువ్వూ, నీ కొడుకులూ మీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు.2ఇంకా, నీ తండ్రి గోత్రం, అంటే లేవీ వంశస్తులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకు రావాలి. నువ్వూ నీ కొడుకులూ నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు.

3వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు.4వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి.5ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి.

6చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య నుంచి లేవీయులైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను. సన్నిధి గుడారపు సేవ చెయ్యడానికి వారిని యెహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను.7కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి>> అన్నాడు.
లేవీయులు, యాజకుల కోసం అర్పణలు

8ఇంకా యెహోవా అహరోనుతో <<చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది.9అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనివి నీకు చెందుతాయి. వారి నైవేద్యాలన్నిట్లో, వారి పాప పరిహారార్థ బలులన్నిట్లో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిట్లో, వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు, నీ కొడుకులకూ చెందుతాయి. మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి.

10మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు 1 ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి.11ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.

12వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను.13వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.

14ఇశ్రాయేలీయులు ప్రతిష్ట చేసిన ప్రతిదీ నీకు చెందుతుంది.15మనుష్యుల్లోగాని, పశువుల్లోగాని, వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిట్లో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది. అయితే, ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి.16అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాలి. వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల ప్రకారం పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి. అంటే 2 55 గ్రాములు.

17కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది.18అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది.

19ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన>> అన్నాడు.20ఇంకా యెహోవా అహరోనుతో <<ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే.

21చూడు, లేవీయులు చేసే సేవకు, అంటే, సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇశ్రాయేలీయుల పదోవంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను.22ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు. అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు.

23అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి, వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు. మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు.24అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను>> అన్నాడు.

25ఇంకా యెహోవా మోషేతో,26<<నువ్వు లేవీయులతో ఇలా చెప్పు, <నేను ఇశ్రాయేలీయుల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో, అంటే ఆ పదోవంతు భాగంలో పదోవంతు భాగం యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి.27మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి.

28ఆ విధంగా మీరు ఇశ్రాయేలీయుల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు అన్నిట్లోనుంచి మీరు ప్రతిష్ఠార్పణ యెహోవాకు చెల్లించాలి. దానిలోనుంచి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.29మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలోనుంచి యెహోవాకు శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వాలి.>

30ఇంకా నువ్వు వారితో, మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తభాగం అర్పించినప్పుడు, లేవీయులు దాన్ని కళ్ళం నుంచీ, ద్రాక్షగానుగ నుంచీ వచ్చిన ఫలంలా పరిగణించాలి.31మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం.32మీరు పొందిన వాటిలోనుంచి ప్రశస్తమైనవి యెహోవాకు అర్పించి ఉంటే, దాన్ని తిని, తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు. మీరు చనిపోకుండా ఉండాలంటే ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చెయ్యకూడదని చెప్పు>> అన్నాడు.


1 18:10 పరిశుద్ధమైనదిగా ఎంచి తినాలి. దాన్ని పరిశుద్ధ స్థలంలో ఆరగించాలి.
2 18:16 20 గేరాలు.

Chapter 19

అశుద్ధతను తొలగించే నీళ్ళు

1యెహోవా మోషే అహరోనులతో,2<<యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు.

3మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి.4యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.5అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి.6ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.

7అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.8దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.

9ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు.10ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం.

11మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.12అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు.13మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.

14ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.15మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి.16గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.

17అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి.18తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి.19మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు.

20ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు.21ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే - పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం22దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.>>

Chapter 20

బండలోనుంచి నీళ్ళు

1మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు.

2ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.3ప్రజలు మోషేను విమర్శిస్తూ <<మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!
4మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు?5ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు>> అన్నారు.

6అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.

7అప్పుడు యెహోవా మోషేతో,8<<నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి>> అన్నాడు.9యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.

10తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో <<తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?>> అన్నారు.11అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.

12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో <<మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు>> అన్నాడు.13ఈ నీళ్ళ ప్రాంతానికి 1 మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
ఎదోము రాజు ఇశ్రాయేలు వారిని తన సరిహద్దుల్లో గుండా వెళ్ళడానికి అనుమతించక పోవటం

14మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి <<నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.15మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు.16మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.

17మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం>> అని చెప్పించాడు.

18కాని ఎదోము రాజు <<నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను>> అని జవాబిచ్చాడు.19అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో <<మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే>> అన్నారు. అప్పుడు అతడు<<నువ్వు రాకూడదు>> అన్నాడు.

20అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.21ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు.
అహరోను మరణం

22అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు.23యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ,24<<మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు.

25నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,26అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు>> అన్నాడు.

27యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు.28మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.29అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.


1 20:13 జగడం.

Chapter 21

అరాదు నాశనం

1ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు.2ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని <<నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం>> అన్నారు.3యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి <<1 హోర్మా>> అని పేరు.

ఇత్తడి పాము

4ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు.5అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ <<ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం>> అన్నారు.

6అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.7కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి <<మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి>> అన్నారు.

8మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా <<పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు>> అని మోషేకు చెప్పాడు.9కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
మోయాబుకు ప్రయాణం

10తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు.11ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.

12అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు.13అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.

14ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో <<సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు,15మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు>> అని రాసి ఉంది.

16అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో <<ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను>> అన్నాడు.

17అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. <<బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు.18వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.>>

19వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ,20మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.
సీహోను, ఓగుల పరాజయం

21ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపించి <<మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు,22మేము పొలాల్లోకైనా, ద్రాక్షతోటల్లోకైనా వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. మేము నీ సరిహద్దులు దాటే వరకూ రాజమార్గంలోనే నడిచి వెళ్తాం>> అని అతనితో చెప్పించారు.23కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.

24ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో హతం చేసి, అతని దేశం అర్నోను మొదలు యబ్బోకు వరకూ, అంటే అమ్మోనీయుల దేశం వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల సరిహద్దు బలోపేతం అయ్యింది.25ఇశ్రాయేలీయులు ఆ పట్టాణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టాణాలన్నిట్లో, హెష్బోనులో, దాని పల్లెలన్నిట్లో శిబిరం వేసుకున్నారు.26హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.

27కాబట్టి సామెతలు పలికే వారు <<హెష్బోనుకు రండి. సీహోను పట్టణం కట్టాలి, దాన్ని స్థాపించాలి,28హెష్బోను నుంచి అగ్ని బయలువెళ్ళింది, సీహోను పట్టణంనుంచి జ్వాలలు బయలువెళ్ళాయి, అది మోయాబుకు ఆనుకున్న ఆర్ దేశాన్ని కాల్చేసింది, అర్నోను 2 కొండ ప్రదేశాలను కాల్చేసింది.
29మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.30కాని మేము సీహోనును జయించాం. 3 హెష్బోను దీబోను వరకూ నాశనం అయ్యింది. నోఫహు వరకూ దాన్ని పాడు చేశాం. అగ్నితో మేదెబా వరకూ తగల బెట్టాం>> అంటారు.

31కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.32అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలివేశారు.

33వారు తిరిగి బాషాను మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగు, అతని జనమంతా ఎద్రెయీలో యుద్ధం చెయ్యడానికి బయలుదేరారు.34యెహోవా మోషేతో <<అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు>> అన్నాడు.35కాబట్టి వారు అతన్ని, అతని కొడుకులను, ఒక్కడు కూడా మిగలకుండా అతని జనం అంతటినీ హతం చేసి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.


1 21:3 వినాశనం
2 21:28 అధిపతులను.
3 21:30 హెష్బోనునుండి దీబోను వరకు రాళ్ళతో కొట్టి ధ్వంసం చేసాము.

Chapter 22

బాలాకు, బిలాము కోసం కబురంపటం

1తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.

2సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.3ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.4మోయాబీయులు మిద్యాను పెద్దలతో <<ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు>> అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.

5కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. <<చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు.6కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు>> అని అన్నాడు.

7కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.8అతడు వారితో <<ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను>> అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.

9దేవుడు బిలాము దగ్గరికి వచ్చి <<నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?>> అన్నాడు.10బిలాము దేవునితో <<సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి,11<చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో> అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు>> అన్నాడు.

12దేవుడు బిలాముకు జవాబిస్తూ <<నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు>> అన్నాడు.13కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో <<మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు>> అన్నాడు.14కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి <<బిలాము మాతో రావడానికి నిరాకరించాడు>> అని చెప్పారు.

15బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు.16వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో <<సిప్పోరు కొడుకు బాలాకు, <నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు,17ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు> అని చెప్పమన్నాడు>> అన్నారు.

18బిలాము జవాబిస్తూ <<బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను.19కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను>> అన్నాడు.20ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి <<ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి>> అని చెప్పాడు.
బిలాము గాడిద

21ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.22అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.23యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.

24యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.25గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.

26యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,27ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.

28అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది <<నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?>> అని బిలాముతో అంది.29బిలాము <<నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి>> అన్నాడు.30ఆ గాడిద <<ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?>> అని బిలాముతో అంది. బిలాము <<లేదు>> అన్నాడు.

31అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.32యెహోవా దూత <<నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.33ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి>> అని అతనితో అన్నాడు.

34అందుకు బిలాము <<నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను>> అని యెహోవా దూతతో చెప్పాడు.35యెహోవా దూత <<నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు>> అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.

36బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు,37బాలాకు బిలాముతో <<నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?>> అన్నాడు.

38అప్పుడు బిలాము <<చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా>> అని బాలాకుతో చెప్పాడు.39అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్‌ హుజోతుకు వచ్చినప్పుడు40బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.

41బాలాకు ఆ తరువాత రోజు బిలామును 1 బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.


1 22:41 బామోతు బయలు.

Chapter 23

బిలాము మొదటి సందేశం

1అప్పుడు బిలాము బాలాకుతో <<ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి>> అన్నాడు.2బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు.3ఇంకా బిలాము బాలాకుతో <<బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను>> అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు.

4దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో <<నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను>> అని చెప్పాడు.5యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి <<నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు>> అన్నాడు.6అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.

7అప్పుడు బిలాము ప్రవచనరీతిగా,

<<అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి,

<వచ్చి, నాకోసం యాకోబును శపించు> అన్నాడు,

<వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు> అన్నాడు.

8దేవుడు శపించనివారిని నేనెలా శపించను?

దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?

9రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను.

కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను.

చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది.

వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.

10యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు?

ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు?

నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి.

నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి>> అన్నాడు.

11బాలాకు బిలాముతో <<నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు>> అన్నాడు.12బిలాము జవాబిస్తూ <<యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?>> అన్నాడు.
బిలాము రెండవ సందేశం

13అప్పుడు బాలాకు అతనితో <<దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి>> అని చెప్పి14పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.15అప్పుడు బిలాము బాలాకుతో <<నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను>> అన్నాడు.

16యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి <<నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు>> అన్నాడు.17అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు<<యెహోవా ఏం చెప్పాడు?>> అని అడిగాడు.

18బిలాము ప్రవచనంగా <<బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.

19అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.

మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.

ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?

ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

20చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది.

దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.

21ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు.

వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.

22అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.

23యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు.

ఏ శకునం హాని చెయ్యదు.

దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ <దేవుడు ఏం చేశాడో చూడు> అని చెప్పుకోవాలి.

24చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు,

ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది.

చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు>> అని పలికాడు.

25అప్పుడు బాలాకు బిలాముతో <<వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు>> అన్నాడు.26కాని బిలాము <<యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?>> అని బాలాకుకు జవాబిచ్చాడు.
బిలాము మూడవ సందేశం

27బాలాకు బిలాముతో <<నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో>> అన్నాడు.

28బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు.29బిలాము<<ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి>> అని బాలాకుతో చెప్పాడు.30బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.

Chapter 24

1ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు ఇంతకు ముందు లాగా శకునం చూడడానికి వెళ్ళకుండా ఎడారి వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు.

2బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు.3అతడు ఇలా ప్రవచించాడు.

<<బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు.

కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.

4అతడు దేవుని మాటలు మాట్లాడతాడు,

దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు,

ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు.

5యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి.

ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!

6అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా,

యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి.

7అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి.

అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి.

వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు.

వారి రాజ్యం ఘనత పొందుతుంది.

8దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు.

అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది.

అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు.

వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.

9అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు.

అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు?

అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక,

అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక>> అన్నాడు.

10అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో <<నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు.11నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు>> అన్నాడు.

12అందుకు బిలాము బాలాకుతో <<బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను,13యెహోవా ఏం చెప్తాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరికి పంపించిన నీ వర్తమానికులతో నేను చెప్పలేదా?14కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి>> అన్నాడు.
బిలాము నాలుగో సందేశం

15బిలాము ప్రవచనం చెప్పాడు. <<బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు,

కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు.

16ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం.

మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం.

సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం.

ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు.

17నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు.

నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు.

ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది.

రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది.

అతడు మోయాబు 1 నాయకులను పడగొడతాడు.

అతడు 2 షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.

18ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు.

వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు.

బిలాము చివరి సందేశం

19యాకోబు సంతానంలోనుంచి రాజ్యాధికారం వస్తుంది.

అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు>> అన్నాడు.

20ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ,

<<ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం.

కాని దాని అంతం నాశనమే>> అన్నాడు.

21తరువాత బిలాము కేనీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ,

<<నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది.

నీ గూడు బండరాళ్ళల్లో ఉంది.

22కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది>> అన్నాడు.

23అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ <<అయ్యో! దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు?

24కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి.

అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి.

కిత్తీయులు కూడా నాశనమౌతారు>> అన్నాడు.

25అప్పుడు బిలాము లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు కూడా వెళ్ళిపోయాడు.


1 24:17 సరిహద్దులు.
2 24:17 అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని.

Chapter 25

మోయాబులు దగ్గర ఇశ్రాయేలీయుల పాపం

1ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.2ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.3ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.

4అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, 1 పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది>> అని చెప్పాడు.5కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో <<మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి>> అన్నాడు.

6అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.7యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,

8సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.9ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.

10అప్పుడు యెహోవా మోషేతో <<యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,11వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.

12కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.13అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు>> అన్నాడు.

14ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.15ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.

16ఇంకా యెహోవా మోషేతో <<మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.17వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.18పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.>>


1 25:4 యెహోవా ఎదుట, అందరూ చూసేలా.

Chapter 26

రెండోసారి జనాభా లెక్కలు

1ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,2<<మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి>> అన్నాడు.

3కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,4<<20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు>> అన్నారు.

5ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,6పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.7వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43,730 మంది పురుషులు.

8పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.9కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.

10ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.11అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.

12షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,13జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.14ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22,200 మంది పురుషులు.

15గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,16ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,17ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.18వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40,500 మంది పురుషులు.

19యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.20యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,21పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.22వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76,500 మంది పురుషులు.

23ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.24రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,300 మంది పురుషులు.

25జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.27రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60,500 మంది పురుషులు.

28యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.29మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు,

30ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,31అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,32షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.

33హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.34వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52,700 మంది పురుషులు.

35ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు - షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.36షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.37వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32,500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.

38బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,39అహీరామీయులు అహీరాము వంశస్థులు,40షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.41వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,600 మంది పురుషులు.

42దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.43రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,400 మంది పురుషులు.

44ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.45బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.46ఆషేరు కూతురు పేరు శెరహు.47రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53,400 మంది పురుషులు.

48నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,49యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.50వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,400 మంది పురుషులు.

51ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
52యెహోవా మోషేతో <<వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.53తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.

54ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.55చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.56ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.>>

57వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.58లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.59కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.

60అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.61నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.62వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.

63యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.64మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.

65ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.

Chapter 27

సెలోపెహాదు కూతుళ్ళు

1అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.

2వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకుల ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి <<మా తండ్రి ఎడారిలో చనిపోయాడు.3అతడు కోరహు గుంపులో, అంటే యెహోవాకు విరోధంగా కూడినవారి గుంపులో లేడు. తన పాపాన్నిబట్టి, తన సొంత పాపాన్నిబట్టి చనిపోయాడు.

4అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలోనుంచి తీసెయ్యాలా? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి>> అన్నారు.5అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,

6యెహోవా మోషేతో <<సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే.7కచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి, వారి తండ్రి స్వాస్థ్యం వాళ్లకు వచ్చేలా చూడు.8ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.

9అతనికి కూతుళ్ళు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి.10అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.11అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం>> అన్నాడు.
మోషే తరువాత యెహోషువ నాయకుడు

12ఇంకా యెహోవా మోషేతో<<నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.13నువ్వు దాన్ని చూసిన తరువాత, నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంతవారితో చేరిపోతావు.14ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను ఘనపరచకుండా, నా మీద మీరు తిరగబడ్డారు>> అన్నాడు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేషులో ఉన్న మెరీబా నీళ్ళు.

15అప్పుడు మోషే యెహోవాతో <<యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండాా ఈ సమాజం మీద యెహోవా ఒకణ్ణి నియమించు గాక.16అతడు వారి ముందు వస్తూ, పోతూ,17వాళ్లకు నాయకుడుగా ఉండడానికి సమర్థుడుగా ఉండాలి>> అన్నాడు.

18అందుకు యెహోవా మోషేతో <<నూను కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి పెట్టి19యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట, అతని నిలబెట్టి, వారి కళ్ళ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు.

20ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు.21యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో 1 ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి>> అన్నాడు.

22యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,23అతని మీద తన చేతులు పెట్టి, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.


1 27:21 యెహోవా నిర్ణయం తెలుసుకోవడానికి యాజకుడు ఉపయోగించే వెలగల రాళ్లు అయి ఉండవచ్చు.

Chapter 28

ప్రతి రోజు అర్పణలు

1యెహోవా మోషేతో మాట్లాడుతూ,2<<నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి.

3ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు. మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతి రోజూ ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న రెండు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.4వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయాన, రెండోదాన్ని సాయంకాలం అర్పించాలి.5మెత్తగా దంచిన ఒక కిలో పిండిని ఒక లీటరు నూనెతో కలిపి పదోవంతు నైవేద్యంగా అర్పించాలి.

6అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.7ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించాల్సిన పానార్పణ ముప్పావు లీటరు. పవిత్రస్థలంలో యెహోవాకు మద్యం పానార్పణగా పొయ్యాలి.8ఉదయ నైవేద్యం, దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా ఆ రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి.
విశ్రాంతి రోజు అర్పణలు

9విశ్రాంతి రోజున ఒక సంవత్సరం వయస్సు ఉండి, ఏ దోషం లేని రెండు గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు అర్పించాలి.10నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి.
ప్రతినెల అర్పణలు

11ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో12నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో మూడు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో ఒక్క పదో వంతు నైవేద్యంగా అర్పించాలి.13అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలి.

14వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో ఒక లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో ఒక లీటరు, గొర్రెపిల్లతో ముప్పావు లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతినెలా జరగాల్సిన దహనబలి.15నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా ఒక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పించాలి.
పస్కాపండగ

16మొదటి నెల 14 వ రోజు యెహోవా పస్కాపండగ వస్తుంది.17ఆ నెల 15 వ రోజు పండగ జరుగుతుంది. ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి.18మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.

19అయితే, యెహోవాకు దహనబలిగా మీరు రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలు అర్పించాలి. అవి మీ మందల్లో ఏ దోషం లేనివిగా ఉండాలి.20వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి.21ఒక్కొక్క దున్నపోతుతో నూనెతో కలిపిన ఆరు లీటర్ల మెత్తని పిండి, పొట్టేలుతో నూనెతో కలిపిన నాలుగు లీటర్ల మెత్తని పిండి, ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన రెండు లీటర్ల మెత్తని పిండి అర్పించాలి.22మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి.

23ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.24ఆ విధంగానే, ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే పదార్థం ఆహారంగా అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి, దాని పానార్పణ కాకుండా దాన్ని కూడా అర్పించాలి.25ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.
వారాల పండగ

26ఇంకా, ప్రథమ ఫలాలు అర్పించే రోజు, అంటే, వారాల పండగరోజు మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పవిత్ర సంఘంగా సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.27యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలిగా మీరు రెండు దున్నపోతు దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి దున్నపోతు దూడతో28నూనెతో కలిపిన ఆరు కిలోల మెత్తని పిండిలో మూడు పదో వంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదో వంతులు,

29ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదో వంతు,30మీ కోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ఒక మేకపిల్ల, అర్పించాలి.31నిత్యం జరిగే దహనబలి, దాని నైవేద్యం కాకుండా వాటినీ, వాటి పానార్పణను అర్పించాలి. అవి ఏ దోషం లేనివిగా ఉండాలి.>>

Chapter 29

బూరలూదే పండగ

1ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.

2ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.
3ఏ లోపం లేని ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన గల దహనబలిగా అర్పించాలి.4వాటి వాటి పద్ధతి ప్రకారం దహనబలిని, దాని నైవేద్యాన్ని, వాటి పానార్పణలు అర్పించాలి.

5వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు, ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.
6అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
ప్రాయశ్చిత్తం (పాపపరిహార బలి)

7ఈ ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. అప్పుడు మిమ్మల్ని మీరు 1 అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు.

8ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహార బలి, నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, వాటి వాటి పానార్పణలు కాక, ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా అర్పించాలి. వాటిలో ఏలోపమూ ఉండకూడదు.

9వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,10ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.11అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
గుడారాల పండగ

12ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు పండగ జరపాలి.13దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.
14నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు15ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.16అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

17రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను18వాటి వాటి లెక్క ప్రకారం వాటి వాటి నైవేద్యం,19పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
20మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను21వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను22పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

23నాలుగో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని 10 కోడెలను రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం24వాటి నైవేద్యం, పానార్పణలను,25పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
26అయిదో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను27వాటి వాటి లెక్క ప్రకారం, వాటి నైవేద్యం, పానార్పణను,28అలాగే పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

29ఆరో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను, వాటి వాటి లెక్క ప్రకారం,30వాటి నైవేద్యం, పానార్పణను31పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
32ఏడో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం,33వాటి వాటి నైవేద్యం, పానార్పణలను,34పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

35ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.36ఆ రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా ఏ లోపం లేని నిర్దోషమైన ఒక కోడెను ఒక పొట్టేలును ఒక సంవత్సరం వయసున్న ఏడు గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం
37వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను38పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
39మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాకు అర్పించాలి.40యెహోవా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.


1 29:7 ఉపవాసం.

Chapter 30

మొక్కుబడి

1మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు,2<<ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.

3తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.4ఆమె ప్రమాణాలు అన్నీ నిలిచి ఉంటాయి.
5అయితే ఆమె చేసిన ప్రమాణాలను ఆమె తండ్రి విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, ఏవీ నిలబడవు.
6ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.

7ఆమె వివాహిత అయితే, ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త ఎరిగి ఏమీ మాట్లాడకపోతే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు ఆమెపై నిలిచి ఉంటాయి.
8అయితే ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, అతడు ఆమె మొక్కుబడులను, తొందరపాటుగా చేసిన ప్రమాణాలను రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు.

9వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.10ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,11వాటిని గురించి ఆమె భర్త విని ఏ ఆక్షేపణా చేయకుండా ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, అన్నీ నిలిచి ఉంటాయి.
12ఆమె భర్త వాటి గురించి విన్న రోజునే వాటిని పూర్తిగా రద్దు చేసి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు గురించిన ఆమె మాటలు ఏవీ నిలబడవు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
13ఒక స్త్రీ చేసిన ప్రతి మొక్కుబడిని, ప్రమాణపూర్వకంగా తన మీద మోపుకొన్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చు, రద్దు చేయవచ్చు.14అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు.
15అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.>>16ఇవి భర్తను గూర్చీ భార్యను గూర్చీ, తండ్రిని గూర్చీ బాల్యంలో తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చీ యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞలు.

Chapter 31

మిద్యానీయులు మీద ప్రతీకారం

1యెహోవా <<మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.2ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు>> అని మోషేకు చెప్పాడు.

3అప్పుడు మోషే <<మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.4ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి>> అని ప్రజలతో అన్నాడు.5ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.
6మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.

7యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.8వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.
9వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.10వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.
11వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.12తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.
13అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.

14అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.15అతడు వారితో <<మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?
16బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.17కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.
18మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.19మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.20మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.>>

21అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో <<యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,22<అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ23మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.24ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.> >> అన్నాడు.
చెరగా పట్టుకున్నవి రెండు భాగాలు

25యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,26<<నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.27సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.
28యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని29యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.
30అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.>>31యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.

32ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది336,75,000 గొర్రెలు లేక మేకలు,3472,000 పశువులు, 61,000 గాడిదలు,3532,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.
36అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3,37,500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.37వాటిలో యెహోవా పన్ను 72.38గాడిదల్లో సగం 30,500.
39వాటిలో యెహోవా పన్ను 61.40మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.41యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.

42మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.433,37,500 గొర్రె మేకలు,4436,000 పశువులు, 30,500 గాడిదలు,4516,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.46మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,
4750 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.

48అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి49<<నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.
50కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం>> అని చెప్పారు.51మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.
52వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16,750 తులాలు.53ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.54అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.

Chapter 32

యొర్దాను నది తూర్పు ప్రాంతం

1రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.2వారు మోషేతో, యాజకుడు ఎలియాజరుతో సమాజ నాయకులతో3<<అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,

4అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.5కాబట్టి మా మీద మీకు దయ కలిగితే, మమ్మల్ని యొర్దాను నది దాటించవద్దు. మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి>> అన్నారు.

6అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. <<మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?7యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?
8ఆ దేశాన్ని చూసి రావడానికి కాదేషు బర్నేయలో నేను మీ తండ్రులను పంపినప్పుడు వారు కూడా ఇలాగే చేశారు కదా.9వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కాబట్టి యెహోవా తమకిచ్చిన దేశంలో ప్రవేశించలేకపోయారు.

10ఆ రోజు యెహోవా కోపం తెచ్చుకున్నాడు.11ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప12మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.
13అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.

14ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.15మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.>>
16అందుకు వారు అతనితో <<మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.17ఇశ్రాయేలు ప్రజలను వారివారి స్థలాలకు చేర్చే వరకూ మేము యుద్ధానికి సిద్ధపడి వారి ముందు సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ ప్రాంత ప్రజల భయం వలన ప్రాకారాలున్న ఊర్లలో నివసించాలి.
18ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడూ తన తన వారసత్వాన్ని పొందేవరకూ మా ఇళ్ళకు తిరిగి రాము.19తూర్పున యొర్దాను ఇవతల మాకు వారసత్వం దొరికింది కాబట్టి ఇక యొర్దాను అవతల వారితో వారసత్వం అడగం>> అన్నారు.

20అప్పుడు మోషే వారితో <<మీరు మీ మాట మీద నిలబడి యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టే వరకూ21యెహోవా సన్నిధిలో మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళి22ఆ దేశాన్ని జయించిన తరవాత మీరు తిరిగి రావచ్చు. మీరు యెహోవా దృష్టికీ ఇశ్రాయేలీయుల దృష్టికీ నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిలో మీకు వారసత్వం అవుతుంది.
23మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.24మీరు మీ పిల్లల కోసం ఊర్లను, మీ పశువుల కోసం దొడ్లను కట్టుకుని మీరు చెప్పిన ప్రకారం చేయండి అన్నాడు.>>

25అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో <<మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం.
26మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు.27నీ సేవకులైన మేము, అంటే మా సైన్యంలో ప్రతి యోధుడు మా యజమానివి నువ్వు చెప్పినట్టు యెహోవా సన్నిధిలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తాము>> అన్నారు.

28కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, ఇశ్రాయేలు గోత్రాల్లో పూర్వీకుల వంశాల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు,29<<గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్దపడి మీతో కూడా యొర్దాను అవతలికి వస్తే, ఆ దేశాన్ని మీరు జయించిన తరవాత మీరు గిలాదు దేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.30కాని వారు యుద్ధానికి సిద్ధపడి మీతో కలిసి అవతలకి రాకపోతే వారు కనాను దేశంలో మీ మధ్యనే వారసత్వం పొందుతారు>>
31దానికి గాదీయులు, రూబేనీయులు <<యెహోవా నీ సేవకులైన మాతో చెప్పినట్టే చేస్తాం.32మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం>> అని జవాబిచ్చారు.

33అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.

34గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను,35యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను36అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు.

37రూబేనీయులు హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్మెయోను,38షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.

39మనష్షే సంతానం అయిన మాకీరీయులు గిలాదుపై దండెత్తి దాన్ని ఆక్రమించి దానిలోని అమోరీయులను వెళ్లగొట్టారు.
40మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.41అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి 1 యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.42నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామాలను ఆక్రమించి దానికి నోబహు అని తన పేరు పెట్టాడు.


1 32:41 హవ్వోతు యాయిరు.

Chapter 33

ఐగుప్తుదేశం నుండి మోయాబు వరకు ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు

1మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.2యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.

3మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.4ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.

5ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.6సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.7ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
8పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.9ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.10ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
11అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.12సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.13దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.14ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.

15రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.16అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.17కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.18హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
19రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.20రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.21లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.22రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
23కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.24షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.25హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.26మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
27తాహతు నుండి తారహుకు వచ్చారు.28తారహు నుండి మిత్కాకు వచ్చారు.29మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.30హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
31మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.32బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.33హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.34యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
35ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.36ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.37కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.

38యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.39అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
40అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.

41వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.42సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.43పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
44ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.45ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.46దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
47అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.48అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.49వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.

50యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,51<<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, <మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత52ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
53ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
54మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
55అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.56అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.> >>

Chapter 34

కనాను దేశంలో ఇశ్రాయేలీయుల సరిహద్దులు

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,2<కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.3మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.

4మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.5అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.

6మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
7మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,8హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,9అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.

10తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.11అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.12అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం> అని వారితో చెప్పు.>>

13మోషే ఇశ్రాయేలీయులతో <<ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.14ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.15అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు>> అని చెప్పాడు.
16అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,17<<ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.18వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.

19వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,20షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
21బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.22దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.23యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
24ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,25జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,26ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
27ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.28నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.>>29వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.

Chapter 35

లేవీయులు నివసించడానికి పట్టణాలు

1యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.2<<తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.

3అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.4మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు,
5ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.
శరణు పట్టణాలు

6మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.7వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
8మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.>>

9యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,10మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత11ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.
12పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.13మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.
14వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.

15ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.
16ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.17ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.18అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.

19హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.20ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.21ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.

22అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా,23దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.
24కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.25ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.
26అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే27నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు.28ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.

29ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ.30ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.
31హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.32ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు.
33మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.34కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.>>

Chapter 36

సెలోపెహాదు కూతుళ్ళ వారసత్వం

1యోసేపు కొడుకుల వంశాల్లో మాకీరు కొడుకు, మనష్షే మనమడు అయిన గిలాదు వంశం పెద్దలు వచ్చి మోషేతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల నాయకులతో ఇలా అన్నారు,2<<ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు.

3అయితే వారు ఇశ్రాయేలీయుల్లో ఇతర గోత్రాల వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వం నుండి తీసి, వారు చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోయి, మా గోత్రానికి వచ్చిన చీటీల ప్రకారం లభించిన వారసత్వం నుండి వేరైపోతుంది.4కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి వంతు వారు పెళ్లి చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోతుంది కాబట్టి ఆ మేరకు మా పూర్వీకుల గోత్ర వారసత్వం తగ్గిపోతుంది.>>

5అప్పుడు మోషే యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. <<యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పింది న్యాయంగానే ఉంది.6యెహోవా సెలోపెహాదు కూతుళ్ళ గురించి చెప్పింది ఏమిటంటే, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు గాని, తమ తండ్రి గోత్ర వంశాల్లోనే చేసుకోవాలి.
7ఇశ్రాయేలీయుల వారసత్వం ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల గోత్ర వారసత్వానికి కట్టుబడి ఉండాలి.
8ఇశ్రాయేలీయులకు వారి పూర్వీకుల వారసత్వం కలిగేలా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి యువతీ తన తండ్రి గోత్రంలోనే వివాహం చేసుకోవాలి.9వారసత్వం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రాలు వారి వారి వారసత్వాల్లోనే నిలిచి ఉండాలి.>>

10యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా సెలోపెహాదు కూతుళ్ళు చేశారు.11మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అనే సెలోపెహాదు కూతుళ్ళు తమ తండ్రి సోదరుని కొడుకులను వివాహం చేసుకున్నారు.12అంటే యోసేపు కొడుకులైన మనష్షీయులను వివాహం చేసుకోవడం వలన వారి వారసత్వం వారి తండ్రి గోత్రంలోనే ఉండిపోయింది.
13ఇవి యెరికో దగ్గర యొర్దానుకు సమీపంగా ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు.

ద్వితీయోపదేశ కాండము

Chapter 1

హోరేబు వదలి వెళ్ళమని ఆజ్ఞ

1యొర్దాను నదికి తూర్పున ఉన్న ఎడారిలో, అంటే పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు అనే ప్రదేశాల మధ్య సూపుకు ఎదురుగా ఉన్న ఆరాబా ఎడారిలో మోషే, ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు.2హోరేబు నుండి శేయీరు ఎడారి దారిలో కాదేషు బర్నేయ వరకూ ప్రయాణ సమయం 11 రోజులు.

3-4హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజు సీహోనునూ అష్తారోతులో నివసించిన బాషాను రాజు ఓగునూ ఎద్రెయీలో చంపిన తరువాత 40 వ సంవత్సరంలో 11 వ నెల మొదటి రోజున మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.

5యొర్దాను ఇవతల ఉన్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు,6<<మన దేవుడు యెహోవా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు.
7మీరు బయలుదేరి అమోరీయుల కొండ ప్రాంతానికీ అరాబా లోయలో దక్షిణ దిక్కున సముద్రతీరంలో ఉన్న స్థలాలన్నిటికీ కనాను దేశానికీ లెబానోనుకూ యూఫ్రటీసు మహానది వరకూ వెళ్ళండి.8ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.>>
నాయకులుగా నియామకం

9ఆ సమయంలో, నేను మీతో <<నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను.10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు.11మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.
12నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను?13జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను>> అని చెప్పాను.

14అప్పుడు మీరు<<నీ మాట ప్రకారం చేయడం మంచిది>> అని నాకు జవాబిచ్చారు.
15కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను.

16అప్పుడు నేను వారితో <<మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి.
17అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను>> అని ఆజ్ఞాపించాను.18అలాగే మీరు చేయాల్సిన పనులన్నిటిని గూర్చి మీకు ఆజ్ఞాపించాను.
పన్నెండు మందిని సమాచారం కోసం బయటకు పంపుట

19మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేషు బర్నేయ చేరాం.
20అప్పుడు నేను <<మన దేవుడైన యెహోవా మనకిస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి వచ్చాం.

21ఇదిగో, మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్టు దాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడవద్దు, నిరుత్సాహం వద్దు>> అని మీతో చెప్పాను.
22అప్పుడు మీరంతా నా దగ్గరికి వచ్చి <<ముందుగా మన మనుషులను పంపుదాం, వాళ్ళు మన కోసం ఈ దేశాన్ని పరిశీలించి తిరిగి వచ్చి దానిలో మనం వెళ్ళాల్సిన మార్గం గురించీ మనం చేరాల్సిన పట్టణాలను గురించీ మనకు సమాచారం తెస్తారు>> అన్నారు.23ఆ మాట అంగీకరించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కరు చొప్పున పన్నెండు మందిని పంపాను.

24వాళ్ళు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు. ఆ దేశంలో దొరికే పండ్లు కొన్నిటిని మన దగ్గరికి తెచ్చి,
25<<మన దేవుడు యెహోవా మనకిస్తున్న దేశం మంచిది>> అని మనకు చెప్పారు.
26అయితే మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు. మీ దేవుడైన యెహోవా మాటకు తిరగబడ్డారు.
యెహోవాకి వ్యతిరేకంగా తిరుగుబాటు

27మీ గుడారాల్లో సణుక్కుంటూ <<యెహోవా మన మీద పగబట్టి మనలను చంపడానికి, అమోరీయులకు అప్పగించడానికి ఐగుప్తు దేశం నుండి మనలను రప్పించాడు.28మనమెక్కడికి వెళ్లగలం? అక్కడి ప్రజలు మన కంటే బలిష్ఠులు, ఎత్తయినవారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయులను చూశాం>> అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు.

29అప్పుడు నేను మీతో <<దిగులు పడొద్దు, భయపడొద్దు.30మీకు ముందు నడుస్తున్న మీ యెహోవా దేవుడు మీరు చూస్తుండగా31ఐగుప్తులో, అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చేవరకూ దారిలో మీ యెహోవా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు>> అన్నాను.

32అయితే మీకు దారి చూపించి మీ గుడారాలకు స్థలం సిద్ధపరిచేలా33రాత్రి అగ్నిలో, పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు.
34కాబట్టి యెహోవా మీ మాటలు విని,35బాగా కోపం తెచ్చుకుని <<నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో36యెఫున్నె కొడుకు కాలేబు తప్ప మరెవరూ చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించాడు కాబట్టి కేవలం అతడు మాత్రమే దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన భూమిని నేను అతనికీ అతని సంతానానికీ ఇస్తాను>> అని ప్రమాణం చేశాడు.

37అంతేగాక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి <<నీ సేవకుడు, నూను కొడుకు యెహోషువ దానిలో అడుగు పెడతాడు గాని నువ్వు అడుగు పెట్టవు.38అతడే దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు.
39అయితే మంచీ చెడూ తెలియని మీ కొడుకులు, అంటే అన్యాయానికి గురౌతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగు పెడతారు. దాన్ని వారికిస్తాను. వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు.

40మీరు మాత్రం వెనక్కి ఎర్రసముద్రం వైపుకు తిరిగి ఎడారిలోకి ప్రయాణించండి>> అని చెప్పాడు.
41అందుకు మీరు <<మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం. మా యెహోవా దేవుడు మాకాజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం>> అని నాతో చెప్పి, మీ ఆయుధాలతో ఆ కొండ ప్రాంతానికి బయలుదేరారు.42అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు <<యుద్ధానికి వెళ్లొద్దు. నేను మీతో ఉండను కాబట్టి మీరు వెళ్లినా మీ శత్రువుల చేతిలో ఓడిపోతారని వారితో చెప్పు.>>

43ఆ మాటలు నేను మీతో చెప్పినా మీరు వినకుండా యెహోవా మాటకు ఎదురు తిరిగి మూర్ఖంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు.44అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు.
45తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడ్చారు. అయినా యెహోవా మిమ్మల్ని లెక్కచేయలేదు, మీ మాట వినలేదు.46కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.

Chapter 2

ఎడారిలో సంచారం

1అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.2యెహోవా నాకు ఇలా చెప్పాడు. <<మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు,3ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు.

4<శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.5వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.
6మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.>7ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.>>

8అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం.
9మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు. <<మోయాబీయులను బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.>>

10గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా <<1 రెఫాయీయులు>> అని పిలిచారు.11మోయాబీయులు వారికి <<ఏమీయులు>> పేరు పెట్టారు.

12పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు.
13<<ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి>> అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం.

14మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు.15అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది.

16ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు,17<<ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు.18అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు.19వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.>>
20దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని <<జంజుమీయులు>> అనేవారు.

21వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు.22ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.
23గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు.
హెష్బోను రాజు అయిన సీహోనునూ ఓటమి

24<<మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి.25ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు>> అని యెహోవా నాతో చెప్పాడు.

26అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి27<<మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము.
28నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు.29శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు>> అని శాంతికరమైన మాటలు పలికించాను.
30అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు.

31అప్పుడు యెహోవా <<చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు>> అని నాతో చెప్పాడు.
32సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు.33మన యెహోవా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం.

34అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.35కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
36అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు.37అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు.


1 2:10 మహా కాయులు.

Chapter 3

బాషాను రాజు ఓగు ఓటమి

1మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.2యెహోవా నాతో ఇలా అన్నాడు. <<అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.>>

3ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.

4ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.
5ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.6మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.7వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

8ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.9సీదోనీయులు హెర్మోనును <<షిర్యోను>> అనేవారు. అమోరీయులు దాన్ని <<శెనీరు>> అనేవారు.10మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.
11రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
భూమి విభజన

12అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం 1 నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.13ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను.

14మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.
15మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.16గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
17ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.

18అప్పుడు నేను మీతో <<మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.
19యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.20అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు>> అన్నాను.
యొర్దాను నది దాటడానికి మోషే నిషేధించబడుట్ట

21ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. <<మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు.22మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.>>

23ఆ రోజుల్లో నేను <<యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.24ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?25నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు>> అని యెహోవాను బతిమాలుకున్నాను.

26యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. <<చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.27నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.
28నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.>>29ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.


1 3:12 ఉత్తర దిశ నుండి

Chapter 4

దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించాలని ఇశ్రాయేలు ప్రజలకు మోషే అభ్యర్ధన

1కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. వినండి.2యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు.

3బయల్పెయోరు విషయంలో యెహోవా చేసినదాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడినీ మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉండకుండాా నాశనం చేశాడు.4యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు.
5యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను.6ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి <<నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు>> అని చెప్పుకుంటారు.

7ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?8ఈ రోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతివిధులు కలిగి ఉన్న గొప్ప జనమేది?
9అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి.10మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, <<నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.>>

11అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా12యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు.
13మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు.
విగ్రహారాధన నిషేధించబడెను

14అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు.16కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని,17ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని,18నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి.
19ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.

20యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు.
21యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ మీ యెహోవా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనీ ఆజ్ఞాపించాడు.22కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

23మీ దేవుడు యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్తపడండి.24ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.
25మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి, ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవా దేవునికి కోపం పుట్టించి, ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా త్వరలోనే పూర్తిగా నాశనమై పోతారని భూమ్యాకాశాలను మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు.

27అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు.28అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
29అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.

30ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు31మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.
యెహోవాయే దేవుడు

32దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు.33మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా?

34మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?
35అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు.36మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.

37ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు.38మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు.

39కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.40అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.
శరణు పట్టణాలు

41ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు42అతడు పారిపోడానికి మోషే తూర్పు దిక్కున, యొర్దాను ఇవతల మూడు పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు.43అవేవంటే, రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.
44ఇదీ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం.

45ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు46యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో, సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో
47మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి.48మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్నీ యొర్దాను ఇవతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్నీ అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సీయోను కొండ వరకూ ఉన్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశాన్ని,49పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు.

Chapter 5

పది ఆజ్ఞలు

1మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, <<ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి.2మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు.3ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు.

4యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు.

5కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు.

6<బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.

7నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.

8పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు.

9వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను.10నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.

11మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.

12మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి.13ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి.14ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.

15మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.

16మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.

17హత్య చేయకూడదు.

18వ్యభిచారం చేయకూడదు.

19దొంగతనం చేయకూడదు.

20మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.

21మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.>

22యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.

23ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికి వచ్చి,24<మన యెహోవా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం.
25కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం.26మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు?27నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.>

28మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు.<ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే.29వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.30<<వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని>> వారితో చెప్పు.
31నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.>

32వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.33మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.>>

Chapter 6

నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

1<<మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ2మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.

3ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.

4ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు.5నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

6ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

7మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

8అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.9మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

10మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు.11మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.

12అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి.
13మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.14మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.

15మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు.
16మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా 1 మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.17ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.

18మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని19యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.

20ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు21మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు.22యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి,23తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.

24మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు.25మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.>>


1 6:16 నిర్గమ 7:1-7 చూడండి.

Chapter 7

కనాను నుండి అనేక జాతుల పారదోలడం

1<<మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు.

2తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు.3మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు.
4ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు.

5కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.
6మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.
7అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా.8అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

9కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.10ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు.11కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి.

12మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు.13ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు.

14అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.15యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు.

16మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది.

17ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో. వారికి భయపడవద్దు.18మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు19మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు.
20మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి 1 పెద్ద కందిరీగలను పంపుతాడు.

21కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.22మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు.

23అయితే మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిని మీకప్పగించి వారిని నాశనం చేసేవరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు.24ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు.
25వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.26దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.>>


1 7:20 తెగులు, అరిష్టం.

Chapter 8

యెహోవా దేవుని మర్చిపోకండి

1<<మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి.2మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

3రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

4ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.5ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.6ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.

7ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం.8దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం.
9మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.

10మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి.
11ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి.12మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు.
13మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

14అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

15బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.16చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.17అయితే మీరు, <మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి> అనుకుంటారేమో.

18కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.19మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను.20యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.>>

Chapter 9

ఇశ్రాయేలు నీతిని బట్టి కాదు

1<<ఇశ్రాయేలూ విను. మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు, ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోడానికి ఈ రోజు మీరు యొర్దాను నది దాటబోతున్నారు.2ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. <అనాకీయులను ఎవరూ ఎదిరించలేరు> అనే మాట మీరు విన్నారు కదా.

3కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు
4మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరవాత <మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు> అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు.

5మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోడానికి కారణం మీ నీతి గానీ మీ హృదయంలో ఉన్న యథార్థత గానీ కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు.
6మీ యెహోవా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయడం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు.
బంగారు దూడ

7ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.8హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు.

9ఆ రాతి పలకలు, అంటే యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోడానికి నేను కొండ ఎక్కినప్పుడు, అన్నపానాలు మాని అక్కడ నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను.10అప్పుడు యెహోవా తన వేలితో రాసిన రెండు రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి.

11ఆ నలభై పగళ్లు, నలభై రాత్రుల తరువాత యెహోవా నిబంధన సంబంధమైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించి,12<నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు> అని నాతో చెప్పాడు.

13యెహోవా ఇంకా <నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు.14నాకు అడ్డం రావద్దు. నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి, నిన్ను వారికంటే బలమైన, విస్తారమైన జనంగా చేస్తాను> అని నాతో చెప్పాడు.

15నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి.16నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు.

17అప్పుడు నేను ఆ రెండు పలకలను, నా రెండు చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను.18మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను.
19ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు.20అంతేగాక యెహోవా అహరోనుపై కోపపడి, అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను.

21అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను.
22అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు.23యెహోవా <కాదేషు బర్నేయలో మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి> అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు.241 నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

25కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు.26నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు.
27నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు.

28ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో.29నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.>>


1 9:24 యెహోవా మిమ్మల్ని ఎరిగిన రోజు నుండి.

Chapter 10

పది ఆజ్ఞల మొదటి పలకల వంటిది

1అప్పుడు యెహోవా <<నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో.2నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి>> అని నాతో చెప్పాడు.

3కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను.4మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి
5నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.

6ఇశ్రాయేలు ప్రజలు యహకానీయుల1 కు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.7అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.
8అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.9అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.

10ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.11యెహోవా నాతో <<ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు>> అని చెప్పాడు.
దేవుడైన యెహోవాకు భయపడుడి

12కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.

13మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.

16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.
18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.

19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.
20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
22మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.


1 10:6 యహకానీయుల యహకానీయుల బావి

Chapter 11

యెహోవాను ప్రేమించి, ఆయన కట్టడలనూ పాటించాలి

1<<కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.

2మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.

3ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
4ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.

5యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.
6అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.

8కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,9యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.

10మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.11మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.12అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.

13కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు 1 నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,14మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.15మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.

16మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.17లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.

18కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.19మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
20మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.21ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.

22మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.23అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.
24మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.25ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.

26చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.27నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.28మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.

29కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.30అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.

31మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.32ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.>>


1 11:13 దేవుడు మీకు ఇచ్చే.

Chapter 12

పూజించే ఓకే ఒక స్థలం

1<<మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.

2మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
3వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.

4వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.
5మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.6మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.
7అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.

8ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.9నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.
10మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.11నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.

12మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
13మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.14కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.

15అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.16వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.
17మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
18వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.

19మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.
20మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.
21నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,22యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.

23అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.24మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.25మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.

26మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.27మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.

28నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.
29మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.

30ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
31వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.32నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.>>

Chapter 13

ఇతర దేవుళ్ళను పూజించుట

1ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి,2మీరు ఎరుగని <<ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి>> అని చెబుతాడేమో.3అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.

4మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి.5మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి, ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి ఆ ప్రవక్తకు, లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి.

6మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు,7ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే
8వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి.9వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి.
10రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.11అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి, మళ్ళీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు.

12మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న వాటిలో ఏదైనా ఒక పట్టణంలో13దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజలను ప్రేరేపించారని వింటే, మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి.14అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే
15ఆ పట్టణస్తులను తప్పకుండా కత్తితో చంపి, దానినీ దానిలో ఉన్న సమస్తాన్నీ దాని పశువులనూ కత్తితో చంపివేయాలి.16దానిలో దోచుకున్న సొమ్మంతటినీ దాని వీధిలో పోగుచేసి, మీ దేవుడు యెహోవా పేరున ఆ పట్టణాన్ని, దాని సొత్తునీ పూర్తిగా కాల్చివేయాలి. దాన్ని ఇక ఎన్నటికీ తిరిగి కట్టకూడదు, అది పాడుదిబ్బలాగా ఉండిపోవాలి.
17ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ18మీ దేవుడైన యెహోవా దృష్టికి సరైన దాన్ని చేస్తూ, ఆయన మాట వినాలి. యెహోవా తన కోపం నుండి మళ్లుకుని మిమ్మల్ని కనికరించి, దయ చూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు.

Chapter 14

పవిత్రమైనవి, హేయమైనవి

1<<మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.2ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్టితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.

3మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు.4ఎద్దు, గొర్రె, మేక.5దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె.
6జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు.7నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం.
8అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాకకూడదు.

9నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు.10రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం.

11పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు.12మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద.13ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ.
14అన్ని రకాల కాకులు.15నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు.16చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట,17గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం.
18కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం.19ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు.20ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు.

21దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు.
దశమ భాగాలు

22ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి.23మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి.

24యెహోవా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే, మీరు వాటిని మోయలేరు కాబట్టి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు,25వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి,
26ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి.27లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు.

28మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి.29అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.>>

Chapter 15

అప్పులు రద్దు చేయడం

1ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే,2తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు.3ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి పై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి.

4మీరు స్వాధీనం చేసుకోడానికి యెహోవా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

5కాబట్టి ఈ రోజు నేను మీకు ఆదేశించే యెహోవా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు.6ఎందుకంటే ఆయన మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఇతరులు అనేకులకు అప్పిస్తారు గాని అప్పు చెయ్యరు. అనేక రాజ్యాలను పాలిస్తారు గాని ఎవరూ మిమ్మల్ని పరిపాలించరు.

7మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు.8మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి.
9అప్పు రద్దు చేయాల్సిన <<ఏడో సంవత్సరం దగ్గర పడింది>> అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

10కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
11పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, <<పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
పనివారిని, బానిసలను స్వతంత్రులుగా చేయడం

12మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు, లేక హెబ్రీయురాలు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తరవాత ఏడో సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి.13అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని వట్టి చేతులతో పంపకూడదు.14వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగలో నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలదీ వారికి ఇవ్వాలి.>>

15మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను.16అయితే వారు నీ దగ్గర పొందిన మేలును బట్టి మిమ్మల్ని, మీ ఇంటివారిని ప్రేమించి <<నేను మీ దగ్గర నుండి వెళ్లిపోను>> అని మీతో చెబితే,17మీరు ఒక లోహపు ఊచ తీసుకుని, తలుపులోకి దిగేలా వాడి చెవికి దాన్ని గుచ్చాలి. ఆ తరువాత అతడు ఎన్నటికీ మీకు దాసుడుగా ఉంటాడు. అదే విధంగా మీరు మీ దాసికి కూడా చేయాలి.

18మీ దాసులను స్వతంత్రులుగా విడిచిపెట్టడాన్ని కష్టంగా భావించకూడదు. ఎందుకంటే వారు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేయడం ద్వారా జీతగాడికి మీరు చెల్లించే జీతానికి రెండు రెట్లు లాభం మీకు కలిగింది. మీ యెహోవా దేవుడు మీరు చేసే వాటన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
తొలి చూలు పశువులు

19మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు.

20మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి.21దానిలో లోపం, అంటే కుంటితనం గాని, గుడ్డితనం గాని, మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు.
22జింకను, దుప్పిని తినే విధంగానే, పట్టణాల్లోని మీ ఆవరణల్లో పవిత్రులు, అపవిత్రులు కూడా దాన్ని తినవచ్చు.23వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి.

Chapter 16

పస్కా పండగ

1<<మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు.2యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి.

3పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి.4మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు.

5మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు.6మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి.
7అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి.8ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.
వారాల పండగ

9మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి.10మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి.
11అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి.12మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి.
పర్ణశాలల పండగ

13మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షరసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను ఏడు రోజులపాటు ఆచరించాలి.14ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి.
15మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి.

16సంవత్సరానికి మూడుసార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి.17వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి.
న్యాయాధిపతులు

18మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి.19మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.
ఇతర దేవతలను ఆరాధించడం

20మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి.
21యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు.22మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు.>>

Chapter 17

1<<ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెలు మీ యెహోవా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవా దేవునికి అసహ్యం.

2మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు,3ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే4ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి.

5అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది.6కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు.7అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి.
న్యాయస్థానలు

8హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే9మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.

10యెహోవా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి.11వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.

12ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.13అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు.
రాజును ఎన్నుకోవడం

14మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి.15మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు.

16అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను 1 ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు.17తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.

18అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.19అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.
20అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.>>


1 17:16 గుర్రాలను తెచ్చుకోవడం కోసం బానిసలను పంపించ వద్దు.

Chapter 18

యాజకులైన లేవీయులకు కానుకలు

1<<యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.2వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.

3ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.4ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.5యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు.

6ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే7అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు.8తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.
నీచమైన పనులు

9మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.10తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,11ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.
12వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.

13మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.14మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.
రాబోయే గొప్ప ప్రవక్త

15మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.

16హోరేబులో సమావేశమైన రోజున మీరు <మా యెహోవా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం> అన్నారు.
17అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. <వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.

18వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు.19అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను.

20అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.>

21<ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?> అని మీరనుకుంటే,
22ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.>>

Chapter 19

శరణు పట్టణాలు

1<<మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.2మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.3మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.

4హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా5పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.

6చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.7అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

8యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.9ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.10ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.

11ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి12ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.13అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.

14మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.
సాక్ష్యాలు

15ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.16ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే
17ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.

18ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.19ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.
20ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.21దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.>>

Chapter 20

యుద్ధానికి వెళ్లినప్పుడు

1<<మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

2మీరు యుద్ధానికి సిద్దమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరకి వచ్చి వారితో ఇలా చెప్పాలి.

3<ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.4అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.>

5సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. <మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
6ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.7ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.>

8సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. <ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.>9సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజలను నడిపించడానికి నాయకులను నియమించాలి.

10యుద్ధం చేయడానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి.11వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు.
12మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి.

13మీ యెహోవా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి.
14స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు.15ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి.

16అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు.17మీ యెహోవా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.18వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.

19మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా!20తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.>>

Chapter 21

తెలియని హత్యకి పరిహారం

1<<మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు2మీ పెద్దలూ, న్యాయాధిపతులూ వచ్చి, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి.

3ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి.4దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి.

5తరువాత యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి.
6అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని7మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీన్ని చూడలేదు.
8యెహోవా, నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది.

9ఆ విధంగా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్యనుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు.
బందీ అమ్మాయిలను పెళ్లి చేసుకోడం

10మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత11వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి,12నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి.
13ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది.14నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు.
జ్యేష్ఠత్వ అధికారం

15ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే,16పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు.17ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే.
మొండివాడై తిరగబడ కొడుకుకు శిక్ష

18ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే19అతని తలిదండ్రులు అతని పట్టుకుని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి.
20మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి.21అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు.

22మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి.23అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి.>>

Chapter 22

1మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి.2మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి.

3అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు.4మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి.

5ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

6చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు.7మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.

8మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.

9మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా 1 చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది.10ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు.11ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు.
12మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి.
పెళ్ళి ఉల్లంఘనలు

13ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి14<<ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు>> అని నేరారోపణ చేసాడనుకోండి.
15ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.

16అప్పుడు ఆ స్త్రీ తండ్రి <<నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు <ఈమెలో కన్యాత్వం కనబడలేదని> అవమానించి ఆమె మీద నింద మోపాడు.17అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే>> అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి.
18అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.

19ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు.
20అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో21పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె 2 తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.

22ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.
23కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే24ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.
25ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి.26ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది.27అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు.

28ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు29ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు.
30ఎవ్వరూ తన 3 తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.


1 22:9 అలా చేస్తే ద్రాక్ష పంట మైలబడి పోతుంది.
2 22:21 అంటే ఇంట్లో.
3 22:30 తండ్రి భార్యల్లో ఎవరితోనైనా.

Chapter 23

సమాజం నుంచి తొలగింపు

1<<చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు.2అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.

3అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.4ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.

5అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు.6మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.

7ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు.

ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు.

8వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
శిబిరం పవిత్రంగా ఉంచాలి

9మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి.10రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి.11అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.

12శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి.13మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి.14మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.
వివిధ నియామాలు, చట్టాలు

15తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు.16అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.

171 ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు.18పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

19మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.20పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.

21మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.22ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు.23మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.

24మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు.25మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.>>


1 23:17 ఇక్కడ వేశ్యరికాలు, పురుష సంపర్కాలు అన్య దేవుళ్ళ ఆలయాల గురించిన సందర్భంలో చెప్పారు. ఇలాంటివి ఆలయాల్లో మాత్రమే కాదు, అసలు చేయకూడదు.

Chapter 24

విడాకులు, మళ్ళి పెళ్ళికి చట్టాలు

1<<ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి.2ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు.

3ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపి వేసినా, లేదా ఆమెను పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా,4ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు.

5కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

6తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.

7ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు.

8కుష్టురోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి.9మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి.

10మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు.11ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు.
12అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి.13అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.

14మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి.15సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.

16కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి.
17పరదేశులకు గానీ తండ్రి లేనివారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు.18మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విమోచించాడని గుర్తుచేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

19మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.20మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.
21మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.22మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.>>

Chapter 25

1<<ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.2ఆ దోషి శిక్షార్హుడైతే, న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి.

3నలభై దెబ్బలు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో.

4కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు.

5సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి.6చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి.

7అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి.8అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి <ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు> అంటే, అతని సోదరుని భార్య
9ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి.10అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి <చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు> అని పేరు వస్తుంది.

11ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతి నుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి, చెయ్యి చాపి అతడి మర్మాంగాలను పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి.12మీ కళ్ళు జాలి చూపించకూడదు.

13వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు.14వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు.
15మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి.16ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.

17మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురు వచ్చి,18మీరు బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు, మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు.19కాబట్టి మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో, మీ దేవుడైన యెహోవా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచీ మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచిపెట్టుకు పోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు.>>

Chapter 26

మొదట పండిన పంటలు, పదోవంతులు

1మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు2మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి, మీ దేవుడైన యెహోవా తనకు మందిరంగా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకువెళ్ళాలి.

3ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి <<యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను>> అని అతనితో చెప్పాలి.4యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి.

5మీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి. <<నా పూర్వీకుడు 1 సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తు వెళ్లి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్లి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన, బలమైన జనసమూహం అయ్యాడు.
6ఐగుప్తీయులు మనలను హింసించి, బాధించి మన మీద కఠినమైన దాస్యం మోపారు.7మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాం. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు.
8యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు.9ఈ స్థలానికి మనలను రప్పించి 2 పాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు.

10కాబట్టి యెహోవా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను.>> ఇలా చెప్పిదాన్ని మీ దేవుడైన యెహోవా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి.11నీకూ, నీ ఇంటి వారికీ నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వూ, లేవీయులూ నీ దేశంలో ఉన్న పరదేశులూ సంతోషించాలి.

12పదవ భాగమిచ్చే మూడవ సంవత్సరం నీ రాబడిలో పదవ వంతు చెల్లించి, అది లేవీయులకూ పరదేశులకూ, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత13నువ్వు మీ యెహోవా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం <<నా ఇంటి నుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకూ పరదేశులకు తండ్రి లేనివారికీ విధవరాళ్లకూ ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు.
14నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనా నేను తినలేదు, అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నువ్వు నా కాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను.15నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం, పరలోకం నుంచి చూసి, నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి, మాకిచ్చిన దేశాన్ని దీవించు>> అని చెప్పాలి.
దేవుని ఆజ్ఞలను అనుసరించడం

16ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.17యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు.
18యెహోవా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని19ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు.


1 26:5 ధ్వంసం చేస్తూ దోచుకుంటూ ఉండే.
2 26:9 సారవంతమైన

Chapter 27

ఏబాలు కొండ మీద బలిపీఠం

1మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. <<ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.2మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.3మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.

4మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.5అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు.

6చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి.7మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి.8ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి.
ఏబాలు కొండ మీద నుంచి శిక్షలు

9మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి.10ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి.

11ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు,12బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి.
13రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.

14అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.>>

<<యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో

15మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

16<<తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

17<<తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

18<<గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా<<ఆమేన్‌>> అనాలి.

19<<పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

20<<తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

21<<ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

22<<తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

23<<తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

24<<రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

25<<నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

26<<ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి.

Chapter 28

విధేయతకు వచ్చే దీవెనలు

1<<మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు.2మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు.

3పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి.4మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి.

5మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి.6మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి.
7యెహోవా మీ మీదికి వచ్చే మీ శత్రువులు మీ ఎదుట హతమయ్యేలా చేస్తాడు. వాళ్ళు ఒక దారిలో మీ మీదికి దండెత్తి వచ్చి ఏడు దారుల్లో మీ ఎదుట నుంచి పారిపోతారు.

8మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
9మీరు మీ యెహోవా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్టిత ప్రజగా మిమ్మల్ని స్థాపిస్తాడు.10భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు.

11యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు.12యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు.

13ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా14వేరే దేవుళ్ళను పూజించడానికి వాటి వైపుకు పోకుండా మీరు అనుసరించి నడుచుకోవాలని ఇవ్వాళ నేను మీ కాజ్ఞాపిస్తున్నాను. మీ యెహోవా దేవుని ఆజ్ఞలు విని, వాటిని పాటిస్తే యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు గానీ తోకగా చెయ్యడు. మీరు పైస్థాయిలో ఉంటారు గానీ కిందిస్థాయిలో ఉండరు.
విధేయతకు వచ్చే శాపాలు

15నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి.
16పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి. పొలంలో మీకు శాపాలు ఉంటాయి.17మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి.
18మీ గర్భఫలం, మీ భూపంట, మీ పశువుల మందల మీద శాపాలు ఉంటాయి.19మీరు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు శాపాలు ఉంటాయి.

20మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు.21మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా మీరు నాశనమయ్యే వరకూ తెగులు మీకు అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు.

22యెహోవా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, 1 కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి.

23మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది.24యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది.

25యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు.26నీ శవం అన్ని రకాల పక్షులకూ, క్రూర మృగాలకూ ఆహారమవుతుంది. వాటిని బెదిరించే వాడెవడూ ఉండడు.

27యెహోవా ఐగుప్తు కురుపులతో, పుండ్లతో, చర్మవ్యాధులతో, దురదతో మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని బాగుచేసుకోలేరు.28పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు.29ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ది చెందరు. ఇతరులు మిమ్మల్ని అణిచివేస్తారు, దోచు కుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు.

30ఒక కన్యను నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు కానీ దానిలో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు కానీ దాని పండ్లు తినరు.31మీ కళ్ళముందే మీ ఎద్దును కోస్తారు కానీ దాని మాంసాన్ని మీరు తినరు. మీ దగ్గర నుంచి మీ గాడిదను బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. దాన్ని తిరిగి మీకు ఇవ్వరు. మీ గొర్రెలను మీ విరోధులకు ఇస్తారు కానీ మీకు సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు.

32మీ కొడుకులను, కూతుళ్ళను అన్య జనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురు చూస్తూ అలిసిపోతాయి గానీ మీ వల్ల ఏమీ జరగదు.
33మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి, అణచి ఉంచుతారు.34మీ కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది.35యెహోవా నీ అరకాలి నుంచి నడినెత్తి వరకూ మోకాళ్ల మీదా తొడల మీదా మానని కఠినమైన పుండ్లు పుట్టించి మిమ్మల్ని బాధిస్తాడు.

36యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.37యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు.

38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి.39ద్రాక్షతోటలను మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి.

40మీ ప్రాంతమంతా ఒలీవ చెట్లు ఉంటాయి కానీ ఆ నూనె తలకు రాసుకోరు. ఎందుకంటే మీ ఒలీవ కాయలు రాలిపోతాయి.41కొడుకులనూ కూతుర్లనూ కంటారు కానీ వారు మీదగ్గర ఉండరు. వారు బందీలుగా వెళ్లితారు.

42మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి.43మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మీరు అంతకంతకూ కిందిస్థాయికి దిగజారతారు.44అతడు మీకు అప్పిస్తాడు గానీ మీరు అతనికి అప్పివ్వలేరు. అతడు తలగా ఉంటాడు, మీరు తోకగా ఉంటారు.

45మీరు నాశనమయ్యేవరకూ ఈ శిక్షలన్నీ మీ మీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. ఎందుకంటే మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలనూ, ఆయన చట్టాలనూ అనుసరించి నడుచుకొనేలా మీరు ఆయన మాట వినలేదు.46అవి ఎప్పటికీ మీ మీద, మీ సంతానం మీద సూచనలుగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.

47మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను ఆరాధించలేదు.48కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ 2 యెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు.

49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.50వాళ్ళు క్రూరత్వం నిండినవారై ముసలివాళ్ళను, పసి పిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు.51మిమ్మల్ని నాశనం చేసే వరకూ మీ పశువులనూ మీ పొలాల పంటనూ దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకూ మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రె మేకమందలు మీకు మిగలకుండా చేస్తారు.

52మీరు ఆశ్రయించే ఎత్తయిన కోట గోడలు కూలిపోయే వరకూ మీ దేశమంతా మీ పట్టణ ద్వారాల దగ్గర వారు మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ దేశమంతటిలో మీ పట్టణ గుమ్మాల దగ్గర మిమ్మల్ని ముట్టడిస్తారు.53ఆ ముట్టడిలో మీ శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తాళలేక మీ సంతానాన్ని, అంటే మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మీ కొడుకులను, కూతుళ్ళను చంపి, వాళ్ళ మాంసం మీరు తింటారు.

54మీలో మృదు స్వభావి, సుకుమారత్వం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల మాంసాన్ని తింటాడు. వాటిలో కొంచెమైనా తన సోదరునికి గానీ, తన ప్రియమైన భార్యకుగానీ, తన మిగతా పిల్లలకు గానీ మిగల్చడు. వాళ్ళపై జాలి చూపడు.55ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో ముట్టడిలో అతనికేమీ మిగలదు.

56మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు.57వారిపట్ల దయ చూపించదు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిని ముట్టడించి మిమ్మల్ని దోచుకోవడం వల్ల, కడుపు నింపుకోవడానికి మీకేమీ మిగలదు.

58ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక, మీ యెహోవా దేవుని ఘనమైన నామానికి, భయభక్తులు కనపరచకపోతే59యెహోవా మీకూ మీ సంతానానికీ దీర్ఘకాలం ఉండే, మానని భయంకరమైన రోగాలు, తెగుళ్ళు రప్పిస్తాడు.

60మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీమీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు.61మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు.62మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు.

63మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు.64యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.

65ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవా చేస్తాడు.66చస్తామో, బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలూ రాత్రి భయం భయంగా గడుపుతారు.

67రాత్రింబవళ్ళూ భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనీ, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు.

68మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలోగుండా యెహోవా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు కానీ మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు.>>


1 28:22 అనావృష్టి, లేదా కత్తితో.
2 28:48 లేక శత్రువులు

Chapter 29

నిబంధన పునరుద్ధరణ

1యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.

2మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు.<<యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా,3అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు.4అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు.

5నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు.6మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు.

7మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు8మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము.9కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి.

10మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ,11అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకుని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు.
12మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా13ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు.

14నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో15ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను.16మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు.
17వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు.

18ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు.19అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ <నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది> అనుకుంటాడు.

20యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు.21ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి 1 వెళ్ళ గొట్టేస్తాడు.

22కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు.23యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,24వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.

25అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. <వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు.26తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు.
27కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది.

28యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.>

29రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.>>


1 29:21 అతణ్ణి మిగతా వారికోసం ఒక గుణపాఠం గా చేస్తాడు.

Chapter 30

దేవుని వైపు తిరిగి తరువాత అభివృద్ధి

1<<నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన2అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే3మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

4చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.5మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.

6మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.

7మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు.8మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.

9మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు.10ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

11ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు.12<మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?> అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు.
13<మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?> అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు.14మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది.

15చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను.16మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

17అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే18మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను.
19ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.20మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.>>

Chapter 31

ఇశ్రాయేలు ప్రజలకు నూతన నాయకుడుగా యెహోషువ

1మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు, <<నాకు ఇప్పుడు 120 ఏళ్ళు.2ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు.3మీ యెహోవా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాలను మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు.

4యెహోవా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకూ, వారి దేశాలకూ ఏమి జరిగించాడో అలానే వారికీ చేస్తాడు.5మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారిపట్ల చెయ్యండి.6నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.>>

7మోషే యెహోషువను పిలిచి, <<నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి.8నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు>> అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.
దేవుని ధర్మ శాస్త్రం చదవడం

9మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి, యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకూ ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు.10మోషే వారికిలా ఆజ్ఞాపించాడు, <<ప్రతి ఏడవ సంవత్సరంలో అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో పర్ణశాలల పండగ సమయంలో11మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి.

12మీ యెహోవా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి.13అలా చేస్తే, ఆ వాక్యాలు ఎరగనివారి పిల్లలు వాటిని విని, మీరు స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవా దేవునికి భయపడడం నేర్చుకుంటారు.>>
ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు అంచనా

14యెహోవా, మోషేతో ఇలా చెప్పాడు. <<చూడు. నువ్వు తప్పకుండా చనిపోయే రోజు వస్తుంది. నువ్వు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలు ఇవ్వడానికి సన్నిధి గుడారంలో నిలబడండి.>>15మోషే, యెహోషువలు సన్నిధి గుడారంలో నిలబడ్డారు. యెహోవా మేఘస్తంభంలో నుండి గుడారం దగ్గర కనిపించాడు. ఆ మేఘస్తంభం గుడారపు ద్వారం పైగా నిలిచింది.

16యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.

17అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు.18వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి, చేసిన దుర్మార్గమంతటిబట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను.

19కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పండి. ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నీకు సాక్ష్యంగా ఉండేలా దాన్ని వారికి కంఠస్తం అయ్యేలా నేర్పించండి.20నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించిన తరువాత వారు తిని తాగి తృప్తిపొంది అహంకారం తెచ్చుకుంటారు. ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి నన్ను విడిచిపెట్టి నా నిబంధన మీరతారు.

21ఎన్నో ఆపదలూ కష్టాలూ వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ పాట వారి ఎదుట సాక్షిగా నిలబడి సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఆ పాట మరచిపోకుండా ఉండేలా వారి సంతానానికి కంఠోపాఠంగా ఉంటుంది. ఎందుకంటే, నేను ప్రమాణం చేసిన దేశంలో వాళ్ళను నడిపించక ముందే, ఈనాడే వాళ్ళు జరిగించే ఆలోచన నాకు తెలుసు>> అన్నాడు.

22మోషే ఆ రోజు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు.23యెహోవా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. <<నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను.>>

24మోషే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ గ్రంథంలో పూర్తిగా రాయడం ముగించిన తరువాత25యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులను చూసి మోషే ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ యెహోవా దేవుని నిబంధన మందసం పక్కన ఉంచండి.26అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది.

27మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు.28నేను చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా! మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులనూ నా దగ్గరికి తీసుకురండి. ఆకాశాన్నీ భూమినీ వారిమీద సాక్ష్యంగా పెట్టి నేనీ మాటలను వాళ్ళు వినేలా చెబుతాను.

29ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి.

30తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు వింటుండగా ఈ పాట పూర్తిగా పాడి వినిపించాడు.

Chapter 32

1ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి.

భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు.
2నా ఉపదేశం వానలా కురుస్తుంది.
నా మాటలు మంచు బిందువుల్లా,
లేతగడ్డిపై పడే చినుకుల్లా,
పచ్చికపై కురిసే చిరుజల్లులా,
మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.
3నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.
మన దేవునికి ఘనత ఆపాదించండి.
4ఆయన మనకు ఆశ్రయ దుర్గం.
ఆయన పని పరిపూర్ణం.
ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి.
ఆయన నమ్మదగిన దేవుడు.
ఆయన పక్షపాతం చూపని దేవుడు.
ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
5వారు తమను తాము చెడగొట్టుకున్నారు.
వారు ఆయన సంతానం కారు.
వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం.
6బుద్ధి, ఇంగితం లేని మనుషులారా,
యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక?
ఆయన మీ తండ్రి కాడా?
ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?
7గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి.
మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు.
పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.
8మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు,
మానవ జాతులను వేరు పరచినపుడు,
ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు.
9యెహోవా వంతు ఆయన ప్రజలే.
ఆయన వారసత్వం యాకోబు సంతానమే.
10ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు.
బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు.
తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.
11గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ
రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.
12యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు.
వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు.
13లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు.
పొలాల పంటలు వారికి తినిపించాడు.
కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.
14ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ,
గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను,
మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు.
మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
151 యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు,
మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు.
యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు.
తన రక్షణ శిలను నిరాకరించాడు.
16వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు.
అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.
17వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు.
తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ,
మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.
18నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు,
నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.
19యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు,
తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.
20ఆయనిలా అన్నాడు. <<వారికి నా ముఖాన్ని దాచు కుంటాను.
వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను.
వాళ్ళు మొండి తరం,
విశ్వసనీయత లేని పిల్లలు.
21దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు.
తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు.
ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను.
తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
22నా కోపాగ్ని రగులుకుంది.
పాతాళ అగాధం వరకూ అది మండుతుంది.
భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది.
పర్వతాల పునాదులను రగులబెడుతుంది.
23వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను.
వారి మీదికి నా బాణాలు వదులుతాను.
24వారు కరువుతో అల్లాడతారు.
ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు.
దుమ్ములో పాకే వాటి విషాన్నీ
అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.
25బయట కత్తి చావు తెస్తుంది.
పడక గదుల్లో భయం పీడిస్తుంది.
యువకులూ, కన్యలూ, పసికందులూ,
నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.
26వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను.
వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను.
27కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే,
వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో,
వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, <పైచెయ్యి మనదే,
ఇది చేసింది యెహోవా కాదు> అంటారేమో.>>
28ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ.
వాళ్ళలో వివేకమే లేదు.
29వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే,
వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,
30వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే,
యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే,
ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు?
పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?
31మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు.
మన శత్రువులే దీనికి సాక్షులు.
32వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది.
అది గొమొర్రా పొలాల్లోనిది.
వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు.
వాటి గెలలు చేదు.
33వారి ద్రాక్షారసం పాము విషం.
నాగుపాముల క్రూర విషం.
34ఇది నా రహస్య ఆలోచన కాదా?
నా ఖజానాల్లో భద్రంగా లేదా?
35వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే.
ప్రతిఫలమిచ్చేది నేనే.
వారి ఆపద్దినం దగ్గర పడింది.
వారి అంతం త్వరగా వస్తుంది.
36బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే,
వారికి ఆధారం లేనప్పుడు చూసి,
తన సేవకులకు జాలి చూపిస్తాడు,
తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.
37అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ?
వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?
38వారికి ఆధారం లేనప్పుడు చూసి,
వారి నైవేద్యాల కొవ్వు తిని,
వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ?
వారు లేచి మీకు సాయపడనివ్వండి.
వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి.
39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి.
నేను తప్ప మరో దేవుడు లేడు.
చంపేది నేనే, బతికించేది నేనే.
దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే.
నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.
40ఆకాశం వైపు నా చెయ్యెత్తి
నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.
41నేను తళతళలాడే నా కత్తి నూరి,
నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే,
నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను.
నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
42నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను.

నా కత్తి, మాంసం భక్షిస్తుంది!

చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ,
శత్రువు అధికారులనూ అవి తింటాయి.

43ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి.
వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు.
తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు.
తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.

44మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.45మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.

46తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.47ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.

48అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,49అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
50నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.51ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.52నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.


1 32:15 నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్

Chapter 33

గోత్రాలు గూర్చి మోషే పలికిన దీవెనలు

1దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు,

యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు

2శేయీరు నుంచి వారికి ఉదయించాడు.
ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు
వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు.
ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.
3నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు.
ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు,
వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.
4మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు,
యాకోబు సమాజానికి అది వారసత్వం.
5అప్పుడు ప్రజల అధికారులూ
ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే
యెహోవా యెషూరూనులో రాజయ్యాడు.
6రూబేను చావకూడదు. బతకాలి.
అయితే వారు కొద్ది మంది మాత్రమే.
7యూదా గురించి మోషే ఇలా పలికాడు,
యెహోవా, యూదా ప్రజల మనవి విని,
మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు.
అతని కోసం పోరాడు.
అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి
8లేవీ గురించి మోషే ఇలా పలికాడు,
నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి.
మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు.
మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు.
9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి,
తన తల్లి గురించి అన్నవాడు అతడు.
తన సోదరులను లెక్క చెయ్యలేదు.
తన సొంత కొడుకులను పట్టించుకోలేదు.
ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు.
నీ నిబంధన పాటించాడు.
10అతడు యాకోబుకు నీ విధులనూ,
ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు.
అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు.
నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.
11యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు,
అతడు చేసే పనులను అంగీకరించు.
అతనికి విరోధంగా లేచే వారి,
అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు.
వాళ్ళు మళ్ళీ లేవరు.
12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు,
యెహోవాకు ప్రియుడు.
ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు.
రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు.
అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు.
13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు.
యెహోవా అతని భూమిని దీవిస్తాడు
ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో,
కింద ఉన్న జలాగాధంతో,
14సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో,
నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో,
15పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో,
శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో,
16భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో,
పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక.
తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక.
17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది.
అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు.
వాటితో అతడు ప్రజలను
భూదిగంతాలకు తోలివేస్తాడు.
వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది.
మనష్షేకు చెందిన వేలమంది.
18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు,
జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు.
ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు.
19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు.
అక్కడ సరైన బలులు అర్పిస్తారు.
వారు సముద్రాల సమృద్ధినీ
సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.
20గాదు గురించి మోషే ఇలా పలికాడు.
గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన.
ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది
చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
21అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు.
నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది.
ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు,
యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు.
ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు.
22దాను విషయం మోషే ఇలా పలికాడు,
దాను సింహపు పిల్ల వంటిది
అది బాషానునుంచి దూకుతుంది.
23నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు.
కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి,
యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి,
పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.
24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు,
మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన.
తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు.
తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు
25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ.
నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే.
26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు
నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు
తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు.
27నిత్య దేవుడు నీకు ఆశ్రయం,
శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి.
శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు.
నాశనం చెయ్యి! అంటాడు.
28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు.
యాకోబు 1 నివాసం సురక్షితం.
ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో
అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
29ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు!
యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు?
ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు,
ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు.
నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు
నువ్వు వారి 2 ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.


1 33:28 యాకోబు నీటి ఊట
2 33:29 వీపులను

Chapter 34

మోషే మరణం

1ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు.2దాను వరకూ గిలాదు ప్రదేశాన్నీ, నఫ్తాలి ప్రాంతాన్నీ, ఎఫ్రాయీము మనష్షే ప్రాంతాన్ని, పశ్చిమ సముద్రం వరకూ యూదా ప్రాంతమంతా,3దక్షిణ దేశాన్నీ, ఈత చెట్లు ఉన్న యెరికో పట్టణం నుంచి సోయరు వరకూ ఉన్న మైదానాన్నీ అతనికి చూపించాడు.

4యెహోవా అతనితో ఇలా చెప్పాడు. <<నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.>>

5యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు.6బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతణ్ణి సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.

7మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు. అతని బలం తగ్గలేదు.8ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి.

9నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

10యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ11అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు.12మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.

యెహోషువా

Chapter 1

యెహోషువకు యెహోవా ఆదేశాలు

1యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత, నూను కుమారుడు, మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. <<నా సేవకుడు మోషే చనిపోయాడు.2కాబట్టి నీవు లేచి, నీవూ ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి.3నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ మీకు ఇచ్చాను.

4ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు.5నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను.
6నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.

7అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు.
8ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.9నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.>>

10అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు <<మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి,11<మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.> >>

12రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు,13<<యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు.
14మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా15నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.>>

16దానికి వారు <<నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం.17మోషే చెప్పిన ప్రతి మాటా మేము విన్నట్టు నీ మాటా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక.18నీమీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు>> అని యెహోషువతో చెప్పారు.

Chapter 2

రాహాబు, ఇద్దరు గూఢచారులు

1నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి <<మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి>> అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు.

2దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది.3అతడు తన మనుషులను పంపి <<నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు>> అని రాహాబుకు కబురు పంపాడు.

4ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో <<మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే,5వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు>> అని చెప్పింది.
6అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.

7రాజు పంపిన ఆ మనుషులు యొర్దాను నది దాటే రేవుల వెంబడి వాళ్ళను పట్టుకోవడానికి వెళ్లారు. తరమడానికి వెళ్ళిన మనుషులు బయటికి వెళ్ళగానే కోట తలుపులు మూసేశారు.

8ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది,9<<యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు.
10మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం.11వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.

12కాబట్టి ఇప్పుడు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. నేను మీకు ఉపకారం చేసినట్టే మీరూ నా తండ్రి కుటుంబానికి ఉపకారం చేయండి.13నా తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు కచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి>> అంది.

14అందుకు వారు ఆమెతో <<నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం>> అన్నారు.

15ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది, ఆమె ప్రాకారం మీద నివాసం ఉంటున్నది కాబట్టి తాడువేసి కిటికీ గుండా వాళ్ళని దింపింది.16ఆమె <<మిమ్మల్ని తరమడానికి వెళ్ళినవాళ్ళు మీకెదురొస్తారేమో, వారు తిరిగి వచ్చేవరకూ మీరు కొండలకు వెళ్లి మూడురోజులు అక్కడ దాక్కుని ఉండండి, తరువాత మీ దారిన మీరు వెళ్ళండి>> అని వారితో చెప్పింది.

17ఆ మనుషులు ఆమెతో <<మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా
18మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్ర తాడు కట్టి, నీ తండ్రినీ నీ తల్లినీ నీ అన్నదమ్ములనూ నీ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నీ ఇంటికి తెచ్చుకో.19నీ ఇంట్లోనుండి ఎవరన్నా బయటికి వస్తే మాత్రం తన ప్రాణానికి తానే బాధ్యుడు, మేము నిర్దోషులం. అయితే నీ దగ్గర నీ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఏ అపాయమైనా కలిగితే దానికి మేమే జవాబుదారులం.
20నీవు మా సంగతి వెల్లడి చేస్తే నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మాకు దోషం ఉండదు>> అన్నారు.

21అందుకు ఆమె <<మీ మాట ప్రకారం జరుగుతుంది>> అని చెప్పి వాళ్ళను పంపివేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్ర తాడును కిటికీకి కట్టింది.
22వారు వెళ్లి కొండలు ఎక్కి తమను తరిమేవారు తిరిగి వచ్చేవరకూ మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. తరిమేవారు ఆ మార్గమంతా వారిని వెదికారు గానీ వారు కనబడలేదు.

23ఆ ఇద్దరు మనుషులు కొండలు దిగి యొర్దాను నది దాటి నూను కుమారుడు యెహోషువ దగ్గరికి వచ్చి తమకు జరిగిందంతా అతనితో వివరంగా చెప్పారు.24వారు <<ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో ఆ దేశనివాసులందరికీ ధైర్యం చెడింది>> అని యెహోషువతో చెప్పారు.

Chapter 3

యొర్దాను దాటడం

1యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు.

2మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు,3<<మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి.4మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల1 దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.>>

5యెహోషువ ప్రజలతో <<రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి>> అన్నాడు.6అతడు యాజకులతో <<మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి>> అని చెప్పాడు.

వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు.

7అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. <<నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను.8మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.>>

9కాబట్టి యెహోషువ <<మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి>> అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి,10వారితో ఇలా చెప్పాడు. <<సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి11జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు.

12కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి.13సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.>>

14కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు.15అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే16పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు.
17ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.


1 3:4 రెండువేల మూరల ఒక కిలోమీటరు

Chapter 4

1ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు.2<<ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని ఏర్పరచి3యాజకుల కాళ్లు నిలిచిన స్థలం లో యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని బయటికి తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారి కాజ్ఞాపించు.>>

4కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరచిన పన్నెండు మందిని, అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి,5వారితో ఇలా అన్నాడు. <<యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట నుండి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడూ ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి.
6ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, <యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి.7యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఈ రాళ్లు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ఉంటాయి> అని వారితో చెప్పాలి.>>

8యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు.9అప్పుడు యెహోషువ నిబంధన మందసాన్ని మోసే యాజకుల కాళ్లు యొర్దాను మధ్య నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలబెట్టించాడు. నేటి వరకూ అవి అక్కడ ఉన్నాయి.

10ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతా, అంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకూ యాజకులు మందసాన్ని మోస్తూ యొర్దాను మధ్య నిలబడగా ప్రజలు త్వరపడి దాటారు.11ప్రజలందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసం మోసే యాజకులు దాటారు.

12ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులూ గాదీయులూ మనష్షే అర్థగోత్రపు వారూ మోషే వారితో చెప్పినట్టు యుద్ధసన్నద్ధులై దాటారు.13సేనలో ఇంచుమించు నలభై వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధం చేయడానికి యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు వచ్చారు.14ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు.

15యెహోవా <<సాక్ష్యపు మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు>>16అని యెహోషువతో చెప్పినప్పుడు
17యెహోషువ <<యొర్దానులో నుండి ఎక్కి రండి>> అని యాజకులకు ఆజ్ఞాపించాడు.18యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటిలాగే తమ చోటికి మళ్ళి దాని గట్లన్నిటి మీదా పొర్లి ప్రవహించాయి.

19మొదటి నెల పదో తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే20యొర్దానులో నుండి వారు తెచ్చిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి21ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు<<రాబోయే కాలంలో మీ సంతానం <ఈ రాళ్ళు ఎందుకు> అని వారి తండ్రులను అడిగితే,
22అప్పుడు మీరు, <ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు> అని చెప్పాలి.

23యెహోవా బాహువు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోడానికీ24మీరు ఎప్పుడూ మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడానికీ, మేము దాటేవరకూ మీ దేవుడు యెహోవా తానే మన ముందు ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండి పోయేలా చేశాడో అలాగే మీరు దాటే వరకూ యొర్దాను నీళ్ళను కూడా ఎండి పోయేలా చేశాడని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి.>>

Chapter 5

1వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.

గిల్గాలు దాటడం, సున్నతి పొందడం

2ఆ సమయంలో యెహోవా <<రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు>> అని యెహోషువకు ఆజ్ఞాపించాడు.3యెహోషువ రాతి కత్తులు చేయించి <<గిబియత్ హరాలోత్1 >> అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.

4యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు.5బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు.

6యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే2 దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు.7ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు.

8కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు.9అప్పుడు యెహోవా <<ఈ రోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేశాను>> అని యెహోషువతో అన్నాడు. అప్పటినుండి నేటివరకూ ఆ స్థలానికి <<గిల్గాలు3 >> అని పేరు.

10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగో రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు.11పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు.
12ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు.
యెరికో పతనం

13యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి <<నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా>> అని అడిగాడు.
14అతడు <<కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను>> అన్నాడు.

యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి <<నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు>> అని అడిగాడు.

15అందుకు యెహోవా సేనాధిపతి <<నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి>> అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.


1 5:3 గిబియత్ హరాలోత్ సున్నతి కొండ
2 5:6 పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన భూమి, నిర్గమ 3:8 చూడండి
3 5:9 గిల్గాలు దొర్లించే

Chapter 6

1ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.

2అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. <<చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను.
3మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.4అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి.
5మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి>> అన్నాడు.

6నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి <<మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి>> అని వారితో చెప్పాడు.7తరువాత అతడు <<మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి>> అని ప్రజలతో చెప్పాడు.

8యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది.9యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు.

10యెహోషువ <<మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి>> అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు.11ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు.

12యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు.13ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు.14ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.

15ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు.16ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు <<కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.>>

17<<ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు.18శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు.19వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.>>

20యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.21వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.

22అయితే యెహోషువ <<ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి>> అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు.
23వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు.24తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు.

25రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.

26అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి వారికిలా ఆజ్ఞాపించాడు <<ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్దకొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినపుడు వాడి చిన్నకొడుకు మరణిస్తాడు.>>27యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.

Chapter 7

ఆకాను పాపం

1శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.

2యెహోషువ <<మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి>> అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు.3వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి <<ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు>> అన్నారు.

4కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు.5హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము1 వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు.

కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి.

6యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ7<<అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా.
8ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి?9కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు>> అని ప్రార్థించారు.

10అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు <<లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు?11ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు.12కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.

13నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, <రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసేవరకూ మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.>
14ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరికి రావాలి.15అప్పుడు శాపానికి గురైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్నీ అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు>> అని చెప్పాడు.

16కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదాగోత్రం పట్టుబడింది.17యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడింది. జెరహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్ది దొరికాడు.18అతడినీ అతని ఇంటివారిని పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనుమడూ జబ్ది మనుమడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను దొరికాడు.

19అప్పుడు యెహోషువ ఆకానుతో <<నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు>> అని అన్నాడు.20అందుకు ఆకాను యెహోషువతో <<ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే.21దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది>> అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు.

22అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు.23కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకు యెహోషువ దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు.

24తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారులనూ, కుమార్తెలనూ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.

25అప్పుడు యెహోషువ <<నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు>> అనగానే ఇశ్రాయేలీయులంతా అతణ్ణి రాళ్లతో చావగొట్టారు.26తరువాత ఆ వస్తువులనూ రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకూ ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటి వరకూ ఆ చోటికి <<ఆకోరు లోయ2 >> అని పేరు.


1 7:5 షేబారీము రాళ్ళు క్వారీ
2 7:26 ఆకోరు లోయ భాదల లోయ

Chapter 8

హాయి నగరం నాశనం

1కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. <<భయపడకు, జడియకు, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడూ, నేను హాయి రాజునూ, అతని ప్రజలనూ, అతని పట్టణాన్నీ, అతని దేశాన్నీ నీ చేతికప్పగించాను.2నీవు యెరికోకూ, దాని రాజుకూ, ఏమి చేశావో అదే హాయికీ, దాని రాజుకూ చేస్తావు, అయితే దోపుడు సొమ్మునీ పశువులనూ మీరు బాగా దోచుకోవాలి. పట్టణపు పడమటి వైపు మాటుగాళ్ళను ఉంచు.>>

3యెహోషువ, హాయి మీదికి వెళ్ళడానికి పరాక్రమవంతులైన ముప్ఫై వేల మంది శూరులను ఏర్పరచుకుని రాత్రివేళ వారిని పంపాడు.

4అతడు వారికిలా ఆజ్ఞాపించాడు. <<ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోడానికి మీరు పొంచి ఉండాలి, పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి.
5నేనూ, నాతో కూడా ఉన్న ప్రజలంతా పట్టణానికి చేరుకుంటాం, వారు ఇంతకు ముందులాగా మమ్మల్ని ఎదుర్కోడానికి రాగానే మేము పారిపోతాం.6ఇంతకు ముందులాగానే <వారు మన ముందు నిలవలేక పారిపోతున్నారు> అనుకుని, వారు మా వెంటబడతారు, పట్టణం నుండి వారు బయటికి రాగానే7మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి, మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు.
8మీరు ఆ పట్టణాన్ని పట్టుకొన్నప్పుడు యెహోవా మాట ప్రకారం దాన్ని తగలబెట్టాలి. ఇదే నేను మీకాజ్ఞాపిస్తున్నాను.>>

9యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు.
10ఉదయమే యెహోషువ లేచి ప్రజలను వ్యూహంగా సమకూర్చి తానూ, ఇశ్రాయేలీయుల పెద్దలూ, ప్రజలకు ముందుగా పడమరగా ఉన్న హాయి మీదికి వెళ్ళారు.11అతని దగ్గరున్న యోధులందరు ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది.12అతడు ఇంచుమించు ఐదు వేలమందిని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య పొంచి ఉండటానికి నియమించాడు.
13వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు.

14హాయి రాజు దాన్ని చూసి అతడూ, అతని ప్రజలంతా, త్వరపడి పెందలకడే లేచి మైదానం ఎదురుగా ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకు ముందు నిర్ణయించుకొన్న స్థలం లో యుద్ధం చేయడానికి బయలుదేరారు. తనను పట్టుకోడానికి వారు పట్టణానికి పడమటి వైపున పొంచి ఉన్న సంగతి అతడు తెలుసుకోలేక పోయాడు.

15యెహోషువ, ఇశ్రాయేలీయులందరూ వారి ముందు నిలవలేక ఓడిపోయినట్టు అరణ్యమార్గం వైపు పారిపోతుండగా16వారిని ఆత్రుతగా తరమడానికి హాయిలో ఉన్న వారందరూ పోగై యెహోషువను తరుముతూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు.17ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లనివారు హాయిలో గాని, బేతేలులో గాని ఒక్కరూ మిగల్లేదు. వారు ద్వారం మూయకుండానే పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్ళిపోయారు.

18అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. <<నీవు చేతిలో పట్టుకొన్న ఈటెను హాయి వైపు చాపు, పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను.>> అప్పుడు యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాడు.19అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటు వేసిన చోటనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోకి చొచ్చుకుపోయి దాన్ని పట్టుకుని వెంటనే అప్పటికప్పుడే తగులబెట్టేశారు.

20హాయివారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ పట్టణం పొగ ఆకాశానికి ఎక్కుతూ ఉంది. అప్పుడు అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు యోధులు వెనక్కి తిరిగి తమను తరుముతున్న వారిమీద దాడిచేసేటప్పటికి ఈ వైపు గానీ, ఆ వైపు గానీ, ఎటూ పారిపోవడానికి వారికి వీలు లేకపోయింది.21పొంచి ఉన్నవారు పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణంలో పొగ పైకి రావడం యెహోషువ, ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వారు హాయి వారిని హతం చేశారు.

22తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయివారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు.

23వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
24ఎడారిలోను, పొలంలోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు కత్తివాత హతం కాకుండా మిగిలిన వాడొక్కడు కూడా లేకపోవడంతో చంపడం చాలించి అందరూ హాయికి తిరిగి వచ్చారు, హాయిని పూర్తిగా కత్తితో నిర్మూలం చేశారు.

25ఆ దినాన్న చనిపోయిన స్త్రీ పురుషులందరు మొత్తం పన్నెండు వేలమంది.26యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలం చేసేవరకూ ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు.
27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులనూ సొమ్మునీ తమ కోసం పూర్తిగా దోచుకున్నారు.

28అలా యెహోషువ, హాయి ఎప్పటికీ పాడు దిబ్బగా ఉండాలని దాన్ని కాల్చివేశాడు, ఇప్పటికీ అది అలాగే ఉంది.
29యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకూ ఉరికొయ్య మీద వేలాడదీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు యెహోషువ ఆజ్ఞతో ప్రజలు అతని శవాన్ని మానుమీద నుండి దించి ఆ పట్టణ ద్వారం ముందు దాన్ని విసిరేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేశారు. అది నేటి వరకూ ఉంది.
ఏబాలు కొండ మీద బలిపీఠాన్ని తిరిగి స్థిరపరచడం

30మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసిన ప్రకారం31యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామాన బలిపీఠాన్ని ఇనుప పనిముట్లు తగలని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించాడు. దాని మీద వారు యెహోవాకు దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.32మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రగ్రంథం ప్రతిని అతడు అక్కడ ఇశ్రాయేలీయుల సమక్షంలో ఆ రాళ్ల మీద రాయించాడు.

33అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించడానికి యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినట్టు జరగాలని, ఇశ్రాయేలీయులంతా వారి పెద్దలూ వారి నాయకులూ వారిలో పుట్టినవారూ, పరదేశులూ, వారి న్యాయాధిపతులూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులైన లేవీయుల ఎదుట ఆ మందసానికి ఈ వైపున, ఆ వైపున నిలబడ్డారు. వారిలో సగం మంది గెరిజీము కొండ ముందూ సగం మంది ఏబాలు కొండ ముందూ నిలబడ్డారు.

34యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అంటే దాని దీవెన వచనాలనూ దాని శాప వచనాలనూ చదివి వినిపించాడు. స్త్రీలూ పిల్లలూ వారి మధ్య ఉన్న పరదేశులూ వింటూ ఉండగా35యెహోషువ సర్వసమాజం ముందు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.

Chapter 9

కుయుక్తిపరులైన గిబియోను ప్రజలు

1యొర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబానోను ముందు ఉన్న మహా సముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు2వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.

3యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు4వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,5పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.

6వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి <<మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి>> అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.7అప్పుడు ఇశ్రాయేలీయులు <<మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం?>> అని ఆ హివ్వీయులతో అన్నారు.8వారు <<మేము నీ దాసులం>> అని యెహోషువతో చెప్పారు. యెహోషువ <<మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు?>> అని వారిని అడిగాడు.

9వారు<<నీ దేవుడైన యెహోవా నామాన్నిబట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ,10యొర్దాను తీరంలో ఉన్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం.
11అప్పుడు మా పెద్దలూ మా దేశ ప్రజలంతా మాతో, మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్లి వారితో <మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి> అని మీతో చెప్పమన్నారు.12మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ళనుండి తెచ్చుకొన్న వేడి ఆహార పదార్ధాలు ఇవే, ఇప్పటికి అవి యెండిపోయి ముక్కలయ్యాయి.13ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి>> అని అతనితో చెప్పారు.

14ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.15యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
16అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.

17ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.
18ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.

19దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. <<మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.
20మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి>> అని చెప్పారు.21నాయకులు <<వారిని బతకనియ్యండి>> అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.

22యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. <<మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?23ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు>> అన్నాడు.

24అందుకు వారు యెహోషువను చూసి <<నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.25కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో, అదే మాకు చెయ్యి>> అని యెహోషువకు జవాబిచ్చారు.

26కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లోనుండి విడిపించాడు.27అయితే సమాజం కోసమూ యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసమూ కట్టెలు నరికే వారుగా నీళ్లు తోడేవారుగా యెహోషువ ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటివరకూ వారు ఆ పని చేస్తూనే ఉన్నారు.

Chapter 10

నిలిచిపోయిన సూర్యుడు

1యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.2ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు <<గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం>> అని

3హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ4లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.

5కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6అప్పుడు <<గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు>> అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.

7వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
8అప్పుడు యెహోవా <<వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు>> అని యెహోషువతో చెప్పగానే,
9యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.

10అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
11వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.

12యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు,
<<సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో.
చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.>>
13<<ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు,
చంద్రుడు ఆగిపోయాడు>> అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా.
సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి
ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.

14యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
15అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
అమోరీయు రాజులు ఐదు గురూ చనిపోవడం

16ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.17మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
18యెహోషువ <<ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.19మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి>> అని చెప్పాడు.

20వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.21ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.

22యెహోషువ <<ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి>> అని చెప్పగానే,23వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు- ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
24వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో <<మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి>> అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.

25అప్పుడు యెహోషువ వారితో <<మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు>> అన్నాడు.
26తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.27పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి.
దక్షిణ నగరాలు స్వాధీనం

28ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.

29యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.30యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.

31తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా32యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.

33లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.

34తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి35ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.

36అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి37దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.

38అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి39దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.

40తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.

41కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
42ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.43తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.

Chapter 11

ఉత్తర రాజులు ఓడిపోవడం

1హాసోరు రాజు యాబీను జరిగిన ఇశ్రాయేలీయులు విజయాలు గూర్చి విని మాదోను రాజు యోబాబుకూ, షిమ్రోను రాజుకూ, అక్షాపు రాజుకూ,2ఉత్తరం వైపున ఉన్న మన్యదేశంలో కిన్నెరెతు దక్షిణం వైపున ఉన్న అరాబాలో షెఫేలాలో పడమట ఉన్న దోరు కొండ ప్రాంతంలో ఉన్న రాజులకూ,3తూర్పు పడమటి దిక్కుల్లో ఉన్న కనానీయులకూ, అమోరీయులకూ, హిత్తీయులకూ, పెరిజ్జీయులకూ, కొండ ప్రాంతంలో ఉన్న యెబూసీయులకూ, మిస్పా దేశంలోని హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకూ కబురు పంపించాడు.

4వారంతా సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరారు.5ఆ రాజులంతా కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర దిగారు.

6అప్పుడు యెహోవా <<వారికి భయపడవద్దు. రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చినవారుగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు>> అని యెహోషువతో చెప్పాడు.

7కాబట్టి యెహోషువ, అతనితో ఉన్న యోధులంతా హఠాత్తుగా మేరోము నీళ్ల దగ్గరికి వచ్చి వారిపై దాడి చేశారు.
8యెహోవా, ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి మహా సీదోను వరకూ మిశ్రేపొత్మాయిము వరకూ తూర్పు వైపు మిస్పా లోయ వరకూ వారిని తరిమి ఒక్కడు కూడా మిగలకుండా చంపారు.

9యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలుని తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు.
10ఆ సమయంలోనే యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తితో హతం చేశాడు. గతంలో హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి.11ఇశ్రాయేలు ప్రజలు దానిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కత్తితో హతం చేశారు. ఎవ్వరూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేశాడు. తరువాత అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు.

12యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణాలను వశం చేసుకుని వాటిని నాశనం చేశాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలం చేశాడు.13అయితే యెహోషువ హాసోరుని కాల్చినట్టు మట్టి దిబ్బల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు.
14ఆ పట్టణాలకు సంబంధించిన కొల్లసొమ్మునూ పశువులనూ ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. మనుషుల్లో ఒక్కర్నీ విడిచిపెట్టకుండా అందర్నీ నాశనం చేసే వరకూ కత్తితో హతం చేశారు.

15యెహోవా తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ ఆప్రకారమే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చేయకుండా విడిచిపెట్టలేదు.

16యెహోషువ శేయీరుకు పోయే హాలాకు కొండ నుండి17లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు వరకూ ఆ దేశమంతటినీ అంటే కొండ ప్రాంతాన్నీ, దక్షిణ దేశమంతటినీ, గోషేను దేశమంతటినీ, షెఫేలా ప్రదేశాన్నీ, మైదానాన్నీ, ఇశ్రాయేలు కొండలనూ వాటి లోయలనూ వాటి రాజులందర్నీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు.

18చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసాడు. గిబియోను ప్రజలూ హివ్వీయులూ కాకుండా19ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసిన పట్టణం ఇంకేదీ లేదు. ఆ పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలో తమ వశం చేసుకున్నారు.20<<వారిని నిర్మూలం చేయండి>> అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు ప్రజలు కనికరం లేకుండా వారిని నాశనం చేయడాని వీలుగా, వారు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు.

21ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో అంటే హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని వారి పట్టణాలనూ నిర్మూలం చేశాడు.22ఇశ్రాయేలు ప్రజల దేశంలో అనాకీయుల్లో ఎవడూ మిగల్లేదు. గాజా, గాతు, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలారు.

23యెహోవా మోషేతో చెప్పినట్టు, యెహోషువ దేశాన్నంతటినీ వశం చేసుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా దాన్ని అప్పగించాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా శ్రాంతిగా ఉంది.

Chapter 12

ఓడిపోయిన రాజులు

1ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,

2అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ
3తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.

4ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,5హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు.

6యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.

7యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.8కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.

9వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,

10హెబ్రోను రాజు, యర్మూతు రాజు,

11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,

12గెజెరు రాజు, దెబీరు రాజు,

13గెదెరు రాజు, హోర్మా రాజు,

14అరాదు రాజు, లిబ్నా రాజు,

15అదుల్లాము రాజు, మక్కేదా రాజు,

16బేతేలు రాజు, తప్పూయ రాజు,

17హెపెరు రాజు, ఆఫెకు రాజు,

18లష్షారోను రాజు, మాదోను రాజు,

19హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,

20అక్షాపు రాజు, తానాకు రాజు,

21మెగిద్దో రాజు, కెదెషు రాజు.

22కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,

23గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.

24వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.

Chapter 13

ఇంకా జయించవలసిన భూభాగం

1యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. <<నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది.

2ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి3కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ
4దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ5గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది.

6సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.7తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.>>
యొర్దాను తూర్పు భూభాగం విభజన

8యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు.9అదేమంటే, అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలు ఆ లోయమధ్య ఉన్న పట్టణం నుండి దీబోను వరకూ మేదెబా మైదానమంతా, అమ్మోనీయుల సరిహద్దు వరకూ
10హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు,11గిలాదూ గెషూరీయుల, మాయకాతీయుల దేశమూ హెర్మోను మన్యమంతా సల్కావరకూ బాషాను దేశమంతా12రెఫాయీయుల్లో మిగిలి ఉన్నవారిలో అష్తారోతులో ఎద్రెయీలో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు.

13కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గానీ మాయకాతీయుల దేశాన్ని గానీ పట్టుకోలేదు కాబట్టి గెషూరీయులు మాయకాతీయులు ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు.

14లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు <<ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే>> వారికి స్వాస్థ్యం.

15వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు.16వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా.
17ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,18యాహసు, కెదేమోతు, మేఫాతు,19కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు.
20అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషీమోతు,21మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు.

22ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు.23యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం.

24మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు.25వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం.26హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ.
27లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం.28ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు.

29మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం.30వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు,31గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి.
32ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.

33లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్ట లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.

Chapter 14

యొర్దాను ఉత్తర భూభాగం విభజన

1ఇశ్రాయేలీయులు కనాను దేశంలో పొందిన స్వాస్థ్యాలు ఇవి.

2మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించిన విధంగా యాజకుడు ఎలియాజరూ నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పితరుల కుటుంబాల పెద్దలూ చీట్లు వేసి, తొమ్మిది గోత్రాల వారికి అర్థగోత్రపు వారికి ఆ స్వాస్థ్యాలను పంచిపెట్టారు.3మోషే రెండు గోత్రాలకూ అర్థగోత్రానికీ యొర్దాను అవతలి వైపున స్వాస్థ్యాలను ఇచ్చాడు. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమూ ఇవ్వలేదు4యోసేపు వంశస్తులైన మనష్షే, ఎఫ్రాయిములను రెండు గోత్రాలుగా పరిగణించారు. లేవీయులకు నివసించడానికి పట్టణాలు, వారి పశువులకు, మందలకు వాటి సమీప భూములు తప్ప ఆ దేశంలో స్వాస్థ్యమేమీ ఇవ్వలేదు.5యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా చేసి ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని పంచుకున్నారు.
కాలేబుకు హెబ్రోను కేటాయించిన

6యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలా మనవి చేశాడు. <<కాదేషు బర్నేయలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చీ నిన్ను గూర్చీ చెప్పిన మాట నీకు తెలుసు.7దేశాన్ని వేగుచూడడానికి యెహోవా సేవకుడు మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాల వయసు. ఎవరికీ భయపడకుండా నేను చూసింది చూసినట్టే అతనికి సమాచారం తెచ్చాను.

8నాతో వచ్చిన నా సోదరులు ప్రజల హృదయాలు హడలిపోయేలా చేసినా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను.9ఆ రోజు మోషే నాతో ప్రమాణపూర్వకంగా <నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది> అన్నాడు.

10యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో, నాకిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు.11మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది.
12కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను.>>

13యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు.14ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి హెబ్రోను కాలేబుకు నేటివరకూ స్వాస్థ్యంగా ఉంది.15పూర్వం హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనేవాడు అనాకీయుల్లో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉండేది.

Chapter 15

యూదాకు కేటాయించిన సరిహద్దులు
15:15-19; న్యాయాధి 1:11-15

1యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.2వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు1 ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.

3వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి4అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.

5దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.

6ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.

7ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది.

ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.

8ఆ సరిహద్దు పడమట బెన్‌ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది.

ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.

9ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది.

ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.

10ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.

11ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.

12పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.

13యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.

14షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.15అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
16కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే17కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.

18ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో <<నీకేం కావాలి>> అని అడిగాడు.
19<<నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి>> అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.

20యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
21యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు:

కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,

22కీనా, దిమోనా, అదాదా,

23కెదెషు, హాసోరు, ఇత్నాను,

24జీఫు, తెలెము, బెయాలోతు,

25హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,

26అమాము, షేమ, మోలాదా,27హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,

28హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,

29బాలా, ఈయ్యె, ఎజెము,

30ఎల్తోలదు, కెసీలు, హోర్మా,

31సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,

32లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.

33మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,

34జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,

35యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,

36షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.

37సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,

38దిలాను, మిజ్పా, యొక్తయేలు,

39లాకీషు, బొస్కతు, ఎగ్లోను,

40కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,

41గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.

42లిబ్నా, ఎతెరు, ఆషాను,

43ఇప్తా, అష్నా, నెసీబు,

44కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.

45ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,

46దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.

47గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,

48మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,

49దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,

50అనాబు, ఎష్టెమో, ఆనీము,

51గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.

52ఆరాబు, దూమా, ఎషాను,

53యానీము, బేత్ తపూయ, అఫెకా,

54హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.

55మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,

56యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,

57కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.

58హల్హూలు, బేత్సూరు, గెదోరు,

59మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.

60కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.

61అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా62ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.

63యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.


1 15:2 ఉప్పు సముద్రపు మృత సముద్రం

Chapter 16

మనష్షే, ఎఫ్రాయిం

1యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి2తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది.

3అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.

4అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.
5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌ హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది.6వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి7యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది.
8తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.

9ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.
10అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.

Chapter 17

1మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి, అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు బాషాను వచ్చాయి.2మనష్షీయుల్లో మిగిలిన వారికి, అంటే అబీయెజెరీయులకూ హెలకీయులకూ అశ్రీయేలీయులకూ షెకెమీయులకూ హెపెరీయులకూ షెమీదీయులకూ వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే మగ సంతానమది.

3మనష్షే మునిమనుమడూ మాకీరు ఇనుమనుమడూ గిలాదు మనుమడూ హెపెరు కుమారుడూ అయిన సెలోపెహాదుకు కూతుర్లే గాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.4వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ, ప్రధానుల దగ్గరికి వచ్చి <<మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు>> అని చెప్పారు. కాబట్టి, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు.

5కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి.6ఎందుకంటే మనష్షీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనష్షీయులకు స్వాస్థ్యం అయింది.

7మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు తూర్పుగా ఉన్న మిక్మెతావరకూ దక్షిణాన ఏన్తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది.8తప్పూయ భూభాగం మనష్షీయులది. అయితే మనష్షీయుల సరిహద్దు లోని తప్పూయ పట్టణం ఎఫ్రాయిమీయులది అయింది.

9ఆ సరిహద్దు కానా వాగు వరకూ ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనష్షీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఎఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకూ వ్యాపించింది.10దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తరభూమి మనష్షీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది ఆషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇశ్శాఖారీయుల సరిహద్దుకు అనుకుని ఉంది.

11ఇశ్శాఖారీయుల ప్రదేశంలో ఆషేరీయుల ప్రదేశంలో బేత్ షెయాను, దాని గ్రామాలూ ఇబ్లెయాము, దాని గ్రామాలూ దోరు నివాసులు, దాని గ్రామాలూ ఏన్దోరు నివాసులు, దాని గ్రామాలూ తానాకు నివాసులు, దాని గ్రామాలూ మెగిద్దో నివాసులు, దాని గ్రామాలూ అంటే మూడు కొండల ప్రదేశం మనష్షీయులకు వచ్చింది.12కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు.
13ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు.

14అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో <<మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు>> అని మనవి చేశారు.15యెహోషువ వారితో <<మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయులు రెఫాయీయులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడవి నరుక్కొని అక్కడ ఉండండి>> అన్నాడు.

16అందుకు యోసేపు వంశం వారు <<ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాల్లో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి>> అన్నారు.17అప్పడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూసి <<మీరు ఒక గొప్ప జనం,18మీది గొప్ప బలం. మీకు ఒక్క వాటా మాత్రమే ఉండకూడదు. ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దాన్ని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు>> అన్నాడు.

Chapter 18

మిగిలిన భూభాగాల పంపకం

1ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు.2ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి.

3కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. <<మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు?4ఒక్కొక్క గోత్రానికి ముగ్గుర్ని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటాతిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరికి తీసుకురావాలి.

5వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి.6మీరు ఏడు వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను.

7లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం, యొర్దాను అవతల తూర్పువైపున స్వాస్థ్యాన్ని పొందారు.>>

8ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ <<మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను>> అన్నాడు.9వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.

10వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
బెన్యామీనీయులకు వచ్చిన భూభాగం

11బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం, వాటా వచ్చింది. వారి వాటా సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకు, యోసేపు వంశస్థుల సరిహద్దుకు మధ్య ఉంది.12ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు యెరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బేతావెను అరణ్యం దగ్గర అంతం అయింది.

13అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్‌ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకూ వెళ్ళింది.

14అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బేత్‌హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనే కిర్యత్యారీము వరకూ వెళ్ళింది, అది పడమటి సరిహద్దు.
15దక్షిణం వైపు కిర్యత్యారీము కొననుండి దాని సరిహద్దు పడమరగా నెఫ్తోయ నీళ్ల ఊటవరకూ సాగి16ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్‌ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.

17అది ఉత్తరంగా ఏన్‌షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.18అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బేత్‌హోగ్లా వరకూ వెళ్ళింది.
19అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయింది. ఇది దక్షిణ సరిహద్దు.

20తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది.

21బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో, బేత్‌హోగ్లా, యెమెక్కెసీసు,

22బేత్ అరాబా, సెమరాయిము,

23బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా,

24కెఫార్ అమ్మోని, ఒప్ని, గెబా అనేవి, వాటి పల్లెలు కాక పన్నెండు పట్టణాలు.

25గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,

26కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా,

27సేలా, ఎలెపు, యెరూషలేము అనే ఎబూసు, గిబియా, కిర్యతు అనేవి. వాటి పల్లెలు పోతే పద్నాలుగు పట్టణాలు.

28వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం.

Chapter 19

షిమ్యోనుకు గోత్రం వారికి వచ్చిన భూభాగం

1రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.

2వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా,

3హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా,

4సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా,

5బేత్లబాయోతు, షారూహెను అనేవి,6వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు.

7అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు.

8దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం.9షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది.
జెబూలూను గోత్రం వారికి వచ్చిన భూభాగం

10మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది.11వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి
12శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.13అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది.
14దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది.15వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు.16ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చిన భూభాగం

17నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది.18వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను,19అబెసు, రెమెతు, ఏన్గన్నీము,
20ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ21వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు22చేరి యొర్దాను దగ్గర అంతమయింది.
23వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
ఆషేరు గోత్రం వారికి వచ్చిన భూభాగం

24అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.25వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,26అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి
27తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ28ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది.
29అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది.30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.
31వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
నఫ్తాలి గోత్రం వారికి వచ్చిన భూభాగం

32ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.33వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది.34అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.
35ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,36అదామా, రామా, హాసోరు,37కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు,
38ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు.39ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
దాను గోత్రం వారికి వచ్చిన భూభాగం

40ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది.41వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,42ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను,
43అయ్యాలోను, యెతా, ఏలోను,44తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను,45బాలాతా, యెహుదు, బెనేబెరకు,46గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం.
47దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు.48వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
యెహోషువకు వచ్చిన భూభాగం

49సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచి పెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు.50యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని, అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశంలో ఉన్న తిమ్నత్సెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు.

51యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చీట్ల వేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు.

Chapter 20

శరణార్థుల నగరాలు

1యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు,2<<నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పాలి, తెలియక పొరపాటున ఎవరినైనా చంపిన హంతకుడు పారిపోడానికి నేను మోషే ద్వారా మీతో పలికించిన ఆశ్రయ పట్టణాలు మీరు ఏర్పరచుకోవాలి.3హత్య విషయమై ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పట్టణాలవుతాయి.

4ఒకడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి ఆ పట్టణ ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దలు వినేలా తన సంగతి చెప్పిన తరువాత, వారు పట్టణంలోకి అతనిని చేర్చుకుని తమ దగ్గర నివసించడానికి స్థలమివ్వాలి.

5హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు అతనిని తరిమితే అతని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎందుకంటే అతడు పొరపాటున తన పొరుగువాని చంపాడు గాని అంతకు మునుపు వాని మీద పగపట్టలేదు.6అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ, ఆ రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ ఆ పట్టణంలోనే నివసించాలి. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయాడో ఆ పట్టణంలోని తన ఇంటికి తిరిగి రావాలి.>>

7అప్పుడు వాళ్ళు గలిలీలోని నఫ్తాలి కొండ ప్రదేశంలో ఉన్న కెదెషు, ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని షెకెం, యూదా కొండ ప్రదేశంలోని హెబ్రోను అనే కిర్యతర్బాను ప్రతిష్ఠించారు.8తూర్పు వైపున యొర్దాను అవతల యెరికో దగ్గర రూబేను గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసెరు, గాదు గోత్రం నుండి గిలాదు లోని రామోతు, మనష్షే గోత్రం నుండి బాషానులోని గోలానులను నియమించారు.
9పొరపాటున ఒకడి చంపినవాడు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేసేవాడు చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకూ ఇశ్రాయేలీయులందరికీ వారిమధ్య నివసించే పరదేశులకూ నియమించిన పట్టణాలు ఇవి.

Chapter 21

లేవీయుల పట్టణాలు

1లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికీ నూను కుమారుడు యెహోషువ దగ్గరికీ ఇశ్రాయేలీయుల గోత్రాల, కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.2అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో వారిని కలిసి <<మేము నివసించడానికి పట్టణాలనూ మా పశువులకు పచ్చిక మైదానాలనూ ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు>> అన్నారు.

3ఇశ్రాయేలీయులు యెహోవా మాట ప్రకారం తమ స్వాస్థ్యంలో ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.
4కహాతీయుల వంశాల చీటి వచ్చింది. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశం వారికి యూదా, షిమ్యోను, బెన్యామీను, గోత్రాల స్వాస్థ్యాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.

5మిగిలిన కహాతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పది పట్టణాలు వచ్చాయి.

6గెర్షోనీయులకు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్న మనష్షే అర్థ గోత్ర కుటుంబాల నుండి చీట్ల వలన పదమూడు పట్టణాలు వచ్చాయి.

7మెరారీయులకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు వచ్చాయి.
8యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చీట్లు వేసి ఆ పట్టణాలను, పచ్చిక మైదానాలను లేవీయులకు ఇచ్చారు.

9యూదా, షిమ్యోను గోత్రాల్లో ఈ కింద చెప్పిన పట్టణాలను వారికిచ్చారు.10వాటిని లేవీయులైన అహరోను వంశంలోని కహాతీయుల కుటుంబాలకు ఇచ్చారు, ఎందుకంటే మొదట పడిన చీటి ప్రకారం వంతు వారిది.
11యూదా కొండసీమలో వారికి కిర్యతర్బా, అంటే హెబ్రోను (అర్బా అనాకు తండ్రి) దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు.12అయితే ఆ పట్టణ పొలాలూ దాని పల్లెలు యెఫున్నె కుమారుడు కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు.
13హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు.14లిబ్నా, దాని పచ్చిక మైదానాలనూ యత్తీరు, దాని పచ్చిక మైదానాలనూ ఎష్టేమోయ, దాని పచ్చిక మైదానాలనూ హోలోను, దాని పచ్చిక మైదానాలనూ15దెబీరు, దాని పచ్చిక మైదానాలనూ ఆయిని, దాని పచ్చిక మైదానాలనూ యుట్టయు, దాని పచ్చిక మైదానాలనూ బేత్షెమెషు, దాని పచ్చిక మైదానాలనూ16అంటే ఆ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలనూ ఇచ్చారు.

17బెన్యామీను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే గిబియోను, దాని పచ్చిక మైదానాలనూ గెబను, దాని పచ్చిక మైదానాలనూ18అనాతోతు, దాని పచ్చిక మైదానాలనూ అల్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.19యాజకులైన అహరోను వంశం వారి పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు పోతే పదమూడు పట్టణాలు.

20కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అంటే కహాతు వంశాల్లో మిగిలినవారికి చీట్ల ద్వారా ఎఫ్రాయిం గోత్రం నుండి పట్టణాలు వచ్చాయి.21నాలుగు పట్టణాలను, అంటే ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతంలో అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలనూ గెజెరు, దాని పచ్చిక మైదానాలనూ22కిబ్సాయిం, దాని పచ్చిక మైదానాలనూ బేత్‌ హోరోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
23దాను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే ఎత్తెకేను, దాని పచ్చిక మైదానాలనూ గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలనూ24అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు.
25రెండు పట్టణాలు, అంటే మనష్షే అర్థగోత్ర కుటుంబాల నుండి తానాకు, దాని పచ్చిక మైదానాలనూ గత్రిమ్మోను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.26వాటి పచ్చిక మైదానాలు గాక కహాతు సంబంధుల్లో మిగిలినవారికి వచ్చిన పట్టణాలన్నీ పది.

27లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు రెండు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలనూ బెయెష్టెరా, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
28ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ29ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.30ఆషేరు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే మిషెయలు, దాని పచ్చిక మైదానాలనూ అబ్దోను, దాని పచ్చిక మైదానాలనూ31హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
32నఫ్తాలి గోత్రం నుండి మూడు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గలిలయలోని కెదెషు, దాని పచ్చిక మైదానాలనూ హమ్మోత్దోరు, దాని పచ్చిక మైదానాలనూ కర్తాను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.33వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని పదమూడు పట్టణాలు.

34లేవీయుల్లో మిగిలిన మెరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి నాలుగు పట్టణాలను, అంటే యొక్నెయాము, దాని పచ్చిక మైదానాలనూ35కర్తా, దాని పచ్చిక మైదానాలనూ దిమ్నా, దాని పచ్చిక మైదానాలనూ నహలాలు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
36రూబేను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే బేసెరు, దాని పచ్చిక మైదానాలనూ యాహసు, దాని పచ్చిక మైదానాలనూ37కెదెమోతు, దాని పచ్చిక మైదానాలనూ మేఫాతు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.38గాదు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలనూ మహనయీము, దాని పచ్చిక మైదానాలనూ
39హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.40వారి వారి వంశాల ప్రకారం, అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మెరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటి ద్వారా వారికి వచ్చిన పట్టణాలు పన్నెండు.
41ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ నలభై ఎనిమిది.42ఆ పట్టణాలన్నింటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.

43యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు.44యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.45యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

Chapter 22

తూర్పు గోత్రికులు స్వస్థలానికి తిరిగి రావడం

1యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలా అన్నాడు,2<<యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు.3ఇన్నిరోజులనుండి ఇప్పటి వరకూ మీరు మీ సోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

4ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే, యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి.5అయితే మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి.>>6అతడిలా చెప్పి వారిని దీవించి పంపివేశాడు. తరువాత వారు తమ నివాసాలకు వెళ్ళిపోయారు.

7మోషే బాషానులో మనష్షే అర్థగోత్రానికీ యెహోషువ పడమరగా యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్థగోత్రానికీ స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు,8<<మీరు చాలా ధనంతో అతి విస్తారమైన పశువులూ వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును మీరు, మీ సోదరులు కలిసి పంచుకోండి.>>

9కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారు యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్యభూమి అయిన గిలాదుకు వెళ్లడానికి కనాను ప్రాంతంలోని షిలోహులోని ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయలుదేరారు. కనాను ప్రాంతంలో ఉన్న యొర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు
10రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపు వారు అక్కడ యొర్దాను నది దగ్గర ఒక బలిపీఠం కట్టారు. అది చూడడానికి గొప్ప బలిపీఠమే.

11అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గర యొర్దాను ప్రదేశంలో కనాను ప్రాంతం ఎదురుగా బలిపీఠం కట్టారని ఇశ్రాయేలీయులకు సమాచారం వచ్చింది.
12ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుధ్ధం చేయడానికి షిలోహులో పోగయ్యారు.

13ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు.14అతనితో ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ప్రతిదానికీ ఒకరి చొప్పున పదిమంది ప్రముఖులను పంపించారు. వారంతా ఇశ్రాయేలీయులకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు.

15వారు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థ గోత్రం వారితో ఇలా అన్నారు,16<<యెహోవా సర్వసమాజం వారు ఇలా అంటున్నారు, <ఈ రోజు యెహోవాను అనుసరించడం మాని, మీ కోసం బలిపీఠం కట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
17పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా?1 దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది. ఇంకా మనం దానినుండి శుద్ధులం కాలేదు.18ఈ రోజు మీరు కూడా యెహోవాను అనుసరించడం మానివేస్తారా? మీరు కూడా ఈ రోజు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీదా కోపిస్తాడు.
19మీ స్వాధీనమైన ప్రదేశం అపవిత్రమైనది అయితే యెహోవా ప్రత్యక్షపు గుడారం ఉండే ప్రదేశానికి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠం కట్టి యెహోవా మీదా, మామీదా తిరగబడవద్దు.20జెరహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయంలో ద్రోహం చేసినందు వలన ఇశ్రాయేలీయుల సమాజమంతటి మీదికి ఉగ్రత రాలేదా?2 తన దోషానికి అతడొక్కడే నాశనం కాలేదు కదా.> >>

21అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు,22<<యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు.23యెహోవాను అనుసరించకుండా దహనబలి గానీ నైవేద్యం గానీ సమాధాన బలులు గానీ దానిమీద అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉంటే యెహోవాయే మమ్మల్ని శిక్షిస్తాడు గాక!
24రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో, <ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం?
25మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు> అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో.
26కాబట్టి మేము, <మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు.27మన దహనబలులూ బలులతో సమాధాన బలులతో మనం యెహోవాకు సేవచేయాలనీ, యెహోవా దగ్గర మీకు పాలు ఏదీ లేదు అనే మాట మీ పిల్లలు మా పిల్లలతో ఎన్నడూ చెప్పకుండా అది మాకు మీకు, మన తరవాతి తరాల వారి మధ్య సాక్షిగా ఉంటుంది> అనుకున్నాము.>>

28<<కాబట్టి ఇక మీదట వారు మాతో గాని మా సంతానంతో గాని అలా అంటే, మేము <మన పూర్వీకులు చేసిన బలిపీఠపు ఆకారం చూడండి, ఇది దహనబలులూ, బలి అర్పణలూ అర్పించడానికి కాదు, మాకు మీకు మధ్య సాక్షిగా ఉండడానికే> అని చెప్పాలని అనుకున్నాం.29మన దేవుడైన యెహోవా ప్రత్యక్షపు గుడారం ఎదురుగా ఉన్న ఆయన బలిపీఠం తప్ప దహనబలులకు గానీ నైవేద్యాలకు గానీ బలులకు గానీ వేరొక బలిపీఠాన్ని కట్టి, ఈ రోజు యెహోవాను అనుసరించకుండా తొలగిపోయి ఆయన మీద తిరగబడడం మాకు దూరమవుతుంది గాక.>>

30రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు చెప్పిన మాటలు యాజకుడైన ఫీనెహాసు, ప్రజల నాయకులు, అంటే అతనితో ఉన్న ఇశ్రాయేలీయుల పెద్దలు విని సంతోషించారు.31అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, రూబేనీయులతో గాదీయులతో మనష్షీయులతో <<మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు>> అని చెప్పాడు.

32అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ఆ నాయకులూ గిలాదులోని రూబేను, గాదు గోత్రాల నుండి ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వచ్చి ప్రజలకు ఆ మాట తెలియచేశారు.33అది విని ఇశ్రాయేలీయులు సంతోషించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులు గాదీయులు నివసించే ప్రదేశాన్ని పాడు చేయకుండా వారి మీద యుధ్ధం చేయడం ఆపేశారు.
34రూబేనీయులు, గాదీయులు <<యెహోవాయే దేవుడు అనడానికి ఆ బలిపీఠం మన మధ్య సాక్షి>> అని చెప్పి దానికి <<సాక్షి3 >> అనే పేరు పెట్టారు.


1 22:17 సంఖ్య 25: 1-9, కీర్తన 106: 28 చూడండి
2 22:20 7:1-26 చూడండి
3 22:34 సాక్షి ఎద

Chapter 23

యెహోషువ చివరి ఉపదేశం

1చుట్టూ ఉన్న వారి శత్రువుల నుండి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసిన తరువాత చాలా రోజులకు యెహోషువ ముసలివాడై పోయాడు.2యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలనూ వారి నాయకులనూ వారి న్యాయాధిపతులనూ వారి అధికారులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు,

<<నేను ముసలివాడినైపోయాను.

3మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరఫున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే!
4చూడండి, యొర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకూ నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు, మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను.5మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు. ఆయనే వాళ్ళను పారదోలతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీన పరచుకుంటారు.
6కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు.7మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు.8దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి.
9బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు.10మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు.11కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి.
12అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే13మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.

14ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు.15అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు.
16మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.>>

Chapter 24

షెకెంలో ఒడంబడికను తిరిగి స్థాపించడం

1యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి, వారి పెద్దలనూ అధికారులనూ న్యాయాధిపతులనూ నాయకులనూ పిలిపించినపుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు.2యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు <<ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు.

3అయితే నేను నది అవతల నుండి మీ పూర్వీకుడు అబ్రాహామును కనాను దేశానికి తీసుకొచ్చి, ఇస్సాకు ద్వారా అతని సంతానాన్ని విస్తరింపజేశాను.4ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ ఇచ్చాను. శేయీరు కొండప్రాంతాలను స్వాధీనపరచుకొనేలా ఏశావుకిచ్చాను. అయితే యాకోబు అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్ళారు.

5తరువాత నేను మోషే అహరోనులను పంపి, ఐగుప్తీయులను తెగుళ్ళతో బాధపెట్టి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను.6నేను ఐగుప్తులోనుండి మీ పూర్వీకులను రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు రథాలతో రౌతులతో వారిని ఎర్రసముద్రం వరకూ తరిమారు.

7మీ పూర్వీకులు యెహోవాకు మొర్రపెడితే ఆయన మీకూ ఐగుప్తీయులకూ మధ్య చీకటి కలిగించాడు. సముద్రం వారి మీద పడి వారిని ముంచి వేసేలా చేశాడు. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు చాలా కాలం ఎడారిలో నివసించారు.

8యొర్దాను అవతల ఉండే అమోరీయుల దేశానికి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. వారు మీతో యుద్ధం చేశారు గానీ నేను వారిని మీ చేతికి అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. వారిని మీ ముందే నాశనం చేశాను.

9తరువాత సిప్పోరు కొడుకూ మోయాబు రాజు బాలాకూ బయలుదేరి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడు బిలామును పిలిపిస్తే10నేను బిలాము మాట వినలేదు. అయితే అతడు మిమ్మల్ని దీవించాడు. అతని చేతినుండి నేనే మిమ్మల్ని విడిపించాను.
11మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. అమోరీయులూ పెరిజ్జీయులూ కనానీయులూ హీత్తీయులూ గిర్గాషీయులూ హివ్వీయులూ యెబూసీయులతో కలిసి యెరికో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను.

12నేను మీకు ముందుగా కందిరీగలను1 పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి.
13మీరు సేద్యం చేయని దేశాన్నీ మీరు కట్టని పట్టణాలనూ మీకిచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లనూ ఒలీవ తోటల పండ్లనూ తింటున్నారు.

14కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి.15యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం>> అన్నాడు.

16అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. <<యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం.17ఐగుప్తుదేశం నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి, మా కళ్ళముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు.18యెహోవా యీ దేశంలో నివసించిన అమోరీయులూ మిగతా ప్రజలందరినీ మా దగ్గరనుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం.>>

19అయితే యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు. <<యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధాలనూ మీ పాపాలనూ క్షమించడు. మీరాయన్ని సేవించలేరు.20మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళను సేవిస్తే ఆయన తన మనస్సు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు.>>

21అప్పుడు ప్రజలు<<అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాం>> అని యెహోషువతో అన్నారు.22అప్పుడు యెహోషువ<<మీరు యెహోవానే సేవిస్తామని ఆయన్ని కోరుకున్నందుకు మీ గురించి మీరే సాక్షులు>>అన్నాడు. వారు <<మేమే సాక్షులం>> అన్నారు.23అందుకతడు <<అలాగైతే మీ మధ్య ఉన్న అన్యదేవుళ్ళను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను తిప్పుకోండి>> అన్నాడు.

24ప్రజలు <<మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం>> అని యెహోషువతో చెప్పారు.25యెహోషువ ఆ రోజు ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడలనూ విధులనూ నియమించాడు.26దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో ఈ మాటలు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోషువ పరిశుద్ధస్థలం లో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టాడు.

27యెహోషువ ప్రజలందరితో <<గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. కాబట్టి అది మనమీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది>> అన్నాడు.28అప్పుడు యెహోషువ ప్రజలను ఎవరి స్వాస్థ్యానికి వారిని పంపివేశాడు.
యెహోషువ మరణం

29ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు, యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు.30అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి, తిమ్నత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండప్రాంతంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.

31యెహోషువ బతికిన కాలమంతా, యెహోషువ తరువాత యింకా బతికి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ ఎరిగిన పెద్దల కాలమంతా ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు.

32ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెంలో, అంటే యాకోబు వంద వెండి నాణేలిచ్చి షెకెం తండ్రి హమోరు కుమారుల దగ్గర కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి స్వాస్థ్యం అయింది.

33అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయీమీయుల కొండప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.


1 24:12 కందిరీగలను బెదరు, నిర్గ 23: 28 చూడండి

న్యాయాధిపతులు

Chapter 1

ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం
1:11-15; యెహో 15:15-19

1యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు.2యెహోవా <<ఆ దేశాన్ని యూదాజాతి వారికి ఇచ్చాను, వాళ్ళే ముందు వెళ్ళాలి>> అని చెప్పాడు.3అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన షిమ్యోను జాతివారితో <<మనం కనానీయులతో యుద్ధం చెయ్యడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం>> అని చెప్పారు. షిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్ళారు.

4కనానీయుల మీదికి యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించాడు గనుక వాళ్ళు బెజెకు ప్రాంతంలో పదివేలమందిని హతం చేశారు.5వాళ్ళు బెజెకు దగ్గర అదోనీ రాజు బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను, హతం చేశారు.
6అదోనీ బెజెకు పారిపోయినప్పుడు వాళ్ళు అతణ్ణి తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేశారు7అప్పుడు అదోనీ బెజెకు <<ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు>> అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు.

8యూదావంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు.9తరువాత యూదా వంశంవారు అరణ్య ప్రాంతాల్లో, దక్షిణదేశంలో లోయలో ఉన్న కనానీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు.10ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి, షేషయిని, అహీమానుని, తల్మయిని హతం చేశారు.
11వారు హెబ్రోనులొ ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదికి యుద్ధానికి వెళ్ళారు. హెబ్రోనుకు అంతకుముందు పేరు కిర్యతర్బా. అక్కడ షేషయి, ఆహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడినుండి వారు దెబీరులో కాపురం ఉంటున్నవారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిర్యత్ సేఫెరు అనే వారు.

12<<కిర్యత్ సేఫెరును కొల్లగొట్టిన వాడికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను>> అని కాలేబు ప్రకటించినప్పుడు13కాలేబు తమ్ముడు కనజు కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాడు.
14ఆమె తన భర్త ఇంటికి వచ్చాక తన తండ్రిని కొంత పొలం అడగమని అతణ్ణి ప్రేరేపించింది. ఆమె గాడిద దిగినప్పుడు కాలేబు <<నీకేం కావాలి?>> అని అడిగాడు.15అందుకు ఆమె <<నాకు దీవెన ఇవ్వు. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు>> అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు.

16మోషే మామ అయిన కేయిను వారసులు యూదావంశం వారితో కలిసి ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి1 అరాదుకు దక్షిణంవైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు.17యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి, ఆ పట్టణానికి హోర్మా2 అనే పేరు పెట్టారు.
18యూదావంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అష్కెలోనును దాని ప్రాంతాన్ని, ఎక్రోనును దాని ప్రాంతాన్ని ఆక్రమించారు.

19యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు.
20మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.21కాని, బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటివరకూ యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు.

22యోసేపు సంతతివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.23పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు24ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి <<దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం>> అని చెప్పారు.
25అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.

26ఆ వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే.

27మనష్షె గోత్రంవారు బేత్షెయానును, తయినాకును, దోరును, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు.28ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టిపనులు చేయించుకున్నారు గాని వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.

29ఎఫ్రాయిమీయులు గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు.

30జెబూలూనీయులు కిత్రోనులో ఉన్నవాళ్ళను, నహలోలు నివాసులను వెళ్లగొట్ట లేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టిపనులు చేసేవాళ్ళుగా ఉన్నారు.

31ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని,32ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ళ మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్లగొట్ట లేదు,
33బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు.

34అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్ళగొట్టారు.35అమోరీయులు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్బీములో నివాసం ఉండాలని గట్టి పట్టు పట్టినప్పుడు యోసేపు గోత్రికులు బలవంతులు గనుక వాళ్ళ చేత వెట్టిపనులు చేయించుకున్నారు.36అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హస్సెలా వరకూ వ్యాపించింది.


1 1:16 ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి యెరికో పట్టణం
2 1:17 హోర్మా నాశనం

Chapter 2

బోకీములో యెహోవా దూత
2:6-9; యెహో 24:29-31

1యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు<<నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను.2మీరు ఈ దేశవాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ళ బలిపీఠాలు విరుగగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను గాని మీరు నా మాట వినలేదు.

3మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లేలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను.>>

4యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు5ప్రజలు బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బోకీము1 అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు యెహోవాకు హోమబలి అర్పించారు.
ఇశ్రాయేలీయులు అవిధేయత

6యెహోషువ ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వాళ్ళకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు.

7యెహోషువ బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువ తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు.8నూను కుమారుడు, యెహోవా దాసుడు అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయస్సులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.
9అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయషు కొండకు ఉత్తరం దిక్కున ఉంది.

10ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది.
11ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.12ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు.13వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు.

14కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు.15వారు యుద్ధానికి ఎటు వెళ్ళినా సరే, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికీ విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది.
న్యాయాధిపతులను లేపడం

16అటు తరువాత యెహోవా వాళ్ళ కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకొనేవాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇస్రాయేల్ ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు.17వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుంచి వీళ్ళు త్వరగా తొలగిపోయి, వ్యభిచారంతో సమానంగా ఇతర దేవుళ్ళకు తమను తాము అప్పగించుకుని పూజించారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్టు వాళ్ళు అనుసరించలేదు.

18వారి శత్రువులు వారిని బాధించగా, ఆ మూలుగులు యెహోవా విని, జాలిపడి, వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి, ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు.19ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడెల్లా వాళ్ళు వెనక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లోగాని, తమ మూర్ఖ ప్రవర్తనలోగాని దేనినీ విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వికుల కంటే ఇంకా భ్రష్టులై పోయారు.

20కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు ఆయన ఇలా అన్నాడు<<ఈ ప్రజలు తమ పితరులతో నేను ఏర్పాటు చేసిన వాగ్దానంలోని షరతులు మీరి, నా మాట వినలేదు గనక,21నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను.22అందుకని యెహోషువ చనిపోయిన కాలంలో మిగిలిన శత్రుజాతుల్లో ఏ జనాంగాన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్లగొట్టను.>>23ఈ కారణంగానే యెహోవా ఆ జనాంగాన్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, వెంటనే వెళ్లగొట్టకుండా వాళ్ళను ఉండనిచ్చాడు.


1 2:5 బోకీము ఏడ్చేవాళ్ళు

Chapter 3

1ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేల్వాళ్ళందరినీ పరీక్షకు గురి చెయ్యడానికి యెహోవా ఈ శత్రు జాతులను అక్కడే ఉంచాడు2ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి:

3ఫిలిష్తీయుల ఐదుగురు నాయకుల జాతులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్హెర్మోను నుంచి హమాతునకు వెళ్ళే మార్గం వరకూ లెబానోను కొండలో ఉండే హివ్వీయులు.
4యెహోవా మోషే ద్వారా వాళ్ళ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఈ జాతులను ఆయన ఉండనిచ్చాడు.

5కాబట్టి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,6పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్య ఇశ్రాయేలీయులు నివాసం చేస్తూ వాళ్ళ కూతుళ్ళను పెళ్లిచేసుకుంటూ, వాళ్ళ కొడుకులకు తమ కూతుళ్ళను ఇస్తూ, వాళ్ళ దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు.
ఒత్నీయేలు

7ఆ విధంగా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా కనబడి, తమ దేవుడైన యెహోవాను మరచి, బయలుదేవుళ్ళను, అషేరా విగ్రహాలను పూజించారు.

8ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఆరాము నహరాయిము రాజైన కూషన్రిషాతాయిము కు బానిసలుగా ఉండడానికి వాళ్ళను అమ్మి వేశాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాలు కూషన్రిషాతాయిముకు బానిసలుగా ఉన్నారు.
9ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల కోసం నియమించి వాళ్ళను కాపాడాడు.10యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.11ఆ తరువాత నలభై సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత కనజు కొడుకు ఒత్నీయేలు చనిపోయాడు.
యెహుదు

12ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు.13అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని వెళ్లి ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూరచెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు.14ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజుకు బానిసలుగా ఉన్నారు.

15ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు
16ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద17దాన్ని కట్టుకుని, ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండే వాడు.

18ఏహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి
19గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి <<రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి>> అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళే వరకూ మాట్లాడవద్దని చెప్పాడు.20ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు <<నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది>> అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.
21అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు.22ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగి పోయింది. ఆ కత్తి అతని వెనుకనుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఏహూదు ఆ కత్తిని అతని శరీరంలోనుంచి బయటకు తీయలేదు.

23అప్పుడు ఏహూదు వసారాలోకి వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టాడు.
24అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు, రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు.25వాళ్ళు ఎంతసేపు కనిపెట్టినా రాజు ఆ గది తలుపులు తీయకపోవడంతో వాళ్ళు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూశారు. వాళ్ళ రాజు చనిపోయి నేలమీద పడి ఉన్నాడు.

26వాళ్ళు ఆలస్యం చేస్తుండగా ఏహూదు తప్పించుకుని చెక్కిన విగ్రహాలు ఉన్న పెసీలీమును దాటి శెయీరాకు పారిపోయాడు.27అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతం నుంచి దిగి అతని దగ్గరికి వచ్చారు.
28అతడు వాళ్ళతో <<నాతో రండి, యెహోవా మీ శత్రువులైన మోయాబీయులను ఓడించబోతున్నాడు>> అన్నాడు. కాబట్టి వాళ్ళు అతని వెంట దిగివచ్చి మోయాబువారికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకుని ఎవరినీ దాటనివ్వలేదు.29ఆ సమయంలో వాళ్ళు మోయాబీయుల్లో బలం, సామర్ధ్యం కలిగిన పరాక్రమవంతులైన పదివేల మందిని చంపారు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఆ దినాన మోయాబీయులు ఇశ్రాయేలీయుల బలాన్ని బట్టి అణగారిపోయారు. ఆ కారణంగా ఆ ప్రాంతం ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
షమ్గరు

30అతని తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు ఆరు వందల మంది ఫిలిష్తీయులను పశువులు కాసే మునుకోల కర్రతో చంపాడు.
31అతడు కూడా ఇశ్రాయేలీయులను ప్రమాదాల నుంచి కాపాడాడు.

Chapter 4

దెబోరా

1ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక2హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు.3అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు.

4ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.5ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు.

6ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది <<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, <నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.7యాబీను సేనాధిపతి సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని, కీషోను నది దగ్గర చేర్చి, అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను.> >>

8అప్పుడు బారాకు <<నువ్వు నాతోబాటు వస్తేనే వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్లను>> అని ఆమెతో చెప్పాడు.9అప్పుడు ఆమె <<నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే, నువ్వు చేసే ఈ ప్రయాణంవల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవా సీసెరాను అప్పగిస్తాడు>> అని చెప్పి, లేచి బారాకుతోబాటు కెదెషుకు వెళ్ళింది.

10బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు.
11దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకి చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు.

12అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను13యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కీషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు
14దెబోరా <<వెళ్ళు. యెహోవా సీసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే. యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా>> అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదినుంచి దిగి వచ్చాడు.

15బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటినీ, అతని సైనికులను కలవరపరచినప్పుడు, సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు.16బారాకు, ఆ రథాలను, సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సీసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు.

17హాసోరు రాజు యాబీనుకూ కయీనీయుడైన హెబెరు వంశస్థులకూ సంధి ఒప్పందం ఉంది గనుక సీసెరా కాలినడకన కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు.18అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి <<ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు>> అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు.
19అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు <<దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు>> అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో20అతడు <<గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి>> అన్నాడు.

21ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.22అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముకుంటూ రాగా యాయేలు అతన్ని ఎదుర్కొని <<నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తాను>> అంది. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో ఉంది.
23ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కోసం కనాను రాజు యాబీనును ఓడించాడు24తరువాత ఇశ్రాయేలీయుల కనాను రాజు యాబీనును చంపేవరకూ వారి బలం అంతకంతకూ పెరుగుతూ ఉంది.

Chapter 5

దెబోరా గీతం

1ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు,

2ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు
ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు.
మేము యెహోవాను స్తుతిస్తాం!
3రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!
నేను యెహోవాకు కీర్తన పాడుతాను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను.
4యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు,
ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు,
భూమి కంపించింది. ఆకాశం వణికింది.
మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.
5యెహోవా సముఖంలో కొండలు కంపించాయి.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖంలో సీనాయి కొండ కూడా కంపించింది.
6అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి.
ప్రయాణికులు ఎవరూ నడవని పక్క త్రోవల్లోనే నడిచారు.
7దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు.
ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది!
8ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు.
9ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు.
వారిని బట్టి యెహోవాను స్తుతించండి!
10తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ,
త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి!
11పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే1 స్వరాలు వినండి.
యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు.
ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు.
<<యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు.
12మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు!
బారాకూ వెళ్ళు, అబీనోయము కుమారా, వెళ్ళు. నీ శత్రువులను బంధించు.
13ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు
తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు.
యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు.
14కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు.
వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు.
మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబూలూనీయుల నుంచి నాయకదండం మోసేవాళ్ళూ వచ్చారు.
15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు.
ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు.
రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.
16గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు?
రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.
17గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు.
దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు?
ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు?
18జెబూలూనీయులకు మరణభయం లేదు.
వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు.
నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు.
19రాజులు వచ్చి యుద్ధం చేశారు.
మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేశారు.
20కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు.
నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి.
నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి.
21కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు.
నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో!
22గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి.
23యెహోవా దూత ఇలా అన్నాడు<మేరోజును శపించండి.>
<దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.
బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.>
24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది.
25అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది.
సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది.
ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది.
26పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది.
ఆమె అతని తల పగలగొట్టింది.
ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది.
27అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు.
ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు.
అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు.
28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది.
అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది
అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి?
అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?
29ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు.
ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది.
30<కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా?
యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా?
సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది.
రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది.
రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.>
31యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి.
ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.>>
ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.


1 5:11 విల్లుకాండ్రు చేసే పాటలు పాడేవాళ్ళ

Chapter 6

గిద్యోను

1ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు.2మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు.

3ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండేవాళ్ళు, తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండు లాగా వాళ్ళ మీదికి వచ్చి4వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు.
5వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.6దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు.

7మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు8యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు <<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, <ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను.
9ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.10మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.> >>

11అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు,12యెహోవా దూత అతనికి కనబడి <<శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు>> అని అతనితో అన్నాడు,
13గిద్యోను <<అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా>> అని అతనితో చెప్పాడు.

14అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి <<బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే>> అని చెప్పాడు.15అతడు<<నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి>> అని ఆయనతో చెప్పాడు.

16అందుకు యెహోవా <<అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు>> అని చెప్పాడు.17అందుకు అతడు <<నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు,18నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు>> అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన <<నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను>> అన్నాడు.

19అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు.20దేవుని దూత <<ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి>> అన్నాడు.
21అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు.
22గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని <<అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను>>అన్నాడు.23అప్పుడు యెహోవా <<నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు>> అని అతనితో చెప్పాడు.

24అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి <<యెహోవా సమాధానకర్త>> అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.
25ఆ రాత్రే యెహోవా <<నీ తండ్రికి చెందిన ఎద్దును, ఏడేళ్ళ వయస్సు ఉన్న రెండవ యెద్దును తీసుకు వచ్చి, నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి, దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నరికివెయ్యి.26సరి అయిన ఏర్పాటుతో ఈ బండ పైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, ఆ రెండవ ఎద్దును తీసుకు వచ్చి నువ్వు నరికిన ఆషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహనబలి ఆర్పించు>> అని అతనితో చెప్పాడు.

27కాబట్టి గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్టు చేసాడు. అతడు తన తండ్రుల కుటుంబాల వారికి, ఆ ఊరివాళ్ళకు భయపడిన కారణంగా పగటి వేళ కాక, రాత్రి సమయంలో చేసాడు.
28ఆ ఊరివాళ్ళు వేకువనే లేచినప్పుడు బయలు దేవుడు బలిపీఠం విరగ్గొట్టి ఉంది. దానికి పైగా ఉన్న దేవతా స్తంభం కూడా పడద్రోసి ఉంది. కొత్తగా కట్టిన బలిపీఠంపై రెండవ ఎద్దు అర్పణ అయిపోయి కనిపించింది.

29అప్పుడు వాళ్ళు, ఇది ఎవరు చేసిన పని, అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాకబు చేసి, యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు.

30కాబట్టి ఆ ఊరివాళ్ళు <<నీ కొడుకు బయలు బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభాన్ని పడద్రోశాడు గనుక అతడు చనిపోవాలి, వాణ్ణి బయటకు తీసుకురా>> అని యోవాషుతో చెప్పారు.
31యోవాషు, తనతో పోట్లాడుతున్న వాళ్ళందరితో<<మీరు బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలును రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు పొద్దు ఎక్కక ముందే చావాలి. ఎవడో బయలు బలిపీఠాన్ని విరగ్గొట్టాడు సరే, బయలు దేవుడే కదా, తన పక్షాన తానే వాదించుకోనివ్వండి.>>32ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా, ఆ దినాన గిద్యోనుకు <<యెరుబ్బయలు>> అని పేరు వచ్చింది.

33మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు తీరం వాళ్ళు కలిసివచ్చి, నది దాటి, యెజ్రెయేలు మైదానంలో దిగినప్పుడు
34యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబీకులు అతని దగ్గరికి వచ్చారు.35అతడు మనష్షె వారి దగ్గరికి దూతలను పంపగా వారంతా కలిసి అతని దగ్గరికి వచ్చారు. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాలవాళ్ళ దగ్గరికి దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా కూడుకొన్న వాళ్ళను కలుసుకున్నారు.

36అప్పుడు గిద్యోను దేవునితో<<నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే,37నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను>>అన్నాడు.
38అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు.

39అప్పుడు గిద్యోను <<నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు>> అని దేవునితో అన్నప్పుడు40ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.

Chapter 7

మిద్యానీయుల ఓటమి

1యెరుబ్బయలు, (అంటే గిద్యోను) అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హరోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరె కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది.

2యెహోవా గిద్యోనుతో <<నీతో ఉన్నవారు ఎక్కువ మంది. నేను వాళ్ల చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు. ఇశ్రాయేలీయులు, <నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది> అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు.3కాబట్టి నువ్వు, <భయపడి, వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లిపోవాలి> అని ప్రజలందరూ వినేలా ప్రకటించు>> అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లోనుంచి ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్లిపోయారు.

4ఇంకా అక్కడ పదివేలమంది ఉన్నారు. యెహోవా <<ఈ ప్రజలు ఇంకా ఎక్కువమందే. నీళ్ల దగ్గరికి వాళ్లను దిగేలా చెయ్యి. అక్కడ నీ కోసం వాళ్ల సంఖ్య తగ్గిస్తాను. <ఇతను నీతో కలిసి వెళ్ళాలి> అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి. <ఇతడు నీతో కలిసి వెళ్లకూడదు> అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు>> అని గిద్యోనుతో చెప్పాడు.
5అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా <<కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్ళు తాగిన వాణ్ణి, నీళ్ళు తాగడానికి మోకాళ్ళు వంచిన వాణ్ణి, వేరువేరుగా ఉంచు>> అని గిద్యోనుతో చెప్పాడు.6చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగినవాళ్ళు మూడు వందల మంది. మిగిలిన వాళ్ళందరు నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచినవాళ్ళే.

7అప్పుడు యెహోవా <<చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు>> అని గిద్యోనుతో చెప్పాడు.

8ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది.
9ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు<<నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను.10వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు.11ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది>> అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు.
12మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి.
13గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ<<నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది>> అన్నాడు.14అందుకు అతని స్నేహితుడు <<అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు>> అని జవాబిచ్చాడు.
15గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి <<లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు>> అని చెప్పి,16ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు <<నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి.
17చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి.18నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, <యెహోవాకు, గిద్యోనుకు, జయం> అని కేకలు వెయ్యాలి>> అని చెప్పాడు.

19కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు.
20అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని <<యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం>> అని కేకలు వేశారు.21వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు.

22ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు,23నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు.

24గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి <<మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి>> అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు.25వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.

Chapter 8

జెబహును, సల్మున్నాను

1అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో <<నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?>> అని అతనితో తీవ్రంగా వాదించారు.

2అందుకు అతడు<<మీరు చేసినదేమిటీ, నేను చేసినదేమిటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జెయేబు మీద మీకు జయం ఇచ్చాడు. మీరు చేసినట్టు నేను చెయ్యగలనా?>>అన్నాడు3అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది.

4గిద్యోను, అతనితో ఉన్న మూడువందల మందీ అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ, యొర్దాను దగ్గరికి వచ్చి, దాన్ని దాటారు.5అతడు సుక్కోతు వాళ్ళతో <<నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి>> అని అడిగాడు.
6సుక్కోతు అధిపతులు<<జెబహు, సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?>> అన్నారు.7అందుకు గిద్యోను <<జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను>> అని చెప్పాడు.

8అక్కడనుంచి అతడు పెనూయేలుకు వెళ్ళి అలాగే వాళ్ళనూ అడిగినప్పుడు, సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలువాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు గనుక అతడు,9<<నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను>> అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు.
10అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు.

11అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు.12జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులు జెబహును, సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటిని చెదరగొట్టాడు.

13యుద్ధం ముగిసిన తరువాత యోవాషు కొడుకు గిద్యోను14హెరెసు ఎగువనుంచి తిరిగి వచ్చి, సుక్కోతు వాళ్ళలో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చేయగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో డెబ్భై ఏడుగురి పేర్లు వివరంగా చెప్పాడు.
15అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి <<<జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?> అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, ఆ జెబహును, సల్మున్నాలను, చూడండి>> అని చెప్పి16ఆ ఊరిపెద్దలను పట్టుకుని, ముళ్ళకంపను, బొమ్మజెముడును తీసుకు వాటితో సుక్కోతు వాళ్ళకు బుద్ధి చెప్పాడు.17అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.

18గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు <<నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు>> అన్నారు.19గిద్యోను <<వాళ్ళు నా తల్లి కుమారులు. నా సహోదరులు. మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే
20యెహోవా జీవం తోడు, మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు>> అని చెప్పి, తన పెద్ద కొడుకు యెతెరును చూసి <<నువ్వు లేచి వాళ్ళని చంపు>> అన్నాడు. అతడు పసి వాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.21అప్పుడు జెబహు సల్మున్నాలు <<వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు>> అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదు

22అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో <<నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి>> అని చెప్పారు.23అందుకు గిద్యోను <<నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు>> అని చెప్పాడు.

24గిద్యోను <<మీలో ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పోగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను>> అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి.)25అందుకు ఇశ్రాయేలీయులు <<సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాము>> అని చెప్పి ఒక బట్ట పరచి, ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాడు.
26మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును1 చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు.
27కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది.
గిద్యోనుమరణం

28ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణచి వేసిన తరువాత, ఇంక వాళ్ళు తలెత్త లేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
29తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయలు2 , తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు.30గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టినవాళ్ళు డెబ్భై మంది కొడుకులు ఉన్నారు.31షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.

32యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.33గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి ఘనపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక,
34మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును3 తమకు దేవుడుగా చేసుకున్నారు.35వాళ్ళు యెరుబ్బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచిపోయి, అతని యింటివాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం, ఉపకారం చెయ్యలేదు.


1 8:26 ఏఫోదును దేవుని సేవించటానికి ప్రధాన యాజకులు వాడే పై వస్త్రం.
2 8:29 యెరుబ్బయలు గిద్యోను
3 8:34 బయల్బెరీతును బయలుతో ఒప్పందం

Chapter 9

అబీమెలెకు

1యెరుబ్బయలు కొడుకు అబీమెలెకు షెకెములో ఉన్న తన మేనమామల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో, తన తల్లి పూర్వీకుల కుటుంబాల వారితో,2<<మీరు దయ చేసి షెకెము నాయకులందరూ వినేలా వాళ్ళతో మాట్లాడండి, మీకేది మంచిది? యెరుబ్బయలు కొడుకులు డెబ్భైమంది మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకం చేసుకోండి>> అని అన్నాడు.

3అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినేలా ఆ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు <<ఇతను మన సహోదరుడు>> అనుకుని తమ హృదయం అబీమెలెకు వైపు తిప్పుకున్నారు.

4అప్పుడు వాళ్ళు బయల్బెరీతు గుడిలోనుంచి డెబ్భై తులాల వెండి తెచ్చి అతనికి ఇచ్చినప్పుడు వాటితో అబీమెలెకు అల్లరి మూకను కూలికి పెట్టుకున్నాడు. వాళ్ళు అతని వశంలో ఉన్నవాళ్ళు.
5తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యింటికి వెళ్లి యెరుబ్బయలు కొడుకులు, తన సహోదరులు అయిన ఆ డెబ్భై మందిని ఒక్క బండ మీద చంపాడు. యెరుబ్బయలు చిన్న కొడుకు యోతాము మాత్రమే దాక్కుని తప్పించుకున్నాడు.

6తరువాత షెకెము నాయకులందరూ, బెత్ మిల్లో ఇంటివారందరూ కలిసి వచ్చి షెకెములో ఉన్న మస్తకి చెట్టు కింద శిబిరం దగ్గర అబీమెలెకును రాజుగా నియమించారు.
7అది యోతాముకు తెలిసినప్పుడు అతడు వెళ్లి గెరిజీము కొండ అంచు మీద నిలబడి బిగ్గరగా పిలిచి, వాళ్ళతో ఇలా అన్నాడు,

<<షెకెము పెద్దలారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు.

8చెట్లు తమ మీద ఒక రాజును అభిషేకించుకోవాలనుకుని, బయలుదేరి
9మమ్మల్ని ఏలమని ఒలీవచెట్టుని అడిగాయి. ఒలీవచెట్టు <దేవుణ్ణీ మానవులనూ దేనివలన మనుషులు సన్మానిస్తారో అలాటి నా నూనె ఇవ్వకుండా చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా> అని వాటితో అంది.

10అప్పుడు చెట్లు, <నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు> అని అంజూరపు చెట్టును అడిగాయి.11అంజూరపు చెట్టు, <చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానాలా?> అని వాటితో అంది.

12ఆ తరువాత చెట్లు, <నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు> అని ద్రాక్షావల్లిని అడిగినప్పుడు ద్రాక్షావల్లి,13<దేవుణ్ణీ మానవులనూ సంతోషపెట్టే నా రసాన్ని ఇవ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా> అని వాటితో అంది.

14అప్పుడు చెట్లన్నీ, <నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు> అని ముళ్ళపొదతో మనవి చేసినప్పుడు
15ముండ్ల పొద<మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది> అని చెట్లతో చెప్పింది.>>

16<<నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు.
17అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి, ఒకే బండ మీద అతనిడెబ్భై మంది కొడుకులను చంపిన, అతని దాసీ కొడుకు అబీమెలెకు మీ బంధువు కాబట్టి, షెకెమువాళ్ళ మీద అతన్ని రాజుగా నియమించారు. యెరుబ్బయలుకు, అతని ఇంటి వాళ్ళకు, మీరు ఉపకారం చెయ్యకుండా18అబీమెలెకును రాజుగా నియమించుకొన్న విషయంలో మీరు యథార్ధంగా ప్రవర్తించి ఉంటే
19నేడు మీరు యెరుబ్బయలు పట్ల అతని యింటివాళ్ళ పట్ల సత్యంగా యథార్ధంగా ప్రవర్తించి ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి. అతడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు గాక.20అలా కాకపోతే అబీమెలెకు నుంచి అగ్ని బయలుదేరి షెకెము వాళ్ళనీ బెత్ మిల్లో యింటి వాళ్ళనీ కాల్చివేయు గాక. షెకెము వాళ్ళలో నుంచి, బెత్ మిల్లో యింటినుంచి అగ్ని బయలుదేరి అబీమెలెకును కాల్చివేయు గాక>> అని చెప్పాడు.21అప్పుడు యోతాము తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేరుకు వెళ్లి అక్కడ నివసించాడు.

22అబీమెలెకు మూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేశాడు.23దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదికి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమేలెకుతో తమకున్న ఇప్పండం విషయంలో ద్రోహం చేశారు.

24యెరుబ్బయలు డెబ్భైమంది కొడుకులకు అబీమెలెకు చేసిన ద్రోహం మూలంగా వాళ్ళను చంపిన వారి సోదరుడు అబీమెలెకు మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు ఈ విధంగా చేశాడు. అతడు తన సహోదరులను చంపేలా అతన్ని బలపరచిన షెకెము నాయకుల మీదికి కూడా ఆ నరహత్య ఫలం వచ్చేలా ఆయన చేశాడు.
25షెకెము యజమానులు కొండ శిఖరాలమీద అతని కోసం మాటు గాళ్ళను ఉంచి, ఆ దారిలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దోచుకున్నారు. అది అబీమెలెకుకు తెలిసింది.

26ఎబెదు కొడుకు గాలు, అతని బంధువులు, షెకెముకు చేరినప్పుడు షెకెము పెద్దలు అతన్ని ఆశ్రయించారు.27వాళ్ళు పొలాల్లోకి వెళ్లి ద్రాక్ష పళ్ళు ఏరుకుని, వాటిని తొక్కి కృతజ్ఞతార్పణం చెల్లించి, తమ దేవుళ్ళ మందిరంలోకి వెళ్లి పండగ చేసుకున్నారు. వారు అన్నపానాలు పుచ్చుకొంటూ అబీమెలెకును దూషించినప్పుడు
28ఎబెదు కొడుకు గాలు ఇలా అన్నాడు<<అబీమెలెకు ఎంతటివాడు? షెకెము ఎంతటివాడు? మనం అతనికెందుకు దాసులం కావాలి? అతడు యెరుబ్బయలు కొడుకు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి హమోరుకు చెందిన వాళ్ళను సేవిస్తాం గాని, మనం అబబీమెలెకుకు దాసులుగా ఎందుకుండాలి?29ఈ ప్రజలు నా ఆధీనం ఉంటేనా! నేను అబీమెలెకును కూలదోసే వాణ్ణి గదా! నేను అబీమెలెకుతో, <నీ సైన్యాన్ని బయలుదేరి రమ్మను> అనేవాణ్ణి గదా!>> అన్నాడు.

30ఎబెదు కొడుకైన గాలు మాటలు ఆ పట్టణ ప్రధాని జెబులు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది.31అప్పుడతడు, అబీమెలెకు దగ్గరికి రహస్యంగా మనుషులను పంపి <<ఎబెదు కొడుకు గాలు, అతని బంధువులు షెకెముకు వచ్చారు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఈ పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు
32కాబట్టి, ఈ రాత్రి నువ్వు, నీతో ఉన్న మనుషులు, లేచి పొలంలో మాటు వెయ్యండి.33ప్రొద్దున సూర్యుడు ఉదయించగానే నువ్వు త్వరగా లేచి పట్టణం మీద దాడి చెయ్యాలి. అప్పుడు అతడు అతనితో ఉన్న మనుషులు నీ మీదికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు నువ్వు సమయం చూసి వాళ్ళకు చెయ్యవలసింది చెయ్యవచ్చు>> అని కబురు పంపాడు.

34అబీమెలెకు అతనితో ఉన్న మనుషులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెము మీద దాడి చెయ్యడానికి పొంచి ఉన్నారు.35ఎబెదు కొడుకు గాలు బయలుదేరి పట్టణం ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు అబీమెలెకు, అతనితో ఉన్న మనుషులు పొంచి ఉన్న చోటు నుండి లేచారు.

36గాలు ఆ మనుషులను చూసి, జెబులుతో<<ఇదిగో మనుషులు కొండ శిఖరాల మీద నుంచి దిగివస్తున్నారు>> అన్నప్పుడు జెబులు <<కొండల నీడలు నీకు మనుషుల్లా కనిపిస్తున్నాయి>> అన్నాడు.37అప్పుడు గాలు<<చూడు, ఆ ప్రాంతంలోని ఉన్నత స్థలం నుంచి మనుషులు దిగి వస్తున్నారు. ఒక గుంపు శకునగాళ్ళ మస్తకి వృక్షపు దారిలో వస్తూ ఉంది>> అన్నాడు.
38జెబులు అతనితో<<మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు, అని నువ్వు చెప్పిన గొప్పలు ఏమైనాయి? వీళ్ళు నువ్వు తృణీకరించిన మనుషులు కాదా? ఇప్పుడు వెళ్లి వాళ్ళతో యుద్ధం చెయ్యి>> అన్నాడు.

39గాలు షెకెము నాయకులను ముందుకు నడిపిస్తూ బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు.40అబీమెలెకు అతన్ని తరమగా, అతడు అతని యెదుట నిలువలేక పారిపోయాడు. చాలామంది గాయపడి పట్టణం ద్వారం వరకూ కూలారు.
41అప్పుడు అబీమెలెకు అరూమాలో1 ఉన్నాడు. గాలును అతని బంధువులనూ షెకెములో నివాసం ఉండకుండాా జెబులు వాళ్ళని తోలి వేశాడు.42తరువాతి రోజు ప్రజలు పొలాల్లోకి బయలుదేరి వెళ్ళారు.43అది అబీమెలెకుకు తెలిసినప్పుడు అతడు తన మనుషులను మూడు గుంపులుగా చేసి వాళ్ళను ఆ పొలంలో మాటుగా ఉంచాడు. అతడు చూస్తుండగా ప్రజలు పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు గనుక అతడు వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేశాడు.

44అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్ళి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఆ రెండు గుంపులు పరుగెత్తి పొలాల్లో ఉన్న వాళ్ళందరినీ మట్టుపెట్టారు.45ఆ రోజంతా అబీమెలెకు ఆ ఊరివారితో యుద్ధం చేసి ఊరిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మనుషులను చంపి, పట్టణాన్ని పడగొట్టి ఆ ప్రాంతమంతా ఉప్పు చల్లించాడు.

46షెకెము గోపుర నాయకులు ఆ వార్త విని, ఏల్‌ బెరీతు గుడి కోటలోకి చొరబడ్డారు.47షెకెము నాయకులంతా అక్కడ పోగుపడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలిసి
48అతడు, అతనితో ఉన్న మనుషులందరూ, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు గొడ్డలి చేత పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ నరికి, యెత్తి భుజంపై పెట్టుకుని <<నేనేం చేస్తున్నానో అదే మీరు కూడా చెయ్యండి>> అని తనతో ఉన్న మనుషులతో చెప్పాడు.49అప్పుడు ఆ మనుషులందరూ ప్రతివాడూ ఒక్కొక్క కొమ్మ నరికి అబీమెలెకు చేసినట్టుగానే ఆ కోట దగ్గర వాటిని పేర్చి, వాటితో ఆ కోటను తగలబెట్టారు. అప్పుడు షెకెము గోపుర యజమానులు, వాళ్ళల్లో ఉన్న స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చనిపోయారు.

50తరువాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి తేబేసును ముట్టడించి, దాన్ని పట్టుకున్నాడు.51ఆ పట్టణం మధ్యలో ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు, పట్టణపు యజమానులు, అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకు ఎక్కారు.
52అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు.53అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది.54అప్పుడతను తన ఆయుధాలు మోసే సేవకుణ్ణి కంగారుగా పిలిచి <<ఒక స్త్రీ నన్ను చంపిందని నన్ను గూర్చి ఎవరూ అనుకోకుండా, నీ కత్తి దూసి నన్ను చంపు>> అని చెప్పాడు. ఆ సేవకుడు అతన్ని పొడవగా అతడు చచ్చాడు.
55అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులకు తెలియగానే ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళారు.

56ఆ విధంగా అబీమెలెకు తన డెబ్భైమంది సహోదరులను చంపడం వల్ల తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు మళ్ళీ అతని మీదకి రప్పించాడు.57షెకెమువాళ్ళు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వాళ్ళ తలల మీదికి మళ్ళీ రప్పించాడు. యెరుబ్బయలు కుమారుడు యోతాము శాపం వాళ్ళ మీదకి వచ్చింది.


1 9:41 అరూమాలో షెకెముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది

Chapter 10

తోలా

1అబీమెలెకు తరువాత ఇశ్శాఖారు గోత్రంవాడు, దోదో మనువడు, పువ్వా కొడుకు అయిన తోలా న్యాయాధిపతిగా నియామకం అయ్యాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యంలో షామీరులో నివాసం ఉండేవాడు.2అతడు ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు అతణ్ణి షామీరులో పాతిపెట్టారు.

యాయీరు

3అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు వచ్చాడు. అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.4అతనికి ముప్ఫైమంది కొడుకులున్నారు. వాళ్ళు ముప్ఫై గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్ళకు ముప్ఫై ఊళ్లు ఉండేవి. ఈ రోజు వరకూ వాటికి యాయీరు గ్రామాలని పేరు.5అవి గిలాదు దేశంలో ఉన్నాయి. యాయీరు చనిపోయినప్పుడు అతణ్ణి కామోనులో పాతిపెట్టారు.
యెఫ్తా

6ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్ళను, మోయాబీయుల దేవుళ్ళను, అమ్మోనీయుల దేవుళ్ళను, ఫిలిష్తీయుల దేవుళ్ళను, పూజించడం మొదలుపెట్టారు.7యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక,
8వాళ్ళు ఆ సంవత్సరం మొదలు, ఇశ్రాయేలీయులను, అంటే, యొర్దాను నది అవతల ఉన్న, గిలాదులోని అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను పద్దెనిమిది సంవత్సరాలు చితకగొట్టి అణచివేశారు.9ఇంక అమ్మోనీయులు యూదాదేశస్థులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి యొర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి.

10అప్పుడు ఇశ్రాయేలీయులు <<మేము నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం>> అని యెహోవాకు మొర్రపెట్టారు.11యెహోవా <<ఐగుప్తీయుల వశంలో నుంచి, అమోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిష్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా12సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధ పరచినప్పుడు వాళ్ళ వశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా,
13అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను.14మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవుళ్ళకు మొర్ర పెట్టుకోండి. మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో>> అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.

15అప్పుడు ఇశ్రాయేలీయులు<<మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు>> అని చెప్పి,16యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించివేసారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేక పోయింది.
17అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడి ఉన్నారు.18కాబట్టి ప్రజలు, అంటే గిలాదు పెద్దలు <<అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి పూనుకొన్నవాడు ఎవడో, అతడు గిలాదు నివాసులకందరికీ ప్రధాని అవుతాడు>> అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.

Chapter 11

1గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలశాలి. అతడు ఒక వేశ్య కొడుకు. యెఫ్తా తండ్రి గిలాదు.2గిలాదు భార్య అతనికి కొడుకులను కన్నప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యెఫ్తాతో <<నువ్వు అన్యస్త్రీకి పుట్టావు కాబట్టి మన తండ్రి ఇంట్లో నీకు భాగం లేదు>> అన్నారు.

3యెఫ్తా తన సహోదరుల దగ్గర నుంచి పారిపోయి టోబు దేశంలో నివాసం ఉన్నప్పుడు అల్లరిమూకలు యెఫ్తా దగ్గరికి వచ్చి అతనితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు.
4కొంతకాలం తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.5అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు6గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యెఫ్తాను రప్పించడానికి వెళ్లి <<నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం>> అని యెఫ్తాతో చెప్పారు.
7అందుకు యెఫ్తా <<మీరు నా మీద పగపట్టి నా తండ్రి ఇంట్లోనుంచి నన్ను తోలేశారు కదా. ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు నేను కావలసి వచ్చానా?>> అని గిలాదు పెద్దలతో అన్నాడు.

8అప్పుడు గిలాదు పెద్దలు <<అందుకే మేము నీదగ్గరికి మళ్ళీ వచ్చాం. నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే, గిలాదు నివాసులమైన మా అందరిమీద నువ్వు అధికారివి ఔతావు>> అని యెఫ్తాతో అన్నారు
9అందుకు యెఫ్తా <<అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకు వెళ్లిన తరువాత యెహోవా వాళ్ళను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధానినౌతానా?>> అని గిలాదు ఆ పెద్దలను అడగగా,10గిలాదు పెద్దలు <<కచ్చితంగా మేము నీ మాట ప్రకారం చేస్తాం. యెహోవా మన ఇరువురి మధ్య సాక్షిగా ఉంటాడు గాక>> అని యెఫ్తాతో అన్నారు.

11కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసి వెళ్లినప్పుడు ప్రజలు అతన్ని తమకు ప్రధానిగా, అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన వాగ్దానాల సంగతి అంతా వినిపించాడు.
12యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానికులను పంపి <<నాకు నీకు మధ్య ఏమీ జరగ లేదు కదా. నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి ఎందుకొచ్చావు?>> అని అడిగాడు.13అమ్మోనీయుల రాజు <<ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వచ్చినప్పుడు వాళ్ళు అర్నోను మొదలు యబ్బోకు వరకూ యొర్దాను వరకూ నా దేశం ఆక్రమించుకొన్నందుకే నేను వచ్చాను. కాబట్టి మనం శాంతియుతంగా ఉండేలా ఆ దేశాలను మళ్ళీ మాకప్పగించు>> అని యెఫ్తా పంపిన వర్తమానికులతో సమాచారం పంపాడు.

14అప్పుడు యెఫ్తా మళ్ళీ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఇలా కబురంపాడు.15<<యెఫ్తా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులు మోయాబు దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఆక్రమించుకోలేదు.16ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎర్రసముద్రం వరకూ అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.
17అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరికి మనుషులను పంపి నీ దేశం గుండా దయచేసి తమను వెళ్ళనిమ్మని అడిగినప్పుడు, ఎదోము రాజు ఒప్పుకోలేదు. వాళ్ళు మోయాబు రాజు దగ్గరికి అలాంటి వర్తమానమే పంపారు గాని అతడు కూడా నేను వెళ్ళనివ్వనని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.

18తరువాత వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోమీయుల దేశం, మోయాబీయుల దేశం చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పు దిక్కులో కనాను దేశంలో ప్రవేశించి అర్నోను అవతలివైపున మకాం వేశారు. వాళ్ళు మోయాబు సరిహద్దు లోపలికి వెళ్ళలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు గదా.

19ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు సీహోను అనే హెష్బోను రాజు దగ్గరికి దూతలను పంపి, మీ దేశం గుండా మా స్థలానికి మమ్మల్ని దయచేసి వెళ్ళనిమ్మని అతని దగ్గర మనవి చేసినప్పుడు20సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశంలోనుంచి వెళ్లనివ్వక, తన ప్రజలందర్నీ సమకూర్చుకుని యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
21అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త ప్రజలను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆ ప్రజలను హతం చేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశం అంతా స్వాధీనం చేసుకుని22అర్నోను నది మొదలు యబ్బోకు వరకూ, అరణ్యం మొదలు యొర్దాను వరకూ, అమోరీయుల ప్రాంతాలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు.

23కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలముందు నిలువకుండా తోలివేసిన తరువాత నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావా?24స్వాధీనం చేసుకోడానికి కెమోషు అనే నీ దేవుత నీకిచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా? మా దేవుడైన యెహోవా మా ఎదుట నుంచి ఎవరిని తోలివేస్తాడో వాళ్ళ స్వాస్థ్యం మేము స్వాధీనం చేసుకుంటాము.25మోయాబు రాజైన సిప్పోరు కొడుకు బాలాకు కంటే నువ్వు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహమాడే సాహసం చేశాడా? ఎప్పుడైనా వాళ్ళతో యుద్ధం చేశాడా?
26ఇశ్రాయేలీయులు హెష్బోనులో దాని ఊళ్లలో అరోయేరులో దాని ఊళ్లలో అర్నోను తీరాల పట్టాణాలన్నిటిలో మూడు వందల సంవత్సరాలనుంచి నివాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వెందుకు వాటిని పట్టుకోలేదు?27నేను నీ పట్ల తప్పూ చెయ్యలేదు, నువ్వే నా మీదికి యుద్ధానికి రావడం వల్ల నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చుగాక.>>

28అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు.
29యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు అతడు గిలాదులో, మనష్షేలో సంచారం చేస్తూ, గిలాదు మిస్పాల నుంచి అమ్మోనీయుల దగ్గరికి సాగి వెళ్ళాడు.30అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు <<నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే,31నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఎదుర్కోడానికి నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి ఏది వచ్చినా అది యెహోవాకు ప్రతిష్ట చేస్తాను. ఇంకా దహన బలిగా దాన్ని అర్పిస్తాను>> అన్నాడు.

32అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళగా యెహోవా అతనికి జయం ఇచ్చాడు గనుక అతడు వాళ్ళని,33అంటే, అరోయేరు మొదలు మిన్నీతుకు వరకూ ఆబేల్కెరామీము వరకూ ఇరవై పట్టణాల వాళ్ళను ఎవరూ మిగలకుండా హతం చేశాడు. ఆ విధంగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వారికి లొంగిపోయారు.
34యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.

35కాబట్టి అతడు ఆమెను చూసి, తన బట్టలు చింపుకుని<<అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో క్రుంగదీశావు, నన్ను తల్లడిల్లజేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుక తీయలేను>> అన్నాడు.
36ఆమె <<నాన్నా, యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటినుంచి వచ్చిన మాట ప్రకారం నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నాడు>> అని అతనితో అంది.

37ఇంకా ఆమె <<నా కోసం చేయవలసింది ఏదంటే, రెండు నెలల వరకూ నన్ను వదిలిపెట్టు. నేను, నా చెలికత్తెలు వెళ్లి కొండలమీద ఉండి, నా కన్యస్థితిని1 గూర్చి ప్రలాపిస్తాము>> అని తన తండ్రితో చెప్పింది.
38అతడు వెళ్ళమని చెప్పి రెండు నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కలిసి వెళ్లి కొండల మీద తన కన్యస్థితిని గూర్చి ప్రలాపించింది.39ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.40ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల ఆడపడుచులు నాలుగు రోజులపాటు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తె కథ జ్ఞాపకం చేసుకుంటారు.


1 11:37 ఇక్కడ కన్య స్థితి అంటే, తను ఇక ఎన్నడూ పెళ్లి చేసుకోని పరిస్థితిని గురించిన విషయం కావచ్చు.

Chapter 12

యెఫ్తా, ఎఫ్రాయిమీయులు

1ఎఫ్రాయిమీయులు సమకూడి <<నువ్వు ఉత్తరదిక్కుకు వెళ్లి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి బయలుదేరినప్పుడు నీతో కలిసి వెళ్ళడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాపురముంటున్న నీ ఇంటిని అగ్నితో కాల్చేస్తాం>> అని యెఫ్తాతో అన్నారు.2యెఫ్తా <<నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద కలహం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వాళ్ళ చేతుల్లోనుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం చూసి

3నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈ రోజు మీరెందుకు వచ్చారు?>> అన్నాడు.

4అప్పుడు యెఫ్తా గిలాదు వారందర్నీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు. గిలాదువాళ్ళు ఎఫ్రాయిమీయుల మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు <<ఎఫ్రాయిమీయులకు మనష్శే గోత్రికులకు మధ్య గిలాదువారైన మీరు - ఎఫ్రాయిమీయులకు మొహం చాటేసి పారిపోయారు>> అన్నారు.
5ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి గిలాదువాళ్ళు యొర్దాను దాటే రేవులను పట్టుకొన్నప్పుడు, పారిపోతున్న ఎఫ్రాయిమీయుల్లో ఎవరన్నా <<నన్ను దాటనివ్వండి>> అని అడిగితే గిలాదువాళ్ళు <<నువ్వు ఎఫ్రాయిమీయుడవా>> అని అతన్ని అడిగారు.6అందుకతను <<కాదు>> అంటే, వాళ్ళు అతన్ని చూసి <<షిబ్బోలెత్>> అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక <<సిబ్బోలెత్>> అని పలికితే, వాళ్ళు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో నలభై రెండు వేల మంది చనిపోయారు.
7యెఫ్తా ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. గిలాదువాడైన యెఫ్తా చనిపోయినప్పుడు, గిలాదు పట్టణాల్లో ఒక దానిలో అతన్ని పాతిపెట్టారు.
ఇబ్సాను, ఏలోను, అబ్దోను

8అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు.9అతనికి ముప్ఫైమంది కొడుకులు, ముప్ఫైమంది కూతుళ్ళు ఉన్నారు. అతడు ఆ కూతుళ్ళను తన వంశంలో చేరనివారికిచ్చి, తన వంశంలో చేరని ముప్ఫైమంది కన్యలను తన కొడుకులకు పెళ్లి చేశాడు. అతడు ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.
10ఇబ్సాను చనిపోయినప్పుడు అతణ్ణి బేత్లెహేములో పాతిపెట్టారు.

11అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతడు పది సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయినప్పుడు జెబూలూను దేశంలోని అయ్యాలోనులో అతన్ని పాతిపెట్టారు.

13అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు.14అతనికి నలభైమంది కొడుకులు, ముప్ఫై మంది మనుమలు ఉన్నారు. వాళ్ళు డెబ్భై గాడిదపిల్లలు ఎక్కి తిరిగేవాళ్ళు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు.15పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను చనిపోయినప్పుడు ఎఫ్రాయిము దేశంలో అమాలేకీయుల మన్యంలో ఉన్న పిరాతోనులో పాతిపెట్టారు.

Chapter 13

1ఇశ్రాయేలు ప్రజలు మరోసారి యెహోవా దృష్టిలో దోషులయ్యారు. కాబట్టి ఆయన వారిని ఒక నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు.

సంసోను పుట్టుక

2ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
3యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు<<చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు4ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు.5నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్1 గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.>>

6అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి <<దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు.7ఆయన నాతో, <చూడు నువ్వు గర్భవతివి అవుతావు. కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గానీ, మద్యాన్ని గానీ తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకూ దేవుని కోసం నాజీర్ గా ఉంటాడు> అని చెప్పాడు>> అంది.

8అప్పుడు మనోహ <<నా ప్రభూ, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పించడానికి నువ్వు పంపిన ఆ దేవుని మనిషి మరోసారి మా దగ్గరికి వచ్చేట్లుగా చెయ్యి>> అని యెహోవాకు ప్రార్థన చేసాడు.9దేవుడు మనోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కన్పించాడు.
10అప్పుడు ఆమె భర్త మనోహ ఆమె దగ్గర లేడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి <<ఆ రోజు నాకు కన్పించిన వ్యక్తి మళ్ళీ కన్పించాడు>> అని చెప్పింది.

11అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. <<నా భార్యతో మాట్లాడింది నువ్వేనా>> అని అడిగాడు. అందుకా వ్యక్తి <<నేనే>> అన్నాడు.
12అప్పుడు మానోహ <<నీ మాట ప్రకారమే జరుగుతుంది గాక. ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియ చేయండి>> అన్నాడు.13అందుకు జవాబుగా యెహోవా దూత <<నేను ఆ స్త్రీకి చెప్పినదంతా ఆమె జాగ్రత్తగా చేయాలి. ఆమె ద్రాక్ష నుండి వచ్చేది ఏదీ తినకూడదు,14ఆమె ద్రాక్షారసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకూడదు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రంగా చెప్పిన దేనినీ తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి>> అని మనోహకు చెప్పాడు.

15అప్పుడు మనోహ <<మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకూ ఆగమని మనవి చేస్తున్నాను>> అని యెహోవా దూతతో అన్నాడు.16దానికి యెహోవా దూత మనోహ <<నేను ఆగినా నీ భోజనాన్ని మాత్రం ఆరగించను. ఒక వేళ నువ్వు దహన బలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి>> అన్నాడు. ఆయన యెహోవా దూత అని మనోహకు తెలియలేదు.
17మనోహ <<నువ్వు చెప్పిన ప్రకారం జరిగిన తరువాత నిన్ను సన్మానించాలి గదా, మరి నీ పేరు ఏమిటి?>> అని అడిగాడు.18దానికి యెహోవా దూత <<నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం>> అన్నాడు.

19అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు.20అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతోబాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్యా అది చూసి నేలపై పడి నమస్కారం చేసారు.
21ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు.

22మనోహ తన భార్యతో <<మనం దేవుణ్ణి చూశాం కాబట్టి కచ్చితంగా చనిపోతాం>> అన్నాడు.
23కానీ అతని భార్య <<యెహోవా మనలను చంపాలనుకుంటే మనం అర్పించిన దహనబలినీ ధాన్యపు నైవేద్యాన్నీ అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విషయాలను మనకు చూపించి ఉండేవాడూ కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సంగతులను మనకు చెప్పేవాడూ కాదు,>> అంది.
24తరువాత ఆ స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు.25ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.


1 13:5 నాజీర్ సంఖ్య. 6 చూడండి

Chapter 14

సంసోను ఫిలిష్తీ యువతితో వివాహం

1సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.2అతడు ఇంటికి తిరిగి వచ్చి <<తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి>> అని తన తల్లిదండ్రులను అడిగాడు.

3వారు <<నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?>> అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను <<ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు>> అని తన తండ్రితో అన్నాడు.4అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.

5తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది.6యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.

7అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది.8కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి.9అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.

10సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు.11ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు.
12అప్పుడు సంసోను వారితో <<మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను.13ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి>> అన్నాడు. దానికి వారు <<ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.>> అన్నారు.

14అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు,

<<తినే దాంట్లోనుండి తిండి వచ్చింది.

బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.>>అన్నాడు.

అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు.

15ఏడవ1 రోజున వాళ్ళు సంసోను భార్యతో<<మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం>> అన్నారు.

16సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది <<నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు>> అంది. దానికతడు <<నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను>> అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది.17ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.

18ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో <<తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?>> అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు <<మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే2 నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు>> అన్నాడు.
19యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు.20సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.


1 14:15 ఏడవ నాలుగో
2 14:18 మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నీకు సమాధానం కేవలం నా భార్య నుండి వస్తుంది.

Chapter 15

సంసోను ఫిలిష్తీయులపై ప్రతీకారం

1కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. <<నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను>> అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.2ఆమె తండ్రి <<నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను. అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందకత్తె గదా. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో>> అన్నాడు.

3అప్పుడు సంసోను వారితో <<ఈ సారి నేను ఫిలిష్తీయులకు కీడు చేసినా నిర్దోషి గానే ఉంటాను>> అన్నాడు.

4సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు.
5ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి.6ఫిలిష్తీయులు <<ఎవడు చేసాడిలా>> అన్నారు. <<తిమ్నాతు వాడి అల్లుడైన సంసోను చేశాడు. ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతు వాడు అతని స్నేహితుడికిచ్చాడు>> అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెనూ ఆమె తండ్రినీ సజీవ దహనం చేశారు.

7అప్పుడు సంసోను <<మీరు ఇలా చేశారు గనక, నేనూ మీ మీద పగ తీర్చుకునే దాకా ఊరుకోను>> అని చెప్పాడు.8అతడు వారి తొడలనూ తుంటి ఎముకలనూ విరగగొట్టి ముక్కలు చేసి అనేకమందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు.

9అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు.10యూదాప్రజలు వారిని <<మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?>> అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు <<సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి>> అన్నారు.

11అప్పుడు యూదా వారిలో మూడువేలమంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు <<ఫిలిష్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు>> అన్నారు. దానికి సంసోను <<వాళ్ళు నాకేం చేసారో నేనూ వాళ్ళకూ అదే చేసాను>> అన్నాడు.
12దానికి వారంతా <<మేము నిన్ను కట్టి పడేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం>> అన్నారు. అందుకు సంసోను <<మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చేయండి>> అన్నాడు.13అందుకు వారు <<మేము నిన్ను చంపం. కేవలం తాళ్ళతో బంధించి వాళ్లకి అప్పగిస్తాం>> అన్నారు. ఇలా చెప్పి వారు అతణ్ణి కొత్తగా పేనిన తాళ్ళతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు.

14అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కోడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడి పడ్డాయి.
15అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో వెయ్యి మందిని కొట్టి చంపాడు.

16అప్పుడు సంసోను ఇలా అన్నాడు,

<<నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా,

గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.>>

17అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి <<రామత్లేహి1 >> అనే పేరు పెట్టాడు.18అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. <<నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను>> అంటూ వేడుకున్నాడు.

19అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి <<ఏన్ హక్కోరే2 >> అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.20సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.


1 15:17 రామత్లేహి దవడ ఎముక కొండ
2 15:19 ఏన్ హక్కోరే మొరపెట్టేవాడి ఊట

Chapter 16

సంసోను, దెలీలా

1తరువాత సంసోను గాజా1 కు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు.2సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు.

3సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.

4ఆ తరువాత సంసోను శోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా.5ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో <<నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి2 నాణేలిస్తాం>> అన్నారు.

6కాబట్టి దెలీలా <<నువ్వు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు>> అని సంసోనును అడిగింది.7దానికి సంసోను <<ఏడు పచ్చి వింటినారలతో నన్ను కట్టిపడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను>> అన్నాడు.
8ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది.9ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.

10అప్పుడు దెలీలా <<చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు>> అని సంసోనుతో అంది.11సంసోను <<కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను>> అన్నాడు.12అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు.

13అప్పుడు దెలీలా <<ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు>> అంది. అప్పుడు సంసోను <<నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గంలో నేతలాగ అల్లితే సరి>> అన్నాడు.14అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై ఏడు జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తరువాత <<సంసోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు!>> అంటూ అతణ్ణి నిద్ర లేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకునూ నేతనూ ఊడబెరికాడు.

15అప్పుడు ఆమె <<నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి మూడు సార్లు నన్ను మోసం చేశావు. నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకూ నాకు చెప్పలేదు>> అంది.16ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి <<చావే నయం>> అనిపించింది.

17అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. <<నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను>> అని ఆమెకు చెప్పాడు.
18అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. <<మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు>> అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.

19ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.
20ఆమె <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అంది. సంసోను నిద్ర లేచి <<ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను>> అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

21అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు.22అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.
సంసోను ప్రతీకారం, మరణం

23ఫిలిష్తీయుల అధికారులు <<మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు>> అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు.24అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి <<మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు>> అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు.
25వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు <<సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం>> అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు.

26సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో <<ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను>> అన్నాడు.
27ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.

28అప్పుడు సంసోను <<ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి>> అని యెహోవాకు మొర్ర పెట్టాడు.29ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు.
30<<నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం>> అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.

31అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.


1 16:1 గాజా ఫిలిష్తీయులు పట్టణం
2 16:5 పదకొండు వందల వెండి 60 కిలోగ్రాములు

Chapter 17

మీకా విగ్రహాలు, యాజకుడు

1ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు.2అతడు తన తల్లితో <<నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి1 ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను>> అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి <<కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!>> అంది.

3అతడు ఆ పదకొండు వందల వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె <<ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహమూ, మరొక పోత విగ్రహమూ తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను>> అంది.4అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.

5మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఎఫోదునూ కొన్ని విగ్రహాలనూ చేయించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్టించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు.6ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.

7అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు.8ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు.9అతణ్ణి మీకా <<నీవు ఎక్కడ నుంచి వచ్చావు?>> అని అడిగాడు. దానికతడు <<నేను యూదా బేత్లెహేమునుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెదుకుతున్నాను.>> అన్నాడు.
10అప్పుడు మీకా <<నువ్వు నా దగ్గరే ఉండు. నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీకు సంవత్సరానికి పది వెండి నాణేలూ, బట్టలూ, ఆహారమూ ఇస్తాను.>> అన్నాడు. దానికి ఆ లేవీయుడు అంగీకరించాడు.11ఆ వ్యక్తి దగ్గర ఉండిపోడానికి ఒప్పుకున్నాడు. ఆ యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు.
12మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు.13అప్పుడు మీకా <<ఈ లేవీయుడు నాకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు>> అన్నాడు.


1 17:2 పదకొండు వందల వెండి 13 కిలోగ్రాములు

Chapter 18

దాను గోత్రం వారు లాయిషును జయించడం

1ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెదుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు.

2దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ <<మీరు వెళ్లి దేశమంతా చూసి రండి>> అని చెప్పి పంపారు.
3వాళ్ళు ప్రయాణిస్తూ ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ మీకా ఇంట్లో ఆ రాత్రి ఆతిథ్యం పొందారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ లేవీ యువకుని మాట గుర్తు పట్టారు. అతణ్ణి చూసి <<నిన్ను ఇక్కడికి ఎవరు రప్పించారు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకున్నావు?>> అంటూ అడిగారు.4అతడు మీకా తనకు చేసిందంతా చెప్పాడు. <<నేను మీకాకు పూజారిగా ఉన్నాను. అతడు నాకు జీతం ఇస్తున్నాడు>> అని చెప్పాడు.

5అప్పుడు వాళ్ళు <<మేము చేయబోయే పని సఫలమౌతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు>> అన్నారు.6దానికా యాజకుడు <<క్షేమంగా వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన మార్గంలో యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తాడు.>>అన్నాడు.
7అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ1 ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.

8వాళ్ళు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న తమ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు <<మీరిచ్చే నివేదిక ఏమిటి?>> అని అడిగారు.
9దానికి వాళ్ళు <<రండి! మనం వాళ్ళపై దాడి చేద్దాం. ఆ దేశాన్ని మేము చూశాం. అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్ళపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు.10మీరు అక్కడికి వెళ్ళినప్పుడు <మేము భద్రంగా ఉన్నాం> అని భావిస్తున్న వారిని మీరు చూస్తారు. ఆ దేశం విశాలమైనది. భూమి మీద ఎలాంటి కొరతా అక్కడ లేదు. దేవుడు దాన్ని మీకిచ్చాడు,>> అన్నారు.
11అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దాను గోత్రం వాళ్ళలో ఆరు వందలమంది ఆయుధాలు ధరించి బయలుదేరి యూదా దేశం లోని కిర్యత్యారీములో ఆగారు.12అందుకే ఆ స్థలానికి ఇప్పటికీ మహానేదాన్ అని పేరు. దాను గోత్రం వాళ్ళ సైన్యం అని దాని అర్థం. అది కిర్యత్యారీముకు పడమరగా ఉంది.

13అక్కడనుండి వాళ్ళు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉన్న మీకా ఇంటికి వచ్చారు.14అప్పుడు లాయిషు దేశాన్ని చూడటానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు తమ వారిని చూసి <<ఈ ఇంట్లో ఎఫోదూ, గృహ దేవుళ్ళూ, చెక్కిన ప్రతిమా, పోత విగ్రహమూ ఉన్నాయని మీకు తెలుసా? మీరేం చేయాలో ఆలోచించుకోండి>> అన్నారు.
15వారు ఆ వైపుకు తిరిగి ఆ లేవీ యువకుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతణ్ణి కుశల ప్రశ్నలడిగారు.16దాను గోత్రానికి చెందిన ఆరు వందలమంది యుధ్ధానికై ఆయుధాలు ధరించి సింహద్వారం దగ్గర నిల్చున్నారు.
17అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు.

18వీరు మీకా యింటిలోకి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు<<మీరేం చేస్తున్నారు?>> అని అడిగాడు.
19వాళ్ళు <<నువ్వు నోరు మూసుకో. నీ చెయ్యి నోటి మీద ఉంచుకుని మాతో కలసి వచ్చి మాకు తండ్రిగా యాజకుడుగా ఉండు. ఒక ఇంటికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా లేక ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రానికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా>> అని అడిగారు.20ఆ మాటలకు అ యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఆ ఎఫోదునూ, గృహ దేవుళ్ళనూ చెక్కిన ప్రతిమనూ తీసుకుని వాళ్ళతో కలసి పోయాడు.
21అక్కడి నుంచి వాళ్ళు వెనక్కు తిరిగారు. చిన్నపిల్లలనూ, పశువులనూ, సామగ్రినీ తమకు ముందుగా తరలించుకు పోయారు.22వాళ్ళు మీకా ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళాక మీకా అతని పొరుగు వారూ సమకూడి దాను గోత్రం వారిని వెంటాడి వాళ్ళను కలుసుకుని కేకలు వేసి పిలిచారు.23దానీయులు తిరిగి చూసి <<నీకేం కావాలి? ఇలా గుంపుగా వస్తున్నరేమిటి?>> అని మీకాను అడిగారు.
24దానికి అతడు<<నేను చేయించిన నా దేవుళ్ళనూ, నా కుల పూజారినీ మీరు పట్టుకుపోతున్నారు. ఇక నాకేం మిగిలింది? <నీకేం కావాలి?> అని నన్ను ఎలా అడుగుతున్నారు?>> అన్నాడు.25దాను గోత్రం వారు అతనితో <<జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు>> అన్నారు.26ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
27దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటినీ, అతని యాజకుడినీ పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు.28ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండటం వల్లా, వాళ్లకు ఎవరితోనూ2 సంబంధం లేకపోవడం వల్లా వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు.29తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు ఆ పట్టణం పేరు లాయిషు.

30దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనుమడూ, గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనే వాడూ, అతని కుమారులూ ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్ళే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు.31దేవుని మందిరం షిలోహులో ఉన్నంత కాలం వాళ్ళు మీకా చేయించిన చెక్కిన విగ్రహాన్ని పూజించారు.


1 18:7 ఎవరితోనూ అరామియులు
2 18:28 ఎవరితోనూ అరామియులతో

Chapter 19

లేవీయుడు, అతని ఉపపత్ని

1ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.2అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.

3ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకోడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి, రెండు గాడిదలనూ తీసుకుని బయల్దేరాడు. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. ఆ యువతి తండ్రి అతణ్ణి చూసి అతణ్ణి కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు.

4ఆ అమ్మాయి తండ్రి, అంటే అతని మామ తనతో మూడు రోజులుండమని అతణ్ణి బలవంతం చేశాడు. కాబట్టి అతడు మూడు రోజులూ, రాత్రులూ తింటూ తాగుతూ అక్కడే గడిపాడు.
5నాలుగవ రోజు వెళ్ళడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో <<కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు>>అన్నాడు.6దాంతో మళ్ళీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి <<దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు. సరదాగా, సంతోషంగా ఉండు>> అన్నాడు.
7అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు.

8అయిదో రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి <<మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి కొంచెం బలపడు>> అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యేవరకూ తాత్సారం చేస్తూ వారు భోజనం చేసారు.
9ఆ లేవీయుడూ, అతని ఉంపుడుకత్తే, అతని సేవకుడూ ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో<<చూడు, సాయంత్రం అయింది. చీకటి పడబోతోంది. నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు. రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు.>> అని బలవంతం చేశాడు.
10కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.

11వారు యెబూసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయింది. అతని సేవకుడు అతనితో<<మనం ఈ యెబూసీయుల ఊర్లోకి వెళ్దాం. దీనిలో ఈ రాత్రి గడుపుదాం>>అన్నాడు.
12కానీ అతని యజమానుడు<<ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం. ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం. మనం గిబియా వరకూ వెళ్దాం>>అన్నాడు.13తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో <<నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.>>అన్నాడు.
14అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకూ బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది.

15కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.
16అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.17ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. <<నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?>> అని అడిగాడు.
18అందుకతడు <<మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి1 వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు19మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.>>అన్నాడు.
20ఆ వృద్ధుడు <<మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను21అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు>>అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
22వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. <<నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి>> అన్నారు.23ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు <<సోదరులారా, వద్దు. దయచేసి అలాంటి దుర్మార్గపు పని చేయకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చేయకండి.
24చూడండి, నా కూతురు కన్య. ఆమే, ఆ వ్యక్తి ఉంపుడుగత్తే ఉన్నారు. వాళ్ళను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్లు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చేయకండి>>అన్నాడు.25కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్ళారు.

26ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.
27ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్ళడానికి తలుపులు తీశాడు. అతని ఉంపుడుగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది.28ఆ లేవీయుడు <<లే వెళ్దాం>> అన్నాడు. కానీ ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు.
29అతడు తన యింటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం పన్నెండు ముక్కలుగా కోశాడు. ఆ పన్నెండు ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు.30దాన్ని చూసిన వారంతా <<ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి! ఏం చేయాలో చెప్పండి>> అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.


1 19:18 యెహోవా మందిరానికి నా ఇంటికి

Chapter 20

బెన్యామీనీయుల నాశనం

1అప్పుడు దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ, గిలాదు వరకూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ కదలి వచ్చారు. వారి సమాజం అంతా ఒక్క వ్యక్తిలా ఒకే ఆలోచనతో మిస్పాలో యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.2ఈ సమావేశంలో దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కత్తియుద్ధం చేయగల నాలుగు లక్షలమంది కూడా వీరిలో ఉన్నారు.

3ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశం అయ్యారని బెన్యామీనీయులు విన్నారు. ఇశ్రాయేలీయులు <<ఈ దుర్మార్గపు పని ఎలా జరిగిందో చెప్పండి>>అని అడిగారు.4చనిపోయిన స్త్రీ భర్త అయిన లేవీయుడు ఇలా సమాధానమిచ్చాడు. <<బెన్యామీనీయులకు చెందిన గిబియాలో రాత్రి బస కోసం నేను నా ఉంపుడుగత్తెతో కలసి వచ్చాను.
5గిబియాకు చెందినవారు ఆ రాత్రి నా మీద దాడి చేశారు. నేను ఉన్న ఇంటిని చుట్టుముట్టి నన్ను చంపాలని ప్రయత్నించారు.6వాళ్ళు నా ఉంపుడుగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం, దౌర్జన్యం వాళ్ళు జరిగించారు కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికి ఆ ముక్కలను పంపాను.>>

7<<ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఇక్కడే ఉన్నారు. ఈ విషయం గూర్చి ఆలోచించి ఏమి చేయాలో చెప్పండి>>
8అందరూ ఒక్కసారిగా ఒకే రకంగా స్పందించారు. వాళ్ళిలా అన్నారు<<మనలో ఎవరూ తన గుడారానికి గానీ తన ఇంటికి గానీ వెళ్ళడు.9గిబియాకు మనం చేయాల్సిన విషయంలో ఇలా చేద్దాం. మనం చీట్లు వేసి దాని ప్రకారం గిబియా పైన దాడి చేద్దాం.
10ఇశ్రాయేలీయుల్లో జరిగిన దుర్మార్గాన్ని శిక్షించడానికై బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చడం కోసం ప్రతి గోత్రం నుండి నూరుమందికి పదిమందినీ, అలాగే వెయ్యికి వందమందినీ పదివేలకు వెయ్యి మందినీ ఏర్పాటు చేద్దాం>> అని చెప్పుకున్నారు.

11కాబట్టి ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఒక్క వ్యక్తిలా ఏకీభవించారు. అంతా ఒకే ఉద్దేశ్యంతో ఆ పట్టాణానికి వ్యతిరేకంగా లేచారు.
12ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి దగ్గరికి మనుషులను పంపారు. వారితో <<మీ మధ్య జరిగిన ఈ దుర్మార్గం ఏమిటి?13గిబియాలో ఉన్న ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి. ఇశ్రాయేలీయులపై ఈ దోషాన్ని సంపూర్ణంగా తొలగించడానికై మేము వారిని చంపుతాం>> అని చెప్పించారు. కాని బెన్యామీను గోత్రం వాళ్ళు తమకు సోదరులైన ఇశ్రాయేలీయుల హెచ్చరికను పెడచెవిన పెట్టారు.14వారంతా తమ తమ పట్టణాల్లో నుండి యుద్ధానికి బయల్దేరి గిబియాకు వచ్చి కలిశారు.
15ఆ రోజు బెన్యామీను గోత్రం వాళ్ళు తమ సంఖ్య ఎంతో లెక్క వేసుకున్నారు. గిబియా వాళ్ళు ఏడువందల మంది కాకుండా ఇతర పట్టణాలనుండి వచ్చినవాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు.16వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఏడు వందలమంది ఎడమ చేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక ఒడిసెలలో రాయి పెట్టి తలవెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం గలవారు.
17బెన్యామీనీయులు కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయుల్లో కత్తియుద్ధం చేయగలిగిన వాళ్ళు నాలుగు లక్షలమంది అని లెక్క వేశారు. వీళ్ళంతా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు.

18ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు1 వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు <<యూదా వాళ్ళు వెళ్ళాలి>> అని చెప్పాడు.
19ఇక ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి యుద్ధానికి సిద్ధపడి గిబియాకు ఎదురుగా మొహరించారు.20ఇశ్రాయేలీయుల సైనికులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళి గిబియా మీద దాడి చేయడానికి బారులు తీరారు.21ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు.

22తరువాత ఇశ్రాయేలీయులు వెళ్ళి సాయంకాలం వరకూ యెహోవా ఎదుట ఏడుస్తూ ఉన్నారు. <<మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళాలా>> అంటూ దేవుని నడిపింపు కోసం ప్రార్థించారు. అప్పుడు యెహోవా <<యుద్ధానికి వెళ్ళండి>> అని చెప్పాడు.23రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.
24కాబట్టి ఇశ్రాయేలీయులు రెండో రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి బయల్దేరారు. వారిని ఎదుర్కోడానికి బెన్యామీనీయులు25గిబియాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయుల్లో పద్దెనిమిది వేలమందిని చంపేశారు.
26చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధం చేసేవాళ్ళే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులూ, ప్రజలూ అంతా వెళ్ళి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకూ యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి, దేవునికి దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.

27ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.28అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ అయిన ఫీనేహసు ఆ రోజుల్లో ఆ మందసం దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు <<మరోసారి మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్దానికి వెళ్ళాలా వద్దా>> అని యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ అడిగారు. దానికి యెహోవా <<వెళ్ళండి, రేపు వాళ్ళను ఓడించడానికి మీకు సహాయం చేస్తాను>> అని సమాధానం ఇచ్చాడు.
29అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ సైనికులను మాటు పెట్టారు.30మూడో రోజున ఇంతకు ముందు లాగానే ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళారు. గిబియా వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు.
31బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణంలో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్ళారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డవాళ్ళను రాజ మార్గాల్లో చంపుతూ వెళ్ళారు. దాదాపు ముప్ఫై మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది. మరొకటి గిబియాకు వెళ్తుంది.
32బెన్యామీనీయులు<<ఇంతకు ముందులా వీళ్ళు మనముందు నిలువలేకపోతున్నారు>> అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు <<మనం పారిపోతూ వాళ్ళను పట్టణంలోనుండి బయటకు వచ్చేలా చేద్దాం>> అని చెప్పుకున్నారు.33ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.
34అప్పుడు ఇశ్రాయేలీ సైనికుల్లో నుండి ప్రత్యేకంగా ఉన్న పదివేల మంది సైనికులు గిబియా నుండి రావడంతో భీకరమైన యుద్ధం జరిగింది. కాని తాము నాశనం అంచున ఉన్నామని బెన్యామీనీయులకు తెలియలేదు.

35ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల ద్వారా బెన్యామీనీయులను ఓడించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్లో ఇరవై ఐదు వేల వంద మందిని చంపారు. వీళ్ళంతా కత్తియుద్ధం చేయడంలో శిక్షణ పొందినవాళ్ళు.
36బెన్యామీను సైన్యం తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీ సైనికులు తాము గిబియా పైన మాటుగా పెట్టిన వారిపై నమ్మకముంచి బెన్యామీనీయులను తమపైకి రానిచ్చారు.37మాటుగా ఉన్న సైనికులు త్వరగా గిబియాలో చొరబడి పట్టణంలో ఉన్నవారినందరినీ కత్తితో చంపేశారు.

38ఇశ్రాయేలు సైన్యాలకూ, మాటున ఉండేవారికీ మధ్య సంకేతం ఒకటుంది. అదేమిటంటే పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయడం.
39ఇశ్రాయేలీయులు మొదట యుద్ధం నుండి పారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు బెన్యామీనీయులు <<వీళ్ళు మొదటి యుద్ధంలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా మన చేతిలో ఓడిపోతున్నారు>> అనుకుని, ఇశ్రాయేలీయుల్లో దాదాపు ముప్ఫైమందిని చంపారు.
40కాని వెనుక ఉన్న పట్టణంలో నుండి ఆకాశంలోకి పెద్ద స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభించింది. అప్పుడు బెన్యామీనీ యులు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ పట్టణమంతా పొగ నిండిపోయి కనిపించింది.41అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగారు. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని భయకంపితులయ్యారు.
42ఇశ్రాయేలీయుల నుండి పారిపోవడానికి ఎడారి దారి వైపుకు వెళ్దామని చూశారు, కానీ పారిపోతుండగా వారిని పట్టణంలో నుండి వచ్చిన ఇశ్రాయేలీ సైనికులు దారిలోనే చంపారు.
43ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుముట్టారు. వారి వెనకబడి తరిమారు. తూర్పు వైపున గిబియాకి ఎదురుగా నోహా దగ్గర వారిని అణచి వేశారు.44అక్కడ బెన్యామీనీయుల్లో పద్దెనిమిది వేలమంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు.

45అప్పుడు మిగిలినవాళ్ళు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోయారు. రాజమార్గాల్లో చెదరిపోయి ఉన్న మరో ఐదు వేలమందిని ఇశ్రాయెలీ సైనికులు వేరు చేసి వాళ్ళను గిదోము వరకూ వెంటాడి తరిమి వాళ్ళలో రెండు వేలమందిని చంపేశారు.46ఆ రోజు ఇరవై ఐదు వేలమంది బెన్యామీనీయులు మరణించారు. చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధంలో శిక్షణ పొందినవారే. యుద్ధం చేయడంలో ఆరితేరినవారే.
47కాని ఆరువందలమంది ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయారు. ఆ కొండ మీద నాలుగు నెలలు ఉన్నారు.48తరువాత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల పైకి తిరిగి వచ్చి పట్టణంలో ఉన్నవారిని పశువులనూ దొరికిన సమస్తాన్నీ కత్తితో చంపేశారు. దీనితో పాటు తాము ఆక్రమించుకున్న పట్టణాలన్నిటినీ తగలబెట్టారు.


1 20:18 బేతేలుకు దేవుని మందిరం

Chapter 21

బెన్యామీనీయుల కోసం భార్యలు

1ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశమై<<మనలో ఎవరూ మన కుమార్తెలను బెన్యామీనీయులకు వివాహానికి ఇవ్వకూడదు>> అని శపథం చేశారు.2తరువాత వారంతా బేతేలుకు వెళ్ళారు. అక్కడే సాయంత్రం వరకూ దేవుని సన్నిధిలో కూర్చున్నారు.3<<యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, ఈ రోజున ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రం లేకుండా పోయింది. ఇశ్రాయేలుకు ఇది ఎందుకు జరిగింది>> అంటూ ఎంతో ఏడ్చారు.

4తరువాత రోజున ప్రజలు ఉదయాన్నే లేచి అక్కడ బలిపీఠం కట్టి దహన బలులనూ, సమాధాన బలులనూ అర్పించారు.5అప్పుడు ఇశ్రాయేలీయులు <<ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో మిస్పాలో యెహోవా ఎదుట జరిగిన సమావేశానికి రాకుండా ఉన్నదెవరు>> అంటూ వాకబు చేసారు. ఎందుకంటే అలాంటి వారికి కచ్చితంగా మరణ శిక్ష విధించాలని శపథం చేశారు.

6ఇశ్రాయేలీయులు తమ సోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి ఇలా చెప్పుకున్నారు <<ఈ రోజున ఒక ఇశ్రాయేలీయుల గోత్రం అంతరించి పోయింది.7మిగిలిన వారికి ఎవరికీ మన కూతుళ్ళను పెళ్ళికి ఇవ్వకూడదని యెహోవా పేరుమీద శపథం చేశాం కదా, ఇప్పుడు మిగిలిన వారికి భార్యలు ఎవరు చూస్తారు? ఇక వారి విషయంలో మనం ఏం చేయగలం?>>

8వారు ఇశ్రాయేలీయుల గోత్రాల్లో యెహోవా ఎదుట మిస్పాలో జరిగిన సమావేశానికి రానిది ఎవరు, అని విచారించినప్పుడు9యాబేష్గిలాదునుండి సైన్యంలోకి ఎవరూ రాలేదని తెలిసింది. ప్రజలంతా అక్కడ జన గణనలో చేరినప్పుడు యాబేష్గిలాదు నివాసుల్లో ఒక్కడు కూడా అక్కడ లేడు.

10కాబట్టి సమాజపు వారు ధైర్యవంతులైన పన్నెండు వేలమంది మనుషులను యాబేష్గిలాదు మీద దాడి చేసి అక్కడ స్త్రీలూ, పిల్లలతో సహా అందర్నీ చంపమనే ఆదేశంతో పంపించారు.
11<<మీరు ఇలా చేయండి, ప్రతి మగవాణ్ణీ అలాగే కన్య కాని ప్రతి స్త్రీనీ చంపండి>> అని చెప్పారు.12యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సాంగత్యం తెలియని నాలుగు వందలమంది స్త్రీలను వాళ్ళు చూసారు. వాళ్ళను కనాను దేశంలోని షిలోహు లో ఉన్న సైన్యం శిబిరానికి తీసుకు వచ్చారు.

13అప్పుడు సమాజం రిమ్మోను కొండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో శాంతి చేసుకోడానికి సమాచారం పంపించారు.14ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు. యాబేష్గిలాదు నుండి తీసుకు వచ్చిన స్త్రీలను వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే ఆ స్త్రీలు వాళ్లకు సరిపోలేదు.15యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో లోపం కలగ చేశాడని ప్రజలంతా బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడ్డారు.

16సమాజంలో ప్రముఖులు ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి పోవడం చూసి <<మిగిలిన వారికి మనం భార్యలను ఎక్కడనుండి తీసుకు రావాలి>> అని మధన పడ్డారు.17<<ఇశ్రాయేలీయుల్లోనుండి ఒక గోత్రం అంతరించి పోకుండా బెన్యామీనీయుల్లో తప్పించుకున్న వారికి వారసులు ఉండాలి>> అన్నారు.

18<<ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా సరే, తన కూతుర్ని బెన్యామీనీయుడికి ఇస్తే వాణ్ణి నాశనం చేయాలని శపథం చేశాం. కాబట్టి మన కూతుళ్ళను వారికిచ్చి పెళ్ళి చేయకూడదు,>> అని చెప్పుకున్నారు.19కాబట్టి వాళ్ళు బెన్యామీనీయులతో ఇలా అన్నారు<<చూడండి, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెముకు వెళ్ళే రాజమార్గానికి తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున ఉన్న షిలోహు లో ప్రతి సంవత్సరం యెహోవాకు పండగ జరుగుతుంది.

20మీరు వెళ్లి ద్రాక్షతోటల్లో చాటున దాక్కుని ఉండండి. షిలోహు నుండి స్త్రీలు నాట్యమాడటానికి బయటకు వస్తారు.21ద్రాక్షతోటల్లో నుండి వేగంగా బయటకు వచ్చి మీలో ప్రతి ఒక్కడూ ఒక్కో షిలోహు అమ్మాయిని పట్టుకుని భార్యగా చేసుకోడానికి మీ బెన్యామీనీయుల దేశానికి పారిపొండి.

22ఆ తరువాత ఆ అమ్మాయిల తండ్రులు గానీ సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి వాదిస్తే మేము వారితో <మీరు కాస్త మా పట్ల దయ చూపండి. యుద్ధం కారణంగా వాళ్ళలో ప్రతి వాడికీ పెళ్ళి చేసుకోడానికి స్త్రీలు దొరకలేదు. కాబట్టి ఆ స్త్రీలను ఉండనివ్వండి. మీ అంతట మీరే వాళ్ళను పెళ్లికివ్వలేదు కాబట్టి శపథం విషయంలో మీరు నిరపరాధులు అవుతారు> అని చెబుతాము>> అన్నారు.

23బెన్యామీనీయులు సరిగ్గా అలాగే చేసి నాట్యమాడుతున్న స్త్రీలలో నుండి తమకు కావలసిన స్త్రీలను పట్టుకుని తమకు భార్యలుగా తీసుకు వెళ్ళారు. తమ వారసత్వ స్థలానికి వెళ్ళి అక్కడ పట్టణాలను కట్టి వాటిలో నివసించారు.24ఆ తరువాత ఇశ్రాయేలీయులలో ప్రతివాడూ అక్కడనుండి తమ తమ గోత్రాలుండే ప్రాంతాలకూ, తమ కుటుంబాల దగ్గరకూ వారసత్వ భూమికీ వెళ్ళి పోయారు.
25ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేడు. ప్రతి వాడూ తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు.

రూతు

Chapter 1

నయోమి, భర్త, కొడుకుల చనిపోవడం

1న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యూదా దేశంలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళాడు.2అతని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతనికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యూదా దేశపు బేత్లెహేములో నివసించే ఎఫ్రాతా ప్రాంతం వారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ నివసించారు.

3నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది.4వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు.5సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.
బేత్లెహేముకి నయోమి, రూతు తిరిగి వెళ్ళడం

6బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది.7ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది.
8అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. <<మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక.9మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక>> అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది.

10అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చి <<మేము నీతో కూడా నీ ప్రజల దగ్గరకే వస్తాం>> అన్నారు.
11అప్పుడు నయోమి <<నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా.12అమ్మాయిలూ, తిరిగి వెళ్ళండి. నేను ముసలిదాన్ని. మగ వాడితో ఇప్పుడు కాపురం చెయ్యలేను. ఒక వేళ నేను నమ్మకంతో ఈ రాత్రి నేను ఒక మగ వాడితో గడిపి కొడుకులను కనినప్పటికీ13వాళ్ళు పెద్దవాళ్లయ్యే వరకూ మీరు వేచి ఉంటారా? పెళ్లి చేసుకోకుండా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నా బిడ్డలారా, అలా వద్దు. అలాంటి పరిస్థితి మీకంటే నాకే ఎక్కువ వేదన కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు విరోధి అయ్యాడు>> అని వాళ్ళతో అంది.
14వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.

15అప్పుడు నయోమి <<చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు>> అని రూతుతో చెప్పింది.
16అందుకు రూతు <<నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు.17నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక>> అంది.

18తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది.
19కాబట్టి వాళ్ళిద్దరూ బేత్లెహేముకు ప్రయాణం సాగించారు. వాళ్ళు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు ఊరంతా ఎంతో ఆసక్తిగా గుమిగూడారు. ఊరి స్త్రీలు <<ఈమె నయోమి కదా>> అని చెప్పుకున్నారు.

20అప్పుడు నయోమి <<నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు.21నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?>> అని వారితో అంది.
22ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.

Chapter 2

బోయజు పొలంలో రూతుతో మాట్లాడటం

1నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు.2మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది <<నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.>> అప్పుడు నయోమి <<అలాగే అమ్మా, వెళ్ళు>> అంది.

3ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.4బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో <<యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక>> అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో <<యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక>> అన్నారు.

5అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో <<ఆ అమ్మాయి ఎవరు?>> అని అడిగాడు.6అతడు<<ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి.7ఆమె <నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి> అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది>> అని చెప్పాడు.

8అప్పుడు బోయజు రూతుతో <<అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు.9కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు>> అని చెప్పాడు.

10అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి <<పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!>> అంది. అప్పుడు బోయజు <<నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను.11నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు.12యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!>> అన్నాడు.

13అందుకు ఆమె <<అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి>> అని చెప్పింది.
14భోజన సమయంలో బోయజు <<నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను>> అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.

15ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో <<ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు.16అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు>> అని చెప్పాడు.
17కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు1 బార్లీ గింజలు అయ్యాయి.18ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది.

19అప్పుడు రూతుతో ఆమె అత్త <<నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక>> అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. <<అతని పేరు బోయజు>> అని చెప్పింది.20దానికి నయోమి<<యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు>> అని తన కోడలితో అంది. నయోమి ఇంకా <<ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు>> అని చెప్పింది.
21దానికి మోయాబీయురాలైన రూతు <<అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు>> అంది.

22అప్పుడు నయోమి తన కోడలు రూతుతో <<అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు>> అంది.
23రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది.


1 2:17 తూమెడు 12 కిలోగ్రాములు

Chapter 3

బోయజు, రూతు బార్లీ గింజలు పొలంలో

1తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. <<అమ్మా, నువ్వు స్థిరపడేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి.2ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. విను, ఈ రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు.

3నువ్వు స్నానం చేసి సువాసన నూనె రాసుకుని బట్టలు మార్చుకుని ఆ పొలానికి ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళు. అతని భోజనం ముగించి నిద్రపోయేంత వరకూ అతనికి కనిపించవద్దు.4నిద్రపోయిన తరువాత ఎక్కడ పడుకున్నాడో చూడు. ఆ చోటికి నువ్వూ వెళ్ళగలిగేలా దాన్ని గుర్తు పెట్టుకో. తరువాత అక్కడికి వెళ్ళి అతని కాళ్ళపై ఉన్న దుప్పటి తీసి అక్కడ పడుకో. ఆ తరువాత జరగాల్సిందంతా అతనే చెబుతాడు.>>5అప్పుడు రూతు <<నువ్వు చెప్పినట్టే చేస్తాను>> అంది.

6ఆమె ధాన్యం చెరిగించే కళ్లం దగ్గరికి వెళ్ళి తన అత్త తనకు చెప్పినట్లు చేసింది.7బోయజు భోజనం చేసి ద్రాక్షారసం తాగి మనస్సులో ఉల్లాసంగా పోయి ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. అప్పుడు రూతు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి తీసి పడుకుంది.
8అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది.9అతడు, <<ఎవరు నువ్వు?>> అని అడిగాడు. ఆమె <<నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు1 >> అంది.
10అతడు <<అమ్మాయీ, నిన్ను యెహోవా దీవించాడు. పేదవారు, ధనికులు అయిన యువకులపై నువ్వు మోజు పడలేదు. అందుకని గతంలో నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరింత యోగ్యంగా ఉంది.11అమ్మాయీ, ఇప్పుడిక భయపడవద్దు. నీకు నేను చెప్పేదంతా తప్పక నెరవేరుస్తాను. నువ్వు చాలా యోగ్యురాలివి అని ప్రజలందరికీ తెలుసు.
12నేను నిన్ను విడిపించగలను అనే మాట నిజమే. కానీ నీకు నాకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు.13ఈ రాత్రి ఉండు. ఉదయాన్నే ఆ వ్యక్తి నీకు బంధువుగా ధర్మం జరిపి నిన్ను విడిపించవచ్చు. నీకు బంధువు ధర్మం జరపడం అతనికి ఇష్టం లేకపోతే నేనే బంధువుగా ఆ ధర్మాన్ని జరిగిస్తానని యెహోవా తోడుగా ప్రమాణం చేస్తున్నాను. తెల్లవారే వరకూ నిద్రపో>> అన్నాడు.

14కాబట్టి ఆమె తెల్లారే వరకూ అతని కాళ్ళ దగ్గర పడుకుని ఇంకా తెల్లవారకముందే లేచింది. అప్పుడు అతడు <<ఆమె ధాన్యం చెరిగించే కళ్ళం దగ్గరికి వచ్చిన విషయం ఎవరికీ చెప్పవద్దు>> అని తన సేవకులకు చెప్పాడు.15తరువాత అతడు <<నువ్వు కప్పుకున్న దుప్పటి పట్టు>> అనగా ఆమె దాన్ని పట్టింది. అతడు ఆరు కొలతల2 బార్లీ గింజలు కొలిచి ఆమె భుజానికెత్తాడు. ఆమె ఊళ్లోకి వెళ్ళిపోయింది.

16రూతు తన అత్త నయోమి దగ్గరికి వచ్చినప్పుడు నయోమి <<అమ్మాయ్, ఏమైంది?>> అని అడిగింది. రూతు అతడు తనకు చేసినదంతా వివరించింది.17<<అతడు నువ్వు వట్టి చేతులతో మీ అత్త ఇంటికి వెళ్ళవద్దు అని ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చాడు>>అంది.18అప్పుడు ఆమె అత్త <<అమ్మా, అతడు ఈ రోజే ఈ విషయం తేల్చేవరకూ ఊరుకోడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందో తెలిసేంత వరకూ ఇక్కడే ఉండు>> అని చెప్పింది.


1 3:9 నాపై నీ కొంగు కప్పు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నది
2 3:15 ఆరు కొలతల ఆరు కిలోగ్రాములు

Chapter 4

బోయజు, రూతుల వివాహం

1బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు <<ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో>> అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు.2బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.

3తరువాత అతడు <<మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.4ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే>> అని అతనితో చెప్పాడు. అందుకతడు <<నేను విడిపిస్తాను>> అన్నాడు.

5అప్పుడు బోయజు <<నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం>>అన్నాడు.6దానికి ఆ బంధువు <<నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను>> అన్నాడు.

7ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు.8ఆ బంధువు <<నువ్వే దాన్ని సంపాదించుకో>> అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.

9అప్పుడు బోయజు <<ఎలీమెలెకుకు కలిగిన సమస్తం- కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు.10అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు>> అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.

11అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ <<మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక!12ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు1 కుటుంబంలా ఉండుగాక!>> అన్నారు.
ఓబేదు పుట్టుక, దావీదు వంశక్రమం
1 దిన 2:5-15; మత్తయి 1:3-6; లూకా 3:31-33

13బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది.14అప్పుడు అక్కడి స్త్రీలు <<ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక.15నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు>> అని నయోమితో చెప్పారు.

16అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.17ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.

18పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.19హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు.20అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.21శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు.22ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.


1 4:12 పెరెసు ఎఫ్రాతా గోత్రం

1 సమూయేలు

Chapter 1

సమూయేలు జననం

1ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు.2ఒకామె హన్నా, రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు.

3ఎల్కానా షిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికీ, బలులు అర్పించడానికీ ప్రతి సంవత్సరం తన ఊరినుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు యెహోవాకు యాజకులుగా ఉన్నారు.

4ఎల్కానా బలి అర్పించే సమయంలో అతని భార్య పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు భాగం ఇస్తూ వచ్చాడు.
5అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం గనక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు రెండు భాగాలు ఇస్తుండేవాడు.6యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడంవల్ల ఆమె సవతి పెనిన్నా ఆమెను విసిగిస్తూ, కోపం పుట్టిస్తూ ఉండేది.

7ఎల్కానా ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది.8ఆమె భర్త ఎల్కానా <<హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? పదిమంది కొడుకులకన్నా నేను నీకు ఎక్కువ కాదా?>> అని ఆమెతో చెబుతూ ఉండేవాడు.

9వారు షిలోహులో భోజనం ముగించిన తరువాత హన్నా లేచినపుడు యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న కుర్చీపై కూర్చుని ఉన్నాడు.10తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది.

11ఆమె ఒక ప్రమాణం చేస్తూ <<సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను>> అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు.
12ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది.13ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు.14అతడామెతో <<ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు? ద్రాక్ష మద్యం ఇక చాలించు>> అన్నాడు.

15అందుకు హన్నా <<ప్రభూ, అది కాదు, నేను మనసులో దుఃఖంతో నిండి ఉన్నాను. నేను ద్రాక్షరసం గానీ, మరి ఏ మద్యం గానీ తీసుకోలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఒలకబోస్తూ ఉన్నాను.16నీ సేవకురాలనైన నన్ను చెడ్డదానిగా అనుకోవద్దు. మితిమీరిన దిగులు, అందోళనల వల్ల నాలో నేను చెప్పుకుంటున్నాను>> అని జవాబిచ్చింది.

17అప్పుడు ఏలీ <<నువ్వు క్షేమంగా వెళ్లు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసికొన్న మనవి ఆయన దయచేస్తాడు గాక>> అని ఆమెతో చెప్పాడు.18ఆమె అతనితో <<నీ సేవకురాలనైన నేను ఈ విషయంలో కృప పొందుతాను>> అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్లిపోయి భోజనం చేస్తూ అప్పటినుండి విచారంగా ఉండడం మానుకుంది.

19తరువాత వారు ఉదయాన్నే త్వరగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రమాలోని తమ ఇంటికి వచ్చారు. అప్పుడు ఎల్కానా తన భార్య హన్నాను కూడినప్పుడు, యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు.20హన్నా గర్భం ధరించి, రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని <<నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను>> అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది.
సమూయేలును హన్నా ప్రతిష్టించడం

21ఎల్కానా, అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి ఏడూ అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు.22అయితే హన్నా <<బిడ్డ పాలు మానే వరకూ నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను>> అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు.23అప్పుడు ఆమె భర్త ఎల్కానా <<నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకూ రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక>> అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానేవరకూ అతన్ని పెంచుతూ ఉంది.

24పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది.25వారు ఒక కోడెను వధించి, పిల్లవాణ్ణి ఏలీ దగ్గరకి తీసుకు వచ్చారు. అప్పుడామె అతనితో ఇలా చెప్పింది,

26<<ప్రభూ, నా ప్రభువు జీవం తోడు నీ దగ్గర నిలబడి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే.27యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు.28కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు>> అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు.

Chapter 2

హన్నా ప్రార్థన

1హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

<<నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.
యెహోవాలో నాకు ఎంతో బలం1 కలిగింది.
నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.
నా విరోధుల మీద నేను అతిశయపడతాను.
2యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.
నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు
మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.
3యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.
మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.
కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.
అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.
4పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు.
తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.
5తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు.
ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు.
గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది.
ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.
6మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే.
పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.
7యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.
కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.
8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,
మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ
వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.
పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.
భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.
ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.
9తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.
దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.
బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.
10యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు.
పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు.
భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు.
తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.>>

11తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు.
ఏలీ కుమారులు

12ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.13ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి14డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.

15అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో <<యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి>> అనేవాడు.16<<అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు>> అని అతనితో చెబితే, వాడు <<అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం>> అనేవాడు.17అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.

18బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.19అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది.

20<<యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు>> అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.21యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.

22ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు,23<<ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు?24నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.

25మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి2 శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?>> అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు.26బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.
ఏలీ శిక్షకు సంబంధించిన ప్రవచనం

27ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. <<యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, <నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.28అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.

29నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.30నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.> అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, <నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.>

31జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు.32నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు,33నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.

34నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు.35తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.

36అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, <నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో> అని అతడిని బతిమాలుకుంటారు.>>


1 2:1 బలం కొమ్ము
2 2:25 న్యాయమూతి దేవుడు

Chapter 3

సమూయేలుకు యెహోవా పిలుపు

1బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు.2ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు.3దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు.4అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు <<అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను>> అన్నాడు.

5ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి <<నన్ను పిలిచావు గదా, వచ్చాను>> అన్నాడు. ఏలీ <<నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో>> అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు.6యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి<<అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను>> అన్నాడు. అందుకు అతడు <<బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో>> అని చెప్పాడు.

7అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు.8యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి <<అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను>> అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు.

9అతడు <<నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, <యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి> అని చెప్పు>> అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు.

10తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా <<సమూయేలూ సమూయేలూ>> అని పిలిచినప్పుడు సమూయేలు <<నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి>> అన్నాడు.11అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి.

12ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను.13తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను.14కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.>>

15తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు.16అయితే ఏలీ <<సమూయేలూ, కుమారా>> అని సమూయేలును పిలిచాడు. అతడు <<చిత్తం, నేనిక్కడ ఉన్నాను>> అన్నాడు.

17ఏలీ <<నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక>> అనగా,18సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ <<చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక>> అన్నాడు.

19సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని1 మాటల్లో ఏదీ తప్పిపోలేదు.20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు.21షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్ష పరచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయింది.


1 3:19 దేవుని సమూయేలు

Chapter 4

దేవుని మందసం ఫిలిష్తీయుల స్వాధీనం చేసుకోవడం

1ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు.2ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు.

3ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు <<యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది1 మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది>> అన్నారు.

4కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.

5యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు.6ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు.

7వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని <<అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు,8అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా.9ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం>> అని చెప్పుకున్నారు.

10ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.11శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.
ఏలీ మరణం

12ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకొంటూ, చినిగిన బట్టలతో, తలంతా దుమ్ము కొట్టుకుపోయి షిలోహుకు వచ్చాడు.13అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.

14ఏలీ ఆ కేకలు విని <<ఈ కేకల శబ్దం ఏమిటి?>> అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు.

15అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
16ఆ వ్యక్తి <<యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈ రోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను>> అని ఏలీతో చెప్పాడు. ఏలీ <<నాయనా, అక్కడ ఏమి జరిగింది?>> అని అడిగాడు.17అందుకు అతడు <<ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొఫ్నీ, ఫీనెహాసు అనే నీ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు>> అని చెప్పాడు.

18దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూల కాయుడు. అతడు నలభై ఏళ్లు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు.

19నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫీనెహాసు భార్య శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారనీ, తన మామ, భర్త చనిపోయారనీ విని, నొప్పులు ఎక్కువై మోకాళ్ల మీద కూలబడి అక్కడే ప్రసవించింది.20ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో <<భయపడకు, నీకు కొడుకు పుట్టాడు>> అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
21ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని <<ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది>> అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది.

22<<శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది>> అని ఆమె అంది.


1 4:3 అది యెహోవా

Chapter 5

దేవుని మందసం ఎబెనెజరు, అష్డోదులో

1ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.2వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు.3అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు.

4ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.5అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు.

6యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు.7అష్డోదు ప్రజలు జరిగింది చూసి <<ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.>> అని చెప్పుకున్నారు.

8కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి <<ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?>> అని అడిగారు. అందుకు పెద్దలు <<ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి>> అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు.9వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి.

10వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి <<మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు>> అన్నారు.

11అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి <<ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి>> అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.12చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.

Chapter 6

మందసం ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి రావడం

1యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది.2ఫిలిష్తీయులు యాజకులనూ శకునం చూసేవారిని పిలిపించి <<యెహోవా మందసాన్ని ఏం చేద్దాం? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకి పంపడానికి ఏమి చేయాలో చెప్పండి>> అని అడిగారు. అందుకు వారు,

3<<ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు. ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగి పోలేదో తెలుసుకుంటారు>> అని జవాబిచ్చారు.

4ఫిలిష్తీయులు <<మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి?>> అని వారిని అడగగా వారు<<మిమ్మలనూ మీ పెద్దలనూ పీడిస్తున్న తెగులు ఒక్కటే కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం ఐదు బంగారపు గడ్డల రూపాలు, ఐదు బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి.

5కాబట్టి మీకు వచ్చిన గడ్డలకూ భూమిని పాడు చేసే పందికొక్కులకూ సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారుచేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకూ మీ దేవుళ్ళకూ మీ భూమికీ కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు.6ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకొన్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్ళనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు కదా.
7కాబట్టి మీరు ఒక కొత్త బండి తయారు చేయించి, ఇంతవరకూ కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి, బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి,8యెహోవా మందసాన్ని ఆ బండిమీద పెట్టి, పరిహారంగా ఆయనకు చెల్లించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఆ బండి దాని దారిలో వెళ్ళేలా వదిలిపెట్టండి.9అది బేత్షెమెషుకు వెళ్లే దారిలో ఈ దేశ సరిహద్దును దాటితే ఆయనే ఈ గొప్ప కీడు మనకు కలిగించాడని తెలుసుకోవచ్చు, ఆ దారిన వెళ్ళకపోతే ఆయన మనకి ఈ కీడు కలిగించలేదనీ, మన దురదృష్టం వల్లనే అది మనకు సంభవించిందనీ గ్రహించాలి>> అన్నారు.

10ఆ విధంగా వారు రెండు పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంట్లో ఉంచి11యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలూ పందికొక్కు రూపాలూ ఉన్న ఆ చిన్న పెట్టెను బండిమీద పెట్టారు.12ఆ ఆవులు రహదారి వెంబడి సాఫీగా వెళ్తూ, రంకెలు వేస్తూ, బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బేత్షెమెషు సరిహద్దు వరకూ వెళ్లారు.

13బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.
14ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ అనే వాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.

15లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందికి దించి ఆ పెద్ద రాతిమీద పెట్టినప్పుడు ఆ రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు.

16ఫిలిష్తీయుల పెద్దలు ఐదుగురు జరిగినదంతా చూసి అదే రోజున ఎక్రోను చేరుకున్నారు.

17పరిహార అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమంటే, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను- ఈ ఐదు పట్టణాల ప్రజల కోసం ఒక్కొక్కటి.18ప్రాకారాలు ఉన్న పట్టణాలు, పొలాల్లో ఉండే గ్రామాలవారు, ఫిలిష్తీయుల ఐదుగురు పెద్దల పట్టణాలు అన్నిటి లెక్క ప్రకారం బంగారపు పందికొక్కులను అర్పించారు. యెహోవా మందసాన్ని కిందికి దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యం. ఇప్పటివరకూ ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉంది.

19బేత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 701 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు.20అప్పుడు బేత్షెమెషు ప్రజలు <<పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడి నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో>> అనుకుని
21కిర్యత్యారీము ప్రజల దగ్గరికి మనుషులను పంపించి <<ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి తీసుకు వచ్చారు, మీరు వచ్చి మీ దగ్గరకి దాన్ని తీసుకు వెళ్ళండి>> అని కబురు పంపించారు.


1 6:19 70 హీబ్రు పత్రాల్లో 50,070 అని ఉంది

Chapter 7

1అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.

2మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
మిస్పా వద్ద ఇశ్రాయేలీయులు తిరిగి ప్రతిష్టించుకోవడం, ఫిలిష్తీయుల ఓటమి

3సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. <<మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.>>4ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.

5అప్పుడు సమూయేలు <<ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను>> అని చెప్పినప్పుడు6వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి <<యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం>> అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.

7ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి8<<మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు>> అని సమూయేలును వేడుకున్నారు.

9సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.

10సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.11ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.

12అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి <<ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు>> అని చెప్పి ఆ రాయికి <<ఎబెనెజరు>> అని పేరు పెట్టాడు.

13ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది.14ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.

15సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.16ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు.17అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.

Chapter 8

రాజు కోసం ఇశ్రాయేలు ప్రజల కోరిక

1సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు.2అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా,3వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.

4ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి,5<<అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు>> అని అతనితో అన్నారు.

6<<మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు>> అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు.7యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. <<ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు.

8వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు.9అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.>>

10తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ11ఇలా చెప్పాడు. <<మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని, తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరుగెత్తుతారు.12అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమంది పై అధికారులుగా, యాభైమంది పై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు.

13మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు.14మీ పొలాల్లో, ద్రాక్షతోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ఠ భాగాన్ని తీసుకు తన సేవకులకు ఇస్తాడు.15మీ పంటలో, ద్రాక్షపళ్ళలో పదవ వంతు తీసుకు తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు.

16మీ స్వంత పనివాళ్ళలో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచివాటిని తీసుకు తన కోసం ఉంచుకొంటాడు.17మీ మందల్లో పదవ భాగం తీసుకొంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు.18ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకొన్న రాజు గురించి ఎంతగా వేడుకొన్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు.>>

19ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి,20<<అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకూ రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు, మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు>> అన్నారు.

21సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు.22అప్పుడు యెహోవా <<నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు>> అని సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు <<మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళి పొండి>> అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

Chapter 9

సమూయేలు సౌలును అభిషేకించడం

1బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా.2కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు.

3సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి <<మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు>> అని చెప్పాడు.4అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి షాలిషా దేశంలో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు.

5అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు <<మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు>> అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు,6వాడు <<ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి>> అని చెప్పాడు.

7అప్పుడు సౌలు <<మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?>> అని తన పనివాణ్ణి అడిగాడు.8వాడు సౌలుతో <<అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం 1 వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను>> అన్నాడు.

9ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో <<మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి>> అని చెప్పుకోవడం పరిపాటి.10అప్పుడు సౌలు <<నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద>> అన్నాడు.

11వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు <<ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?>> అని అడిగారు.

12అందుకు వారు <<ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈ రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈ రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు.13మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లక ముందే మీరు అతణ్ణి కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకూ ప్రజలు భోజనం చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతణ్ణి కలుసుకోడానికి ఇదే సరైన సమయం.>> అని చెప్పారు.

14వారు ఊళ్లోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు.

15సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు.16ఎందుకంటే <<నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.>>

17సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా <<ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు>> అని అతనితో చెప్పాడు.18సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని <<దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి>> అని అడిగినప్పుడు,19సమూయేలు సౌలును చూసి <<నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.

20మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరి పైన ఉంది? నీపైనా, నీ తండ్రి సంతానం పైనే కదా>> అన్నాడు.21అప్పుడు సౌలు <<నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?>> అన్నాడు.

22అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి
23వంటవాణ్ణి చూసి <<నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా>> అని చెప్పినప్పుడు,24అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. <<చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను>> అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు.

25పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు.26తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు<<నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా>> అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి
27ఊరి చివరకూ వస్తుండగా సమూయేలు సౌలుతో <<నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసేవరకూ నువ్వు ఇక్కడే ఆగిపో>> అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు.


1 9:8 పావు తులం 3 గ్రాములు చిన్న నాణెం

Chapter 10

1అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని <<యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల1 మీద నిన్ను రాజుగా నియమించాడు>> అని ఇంకా ఇలా చెప్పాడు,2<<ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు <నువ్వు వెదకుతున్న గాడిదలు దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మరచిపోయి, నా కొడుకును వెదకడానికి నేనేం చెయ్యాలి, అని నీ కోసం బాధ పడుతున్నాడు> అని చెబుతారు.

3తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు.4వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి.

5ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు.6యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది.
7దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి.

8నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరకి వచ్చి నువ్వు ఏమి చేయాలో చెప్పేవరకూ ఏడు రోజులపాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి.>>
సౌలు రాజు కావడం

9సమూయేలు దగ్గర నుండి వెళ్లిపోడానికి బయలుదేరినపుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి.

10వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు.

11గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలసి ప్రకటించడం చూసి <<కీషు కుమారుడికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా?>> అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.12అక్కడ ఉన్న ఒక వ్యక్తి <<అతని తండ్రి ఎవరు?>> అని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా? అనే సామెత పుట్టింది.13తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు.

14సౌలు చిన్నాన్న అతణ్ణి, అతని పనివాణ్ణి చూసి <<మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?>> అని అడిగినపుడు అతడు<<గాడిదలను వెదకాలని వెళ్ళాం, అవి కనబడనప్పుడు సమూయేలు దగ్గరకి వెళ్ళాం>> అని చెప్పాడు.15సౌలు చిన్నాన్న <<సమూయేలు నీకు ఏమి చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు>> అని అడిగాడు.16సౌలు అతనితో <<గాడిదలు దొరికాయి అని అతడు చెప్పాడు>> అని చెప్పాడు గానీ రాజ్య పరిపాలనను గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకు చెప్పలేదు.

17తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు,18<<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి, మిమ్మల్ని బాధపెట్టిన ప్రజలనుండి విడిపించాను.19అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. <మా మీద ఒకరిని రాజుగా నియమించు> అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.>>

20ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినపుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది.21బెన్యామీను గోత్రంవారి వంశాలు, కూటమి పేరుల ప్రకారం సమకూర్చినపుడు మత్రియుల వంశం ఏర్పడింది. తరువాత కీషు కుమారుడు సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతనిని వెదగ్గా అతడు కనబడలేదు.

22అప్పుడు వారు <<ఇక్కడికి రావలసి మనిషి ఇంకెవరైనా ఉన్నారా>> అని యెహోవా దగ్గర వాకబు చేసినప్పుడు యెహోవా <<అతడు సామానుల్లో దాక్కున్నాడు>> అని చెప్పాడు.23వారు పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి అతణ్ణి తీసుకువచ్చారు. అతడు సమూహంలో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరులకంటే పైకి ఎత్తయినవాడుగా కనబడ్డాడు.

24అప్పుడు సమూయేలు <<యెహోవా ఏర్పరచుకున్నవాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు>> అని చెప్పినప్పుడు, ఆ ప్రజలంతా ఆనందంతో <<రాజు చిరకాలం జీవిస్తాడు గాక>> అంటూ బిగ్గరగా కేకలు వేశారు.

25తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని ప్రజలకి వినిపించి, ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచాడు. తరువాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్ళకు పంపివేశాడు.

26సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధవీరులు అతని వెంట వెళ్లారు.27అసూయపరులూ, దుష్టులూ అయిన కొందరు <<ఈ మనిషి మనలను ఏలుతాడా?>> అని చెప్పుకొంటూ అతడిని పట్టించుకోకుండా, కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు.


1 10:1 ప్రజల ఇశ్రాయేలీయుల

Chapter 11

సౌలు అమ్మోనీయులను ఓడించడం

1అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు <<మేము నీకు సేవకులుగా ఉంటాం. మాతో ఒప్పందం చేసుకో>> అని నాహాషును అడిగారు.2<<ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను>> అని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు పెద్దలతో చెప్పాడు.

3అందుకు వారు <<మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మును మేమే నీకు అప్పగించుకుంటాం>> అన్నారు.

4ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు.5సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ <<ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి?>> అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేసారు.

6సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో7ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ <<సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను>> అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు.8అతడు బెజెకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు మూడు లక్షల మంది, యూదావారు 30 వేల మంది ఉన్నారు.

9అప్పుడు సౌలు <<రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి>> అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు.10అప్పుడు యాబేషువారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు. <<రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు.>>

11తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.

12తరువాత ప్రజలు <<సౌలు మనలను ఏలుతాడా? అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు>> అని సమూయేలుతో అన్నారు.13అందుకు సౌలు <<ఈ రోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు>> అన్నాడు.

14<<మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం, రండి>> అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు.15ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

Chapter 12

సమూయేలు చివరి ఉపదేశం

1అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. <<వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను.2మీకు అవసరమైన పనులు మీ రాజు జరిగిస్తాడు. నా తల నెరిసిపోయింది, నేను ముసలివాణ్ణి అయ్యాను. నా కొడుకులు మీ మధ్యలో ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈరోజు వరకూ నేను మీ మధ్య ఉండి మీ పనులు చేస్తూ వచ్చాను.

3ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.>>

4అందుకు ప్రజలు <<నువ్వు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు, ఏ విధంగానూ బాధ కలిగించలేదు, ఎవరి దగ్గరా నువ్వు దేనినీ తీసుకోలేదు>> అని అతనితో చెప్పారు.5అతడు <<అలాంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా, ఇంకా ఆయన అభిషేకం చేయించినవాడు కూడా ఈనాడు మీ మీద సాక్షులుగా ఉన్నారు>> అని చెప్పినప్పుడు <<అవును, సాక్షులే>> అని వారంతా జవాబిచ్చారు.

6సమూయేలు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాడు. <<మోషేను, అహరోనును నాయకులుగా నియమించి మీ పూర్వీకులను ఐగుప్తు దేశం నుండి రప్పించినవాడు యెహోవాయే గదా7కాబట్టి యెహోవా మీకు, మీ పూర్వీకులకు చేసిన న్యాయమైన ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధానంలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.

8యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు.9అయితే వారు తమ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని హాసోరు సేనాధిపతి సీసెరా చేతికీ ఫిలిష్తీయుల చేతికీ మోయాబు రాజు చేతికీ అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి హింసించారు.

10అప్పుడు వారు, <మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళనూ అష్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాం. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. నిన్ను మాత్రమే సేవిస్తాం> అని యెహోవాను వేడుకున్నారు.11యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిక్కులా ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వల్ల మీరు భయం లేకుండా నివసిస్తున్నారు.

12అయితే అమ్మోనీయుల రాజు నాహాషు మీపైకి దండెత్తినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సంరక్షుడుగా ఉన్నప్పటికీ, <ఆయన వద్దు, ఒక రాజు మమ్మల్ని ఏలాలి> అని మీరు నన్ను అడిగారు.13మీరు ఇష్టపూర్వకంగా నియమించుకొన్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీపైన రాజుగా నిర్ణయించాడు.

14మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి.15అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.

16మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి.17ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.>>18సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

19వారు సమూయేలుతో ఇలా అన్నారు. <<రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.>>20అప్పుడు సమూయేలు ప్రజలతో<<భయపడవద్దు. మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాను విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ, నిండు హృదయంతో ఆయనను సేవించండి.21ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.

22యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.23నేను మాత్రం ఇంకా ఎక్కువ ఆసక్తితో మీ కోసం ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసినవాడనవుతాను. ఆయనశ్రేష్ఠమైన మంచి మార్గం మీకు బోధిస్తాను.

24ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.25మీరు చెడ్డ పనులు చేస్తూ ఉన్నట్టయితే మీరూ, మీ రాజూ నశించిపోతారు.>>

Chapter 13

సమూయేలు సౌలును గద్దించడం

1సౌలు రాజుగా పాలించడం ఆరంభించినపుడు అతని వయస్సు ముప్ఫై ఏళ్ళు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత2ఇశ్రాయేలీయుల్లో మూడు వేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండు వేలమంది మిక్మషు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, వెయ్యిమంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు.

3యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినపుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు.4సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు.

5ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు.

6ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు.7కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతణ్ణి అనుసరించారు.

8సమూయేలు చెప్పినట్టు అతడు వారం రోజులు వేచి ఉండి, సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదరిపోవడం చూసి9హోమ బలిని, శాంతి బలిని నా దగ్గరికి తీసుకు రమ్మని చెప్పి హోమబలి అర్పించాడు.10అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతణ్ణి చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు.

11సమూయేలు అతణ్ణి చూసి <<నువ్వు చేసిన పని ఏమిటి?>> అని అన్నాడు. అందుకు సౌలు<<ప్రజలు నానుండి చెదరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమకూడడం నేను గమనించి12ఇక యెహోవాకు శాంతి బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను>> అన్నాడు.

13అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు. <<నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలచాడు. అయితే నీ అధికారం నిలబడదు.14యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.>>

15సమూయేలు లేచి, ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినపుడు వారు సుమారు ఆరు వందలమంది ఉన్నారు.
ఆయుధాలు లేని ఇశ్రాయేలీ సైనికులు

16సౌలు, అతని కుమారుడు యోనాతాను, తమ దగ్గర ఉన్న వారితో కలసి బెన్యామీనీయుల గిబియాకు చేరుకున్నారు. ఫిలిష్తీయులు మిక్మషులో దిగారు.

17ఫిలిష్తీయుల దండు నుండి దోచుకొనేవారు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రావైపుగా వెళ్లే దారిలో కాపు కాశారు.18రెండవ గుంపు బేత్‌ హోరోనుకు వెళ్లే దారిలో, మూడవ గుంపు అరణ్యం దగ్గరలోని జెబోయిము లోయ సరిహద్దు దారిలో కాపుకాశారు.

19హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకొంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివాళ్ళు ఎవరూ ఉండకుండాా చేశారు.20కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది.21నాగటి కర్రలకు, పారలకు, మూడు ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్ళకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది.

22అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు, యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తిగానీ, యీటెగానీ లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి.23ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.

Chapter 14

యోనాతాను ఫిలిష్తీయులను ఎదుర్కొవడం

1ఆ రోజున సౌలు కొడుకు యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధాలు మోసేవాణ్ణి పిలిచి <<అటువైపు ఉన్న ఫిలిష్తీయుల సైన్యం కావలి వారిని చంపడానికి వెళ్దాం పద>> అన్నాడు.

2సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద డేరా వేసుకున్నాడు. అతని దగ్గర సుమారు ఆరు వందలమంది మనుషులు ఉన్నారు.3షిలోహులో యెహోవా యాజకుడైన ఏలీ కుమారుడు ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు సహోదరుడు అహీటూబుకు పుట్టిన అహీయా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉన్నాడు. యోనాతాను వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు.

4యోనాతాను ఫిలిష్తీయుల సైన్యానికి కావలి వారున్న స్థలానికి వెళ్ళాలనుకున్న దారికి రెండు ప్రక్కలా నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవదాని పేరు సెనే.5మిక్మషుకు ఉత్తరంగా ఒక కొండ శిఖరం, రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి.

6యోనాతాను <<ఈ సున్నతి లేనివారి శిబిరంపైకి వెళ్దాం పద. ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో. అనేకమంది చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా?>> అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు.7వాడు <<నీ మనస్సుకు తోచింది చెయ్యి. వెళ్దాం పద, నీకు నచ్చినట్టు చేయడానికి నేను నీతోపాటే ఉంటాను>> అన్నాడు.

8అప్పుడు యోనాతాను <<మనం వారి దగ్గరికి వెళ్ళి వారు మనలను చూసేలా చేద్దాం.9వారు మనలను చూసి, <మేము మీ దగ్గరికి వచ్చేవరకూ అక్కడే నిలిచి ఉండండి> అని చెప్పినట్టైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం ఉన్న చోటే ఉండిపోదాం.10<మా దగ్గరకి రండి> అని వాళ్ళు పిలిస్తే దానివల్ల యెహోవా వారిని మన చేతికి అప్పగించాడని అర్థం చేసుకుని మనం వెళ్దాం>> అని చెప్పాడు.

11వారిద్దరూ తమను తాము ఫిలిష్తీయుల సైన్యం కావలి వారికి కనపరచుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు <<చూడండి, దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు>> అని చెప్పుకొంటూ,12యోనాతానును, అతని ఆయుధాలు మోసేవాడిని పిలిచి <<మేము మీకు ఒకటి చూపిస్తాం రండి>> అన్నారు. యోనాతాను <<నా వెనకే రా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు>> అని తన ఆయుధాలు మోసేవాడితో చెప్పి
13అతడూ, అతని వెనుక అతని ఆయుధాలు మోసేవాడూ తమ చేతులతో, కాళ్లతో పాకి పైకి ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడిపోగానే అతని వెనకాలే అతని ఆయుధాలు మోసేవాడు వారిని చంపివేశాడు.

14యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు చేసిన ఆ మొదటి సంహారంలో దాదాపు ఇరవై మంది చనిపోయారు. ఒక రోజులో ఒక కాడి యెడ్లు దున్నగలిగే అర ఎకరం నేల విస్తీర్ణంలో ఇది జరిగింది.
ఫిలిష్తీయుల మీద విజయం

15ఆ సమూహంలో, పొలంలో ఉన్నవారందరిలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. సైన్యానికి కావలివారు, దోచుకొనేవారూ భయపడ్డారు, నేల కంపించింది. ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు అనుకున్నారు.

16బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియాలో ఉన్న సైనికులు చెదిరిపోయి పూర్తిగా ఓడిపోవడం సౌలు గూఢచారులు చూసి ఆ సమాచారం సౌలుకు తెలిపారు.17సౌలు <<మన దగ్గర లేనివాళ్ళెవరో తెలుసుకోడానికి అందరినీ లెక్కపెట్టండి>> అని చెప్పాడు. వారు చూసి యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు అక్కడ లేరని కనుగొన్నారు.

18ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది. <<దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురండి>> అని సౌలు అహీయాకు ఆజ్ఞాపించాడు.19సౌలు యాజకునితో మాట్లాడుతుండగా, ఫిలిష్తీయుల శిబిరంలో అలజడి ఎక్కువ కాసాగింది. అప్పుడు సౌలు యాజకునితో <<నీ చెయ్యి వెనక్కి తీసుకో>> అని చెప్పి
20అతడూ, అతనితో ఉన్నవారంతా కలిసి యుద్ధానికి బయలుదేరారు. వారిని చూసి ఫిలిష్తీయులు తికమకపడి ఒకరినొకరు చంపుకున్నారు.

21అంతకు ముందు ఫిలిష్తీయుల ఆధీనంలో చుట్టుపక్కల శిబిరాల్లో ఉన్న హెబ్రీయులు ఇశ్రాయేలీయులను కలుసుకోడానికి ఫిలిష్తీయులను విడిచిపెట్టి సౌలు దగ్గరకి, యోనాతాను దగ్గరకి వచ్చారు.
22అంతేకాక, ఫిలిష్తీయ సైన్యం పారిపోతున్నదని విని వారిని తరమడానికి ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కొన్న ఇశ్రాయేలీయులు యుద్ధంలో చేరారు.

23ఆ రోజున ఇశ్రాయేలీయులను యెహోవా ఈ విధంగా కాపాడాడు. యుద్ధం బేతావెను అవతల వరకూ సాగింది. ఇశ్రాయేలీయులు బాగా అలసిపోయారు.
యోనాతాను తేనె తాగటం

24<<నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు>> అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు.25సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది.26వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు.

27అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు1 వచ్చింది.28అక్కడి వారిలో ఒకడు <<నీ తండ్రి ప్రజలచేత ఒట్టు పెట్టించి <ఈ రోజున ఆహారం తీసుకొనేవాడు కచ్చితంగా శాపానికి గురవుతాడు> అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు>> అని చెప్పాడు.

29అందుకు యోనాతాను <<నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు.30మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా>> అన్నాడు.

31ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకూ తరిమి హతం చేసినందువల్ల బాగా అలసిపోయారు.32వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి, గొర్రెలను, ఎద్డులను, దూడలను నేలమీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు.

33<<ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు>> అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు <<మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి>> అని చెప్పి,34<<అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు>> అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు.

35అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.

36సౌలు <<మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళలో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి>> అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా <<నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి>> అని అన్నారు. అప్పుడు సౌలు <<యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి>> అని చెప్పాడు.37సౌలు <<నేను ఫిలిష్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తావా>> అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు.

38అందుకు సౌలు <<ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి.39అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే, వాడు తప్పకుండా చనిపోతాడని ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను>> అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.

40<<మీరంతా ఒక పక్కన ఉండండి, నేనూ, నా కొడుకు యోనాతానూ మరో పక్కన నిలబడతాం>> అని సౌలు చెప్పినప్పుడు, వారంతా <<నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి>> అన్నారు.41అప్పుడు సౌలు <<ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, తప్పు చేసినది ఎవరో చూపించు>> అని ప్రార్థించినపుడు సౌలు, యోనాతానుల పేరున చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు.

42<<నాకూ నా కొడుకు యోనాతానుకూ మధ్య చీటీ వేయండి>> అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరున పడింది.

43<<నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి>> అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను <<నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది>> అని సౌలుతో అన్నాడు.44అప్పుడు సౌలు <<యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు>> అన్నాడు.

45అయితే ప్రజలు సౌలుతో <<మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈ రోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు. అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు>> అని చెప్పి యోనాతాను మరణించకుండా అతణ్ణి కాపాడారు.46తరువాత సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్లిపోయాడు, ఫిలిష్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు.

47ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది, నలు దిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబా దేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరి పైనా గెలుపు సాధించాడు.48అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు.
సౌలు కుటుంబం

49సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మేరబు, రెండవది మీకాలు.50సౌలు భార్య అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు, ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు.51సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, ఇద్దరూ అబీయేలు కుమారులు.

52సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను, వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు.


1 14:27 కళ్ళకు వెలుగు శక్తి

Chapter 15

రాజుగా సౌలును దేవుడు తిరస్కరించడం

1ఒక రోజున సమూయేలు సౌలును పిలిచి ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజలపై నిన్ను రాజుగా అభిషేకించడానికి యెహోవా నన్ను పంపించాడు. ఆయన మాట విను.2సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, <అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గ మధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా.3కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, ఎద్దులైనా, గొర్రెలైనా, ఒంటెలైనా, గాడిదలైనా వేటినీ విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి, అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి> >> అని చెప్పాడు.

4అప్పుడు సౌలు ప్రజలను తెలాయీములో పోగుచేసి వారిని లెక్కించాడు. కాల్బలం రెండు లక్షలమంది, యూదావారు పదివేలమంది పోగయ్యారు.5అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు.

6ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కేనీయులు వారికి సహాయం చేశారు గనుక అమాలేకీయులతో కలసి ఉన్న కేనీయులు కూడా నాశనం కాకుండా ఉండేలా వారిని బయలుదేరి వెళ్ళిపొమ్మని కేనీయులకు సమాచారం పంపినపుడు కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్లిపోయారు.7తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకూ తరిమి సంహరించి
8అమాలేకీయుల రాజు అగగును సజీవంగా పట్టుకుని, మిగిలిన వారందరినీ కత్తితో నాశనం చేశాడు.

9సౌలు, అతని ప్రజలు కలసి అగగును, గొర్రెలు, ఎద్దులు, బాగా బలిసిన గొర్రెపిల్లలు మొదలైనవాటిలో మంచివాటినీ నాశనం చేయకుండా వేరుగా ఉంచి, పనికిరాని వాటిని, నాసిరకం వాటిని చంపివేశారు.

10అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైఇలా చెప్పాడు,11<<సౌలు నేను చెప్పినది చేయకుండా నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు గనుక అతణ్ణి రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.>> అప్పుడు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రి అంతా యెహోవాకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు.

12తెల్లవారగానే సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్ళినప్పుడు సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ విజయ స్మారక స్థూపం నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు.13తరువాత అతడు సౌలు దగ్గరకి వచ్చినపుడు సౌలు<<యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక, యెహోవా చెప్పిన మాట నేను జరిగించాను>> అన్నాడు.

14అప్పుడు సమూయేలు <<అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి?>> అని అడిగాడు.15అందుకు సౌలు <<అమాలేకీయుల నుండి ప్రజలు వీటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజలు గొర్రెల్లో, ఎద్దుల్లో మంచివాటిని చంపకుండా ఉండనిచ్చారు. మిగిలిన వాటన్నిటినీ మేము హతం చేశాం>> అన్నాడు.16సమూయేలు <<నీవు మాట్లాడవలసిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు చెబుతున్నాను విను>> అన్నాడు. సౌలు <<చెప్పండి>> అన్నాడు.

17అప్పుడు సమూయేలు <<నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు.18యెహోవా నిన్ను పంపించి <నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చెయ్యి> అని చెప్పినప్పుడు,19నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దాన్ని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు?>> అన్నాడు.

20అప్పుడు సౌలు<<అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగగును మాత్రమే తీసుకు వచ్చాను కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను.21అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెల్లో, ఎద్దుల్లో శ్రేష్ఠమైనవాటిని తీసుకువచ్చారు>> అని సమూయేలుతో చెప్పాడు.

22అందుకు సమూయేలు <<ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.23తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు>> అన్నాడు.

24అప్పుడు సౌలు <<ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.25నువ్వు నా పాపాన్ని తీసివేసి నేను యెహోవాకు మొక్కుకొనేలా నాతో కలసి రా>> అని సమూయేలును వేడుకున్నాడు.

26అయితే సమూయేలు <<నీతోబాటు నేను వెనక్కి రాను. నీవు యెహోవాను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా యెహోవా నిన్ను తిరస్కరించాడు>> అని చెప్పి27వెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది.

28అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు<<ఈ రోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దాన్ని అప్పగించాడు.29ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు.>>

30సౌలు<<నేను పాపం చేశాను. అయినప్పటికీ నా ప్రజల పెద్దల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నన్ను గౌరవించు. యెహోవాకు మొక్కడానికి నేను వెళ్తుండగా నాతో కూడ కలసి రమ్మని>> అతని బతిమాలినప్పుడు31సమూయేలు సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత
32సమూయేలు <<అమాలేకీయుల రాజు అగగును నా దగ్గరికి తీసుకు రండి>> అన్నాడు. అగగు ఆనందంగా అతని దగ్గరకి వచ్చి <<నాకు మరణ శిక్ష తప్పిపోయిందా>> అన్నాడు.

33సమూయేలు <<నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది>> అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు.

34తరువాత సమూయేలు రమాకు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు.35సౌలు బతికినంత కాలం సమూయేలు అతణ్ణి చూసేందుకు వెళ్లలేదు గానీ సౌలును గూర్చి దుఃఖిస్తూ వచ్చాడు. తాను సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందాడు.

Chapter 16

సమూయేలు దావీదును అభిషేకించడం

1యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు <<ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.>>

2అందుకు సమూయేలు <<నేనెలా వెళ్ళగలను? నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు>> అన్నాడు. యెహోవా <<నువ్వు ఒక లేగ దూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి,3యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతణ్ణి నువ్వు అభిషేకించాలి>> అని చెప్పాడు.

4సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బేత్లెహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి <<నువ్వు శాంతంగానే వస్తున్నావా?>> అని అడిగినప్పుడు,5అతడు <<శాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలసి బలికి రండి>> అని చెప్పి యెష్షయిని, అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు.

6వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి <<నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు>> అని అనుకున్నాడు.7అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. <<అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.>>

8యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు <<యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు>> అన్నాడు.9అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు <<యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు>> అన్నాడు.10యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు <<యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు>> అని చెప్పి,
11<<నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?>> అని యెష్షయిని అడిగాడు. అతడు <<ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు>> అని చెప్పాడు. అందుకు సమూయేలు<<నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా>> అని యెష్షయితో చెప్పాడు.

12యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే <<నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు>> అని యెహోవా చెప్పగానే,
13సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.
సౌలు ఇంటిలో దావీదు

14యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది,15సౌలు సేవకులు <<దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది.16నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు>> అని సౌలుతో అన్నారు.

17అప్పుడు సౌలు <<బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి>> అని వారితో చెప్పాడు.18వారిలో ఒకడు <<బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా>> అని చెప్పాడు.19సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి <<గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు>> అని కబురు చేశాడు.

20అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.21దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.

22అప్పుడు సౌలు <<దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో>> అని యెష్షయికి కబురు పంపాడు.23దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.

Chapter 17

దావీదు, గొల్యాతు

1ఫిలిష్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోలో సమకూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకో, అజేకా మధ్య మకాం చేశారు.

2సౌలు, ఇశ్రాయేలీయులు కూడుకుని ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులను ఎదిరించడానికి వరుసల్లో నిలబడ్డారు.3ఒక లోయకు ఇరుప్రక్కలా కొండల మీద ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు నిలిచి ఉన్నారు.

4ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు.5అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు.

6అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి.7అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు.

8అతడు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యం వారితో <<నేను ఫిలిష్తీయుణ్ణి, మీరంతా సౌలు దాసులు కదా. యుద్ధం చేయడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు? మీరు మీ తరఫున ఒకరిని ఎన్నుకుని అతణ్ణి నాపైకి యుద్ధానికి పంపండి.9అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసోహం అవుతాం. నేనే గనక అతణ్ణి జయించి, అతణ్ణి చంపితే మీరంతా మాకు దాస్యం చేయాలి.>>

10ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు. <<ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్న్యాన్ని సవాలు చేస్తున్నాను. మీ నుండి ఒకరిని పంపితే వాడూ నేనూ పోరాడతాం>> అంటూ రంకెలు వేశాడు.11సౌలు, ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని కేకలు విని హడలిపోయి చాలా భయపడి పోయారు.

12దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు.13యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్ళిన అతని ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.
14దావీదు ఆఖరి కొడుకు. అన్నలు ముగ్గురూ సౌలుతోబాటు వెళ్లారు కాని15దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ, సౌలు దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు.

16ఆ ఫిలిష్తీయుడు నలభై రోజులు ప్రతి ఉదయం సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు.

17యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి <<ఒక తూముడు వేయించిన గోదుమలనూ పది రొట్టెలనూ తీసుకు సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు.18ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా>> అని చెప్పి పంపించాడు.

19సౌలు సైన్యం, ఇశ్రాయేలీయులంతా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.20దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకు యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులుతీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకొంటున్నారు.21ఇశ్రాయేలువారు, ఫిలిష్తీయవారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు.

22దావీదు తాను తెచ్చిన వస్తువులను సామానులు భద్రపరచే వాని దగ్గర ఉంచి, పరిగెత్తుకుంటూ సైన్యంలో చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలడిగాడు.23అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతు పట్టణపు ఫిలిష్తీయ బలశాలి, గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలోనుండి వచ్చి పైన పలికిన మాటల్నే చెప్పడం దావీదు విన్నాడు.24ఇశ్రాయేలీ సైనికులు అతణ్ణి చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.

25ఇశ్రాయేలీయులు <<ముందుకు వస్తున్న అతణ్ణి చూశారా, కచ్చితంగా ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా డబ్బులిచ్చి, కూతురినిచ్చి పెళ్లిచేసి, అతణ్ణి, అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి మినహాయిస్తాడు>> అని చెప్పాడు.

26అప్పుడు దావీదు <<సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం?>> వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడినవాళ్ళని అడిగితే,27వారు, వాణ్ణి చంపినవాడికి లభించే కానుకల గురించి చెప్పారు.

28దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు, అతని పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదు మీద కోపపడి <<నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీ గర్వం, నీలోని చెడుతనం నాకు తెలుసు. యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా?>> అన్నాడు.29దావీదు <<నేనేం చేశాను? ఊరికే అడుగుతున్నాను>> అని చెప్పి30అక్కడ నుండి మరో వ్యక్తిని ఆలానే అడిగాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది.

31దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదును పిలిపించాడు.32దావీదు సౌలుతో <<ఈ ఫిలిష్తీయుడి విషయంలో ఎవరూ ఆందోళన పడనక్కరలేదు. మీ సేవకుడనైన నేను వాడితో యుద్ధం చేస్తాను>> అన్నాడు.33సౌలు <<ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు. నువ్వు చిన్న పిల్లవాడివి. వాడు చిన్నప్పటినుండి యుద్దాలు చేస్తూ ఉన్నాడు>> అని దావీదుతో అన్నాడు.

34అందుకు దావీదు సౌలుతో <<నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే35నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.

36నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు.

37సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు>>అని చెప్పాడు. సౌలు <<యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు>> అని దావీదుతో అన్నాడు.

38అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించాడు. ఒక కంచు శిరస్త్రాణం అతనికి పెట్టి, యుద్ధ కవచం తొడిగించాడు.

39దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు. అయితే అవి అతనికి అలవాటు లేవు గనక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు <<ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్లలేను>> అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.40తన చేతికర్ర పట్టుకుని వాగులోనుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయునికి దగ్గరగా వెళ్ళాడు.

41బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి42చుట్టూ తేరి చూసి, ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు.43ఫిలిష్తీయుడు <<కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా?>> అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు.

44<<నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు, జంతువులకు వేస్తాను>> అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు,45దావీదు <<నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను.

46ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను.47అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు>> అని చెప్పాడు.

48ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి49తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు.

50ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు.51దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు.

52అప్పుడు ఇశ్రాయేలువారు, యూదావారు లేచి, హర్షధ్వానాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకూ, ఎక్రోను ద్వారాల వరకూ ఫిలిష్తీయులను తరిమారు. చచ్చిన ఫిలిష్తీయులు షరాయిం దారి పొడవునా గాతు1 , ఎక్రోను పట్టణాల వరకూ కూలిపోయారు.53తరువాత ఇశ్రాయేలువారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు.54అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని, అతని తలను తీసుకు యెరూషలేముకు వచ్చాడు.

55దావీదు ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి <<అబ్నేరూ, ఈ కుర్రవాడు ఎవరి కొడుకు?>> అని అడిగినప్పుడు, అబ్నేరు<<రాజా, నీమీద ఒట్టు. అతడెవరో నాకు తెలియదు>> అన్నాడు.56అప్పుడు రాజు <<ఈ కుర్రవాడు ఎవరి కొడుకో అడిగి తెలుసుకో>> అని ఆజ్ఞాపించాడు.

57ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిష్తీయుని తల, దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు.58సౌలు అతనితో <<అబ్బాయ్! మీ నాన్న ఎవరు?>> అని అడిగినప్పుడు దావీదు<<నేను నీ దాసుడు, బేత్లెహేము ఊరి వాడైన యెష్షయి కొడుకుని>> అని జవాబిచ్చాడు.


1 17:52 గాతు లోయలో

Chapter 18

దావీదు మీద సౌలు అసూయ, భయం

1దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.2ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.

3యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.4యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

5దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.

6వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.7ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ:
<<సౌలు వెయ్యిమందిని,
దావీదు పదివేలమందినీ చంపేశారు.>> అని పాడారు.

8ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. <<వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు>> అని మనసులో అనుకున్నాడు.9అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.

10తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.11ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.12యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.

13అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.14దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.

15దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.16దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు.

17సౌలు <<నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి>> అనుకుని దావీదుతో <<నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు>> అన్నాడు.18దావీదు <<రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?>> అని సౌలుతో అన్నాడు.

19అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.

20అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.21<<ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.>> అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో <<నువ్వు నా అల్లుడౌతున్నావు>> అని చెప్పాడు.

22సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు <<మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, <రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి> అని చెప్పండి.>>

23సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు <<నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?>> అని వారితో అన్నాడు.24సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.

25ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు <<రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి>> అన్నాడు.26సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
27గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.

28యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,29సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.

30ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.

Chapter 19

దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం

1మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు.2అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు <<నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో.3నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను>> అన్నాడు.

4యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి<<నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు.5అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?>> అని చెప్పినప్పుడు,
6సౌలు యోనాతాను చెప్పింది విని <<యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను>> అని ప్రమాణం చేశాడు.

7అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియచేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినపుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు.
8తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి, చాలామందిని చంపేశాడు.

9యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే,
10సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు.

11ఉదయాన్నే అతణ్ణి చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు <<ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు>> అని చెప్పి
12కిటికీగుండా దావీదును కిందికి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.

13తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది.
14సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు <<అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు>> అని చెప్పింది.

15దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి <<అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను>> అన్నాడు.

16ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది.17అప్పుడు సౌలు <<నా శత్రువు తప్పించుకుపోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు>> అని మీకాలును అడిగితే, మీకాలు <<నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావ్, <నన్ను వెళ్లనివ్వు> అని దావీదు తనతో చెప్పాడు>> అని సౌలుతో చెప్పింది.

18ఆ విధంగా దావీదు తప్పించుకు పారిపోయి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు తనపట్ల చేసినదంతా అతనికి తెలియజేశాడు. అతడూ సమూయేలూ బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.19దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు సమాచారం వచ్చినప్పుడు,20దావీదును పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదకి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం ప్రారంభించారు.

21ఈ విషయం సౌలుకు తెలిసి మరి కొందరు సైనికులును పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడవసారి సైనికులను పంపాడు గాని వారు కూడా అలాగే ప్రకటించడం మొదలుపెట్టారు.22చివరిసారిగా తానే రమాకు వెళ్ళి సెకు దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి <<సమూయేలూ దావీదూ ఎక్కడ ఉన్నారు?>> అని అడిగాడు. ఒక వ్యక్తి <<రమా దగ్గర నాయోతులో ఉన్నారు>> అని చెప్పాడు.

23అతడు రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినపుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగాడు. కాబట్టి అతడు ప్రయాణం చేస్తూ రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చేవరకూ పరవశుడై ప్రకటిస్తూ ఉన్నాడు.24ఇంకా అతడు తన దుస్తులు తీసివేసి ఆ రోజు రాత్రి, పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ, లోదుస్తులతోనే పడి ఉన్నాడు. అప్పటినుండి <<సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?>>అనే సామెత పుట్టింది.

Chapter 20

దావీదు, యోనాతాను

1తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి <<నేనేం చేశాను? నా తప్పు ఏంటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను?>> అని అడిగాడు,2యోనాతాను <<నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు, నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా, పెద్ద పనైనా చెయ్యడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు?>> అన్నాడు.

3దావీదు <<నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టంలేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకూ, మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది>> అని ప్రమాణపూర్తిగా చెప్పాడు.
4యోనాతాను <<నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తాను>> అన్నాడు.

5అప్పుడు దావీదు <<రేపు అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కలసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకూ పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.
6నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, <దావీదు ఇంటివారు ప్రతి ఏడూ బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బేత్లెహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు.>

7మీ తండ్రి అలాగేనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడనైన నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చేయాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకుని
8నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి>> అని యోనాతానును కోరాడు.

9యోనాతాను <<అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా>> అన్నాడు.

10దావీదు <<మీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియచేస్తారు?>> అని యోనాతానును అడిగాడు.11అప్పుడు యోనాతాను <<పొలంలోకి వెళ్దాం రా>> అంటే, ఇద్దరూ పొలంలోకి వెళ్లారు.

12అప్పుడు యోనాతాను <<ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకొన్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను.13అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగచేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకూ తోడుగా ఉంటాడు గాక.

14అయితే నేనింకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాస్యతను నువ్వు నా పట్ల చూపిస్తావు కదా?15నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక.>>16ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. <<ఈ విధంగా యెహోవా దావీదు శత్రువులు లెక్క అప్పగించేలా చేస్తాడు గాక>> అని అతడు అన్నాడు.

17యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.18యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు. <<రేపు అమావాస్య. నువ్వుండే స్థలం ఖాళీగా కనబడుతుంది గదా నీవు లేని విషయం తెలిసిపోతుంది.19నువ్వు మూడు రోజులు ఆగి, ఈ పని జరుగుతుండగా నువ్వు దాక్కొన్న స్థలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు.

20గురి చూసి వేసినట్టు నేను మూడు బాణాలు పక్కగా వేసి,21<నీవు వెళ్లి బాణాలు వెతుకు> అని ఒక పనివాడితో చెబుతాను, <బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా> అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుతుంది.

22అయితే, <బాణాలు నీకు అవతల వైపు ఉన్నాయి> అని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపొమ్మని యెహోవా సెలవిస్తున్నాడని గ్రహించి నువ్వు ప్రయాణమైపోవాలి.23అయితే మనమిద్దరం మాట్లాడుకొన్న విషయాలను జ్ఞాపకం ఉంచుకో. సదాకాలం యెహోవాయే మనకు సాక్షి.>>

24అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్యనాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు25ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న స్థలం లో తన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. యోనాతాను లేచినపుడు అబ్నేరు సౌలు దగ్గర కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే స్థలం ఖాళీగా ఉంది.

26<<ఏదో జరిగి అతడు మైలబడ్డాడు. అతడు తప్పక అపవిత్రుడై ఉంటాడు>> అని సౌలు అనుకున్నాడు. ఆ రోజు అతడు ఏమీ మాట్లాడలేదు.

27అయితే అమావాస్య తరువాతి రోజు, అంటే రెండవ రోజు దావీదు కూర్చునే స్థలం లో ఎవరూ లేకపోవడం చూసి సౌలు <<నిన్న, నేడు యెష్షయి కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏంటి?>> అని యోనాతానును అడిగితే,
28యోనాతాను <<దావీదు బేత్లెహేముకు వెళ్ళాలని ఆశించి,29దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు>> అని సౌలుతో చెప్పాడు.

30సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి <<వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా, నీకూ నీ తల్లికీ అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకొన్న సంగతి నాకు తెలియదా?31యెష్షయి కొడుకు భూమిమీద బతికి ఉన్నంత కాలం నువ్వైనా, నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసు గదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతణ్ణి నా దగ్గరికి రప్పించు. నిజంగా అతడు చనిపోవలసిందే>> అన్నాడు.

32అందుకు యోనాతాను <<అతడెందుకు మరణశిక్ష పొందాలి? అతడు ఏమి చేశాడు>>అని సౌలును అడగగా,33సౌలు యోనాతానును పొడవాలని ఈటె విసిరాడు. దీన్నిబట్టి తన తండ్రి దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని,34అమితమైన కోపం తెచ్చుకుని బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందు వల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు.

35ఉదయాన్నే యోనాతాను దావీదుతో ముందుగా అనుకొన్న సమయానికి ఒక పనివాణ్ణి పిలుచుకుని పొలంలోకి వెళ్ళాడు.

36<<నువ్వు పరుగెత్తుకొంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు>> అని ఆ పనివాడితో చెప్పినప్పుడు వాడు పరుగెత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతలి పక్కకు వేశాడు.37అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్నచోటుకు వస్తే యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి <<బాణం నీ అవతల ఉంది>> అని చెప్పి
38<<నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా>> అని కేక వేశాడు. యోనాతాను పనివాడు బాణాలు ఏరుకుని తన యజమాని దగ్గరికి వాటిని తీసుకువచ్చాడు గాని39సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలుసు.40యోనాతాను తన ఆయుధాలను పనివాడి చేతికి ఇచ్చి <<వీటిని పట్టణానికి తీసుకువెళ్ళు>> అని చెప్పి అతణ్ణి పంపివేసాడు.

41పనివాడు వెళ్లిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు.42అప్పుడు యోనాతాను <<యెహోవా నీకూ నాకూ, నీ సంతానానికీ నా సంతానానికీ మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడు గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాము కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు>> అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్లిపోగా, యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు.

Chapter 21

దావీదు నోబులో

1దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి <<నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?>> అని అడిగాడు,2దావీదు <<రాజు నాకు ఒక పని అప్పగించి, <నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు> అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను.

3తినడానికి నీ దగ్గర ఏం ఉన్నాయి? ఐదు రొట్టెలు గానీ ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు>> అని యాజకుడైన అహీమెలెకును అడిగాడు.4యాజకుడు <<మామూలు రొట్టెలు నా దగ్గర లేవు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్టైతే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు>> అని దావీదుతో అన్నాడు.

5అప్పుడు దావీదు <<మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది>> అని యాజకునితో అన్నాడు.6అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల, వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు.

7ఆ రోజున సౌలు సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు నాయకుడు.

8<<రాజు పని త్వరగా జరగాలన్న తొందరలో నా కత్తిని, ఆయుధాలను నేను తీసుకు రాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తి గానీ ఈటె గానీ ఉందా?>> అని దావీదు అహీమెలెకును అడిగితే,9యాజకుడు <<ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుడి కత్తి ఉంది. అదిగో బట్టతో చుట్టి ఏఫోదు వెనక ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తీ లేదు. దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైతే తీసికో>> అన్నాడు. దావీదు <<దానికి మించింది వేరొకటి లేదు. అది నాకివ్వు>> అన్నాడు.
దావీదు గాతులో

10దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు.11ఆకీషు సేవకులు <<ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా>> అని అతని గురించి రాజుతో చెబుతుంటే,
12దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.

13అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.

14అది చూసి ఆకీషు రాజు <<మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు?15పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?>> అని తన సేవకులతో అన్నాడు.

Chapter 22

అదుల్లాము, మిస్పాకు పారిపోవడం దావీదు

1దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు.2ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు.

3తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి <<దేవుడు నాకు ఏమి చేస్తాడో నేను తెలుసుకొనేంత వరకూ నా తలిదండ్రులను నీ దగ్గర ఉండనివ్వు>> అని మోయాబు రాజును అడిగి,4వారిని అతనికి అప్పగించాడు. దావీదు దాక్కుని ఉన్న రోజుల్లో వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు.5ఆ తరువాత గాదు ప్రవక్త వచ్చి <<కొండల్లో ఉండకుండాా యూదా దేశానికి పారిపో>> అని దావీదుతో చెప్పడంవల్ల దావీదు వెళ్ళి హారెతు అడవిలో దాక్కున్నాడు.
నోబులో యాజకులను సౌలు చంపడం

6దావీదు, అతని అనుచరులు ఫలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

7సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు <<బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా?8మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు నా సేవకుడు, దావీదును రెచ్చగొట్టినా, నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు>> అన్నాడు.

9అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి <<యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను.10అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు>> అని చెప్పాడు.
11రాజు, యాజకుడూ అహీటూబు కొడుకు అయిన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు,12సౌలు <<అహీటూబు కొడుకా, విను>> అన్నప్పుడు, అతడు <<నా యజమానీ, చెప్పండి>>అన్నాడు.

13సౌలు<<నువ్వు, యెష్షయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం, కత్తి ఇచ్చి అతనికి సహాయ పడమని దేవుని దగ్గర విన్నపం చేసావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నానుండి దాక్కుని, రేపు నాపై తిరగబడతాడు గదా?>> అన్నాడు.
14అహీమెలెకు <<రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నేరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు?15ఈ సంగతి గూర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీదా నా తండ్రి ఇంటి వారందరిమీదా ఈ నేరం మోపకూడదు>> అని రాజుకు జవాబిచ్చాడు.
16రాజు <<అహీమెలెకూ, నీకూ, నీ తండ్రి ఇంటివారికందరికీ చావు తప్పదు>> అన్నాడు.17<<వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్ప లేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి>> అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు.

18రాజు దోయేగును చూసి <<నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు>> అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, యాజకుల పై దాడిచేసి ఏఫోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు.19ఇంకా యాజకుల పట్టణమైన నోబులొ కాపురం ఉంటున్నవారిని కత్తితో చంపేశాడు. మగవాళ్ళను, ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను, అన్నిటినీ కత్తితో చంపేశాడు.

20అయితే అహీటూబు కొడుకైన అహీమెలెకు కొడుకుల్లో ఒకడైన అబ్యాతారు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి,21సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియచేసారు.

22దావీదు <<ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉండడంవల్ల వాడు సౌలుకు కచ్చితంగా ఈ సంగతి చెబుతాడని నేననుకొన్నాను. నీ తండ్రి యింటివారందరి మరణానికి నేనే కారకుడనయ్యాను.23నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్నూ నిన్నూ చంపాలని చూసేవాడు ఒక్కడే>> అని అబ్యాతారుతో చెప్పాడు.

Chapter 23

కెయీలా పట్టణాన్ని దావీదును మోసగించడం

1తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.2అప్పుడు దావీదు <<నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా>> అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా <<నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు>> అని దావీదుతో చెప్పాడు.

3దావీదుతో ఉన్నవారు <<మేము ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా>> అని దావీదుతో అన్నారు.4దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. <<నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను>> అని యెహోవా చెప్పాడు.

5దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు.

6దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు.

7దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని <<దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు>> అనుకున్నాడు.8అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరులనూ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు.9సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.

10అప్పుడు దావీదు <<ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది.11కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి>> అని ప్రార్థిస్తే <<అతడు వస్తాడు>> అని యెహోవా బదులిచ్చాడు.

12<<కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?>> అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా <<వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు>> అన్నాడు.

13దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.

14దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.
సౌలు దావీదును వెంటాడటం

15తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు.16అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి <<నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు.
17నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది>> అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు.18వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.

19జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి <<యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు.20రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని>> అని చెప్పారు.
21సౌలు వారితో ఇలా అన్నాడు. <<మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక.22మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి23మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను>> అని చెప్పాడు.

24వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు,25సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.

26కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.27ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి <<నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు>> అని చెబితే
28సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు1 అని పేరు పెట్టబడింది.

29తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.


1 23:28 ఎడబాటు బండ

Chapter 24

దావీదు సౌలును ప్రాణంతో విడిచిపెట్టడం

1సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది.2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.

3దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు.4దావీదు అనుచరులు <<నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది>> అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.

5సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని,6<<ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను>> అని తన వారితో చెప్పాడు.7ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.

8అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి <<నా యజమానీ, రాజా>> అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి9సౌలుతో ఇలా అన్నాడు <<దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?
10ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. <ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను> అని చెప్పాను.11నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
12నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.

13పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.
14ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా?15యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.>>

16దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు <<దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?>> అని బిగ్గరగా ఏడ్చి
17దావీదుతో ఇలా అన్నాడు. <<యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు18ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి.
19ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.

20కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు.
21కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.>> అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.

22తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.

Chapter 25

దావీదు, నాబాలు, అబీగయీలు

1సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా సమావేశమై అతని కోసం ఏడ్చారు. రమాలో ఉన్న అతని సొంత ఇంట్లో సమాధి చేశారు. తరువాత దావీదు లేచి పారాను అరణ్య ప్రాంతానికి వెళ్లిపోయాడు.

2మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు.3అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈమె జ్ఞానం గలదీ, అందగత్తే. అయితే అతడు మాత్రం మొరటు వాడు, తన వ్యవహారాలన్నిటిలో దుర్మార్గుడు. అతడు కాలేబు సంతతివాడు.

4నాబాలు గొర్రెలబొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు.5తన దగ్గరున్న వారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. <<మీరు కర్మెలుకు నాబాలు దగ్గరికి పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి6ఆ ధనికునితో ఇలా అనండి. మీరు వర్ధిల్లుతారు గాక. మీకూ మీ ఇంటికీ మీ ఆస్తిపాస్తులకూ క్షేమం ఉండాలి.

7మీతో గొర్రెబొచ్చు కత్తిరించే వారున్నారని నాకు తెలిసింది. మీ గొర్రెల కాపరులు మా దగ్గరున్నప్పుడు మేము వారికి ఏ కీడూ తలపెట్టలేదు. వారు కర్మెలు ప్రాంతంలో ఉన్నంతకాలం వారేదీ పోగొట్టుకోలేదు.8మీ పనివారిని అడగండి, వారే చెబుతారు. కాబట్టి నేను పంపిన కుర్రాళ్ళకు దయ చూపండి. మేము పండగ పూట వచ్చాం గదా. మీ మనసుకు తోచింది మీ దాసులకు, మీ కుమారుడు దావీదుకు ఇచ్చి పంపండి.>>

9దావీదు పంపిన యువకులు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చున్నారు.10దావీదు సేవకులతో నాబాలు <<దావీదు ఎవడు? యెష్షయి కొడుకెవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు.11నా అన్నపానాలను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారికోసం సిద్ధపరచిన నా మాంసాన్ని, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని వాడికి ఇవ్వాలా?>> అన్నాడు.

12దావీదు కుర్రాళ్ళు తిరుగు ముఖం పట్టి, వచ్చి ఈ మాటలన్నీ అతనికి చెప్పారు.13అప్పుడు దావీదు వారితో <<మీరంతా నడుముకు కత్తులు ధరించుకోండి>> అని చెప్పాడు. వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా ఒక కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు.

14పనివాడొకడు నాబాలు భార్య అబీగయీలుతో <<అమ్మా, మన అయ్యగారిని కుశల ప్రశ్నలు అడగడానికి దావీదు అరణ్యంలో నుండి మనుషులను పంపాడు. ఆయన వారితో కఠినంగా మాట్లాడాడు.15అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసిన వాళ్ళు. మేము గడ్డి మైదానాల్లో వారి మధ్య ఉన్నంత కాలమూ ప్రమాదం గానీ నష్టం గాని మాకు కలగలేదు.

16మేము గొర్రెలను కాచుకొంటూ ఉన్నంత కాలం వారు పగలూ రాత్రీ మా చుట్టూ ప్రాకారం లాగా ఉండేవారు.17అయితే ఇప్పుడు మా యజమానికీ అతని ఇంటివారందరికీ వాళ్ళు కీడు తలపెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు. మన అయ్యగారు పనికిమాలిన దుష్టుడు, ఎవరి మాటా వినడు.>>

18అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసం తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, ఐదు మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు గాడిదలకెక్కించి19తన పనివాళ్ళతో <<మీరు నాకంటే ముందుగా వెళ్ళండి., నేను మీ వెనుక వస్తాను>> అని చెప్పింది.

20ఆమె గాడిద ఎక్కి కొండ లోయలోబడి వస్తుంటే దావీదు, అతని మనుషులు ఆమెకు ఎదురుపడ్డారు. ఆమె వారిని కలుసుకుంది.

21అంతకుముందు దావీదు <<నాబాలు ఆస్తిపాస్తులన్నింటిలో ఏదీ పోకుండా ఈ అడివి ప్రాంతంలో అతని ఆస్తి అంతటికీ నేను అనవసరంగా కాపలా కాశాను. అతడు మాత్రం ఉపకారానికి ప్రతిగా నాకు అపకారం చేశాడు గదా>>22అనుకుని <<అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడి నైనా తెల్లవారే సరికి ఉండయ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయుగాక>> అని శపథం చేశాడు.

23అబీగయీలు దావీదును చూసి, గాడిద మీదనుంచి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలపై బడి ఇలా అంది.24<<ప్రభూ, ఈ అపరాధం నాదిగా ఎంచు. నీ దాసినైన నన్ను మాటలాడనియ్యి, నీ దాసినైన నేను చెప్పేమాటలు ఆలకించు.

25అయ్యా, దుష్టుడైన ఈ నాబాలును పట్టించుకోవద్దు. అతడు అతని పేరుకు తగిన వాడే. అతనిపేరు నాబాలు కదా, మోటుతనం అతని లక్షణం. నా ప్రభువైన మీరు పంపించిన కుర్రాళ్ళు నీ దాసినైన నాకు కనబడలేదు.26నా ప్రభూ, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, రక్తపాతం జరిగించకుండా, నీవే స్వయంగా పగ తీర్చుకోకుండా యెహోవా నిన్ను ఆపాడు. నీ శత్రువులు, నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించే వారందరికీ నాబాలుకు పట్టే గతే పట్టాలి అని యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని ప్రమాణం చేస్తున్నాను.>>

27<<ఇప్పుడు నేను నా యేలినవాడవైన నీకోసం నీ దాసి తెచ్చిన ఈ కానుకను నా యేలినవాడవైన నిన్ను ఆశ్రయించి ఉన్న పనివారికి ఇప్పించు.28నీ దాసినైన నా తప్పు క్షమించు. నా యేలినవాడవైన నీవు, యెహోవా యుద్ధాలు చేస్తున్నావు గనక నా యేలినవాడవైన నీకు ఆయన శాశ్వతమైన రాజ వంశాన్ని ఇస్తాడు. నీ జీవిత కాలమంతటా నీకు అపాయం కలుగదు.

29నిన్ను హింసించడానికైనా, నీ ప్రాణం తీయడానికైనా ఎవడైనా పూనుకుంటే, నా యేలినవాడవైన నీ ప్రాణాన్ని నీ దేవుడైన యెహోవా తన దగ్గరున్న జీవపుమూటలో భద్రపరుస్తాడు. ఒకడు వడిసెలతో రాయి విసరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణాలు విసిరేస్తాడు.
30యెహోవా నా యేలినవాడవైన నిన్ను గురించిసెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమిస్తాడు. ఆ తరువాత31నీవు అకారణంగా రక్తం చిందించినందుకూ పగ తీర్చుకొన్నందుకూ మనోవేదన, పరితాపం నా యేలినవాడవైన నీకు ఎంతమాత్రం కలగకూడదు. యెహోవా నా యేలినవాడవైన నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసినైన నన్ను జ్ఞాపకం చేసుకో>> అంది.

32అందుకు దావీదు అబీగయీలుతో <<నాకు ఎదురు రావడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి.33నేను పగ తీర్చుకోకుండా ఈ రోజున రక్తపాతం చేయకుండా నన్ను వివేకంతో ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగు గాక.
34ఒకవేళ ఈ రోజు నీవు త్వరగా నన్ను ఎదుర్కొనక పోయినట్టయితే, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం పైన ఆన బెట్టి చెబుతున్నాను, తెల్లవారేలోగా నాబాలుకు మగవాడొకడు కూడా మిగిలేవాడు కాదు>> అని చెప్పాడు.35ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకు <<నీ మాటలు నేను విన్నాను, నీ విన్నపం అంగీకరించాను. నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు>> అని ఆమెతో చెప్పాడు.

36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.
37ఉదయాన నాబాలు మత్తు దిగిన తరువాత అతని భార్య అతనితో ఆ విషయం చెప్పగానే భయంతో అతని గుండె పగిలింది. అతడు రాయి లాగా బిగుసుకు పోయాడు.38పది రోజుల తరువాత యెహోవా నాబాలును దెబ్బ తీయగా అతడు చనిపోయాడు.

39నాబాలు చనిపోయాడని దావీదు విని <<నాబాలు చేసిన కీడును యెహోవా అతని తలమీదికే రప్పించాడు. ఆయన సేవకుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి, నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తుతి కలుగు గాక>> అన్నాడు. తరవాత దావీదు అబీగయీలును తాను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడడానికి తన వారిని పంపాడు.40దావీదు సేవకులు కర్మెలులో అబీగయీలు దగ్గరికి వచ్చి <<దావీదు నిన్ను పెళ్లి చేసుకోడానికి తీసుకు రమ్మని మమ్మల్ని పంపించాడు>> అని చెప్పారు.

41ఆమె లేచి సాగిలపడి <<నా స్వామి ఇష్టం. నా యేలినవాని సేవకుల కాళ్లు కడగడానికైనా నా యేలినవాని దాసీనైన నేను సిద్దం>> అని చెప్పింది.42ఆమె త్వరగా లేచి గాడిదనెక్కి ఐదుగురు పనికత్తెలు వెంట రాగా దావీదు పంపిన దూతలవెంట వెళ్ళింది. దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

43దావీదు యెజ్రెయేలు వాసి అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అతనికి భార్యలయ్యారు.44సౌలు కూతురు మీకాలు దావీదు భార్య. సౌలు ఆమెను గల్లీము ఊరివాడైన లాయీషు కొడుకు పల్తీయేలుకు ఇచ్చాడు.

Chapter 26

దావీదు సౌలును రెండో సారి ప్రాణంతో విడిచిపెట్టడం

1గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి జీఫు నివాసులు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా కొండలో దాక్కున్నాడని తెలియజేశారు.2సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకు దావీదును వెదకడానికి జీఫుకు బయలుదేరాడు.

3సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా కొండలో దారి పక్కన దిగినప్పుడు, ఎడారిలో ఉంటున్న దావీదు తనను పట్టుకోవాలని సౌలు వచ్చాడని విని,4గూఢచారులను పంపి <<సౌలు కచ్చితంగా వచ్చాడు>> అని తెలుసుకున్నాడు.

5తరువాత దావీదు లేచి సౌలు సైన్యం మకాం వేసిన స్థలానికి వచ్చి, సౌలు, సౌలు సైన్యాధిపతి, నేరు కొడుకు అబ్నేరు నిద్రపోతున్న స్థలం చూశాడు. సౌలు శిబిరం మధ్యలో నిద్ర పోతున్నప్పుడు సైనికులు అతని చుట్టూ పడుకున్నారు.

6అప్పుడు దావీదు <<శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలసి ఎవరు వస్తారు>> అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కొడుకు, యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. <<నీతో నేను వస్తాను>> అని అబీషై అన్నాడు.7దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.8అప్పుడు అబీషై దావీదును చూసి <<దేవుడు ఈ రోజున నీ శత్రువుని నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఆ ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను. ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను>> అన్నాడు.

9అప్పుడు దావీదు <<నువ్వు అతణ్ణి చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందినవాణ్ణి చంపి దోషి కాకుండా ఉండడం ఎవరివల్లా కాదు.10యెహోవా మీద ఒట్టు, యెహోవాయే అతణ్ణి శిక్షిస్తాడు, అతడు ప్రమాదం వల్ల చస్తాడు, లేకపోతే యుద్ధంలో నశిస్తాడు.
11యెహోవా వలన అభిషేకం పొందినవాణ్ణి నేను చంపను. అలా చేయకుండా యెహోవా నన్ను ఆపుతాడు గాక. అయితే అతని దిండు దగ్గర ఉన్న ఈటె, నీళ్లబుడ్డి తీసుకు మనం వెళ్ళిపోదాం పద>> అని అబీషైతో చెప్పాడు.

12సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.

13తరువాత దావీదు దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న కొండపై నిలబడ్డాడు. వీరిద్దరి మధ్యా చాలా ఎడం ఉంది.14అప్పుడు ప్రజలు, నేరు కొడుకు అబ్నేరు వినేలా <<అబ్నేరూ, నువ్వు మాట్లాడతావా?>> అని గట్టిగా కేకవేస్తే, అబ్నేరు కేకలు వేస్తూ <<రాజుకు నిద్రాభంగం చేస్తున్న నువ్వు ఎవరివి?>> అని అడిగాడు.

15అప్పుడు దావీదు <<నీకు ధైర్యం లేదా? ఇశ్రాయేలీయుల్లో నీలాంటి వాడు ఎవరు? నీకు యజమాని అయిన రాజుకు నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు? నీకు యజమాని అయిన రాజును చంపడానికి ఒకడు దగ్గరగా వచ్చాడే.16నువ్వు చేసిన పని సరి కాదు, నువ్వు శిక్షకు పాత్రుడివే. యెహోవా వలన అభిషేకం పొందిన నీ యజమానికి నువ్వు రక్షణగా ఉండలేదు. యెహోవా మీద ఒట్టు, నువ్వు మరణశిక్ష పొందాల్సిందే. రాజు ఈటె ఎక్కడ ఉందో చూడు, అతని దిండు దగ్గర ఉన్న నీళ్లబుడ్డి ఎక్కడ ఉందో చూడు>> అన్నాడు.

17సౌలు దావీదు గొంతు గుర్తుపట్టి <<దావీదూ, నాయనా, ఇది నీ గొంతే కదా>> అని పిలిచాడు. అందుకు దావీదు <<నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే.18నా యజమాని దాసుడనైన నన్ను ఈ విధంగా అతడు ఎందుకు తరుముతున్నాడు? నేనేం చేశాను? నా నుండి నీకు ఏ కీడు సంభవిస్తుంది?

19రాజా, నా యజమానీ, దాసుడనైన నా మాటలు విను. నా మీద పగ సాధించాలని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయన అర్పణ స్వీకరించి ఆయన్ను శాంతిపరచవచ్చు. మనుషులెవరైనా నిన్ను ప్రేరేపించినట్టైతే వారు తప్పక యెహోవా దృష్టిలో శాపానికి గురి అవుతారు. ఎందుకంటే వారు, <నువ్వు దేశం విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించు> అని నాకు చెప్పి, యెహోవా సన్నిధానం నుండి నన్ను దూరం చేస్తున్నారు.20నా దేశానికి, యెహోవా సన్నిధానానికి దూరంగా నా రక్తం ఒలక నియ్యవద్దు. ఒకడు బయలుదేరి కొండలపై కౌజుపిట్టను వేటాడినట్టుగా ఇశ్రాయేలు రాజవైన నువ్వు పురుగులాంటి నన్ను వెదకడానికి బయలుదేరి వచ్చావు.>>

21అప్పుడు సౌలు <<నేను పాపం చేశాను, ఈ రోజు నా ప్రాణం నీ దృష్టిలో విలువైనదిగా ఉన్నదాన్నిబట్టి నేను నీకు ఇక ఎన్నడూ హాని తలపెట్టను. దావీదూ, నా కొడుకా, నా దగ్గరికి తిరిగి వచ్చేయి. పిచ్చి వాడిలాగా ప్రవర్తించి నేను ఎన్నో తప్పులు చేశాను>> అని పలికాడు.
22దావీదు <<రాజా, ఇదిగో నీ ఈటె నా దగ్గర ఉంది. పనివాళ్ళలో ఒకడు వచ్చి దీన్ని తీసుకోవచ్చు>> అన్నాడు.

23<<యెహోవా ఈ రోజున నిన్ను నాకు అప్పగించినప్పటికీ, నేను యెహోవా వలన అభిషేకించబడిన వాణ్ణి చంపకుండా వదిలినందువల్ల ఆయన నా నీతి, విశ్వాస్యతను బట్టి నాకు తగిన బహుమానం ఇస్తాడు.
24విను, ఈ రోజు నీ ప్రాణం నా దృష్టిలో విలువైనది అయినట్టే, యెహోవా నా ప్రాణాన్ని తన దృష్టికి మిన్నగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షిస్తాడు గాక>> అని చెప్పాడు.

25అప్పుడు సౌలు <<దావీదూ, బిడ్డా, నీకు ఆశీర్వాదం కలుగు గాక. నీవు గొప్ప పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తావు గాక>> అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు తన దారిన వెళ్లిపోయాడు. సౌలు కూడా తన స్థలానికి తిరిగి వచ్చాడు.

Chapter 27

ఫిలిష్తీయుల మధ్య దావీదు నివాసం

1తరువాత దావీదు <<నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు>> అని మనసులో అనుకుని

2లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.

3దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.

4దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు.
5దావీదు <<రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు>> అని ఆకీషును అడిగితే,6ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.

7దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.
8తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.9దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.

10అప్పుడు ఆకీషు <<ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?>> అని దావీదును అడిగితే, దావీదు <<యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము>> అన్నాడు.

11ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు.12ఆకీషు దావీదును నమ్మాడు. <<దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు>> అనుకున్నాడు.

Chapter 28

1ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి <<నువ్వు, నీ మనుషులు నాతో కలసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో>> అన్నాడు.2దావీదు <<నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు>> అన్నాడు. ఆకీషు <<ఆలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడుగా నియమించుకుంటాను>> అన్నాడు.

ఏన్దోరులోని స్త్రీ దగ్గర సౌలు

3సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు.4ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు, సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవ లోయలో మకాం వేసారు.

5సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని6యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.7అప్పుడు సౌలు <<నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను>> అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు <<అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది>> అని అతనితో చెప్పారు.

8సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో <<మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు>> అని కోరాడు.9ఆ స్త్రీ, అలాగే <<సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు>> అని అతనితో అంది.

10అప్పుడు సౌలు <<దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు>> అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే,
11ఆ స్త్రీ <<నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి>> అని అడిగింది. అతడు <<సమూయేలును రప్పించాలి>> అని కోరాడు.12ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి <<నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు>> అని సౌలును అడిగితే,
13రాజు <<నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు>> అని ఆమెను అడిగితే <<దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను>> అని చెప్పింది.

14రాజు <<అతడు ఏ రూపంలో ఉన్నాడు>> అని అడిగాడు. ఆమె <<దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు>> అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు.
15<<నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు>> అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు <<నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను>> అన్నాడు.

16అప్పుడు సమూయేలు <<యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి?17యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు.

18యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈ రోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు.19యెహోవా నిన్నూ, ఇశ్రాయేలీయులనూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు, నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు>> అని సౌలుతో చెప్పాడు.
20సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు.

21అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు ఎంతో కలవరపడడం చూసి <<నా యజమానీ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను>> అని చెప్పింది.
22ఇప్పుడు <<నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు>> అని అతనితో అంది.

23అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు.
24ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి25తీసుకువచ్చి సౌలుకు, అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనం చేసి అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్లిపోయారు.

Chapter 29

ఫిలిష్తీయువారు దావీదుని సిక్లగుకు తిరిగి పంపడం

1అప్పుడు ఫిలిష్తీయుల సైన్యం గుంపుగా వెళ్ళి ఆఫెకులో మకాం చేశారు. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట పక్కన బస చేశారు.2ఫిలిష్తీయ పెద్దలు తమ సైన్యాన్ని వందమందిగా, వెయ్యిమందిగా సమకూర్చి పథకం ప్రకారం వస్తుంటే, దావీదు, అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యం వెనుక వైపున వస్తున్నారు.

3ఫిలిష్తీయ సేనానులు <<ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?>> అని ఆకీషును అడిగారు. అతడు <<ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళగా నా దగ్గర ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదు ఇతడే కదా. ఇతడు నా దగ్గర చేరినప్పటి నుండి ఈనాటి వరకూ ఇతనిలో ఏ తప్పూ నాకు కనిపించలేదు>> అని ఫిలిష్తీయుల సేనానులతో అన్నాడు.

4అందుకు వారు అతని మీద కోపగించి <<ఇతణ్ణి నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు, యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారతాడేమో. ఏం చేసి అతడు తన యజమానితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మనవాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా.

5సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందిని హతం చేసారని ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ, పాటలు పాడిన దావీదు ఇతడే కదా>> అని అతనితో అన్నారు.

6ఆకీషు దావీదును పిలిచి <<యెహోవా మీద ఒట్టు, నువ్వు నిజంగా నీతిమంతుడివిగా ఉన్నావు. సైన్యంలో నువ్వు నాతో కలసి తిరగడం నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నీలో ఎలాంటి తప్పూ నాకు కనబడలేదు. అయితే పెద్దలు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నారు.

7ఫిలిష్తీయ పెద్దల విషయంలో నువ్వు వ్యతిరేకమైనది చేయకుండా ఉండేలా నువ్వు తిరిగి నీ ఇంటికి తిరిగి సుఖంగా వెళ్ళు>> అని చెప్పాడు.
8దావీదు <<నేనేం చేశాను? నా అధికారివైన రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను రాకుండా ఉండేంత తప్పు నీ దగ్గరికి వచ్చినప్పటినుండి ఈ రోజు వరకూ నాలో నీకు ఏమి కనబడింది?>> అని ఆకీషును అడిగాడు.

9అప్పుడు ఆకీషు <<నువ్వు నా కళ్ళకు దేవదూతలాగా కనబడుతున్నావని నాకు తెలుసు. అయితే ఫిలిష్తీయ సేనానులు, ఇతడు మనతో కలసి యుద్ధం చేయడానికి రాకూడదని చెబుతున్నారు.

10కాబట్టి పొద్దున్నే నువ్వూ, నీతో ఉన్న నీ సైనికులు త్వరగా లేచి తెల్లవారగానే బయలుదేరి వెళ్ళిపోవాలి>> అని దావీదుకు ఆజ్ఞ ఇచ్చాడు.11కాబట్టి దావీదు, అతని ప్రజలు పొద్దున్నే తొందరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలుకు వెళ్లారు.

Chapter 30

అమాలేకీయులపై దావీదు దాడి

1దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి,2పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు.

3దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి4ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు.

5యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి6దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

7అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు.8<<నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?>> అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా <<తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు>> అని చెప్పాడు.

9కాబట్టి దావీదు, అతనితో ఉన్న 600 మంది బయలుదేరి, బెసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు.10దావీదు, ఇంకా 400 మంది తరుముతూ పోయారు గానీ ఆ 200 మంది అలిసి పోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే
11ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.

12వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది.
13అప్పుడు దావీదు <<నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?>> అని అడిగాడు. అందుకు వాడు <<నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.

14మేము దండెత్తి కెరేతీ జాతి వారుండే దక్షిణ దేశానికి, యూదా దేశానికి, కాలేబు దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాం>> అని చెప్పాడు.
15<<ఆ దోపిడీ గుంపును కలుసుకొనేందుకు నీవు నాకు దారి చూపుతావా>> అని దావీదు అడిగితే అతడు <<నేను నిన్ను చంపననీ నీ యజమాని వశం చేయననీ దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను>> అన్నాడు.

16తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు.17దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.

18ఇలా దావీదు అమాలేకీయులు దోచుకు పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు.19కొడుకులూ కూతుర్లూ దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు.20దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.

21అలిసి పోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన ఆ 200 మంది దగ్గరకి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరకి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు.

22దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది <<వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు>> అన్నారు.1

23అందుకు దావీదు వారితో <<నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మన వశం చేసి, మనకు దయచేసిన కొల్ల సొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు.24మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా>>25ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకూ దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరచి నియమించాడు.

26దావీదు సిక్లగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువులనుండి నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు.27బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో,28అరోయేరులో, షిప్మోతులో, ఎష్టేమోలో,
29రాకాలులో, యెరహ్మెయేలీయుల గ్రామాల్లో, కేనీయుల గ్రామాల్లో,30హోర్మాలో బోరాషానులో, అతాకులో31హెబ్రోనులో దావీదూ అతని మనుషులూ తిరుగాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు.


1 30:22 1: 16 చూడండి

Chapter 31

సౌలు మరణం
31:1-13; 2 సమూ 1:4-12; 1 దిన 10:1-12

1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ,2సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.

3యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి,
4<<సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు>> అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు.5సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.

6ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.

7లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు.

8తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,
9అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.

10వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు.

11ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని12బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు.13ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.

2 సమూయేలు

Chapter 1

సౌలు మరణ వార్త దావీదు వినడం
1:4-12; 1 సమూ 31:1-13; 1 దిన 10:1-12

1దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు.2మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు.

3అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు <<నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?>> అని అడిగాడు. అందుకు వాడు <<ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను>> అన్నాడు.4<<జరిగిన సంగతులు నాతో చెప్పు>> అని దావీదు అడిగాడు. అందుకు అతడు <<సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు>> అన్నాడు.

5<<సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు>> అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు,
6<<నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు.7రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, <చిత్తం నా రాజా> అన్నాను.
8అతడు <నువ్వు ఎవరివి?> అని నన్ను అడిగాడు. <నేను అమాలేకీయుణ్ణి> అని చెప్పాను.9అతడు <నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి> అని ఆజ్ఞాపించాడు.

10అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను>> అన్నాడు.
11దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి,12సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.

13తరువాత దావీదు <<నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?>> అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు <<నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును>> అన్నాడు.
14అందుకు దావీదు <<భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?>> అని15తన మనిషి ఒకణ్ణి పిలిచి <<వెళ్లి వాణ్ణి చంపు>> అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు.16<<యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి>> అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు.
సౌలు, యోనాతానుల మరణ వార్త గురించి దావీదు విలాపం

17దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.18యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది.
19ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా
నీ పర్వతాలపై మృతి చెందింది.
బలవంతులు ఎలా పడిపోయారో గదా!
20ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు.
సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు.
అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి.
అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.

21గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక.
అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక.
పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది.
సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.
22హతుల రక్తం ఒలికించకుండా,
బలిష్టుల దేహాలనుండి
యోనాతాను విల్లు మడమ తిప్పలేదు.
ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు.
23సౌలూ యోనాతానూ తమ బతుకులో
ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు.
తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు.
వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు.
సింహాలకంటే బలమైన వారు.
24ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి.
అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు.
మీకు బంగారు నగలు ఇచ్చాడు.
25యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు.
నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు.
26నా సోదరుడా, యోనాతానూ,
నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి.
నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను.
నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది.
స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.
27అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు.
యుద్ధ శూరులు నశించిపోయారు.

Chapter 2

దావీదు యూదా రాజుగా అభిషేకం

1కొంతకాలం తరువాత దావీదు <<నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?>> అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. <<వెళ్ళు>> అని యెహోవా అతనితో చెప్పాడు. <<ఏ పట్టణానికి వెళ్ళమంటావు?>> అని దావీదు అడిగాడు. <<హెబ్రోనుకు వెళ్ళు>> అని ఆయన చెప్పాడు.2అప్పుడు దావీదు యెజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలీయుడు నాబాలుకు భార్యగా ఉండి విధవరాలైన అబీగయీలు, అనే తన ఇద్దరు భార్యలను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళాడు.3దావీదు తన దగ్గర ఉన్న వారినందరినీ, వారి వారి కుటుంబాలనూ వెంట బెట్టుకుని వెళ్ళాడు. వీరు హెబ్రోను నగరాల్లో కాపురం పెట్టారు.

4అప్పుడు యూదా జాతి ప్రజలు అక్కడికి వచ్చి దావీదును తమ రాజుగా పట్టాభిషేకం చేశారు.

5సౌలును యాబేష్గిలాదు ప్రజలు పాతిపెట్టారని దావీదు తెలుసుకుని వారి దగ్గరికి తన మనుషులను పంపించాడు. <<మీరు మీ రాజు సౌలును పాతిపెట్టి అతని పట్ల నమ్మకత్వం కనపరిచారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
6యెహోవా మీకు తన కృపను, విశ్వాస్యతను చూపుతాడు గాక. మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీకు మేలు చేస్తాను.7మీ రాజు సౌలు చనిపోయినప్పుడు యూదా జాతి వారు నాకు రాజుగా పట్టాభిషేకం చేశారు. మీరు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండండి>> అని కబురు పంపాడు.
ఇశ్రాయేలుకు, యూదాకు మధ్య యుధం
3:2-5; 1 దిన 3:1-4

8సౌలు సైన్యాధిపతి, నేరు కుమారుడు అయిన అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు1 ను మహనయీముకు తీసుకు వెళ్ళి,9అతణ్ణి గిలాదు వారిపై, ఆషేరీయుల పై, యెజ్రెయేలు పై, ఎఫ్రాయిమీయులపై, బెన్యామీనీయులపై, ఇశ్రాయేలు వారి పై రాజుగా నియమించి అతనికి పట్టాభిషేకం చేశాడు.
10నలభై ఏళ్ల వయసు గల ఇష్బోషెతు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా జాతివారు దావీదు పక్షాన నిలబడ్డారు.11దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు హెబ్రోనులో ఉండి యూదా వారిని పరిపాలించాడు.

12అంతలో నేరు కుమారుడు అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులు మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చారు.13అప్పుడు సెరూయా కుమారుడు యోవాబు, దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియోను లోయకు వచ్చి లోయకు వీరు ఈ వైపున, వారు ఆ వైపున దిగి ఉన్నారు.

14అబ్నేరు <<మన యువకులను ముందు ఒకరితో ఒకరు పోరాటం చేయిద్దామా?>> అని యోవాబుతో అన్నాడు. యోవాబు <<అలాగే చేద్దాం>> అన్నాడు.15సౌలు కుమారుడు ఇష్బోషెతుకు చెందిన బెన్యామీనీయులు పన్నెండుమంది, దావీదు సేవకుల్లో నుండి పన్నెండుమంది లేచి ఎదురెదురుగా నిలబడ్డారు.
16ఒక్కొక్కడు తన ఎదురుగా ఉన్నవాడి తల పట్టుకుని వాడి డొక్కలో కత్తితో పొడిచారు. అందరూ ఒకేసారి నేలపై పడిపోయారు. అందువల్ల ఆ స్థలానికి హెల్కతు హస్సూరీము2 అని పేరు వచ్చింది. అది గిబియోనుకు దగ్గరలో ఉంది.

17ఆ తరువాతి రోజు ఘోరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలవ లేక పారిపోయారు.
18సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.

19అతడు కుడి వైపుకైనా, ఎడమ వైపుకైనా చూడకుండా అబ్నేరును తరుముతున్నప్పుడు,
20అబ్నేరు వెనక్కి తిరిగి <<నువ్వు అశాహేలువా?>> అని అతణ్ణి అడిగాడు. అతడు <<అవును, నేను అశాహేలునే>> అన్నాడు.21<<నువ్వు కుడి వైపుకైనా, ఎడమ వైపుకైనా పరుగెత్తి ఆ యువకుల్లో ఒకడి మీదకు వెళ్లి వాడి ఆయుధాలు స్వాధీనం చేసుకో>> అని అబ్నేరు అతనితో చెప్పినప్పటికీ అశాహేలు ఈ వైపుకు గానీ ఆ వైపుకు గానీ చూడకుండా అతణ్ణి తరుముతూనే ఉన్నాడు.

22అబ్నేరు <<నన్ను తరమడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళు. నేను నిన్ను నేలకు కొట్టి చంపితే, ఆ తరువాత నీ అన్న యోవాబుకు నా ముఖమెలా చూపించగలను?>> అన్నాడు.23అందుకు అశాహేలు <<నేను వెనక్కి వెళ్ళను>>అన్నాడు. అప్పుడు అబ్నేరు ఈటె అంచుతో అతని కడుపులో పొడవడం వల్ల ఈటె అతనిలోకి దిగి వీపు నుండి వెనక్కి వచ్చింది. అతడు అక్కడే పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడిన ఉన్న స్థలానికి వచ్చిన వారంతా నిలబడి పోయారు.

24యోవాబు, అబీషైలు అబ్నేరును తరుముతూ గిబియోను అడవి దారిలోని గుహ ఎదురుగా ఉన్న అమ్మా అనే కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు సూర్యుడు అస్తమించాడు.25అబ్నేరు మీదికి ఎవరూ దాడి చేయకుండా బెన్యామీనీయులు గుంపుగా చేరి ఆ కొండ మీద నిలబడ్డారు.
26అబ్నేరు కేక వేసి <<కత్తి ఎప్పుడూ చంపుతూనే ఉండాలా? అది చివరకూ కీడుకే కారణం అవుతుందని నీకు తెలుసు గదా. మీ సోదరులను తరమడం ఆపమని నీ మనుషులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?>> అని యోవాబుతో అన్నాడు.

27అందుకు యోవాబు <<దేవుని మీద ఒట్టు. నువ్వు ఈ మాట చెప్పకుండా ఉన్నట్లయితే మా మనుషులు తమ సోదరులను రేపు ఉదయం వరకూ తరముతూనే ఉండే వారు>>అన్నాడు.
28అతడు బాకా ఊదగా ప్రజలంతా ఆగిపోయి ఇశ్రాయేలు వారిని తరమడం, యుద్ధం చేయడం మానివేశారు.29అబ్నేరు, అతని మనుషులు ఆ రాత్రి అంతా ఎడారి గుండా ప్రయాణం చేసి యొర్దాను నది దాటి బిత్రోను3 దారిలో మహనయీము చేరుకున్నారు.

30యోవాబు అబ్నేరును తరమడం మాని తిరిగి వచ్చి మనుషులను పోగు చేసి లెక్క చూడగా దావీదు సేవకుల్లో అశాహేలు గాక పందొమ్మిదిమంది తక్కువయ్యారు.31అయితే దావీదు సేవకులు బెన్యామీనీయుల్లో, అబ్నేరు మనుషుల్లో మూడు వందల అరవై మందిని చంపారు.32వారు అశాహేలును తీసుకువెళ్ళి బేత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తరువాత యోవాబు, అతని మనుషులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.


1 2:8 ఇష్బోషెతు ఇష్బలే
2 2:16 హెల్కతు హస్సూరీము కత్తులతో నిండిన భూమి
3 2:29 బిత్రోను పగలు అంతా

Chapter 3

1సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.

2హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.

3రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు.

మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు.

4నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు.

అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు.

5ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.

6సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.7రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు <<నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు>> అని అబ్నేరును ప్రశ్నించాడు.

8ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు <<నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా?
9యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే10దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను>> అన్నాడు.11అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.

12అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి <<ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను>> అని కబురు పంపాడు. అప్పుడు దావీదు <<మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను.13అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు>> అని జవాబిచ్చాడు.

14దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి <<ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి>> అని చెప్పమన్నాడు.15మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు.16ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు <<నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో>> అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు.
అబ్నేరు దావీదును సందర్శించటం

17అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి <<దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా?18<నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను> అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి>> అని వారితో చెప్పాడు.

19అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు.20అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు.

21అప్పుడు అబ్నేరు <<నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను>> అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.

22దావీదు సేవకులు, యోవాబు యుద్ధంలో పెద్ద మొత్తంలో దోచుకున్న దోపుడు సొమ్ము తీసుకు వచ్చే సమయానికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఆప్పటికే దావీదు దగ్గర అనుమతి తీసుకుని అతడు శాంతికరంగా వెళ్ళిపోయాడు.23అయితే యోవాబు, తన సైన్యంతో తిరిగి వచ్చినప్పుడు నేరు కొడుకు అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడనీ, రాజు అతనికి ఆతిథ్యమిచ్చి పంపాడనీ, అతడు శాంతియుతంగా తిరిగి వెళ్ళాడనీ తెలిసికున్నాడు.

24అతడు రాజు దగ్గరికి వచ్చి <<రాజా విను, నువ్వు చేసిన పనేంటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతణ్ణి ఎందుకు తిరిగి వెళ్లనిచ్చావు?25నేరు కొడుకు అబ్నేరు గురించి నీకు తెలీదా? నిన్ను మోసం చేసి నీ ప్రణాళికలూ, నువ్వు చేసే పనులూ తెలుసుకొనేందుకు అతడు వచ్చాడు>> అని అన్నాడు.26అతడు దావీదు దగ్గర నుండి బయలుదేరి అబ్నేరును వెనక్కి పిలిపించడానికి మనుషులను పంపాడు. వారు వెళ్లి సిరా అనే బావి దగ్గర నుండి అతణ్ణి వెనక్కి తీసుకు వచ్చారు. అతడు తిరిగి వచ్చిన సంగతి దావీదుకు తెలీదు.
యోవాబు అబ్నేరు చంపడం

27అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు <<విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి>> అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.

28ఆ తరువాత ఈ సంగతి దావీదుకు తెలిసి అతడు ఈ విధంగా అనుకున్నాడు<<నేనూ, నా రాజ్యమూ నేరు కొడుకు అబ్నేరు ప్రాణం తీసిన విషయంలో యెహోవా దృష్టికి ఎప్పటికీ నిరపరాధులమే.29ఈ దోషం యోవాబు మీదా, అతని తండ్రి సంతానమంతటి మీదా నిలుస్తుంది గాక. యోవాబు సంతానంలో గాయాలు ఉన్నవారు, కుష్టురోగులు, ముసలివారు, కత్తి చేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారు గాక>>అన్నాడు.30ఆ విధంగా యోవాబు, అతని సోదరుడు అబీషై, గిబియోను యుద్ధంలో అబ్నేరు తమ సోదరుడు అశాహేలును చంపిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు.

31దావీదు <<మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి>> అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు.32రాజు కూడా స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు.

33రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు,
34<<అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే.
నీ చేతులకు గాయాలు లేకుండా,
నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా,
అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు
నువ్వు పడిపోయావు గదా.>>
రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.

35ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు <<సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక>> అని ఒట్టు పెట్టుకున్నాడు.36ప్రజలంతా ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. ఇప్పటి వరకూ రాజు చేసినదంతా ప్రజల దృష్టికి అంగీకారమైనట్టు ఇది కూడా వారి దృష్టికి అంగీకారమయ్యింది.

37నేరు కొడుకు అబ్నేరు హత్య రాజు పథకం ప్రకారం చేయించింది కాదని ఆ రోజున ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది.38తరువాత రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. <<ఈ రోజు చనిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ముఖ్యమైన వాడనీ ప్రధానుల్లో ఒకడనీ మీకు తెలిసే ఉంటుంది.39పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.>>

Chapter 4

ఇష్బోషెతు హత్య

1హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలు పోలేదు.2అయితే సౌలు కుమారుడి దగ్గర ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయనా, రెండవవాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం.3అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకూ అక్కడే కాపురం ఉన్నారు.

4సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.

5రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.6-8గోదుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు. రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు.

వారు <<దయచేసి విను. నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు>> అని చెప్పారు.

9అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు,10<<మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు.11వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా?12అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను>> అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

Chapter 5

ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదు
5:1-3; 1 దిన 11:1-3

1ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు<<రాజా, విను. మేమంతా నీకు దగ్గర బంధువులం.2గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడుగా ఉన్నావు. <నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించి వారికి కాపరిగా ఉంటావు> అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు.>>

3ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు.

4దావీదు రాజైనప్పుడు అతని వయసు ముప్ఫై ఏళ్ళు. అతడు నలభై ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు.5హెబ్రోనులో అతడు యూదా గోత్రం వారిని ఏడేళ్ళ ఆరు నెలలు, యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా గోత్రాల ప్రజలను ముప్ఫై మూడు ఏళ్ళు పాలించాడు.
దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం
5:6-10; 1 దిన 11:4-9
5:11-16; 1 దిన 3:5-9; 14:1-7

6-7దేశంలో యెబూసీయులు నివసిస్తూ ఉన్నప్పుడు వారిపై దాడి చేసేందుకు దావీదూ అతని మనుషులూ యెరూషలేముకు వచ్చారు. దావీదు తమపైకి రాలేడన్న ధీమాతో యెబూసీయులు <<నువ్వు మాపైకి వస్తే ఇక్కడ ఉన్న గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిన్ను తోలివేస్తారు>> అని దావీదుకు కబురు పంపారు. దావీదు వారిపై దండెత్తి దావీదుపురం అని పిలిచే సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు.

8ఆ సమయంలో దావీదు <<దావీదు శత్రువులైన గుడ్డి, కుంటి యెబూసీయులపై దాడి చేయాలనుకునే వారంతా నీటికాలువ సొరంగం గుండా ఎక్కి వెళ్ళాలి>> అన్నాడు. అప్పటినుండి <<గుడ్డివారు, కుంటివారు యెహోవా మందిరంలోపలికి1 రాలేరు>> అనే సామెత పుట్టింది.9దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు.10దావీదు దినదినమూ వర్ధిల్లుతూ వచ్చాడు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

11తూరు రాజు హీరాము తన మనుషులనూ, దేవదారు చెక్కలనూ, వడ్రంగం పనివారిని, భవనాలు కట్టేవారిని పంపించాడు. వాళ్ళు దావీదు కోసం ఒక పట్టణం కట్టారు.12ఇశ్రాయేలీయులపై రాజుగా యెహోవా తనను స్థిరపరిచాడనీ. దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని వర్థిల్లజేస్తాడనీ దావీదు గ్రహించాడు.

13దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నివసించి అనేకమందిని ఉంపుడుగత్తెలుగా, భార్యలుగా చేసుకున్నాడు, దావీదుకు ఇంకా చాలామంది కొడుకులూ, కూతుర్లూ పుట్టారు.14దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,15ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ,16ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు, అనేవారు పుట్టారు.
దావీదు ఫిలిష్తీయులను ఓడించడం

17ప్రజలంతా ఇశ్రాయేలీయులపై రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు దావీదును చంపడానికి వారు సైన్యంతో బయలుదేరారు. ఆ వార్త తెలియగానే దావీదు సురక్షితమైన స్థలానికి వెళ్లిపోయాడు.18ఫిలిష్తీ సైన్యం వచ్చి రెఫాయీము లోయలో మకాం వేశారు.
19దావీదు <<నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?>> అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు <<బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను>> అని చెప్పాడు.20అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి అక్కడ వాళ్ళను ఓడించి <<జలప్రవాహాలు కొట్టుకు పోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని>> ఆ స్థలానికి బయల్పెరాజీము అని పేరు పెట్టాడు.21ఫిలిష్తీయులు తమ దేవుళ్ళ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

22ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు.23దావీదు యెహోవాను ప్రార్థించినప్పుడు, యెహోవా అతనితో <<నువ్వు వాళ్ళను తిన్నగా వెళ్లి ఎదుర్కోవద్దు. చుట్టూ తిరిగి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిపై దాడి చెయ్యి.
24కంబళి చెట్ల చుట్టూ తిరిగి వెళ్లి ఆ చెట్లకొమ్మల్లో వీచే గాలిలో శబ్దం వినిపించగానే ఫిలిష్తీయులపై దాడి చెయ్యి. ఎందుకంటే వారిని హతమార్చడానికి యెహోవా ముందుగా బయలుదేరుతున్నాడన్న మాట>> అని చెప్పాడు.25యెహోవా తనకు చెప్పినట్టు చేసి, దావీదు గెబ నుండి గెజెరు వరకూ ఫిలిష్తీ సైన్యాన్ని తరుముతూ సంహరించాడు.


1 5:8 యెహోవా మందిరంలోపలికి రాజభవనం

Chapter 6

దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం
6:11; 1 దిన 13:1-14
6:12-19; 1 దిన 15:25—16:3

1దేవుని నామాన్ని వెల్లడి పరుస్తూ కెరూబుల మధ్య నివసించే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దేవుని మందసం బాలా యెహూదాలో ఉంది.2ఆ మందసాన్ని అక్కడి నుండి తీసుకు రావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి ముప్ఫై వేల మందిని సమకూర్చి బయలుదేరాడు.

3వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకు బయలుదేరినప్పుడు అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యో కొత్త బండిని తోలారు.4దేవుని మందసం ఉన్న ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తెస్తున్నప్పుడు అహ్యో బండికి ముందు నడిచాడు.5దావీదు, ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టుకలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు.

6వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు.7వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు.
8యెహోవా ఉజ్జాను అంతం చేసిన ఆ చోటికి పెరెజ్‌ ఉజ్జా అని పేరు పెట్టారు.9ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి <<యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?>> అనుకున్నాడు.
10కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడ లేదు. గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకు వచ్చి అక్కడ ఉంచాడు.

11యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమునూ, అతని కుటుంబాన్నీ ఆశీర్వదించాడు.
12దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు.13-14ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు, దావీదు నారతో నేసిన ఏఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు.15ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు.

16యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది.17వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దాని కోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు, దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు.18హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు.19సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

20దావీదు తన ఇంటివారిని దీవించడానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె <<ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుటా సేవకుల ఎదుటా ఈ రోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు! ఎవడో పనికిమాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేసాడు>> అంది. అప్పుడు దావీదు,21<<నీ తండ్రినీ, అతని సంతానాన్నీ తోసిపుచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి నన్ను ఎన్నుకొన్న యెహోవా సన్నిధిలో నేను అలా చేశాను. యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను.22నేను ఇంతకన్నా మరింత హీనంగా నా దృష్టికి నేను తక్కువ వాడనై నువ్వు చెబుతున్న బానిస స్త్రీల దృష్టిలో గొప్పవాడినవుతాను>> అని మీకాలుతో అన్నాడు.23సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయేంత వరకూ పిల్లలు పుట్టలేదు.

Chapter 7

దావీదుకు దేవుని వాగ్దానం

1యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి,2<<నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది>> అన్నాడు.

3అప్పుడు నాతాను <<యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి>>అన్నాడు.4అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది,5<<నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా?
6ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను బయటకు రప్పించినప్పటి నుండి నేటి వరకూ మందిరంలో నివసించకుండా డేరాలో, గుడారంలో నివసిస్తూ సంచరించాను.7ఇశ్రాయేలీయులతో కలసి నేను సంచరించిన కాలమంతా నా ప్రజలను సంరక్షించమని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రా నాయకుల్లో ఎవ్వరితోనైనా దేవదారు కలపతో నాకొక మందిరం కట్టించలేకపోయారే అని ఎవ్వరితోనైనా అన్నానా?

8కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.9నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను.
10నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి,11నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను.

యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను వారు శాశ్వతంగా పాలన చేస్తారు.

12నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను.13అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.14అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.

15అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను.16నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.>>17తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు.
దావీదు ప్రార్థన

18అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. <<నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది?19నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను?20యెహోవా నా ప్రభూ, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు.
21నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు.

22దేవా, యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు.23నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు.

24యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు.25దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చీ, నా వంశం గూర్చీ నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు.26<సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు> అని ప్రజలనే మాటచేత నీకు శాశ్వత మహిమ కలిగేలా నీ దాసుడనైన నా వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడేలా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు.

27ఇశ్రాయేలీయుల దేవా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నాకు సంతానం కలిగిస్తానని నీ దాసునికి తెలియపరచావు. కాబట్టి ఈ విధంగా నీతో విన్నపం చేయడానికి నీ దాసుడనైన నాకు ధైర్యం వచ్చింది.28యెహోవా, నా ప్రభూ, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి.29నీ దాసుడనైన నా వంశం అంతా నిత్యమూ నీ సన్నిధిలో ఉండేలా దయచేసి దీవించు. యెహోవా నా ప్రభూ, నువ్వు సెలవిచ్చినట్టు నీ దీవెనలు పొంది నా వంశం అన్నివేళలా దీవెన పొందుతుంది గాక.>>

Chapter 8

దావీదు సైనిక విజయాలు

1దావీదు ఫిలిష్తీయులను ఓడించి వారిని లోబరచుకుని వారి ఆధీనంలో ఉన్న మెతెగమ్మాను ఆక్రమించుకున్నాడు.

2అతడు మోయాబీయులను ఓడించి, పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. రెండు కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలనీ, ఒక కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలనీ నిర్ణయించాడు. అప్పటినుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు.

3సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి4అతని దగ్గరనుండి వెయ్యీ ఏడు వందల మంది గుర్రపు రౌతులను, ఇరవై వేల కాల్బలాన్ని పట్టుకుని, వారి గుర్రాల మందలో వంద ఉంచుకుని, మిగిలినవాటి చీలమండ నరాలను కోయించాడు.

5దమస్కులో ఉన్న అరామీయులు సోబా రాజైన హదదెజెరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.6దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.

7హదదెజెరు సేవకుల1 దగ్గర ఉన్న బంగారు శూలాలను దావీదు స్వాధీనం చేసుకుని యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చాడు.8దావీదు రాజు హదదెజెరుకు చెందిన బెతహు, బేరోతై అనే పట్టణాల్లో ఉన్న విస్తారమైన ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.

9దావీదు హదదెజెరు సైన్యం మొత్తాన్ని హతం చేశాడన్న వార్త హమాతు రాజైన తోయికి వినబడింది.10హదదెజెరు, తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజెరుతో యుద్ధం చేసి అతణ్ణి ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి, క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు.

11రాజైన దావీదు అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల, అమాలేకీయుల రాజ్యాలను జయించి దోచుకొన్న బంగారం, వెండితో పాటు,12రెహోబు కొడుకు హదదెజెరు అనే సోబా రాజు దగ్గర దోచుకొన్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు.

13దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.14ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ వచ్చాడు.
దావీదు అధికారులు

15దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్లా నీతి న్యాయాలు జరిగించాడు.16సెరూయా కొడుకు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యానికి చెందిన దస్తావేజుల పర్యవేక్షణ అధికారి.17అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకులు యాజకులు. శెరాయా లేఖికుడు.18యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధికారి. దావీదు కొడుకులు రాజ్య సభలో ప్రముఖులు2 .


1 8:7 సేవకుల అధికారులు
2 8:18 రాజ్య సభలో ప్రముఖులు యాజకులు

Chapter 9

దావీదు, మెఫీబోషెతు

1<<సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?>> అని దావీదు అడిగాడు.

2సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతణ్ణి దావీదు దగ్గరికి పిలుచుకు వచ్చారు. దావీదు రాజు <<సీబావు నువ్వే కదా>> అని అడిగాడు. అతడు <<నీ సేవకుడినైన నేనే సీబాను>> అన్నాడు.
3అప్పుడు దావీదు <<యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?>> అని అతణ్ణి అడిగాడు.

అప్పుడు సీబా<<యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు>> అని రాజుకు విన్నవించుకున్నాడు.

4<<అతడు ఎక్కడ ఉంటున్నాడు?>> అని రాజు అడిగాడు. సీబా <<అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు>> అని రాజుతో చెప్పాడు.
5అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతణ్ణి తన దగ్గరికి రప్పించాడు.

6సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు <<మెఫీబోషెతూ>> అని అతణ్ణి పిలిచాడు. అతడు <<అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను>> అన్నాడు.
7దావీదు <<నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు>> అని చెప్పాడు.

8అతడు నమస్కరించి <<చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి?>> అన్నాడు.
9అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి <<సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను.10కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు>> అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.

11అప్పుడు సీబా <<నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను>> అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు.12మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు.13మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్ళూ కుంటివి.

Chapter 10

అమ్మోనీయుల మీద దావీదు విజయం

1ఆ తరువాత అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కొడుకు హానూను ఆ దేశానికి రాజు అయ్యాడు.2దావీదు <<హానూను తండ్రి నాహాషు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి>> అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్ళారు.

3అప్పుడు అమ్మోనీయుల ప్రజల నాయకులు రాజైన హానూనుతో ఇలా చెప్పారు <<నీ తండ్రి మీద గౌరవంతో మాత్రమే దావీదు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి మనుషులను పంపాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దాన్ని పరిశీలించడానికి అతడు తన గూఢచారులను పంపించాడని నీకు అనిపించలేదా?>>

4ఈ మాటలు విన్న హానూను దావీదు పంపిన మనుషులను పట్టుకుని, సగం గడ్డం గొరిగించి, వారు తొడుక్కొన్న బట్టలు వెనక వైపు నడుము కింద వరకూ మధ్యకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు.5ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు, వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి <<మీ గడ్డాలు పెరిగే వరకూ యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి>> అని వారికి చెప్పమన్నాడు.

6అమ్మోనీయులు, దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి, తమ మనుషులను పంపి, బేత్రెహోబులో, అరాము సోబాలో ఉన్న అరామీయ సైన్యంలో నుండి ఇరవై వేలమంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మయకా రాజు దగ్గరనుండి వెయ్యిమంది సైనికులను, టోబులో నుండి పన్నెండు వేలమంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు.7ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు.8అమ్మోనీయులు బయలుదేరి తమ నగర సింహద్వారాలకు ఎదురుగా బారులు తీరి నిలబడ్డారు. సోబా నుంచి, రెహోబు నుంచి అరామీయులు, మయకావారు, టోబువారు విడివిడిగా పొలాల్లో కాపు కాశారు.

9తనకు వెనకా, ముందూ యుద్ధపంక్తులుగా నిలబడి ఉన్న సైనికులను చూసి యోవాబు ఇశ్రాయేలీయుల్లో మహా వీరులైన కొందరిని ఎన్నుకుని వరుసలుగా నిలబెట్టి అరామీయులను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు.10మిగిలినవారిని అమ్మోనీయులను ఎదుర్కోడానికి తన సోదరుడు అబీషైకి అప్పగించాడు.
11యోవాబు అబీషైతో<<అరామీయుల సైన్యం నా గుంపును ఓడిస్తుంటే నీ సైన్యం వచ్చి నన్ను ఆదుకోవాలి, అమ్మోనీయుల సైన్యం నీ బలానికి మించిపోతే నేను వచ్చి నిన్ను ఆదుకొంటాను.12ధైర్యం తెచ్చుకో. మన ప్రజలనూ, దేవుని పట్టణాన్నీ తలంచుకుని బలం తెచ్చుకొందాం. యెహోవా ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాడు గాక>> అని చెప్పాడు.

13యోవాబు, అతని సైన్యం యుద్ధం ప్రారంభించగానే అరామీయులు వారి ముందు నిలవలేక పారిపోయారు.14అరామీయులు పారిపోవడం చూసిన అమ్మోనీయులు కూడా అబీషైని ఎదిరించలేక పారిపోయారు. వారు తమ పట్టణాలకు పారిపోయినప్పుడు యోవాబు అమ్మోనీయులను వదిలిపెట్టి యెరూషలేము వచ్చాడు.
15ఇశ్రాయేలీయుల చేతిలో తాము పరాజయం పాలయ్యామని అరామీయులు గ్రహించి మళ్ళీ సమావేశమయ్యారు.16హదదెజరు నది అవతలి వైపున ఉన్న అరామీయులను పిలిపించాడు. వారు హేలాముకు చేరుకున్నారు. హదదెజరు సైన్యానికి షోబకు సైన్యాధిపతిగా ఉన్నాడు.

17దావీదుకు ఈ వార్త తెలిసినప్పుడు అతడు ఇశ్రాయేలు యోధులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు.18అరామీయులు యుద్ధ వ్యూహం సిద్ధపరచుకుని దావీదును ఎదుర్కున్నారు. దావీదు అరామీయుల్లో ఏడు వందలమంది రథికులను, నలభై వేలమంది గుర్రపు రౌతులను హతమార్చాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేక పారిపోయారు. వారి సైన్యాధిపతి షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చనిపోయాడు.19హదదెజరు సామంతులంతా తాము ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక ఓడిపోవడం చూసి భయకంపితులయ్యారు. వారంతా ఇకపై అమ్మోనీయులకు సహాయం చేయడం మానుకుని ఇశ్రాయేలీయులకు లోబడి వారితో సంధి చేసుకున్నారు.

Chapter 11

ఊరియాకు వ్యతిరేకంగా దావీదు చేసిన పాపం

1వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

2ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది.3ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి <<ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు>> అని చెప్పాడు.
4దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

5కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. <<నేను గర్భవతి నయ్యాను>> అని ఆమె దావీదుకు కబురు పంపింది.
6దావీదు <<హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు>> అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు.7యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలనూ యోవాబు, ఇతర సైనికుల క్షేమ సమాచారాలనూ దావీదు అతణ్ణి అడిగి తెలుసుకున్నాడు.8తరువాత దావీదు <<నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో>> అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు.
9అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు.

10ఊరియా అతని ఇంటికి వెళ్ళలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి <<నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?>> అని అడిగాడు.11అందుకు ఊరియా <<మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను>> అని దావీదుతో అన్నాడు.

12అప్పుడు దావీదు <<ఈరోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు. రేపు నిన్ను పంపిస్తాను>> అని ఊరియాతో చెప్పాడు. ఊరియా ఆ రోజు, తరువాతి రోజు యెరూషలేములో ఉండిపోయాడు.13ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని, తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు.

14తెల్లవారిన తరువాత దావీదు <<యుద్ధం భీకరంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు చనిపోయేలా చేసి అక్కడి నుండి వెళ్ళిపో>> అని15యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు.
16యోవాబు అమ్మోనీయుల పట్టాణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు.17ఆ పట్టణం వారు బయటికీ వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.

18యోవాబు ఈ యుద్ధ సమాచారాన్ని ఒక సైనికుడి ద్వారా దావీదుకు తెలియజేశాడు.19యోవాబు ఆ సైనికుడితో <<యుద్ధ సమాచారం రాజుకు చెప్పిన తరువాత రాజు కోపం తెచ్చుకుని <మీరు యుద్ధం తీవ్రంగా జరుగుతున్న పట్టణానికి దగ్గరగా ఎందుకు వెళ్లారు?20గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా?
21ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?> అని అడిగితే, నువ్వు, <తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు> అని చెప్పు>> అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.

22యోవాబు పంపిన సైనికుడు వచ్చి దావీదుకు విషయమంతా చెప్పాడు.23ఎలాగంటే<<వారి సైనికులు మమ్మల్ని తరుముతూ యుద్ధభూమిలో మాకు ఎదురు పడినప్పుడు మేము వారిని సరిహద్దుల వరకూ తరిమి గెలిచాము.
24అప్పుడు గోడలపై నుండి విలుకాళ్ళు తమ సైనికులపై బాణాలు కురిపించారు. రాజు సేవకుల్లో కొందరితో సహా తమరి సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.>>25అప్పుడు దావీదు<<నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు. <జరిగినదాన్ని బట్టి నువ్వు బాధపడవద్దు. కత్తి ఒకసారి ఒకరిని, మరోసారి మరొకరిని చంపుతుంది. పట్టణం మీద యుద్ధం మరింత తీవ్రతరం చేసి దాన్ని ఓడించు> అని యోవాబుకు ధైర్యం చెప్పు>> అని ఆ సైనికునికి చెప్పి పంపించాడు.

26ఊరియా భార్య బత్షెబ తన భర్త చనిపోయిన సంగతి విని విలపించింది.27విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది.

Chapter 12

నాతాను దావీదును మందలించడం

1యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. <<ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు.2ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి.3బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది.

4ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.>>5దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. <<యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు.6వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి>> అని నాతానుతో అన్నాడు.

7నాతాను దావీదును చూసి <<ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి8అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని.
9నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.

10నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

11నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను.12పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది>> అని అన్నాడు.

13అందుకు దావీదు <<నేను పాపం చేశాను>> అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను <<నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు.
14-15అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు>> అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

16యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు.17దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.

18ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు <<బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు.
19ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో>> అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. <<బిడ్డ చనిపోయాడా?>> అని తన సేవకులను అడిగాడు. వారు <<చనిపోయాడు>> అని జవాబిచ్చాడు.

20అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.

21అతని సేవకులు<<బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?>> అని దావీదును అడిగారు.22అప్పుడు దావీదు <<బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను.23ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా>> అని వారితో చెప్పాడు.

24తరువాత దావీదు తన భార్య బత్షెబ దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు.25యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదీద్యా1 అని పేరు పెట్టాడు.
అమ్మోనీయుల మీద విజయం

26యోవాబు అమ్మోనీయుల ముఖ్య పట్టణం రబ్బా మీద యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. మిగతా నగరాలకు నీరు ఇక్కడినుండే సరఫరా అవుతుంది.27యోవాబు దావీదు దగ్గరికి మనుషులను పంపి <<నేను రబ్బా మీద యుద్ధం చేసి నీరు సరఫరా చేసే పట్టణాన్ని అక్రమించుకొన్నాను.28నేను ఆక్రమించుకొన్న పట్టణానికి నా పేరు పెట్టుకోకుండేలా మిగిలిన సైన్యాన్ని సమకూర్చి పట్టణంపై దాడి చెయ్యి>> అని కబురు చేశాడు.

29కాబట్టి దావీదు సైన్యాన్ని సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని, వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీసివేయించాడు. దాన్ని దావీదు తల మీద పెట్టారు. దాన్ని విలువైన రత్నాలతో చెక్కారు. దాని బరువు సుమారు నాలుగు కిలోలు.30ఇంకా అతడు ఆ పట్టణంలో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు.
31పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్ళతో పని చేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు, అతని మనుషులూ తిరిగి యెరూషలేము చేరుకున్నారు.


1 12:25 యదీద్యా యెహోవా ప్రేమించినవాడు

Chapter 13

అమ్నోను తామారును చెరచడం

1దావీదు కొడుకు, అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు, అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు.2తామారు అవివాహిత కావడంవల్ల ఆమెను ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అమ్నోను దిగులు పెంచుకుని తామారును బట్టి చిక్కిపోసాగాడు.

3అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎంతో కుటిలమైన బుద్ది గలవాడు. అతడు అమ్నోనుతో,4<<రాజ కుమారుడవైన నువ్వు రోజురోజుకీ చిక్కిపోడానికి కారణం ఏమిటి? విషయం ఏమిటో నాకు చెప్పవా?>> అని అడిగాడు. అమ్నోను<<నా సోదరుడైన అబ్షాలోము సోదరి తామారుపై కోరిక కలిగి ఉన్నాను>> అని చెప్పాడు.
5అప్పుడు యెహోనాదాబు­ <<నీకు జబ్బు చేసినట్టు నటించి నీ మంచం మీద పండుకుని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు, <నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా వండి నాకు పెట్టేలా ఆమెతో చెప్పు> అని రాజును అడుగు>> అని సలహా ఇచ్చాడు. అమ్నోను జబ్బు చేసినట్టు నటిస్తూ పడక మీద పండుకున్నాడు.

6అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి, అతణ్ణి పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను <<నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చేయమని చెప్పు>> అని రాజును అడిగాడు.
7దావీదు <<నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసం భోజనం తయారుచెయ్యి>> అని తామారు ఇంటికి కబురు పంపాడు.8తామారు, అమ్నోను ఇంటికి వెళ్ళింది.9అతడు పండుకుని ఉన్నప్పుడు ఆమె పిండి తీసుకు కలిపి అతని ముందు రొట్టెలు చేసి వాటిని కాల్చి గిన్నెలో పెట్టి వాటిని అతనికి వడ్డించబోయింది. అతడు <<నాకు వద్దు>> అని చెప్పి, అక్కడ ఉన్నవారితో <<ఇక్కడున్న వారంతా నా దగ్గర నుండి బయటకు వెళ్ళండి>> అని చెప్పాడు.

10వారంతా బయటికి వెళ్ళిన తరువాత అమ్నోను <<నీ చేతి వంటకం నేను తినేలా దాన్ని నా గదిలోకి తీసుకురా>> అని చెప్పాడు. తామారు తాను చేసిన రొట్టెలను తీసుకు గదిలో ఉన్న అమ్నోను దగ్గరికి వచ్చింది.11అయితే అతడు ఆమెను పట్టుకుని <<నా సోదరీ, రా, నాతో శయనించు>> అన్నాడు.12ఆమె <<అన్నయ్యా, నన్నిలా అవమానపరచొద్దు. ఇలా చేయడం ఇశ్రాయేలీయులకు న్యాయం కాదు. ఇలాంటి జారత్వం లోకి పడిపోవద్దు. ఈ అవమానం నేనెక్కడ దాచుకోగలను?
13నువ్వు కూడా ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గుడిగా మారతావు. దీని గూర్చి రాజుతో మాట్లాడు. అతడు నన్ను నీకిచ్చి వివాహం చేయవచ్చు>> అని చెప్పింది.14అయినా అతడు ఆమె మాట వినలేదు. పశుబలంతో ఆమెను మానభంగం చేసి అవమానించాడు.

15అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను <<లేచి వెళ్ళిపో>> అని చెప్పాడు.16ఆమె <<నన్ను బయటకు తోసివేయడం ద్వారా నాకు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేసినవాడివి అవుతావు>> అని చెప్పింది.17అతడు ఆమె మాట వినిపించుకోలేదు. తన పనివాళ్ళలో ఒకణ్ణి పిలిచి <<ఈమెను నా దగ్గర నుండి పంపివేసి తలుపులు వెయ్యి>> అని చెప్పాడు.
18వివాహం కాని రాజకుమార్తెలు రకరకాల రంగుల చీరలు ధరించేవారు. ఆమె అలాంటి చీర కట్టుకుని ఉన్నప్పటికీ ఆ పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మళ్ళీ రాకుండా ఉండేలా తలుపుకు గడియ పెట్టాడు.

19అప్పుడు తామారు తలమీద బూడిద పోసుకుని, కట్టుకొన్న రంగు రంగుల చీర చింపివేసి తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
20ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి <<నీ అన్న అమ్నోను నీతో తన వాంఛ తీర్చుకున్నాడు గదా? నా సోదరీ, నువ్వు నెమ్మదిగా ఉండు. అతడు నీ అన్నే గదా, దీని విషయంలో బాధపడకు>> అన్నాడు. మానం కోల్పోయిన తామారు అప్పటినుండి అబ్షాలోము ఇంట్లోనే ఉండిపోయింది.21ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు.22అబ్షాలోము తన సోదరుడైన అమ్నోనుతో మంచిచెడ్డలేమీ మాటలాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే తన సోదరి తామారును మానభంగం చేసినందుకు అతనిపై పగ పెంచుకున్నాడు.
అబ్షాలోము, అమ్నోనును హతమార్చడం

23రెండేళ్ళ తరువాత అబ్షాలోముకు గొర్రెలబొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులనందరినీ విందుకు పిలిచాడు.24అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి <<రాజా, వినండి. నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వూ నీ సేవకులూ విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను>> అని మనవి చేసుకున్నాడు.

25అప్పుడు రాజు <<నా కుమారా, మమ్మల్ని పిలవొద్దు. మేము రాకూడదు. మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాం>> అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్షాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతపెట్టాడు.26అయితే దావీదు వెళ్లకుండా అబ్షాలోమును దీవించి పంపాడు. అప్పుడు అబ్షాలోము <<నువ్వు రాలేకపోతే నా సోదరుడు అమ్నోను మాతో కలసి బయలుదేరేలా అనుమతి ఇవ్వు>> అని రాజుకు మనవి చేశాడు. <<అతడు నీ దగ్గరికి ఎందుకు రావాలి?>> అని దావీదు అడిగాడు.
27అబ్షాలోము అతణ్ణి బతిమిలాడాడు. రాజు అమ్నోను, తన కొడుకులంతా అబ్షాలోము దగ్గరకు వెళ్ళవచ్చని అనుమతి ఇచ్చాడు.

28ఈలోగా అబ్షాలోము తన పనివాళ్ళను పిలిచి <<నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అమ్నోను బాగా ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉన్న సమయంలో అతణ్ణి చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతణ్ణి చంపివేయండి. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి>> అని చెప్పాడు.29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్నోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదెలు ఎక్కి పారిపోయారు.

30వారు దారిలో ఉండగానే <<ఒక్కడు కూడా మిగలకుండా రాజకుమారులందరినీ అబ్షాలోము చంపివేశాడు>> అన్న వార్త దావీదుకు అందింది.31అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు.
32దీని చూసిన దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యెహోనాదాబు <<రాజా, రాజకుమారులైన యువకులందరినీ వారు చంపారని నువ్వు అనుకోవద్దు. అమ్నోను ఒక్కడినే చంపారు. ఎందుకంటే, అతడు అబ్షాలోము సహోదరి తామారును మానభంగం చేసినప్పటి నుండి అతడు అమ్నోనును చంపాలన్న పగతో ఉన్నాడని అతని మాటలనుబట్టి గ్రహించవచ్చు.33కాబట్టి మా రాజువైన నువ్వు నీ కొడుకులంతా చనిపోయారని భావించి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు>> అని చెప్పాడు.
అబ్షాలోము గెషూరు పారిపోవడం

34కాపలా కాసేవాడు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతని వెనక, కొండ పక్కన దారిలో నుండి వస్తున్న చాలమంది కనబడ్డారు.35వారు పట్టణంలోకి రాగానే యెహోనాదాబు <<అదిగో రాజకుమారులు వచ్చారు. నీ దాసుడనైన నేను చెప్పినట్టుగానే జరిగింది>> అని రాజుతో అన్నాడు.36అతడు తన మాటలు ముగించగానే రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసి రాజు, అతని సేవకులంతా కూడా ఏడ్చారు.
37ఇది జరిగిన తరువాత అబ్షాలోము అక్కడినుంచి పారిపోయి గెషూరు రాజు అమీహూదు కొడుకు తల్మయి దగ్గరికి చేరుకున్నాడు. దావీదు ప్రతిరోజూ తన కొడుకు కోసం శోకిస్తూ ఉండిపోయాడు.

38అబ్షాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ మూడేళ్ళు గడిపాడు.39అమ్నోను ఇక చనిపోయాడు గదా అని రాజైన దావీదు అతని గూర్చి ఓదార్పు పొంది అబ్షాలోమును చంపాలన్న ఆలోచన మానుకున్నాడు.

Chapter 14

అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావడం

1రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.2తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో <<చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ3నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో>> అని చెప్పాడు.

4అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి <<రాజా, నన్ను కాపాడు>> అంది.

5రాజు <<నీకేం ఇబ్బంది కలిగింది?>> అని అడిగాడు. ఆమె <<నా భర్త చనిపోయాడు. విధవరాలిని.6నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
7నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, <తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము> అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు>> అని రాజుతో చెప్పింది.

8అప్పుడు రాజు <<నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను>> అని చెప్పాడు.

9అప్పుడు ఆ తెకోవ స్త్రీ <<నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక>> అని రాజుతో అన్నది. అప్పుడు
10రాజు <<ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు>> అని ఆమెతో చెప్పాడు.

11అప్పుడు ఆమె <<హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు>> అని మనవి చేసింది. అప్పుడు రాజు <<యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు>> అని చెప్పాడు.
12అప్పుడు ఆ స్త్రీ <<నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి>> అంది. రాజు <<ఏమిటో చెప్పు>> అన్నప్పుడు.

13ఆ స్త్రీ <<రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?14మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
15మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,16దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.17నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు>> అంది.

18అప్పుడు రాజు <<నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు>> అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె <<నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు>> అంది.19రాజు <<ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?>> అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది <<నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.20జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.>>

21అప్పుడు రాజు యోవాబును పిలిచి <<విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను>> అని చెప్పి,22<<యువకుడైన అబ్షాలోమును రప్పించండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. <<రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది>> అని చెప్పి, గెషూరుకు వెళ్లి
23అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.24అయితే రాజు <<అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి>> అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.

25ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.26అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.27అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.

28అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.29రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
30తన పనివారిని పిలిచి <<యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి>> అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.

31ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి <<నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?>> అని అడిగాడు.
32అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు <<గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు>> అన్నాడు.33అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

Chapter 15

దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు

1ఇది జరిగిన తరువాత అబ్షాలోము ఒక రథాన్ని, కొన్ని గుర్రాలను సిద్దం చేసుకున్నాడు. తన ముందు పరుగెత్తడానికి ఏభైమంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు.2పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని <<నువ్వు ఏ ఊరివాడివి?>> అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. <<నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి>> అని వాడు చెప్పినప్పుడు,

3అబ్షాలోము <<నీ వివాదం సవ్యంగా, న్యాయంగా ఉన్నది గానీ దాన్ని విచారణ చేసేందుకు రాజు దగ్గర సరి అయిన విచారణకర్త ఒక్కడు కూడా లేడు.

4నేను ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు వివాదాలు పరిష్కరించుకోవడానికి అంతా నా దగ్గరికి వస్తారు, నేను వారికి న్యాయం జరిగిస్తాను>> అని చెబుతూ వచ్చాడు.
5ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి తన దగ్గరికి వస్తే అతడు తన చెయ్యి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనేవాడు.6తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరి పట్లా అబ్షాలోము ఈ విధంగా చేసి ఇశ్రాయేలీయులనందరినీ తనవైపు ఆకర్షించుకున్నాడు.

7ఆ విధంగా నాలుగేళ్ళు గడచిన తరువాత అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. <<నీ దాసుడనైన నేను అరాము దేశంలోని గెషూరులో ఉన్నప్పుడు <యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవిస్తాను> అని మొక్కుకున్నాను. కాబట్టి8నేను హెబ్రోనుకు వెళ్ళి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకొనడానికి నాకు అనుమతి ఇవ్వు>> అని అడిగాడు.
9అప్పుడు రాజు <<క్షేమంగా వెళ్లి రండి>> అని అతనికి అనుమతి ఇచ్చాడు. అతడు లేచి హెబ్రోనుకు బయలుదేరాడు.

10అబ్షాలోము తన గూఢచారులను పిలిచి <<మీరు బూర శబ్దం విన్నప్పుడు, <అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు> అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి>> అని చెప్పి పంపించాడు.
11అబ్షాలోము ఆహ్వానం మేరకు యెరూషలేములో నుండి 200 మంది విందు కోసం బయలుదేరారు. వీరంతా జరగబోయే విషయాలు ఏమీ తెలియని అమాయకులు.12బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.
దావీదు కుటుంబ సమేతంగా పారిపోవడం

13ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది.14దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు <<అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.>>15అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు <<అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.>>

16అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన పదిమంది ఉపపత్నులను ఉంచి, తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు.17రాజు, అతని కుటుంబం బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి అక్కడ సేదదీర్చుకున్నారు.18కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరు వందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు సేవకులంతా అతనికి రెండు వైపులా నడిచారు.
19గిత్తీయుడైన ఇత్తయితో రాజు <<నువ్వు నివసించేందుకు స్థలం కోరి వచ్చిన విదేశీయుడివి. మాతో కలసి ఎందుకు వస్తున్నావు? వెనక్కు వెళ్లి రాజ భవనంలో ఉండు.20నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడి వెళ్తామో తెలియని మాతో కలసి ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు నీ సహోదరులను తీసుకుని వెనక్కు వెళ్ళిపో. యెహోవా నీకు తన సత్యం, కనికరం నీపై చూపుతాడు గాక>> అని చెప్పాడు.

21అప్పుడు ఇత్తయి <<నేను చనిపోయినా, బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక, రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలం లోనే నీ దాసుడనైన నేనూ ఉంటాను>> అని రాజుతో చెప్పాడు.22అప్పుడు దావీదు <<ఆలాగైతే నువ్వు మాతో కూడ రావచ్చు>> అని చెప్పినప్పుడు గిత్తీయుడైన ఇత్తయి, అతని పరివారమంతా దావీదును వెంబడించారు.

23వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలసి కిద్రోనువాగు దాటి ఎడారి వైపు ప్రయాణమై వెళ్ళారు.
24సాదోకు, లేవీయులంతా దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ దావీదు దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని కిందికి దించారు. పట్టణంలోనుండి బయలుదేరిన ప్రజలంతా దాటిపోయే వరకూ అబ్యాతారు అక్కడే నిలబడి ఉన్నాడు.

25అప్పుడు రాజు సాదోకును పిలిచి <<దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి26దానినీ, అది ఉండే స్థలాన్నీ నాకు చూపిస్తాడు. నీపట్ల నాకు దయ లేదని చెప్పినట్టయితే అది ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది అనుకూలమో దానినే నా విషయంలో జరిగిస్తాడు>> అని చెప్పాడు.
27అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. <<దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు.28నేను చెప్పేది విను, నీ నుండి నాకు కచ్చితమైన కబురు వచ్చేదాకా నేను అరణ్యంలో నది తీరాల దగ్గర వేచి ఉంటాను.>>29అప్పుడు సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు.

30దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.31అంతలో ఒకడు వచ్చి <<అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది>> అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు <<యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు>> అని ప్రార్థన చేశాడు.

32దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఆ కొండమీద ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అర్కీయుడైన హూషై తన పైదుస్తులు చింపుకుని, తలపై దుమ్ము పోసుకుని వచ్చి రాజు దర్శనం చేసుకున్నాడు.

33రాజు <<నువ్వు నాతో ఉంటే నాకు భారంగా ఉంటుంది.34నువ్వు తిరిగి పట్టణానికి వెళ్లి, అబ్షాలోముతో <రాజా, ఇంతవరకూ నీ తండ్రికి సేవచేసినట్టు ఇకనుండి నీకూ సేవ చేస్తాను> అని చెప్పి అతని దగ్గర చేరి, నా తరపున పనిచేస్తూ అహీతోపెలు అబ్షాలోముతో కలసి చేసే కుట్రలు భగ్నం చేయగలవు.
35అక్కడ యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు సహాయకులుగా ఉంటారు. కనుక రాజ నగరంలో జరుగుతున్న విషయాలు నీకు వినిపిస్తే వాటిని యాజకుడైన సాదోకుతో, అబ్యాతారుతో చెప్పు.36వారి ఇద్దరు కొడుకులు సాదోకు కొడుకు అహిమయస్సు, అబ్యాతారుకు కొడుకు యోనాతాను అక్కడ ఉన్నారు. నీకు తెలిసిన విషయాలన్నీ వారి ద్వారా నాకు తెలియపరచు>> అని చెప్పి అతణ్ణి పంపించాడు.

37అందువల్ల దావీదు స్నేహితుడు హూషై యెరూషలేము పట్టణానికి బయలుదేరాడు. ఆ సమయానికి అబ్షాలోము యెరూషలేము చేరుకున్నాడు.

Chapter 16

దావీదు, సీబా

1దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి.2రాజు <<ఇవి ఎందుకు తెచ్చావు?>> అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా <<రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను>> అని చెప్పాడు.

3అప్పుడు రాజు <<నీ యజమాని కొడుకు ఎక్కడ ఉన్నాడు?>> అని అడిగాడు. సీబా <<అయ్యా, ఈరోజు ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పిస్తారనుకుని అతడు యెరూషలేములో ఉండిపోయాడు>> అని చెప్పాడు.4అప్పుడు రాజు <<మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది>> అని సీబాతో చెప్పినప్పుడు సీబా <<నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు>> అన్నాడు.
షిమీ దావీదును శపించడం

5రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు.6అతడు దావీదు పక్కనే నడుస్తూ <<నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు.
7నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు>> అని దుర్భాషలాడుతూ వచ్చాడు.

8రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు.
9అప్పుడు సెరూయా కుమారుడు అబీషై <<ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను>> అన్నాడు.10అందుకు రాజు <<సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?>> అని చెప్పాడు.

11తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. <<నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి.12యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.>>
13తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.14రాజు, అతనితో ఉన్నవారంతా బాగా అలసిపోయి ఉండడంవల్ల ఒక చోటికి వచ్చి అలసట తీర్చుకున్నారు.
అహీతోపెలు సలహా

15అబ్షాలోము, అహీతోపెలు, ఇశ్రాయేలువారంతా యెరూషలేము చేరుకున్నారు.16దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడు హూషై అనేవాడు అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోమును చూసి <<రాజు సదాకాలం జీవిస్తాడు గాక, రాజు సదాకాలం జీవిస్తాడు గాక>> అని చెప్పాడు.
17అప్పుడు అబ్షాలోము <<నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారమిదేనా? నీ స్నేహితునితో కలసి ఎందుకు వెళ్ళలేదు?>> అని అడిగాడు.18హూషై <<యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులంతా ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటారో నేను అతని పక్షం వహిస్తాను. అతని దగ్గరే ఉంటాను.
19నేనెవరికి సేవ చేయాలి? నీ తండ్రి కుమారుడికి నేను సేవ చేయాలి గదా. నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సేవ చేస్తాను>> అని అబ్షాలోముతో చెప్పాడు.

20తరువాత అబ్షాలోము అహీతోపెలును పిలిపించాడు. <<మనం ఏ ఏ పనులు చెయ్యాలో ఆలోచిద్దాం>> అన్నాడు.21అప్పుడు అహీతోపెలు <<నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు శయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకొంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది>> అన్నాడు.
22తరువాత వారు మేడపైన అబ్షాలోముకు గుడారం వేశారు. ఇశ్రాయేలీయులకందరికీ తెలిసేలా అతడు తన తండ్రి ఉపపత్నులతో లైంగికంగా కలిశాడు.23ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.

Chapter 17

1అహీతోపెలు అబ్షాలోముతో ఇలా చెప్పాడు <<దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు.2-3నేను అతనిపై దాడిచేసి అతణ్ణి బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు. అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీవైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను>> అన్నాడు.4ఈ మాటలు అబ్షాలోముకు, ఇశ్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించాయి.

హూషై సలహా

5అప్పుడు అబ్షాలోము<<ఈ విషయంలో అర్కీయుడైన హూషై ఏమి చెబుతాడో విందాం. అతణ్ణి పిలిపించండి>> అని ఆజ్ఞాపించాడు. హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చాడు.6అబ్షాలోము అహీతోపెలు చెప్పిన పథకం అతనికి తెలియజేశాడు. <<అతడు చెప్పినట్టు చేయడం మంచిదా, కాదా? నీ ఆలోచన ఏమిటో చెప్పు>> అని అడిగాడు.7హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు. <<ఇప్పుడు అహీతోపెలు చెప్పిన ప్రణాళిక మంచిది కాదు.

8నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.9అతడు ఏదో ఒక గుహలోనో, లేకపోతే ఏదైనా రహస్య స్థలంలోనో దాక్కుంటాడు. యుద్ధం ఆరంభంలో నీ మనుషులు కొందరు చనిపోతే ప్రజలు వెంటనే దాన్నిబట్టి అబ్షాలోము మనుషులు ఓడిపోయారని చెప్పుకుంటారు.10నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాలవంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు.

11నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకూ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులనందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు.12అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చేయవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
13అతడు గనుక ఒక పట్టణం వెనుక దాక్కొంటే ఇశ్రాయేలీయులంతా ఆ పట్టణాన్ని తాళ్లు తీసుకుని ఒక చిన్న రాయి కూడా కనబడకుండా దాన్ని నదిలోకి లాగుతారు.>>

14అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.

15అప్పుడు హూషై, అబ్షాలోము, ఇశ్రాయేలు పెద్దలకందరికీ అహీతోపెలు వేసిన పథకం, తాను చెప్పిన ఆలోచన యాజకులైన సాదోకు, అబ్యాతారులకు తెలియజేశాడు.16<<మీరు తొందరగా వెళ్లి, రాజు, అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు>> అని చెప్పాడు.
17యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్‌రోగేలు దగ్గెర నిలిబడి ఉన్నప్పుడు ఒక పనిమనిషి వచ్చి, హూషై చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.

18వారిద్దరినీ అక్కడ చూసిన ఒక పనివాడు అబ్షాలోముకు చెప్పాడు. వారిద్దరూ వెంటనే పరుగెత్తి వెళ్లి బహూరీములో ఒకడి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక బావిలో దిగి దాక్కున్నారు.
19ఆ ఇంటి ఇల్లాలు ఒక పరదా తీసుకువచ్చి బావిమీద పరిచి, దానిపైన గోదుమపిండి ఆరబోసింది. కనుక వారు బావిలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు.

20అబ్షాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె <<వారు నది దాటి వెళ్లిపోయారు>> అని చెప్పింది. వారు వెళ్లి చుట్టుపక్కల అంతా వెతికి వారు కనబడకపోయే సరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు.
21సేవకులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరికి వెళ్లి. అహీతోపెలు అతని మీద వేసిన పథకం గురించి చెప్పి<<నువ్వు లేచి త్వరగా నది దాటు>> అని చెప్పారు.

22దావీదు, అతని దగ్గర ఉన్న మనుషులంతా లేచి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నది దాటి వెళ్ళిపోయారు.
23అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.

24దావీదు మహనయీముకు చేరేటప్పటికి అబ్షాలోము, ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు.25అబ్షాలోము యోవాబును తొలగించి అమాశాను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అమాశా తండ్రి ఇత్రా, ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి సెరూయా సహోదరియైన నాహాషు కుమార్తెకు, అబీగయీలుకు ఇత్రా పుట్టాడు.26అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో మకాం వేశారు.

27దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణ వాస్త్యవ్యుడు, నాహాషు కొడుకు షోబీయు, లోదెబారు ఊరివాడు అమ్మీయేలు కొడుకు మాకీరు, రోగెలీము ఊరికి చెందిన గిలాదీయుడు బర్జిల్లయి28ఎడారిలో దావీదు, అతని మనుషులు అలసిపోయి, ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి, పరుపులు, వంటపాత్రలు, కుండలు, వారంతా తినడం కోసం గోదుమలు, యవల పిండి, పప్పులు, చిక్కుడు కాయలు, పేలాలు,29తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.

Chapter 18

యోవాబు అబ్షాలోమును హతమార్చడం

1దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో వెయ్యిమందిని, వందమందిని విభజించి వారిని మూడు భాగాలుగా చేశాడు.2ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు <<నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను>> అని వారితో చెప్పాడు.

3అందుకు వారు <<నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి>> అని చెప్పారు.

4అందుకు రాజు <<మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను>> అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
5అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి <<నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి>> అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు.

6దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది.7ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు.8ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు.

9అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది.

10ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి <<అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను>> అని చెప్పాడు.11అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో <<నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి>> అన్నాడు.
12అప్పుడు వాడు <<యువకుడైన అబ్షాలోమును ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తపడమని రాజు నీకూ, అబీషైకీ, ఇత్తయికీ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను.13మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపెడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివౌతావు>> అని యోవాబుతో అన్నాడు.

14యోవాబు <<నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా?>> అని చెప్పి, మూడు బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్లి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురి చూసి కొట్టాడు.15యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు.

16అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు.17ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
18అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది.
దావీదుకు చేరిన అబ్షాలోము మరణవార్త

19సాదోకు కొడుకు అహిమయస్సు <<నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను>> అన్నాడు.20యోవాబు <<ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు>> అని అతనితో చెప్పాడు.

21తరువాత కూషువాడిని పిలిచి <<నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి>> అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.22సాదోకు కొడుకు అహిమయస్సు <<కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు>> అని అడిగాడు. యోవాబు <<కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా>> అని అతనితో అన్నాడు.23అప్పుడు అతడు <<ఏమైనా సరే, నేను పరుగెత్తి వెళ్తాను>> అన్నాడు. అందుకు యోవాబు <<సరే వెళ్ళు>> అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరుగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు.

24దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు.25రాజు <<వాడు ఒంటరిగా వస్తున్నట్టైతే ఏదో కబురు తెస్తున్నాడు>> అన్నాడు. వాడు పరుగెత్తుకొంటూ దగ్గరికి వచ్చాడు.
26కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు <<అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు>> అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు <<వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు>> అన్నాడు.27కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి <<వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది>> అన్నాడు. అప్పుడు రాజు <<వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు>> అన్నాడు.
28అంతలో అహిమయస్సు <<రాజా, జయహో>> అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి <<నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం>> అన్నాడు.29అప్పుడు రాజు <<బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగాడు. అహిమయస్సు <<నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు>> అని చెప్పాడు.30అప్పుడు రాజు <<నువ్వు అవతలికి వెళ్లి నిలబడు>> అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు.
31అంతలో కూషీవాడు వచ్చి <<మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈ రోజు యెహోవా నీ మీదికి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు>> అని చెప్పినప్పుడు32రాజు <<బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగాడు. అప్పుడు కూషీవాడు <<మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది>> అన్నాడు.33అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ <<అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా>> అని కేకలు వేస్తూ <<అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా>> అని విలపిస్తూ ఉన్నాడు.

Chapter 19

1రాజు తన కొడుకు గురించి విలపిస్తూ, విచారంగా ఉన్నాడన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఆనాటి విజయం ప్రజలందరి దుఃఖానికి కారణమయ్యింది.2యుద్ధ సమయంలో భయపడి పారిపోయిన ప్రజలు దొంగలవలె తిరిగి పట్టణంలో ప్రవేశించారు.

3రాజు తన ముఖం కప్పుకుని <<అబ్షాలోమా నా బిడ్డా, అబ్షాలోమా నా బిడ్డా>> అంటూ కేకలువేస్తూ ఏడుస్తున్నాడని, అబ్షాలోమును గూర్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు.4అతడు ఉన్న నగరంలోని భవనానికి వచ్చాడు.
5<<నీ ప్రాణాన్ని, నీ కొడుకుల, కూతుళ్ళ ప్రాణాలను, నీ భార్యల, నీ ఉపపత్నుల ప్రాణాలను రక్షించిన నీ సేవకులనందరినీ నువ్వు సిగ్గుపరుస్తున్నావు.

6నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ, నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు నీకు ఇష్టమైనవారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్షాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచు.
7నువ్వు గనుక ఇప్పుడు బయటికి రాకపోతే ఈ రాత్రి ఒక్కడు కూడా నీ దగ్గర ఉండడని యెహోవా పేరట ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ చిన్నప్పటినుండి ఇప్పటివరకూ నీకు కలిగిన కీడులన్నిటికంటే అది నీకు మరీ కష్టంగా ఉంటుంది>> అని రాజుతో చెప్పినప్పుడు రాజు లేచి బయటకు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు.

8రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడన్న సంగతి ప్రజలంతా విని రాజును దర్శించేందుకు వచ్చారు. ఇశ్రాయేలువారంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
దావీదు యెరూషలేముకు తిరిగి రావడం

9ఆ సమయంలో ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన ప్రజల మధ్య గందరగోళం బయలుదేరింది. వారు <<మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోముకు భయపడి దేశం వదలి పారిపోయాడు.10మనం రాజుగా పట్టాభిషేకం చేసికొన్న అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కనుక మనం రాజును తిరిగి ఎందుకు తీసుకు రాకూడదు?>> అనుకున్నారు.

11రాజైన దావీదుకు ఈ సంగతి వినబడింది. యాజకులైన సాదోకు, అబ్యాతారుకులను పిలిపించి <<ఇశ్రాయేలు వారంతా మాట్లాడుకొంటున్న విషయం రాజుకు తెలిసింది. రాజును నగరానికి మళ్ళీ తీసుకు వెళ్లేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?12మీరు నాకు రక్త సంబంధులు, సోదరులు. రాజును తీసుకు వచ్చేందుకు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారని యూదావారి పెద్దలతో చెప్పండి>> అని వారికి ఆజ్ఞాపించాడు.

13తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి <<నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక>> అని చెప్పమన్నాడు.14అతడు వెళ్లి యూదా వారిలో ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా రాజుకు లోబడేలా చేశాడు. యూదావారు రాజు దగ్గరికి <<నువ్వు, నీ సేవకులంతా తిరిగి రావాలి>> అన్న కబురు పంపించారు. రాజు బయలుదేరి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు15యూదావారు రాజును ఎదుర్కొవడానికి, నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు.

16అంతలో బహూరీములో ఉంటున్న బెన్యామీనీయుడైన గెరా కొడుకు షిమీ త్వరత్వరగా రాజైన దావీదును ఎదుర్కొనడానికి యూదావారితో కలసి వచ్చాడు.17అతనితోపాటు వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబం సేవకుడు సీబా, అతని పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు వచ్చారు.

18వారంతా రాజు ఎదురుగా నది దాటారు. రాజు, అతని పరివారం నది దాటడానికి, రాజుకు అనుకూలంగా చేయడానికి పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను నది దాటి వెళ్ళగానే గెరా కుమారుడు షిమీ వచ్చి అతనికి సాష్టాంగపడ్డాడు.
19<<నా యజమానీ, నేను చేసినదాన్ని బట్టి నాపై నేరం మోపవద్దు. రాజువైన నువ్వు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను మూర్ఖత్వంతో చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకోవద్దు.20నేను పాపం చేశానని నాకు తెలుసు. కనుక రాజువైన నిన్ను కలుసుకోవడానికి యోసేపు వంశం వారందరికంటే ముందుగా వచ్చాను>> అన్నాడు.

21అప్పుడు సెరూయా కుమారుడు అబీషై వచ్చి <<యెహోవా అభిషేకించిన రాజును శపించిన ఈ షిమీకి మరణ శిక్ష విధించాలి>> అన్నాడు.22దావీదు <<సెరూయా కొడుకుల్లారా, మీకూ, నాకూ ఏమి సంబంధం? ఇలాంటి సమయంలో మీరు నాకు విరోధులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలు వారిలో ఎవరికైనా మరణశిక్ష విధించడం సమంజసమా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారిమీద రాజునయ్యానన్న సంగతి తెలుసుకున్నాను>> అన్నాడు. తరువాత23<<నీకు మరణశిక్ష విధించను>> అని షిమీకి వాగ్దానం చేశాడు.

24సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు.25అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు రాజు <<మెఫీబోషెతూ, నీవు నాతో కలసి ఎందుకు రాలేదు?>> అని అడిగాడు.

26అప్పుడు అతడు <<నా యజమానివైన రాజా, నీ దాసుడినైన నేను కుంటివాణ్ణి కనుక గాడిదను సిద్ధం చేసి రాజుతో కలసి వెళ్లిపోవాలని నేను అనుకున్నప్పుడు నా పనివాడు నన్ను మోసం చేశాడు.27సీబా నా విషయంలో నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు నా ఏలినవాడివి, రాజువు. నువ్వు దేవుని దూతవంటి వాడివి. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి.28నా తండ్రి కుటుంబం వారంతా నీ దృష్టిలో చచ్చినవారమై ఉన్నప్పుడు, నువ్వు నీ భోజనం బల్ల దగ్గర నీతో భోజనం చేయడానికి దయ చూపించావు. కాబట్టి రాజవైన నిన్ను వేడుకోవడానికి నాకు వేరే అవసరం ఏముంటుంది?>> అన్నాడు.

29అప్పుడు రాజు <<నువ్వు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వూ, సీబా భూమిని పంచుకొమ్మని నేను ఆజ్ఞ ఇచ్చాను గదా>> అన్నాడు.30అందుకు మెఫీబోషెతు <<నా ఏలినవాడవైన నువ్వు నీ నగరానికి క్షేమంగా తిరిగి వచ్చావు గనుక అతడు అంతా తీసుకోవచ్చు>> అన్నాడు.

31గిలాదీయుడైన బర్జిల్లయి రోగెలీము నుండి యొర్దాను అవతల నుండి రాజును సాగనంపడానికి వచ్చాడు.32ఇప్పుడు బర్జిల్లయి వయసు 80 ఏళ్ళు. వయసు పైబడి బాగా ముసలివాడైపోయాడు. అతడు అత్యంత ధనవంతుడు. రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహార పదార్ధాలు పంపిస్తూ వచ్చాడు.

33రాజు <<నువ్వు నాతోకూడ నది దాటి వచ్చి యెరూషలేములో నాతో కలసి ఉండిపో. నేను నిన్ను పోషిస్తాను>> అని బర్జిల్లయితో చెప్పాడు.
34బర్జిల్లయి <<రాజువైన నీతో కలసి యెరూషలేముకు వచ్చి ఉండడానికి ఇంకా నేనెంకాలం బతకగలను?35ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి?

36రాజువైన నువ్వు నాపట్ల అంతటి మేలు చూపడానికి నేనెంతటివాణ్ణి? నీ దాసుడనైన నేను నీతో కలసి నది దాటి అవతలకు కొంచెం దూరం వస్తాను.
37నేను నా ఊరిలోనే ఉండి, చనిపోయి నా తలిదండ్రుల సమాధిలో పాతిపెట్టబడడానికి అక్కడికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు. అయ్యా, విను. నీ దాసుడు కింహాము ఇక్కడ ఉన్నాడు. నా ఏలినవాడవు, రాజువు అయిన నీతో కలసి రావడానికి అనుమతి ఇవ్వు. నీకు ఏది మంచి అనిపిస్తే అది అతడిపట్ల చెయ్యి>> అని మనవి చేశాడు.

38అప్పుడు రాజు <<కింహాము నాతో కలసి రావచ్చు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేస్తాను. ఇంకా నా వల్ల నువ్వు ఏమి కోరుతావో అంతా చేస్తాను>> అని చెప్పాడు.39అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.

40రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలుకు వచ్చాడు. యూదావారు, ఇశ్రాయేలువారిలో సగంమంది రాజును వెంటబెట్టుకుని వచ్చారు.41ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలువారు రాజు దగ్గరికి వచ్చారు. <<మా సహోదరులైన యూదావారు నిన్ను, నీ ఇంటివారిని దొంగిలించుకుని యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకు వచ్చారు?>> అని అడిగారు.

42అందుకు యూదా వారు<<రాజు మీకు సమీపబంధువు గదా, మీకు కోపం ఎందుకు? అలాగైతే మాలో ఎవరమైనా రాజు ద్వారా లాభం పొందామా? లేక మాకోసం ఏమైనా దొంగతనం చేశామా?>> అని ఇశ్రాయేలు వారితో అన్నారు.43ఇశ్రాయేలువారు <<రాజులో మాకు పది వంతులు ఉన్నాయి. దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా>> అని యూదావారితో అన్నారు.

యూదావారు ఇశ్రాయేలువారి కంటే కఠినంగా మాట్లాడారు.

Chapter 20

షెబ ఇశ్రాయేలీయులను తిరుగుబాటుకు ప్రేరేపించడం

1బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కొడుకు షెబ అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు <<ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి. దావీదులో మనకు పాలు లేదు, యెష్షయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు>> అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు.2ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కొడుకు షెబను వెంబడించారు. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకూ ఉన్న యూదావారు రాజు దగ్గరే ఉండిపోయారు.

3దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు పదిమంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు గానీ వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంత కాలం వితంతువుల వలె ఉండిపోయారు.

4తరువాత రాజు అమాశాను పిలిపించి <<మూడు రోజుల్లోగా నువ్వు యూదా వారినందరినీ సమకూర్చి నా దగ్గర హాజరు పరుచు>> అని ఆజ్ఞాపించాడు.5అమాశా యూదా వారిని సమీకరించడానికి వెళ్లిపోయాడు. అమాశా ఆలస్యం చేయడంతో అతనికిచ్చిన సమయం ముగిసిపోయింది.
6అప్పుడు దావీదు అబీషైని పిలిపించాడు. <<బిక్రి కొడుకు షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. వాడు ఎత్తయిన గోడలు గల పట్టణాల్లో దాక్కుని మనకు దొరకడేమో. కాబట్టి నీవు నా సేవకులను వెంటబెట్టుకుని వెళ్లి వాడిని తరిమి పట్టుకో>> అని ఆజ్ఞాపించాడు.7కాబట్టి యోవాబు మనుషులు, కెరేతీయులు, పెలేతీయులు, యోధులందరూ అతనితో కూడ యెరూషలేములో నుండి బిక్రి కొడుకు షెబను తరమడానికి బయలుదేరారు.

8వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరికి వచ్చినప్పుడు వారిని కలిసేందుకు అమాశా వచ్చాడు. యోవాబు తొడుక్కున్న చొక్కాకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వేలాడుతున్న వరలో కత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ వర వదులైనందువల్ల కత్తి నేలపై జారి పడింది.
9అప్పుడు యోవాబు అమాశాను చూసి <<నా సోదరా, క్షేమంగా ఉన్నావా?>> అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు.10యోవాబు చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కనుక తనను కాపాడుకోలేక పోయాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో బలంగా పొడిచాడు. కత్తి కడుపులో దిగిన వెంటనే అతని పేగులు జారి నేలపై పడడంతో ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. తరువాత యోవాబు, అతని సోదరుడు అబీషైలు బిక్రి కొడుకు షెబను తరమడానికి వెళ్ళిపోయారు.

11యోవాబు సైనికుడు ఒకడు అతని దగ్గర నిలబడి <<యోవాబును ఇష్టపడేవారు, దావీదు పక్షంలో ఉన్నవారు అంతా యోవాబును వెంబడించండి>> అని ప్రకటించాడు.12అమాశా రక్తంలో దొర్లుతూ దారి వెంట పడి ఉన్నాడు. ఆ చోటికి వచ్చినవారంతా నిలబడి చూస్తూ ఉండడం సైనికుడు చూసి, అమాశాను దారిలో నుండి పక్కన ఉన్న పొలంలోకి లాగివేసి, ఆ దారిలో నడిచేవారు ఎవ్వరూ చూడకుండా ఆ శవం మీద ఒక గుడ్డను కప్పివేశాడు.

13శవం దారిలో నుండి తీసిన తరువాత ప్రజలంతా బిక్రి కొడుకు షెబను తరమడానికి యోవాబు వెంట వెళ్ళారు.
14యోవాబు, ఇశ్రాయేలు గోత్రపువారు, ఆబేలు బేత్మయకా, బెరీయుల గోత్రాలవారి దగ్గరికి వచ్చాడు. వారంతా కలసికట్టుగా అతణ్ణి వెంబడించారు.15ఈ విధంగా వారు వచ్చి ఆబేల్బేత్మయకాలో బిక్రిని ముట్టడించారు. పట్టణ ముఖ్య ద్వారం ముందు బురుజు కట్టారు. యోవాబు మనుషులు ప్రాకారాన్ని పడగొట్టి పాడు చేయడానికి పూనుకున్నారు.

16అప్పుడు ఆబేలులో ఉన్న తెలివి గల ఒక స్త్రీ ప్రాకారపు గోడ ఎక్కి <<అయ్యలారా వినండి, నేను యోవాబుతో మాట్లాడాలి గనుక అతణ్ణి ఇక్కడకి రమ్మని చెప్పండి>> అని కేకలు వేసింది. యోవాబు ఆమె దగ్గరికి వచ్చాడు.
17అప్పుడు ఆమె <<యోవాబువు నువ్వేనా?>> అని అతణ్ణి అడిగింది. అతడు <<నేనే>> అని జవాబిచ్చాడు.

అప్పుడామె <<నీ దాసురాలనైన నేను నీతో మాట్లాడవచ్చా?>> అని అడిగినప్పుడు, అతడు <<మాట్లాడవచ్చు>> అన్నాడు.

18ఆమె <<పూర్వకాలంలో ప్రజలు <సమస్య ఏదైనా ఉంటే ఆబేలులో పరిష్కరించుకోవాలి> అని చెప్పుకునేవారు. ఆ విధంగా చేసి తమ సమస్యలు తీర్చుకొనేవారు.19నేను ఇశ్రాయేలు గోత్రంలో నెమ్మదస్తురాలు, నిజాయితీ పరురాలు అని పేరు పొందిన దాన్ని. ఇశ్రాయేలీయుల పట్టణాల్లో ముఖ్యమైన ఒక పట్టణాన్ని నాశనం చేయాలని నువ్వు తలపెడుతున్నావు. అలా చేసి యెహోవా సంపదను నువ్వెందుకు నిర్మూలం చేస్తావు?>> అని అడిగింది.

20అందుకు యోవాబు <<నిర్మూలం చెయ్యను, అలా చేయడం నాకు దూరమవుతుంది గాక. అసలు సంగతి అది కానే కాదు.21బిక్రి కొడుకు షెబ అనే ఒక ఎఫ్రాయిము గోత్రంవాడు రాజైన దావీదు పట్ల ద్రోహం చేశాడు. మీరు వాణ్ణి మాత్రం మాకు అప్పగించండి. వెంటనే నేను ఈ పట్టణం విడిచి వెళ్ళిపోతాము>> అని చెప్పాడు. ఆమె యోవాబుతో <<అయ్యా, అలాగే, వాడి తల ప్రాకారపు గోడపై నుండి పడవేస్తాం>> అని చెప్పి లోపలికి వెళ్లి,22తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలను అక్కడి ప్రజలందరికీ చెప్పినప్పుడు వారు బిక్రి కొడుకు షెబ తల నరికి గోడపై నుండి యోవాబు ముందు పడవేశారు. అప్పుడు యోవాబు బాకా ఊదించాడు. ప్రజలంతా ఆ పట్టణాన్ని విడిచి ఎవరి నివాసాలకు వారు బయలుదేరారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు.

23ఇశ్రాయేలు సైన్యం అంతటికీ యోవాబు అధికారిగా నియామకం అయ్యాడు. కెరేతీయులకు, పెలేతీయులకు యెహోయాదా కొడుకు బెనాయా అధిపతిగా ఉన్నాడు.24పన్నువసూలు చేసే పనివారి మీద అదోరాము,25రాజ్యపు దస్తావేజులు, పత్రాల మీద అహీలూదు కొడుకు యెహోషాపాతు అధికారులుగా నియామకమయ్యారు. షెవా ప్రధానమంత్రి.26సాదోకు, అబ్యాతారు యాజక వృత్తి నిర్వహించే వారు. యాయీరీయుడైన ఈరా దావీదుకు ముఖ్య సలహాదారు.

Chapter 21

గిబియోనీయులకు దావీదు ప్రత్యుపకారం

1దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. <<సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.>>

2గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. వారు అమోరీయుల్లో మిగిలిపోయిన వారు. సౌలు రాజు కాక ముందు ఇశ్రాయేలీయులు <<మిమ్మల్ని చంపం>> అని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలు, యూదా వారిపట్ల అమితమైన ఆసక్తి కనపరచి గిబియోనీయులను హతం చేస్తూ వచ్చాడు.

3దావీదు గిబియోనీయులను పిలిపించి <<మీరు యెహోవా సొత్తును దీవించడానికి మా దోషం తొలగిపోయేందుకు పరిహారంగా నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు?>> అని అడిగాడు.
4గిబియోనీయులు <<సౌలు అతని ఇంటి వారు చేసినదాన్ని బట్టి పరిహారం చేయడానికి వెండి, బంగారాలు గానీ, ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపాలని గానీ మేము కోరుకోవడం లేదు>> అన్నారు. అప్పుడు దావీదు <<మీరేమి కోరుకున్నా అది మీకు చేస్తాను>> అన్నాడు.

5వారు <<ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించినవాడి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించు.6యెహోవా నియమించిన సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సన్నిధానంలో మేము వారిని ఉరితీస్తాం>> అని రాజును కోరారు. అప్పుడు రాజు <<నేను వారిని మీకు అప్పగిస్తాను>> అన్నాడు.

7అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక,8అయ్యా కుమార్తె రిస్పా ద్వారా సౌలుకు పుట్టిన యిద్దరు కొడుకులు అర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మెరాబుకు మెహూలతీయుడైన బర్జిల్లయి కొడుకు అద్రీయేలు ద్వారా పుట్టిన ఐదుగురు కొడుకులను తీసుకువచ్చి గిబియోనీయులకు అప్పగించాడు.

9వారు ఈ ఏడుగురిని తీసుకువెళ్ళి యెహోవా సన్నిధానంలో కొండ మీద ఏడుగురినీ ఒకే విధంగా ఉరితీశారు. యవల పంట కోతకాలం ఆరంభంలో వారు చనిపోయారు.
10అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.

11సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది.
12కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు.13కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు.

14సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు.
ఫిలిష్తీయుల మీద విజయాలు

15ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు.

16అక్కడ రెఫాయీయుల సంతానం వాడైన ఇష్బిబేనోబ అనేవాడు కొత్తగా చేసిన కత్తి, మూడున్నర కిలోల బరువున్న ఇత్తడి ఈటె పట్టుకుని <<నేను దావీదును చంపుతాను>> అని చెబుతూ వచ్చాడు.17సెరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు <<ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు>> అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు.

18ఆ తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతానం వాడైన సఫును చంపాడు.19గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగినప్పుడు అక్కడ బేత్లెహేము నివాసి యహరేయోరెగీము కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. వాడి చేతిలో ఉన్న ఈటె నేతగాని అడ్డకర్ర అంత పెద్దది.

20మరొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ బాగా పొడవైనవాడు ఒకడు ఉన్నాడు. వాడి చేతులకు, కాళ్ళకు ఆరు వేళ్ళు చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతానం వాడు.21వాడు ఇశ్రాయేలీయులను దూషిస్తున్నప్పుడు దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యోనాతాను వాణ్ణి చంపివేశాడు.22గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన ఈ నలుగురినీ దావీదు, అతని సేవకులు హతం చేశారు.

Chapter 22

దావీదు స్తుతిగీతం

1యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు,

అతడిలా ప్రార్థించాడు.

2యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.
3నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను.
నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం.
హింస నుండి నన్ను కాపాడేవాడు.
4స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను.
నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.
5మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి.
భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.
6పాతాళ1 పాశాలు నన్ను కట్టి వేశాయి.
మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.
7నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను.
నా దేవునికి విన్నవించుకున్నాను.
ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు.
నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
8అప్పుడు భూమి కంపించింది. అదిరింది.
పరమండలపు పునాదులు వణికాయి.
ఆయన కోపానికి అవి కంపించాయి.
9ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది.
ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి.
అవి నిప్పు కణాలను రగిల్చాయి.
10ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు
ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.
11ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు.
గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.
12అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు.
దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.
13ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.
14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు.
సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.
15తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు.
ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.
16యెహోవా యుధ్ధ ధ్వనికి
ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి
భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.
17పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు.
నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.
18బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి,
నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.
19విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు.
కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.
20యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు.
నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.
21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు.
నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.
22ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను.
నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.
23ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి.
ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.
24ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను.
పాపానికి దూరంగా ఉన్నాను.
25నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు
తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.
26నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు.
యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.
27నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు.
వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.
28యాతన పడే వారిని రక్షిస్తావు
గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.
29యెహోవా, నీవు నాకు దీపం.
యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.
30నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను2 .
నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.
31దేవుని మార్గం పరిపూర్ణం
యెహోవా వాక్కు నిర్మలం
ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.
32యెహోవా తప్ప దేవుడేడి?
మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
33దేవుడు నాకు బలమైన కోట.
ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.
34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు.
పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
35నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే
నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.
36నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు.
నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.
37నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు.
అందువల్ల నా కాళ్ళు జారవు.
38నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను.
వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.
39నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు.
వారు నా కాళ్ళ కింద ఉన్నారు.
40నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు.
నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.
41నా శత్రువుల మెడలను నా ముందు వంచావు.
నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.
42వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు.
వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.
43నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను.
వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
44నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు.
ప్రజల అధికారిగా నన్ను నిలిపావు.
నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.
45పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు.
వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.
46అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.
47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి.
నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.
48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు
జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
49ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు.
నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు.
హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.
50కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.
51తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు.
తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.


1 22:6 పాతాళ చనిపోయిన వారి ప్రదేశం
2 22:30 అధిగమిస్తాను అణిచివేస్తాను

Chapter 23

దావీదు చివరి మాటలు

1దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.

2<<యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
3ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
4అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
5నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
6ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
7ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.>>
దావీదు యోధులు

8దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.

9ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి10అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.

11ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.12అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.

13ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.14దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
15దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ <<బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!>> అన్నాడు.16ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి <<యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.17వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం>> అని చెప్పి తాగడానికి నిరాకరించాడు.

ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.

18సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.19ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.

20కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.21ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
22ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.23ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.

24ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,26పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,27అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,

29నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,30పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,31అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,32షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,

33హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,34మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,35కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,36సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,39హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.

Chapter 24

ఇశ్రాయేలీయులవారి, యూదావారి, జనాభా లెక్కలు

1యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. <<వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో>> అని అదేశించాడు.2అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు <<యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు>> అని ఆజ్ఞాపించాడు.

3అందుకు యోవాబు <<నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?>> అన్నాడు.4అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు.

5వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు.6అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.7అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు.

8ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు.9అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.

10జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో <<నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి>> అన్నాడు.

11తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై,12<<నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. <మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.> >>

13కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. <<నీవు నీ దేశంలో మూడేళ్ళు1 కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు>> అన్నాడు.14అందుకు దావీదు <<గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము>> అని గాదుతో అన్నాడు.

15కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు.16దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు <<ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో>> అని ఆజ్ఞ ఇచ్చాడు.

ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు.

17ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. <<పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.>>
దావీదు బలిపీఠం కట్టించడం

18ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి <<నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు>> అని అతనితో చెప్పాడు.19దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు.20రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి <<నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?>> అని అడిగాడు.
21దావీదు <<ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది>> అన్నాడు.

22అందుకు అరౌనా<<నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి.23రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను>> అన్నాడు. <<నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక>> అని రాజుతో అన్నాడు.

24రాజు <<నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను>> అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు.

25అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.


1 24:13 మూడేళ్ళు ఏడేళ్ళు

1 రాజులు

Chapter 1

అదోనియా రాజ్యకాంక్ష

1దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. వారు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెచ్చదనం కలగడం లేదు.2కాబట్టి వారు అతనితో <<మా యజమాని, రాజు అయిన నీ కోసం మంచి యవ్వనంలో ఉన్న కన్యను వెతకడం మంచిది. ఆమె నీ దగ్గర ఉండి నిన్ను కనిపెట్టుకుని నీకు వెచ్చదనం కలిగించడానికి నీ కౌగిలిలో పడుకుంటుంది>> అని చెప్పారు.

3ఇశ్రాయేలు దేశం అంతటా వెతికి, షూనేము గ్రామానికి చెందిన అబీషగు అనే యువతిని చూసి ఆమెను రాజు దగ్గరికి తీసుకు వచ్చారు.4ఆమె చూడ చక్కనిది. ఆమె రాజును కనిపెట్టుకుని పరిచర్య చేస్తున్నది గాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.

5ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి <<నేనే రాజునవుతాను>> అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలనూ గుర్రపు రౌతులనూ తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులనూ ఏర్పాటు చేసుకున్నాడు.6అతని తండ్రి దావీదు అతడు బాధ పడతాడేమోనని <<నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?>> అని ఎప్పుడూ అడగలేదు. అతడు చాలా అందగాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
7అదోనీయా సెరూయా కొడుకు యోవాబుతో, యాజకుడు అబ్యాతారుతో సమాలోచన చేశాడు. వారు అతని పక్షాన చేరి అతనికి సహాయం చేశారు.8అయితే యాజకుడు సాదోకు, యెహోయాదా కొడుకు బెనాయా, ప్రవక్త నాతాను, షిమీ, రేయీ, దావీదు అంగరక్షకులు అదోనీయాతో చేరలేదు.
9అదోనీయా ఏన్‌రోగేలు దగ్గరలోని జోహెలేతు అనే బండ దగ్గర గొర్రెలనూ ఎడ్లనూ కొవ్విన దూడలనూ బలిగా అర్పించి, రాకుమారులైన తన సోదరులందరినీ, యూదావారైన రాజు సేవకులందరినీ పిలిపించాడు.10అయితే అతడు నాతాను ప్రవక్తనూ బెనాయానూ దావీదు శూరులనూ తన సోదరుడు సొలొమోనునూ పిలవలేదు.

11అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబతో ఇలా చెప్పాడు. <<హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు.12కాబట్టి నీ ప్రాణాన్ని, నీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని రక్షించుకోడానికి నేను నీకొక ఆలోచన చెబుతాను విను.
13నీవు దావీదు రాజు దగ్గరకి వెళ్ళి, <నా యేలినవాడా, రాజా, నీ కొడుకు సొలొమోను నా తరువాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడని నీ సేవకురాలినైన నాకు నీవు ప్రమాణం చేశావే, మరి ఇదేంటి, అదోనీయా ఏలుతున్నాడు?> అని అడుగు.14రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను.>>

15కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు దగ్గరికి వచ్చింది. చాలా ముసలివాడైన రాజుకి షూనేమీయురాలు అబీషగు పరిచర్య చేస్తూ ఉంది.16బత్షెబ వచ్చి రాజు ముందు సాగిలపడి నమస్కారం చేసింది. రాజు <<నీకేమి కావాలి?>> అని అడిగాడు. అందుకు ఆమె ఇలా మనవి చేసింది.17<<నా యేలిన వాడా, నీవు <నా దేవుడైన యెహోవా తోడు, నిశ్చయంగా నీ కొడుకు సొలొమోను నా తరవాత నా సింహాసనం మీద ఆసీనుడై పాలిస్తాడు> అని నీ సేవకురాలినైన నాకు ప్రమాణం చేశావు.
18కానీ ఇప్పుడు అదోనీయా పరిపాలిస్తున్నాడు. ఈ సంగతి నా యజమానివీ, రాజువీ అయిన నీకు ఇప్పటి వరకూ తెలియలేదు.19అతడు ఎడ్లనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ, యాజకుడు అబ్యాతారునూ సైన్యాధిపతి యోవాబునూ ఆహ్వానించాడు గానీ నీ సేవకుడు సొలొమోనుని ఆహ్వానించలేదు.
20నా యజమానీ, నా రాజా, నీ తరవాత ఎవరు సింహాసనం అధిష్టిస్తారో అని ఇశ్రాయేలీయులంతా కనిపెట్టి చూస్తున్నారు.21అంతేగాక, నా యేలినవాడివీ, రాజువూ అయిన నీవు నీ పూర్వికులతో కూడ కన్ను మూసిన తరవాత నన్నూ నా కొడుకు సొలొమోనునూ వారు రాజద్రోహులుగా ఎంచుతారు.>>

22ఆమె రాజుతో మాటలాడుతూ ఉండగానే నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. <<నాతాను ప్రవక్త వచ్చాడు>> అని సేవకులు రాజుకు తెలియజేశారు.23అతడు రాజు ఎదుటకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశాడు.
24అతడు <<నా యజమానీ, రాజా! అదోనీయా నీ తరవాత నీ సింహాసనమెక్కి రాజ్యాన్ని పాలిస్తాడని నీవు చెప్పావా?25ఎందుకంటే, ఈ రోజు అతడు అసంఖ్యాకంగా ఎద్దులనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ సైన్యాధిపతులనూ యాజకుడు అబ్యాతారునూ పిలిచాడు. వారంతా అతని దగ్గర ఉండి అన్నపానాలు తీసుకుంటూ, <రాజైన అదోనీయా చిరంజీవి అవుతాడు గాక> అని పలుకుతున్నారు.
26అయితే నీ సేవకుడినైన నన్నూ యాజకుడు సాదోకునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నీ సేవకుడు సొలొమోనునూ అతడు పిలవలేదు.27నా యజమాని రాజు తన తరువాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడౌతాడో తన సేవకులతో చెప్పకుండానే ఇలా చేసాడా>> అని అడిగాడు.
సొలొమోను రాజుగా అభిషిక్తుడు కావడం

28దావీదు <<బత్షెబను పిలవండి>> అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది.29అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా <<అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు,30<తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరవాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు> అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను>> అని చెప్పాడు.31అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి <<నా యజమాని, రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక>> అంది.

32అప్పుడు రాజైన దావీదు <<యాజకుడు సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి పిలవండి>> అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు.33రాజు <<మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకు వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకు వెళ్ళండి.34యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, <రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి> అని ప్రకటన చేయాలి.
35తరువాత, ఇశ్రాయేలు వారి మీదా యూదా వారి మీదా నేను అతణ్ణి అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానంలో రాజవుతాడు>> అని ఆజ్ఞాపించాడు.

36అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు. <<ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక.37యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి, నా యజమానివీ రాజువీ అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక.>>
38కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకు వచ్చారు.39సాదోకు గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా <<రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి>> అని కేకలు వేశారు.40ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు.

41అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా ఆ కోలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని <<పట్టణంలో ఈ సందడి ఏమిటి?>> అని అడిగాడు.42అంతలో, యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా <<లోపలికి రా, నీవు యోగ్యుడివి. మంచి వార్తతో వస్తావు>> అన్నాడు.
43అప్పుడు యోనాతాను అదోనీయాతో <<మన యజమాని, రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు.44రాజు యాజకుడైన సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతీయులనూ పెలేతీయులనూ అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు.45యాజకుడైన సాదోకూ ప్రవక్త నాతానూ గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే.

46అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు.47పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. <దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక> అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి48<నేను బతికి ఉండగానే ఈ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కళ్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగు గాక> అన్నాడు>> అని యోనాతాను చెప్పాడు.

49అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు.50అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.51అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని <<రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి>> అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది.
52అందుకు సొలొమోను <<అతడు తనను నిర్దోషిగా కనపరచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. కాని అతడు దోషి అని తేలితే అతనికి మరణశిక్ష తప్పదు>> అని చెప్పి,53బలిపీఠం దగ్గర నుండి అతణ్ణి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినపుడు సొలొమోను అతనితో<<ఇక నీ ఇంటికి వెళ్ళు>> అన్నాడు.

Chapter 2

దావీదు చివరి పలుకులు, మరణం

1దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు,2<<మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు.3నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు.4అప్పుడు <నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు> అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.

5అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు.6అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు.
7నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు.
8ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, <యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను> అని ప్రమాణం చేశాను.9అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.>>

10ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు.11దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు.12అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.
సొలొమోను పరిపాలన ఆరంభం, దుష్ట శత్రువులను తొలిగించడం

13అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె <<శాంతంగా వస్తున్నావా?>> అని అతణ్ణి అడిగింది.

అతడు <<శాంతంగానే వస్తున్నాను>> అని చెప్పి,

14తరువాత అతడు <<నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది>>అన్నాడు.

ఆమె <<ఏమిటో చెప్పు>> అంది.

15అతడు <<రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది.
16ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు>> అన్నాడు.

17ఆమె <<చెప్పు>> అంది.

అతడు <<షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు>> అన్నాడు.

18బత్షెబ <<మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను>> అంది.

19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.

20ఆమె అతనితో <<నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు>> అంది.

రాజు <<అమ్మా, చెప్పు. నీ మాట కాదనను>> అన్నాడు.

21అప్పుడామె <<నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ>> అంది.

22అందుకు సొలొమోను <<షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా>> అని తన తల్లితో అన్నాడు.

23అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. <<యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక.
24నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు>> అన్నాడు.25అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.

26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో <<అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను>> అని చెప్పాడు.27తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది.
28యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.

29యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి <<నీవు వెళ్లి అతని మీద పడి చంపు>> అని ఆజ్ఞాపించాడు.

30బెనాయా యెహోవా గుడారానికి వచ్చి <<రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు>> అని యోవాబుతో చెప్పాడు.

అతడు <<రాను, నేనిక్కడే చనిపోతాను>> అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.

31అందుకు రాజు ఇలా అన్నాడు. <<అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి.
32నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు.33అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.>>

34కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు.35రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.

36తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. <<నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు.37నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.>>38అప్పుడు షిమీ <<మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను>> అని రాజుతో చెప్పాడు.

షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు.

39అయితే మూడు సంవత్సరాల తరవాత షిమీ పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరకి చేరారు. అప్పుడు <<నీ మనుషులు గాతులో ఉన్నారు>> అని షిమీకి వార్త వచ్చింది.40షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరకి వెళ్ళి, అక్కడి నుండి తన పనివారిని తీసుకువచ్చాడు.

41షిమీ యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది.42రాజు షిమీని పిలిపించి అతనితో <<నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి, నీచేత ప్రమాణం చేయించాను గదా? పైగా, <మీరు చెప్పిందే మంచిది> అని నీవు కూడా ఒప్పుకున్నావు.
43కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు?>> అని అడిగాడు.44<<నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పిస్తాడు.
45అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలం సుస్థిరమౌతుంది>> అని షిమీతో చెప్పి46రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది.

Chapter 3

జ్ఞనం కోసం సొలొమోను చేసిన ప్రార్థన

1తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు.2అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు.3సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు.

4ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

5గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై <<నేను నీకు ఏమి ఇవ్వాలి?>> అని అడిగాడు.
6సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు <<నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

7నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు.8నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం.9నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.>>

10సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది.11కాబట్టి దేవుడు అతనితో <<దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు.12నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.
13ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు.14నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను>> అన్నాడు.

15అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.
సొలొమోను తెలివైన తీర్పు

16ఆ తరవాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు.17వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది <<నా యజమానీ, నేనూ ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను.
18నేను కనిన తరవాత మూడో రోజు ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు.19అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు.20కాబట్టి మధ్య రాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని, చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది.
21ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరవాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను.>>

22అంతలో రెండో స్త్రీ <<అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు. చచ్చినవాడు ఆమె కొడుకు>> అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ <<కాదు, చచ్చిన వాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు>> అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు.

23అప్పుడు రాజు <<బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయిన వాడు నీ కొడుకు అని ఒకామె, కాదు, కాదు చనిపోయిన వాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది.24కాబట్టి ఒక కత్తి తీసుకు రండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు.25రాజు <<బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకూ, సగం ఆమెకూ ఇయ్యండి>> అని ఆజ్ఞాపించాడు.
26ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి, రాజుతో <<రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి>> అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ <<ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరి సగం చేయండి>> అంది.27అందుకు రాజు <<బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు. వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఆమే వాడి తల్లి>> అని తీర్పు చెప్పాడు.28అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారు.

Chapter 4

అధికారులు నియామకం

1సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.2అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,3షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.4యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.

5నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.6అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.
7ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.

8వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు,

9మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు,

10అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు.

11అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య.

12అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది.

13గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం.

14ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా
15నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.

16ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు.

17ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.

18బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.

19గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి.

20అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.21నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు.
సొలొమోను గృహ భోజన సామగ్రి

22రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1,200 తూముల ముతక పిండి,23పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
24యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.25సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.

26సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.27సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.28రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.
సొలొమోను గొప్ప జ్ఞనం

29దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.30అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.31అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.
32అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.

33లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.34అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.

Chapter 5

దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు

1తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు.2అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు.

3<<యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి.
4తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు.5కాబట్టి <నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు> అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను.

6లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా.
7మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను>> అన్నాడు.

హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి <<ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక>> అన్నాడు.

8అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ <<నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను.
9నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు>> అన్నాడు.

10హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానులను పంపించాడు.11సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4,16,350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.

12యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము, సొలొమోను సంధి చేసుకున్నారు, వారిద్దరి మధ్య శాంతి నెలకొంది.

13సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు.14అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు.
15అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.

16వీరంతా కాక సొలొమోను పనివారిపై 3,300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు.
17రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి, చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు.18ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పకారులు, గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు.

Chapter 6

సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు

1ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్‌ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.2సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.

3పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.4అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.

5మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.6కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.

7అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు.8మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.
9ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు.10మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.

11అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.12<<ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను.13ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.>>

14ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.15అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.
16మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు.17అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.

18మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.
19యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.20అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.

21ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.22ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.

23అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు.24ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు.25రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి.26ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.

27అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి.28ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.

29మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు.30లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.

31అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి.32రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు.
33పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.

34రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.35వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.
36లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.

37నాలుగో సంవత్సరం జీప్‌ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు.38పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.

Chapter 7

సొలొమోను రాజ గృహం కట్టించడం పూర్తి

1సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు.2అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.

3పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి.4మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి.5తలుపుల, కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. మూడు వరసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.

6అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు, మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి.

7తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకూ దేవదారు కర్రతో కప్పారు.
8సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు.

9ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి.10దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది.
11పై భాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్లు, దేవదారు కర్రలు ఉన్నాయి.

12ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరంలోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు.
దేవాలయ పరికరాలు

13సొలొమోను రాజు తూరు పట్టణం నుండి హీరామును పిలిపించాడు.14ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు.

15ఎలాగంటే, అతడు రెండు ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టు కొలత ఉంది.16స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో రెండు పీటలు పోత పోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు.17స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేసారు. గొలుసు పని దండలు పోత పోసి ఉంది. అవి ఒక్కో పీటకి ఏడేసి ఉన్నాయి.

18ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాడు. రెండు పీటలకీ అతడు అదే విధంగా చేశాడు.19స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి.
20ఆ రెండు స్తంభాల మీద ఉన్న పీటలమీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి.

21ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడి పక్కన ఉన్న స్తంభానికి <<యాకీను>> అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి <<బోయజు>> అని పేరు పెట్టాడు.22ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది.

23హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు.24దాని పై అంచుకు కింద, చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరసలుగా పోత పోశారు.

25ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి.26సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు1 నీరు పడుతుంది.

27హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి.28ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు.29చట్రాల మధ్యలో ఉన్న పక్క పలకల మీదా చట్రాల మీదా సింహాల, ఎద్దుల, కెరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కిందా ఎద్దుల కిందా వేలాడుతున్న పూదండలు ఉన్నాయి.

30ప్రతి స్తంభానికీ నాలుగేసి ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతిపీఠం నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గరా పోత పోశారు.31పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు మూరెడు. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి మూరన్నర వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి.
32పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం మూరన్నర వెడల్పు ఉన్నాయి.

33ఈ చక్రాల పని రథ చక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులూ అంచులూ అడ్డకర్రలూ నడిమి భాగాలూ పోత పనితో చేశారు.
34ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు.35పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతలూ పక్క పలకలూ దానితో కలిసిపోయి ఉన్నాయి.
36దాని మోతల పలకల మీదా దాని పక్క పలకల మీదా, హీరాము కెరూబులనూ సింహాలనూ తమాల వృక్షాలనూ ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు.37ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత, పరిమాణం, రూపం ఒకేలా ఉన్నాయి.

38తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు.39మందిరం కుడి పక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్థంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు.
40హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు.

41రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి.
42ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ4310 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ
44ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ,45బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు.

46యొర్దాను మైదానంలో సుక్కోతు, సారెతానుల మధ్య ఉన్న బంక మట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు.47అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి వీల్లేకుండా పోయింది.

48సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామగ్రిని కూడా చేయించాడు. అవేవంటే, బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు,49గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు.
50అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం తలుపులు, ఆలయం హాలు తలుపులు, వాటి బంగారు బందులు, వీటన్నిటినీ చేయించాడు.

51ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.


1 7:26 44 కిలో లీటర్లు 44,000 కిలో లీటర్లు

Chapter 8

మందసాన్ని దేవాలయానికి తీసుకోని రావడం

1తరవాత సీయోను అనే దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు రావడానికి సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పెద్దలనూ గోత్రాల నాయకులనూ, అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలను యెరూషలేములో తన దగ్గరకి పిలిపించాడు.2కాబట్టి ఇశ్రాయేలీయులంతా ఏతనీము అనే ఏడో నెలలో పండగ కాలంలో సొలొమోను రాజు దగ్గర సమావేశమయ్యారు.

3ఇశ్రాయేలీయుల పెద్దలంతా వచ్చినప్పుడు యాజకులు యెహోవా మందసాన్ని పైకెత్తుకున్నారు.4ప్రత్యక్ష గుడారాన్ని, గుడారంలో ఉన్న పరిశుద్ధ సామగ్రిని యాజకులు, లేవీయులు తీసుకు వచ్చారు.

5సొలొమోను రాజు, అతని దగ్గర సమావేశమైన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ఎదుట నిలబడి, లెక్క పెట్టలేనన్ని గొర్రెలనూ ఎద్దులనూ బలిగా అర్పించారు.
6యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దాని స్థలంలో, అంటే మందిరం గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలం లో, కెరూబుల రెక్కల కింద ఉంచారు.7కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపుకుని ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని మోత కర్రలనీ కమ్ముకుని ఉన్నాయి.8ఆ మోత కర్రల కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలం లోకి కనబడేటంత పొడవుగా ఉన్నప్పటికీ అవి బయటికి కనబడలేదు. అవి ఈ రోజు వరకూ అక్కడే ఉన్నాయి.

9ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరవాత యెహోవా వారితో నిబంధన చేసినపుడు హోరేబులో మోషే ఆ పలకలను మందసంలో ఉంచాడు. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరేమీ లేవు.10యాజకులు పరిశుద్ధ స్థలం లో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది.11కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడ లేకపోయారు.
12సొలొమోను దాన్ని చూసి,
<<గాఢాంధకారంలో నేను నివాసం చేస్తానని యెహోవా చెప్పాడు.
13అయితే నేను ఒక గొప్ప మందిరం కట్టించాను, నీవు ఎల్లకాలం నివసించడానికి నేనొక స్థలం ఏర్పాటు చేశాను>> అన్నాడు.

14తరవాత అతడు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలబడి ఉండగా వారిని ఈ విధంగా దీవించాడు,15<<నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక.16<నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుండి నా నామం నిలిచి ఉండేలా ఇశ్రాయేలీయుల గోత్రాలకు చెందిన ఏ పట్టణంలో నైనా మందిరం కట్టించాలని నేను కోరలేదు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజ్యపాలన చేయడానికి దావీదును ఎన్నుకున్నాను> అని ఆయన ప్రకటించాడు.
17ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలని నా తండ్రి అయిన దావీదు కోరుకున్నాడు.

18కాని యెహోవా నా తండ్రి అయిన దావీదుతో చెప్పిందేమంటే, <నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నీవు కోరుకున్నావు. నీ కోరిక మంచిదే.19అయినా మందిరాన్ని నీవు కట్టించకూడదు. నీ కడుపులో నుండి పుట్టబోయే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఆ మందిరాన్ని కట్టిస్తాడు.>

20ఆయన చెప్పిన మాట యెహోవా నెరవేర్చాడు. నేను నా తండ్రి అయిన దావీదు స్థానంలో నియామకం పొంది, యెహోవా వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీయుల మీద రాజునై, వారి దేవుడు యెహోవా నామ ఘనత కోసం మందిరాన్ని కట్టించాను.21అందులో యెహోవా నిబంధన మందసానికి స్థలం ఏర్పాటు చేశాను. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పూర్వీకులను రప్పించినప్పుడు ఆయన వారితో చేసిన నిబంధన అందులోనే ఉంది.>>
సొలొమోను ప్రతిష్ట ప్రార్థన

22ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇలా అన్నాడు,23<<యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, పైన ఉన్న ఆకాశంలో, కింద ఉన్న భూమిపై నీలాంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచే నీ దాసుల విషయంలో నీవు నీ నిబంధనను నెరవేరుస్తూ కనికరం చూపుతూ ఉంటావు.24నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి, నీవిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చావు.
25యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, <నీవు ఏవిధంగా నా ఎదుట నడుచుకున్నావో అదే విధంగా నీ సంతానం మంచి నడవడి కలిగి, నా ఎదుట నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ కుటుంబంలో ఉండక మానడు> అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు నీ వాగ్దానాన్ని స్థిరపరచు.26ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి.

27వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది?28అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు.
29నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా <నా నామం అక్కడ ఉంటుంది> అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక.30నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.

31ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు,32నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు.
33నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకుని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు34నీవు ఆకాశం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు.

35వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,36నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు.

37దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,38నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే
39ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి40మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.

41నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి42నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే43నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.

44నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,45ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.

46పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,47వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, <మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము> అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
48వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,
49నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు.

50నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.
51వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు.52కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.53ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.>>

54సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు.55అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,56<<తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.

57కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి58తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక.
59ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక.

60అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు.61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉండుగాక.>>
దేవాలయ ప్రతిష్ట, అర్పణలు

62అప్పుడు రాజు, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా యెహోవా సన్నిధిలో బలులు అర్పిస్తుండగా63సొలొమోను 22,000 ఎద్దులను, 1,20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు.
64ఆ రోజు ఆ దహనబలులు, నైవేద్యాలు, సమాధాన బలి పశువుల కొవ్వుని అర్పించడానికి యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠం సరిపోలేదు. కాబట్టి రాజు యెహోవా మందిరం ఎదుట ఉన్న ఆవరణ మధ్య ఉన్న స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు నైవేద్యాలు, సమాధానబలి పశువుల కొవ్వు అర్పించాడు.

65ఆ సమయంలో సొలొమోను, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా హమాతు పట్టంకు పోయే దారి మొదలు ఐగుప్తు నది వరకూ ఉన్న ప్రాంతాలన్నిటి నుండి వచ్చిన ఆ మహా జన సమూహం రెండు వారాలు, అంటే 14 రోజులు యెహోవా సన్నిధిలో పండగ చేశారు.66ఎనిమిదో రోజు అతడు ప్రజలను అనుమతించగా వారు రాజును ప్రశంసించి యెహోవా తన దాసుడైన దావీదుకూ తన ప్రజలైన ఇశ్రాయేలీయులకూ చేసిన మేళ్లను బట్టి సంతోషిస్తూ ఆనంద భరితులై తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు.

Chapter 9

యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమవడం

1సొలొమోను యెహోవా మందిరం, రాజగృహాల నిర్మాణం, తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరవాత,2యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు.

3యెహోవా అతనితో ఇలా అన్నాడు. <<నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.
4నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలనూ, విధులనూ పాటిస్తే,5<నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు> అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.

6అయితే మీరు గాని, మీ సంతానం గాని నానుండి తొలగిపోయి, నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే,7నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.

8ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, <అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?> అని అడుగుతారు.9అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, <వారు ఐగుప్తు దేశం నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారి పైకి రప్పించాడు.> >>
సొలొమోను సాధించిన ఇతర పనులు

10సొలొమోను యెహోవా మందిరం, రాజగృహం, రెంటినీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత దేవదారు, సరళ వృక్షపు కలపను, బంగారాన్నీ అతనికి ఇచ్చాడు.11కాబట్టి సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
12హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు.13కాబట్టి అతడు <<సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాటివి>> అన్నాడు. హీరాము అ ప్రదేశాన్ని కాబూల్1 అన్నాడు. ఈ రోజు వరకూ వాటికి <<కాబూల్‌>> అని పేరు.14హీరాము నాలుగు టన్నుల2 బంగారాన్ని రాజుకు పంపించాడు.

15యెహోవా మందిరాన్ని, తన స్వంత రాజగృహాన్ని, మిల్లోను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు అనే పట్టణాలను కట్టించడానికి సొలొమోను వెట్టిపనివారిని పెట్టాడు.16అంతకుముందు ఐగుప్తు రాజు ఫరో గెజెరు పైకి దండెత్తి దాన్ని పట్టుకుని, అగ్నితో కాల్చి ఆ పట్టణంలోని కనానీయులను హతమార్చాడు. అతడు తన కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు.

17సొలొమోను గెజెరును తిరిగి కట్టించాడు. కింద ఉన్న బేత్‌ హోరోనును,18బయతాతు, అరణ్యంలో ఉన్న తద్మోరు పట్టణాలను,19సొలొమోను భోజన పదార్థాలను నిల్వ చేయడానికి, రథాల కోసం, రౌతుల కోసం పట్టణాలను కట్టించాడు. ఇవి గాక అతడు యెరూషలేములో, లెబానోనులో, తన పాలన కింద ఉన్న దేశమంతటిలో తాను వేటిని కట్టాలని కోరుకున్నాడో వాటన్నిటినీ కట్టించాడు.

20అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో సంబంధంలేని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, అనే జాతుల్లో కొందరు మిగిలి ఉన్నారు.21ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా నశింపజేయలేక పోయారు. మిగిలి ఉన్న ఆ జాతుల ప్రజలను సొలొమోను బానిసలుగా నియమించాడు. ఈ రోజు వరకూ వారు అలాగే ఉన్నారు.
22అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా తన రథాలకు, రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు.

23సొలొమోను చేయించిన పనిని అజమాయిషీ చేయడానికి ఉన్న ముఖ్య అధికారులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు.
24ఫరో కూతురు దావీదుపురం నుండి సొలొమోను తన కోసం కట్టించిన రాజగృహానికి వచ్చిన తరువాత అతడు మిల్లోను కట్టించాడు.
25సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, శాంతి బలులు అర్పిస్తూ, యెహోవా సన్నిధిలో ఉన్న వేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు మందిరాన్ని కట్టడం పూర్తి చేశాడు.

26సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు.27హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతోబాటు ఓడల మీద పంపించాడు.28వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.


1 9:13 కాబూల్ పనికిరాని
2 9:14 నాలుగు టన్నుల సుమారు 4,000 కిలోలు

Chapter 10

సొలొమోను షేబదేశపు రాణి సందర్శన (2 దిన. 9: 1 - 12)

1షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది.2ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.

3ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికి సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు.4షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని,5అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు.

6ఆమె రాజుతో ఇలా అంది. <<నీవు చేసిన పనుల గురించీ నీ జ్ఞానం గురించీ నా దేశంలో నేను విన్న మాట నిజమే.7కానీ నేను వచ్చి నా కళ్ళారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్నదానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి.

8నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు!9నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.>>

10షేబ దేశపు రాణి సొలొమోనుకు సుమారు నాలుగున్నర వేల బంగారం, బహు విస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు.
11ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు అక్కడి నుండి గంధం చెక్క, రత్నాలు, ఎంతో విస్తారంగా తెచ్చాయి.12ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలూ, గాయకులకు సితారాలూ స్వరమండలాలూ చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా.
13సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా, దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది.
సొలొమోను వైభవం (2 దిన. 1: 14 - 17; 9: 13-28)

14సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు.15ఇది గాక, వర్తకులూ, అరబి రాజులూ, దేశాధికారులూ అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు.
16సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలు మూడున్నర కిలోల బంగారంతో చేశారు.17రేకులుగా కొట్టిన బంగారంతో అతడు 300 చిన్న డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు దగ్గరగా రొండు కిలోల బంగారం వాడారు. రాజు వీటిని లెబానోను అరణ్య రాజగృహంలో ఉంచాడు.

18రాజు ఒక పెద్ద దంతపు సింహాసనం చేయించి దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు.19ఈ సింహానానికి 6 మెట్లున్నాయి. సింహాసనం పైభాగం వెనక వైపు గుండ్రంగా ఉంది. ఆసనానికి ఇరుపక్కలా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలు నిలిచి ఉన్నాయి.20ఆరు మెట్లకూ రెండు వైపులా పన్నెండు సింహాలు నిలిచి ఉన్నాయి. అలాటి సింహాసనాన్ని మరే రాజ్యంలో ఎవరూ చేసి ఉండలేదు.

21సొలొమోను రాజు పానపాత్రలు బంగారపువి. లెబానోను అరణ్య మందిరంలోని పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను రోజుల్లో వెండికి విలువ లేదు.22సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతోబాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకు వస్తుండేవి.
23ఈ విధంగా సొలొమోను రాజు ఐశ్వర్యం, జ్ఞానం విషయాల్లో భూరాజులందరినీ అధిగమించాడు.24అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానపు మాటలను వినడానికి లోకప్రజలంతా అతని చెంతకు రావాలని ఆశించారు.25అతనిని కలిసిన ప్రతి వ్యక్తీ కానుకగా వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు, ప్రతి సంవత్సరం తెచ్చేవాడు.

26సొలొమోను రథాలను రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపురౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లోఉంచాడు. కొన్నింటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు.27రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు.

28ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు.29వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి ఒకటిన్నర కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ అరాము రాజులకూ తగిన ధరకు అమ్మారు.

Chapter 11

సొలొమోను భార్యలూ

1సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను అంటే ఫరో కూతుర్నిమాత్రమే గాక మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్ళిచేసుకున్నాడు.2<<ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.>>అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు.

3అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.4సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు.

5సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు.6ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు.
7సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు.8తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు.

9ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి రెండు సార్లు ప్రత్యక్షమై,10నీవు ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించనందుకు ఆయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు.
11<<నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు ఆచరించడం లేదు. కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండాా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను.12అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలోనుండి దాన్ని తీసివేస్తాను.13రాజ్యమంతా తీసివేయను. నా దాసుడు దావీదు కోసం, నేను కోరుకొన్న యెరూషలేము కోసం ఒక్క గోత్రం నీ కొడుక్కి ఇస్తాను.>>
సొలొమోను విరోధులు

14యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.15గతంలో దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే, హతమైన వాళ్ళను పాతిపెట్టించడానికి సైన్యాధిపతి యోవాబు వెళ్ళాడు.16ఎదోములోని మగవారందరినీ చంపేసే వరకూ ఇశ్రాయేలీయులందరితో పాటు యోవాబు ఆరు నెలలు అక్కడే ఉన్నాడు.17అప్పుడు హదదు చిన్నవాడు. అతడూ అతనితో పాటు అతని తండ్రి సేవకుల్లో కొంతమంది ఎదోమీయులూ ఐగుప్తు దేశానికి పారిపోయారు.

18వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలు దేరి పారాను ప్రాంతానికి వచ్చి, అక్కడినుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు.19హదదు ఫరో దృష్టిలో చాలా మెప్పు పొందాడు. ఫరో తన భార్య తహపనేసు సోదరిని అతనికిచ్చి పెళ్లి చేసాడు.
20ఈ తహపనేసు సోదరి హదదుకు గెనుబతు అనే కొడుకుని కన్నది. ఫరో ఇంట్లో తహపనేసు ఇతన్ని పెంచింది, కాబట్టి గెనుబతు ఫరో అంతఃపురంలోనే ఫరో పిల్లలతోపాటు పెరిగాడు.

21దావీదు తన పుర్వికులతో కన్నుమూశాడని, అతని సైన్యాధిపతి యోవాబు చనిపోయాడని ఐగుప్తు దేశంలో హదదు విన్నాడు. అతడు <<నేను నా స్వదేశానికి వెళ్లడానికి సెలవివ్వండి>> అని ఫరోతో మనవి చేశాడు.22ఫరో <<నీవు నీ స్వదేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాదగ్గర నీకేం తక్కువయింది?>> అని అడిగాడు. అందుకు హదదు <<నాకేమీ తక్కువ కాలేదు, కానీ మీరు నన్ను తప్పక వెళ్లనివ్వండి>> అన్నాడు.

23దేవుడు సొలోమోను మీదికి ఎల్యాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. ఇతడు సోబా రాజు హదదెజరు అనే తన యజమాని దగ్గరనుండి పారిపోయినవాడు.24దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు.25హదదు చేసిన ఈ కీడే గాక సొలొమోను బతికిన రోజులన్నీ రెజోను ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులను ద్వేషించాడు. ఇతడు అరాము దేశాన్ని పాలించాడు.
సొలొమోను పైన యరొబాము తిరుగుబాటు

26సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు.27ఇతడు రాజు మీదికి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు.
28యరొబాము మహా బలశాలి. యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి, యోసేపు వంశం వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు.29ఆ సమయంలో యరొబాము యెరూషలేములోనుండి బయటికి వెళ్ళగా షిలోనీయుడూ ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్తబట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరు తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు.

30అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి పన్నెండు ముక్కలు చేసి, యరొబాముతో ఇలా అన్నాడు. <<ఈ పది ముక్కలు నీవు తీసుకో.
31ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే ప్రజలు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయాబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు.32సొలొమోను తండ్రి దావీదు లాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు. నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు. నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు. కాబట్టి సొలొమోను చేతిలోనుండి రాజ్యాన్ని తీసేసి పది గోత్రాలను నీకిస్తాను.33అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను.

34రాజ్యాన్ని సొలోమోను చేతిలోనుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకుని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను.35అయితే అతని కొడుకు చేతిలోనుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు పది గోత్రాలు ఇస్తాను.36నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదు కోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను.

37నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు.38నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్లు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని, నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు ఇస్తాను.39నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గానీ ఎల్లకాలం అలా చేయను.>>

40సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి, ఐగుప్తు రాజు షీషకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకూ ఐగుప్తులోనే ఉన్నాడు.
సొలొమోను మరణం (2 దిన. 9: 29-30)

41సొలొమోను గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా అతని జ్ఞానం గురించి, సొలొమోను చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.42సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ పాలించిన కాలం 40 ఏళ్ళు.43సొలొమోను చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని తండ్రి దావీదు పురంలో అతన్ని పాతిపెట్టారు. తరువాత అతని కొడుకు రెహబాము అతనికి బదులు రాజయ్యాడు.

Chapter 12

ఇశ్రాయేలువారు రెహబాము రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు (2 దిన. 10:1-11: 4)

1రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు.2నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు.

3ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు.4<<మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.>>

5అందుకు రాజు <<మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి>> అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు.
6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి <<ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?>> అని వారిని అడిగాడు.7వారు <<ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు>> అన్నారు.

8అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని9<<మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?>> అని ప్రశ్నించాడు.
10అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. <<నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది.11మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.>>

12<<మూడో రోజు నా దగ్గరికి రండి>> అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు.13అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు.14<<మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.>>

15ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు.
16కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు:
<<దావీదు వంశంతో మాకేం సంబంధం?
యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది?
ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి.
దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.>>

ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.

17అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.

18తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు.19ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.

20యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు.
21రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1,80,000 మందిని సమకూర్చాడు.

22కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు.23<<నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు,24యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.>> కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.
బేతేలు, దానులో బంగారు దూడలు

25తరువాత యరొబాము ఎఫ్రాయిము కొండప్రాంతంలో షెకెము అనే పట్టణాన్ని కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుంచి వెళ్లి పెనూయేలును కట్టించాడు.26యరొబాము ఇలా అనుకున్నాడు. <<ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది.27అప్పుడు వారు నన్ను చంపి మళ్ళీ యూదా రాజు రెహబాము పక్షం చేరతారు. రాజ్యం మళ్ళీ దావీదు సంతానం వారిది అవుతుంది>>
28యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి <<యెరూషలేము వెళ్ళడం మీకు చాలా కష్టం.29ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే>> అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు.30కాబట్టి ఈ పని దోషం అయింది. ఈ రెంటిలో ఒకదాన్ని పూజించడానికి ప్రజలు దాను వరకూ వెళ్ళసాగారు.
31అతడు ఉన్నత స్థలాల్లో మందిరాలను ఏర్పరచాడు. లేవీయులు కాని సాధారణమైన వారు కొందరిని యాజకులుగా నియమించాడు.

32యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.
33ఈ విధంగా తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి అతడు ఎనిమిదవ నెల, పదిహేనవ రోజు బేతేలులో తాను చేయించిన బలిపీఠం సమీపించాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి, ధూపం వేయడానికి తానే బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు.

Chapter 13

యూదా నుండి వచ్చిన దైవజనుడు

1ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.2ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. <<బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.>>3అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు. <<ఈ బలిపీఠం బద్దలై దానిమీదున్న బూడిద ఒలికి పోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే>> అన్నాడు.

4బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవ సేవకుడు ప్రకటించిన మాట యరొబామురాజు విని, బలిపీఠం మీదనుండి తన చెయ్యి చాపి <<అతన్ని పట్టుకోండి>> అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడి పోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు.5యెహోవా మాట ప్రకారం దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై, దాని మీద నుండి బూడిద ఒలికి పోయింది.

6అప్పుడు రాజు <<నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో>> అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.

7అప్పుడు రాజు <<నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. నీకు బహుమతి ఇస్తాను>> అని ఆ దైవసేవకుడితో చెప్పాడు.
8అప్పుడు దైవ సేవకుడు రాజుతో ఇలా అన్నాడు <<నీవు నీ ఇంట్లో సగం నాకిచ్చినా నీతోబాటు నేను లోపలికి రాను. ఇక్కడ నేనేమీ తినను, తాగను.9ఎందుకంటే, ఇక్కడేమీ తినొద్దనీ తాగొద్దనీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దనీ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.>>10అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిన కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు.

11బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవ సేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు.12వారి తండ్రి <<అతడు ఏ దారిన వెళ్ళాడు?>> అని వారినడిగాడు. అతని కొడుకులు యూదాదేశాన్నుంచి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్ళాడో చెప్పారు.

13తరువాత అతడు తన కొడుకులను పిలిచి <<నాకోసం గాడిద మీద జీను వేయండి>> అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదపై జీను వేశారు. అతడు దాని మీద ఎక్కి బయలుదేరాడు.
14సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి <<యూదాదేశం నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా?>> అని అడిగాడు. అతడు <<నేనే>> అన్నాడు.15అప్పుడు అతడు <<నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి>> అన్నాడు.16అతడు <<నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను.17నీవు అక్కడ ఏదీ తినొద్దనీ తాగొద్దనీ నీవు వచ్చిన దారిలో వెళ్ళ వద్దనీ యెహోవా నాతో చెప్పాడు>> అన్నాడు.

18అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో <<నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత <భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా> అని నాతో చెప్పాడు>> అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.19అతడు ఆ ముసలి ప్రవక్త వెంట వెళ్లి అతని ఇంట్లో భోజనం చేశాడు.

20వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకొచ్చిన ఆ ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు.21అతడు యూదాదేశాన్నుండి వచ్చిన దేవుని మనిషితో <<యెహోవా ఇలా చెబుతున్నాడు, నీ దేవుడు యెహోవా నీకు చెప్పిన మాట వినక, ఆయన ఆజ్ఞాపించిన దాన్ని పాటించకుండా22వెనక్కి వచ్చి, నీవు అక్కడ భోజనం చేయొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు>> అని బిగ్గరగా చెప్పాడు.

23వారు భోజనం చేసిన తరువాత ఆ ప్రవక్త తాను వెనక్కి తీసుకు వచ్చిన ఆ దైవసేవకుని గాడిదపై జీను వేశాడు.24అతడు బయలుదేరి వెళ్లి పోతుంటే దారిలో ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. అతని శవం దారిలోనే పడి ఉంది. గాడిద దాని దగ్గర నిలబడి ఉంది, సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది.25కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి, ఆ ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి ఆ విషయం చెప్పారు.

26దారిలో నుండి అతన్ని తీసుకు వచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని <<యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవ సేవకుడు ఇతడే. యెహోవా సింహానికి అతన్ని అప్పగించేసాడు. యెహోవా చెప్పినట్టు, అది అతన్ని చీల్చి చంపేసింది>> అని చెప్పాడు.

27తన కొడుకులను పిలిచి <<నా కోసం గాడిదను ప్రయాణానికి సిద్ధం చేయండి>> అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదను సిద్ధ పరిచారు.28అతడు వెళ్లి అతని శవం దారిలో పడి ఉండడం, గాడిద, సింహం శవం దగ్గర నిలిచి ఉండడం, సింహం గాడిదను చీల్చివేయకుండా శవాన్ని తినకుండా ఉండడం చూసి
29ఆ ముసలి ప్రవక్త అ దేవుని మనిషి శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని దుఃఖించడానికీ శవాన్ని పాతి పెట్టడానికీ తన స్వగ్రామం వచ్చాడు.30అతడు తన సొంత సమాధిలో ఆ శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు <<అయ్యో! నా సోదరా>> అంటూ ఏడ్చారు.

31అతన్ని పాతిపెట్టిన తరువాత, ఆ ముసలి ప్రవక్త తన కొడుకులతో <<నేను చనిపోయినప్పుడు ఆ ప్రవక్తను ఉంచిన సమాధిలోనే నన్నూ పాతిపెట్టండి. నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.32ఎందుకంటే యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణంలో ఉన్న ఉన్నత స్థలాల్లో ఉన్న మందిరాలన్నిటికీ వ్యతిరేకంగా అతడు ప్రకటించినది తప్పకుండా జరుగుతుంది>> అని చెప్పాడు.

33ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.34యరొబాము వంశాన్ని నిర్మూలించి భూమి మీద లేకుండా చేయడానికి కారణమైన పాపం ఇదే.

Chapter 14

యరొబాముకు వ్యతిరేకంగా ప్రవచనం

1అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది.2యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. <<నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు.3కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.>>

4యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు.5యెహోవా అహీయాతో <<యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి>> అన్నాడు.
6గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు.

<<యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు.

7నీవు వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, <నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను.8దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి, నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు.
9దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీ కోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు, పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు.

10కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను.
11పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది, యెహోవానైన నేనే.>12కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు.13అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడిలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది.

14అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు.15ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు.16తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.>>

17అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు.18యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఖించారు.
19యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.20యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు.
యూదా రాజైన రెహబాము (2 దిన. 12:9-16)

21యూదాదేశంలో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయస్సులో పరిపాలించడం మొదలెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణంలో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.

22యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు.
23వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు.24యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.

25రెహబాము రాజు పాలిస్తున్న ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తాడు.26యెహోవా మందిరపు ఖజనాలోని వస్తువులు, రాజభవనపు ఖజనాలోని వస్తువులు, అన్నిటినీ దోచుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను కూడా అతడు దోచుకుపోయాడు.
27రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి, రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకునికి అప్పచెప్పాడు.28రాజు యెహోవా మందిరానికి వెళ్ళే ప్రతిసారీ భటులు వాటిని మోసుకు పోయేవారు. తరువాత వాటిని భద్రమైన గదిలో ఉంచేవారు.

29రెహబాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది.30బ్రతికినంత కాలం రెహబాముకూ యరొబాముకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది.31రెహబాము చనిపోయినప్పుడు దావీదు నగరంలోని అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని తల్లి నయమా అమ్మోనీయురాలు. అతని కొడుకు అబీయా అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 15

యూదా రాజైన అబీయా (15:1-2, 6-8, 2 దిన. 13:1-2, 22, 14:1)

1నెబాతు కొడుకు యరొబాము రాజు పరిపాలన 18 వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలెట్టాడు.2అతడు యెరూషలేములో మూడేళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు.3అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.

4దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు.5అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు.6రెహబాము బతికిన రోజులన్నీ అతనికీ యరొబాముకూ యుద్ధం జరుగుతూ ఉండేది.
7అబీయా యరొబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.8అబీయా చనిపోగా తన పూర్వీకులతో పాటు దావీదు పట్టణంలో అతన్ని సమాధిచేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు.
యూదా రాజైన ఆసా (15: 9-22, 23-24, 2 దిన. 14: 2-3, 15:16 -16: 6, 16: 11-17: 1)

9ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు.10అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు.11ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని
12మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు.13తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.

14ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు.15అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు.
16ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.

17ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు.
18కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.19<<మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.>>

20కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.21బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు.22అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

23ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది.24అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన నాదాబు

25యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు.26అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.

27ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు.28రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు.
29తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది.30యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.

31నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.32వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.
ఇశ్రాయేలు రాజైన బయెషా

33యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు.34ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.

Chapter 16

1యెహోవా బయెషాను గురించి హనానీ కొడుకు యెహూతో ఇలా చెప్పాడు,2<<నేను నిన్ను మట్టిలోనుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు అనే నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేశాను, అయినా సరే, యరొబాము ప్రవర్తించినట్టు నీవు ప్రవర్తిస్తూ ఇశ్రాయేలు వారైన నా ప్రజలు పాపం చేయడానికి కారణమై, వారి పాపాలతో నాకు కోపం పుట్టించావు.

3కాబట్టి బయెషా వంశాన్నీ అతని కుటుంబీకులనూ నేను పూర్తిగా నాశనం చేసి, నెబాతు కొడుకు యరొబాము వంశానికి చేసినట్టు నీ వంశానికీ చేయబోతున్నాను.4పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి. పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి>>అన్నాడు.

5బయెషా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి, అతని బలప్రభావాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.6బయెషా చనిపోయినప్పుడు తన పూర్వీకులతోపాటు అతన్ని తిర్సాలో సమాధి చేశారు. అతనికి బదులు అతని కొడుకు ఏలా రాజయ్యాడు.

7యరొబాము వంశం వారిలాగే బయెషా తన పనులతో యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాడు. దానంతటిని బట్టి, యరొబాము కుటుంబాన్నంతా చంపినందుకూ అతనికీ అతని వంశం వారికీ వ్యతిరేకంగా యెహోవా, హనానీ కొడుకు ప్రవక్త అయిన యెహూ ద్వారా తన వాక్కు వినిపించాడు.
ఇశ్రాయేలు రాజైన ఏలా

8యూదారాజు ఆసా పాలన 26 వ ఏట బయెషా కొడుకు ఏలా ఇశ్రాయేలు వారందరినీ పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు తిర్సాలో రెండేళ్ళు పాలించాడు.9తిర్సాలో తన కార్యనిర్వాహకుడు అర్సా ఇంట్లో అతడు తాగి మత్తులో ఉన్నప్పుడు యుద్ధ రథాల సగభాగం మీద అధికారి జిమ్రీ అతని మీద కుట్ర పన్ని లోపలికి వెళ్లి10అతన్ని కొట్టి చంపి, అతనికి బదులు రాజయ్యాడు. ఇది యూదారాజు ఆసా పాలనలో 27 వ ఏట జరిగింది.

11జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలు పెట్టగానే బయెషా వంశం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో స్నేహితుల్లో మగవారినందరినీ చంపాడు. ఎవరినీ వదిలిపెట్టలేదు.12బయెషా, అతని కొడుకు ఏలా, తామే పాపం చేసి, ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యారు. ఆ పాపాల వల్లా తాము పెట్టుకున్న విగ్రహాలవల్లా ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించారు.13వారు చేసిన పాపాలను బట్టి ప్రవక్త యెహూ ద్వారా బయెషాను గురించి యెహోవా చెప్పిన మాట నెరవేరేలా, బయెషా వంశం వారందరినీ జిమ్రీ నాశనం చేశాడు.
14ఏలా గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.
ఇశ్రాయేలు రాజైన జిమ్రీ

15జిమ్రీ యూదారాజు ఆసా పాలన 27 వ ఏట తిర్సాలో 7 రోజులు పాలించాడు. అంతలో ప్రజలు ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును చుట్టుముట్టారు.16జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాడనే సమాచారం అక్కడ శిబిరంలో తెలిసింది. కాబట్టి శిబిరంలో ఇశ్రాయేలు వారంతా ఆ రోజు సైన్యాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేశారు.17ఒమ్రీ, అతనితోబాటు ఇశ్రాయేలు వారంతా గిబ్బెతోను విడిచిపెట్టి తిర్సా వచ్చి దాన్ని ముట్టడించారు.
18పట్టణం పట్టుబడిందని జిమ్రీ తెలుసుకుని, రాజభవనంలోకి వెళ్లి తనతోపాటు రాజభవనాన్ని తగలబెట్టి చనిపోయాడు.

19ఇతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. యరొబాము చేసినట్టు పాపం చేస్తూ ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమైనందుకు ఇలా జరిగింది.20జిమ్రీ గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన రాజద్రోహం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ

21అప్పుడు ఇశ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయారు. గీనతు కొడుకు తిబ్నీని రాజుగా చేయాలని ప్రజల్లో సగం మంది అతని వైపు, సగం మంది ఒమ్రీ వైపు చేరారు.22ఒమ్రీ వైపున్న వారు గీనతు కొడుకు తిబ్నీ వైపున్న వారిని ఓడించి తిబ్నీని చంపేశారు. ఒమ్రీ రాజయ్యాడు.

23యూదా రాజు ఆసా పాలన 31 వ ఏట ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండేళ్ళు పాలించాడు. అందులో ఆరేళ్ళు తిర్సాలో పాలించాడు.24అతడు షెమెరు దగ్గర షోమ్రోను కొండను దగ్గరగా 70 కిలోల వెండిని కొనుక్కుని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి, ఆ కొండ యజమాని అయిన షెమెరు అనే వాని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు.
25ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇతడు తన పూర్వికులందరికంటే దుర్మార్గుడు.26అతడు నెబాతు కొడుకు యరొబాము ఏ విధంగా ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమై విగ్రహాలను పెట్టుకుని, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడో దానినే అనుసరించి ప్రవర్తించాడు.

27ఒమ్రీ గురించిన మిగతా విషయాల గురించి, అతడు చూపించిన బలపరాక్రమాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.28ఒమ్రీ చనిపోయినప్పుడు షోమ్రోనులో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు అహాబు అతనికి బదులు రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన అహాబు

29యూదారాజు ఆసా పాలన 38 వ ఏట ఒమ్రీ కొడుకు అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 ఏళ్ళు పాలించాడు.30ఒమ్రీ కొడుకు అహాబు తన పూర్వికులందరికంటే ఎక్కువగా యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
31నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు చేయడం అతడికి స్వల్పవిషయం అనిపించింది. అతడు సీదోనీయుల రాజు ఎత్బయలు కూతురు యెజెబెలును పెళ్లి చేసుకుని బయలు దేవుణ్ణి పూజిస్తూ వాడికి మొక్కుతూ ఉండేవాడు.32షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరంలో బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు.33అహాబు అషేరా దేవతాస్తంభాన్ని నిలిపాడు. ఈ విధంగా అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు.

34అతని రోజుల్లో బేతేలువాడైన హీయేలు యెరికో పట్టణాన్ని కట్టించాడు. అతడు దానికి పునాది వేసినప్పుడు అబీరాము అనే అతని పెద్దకొడుకు చనిపోయాడు. దానికి గుమ్మాలు నిలిపినప్పుడు సెగూబు అనే అతని చిన్నకొడుకు చనిపోయాడు. ఈ విధంగా నూను కొడుకు యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది. 1


1 16:34 ఈ విధంగా నూను కొడుకు యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది. యెహోషువ 6:26 చూడండి

Chapter 17

ఏలీయాకు కాకులు ఆహారాన్నిసమకూర్చడం

1గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో <<ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు>> అన్నాడు.

2ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు.3<<నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో.4ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను>> అని అతనికి చెప్పాడు.

5అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు.6అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.7కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది.
సారెపతు విధవరాలు, ఏలీయా

8యెహోవా అతనితో ఇలా చెప్పాడు. <<నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు.9నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.>>

10కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. <<తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?>> అని అడిగాడు.
11ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి <<నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా>> అన్నాడు.12అందుకామె <<నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను>> అంది.

13అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. <<భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో.
14భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.>>15అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు.16యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.

17కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు.18ఆమె ఏలీయాతో <<దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?>> అంది.

19అతడు <<నీ కొడుకును ఇలా తీసుకురా>> అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు.20<<యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?>> అని యెహోవాకు మొర్రపెట్టాడు.21ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని <<యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు>> అని యెహోవాకు ప్రార్థించాడు.

22యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు.23ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి <<చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు>> అని చెప్పాడు.24ఆ స్త్రీ ఏలీయాతో <<నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది>> అంది.

Chapter 18

ఏలీయా, ఓబద్యా కలుసుకోవడం

1చాలా రోజులు గడిచిన తరువాత కరువు కాలంలో మూడో సంవత్సరం యెహోవా ఏలీయాతో <<నేను భూమ్మీద వాన కురిపిస్తాను. నీవు వెళ్లి అహాబుకు కనబడు>> అన్నాడు.2అహాబును కలుసుకోడానికి ఏలీయా వెళ్ళాడు. షోమ్రోనులో కరువు తీవ్రంగా ఉంది.

3అహాబు తన కార్యనిర్వాహకుడు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్యా యెహోవా పట్ల చాలా భయభక్తులు గలవాడు.4యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఉన్నప్పుడు గుహకు యాభై మంది చొప్పున రెండు గుహల్లో వంద మందిని దాచి, అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాడు.
5అహాబు ఓబద్యాతో <<దేశంలోని నీటి ఊటలనూ వాగులనూ చూడడానికి వెళ్ళు. మన గుర్రాలూ కంచర గాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు. అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం>> అన్నాడు.

6కాబట్టి వాళ్ళు నీళ్ళ కోసం దేశమంతా తిరగి చూడడానికి బృందాలుగా వెళ్ళారు. అహాబు ఒక్కడే ఒక వైపూ ఓబద్యా మరొక వైపూ వెళ్ళారు.
7ఓబద్యా దారిలో వెళుతుంటే అనుకోకుండా ఏలీయా ఎదురు పడ్డాడు. ఓబద్యా అతన్ని గుర్తు పట్టి సాష్టాంగ నమస్కారం చేసి<<మీరు నా యజమాని ఏలీయా గదా>> అని అడిగాడు.8అతడు <<నేనే. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, <ఏలీయా ఇక్కడున్నాడు> అని చెప్పు>> అన్నాడు.

9అందుకు ఓబద్యా <<అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడినైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను?10నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించని దేశం గానీ రాజ్యం గానీ లేదు. <ఏలీయా ఇక్కడ లేడు> అని ఆ దేశం గానీ రాజ్యం గానీ అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు.11నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, <ఏలీయా ఇక్కడున్నాడు> అని చెప్పమని నాకు చెబుతున్నావే!
12నేను నీ దగ్గరనుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ, నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్లి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటి నుంచి యెహోవాపట్ల భయభక్తులు గలిగిన వాణ్ణి.13యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తుంటే నేనేం చేశానో నీకు తెలియదా? నేను యెహోవా ప్రవక్తల్లో వందమందిని, గుహకు యాభై మంది చొప్పున దాచి, భోజనం పెట్టి వారిని పోషించాను.
14ఇప్పుడు ఏలీయా ఇక్కడున్నాడని నీ యజమానికి చెప్పు అంటున్నావే, అహాబు నన్ను చంపేస్తాడు>> అని మనవి చేశాడు.

15అప్పుడు ఏలీయా <<ఎవరి సన్నిధిలో నేను నిలుచున్నానో దూతల సైన్యాల అధిపతి అయిన యెహోవా జీవం తోడు, కచ్చితంగా ఈ రోజు నేను అహాబును కలుసుకుంటాను>> అన్నాడు.
16కాబట్టి ఓబద్యా అహాబును కలుసుకుని ఈ విషయం తెలియచేశాడు. వెంటనే ఏలీయాను కలుసుకోడానికి అహాబు బయలుదేరాడు.
కర్మెలు పర్వతం మీద ఏలీయా

17అహాబు ఏలీయాను చూడగానే <<ఇశ్రాయేలు ప్రజా కంటకుడా, నువ్వేనా>> అన్నాడు.
18ఏలీయా <<ఇశ్రాయేలు ప్రజలను కష్ట పెట్టేది నేను కాదు, నువ్వూ నీ తండ్రి వంశం వాళ్ళు. మీరు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలు విగ్రహాలను అనుసరించారు.19అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలు దేవుడి ప్రవక్తలు 450 మందినీ అషేరాదేవి ప్రవక్తలు 400 మందినీ నా దగ్గరికి కర్మెలు పర్వతానికి పిలిపించు>> అన్నాడు.

20అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు.21ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి <<ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి>> అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు.

22అప్పుడు ఏలీయా <<యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు.23మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను.24తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు>> అన్నాడు. ప్రజలంతా <<ఆ మాట బాగుంది>> అని జవాబిచ్చారు.

25అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి <<మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు>> అన్నాడు.26వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ <<బయలు దేవుడా, మా ప్రార్థన విను>> అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.

27మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా <<వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో>> అని గేలి చేశాడు.28వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు.29ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు.

30అప్పుడు ఏలీయా <<నా దగ్గరికి రండి>> అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు.31<<నీ పేరు ఇశ్రాయేలు>> అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు.32ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు.
33కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే <<మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి>> అన్నాడు.

34తరువాత <<రెండవ సారి అలాగే చేయండి>> అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. <<మూడవ సారి కూడా చేయండి>> అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు.35అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు.

36సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి <<యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు.37యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను>>అన్నాడు.

38అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది.39ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి <<యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు>> అని కేకలు వేశారు.40అప్పుడు ఏలీయా <<బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు>> అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.

41ఏలీయా <<పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది. నీవు వెళ్లి భోజనం చెయ్యి>> అని అహాబుతో చెప్పాడు.42అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.
43తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి <<నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు>> అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి <<ఏమీ కనబడ్డం లేదు>> అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు <<వెళ్లి చూడు>> అన్నాడు.44ఏడో సారి అతడు చూసి <<అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం, సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది>> అన్నాడు. అప్పుడు ఏలీయా <<నీవు అహాబు దగ్గరికి వెళ్లి, నీ రథాన్ని సిద్ధ పరచుకో, వానలో చిక్కుకుపోక ముందే వెళ్ళిపో>> అని చెప్పమని అతన్ని పంపాడు.

45అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడైంది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలు పట్టణం వెళ్లిపోయాడు.46అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రెయేలు చేరుకున్నాడు.

Chapter 19

యెజెబెలు నుంచి ఏలీయా పారిపోవడం

1ఏలీయా చేసిందంతా అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతీ అహాబు యెజెబెలుకు చెప్పాడు.2యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది<<రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.>>3ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు.

4అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. <<యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో>> అని ప్రార్థన చేశాడు.5అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి <<నీవు లేచి భోజనం చెయ్యి>> అన్నాడు.6ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.

7యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి <<నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి>> అని చెప్పాడు.8అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.
ఏలీయా కొండ గృహలో దాక్కోవడం

9అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా <<ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్>> అని అతనిని అడిగాడు.10అతడు <<ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు>> అని జవాబిచ్చాడు.

11యెహోవా అతనితో <<నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు>> అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు.12ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.

13ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు <<ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?>> అనే మాట వినిపించింది.14ఏలీయా <<ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు>> అని జవాబిచ్చాడు.

15అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. <<ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి.16ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి.
17హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు.18అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.>>
ఏలీయా, ఎలీషా దగ్గరకు వెళ్ళడం

19ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు.20అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి <<నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను>> అన్నాడు. ఏలీయా <<వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో>> అన్నాడు.
21ఎలీషా అతన్ని విడిచి వెళ్లి, కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతనికి సేవకుడయ్యాడు.

Chapter 20

సమరయపై బెన్హదదు దాడి చేశాడు

1సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.2అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి వార్తాహరులను పంపి,3<<నీ వెండి, నీ బంగారం నావే. నీ భార్యల్లో నీ పిల్లల్లో అందమైన వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళే అని బెన్హదదు తెలియచేస్తున్నాడు>> అని వారికి సందేశం పంపించాడు.

4అందుకు ఇశ్రాయేలు రాజు <<నా ప్రభూ, నా రాజా, నీవు చెప్పినట్టే నేనూ నాకున్నదంతా నీ ఆధీనంలో ఉన్నాం>> అని చెప్పి వారిని పంపించాడు.5ఆ వార్తాహరులు వెళ్లి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి, బెన్హదదు ఇలా అంటున్నాడని చెప్పారు. <<నీవు నీ వెండినీ నీ బంగారాన్నీ నీ భార్యలనూ నీ పిల్లలనూ నాకు అప్పగించాలని నేను నా సేవకులను నీ దగ్గరికి పంపాను.6రేపు ఈ పాటికి వారు నీ ఇంటినీ నీ సేవకుల ఇళ్లనూ వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు.>>

7అప్పుడు ఇశ్రాయేలు రాజు జాతి పెద్దలందర్నీ పిలిపించి <<బెన్హదదు, నీ భార్యలనూ పిల్లలనూ వెండి బంగారాలనూ తీసుకుపోతానని కబురు పంపితే, నేను ఇవ్వనని చెప్పలేదు. అతడు చేయబోయే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి>> అన్నాడు.8<<నీవతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు>> అని ఆ పెద్దలూ ప్రజలంతా అతనితో చెప్పారు.
9కాబట్టి అహాబు అ వార్తాహరులతో <<మీరు రాజైన నా యజమానితో ఇలాచెప్పండి. <నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని, ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చేయలేను> >> అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్లి ఆ జవాబు తెలియచేశారు.

10బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి <<నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక>> అని చెప్పి పంపాడు.
11అందుకు ఇశ్రాయేలు రాజు <<తన యుద్ధ కవచాన్ని ధరించకుండానే దాన్ని విప్పి, తీసేసిన వాడిలాగా అతిశయపడకూడదని బెన్హదదుతో చెప్పండి>> అన్నాడు.12తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి <<యుద్ధానికి సిద్ధంగా ఉండండి>> అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.
అహాబు బెన్హదదును ఓడించడం

13అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి <<యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈ రోజే దాన్ని నీ చేతిలో పెడతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు>> అన్నాడు.14<<ఇది ఎవరివల్ల అవుతుంది?>> అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త <<రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు>> అన్నాడు. <<యుద్ధాన్ని ఎవరు మొదలెట్టాలి?>> అని రాజు అడిగాడు. అతడు <<నువ్వే>> అని జవాబిచ్చాడు.15అప్పుడు అహాబు రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల లెక్క చూశాడు. వారు 232 మంది ఉన్నారు. తరువాత సైనికులను, అంటే ఇశ్రాయేలు సైన్యాన్నంతా లెక్కిస్తే ఏడు వేలమంది అయ్యారు.

16వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.17రాజ్యాధిపతుల్లో ఉన్న యువకులు మొదటగా బయలుదేరారు. విషయం తెలుసుకుందామని బెన్హదదు కొంతమందిని పంపించాడు. సమరయ నుంచి కొంతమంది వచ్చారని అతనికి తెలిసింది.
18బెన్హదదు <<వారు శాంతంగా వచ్చినా యుద్ధం చేయడానికి వచ్చినా వారిని ప్రాణాలతో పట్టుకు రండి>> అని ఆజ్ఞాపించాడు.19రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడ ఉన్న సైన్యం, పట్టణంలో నుంచి బయలు దేరారు.

20వారిలో ప్రతివాడూ తనకెదురు వచ్చిన శత్రువుని చంపేశాడు. కాబట్టి సిరియా వారు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరిమారు. సిరియా రాజు బెన్హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతోపాటు తప్పించుకుపోయాడు.21అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రాలనూ రథాలనూ పట్టుకుని చాలామంది సిరియా వారిని చంపేశాడు.
22అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి <<నీవు ధైర్యం తెచ్చుకో. నీవు చేయాల్సిందేదో కనిపెట్టి చూడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం సిరియారాజు నీ మీదికి మళ్ళీ వస్తాడు>> అని అతనితో చెప్పాడు.

23అయితే సిరియా రాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు. <<వాళ్ళ దేవుడు కొండల దేవుడు. అందుకే వాళ్ళు మన కంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం.

24ఇంకా నువ్విలా చెయ్యి. ఈ రాజులందరినీ తీసేసి, వారికి బదులు సైన్యాధిపతులను నియమించు.25నీవు పోగొట్టుకున్న సైన్యమంత మరో సైన్యాన్నీ గుర్రానికి గుర్రాన్నీ రథానికి రథాన్నీ సిద్ధం చెయ్యి. అప్పుడు మనం మైదానంలో వారితో యుద్ధం చేసి, తప్పకుండా గెలుస్తాం.>> అతడు వారి సలహా విని, వాళ్ళు చెప్పినట్టు చేశాడు.
26కొత్త సంవత్సరం మొదట్లో, బెన్హదదు సిరియనులను సిద్ధం చేసి లెక్క చూసి బయలుదేరి, ఇశ్రాయేలువారితో యుద్ధం చేయడానికి ఆఫెకు వచ్చాడు.

27ఇశ్రాయేలు వారంతా సిద్ధపడి వాళ్ళని ఎదుర్కోడానికి బయలుదేరారు. ఇశ్రాయేలు వారు రెండు మేకల మందల్లాగా వాళ్ళ ఎదుట దిగారు. ఆ ప్రాంతమంతా సిరియా వాళ్ళతో నిండిపోయింది.
28అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. <<యెహోవా చెప్పేదేమిటంటే, <సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు> అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.>>
29వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఏడు రోజులున్నారు. ఏడో రోజున యుద్ధం మొదలయింది. ఇశ్రాయేలు వారు ఒక్క రోజులోనే సిరియను సైన్యంలోని లక్షమంది కాల్బలాన్ని చంపేశారు.30మిగతావారు ఆఫెకు పట్టణంలోకి పారిపోతే, పట్టణ గోడ కూలి 27,000 మంది చనిపోయారు. బెన్హదదు కూడా ఆ పట్టణంలోకి పారిపోయి ఒక ఇంట్లో లోపలి గదిలో దాక్కున్నాడు.

31అతని సేవకులు <<ఇశ్రాయేలు వారి రాజులు దయగల వారని మేము విన్నాం. కాబట్టి నీకు అనుకూలమైతే, మేము నడుం చుట్టూ గోనెపట్టాలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోతాం. అతడు నీ ప్రాణాన్ని కాపాడతాడేమో>> అని రాజుతో అన్నారు. రాజు అందుకు ఒప్పుకున్నాడు.32కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి <<నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు>> అని చెప్పారు. అతడు<<బెన్హదదు నా సోదరుడు. అతడింకా బతికే ఉన్నాడా>> అని అడిగాడు.

33అప్పుడు వాళ్ళు అహాబు దగ్గర్నుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి, అతడా మాట అనగానే వెంటనే <<అవును, బెన్హదదు మీ సోదరుడే>> అన్నారు. అప్పుడు అహాబు <<మీరు వెళ్లి అతన్ని తీసుకు రండి>> అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు, అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు.

34బెన్హదదు అహాబుతో <<మీ తండ్రి చేతిలోనుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు, దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు>> అన్నాడు. అహాబు జవాబిస్తూ <<అలా చేస్తే ఈ ఒప్పందంతో నిన్ను వదిలేస్తాను>> అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు.
ప్రవక్తతో ఆహాబుకు దేవుని వర్తమానం

35ప్రవక్తల బృందంలో ఒకడు, యెహోవా ద్వారా ప్రేరణ పొంది, తన తోటి ప్రవక్తతో <<దయచేసి నన్ను కొట్టు>> అన్నాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు.36అప్పుడా ప్రవక్త తన తోటి ప్రవక్తతో <<నీవు యెహోవా మాట వినలేదు. కాబట్టి నీవు నా దగ్గరనుంచి వెళ్లిపోగానే సింహం నిన్ను చంపేస్తుంది>> అన్నాడు. అతడు వెళ్లిపోతుంటే సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది.
37తరువాత ఆ ప్రవక్త మరొకనితో <<దయచేసి నన్ను కొట్టు>> అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరచాడు.38అప్పుడా ప్రవక్త వెళ్లి, రాజు కోసం దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. తననెవరూ గుర్తుపట్టకుండా తన కళ్ళకు గుడ్డ కట్టుకున్నాడు.

39రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. <<నీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, <ఇతన్ని చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి. లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి> అన్నాడు.

40అయితే నీ సేవకుడనైన నేను పనిమీద అటూ ఇటూ తిరుగుతుంటే వాడు తప్పించుకు పోయాడు.>> అప్పుడు ఇశ్రాయేలు రాజు <<నీకిదే శిక్ష. దాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు>> అన్నాడు.
41ఆ ప్రవక్త వెంటనే తన కళ్ళమీదున్న గుడ్డ తీసేశాడు. అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు గుర్తించాడు.42ప్రవక్త రాజుతో <<యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి. అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు>> అన్నాడు.43ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంగా సమరయలోని తన భవనానికి వెళ్ళిపోయాడు.

Chapter 21

నాబోతు ద్రాక్షతోట

1యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది.2అహాబు నాబోతును పిలిపించి <<నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను>> అన్నాడు.

3అందుకు నాబోతు <<నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు>> అన్నాడు.4నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.

5అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి <<నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?>> అని అడిగింది.6అతడు ఆమెతో ఇలా అన్నాడు. <<నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.>>7అందుకు యెజెబెలు <<నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను>> అంది.

8ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.9ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. <<ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.10నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.>>

11అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు.12ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు.13అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని <<నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు>> అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు.

14నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు.
15అది విని యెజెబెలు <<నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో>> అని అహాబుతో చెప్పింది.16నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు.

17అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు,18<<నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు.
19నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.>>

20అది విని అహాబు ఏలీయాతో <<నా పగవాడా, నేను నీకు దొరికానా?>> అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. <<యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.
21యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను.22ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను.

23యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి.24పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి>> అన్నాడు.
25తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు.26ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు.

27అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.28యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు.29<<అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.>>

Chapter 22

మీకా ప్రవచనం (22:1-28, 2 దిన. 18:1-27)

1సిరియాకూ ఇశ్రాయేలుకూ మధ్య మూడేళ్ళు యుద్ధం జరగలేదు.2మూడో సంవత్సరం యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు.

3ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి <<రామోత్గిలాదు మనదని మీకు తెలుసు. అయితే మనం దాన్ని సిరియా రాజు చేతిలోనుంచి తీసుకోడానికి ప్రయత్నమేమీ చేయడం లేదు>> అన్నాడు.4అతడు <<యుద్ధానికి నాతో పాటు నీవు రామోత్గిలాదు వస్తావా?>> అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు <<నువ్వేదంటే అదే. మా వాళ్ళు నీవాళ్ళే. నా గుర్రాలు నీ గుర్రాలే>> అని ఇశ్రాయేలు రాజుతో అన్నాడు.

5యెహోషాపాతు <<ముందు యెహోవా ఇష్టాన్ని తెలుసుకుందాం>> అన్నాడు.6ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి <<యుద్ధానికి రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా, వద్దా?>> అని వారినడిగాడు. వాళ్ళు <<వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు>> అన్నారు.
7అయితే యెహోషాపాతు <<మనం సలహా తీసుకోడానికి వీళ్ళు తప్ప, యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా ఇక్కడ లేడా?>> అని అడిగాడు.

8అందుకు ఇశ్రాయేలు రాజు <<ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందననే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం>> అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు <<రాజైన మీరు అలా అనొద్దు>> అన్నాడు.9అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక అధికారిని పిలిచి <<ఇమ్లా కొడుకు మీకాయాను వెంటనే ఇక్కడికి తీసుకురండి>> అని ఆదేశించాడు.
10ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకుని, సమరయ ముఖద్వారం దగ్గరున్న బహిరంగ స్థలం లో తమ సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రవక్తలంతా వారి ఎదుట ప్రవచిస్తూ ఉన్నారు.

11కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి <<యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు>> అన్నాడు.12ప్రవక్తలంతా అలాగే ప్రవచిస్తూ <<యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ వశం చేస్తాడు. కాబట్టి నీవు దాని మీదికి వెళ్లి గెలువు>> అన్నారు.
13మీకాయాను పిలవడానికి వెళ్ళిన వార్తాహరుడు అతనితో <<ప్రవక్తలంతా ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే మంచి మాటలు చెప్పు>> అన్నాడు.

14మీకాయా <<యెహోవా జీవం తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను>> అన్నాడు.15అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు <<మీకాయా, యుద్ధం చేయడానికి మేము రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా వద్దా>> అని అడిగాడు. మీకాయా <<యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు, కాబట్టి దాని మీదికి వెళ్లి గెలువు>> అని జవాబిచ్చాడు.
16అందుకు రాజు <<నీతో ప్రమాణం చేయించి యెహోవా పేరును బట్టి, సత్యమే చెప్పాలని నేనెన్నిసార్లు నీతో చెప్పాలి?>>అన్నాడు.17మీకాయా <<ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదరి పోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్లిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు>> అన్నాడు.

18అప్పుడు ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతుతో <<ఇతడు నా గురించి మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడే జరుగుతుందని ప్రవచిస్తాడని నేను నీతో చెప్పలేదా>> అన్నాడు.19అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. <<యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు.20<అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు> అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు.

21అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి <నేనతన్ని ప్రేరేపిస్తాను> అన్నాడు. యెహోవా, <ఎలా> అని అతన్ని అడిగాడు.22అందుకతడు <నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను> అని చెప్పాడు. ఆయన, <నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి> అన్నాడు.23చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.>>

24కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి <<నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు>> అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు.25అందుకు మీకాయా <<దాక్కోడానికి నీవు లోపలి గదుల్లోకి చొరబడే రోజున తెలుసుకుంటావు>> అన్నాడు.
26అప్పుడు ఇశ్రాయేలు రాజు <<మీకాయాను పట్టుకుని తీసికెళ్లి పట్టాణాధికారి ఆమోనుకూ, నా కొడుకు యోవాషుకూ అప్పచెప్పండి.27వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.>>

28అప్పుడు మీకాయా <<నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్నట్టే. ఓ ప్రజలారా, ఈ విషయం వినండి>> అన్నాడు.
ఆహాబు ఓటమి, మరణం (22:29-36, 2 దిన. 18:28-34)

29ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు, రామోత్గిలాదు మీదికి వెళ్ళారు.30ఇశ్రాయేలురాజు <<నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వైతే నీ రాజ వస్త్రాలు ధరించుకో>> అని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు.
31సిరియారాజు తన రథాల మీద అధికారులైన ముప్ఫై రెండు మందిని పిలిపించి <<సాధారణ సైనికులతో గానీ ప్రధాన సైనికులతో గానీ మీరు యుద్ధం చేయొద్దు. ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయండి>> అన్నాడు.

32రథాధిపతులు యెహోషాపాతును చూసి <<కచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు>> అనుకుని అతనితో యుద్ధం చేయడానికి అతని మీదికొచ్చారు. యెహోషాపాతు పెద్దగా కేకలు పెట్టాడు.33రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మానేశారు.
34అయితే ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండానే బాణం వేస్తే అది ఇశ్రాయేలు రాజు కవచం అతుకు మధ్య తగిలింది. కాబట్టి అతడు <<నాకు పెద్ద గాయమైంది. రథం తిప్పి ఇక్కడనుంచి నన్ను అవతలకు తీసుకు పో>> అని తన సారథితో చెప్పాడు.

35ఆరోజు యుద్ధం తీవ్రంగా జరుగుతుంటే, సిరియనులకు ఎదురుగా, రాజు తన రథంలో ఉండిపోయాడు. సాయంకాలానికి అతడు చనిపోయాడు. అతని గాయం నుంచి రక్తం కారి రథం అడుగున నిలిచింది.36సాయంకాలం <<అందరూ తమ తమ పట్టణాలకూ ప్రాంతాలకూ వెళ్లిపోవచ్చు>> అని సైన్యమంతా వార్త పాకిపోయింది.
37ఆ విధంగా రాజు చనిపోయాడు. వాళ్ళు అతన్ని సమరయకు తీసుకు వచ్చారు. అతణ్ణి సమరయలో పాతిపెట్టారు.38వేశ్యలు స్నానం చేసే ఒక కొలను దగ్గర అతని రథాన్ని కడిగారు. యెహోవా చెప్పినట్టు కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి.

39అహాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా అతడు కట్టించిన దంతపు గృహాన్ని గురించి, అతడు కట్టించిన పట్టణాలన్నిటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.40అహాబు చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని కొడుకు అహజ్యా అతని బదులు రాజయ్యాడు.
యూదా రాజైన యెహోషాపాతు (22: 41-50, 2 దిన. 20: 31-21: 1)

41ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలెట్టాడు.42యెహోషాపాతు పరిపాలించడం మొదలెట్టినప్పుడు అతడు ముప్ఫై అయిదేళ్ళ వాడు. యెరూషలేములో అతడు ఇరవై ఐదేళ్ళు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు.
43అతడు తన తండ్రి, ఆసా విధానాన్ని అనుసరించి, యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించాడు. అయితే ఉన్నత పూజా స్థలాలను తీసేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.

44యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు.
45యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు చూపించిన బల ప్రభావాలు, యుద్ధం చేసిన పద్ధతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.46తన తండ్రి ఆసా రోజుల్లోనుంచి మిగిలి ఉన్న మగ వ్యభిచారులను అతడు దేశం నుంచి వెళ్లగొట్టాడు.47ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. ఒక అధికారి పాలించేవాడు.

48యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరు దేశానికి వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గానీ ఆ ఓడలు బయలుదేర లేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలై పోయాయి.49అప్పుడు అహాబు కొడుకు అహజ్యా <<నా సేవకులను నీ సేవకులతో పాటు ఓడల మీద వెళ్ళనివ్వండి>> అని యెహోషాపాతును అడిగాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు.50యెహోషాపాతు చనిపోగా తన పూర్వీకుడైన దావీదు పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన అహజ్యా

51అహాబు కొడుకు అహజ్యా యూదారాజు యెహోషాపాతు పరిపాలన 17 వ సంవత్సరం సమరయలో ఇశ్రాయేలును పరిపాలించడం మొదలుపెట్టి రెండేళ్ళు ఇశ్రాయేలును పాలించాడు.52అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. తన తలిదండ్రులిద్దరి ప్రవర్తననూ ఇశ్రాయేలు ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాము ప్రవర్తననూ అనుసరించాడు.53అతడు బయలు దేవుడికి మొక్కి, పూజిస్తూ తన తండ్రి చేసిందంతా చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు.

2 రాజులు

Chapter 1

అహజ్యాకు ఏలీయా ప్రవచనం

1అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది.2అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి <<మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి>> అని వారికి చెప్పి పంపించాడు.

3కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. <<నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా?4సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు. నీవు కచ్చితంగా ఎక్కిన పడుకున్న పడక దిగకుండానే చనిపొతావు.>> ఏలీయా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు.

5తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు <<మీరు ఎందుకు తిరిగి వచ్చారు?>> అని అడిగాడు.6వారు ఇలా అన్నారు <<ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో మిమ్మల్ని పంపిన రాజు దగ్గరకి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి. యెహోవా చెప్పేదేమిటంటే ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు. కచ్చితంగా చనిపోతావు, అని చెప్పాడు.>>

7అప్పుడు రాజు <<మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు?>> అని అడిగాడు.8అందుకు వారు<<అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు>> అన్నారు. అప్పుడు రాజు <<ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే>> అన్నాడు.

9అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో <<ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు>> అన్నాడు.10అందుకు ఏలీయా <<నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక>> అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.

11ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో <<ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు>> అన్నాడు.12అందుకు ఏలీయా <<నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక>> అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.

13అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా <<దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ.14ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు అధికారులనూ, వాళ్ళ సైనికులనూ నిజంగానే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని కాల్చివేసింది. కానీ ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండనీ>> అన్నాడు.

15అప్పుడు యెహోవా దూత ఎలీయాతో <<దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు>> అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు.16తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. <<నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.>>

17ఏలీయా పలికిన యెహోవా మాట ప్రకారం ఆహాజు రాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన రెండవ సంవత్సరంలో ఇది జరిగింది.18అహజ్యా గూర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

Chapter 2

ఏలీయా పరలోకానికి తీసుకువెళ్ళడం

1యెహోవా ఏలీయాను సుడిగాలిలో పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి ఏలీయా ఎలీషాతో కలసి గిల్గాలు నుండి ప్రయాణమయ్యాడు.2అప్పుడు ఏలీయా <<నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను బేతేలుకు వెళ్ళమని యెహోవా చెప్పాడు>> అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా <<యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను. నేను నిన్ను విడిచి పెట్టను>> అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు.

3బేతేలులో ఉన్న ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. <<ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?>> అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా <<నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి>> అని జవాబిచ్చాడు.4అప్పుడు ఏలీయా <<నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యెరికోకి వెళ్ళమని యెహోవా చెప్పాడు>> అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా <<యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను>> అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ యెరికోకి వెళ్ళారు.

5అప్పుడు యెరికోలో కూడా ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. <<ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?>> అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా <<నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి>> అని జవాబిచ్చాడు.6అప్పుడు ఏలీయా <<నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు>> అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా <<యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను>> అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు.

7తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు.8అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.

9వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. <<నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.>> అందుకు ఎలీషా <<నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి>> అన్నాడు.10అందుకు ఏలీయా <<నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు>> అన్నాడు.

11వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు.12ఎలీషా అది చూసి <<నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే>> అని కేక పెట్టాడు.

ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు.

ఎలీషా సేవ ప్రారంభం

13ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు.14నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి <<ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?>> అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.

15యెరికోలో ఉన్న ప్రవక్తల సమాజం వారు అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతని చూడగానే <<ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది>> అని చెప్పుకున్నారు. వారు అతణ్ణి కలుసుకోడానికి వెళ్ళి నేల వరకూ వంగి అతనికి నమస్కారం చేశారు.16వారు అతనితో <<నీ సేవకులైన మా దగ్గర యాభై మంది బలమైన వారున్నారు. నీ గురువును వెదకడానికి వాళ్ళను వెళ్ళనివ్వు. ఒకవేళ యెహోవా ఆత్మ అతణ్ణి పైకి తీసుకు వెళ్ళి ఏ పర్వతం మీదనో, ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు>> అని మనవి చేశారు. దానికి ఎలీషా <<వద్దు, ఎవర్నీ పంపకండి>> అని జవాబిచ్చాడు.

17అయితే వారు అతణ్ణి బాగా ఒత్తిడి చేసి విసిగించారు. దాంతో అతడు <<సరే పంపండి>> అన్నాడు. అప్పుడు వారు యాభై మందిని పంపించారు. వారు వెళ్లి అతని కోసం మూడు రోజులు గాలించారు గానీ అతణ్ణి కనుక్కోలేక పోయారు.18దాంతో వారు యెరికో పట్టణంలోనే ఆగి ఉన్న ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చారు. అతడు వాళ్ళతో <<వెళ్ళ వద్దని నేను మీకు చెప్పాను కదా>> అన్నాడు.

19తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో <<మా గోడు వినండి. మా యజమానులైన మీరు చూస్తున్నట్లు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది. కానీ ఇక్కడి నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది>> అన్నారు.20దానికి ఎలీషా <<ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి>> అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు.

21అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. <<యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.>>22అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్ళు ఈ రోజు వరకూ ఆరోగ్యకరంగా ఉన్నాయి.

23తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి <<బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో>> అంటూ ఎగతాళి చేసారు.24ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి.25అప్పుడు అతడు అక్కడ నుండి కర్మెలు పర్వతానికి వెళ్ళాడు. అక్కడనుండి షోమ్రోనుకి తిరిగి వెళ్ళాడు.

Chapter 3

యెహోరాము మోయాబును ముట్టడించడం

1యూదా రాజు యెహోషాపాతు పాలన పద్దెనిమిదో సంవత్సరంలో అహాబు కొడుకు యెహోరాము ఇశ్రాయేలుకి రాజయ్యాడు. ఇతడు షోమ్రోనులో పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు.2తన తల్లిదండ్రుల తీరును పూర్తిగా అనుసరించక పోయినా ఇతడు దేవుని దృష్టిలో చెడ్డ పనులే చేశాడు. అయితే బయలు దేవుణ్ణి పూజించడం కోసం అతని తండ్రి కట్టించిన రాతి స్తంభాన్ని తీసివేశాడు.3నెబాతు కొడుకు యరొబాము ఏ ఏ అక్రమాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడో అవే అక్రమాలు ఇతడూ చేశాడు.

4మోయాబు రాజు మేషాకు విస్తారమైన మేకల, గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి ఒక లక్ష గొర్రె పిల్లలనూ, లక్ష గొర్రె పొట్టేళ్ల ఉన్నినీ పన్నుగా కడుతుండేవాడు.5కానీ అహాబు చనిపోయిన తరువాత ఈ మోయాబు రాజు మేషాఇశ్రాయేలు రాజుపై తిరుగుబాటు చేశాడు.6దాంతో ఇశ్రాయేలు ప్రజలందర్నీ యుద్ధానికి సిద్ధం చేయడానికి యెహోరాము షోమ్రోనులో నుండి ప్రయాణమయ్యాడు.

7ఇతడు యూదా దేశానికి రాజుగా ఉన్న యెహోషాపాతుకు ఒక సందేశం పంపించాడు. ఆ సందేశంలో <<మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు. మోయాబుపై నేను చేయబోయే యుద్ధంలో నాతో కలిసి వస్తావా?>> అని అడిగాడు. దానికి యెహోషాపాతు <<నేను యుద్ధానికి వస్తాను. నేనే నువ్వూ, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అనుకో>> అని జవాబిచ్చాడు.8అప్పుడు యెహోరాము <<దాడి చేయడానికి మనం ఏ దారి గుండా వెళ్దాం?>> అని అడిగాడు. అందుకు యెహోషాపాతు <<ఎదోము అడవి దారి గుండా వెళ్దాం>> అన్నాడు.

9కాబట్టి ఇశ్రాయేలు, యూదా, ఎదోము దేశాల రాజులు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికీ, గుర్రాలకూ మిగిలిన పశువులకూ నీళ్ళు లేకుండా పోయాయి.10కాబట్టి ఇశ్రాయేలు రాజు <<అయ్యోయ్యో, ఎందుకిలా జరిగింది? మోయాబు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి రాజులైన మన ముగ్గుర్నీ యెహోవా పిలిచాడా ఏమిటి?>> అన్నాడు.

11కానీ యెహోషాపాతు <<మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?>> అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు <<షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు>> అని చెప్పాడు.12దానికి యెహోషాపాతు <<యెహోవా వాక్కు అతని దగ్గర ఉంది>> అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యెహోషాపాతూ కలసి అతని దగ్గరికి వెళ్ళారు.

13ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి <<నీతో నాకేం పని? నీ తల్లీ తండ్రీ పెట్టుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు>> అన్నాడు. ఇశ్రాయేలు రాజు అతనితో <<మోయాబు వారు మమ్మల్ని ఓడించాలని యెహోవా మా ముగ్గురు రాజులను పిలిచాడు>> అన్నాడు.14అప్పుడు ఎలీషా <<నేను సైన్యాలకు ప్రభువు అయిన యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నాను. ఆ యెహోవా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదా రాజు యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్నసలు లక్ష్యపెట్టేవాణ్ణి కాదు. నీ వైపు చూసే వాణ్ణి కాదు.
15అయితే ఇప్పుడు తీగ వాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి>> అన్నాడు. తీగ వాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషా పైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు.16<<యెహోవా ఇలా చెప్తున్నాడు, ఎండిన ఈ నదీ లోయలో అంతటా కందకాలు తవ్వించండి.17ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, గాలీ ఉండదు, వర్షమూ రాదు. ఈ లోయ అంతా నీటితో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగుతారు. మీ పశువులూ, మీ దగ్గర ఉన్న జంతువులూ తాగుతాయి.

18యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు.19మీరు ప్రాకారాలున్న ప్రతి పట్టణాన్నీ, ప్రతి మంచి పట్టణాన్నీ వశం చేసుకోవాలి. అక్కడ మీరు ప్రతి మంచి చెట్టునీ నరికి వేయాలి. నీళ్ళ ఊటలను పూడ్చి వేయాలి. మంచి భూములను రాళ్ళతో నింపి పాడు చేయాలి.>>

20కాబట్టి మరుసటి ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి ఎదోము వైపు నుండి నీళ్ళు పారుతూ వచ్చాయి. వారున్న ఆ ప్రాంతమంతా జలమయం అయింది.

21తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబు వారు విన్నారు. వాళ్ళలో యువకులు మొదలు వృద్ధుల వరకూ ఆయుధాలు ధరించ గలిగిన వాళ్ళంతా ఆ దేశం సరిహద్దులో సమకూడారు.22ఉదయాన్నే వారు లేచి చూసినప్పుడు సూర్య కాంతి ఆ నీళ్ల మీద ప్రతిబింబిస్తూ ఉంది. అవతల నుండి మోయాబు వాళ్ళకు ఆ నీళ్లు రక్తంలా కనిపించాయి.23<<అదంతా రక్తం! రాజులు నాశనమయ్యారు. వారు ఒకళ్లనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి, మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాము>> అని చెప్పుకున్నారు.

24వారు ఇశ్రాయేలు శిబిరం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మోయాబు వాళ్ళపై మెరుపు దాడి చేశారు. మోయాబు వారు ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలవలేక కాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇశ్రాయేలు సైన్యం మోయాబులో చొరబడి వాళ్ళను తరిమి చంపారు.25వాళ్ళ పట్టణాలను ధ్వంసం చేశారు. అంతా తలో రాయి వేసి సారవంతమైన భూములను రాళ్ళతోనింపారు. నీళ్ళ ఊటలు పూడ్చివేశారు. మంచి చెట్లు అన్నిటినీ నరికి వేశారు. ఒక్క కీర్హరెశెతు అనే పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కానీ ఒడిసెల విసిరే వారు దాన్ని కూడా చుట్టుముట్టి రాళ్ళు విసురుతూ దానిపై దాడి చేశారు.

26మోయాబు రాజు మేషా, యుద్ధంలో ఓడిపోయామని గ్రహించి ఏడువందల మంది ఖడ్గధారులను తనతో తీసుకుని సైన్యాన్ని ఛేదించుకుంటూ ఎదోము రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాని అది వాళ్ళకు సాధ్యం కాలేదు.27అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషా రాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.

Chapter 4

విధవరాలి నూనె జాడీ

1ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. <<నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు>> అని చెప్పింది.2దానికి ఎలీషా ఆమెతో <<నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు>> అన్నాడు. అప్పుడు ఆమె <<నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు>> అంది.

3అప్పుడు ఎలీషా <<నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో.4అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి>> అని ఆమెతో చెప్పాడు.

5ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది.6ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె <<ఇంకో పాత్ర పట్రండి>> అంది. కానీ ఆమె కొడుకు <<ఇక పాత్రలేమీ లేవు>> అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.

7అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు <<వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి>> అన్నాడు.
షూనేమీయురాలి కొడుకుని బ్రతికించడం

8ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు.9ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది. <<ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడూ, దేవుని మనిషీ అని నాకు తెలుసు.
10కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.>>11కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది.

12అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహజీని పిలిచి <<ఆ షూనేమీ స్త్రీని పిలువు>> అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.13అప్పుడు ఎలీషా గేహజీకి ఇలా ఆదేశించాడు. <<నీవు ఆమెతో చెప్పు. నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు. నీ కోసం ఏం చేయాలి? నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడమంటావా?>> దానికి జవాబుగా ఆమె <<నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను>> అంది.

14తరువాత ఎలీషా <<ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం?>> అని గేహజీని అడిగాడు. గేహజీ <<ఆమెకి కొడుకు లేడు. భర్తేమో ముసలివాడు>> అన్నాడు.15కాబట్టి ఎలీషా <<ఆమెను పిలువు>> అన్నాడు. అతడు వెళ్లి ఆమెను తీసుకు వచ్చాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలుచుంది.16ఎలీషా ఆమెతో <<వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు>> అన్నాడు. అప్పుడు ఆమె <<నా ప్రభూ, వద్దు. దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైన నాతో అబద్ధం చెప్పొద్దు>> అంది.

17కానీ ఆ స్త్రీ గర్భం ధరించింది. ఆ తరువాత సంవత్సరం సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కొడుకుని కన్నది.18ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒక రోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో <<నా తల! నా తల!>> అన్నాడు.19వాడి తండ్రి తన సేవకుడితో <<పిల్లాణ్ణి ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళు>> అన్నాడు.20వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకూ తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు.

21అప్పుడు ఆమె వాణ్ని దేవుని మనిషి కోసం వేయించిన మంచం పై పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వెళ్ళింది.22తన భర్తను పిలిచి <<నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి. ఒక పనివాణ్ణీ, ఒక గాడిదనీ పంపించు>> అని చెప్పింది.

23దానికి ఆమె భర్త <<ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా>> అన్నాడు. దానికామె <<నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది>> అంది.24ఆమె ఆ గాడిదకు జీను కట్టించి దానిపై కూర్చుని పనివాడితో <<వేగంగా పోనీ, నేను చెబితే తప్ప నిదానంగా తోలకు>> అంది.
25ఆ విధంగా ఆమె ప్రయాణం చేసి కర్మెలు పర్వతంపై ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది.

ఆమె దూరంలో ఉండగానే దేవుని మనిషి ఆమెను చూశాడు. తన సేవకుడైన గేహజీని పిలిచి <<చూడు, ఆ షూనేమీ స్త్రీ ఇక్కడికి వస్తుంది.

26నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి <నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?> అని అడుగు>> అని చెప్పి పంపించాడు. దానికామె <<క్షేమంగానే ఉన్నాం>> అని జవాబిచ్చింది.

27తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి గా వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి <<ఆమె చాలా నిస్పృహలో ఉంది. యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు. నీవు ఆమె జోలికి పోకు>> అని ఆదేశించాడు.

28అప్పుడు ఆమె <<ప్రభూ, కొడుకు కావాలని నేను నిన్ను అడిగానా? నాతో అసత్యం పలుక వద్దు అనలేదా?>> అంది.29అప్పుడు ఎలీషా గేహజీతో <<నీవు ప్రయాణానికి సిద్ధపడు. నా కర్ర చేత్తో పట్టుకో. ఆమె ఇంటికి వెళ్ళు. దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్ళను పలకరించ వద్దు. ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్ళకు జవాబివ్వవద్దు. అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు>> అని చెప్పాడు.

30కానీ ఆ పిల్లవాడి తల్లి <<యెహోవా ప్రాణం మీదా, నీ ప్రాణం మీదా ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నిన్ను వదలను>> అంది. కాబట్టి ఎలీషా లేచి ఆమెతో కూడా వెళ్ళాడు.31వాళ్ళ కంటే ముందుగా చేరుకున్న గేహజీ ఆ పిల్లవాడి ముఖంపై కర్ర ఉంచాడు కానీ పిల్లవాడు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. కాబట్టి గేహజీ వెనక్కు వచ్చి దారిలో ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషాతో <<పిల్లవాడు కళ్ళు తెరవలేదు>> అని చెప్పాడు.

32ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు.33కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు.34అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది.

35తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు.36అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి <<ఆ షూనేమీ స్త్రీని పిలుచుకురా>> అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె గది లోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో <<నీ కొడుకుని ఎత్తుకో>> అన్నాడు.37అప్పుడు ఆమె అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది.
పాత్రలో ఉన్న విషపూరితమైన ఆహారం బాగు చేయడం

38ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకుని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు <<పొయ్యి మీద పెద్ద వంట పాత్ర పెట్టి వీళ్ళకు ఆహరం సిద్ధం చెయ్యి>> అని తన సేవకుడికి ఆదేశించాడు.39వారిలో ఒకడు కూరగాయల కోసం పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చేదు ద్రాక్షచెట్టును చూశాడు. చేదు కూరగాయలను కోసుకుని తన అంగీ నిండా నింపుకుని తీసుకుని వచ్చాడు. వాటి స్వభావం వాళ్ళకి తెలియలేదు. వారు వాటిని ముక్కలు చేసి పులుసులో వేశారు.

40భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని <<దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది>> అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు.41కానీ ఎలీషా <<కొంచెం పిండి తీసుకు రండి>> అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి <<భోజనానికి దీన్ని వడ్డించండి>> అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది.
వందమందికి ఆహారం

42తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు<<వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు>> అని చెప్పాడు.43అయితే అతని సేవకుడు <<ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?>> అన్నాడు. దానికి అతడు <<వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే <వారు తినగా ఇంకా మిగులుతాయి> అని యెహోవా చెప్తున్నాడు>> అన్నాడు.44కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.

Chapter 5

కుష్టు రోగి నయమాను స్వస్థత

1సిరియా రాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజు దృష్టిలో గొప్పవాడూ, గౌరవనీయుడూ అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడూ, బలవంతుడూ అయినప్పటికీ అతడు కుష్టు రోగి.2సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవారు. ఒకసారి వారు అక్కడనుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయింది.

3ఆ అమ్మాయి తన యజమానురాలితో <<షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా యజమాని కుష్టురోగాన్ని నయం చేస్తాడు>> అంది.4కాబట్టి నయమాను తన రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు.

5సిరియా రాజు <<నీవు వెళ్ళు. నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను>> అన్నాడు. నయమాను తనతో మూడు వందల నలభై కిలోల వెండీ, ఆరు వేల తులాల బంగారం, పది జతల బట్టలూ తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకు వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి అందించాడు.6ఆ లేఖలో <<నా సేవకుడైన నయమానుకి ఉన్న కుష్టురోగాన్ని నీవు బాగు చేయాలి. అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను>> అని ఉంది.

7ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. <<ఒక మనిషికి ఉన్న కుష్టురోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషులను చంపడానికీ బ్రతికించడానికీ నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది>> అన్నాడు.

8ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొన్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి <<నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతణ్ణి నా దగ్గరికి పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు>> అని సందేశం పంపించాడు.9కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు.10ఎలీషా ఒక వార్తాహరుడి చేత <<నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు>> అని కబురు చేశాడు.

11నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. <<ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను.12ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?>> అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

13అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి <<అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే <నీటిలో మునిగి బాగు పడు> అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా>> అన్నారు.14అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.

15నయమాను అప్పుడు సపరివార సమేతంగా తిరిగి దేవుని మనిషి దగ్గరికి వచ్చాడు. అతని ఎదుట నిలబడి ఇలా అన్నాడు <<చూడండి, ఇశ్రాయేలులో తప్ప భూమి మీద ఎక్కడా వేరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకుడిచ్చే కానుక మీరు తీసుకోవాలి.>>16కానీ ఎలిషా <<నేను దేవుని సన్నిధిలో నిలుచున్నాను. ఆయన మీద ఒట్టు. నేనేమీ తీసుకోను>> అని జవాబిచ్చాడు. ఎలీషా కానుక తీసుకోవాల్సిందే, అంటూ నయమాను పట్టుపట్టాడు కానీ ఎలీషా ఒప్పుకోలేదు.

17కాబట్టి నయమాను <<అలా అయితే నీ సేవకుడిని అయిన నాకు రెండు కంచర గాడిదలు మోయగలిగే మట్టి ఇప్పించు. ఎందుకంటే నేను ఈ రోజు నుండి యెహోవాకి తప్పించి మరి ఏ దేవుడికీ దహనబలి గానీ ఇంకా ఏ ఇతర బలిని గానీ అర్పించను.18ఒక్క విషయంలో యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి. అదేమిటంటే మా రాజుగారు రిమ్మోను దేవుణ్ణి పూజించడం కోసం మందిరంలో ప్రవేశించినప్పుడు నా చేతి మీద ఆనుకుంటాడు, అప్పుడు ఆయనతో పాటు నేను కూడా రిమ్మోను దేవుడి ఎదుట వంగుతాను. అలా నేను రిమ్మోను దేవుడి ఎదుట వంగినప్పుడు యెహోవా నీ సేవకుడినైన నన్ను క్షమిస్తాడు గాక>> అన్నాడు.19అప్పుడు ఎలీషా <<ప్రశాంతంగా వెళ్ళు>> అన్నాడు. నయమాను అక్కడి నుండి కదిలాడు.

20అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహజీ ఇలా అనుకున్నాడు. <<చూశావా, ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతణ్ణి వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను.>>

21ఇలా అనుకుని గేహజీ నయమాను వెనకాలే వెళ్ళాడు. తన వెనకాలే ఎవరో పరుగెత్తుకుంటూ రావడం నయమాను చూసి తన రథంపై నుండి దిగి అతణ్ణి కలుసుకుని <<అంతా క్షేమమేనా?>> అని అడిగాడు.22గేహాజీ <<అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. <ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి> అని చెప్పమన్నాడు>> అన్నాడు.

23అందుకు నయమాను <<నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను>> అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వారు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు.24వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు.25తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి <<గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?>> అని అడిగాడు. దానికి గేహాజీ <<నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు>> అన్నాడు.

26అప్పుడు ఎలీషా గేహజీతో <<ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం?27అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది>> అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

Chapter 6

గొడ్డలి పైకి తేలింది

1తరువాత ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. వారు ఎలీషాతో <<మేము నీతో ఉంటున్న ఈ స్థలం చాలా ఇరుకుగా ఉంది.2నీవు దయ చేసి అనుమతిస్తే మేమంతా యొర్దానుకు వెళ్ళి అక్కడ్నించి ఒక్కొక్కరం ఒక్కో చెట్టు కొట్టి తెచ్చుకుంటాం. వాటితో మరో చోట మా కోసం నివాసాలు కట్టుకుంటాం>> అన్నారు. దానికి ఎలీషా <<అలాగే, వెళ్ళండి>> అని జవాబిచ్చాడు.3వాళ్ళల్లో ఒకడు <<నీ సేవకులైన మాతో దయచేసి నువ్వూ రావాలి>> అని బతిమాలాడు. ఎలీషా <<సరే, నేనూ వస్తాను>> అన్నాడు.

4కాబట్టి అతడు వాళ్ళతో వెళ్ళాడు. అందరూ యొర్దానుకి వెళ్ళి చెట్లు నరకడం ప్రారంభించారు.5ఒకడు కొమ్మ కొడుతున్నప్పుడు వాడి గొడ్డలి ఊడి కింద నీళ్ళలో పడిపోయింది. వాడు <<అయ్యో, నా ప్రభూ, అది అరువు తెచ్చిన గొడ్డలి>> అంటూ కేకలు పెట్టాడు.

6అప్పుడు దేవుని మనిషి <<అదెక్కడ పడింది?>> అని అడిగాడు. వాడు అతనికి అది పడిన ప్రాంతం చూపించాడు. అప్పుడతడు ఒక చిన్న కొమ్మని కొట్టి దాన్ని నీళ్ళలో వేశాడు. అప్పుడు ఆ ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలి పైకి వచ్చింది.7ఎలీషా <<దాన్ని పైకి తియ్యి>> అన్నాడు. వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు.
ఎలీషా సిరియానులకు గుడ్డితనం కలుగజేశాడు

8తరువాత సిరియా దేశం రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. తన సేవకులతో ప్రణాళిక వేసి <<ఫలానా చోట నా శిబిరం వేసి ఉంచుతాను>> అని చెప్పాడు.9కానీ దేవుని మనిషి ఇశ్రాయేలు రాజుకి కబురు పంపి <<ఆ మార్గం గుండా వెళ్ళకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే సిరియా సైన్యం అక్కడకు రాబోతున్నారు>> అని తెలియజేశాడు.

10ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా ఆనేకసార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది.11దీని వల్ల సిరియా రాజు మనసులో కలవరపడ్డాడు. తన సేవకులను పిలిచి <<మనలో ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నదెవరో నాకు మీరు చెప్పరా?>> అని అడిగాడు.

12కాబట్టి అతని సేవకుల్లో ఒకడు <<నా ప్రభూ, రాజా, అలా కాదు. ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఇశ్రాయేలు రాజుకి మీరు మీ పడగ్గదిలో పలికిన మాటలు కూడా చెప్పేస్తాడు>> అన్నాడు.13అప్పుడు రాజు <<వెళ్ళండి, ఆ ఎలీషా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. నేను మనుషులను పంపి అతణ్ణి పట్టుకుంటాను>> అని జవాబిచ్చాడు. అప్పుడు వారు అతనికి <<అతడు దోతానులో ఉన్నాడు>> అని సమాచారమిచ్చారు.

14కాబట్టి రాజు దోతానుకి గుర్రాలనూ, రథాలనూ, భారీ సంఖ్యలో సైన్యాలనూ పంపించాడు. వారు రాత్రి వేళ వచ్చారు. ఆ పట్టణాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టారు.15దేవుని మనిషి దగ్గర పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. పట్టణం చుట్టూ గుర్రాలూ, రథాలూ, పెద్ద సైన్యం మోహరించి ఉండటం చూశాడు. అప్పుడు ఆ పనివాడు <<అయ్యో ప్రభూ, ఇప్పుడు మనమేం చేద్దాం?>> అని దేవుని మనిషితో అన్నాడు.16దానికి ఎలీషా <<భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది>> అని జవాబిచ్చాడు.

17ఆ తరువాత ఎలీషా <<యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు>> అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

18సిరియా సైన్యం ఎలీషాకి దగ్గరగా వచ్చారు. అప్పుడు ఎలీషా <<ఈ సైన్యానికి గుడ్డితనం కలుగజెయ్యి>> అని యెహోవాను ప్రార్థించాడు. ఎలీషా అడిగినట్టే యెహోవా వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు.19అప్పుడు ఎలీషా వాళ్ళతో <<మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఇది పట్టణమూ కాదు. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను, నా వెనకాలే రండి>> అని చెప్పి వాళ్ళను షోమ్రోను పట్టణంలోకి తీసుకు వెళ్ళాడు.

20వారు షోమ్రోనులోకి వచ్చిన తరువాత ఎలీషా <<యెహోవా, వీళ్ళు చూడాలి. వీళ్ళ కళ్ళు తెరువు>> అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వాళ్ళ కళ్ళు తెరిచాడు. తాము షోమ్రోనులో ఉన్నామని వాళ్లకర్థమైంది.21అప్పుడు ఇశ్రాయేలు రాజు వాళ్ళను చూసి <<నా తండ్రీ, వీళ్ళను చంపమంటావా, చంపెయ్యనా?>> అని ఎలీషాని అడిగాడు.

22అప్పుడు ఎలీషా <<నీవు వాళ్ళని చంపకూడదు. నీ వింటినీ, కత్తినీ ప్రయోగించి బందీలుగా పట్టుకున్న వాళ్ళను ఎలా చంపుతావు? వాళ్లకు రొట్టె, నీళ్ళూ ఇవ్వు. వారు తిని తాగి తమ రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు>> అన్నాడు.23కాబట్టి రాజు వాళ్ళ కోసం విందు చేయించి అనేక రకాల భోజన పదార్థాలను తయారు చేయించాడు. వారు తిని తాగిన తరువాత వాళ్ళను తిరిగి తమ రాజు దగ్గరికి పంపించి వేశాడు. ఆ తరువాత సిరియా సైన్యం చాలా కాలం వరకూ ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టలేదు.
షోమ్రోనులో భయంకరమైన కరువు

24ఇదంతా జరిగిన తరువాత సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా తీసుకుని షోమ్రోనుపై దాడికి వచ్చి పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు.25దానివల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చింది. వాళ్ళ ముట్టడి ఎంత దారుణంగా ఉందంటే దాని మూలంగా షోమ్రోనులో గాడిద తలను ఎనభై తులాల వెండికీ, పావు కొలత పెన్నేరు దుంప1 ఐదు తులాల వెండికీ అమ్మారు.26ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు ప్రాకారం గోడపై నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ రాజును చూసింది. <<రాజా, నా ప్రభూ, సహాయం చెయ్యండి>> అంటూ కేకలు పెట్టింది.

27అది విని రాజు <<యెహోవాయే నీకు సహాయం చెయ్యడం లేదు. ఇక నేనేం చేస్తాను. ద్రాక్ష గానుగ నుండీ, ధాన్యపు కళ్ళం నుండీ ఏమన్నా వస్తుందా>> అన్నాడు.28రాజు ఇంకా <<నీకు వచ్చిన కష్టం ఏమిటి?>> అని అడిగాడు. దానికి ఆమె <<ఒకామె నాతో ఇలా అంది, <ఈ రోజుకి నీ కొడుకుని ఇవ్వు. వాణ్ని ఈ రోజు మనం వండుకుని తినేద్దాం. రేపు నా కొడుకుని ఇస్తా. రేపు తిందాం> అంది.29అలాగే మేము నా కొడుకుని వండుకుని తినేశాం. అయితే తరువాత రోజు నేను <ఈ రోజు భోజనానికి నీ కొడుకుని ఇవ్వు> అని అడిగాను. కానీ ఆమె తన కొడుకుని దాచిపెట్టుకుంది>> అని చెప్పింది.

30రాజు ఆమె చెప్పింది విని తన బట్టలు చింపుకున్నాడు. ప్రాకారం గోడ పైన నడుస్తున్న రాజును ప్రజలు చూసినప్పుడు వారికి రాజు శరీరం పై గోనె పట్ట కనిపించింది.31అప్పుడు రాజు <<ఈ రోజు షాపాతు కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాడు గాక>> అన్నాడు.

32అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అతనితో పాటు కొందరు పెద్దలు కూడా ఉన్నారు. అప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు. ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి రాక ముందే ఎలీషా ఆ పెద్దలతో <<ఈ హంతకుని కొడుకు నా తల తీయడానికి మనిషిని పంపాడు చూశారా! మీరు చూస్తూ ఉండండి. అతడు వచ్చిన వెంటనే తలుపుతో వాణ్ని వెనక్కు తోసి తలుపులు మూయండి. వాడి వెనకాలే వాడి యజమాని కాళ్ళ చప్పుడు మనకు విన్పిస్తున్నది కదా>> అన్నాడు.33ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిన మనిషి, వాడి వెనకే రాజూ వచ్చారు. అప్పుడు రాజు <<ఈ హాని మనకు యెహోవా వల్ల జరిగింది. ఇక మనం ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలి?>> అన్నాడు.


1 6:25 పావురం రెట్ట అని తర్జుమా చేసింది బహుశా సెనగ గింజలను గానీ భూమిలో తవ్వి తీసే ఒక రకమైన చవకబారు చప్పిడి దుంపను గానీ అయి ఉండవచ్చు. తెలుగులో దీనికి సమానార్ధకం లేదు గానీ <<పెన్నేరు దుంప>> అని నిఘంటువు చెబుతున్నది.

Chapter 7

1అప్పుడు రాజుతో ఎలీషా <<యెహోవా చెప్తున్న మాట విను. యెహోవా చెప్తున్నదేమిటంటే, రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముతారు>> అన్నాడు.2అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో <<చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?>> అన్నాడు. దానికి ఎలీషా <<చూస్తూ ఉండు. అలా జరగడం నీవు కళ్ళారా చూస్తావు గానీ దాంట్లో దేన్నీ తినవు>> అని జవాబిచ్చాడు.

3ఆ సమయంలో పట్టణ ద్వారం దగ్గర నలుగురు కుష్టురోగులున్నారు. వారు <<మనం చచ్చే వరకూ ఇక్కడే ఎందుకు కూర్చోవాలి?4మనం ఊళ్ళోకి వెళ్తే కరువు వల్ల చచ్చిపోతాం. ఇక్కడ ఇలానే కూర్చుని ఉన్నా చావు తప్పదు. అందుకని లేవండి. సిరియా సైన్యం దగ్గరికి వెళ్దాం పదండి. వారు మనలను బతకనిస్తే ఉందాం, చంపితే చద్దాం>> అని తమలో తాము చెప్పుకున్నారు.

5ఇలా మాట్లాడుకుని వారు ఉదయం ఇంకా చీకటి ఉండగానే సిరియా సైన్య శిబిరం దగ్గరికి వెళ్లాలని లేచారు. వారు ఆ శిబిరానికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు.6ఎందుకంటే ఆ శిబిరంలో ఉన్న వారు గుర్రాలూ, రథాలూ పరిగెడుతున్నట్టూ మరో పెద్ద సైనిక దండు కదులుతున్నట్టూ శబ్దాలు వినేలా యెహోవా చేశాడు. దాంతో వారు <<మనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునీ, ఐగుప్తీయుల రాజునీ తోడు తెచ్చుకున్నాడు>> అని తమలో తాము చెప్పుకున్నారు.

7కాబట్టి ఆ సైన్యం ఉదయాన్నే తెల్లవారక ముందే లేచి తమ గుడారాలనూ, గుర్రాలనూ, గాడిదలనూ వదిలి కాళ్ళకు బుద్ధి చెప్పారు. శిబిరాన్ని ఉన్నది ఉన్నట్టుగా వదిలి ప్రాణాలు దక్కించుకోడానికి పరుగులు తీశారు.8అప్పుడు ఆ కుష్టు రోగులు శిబిరం దగ్గరికి వచ్చి ఒక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ తిని తాగారు. అక్కడ ఉన్న వెండీ, బంగారం, బట్టలూ తీసుకుని వెళ్లి వాటిని దాచి పెట్టారు. తరువాత వెనక్కి వచ్చి మరో గుడారంలోకి వెళ్ళి అక్కడి వస్తువులు కూడా తీసుకు వెళ్ళి దాచి పెట్టారు.

9తరువాత వారు ఇలా చెప్పుకున్నారు. <<మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభవార్త చెప్పాల్సిన రోజు. కానీ మనం దాని విషయంలో మౌనంగా ఉన్నాం. తెల్లవారే వరకూ మనం ఇక్కడే ఉంటే మనకు శిక్ష తప్పదు. కాబట్టి ఇప్పుడు మనం రాజభవనంలో ఈ సంగతి తెలియజేద్దాం.>>

10అలా వారు వచ్చి పట్టణ ద్వారం దగ్గర కాపలా ఉన్నవాళ్ళని పిలిచి వాళ్ళతో <<మేము సిరియా సైన్య శిబిరానికి వెళ్ళాం. అక్కడ ఎవ్వరూ లేరు. మనుషుల చప్పుడే లేదు. గుర్రాలూ, గాడిదలూ కట్టి ఉన్నాయి. గుడారాలన్నీ అలానే ఉన్నాయి>> అని చెప్పారు.11అప్పుడు కాపలాదార్లు కేక వేసి ఆ వార్తను తెలియజేశారు. రాజభవనంలో ఈ వార్త తెలిసింది.

12అప్పుడు రాజు రాత్రి వేళ లేచి తన సేవకులను పిలిచాడు. వాళ్ళతో <<ఇప్పుడు సిరియా వారు మనకేం చేశారో చెప్తాను చూడండి. మనం ఆకలితో నకనకలాడుతున్నామని వాళ్ళకు తెలుసు. వారు <వీళ్ళు పట్టణంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను సజీవంగా పట్టుకుని మనం పట్టణంలో ప్రవేశిద్దాం> అని చెప్పుకుని శిబిరం విడిచి బయటకు వెళ్ళి దాక్కున్నారు>> అన్నాడు.13అప్పుడు రాజు సేవకుల్లో ఒకడు <<పట్టణంలో ఇంకా మిగిలి ఉన్న ఐదు గుర్రాల పైన కొంతమందిని వెళ్ళనీయండి. ఇశ్రాయేలులో చాలా మంది చనిపోయారు కదా, మరో ఐదుగురు పోతే నష్టమేంటి? వాళ్ళని పంపి చూద్దాం>> అని బతిమాలాడు.

14కాబట్టి రాజు వాళ్లకి <<సిరియా సైన్యం ఎలా ఉందో వెళ్ళి చూడండి>> అని ఆదేశించాడు. వారు రెండు రథాలనూ, వాటి గుర్రాలనూ తీసుకున్నారు.15సిరియా సైన్యం కోసం యొర్దాను నది వరకూ వెళ్ళారు. సిరియా సైన్యం పారిపోతూ ఆ హడావుడిలో దారి పొడుగునా బట్టలూ, ఇతర సామగ్రీ పారేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి వార్తాహరులు తిరిగి వెళ్ళి రాజుకు ఆ సమాచారం ఇచ్చారు.

16ఇక ప్రజలు బయటకు వెళ్ళి సిరియా సైన్యం శిబిరాన్ని దోచుకున్నారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రకారం ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్మారు.17ఎవరి భుజంపై రాజు ఆనుకుని నిలబడ్డాడో ఆ అధికారిని ద్వారం దగ్గర ఉండమని రాజు ఆజ్ఞాపించాడు. అయితే ఆ అధికారి ప్రజల తొక్కిసలాటలో నలిగి చనిపోయాడు. రాజు తనని చూడడానికి వచ్చినప్పుడు దేవుని మనిషి చెప్పిన దాని ప్రకారం ఇది జరిగింది.

18<<రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముడవుతాయి>> అని దేవుని మనిషి రాజుతో చెప్పినట్టు ఇది జరిగింది.19అప్పుడు ఆ అధికారి <<చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?>> అని ప్రశ్నించాడు. దానికి దేవుని మనిషి <<చూస్తూ ఉండు. అలాగే జరగడం నీవు నీ కళ్ళారా చూస్తావు. కానీ దాంట్లో దేన్నీ తినవు>> అని జవాబిచ్చాడు.20అతనికి ఆ విధంగానే జరిగింది. ద్వారం దగ్గర ప్రజల తొక్కిసలాటలో అతడు చనిపోయాడు.

Chapter 8

తన ఇంటి తిరిగి వచ్చిన షూనేమి స్త్రీ

1తరువాత ఎలీషా తాను బతికించిన పిల్లవాడి తల్లిని పిలిచాడు. ఆమెతో <<నీ కుటుంబాన్ని తీసుకుని బయల్దేరు. ఎక్కడైనా నీకు అనుకూలమైన మరో దేశంలో ఉండు. ఎందుకంటే దేశంలో యెహోవా కరువు రప్పించబోతున్నాడు. ఈ కరువు ఏడు సంవత్సరాలు ఉంటుంది>> అన్నాడు.2కాబట్టి ఆమె దేవుని మనిషి మాటకు లోబడి తన కుటుంబాన్ని తీసుకుని ఫిలిష్తీ దేశం వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించింది.

3ఆ ఏడు సంవత్సరాలు ముగిసిన తరువాత ఆమె ఫిలిష్తీ దేశం నుండి తిరిగి వచ్చి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వెళ్ళింది.4ఆ సమయంలో రాజు దేవుని మనిషి దగ్గర పని చేస్తున్న గేహజీతో <<ఎలీషా చేసిన గొప్ప విషయాలను నాకు చెప్పు>> అన్నాడు.

5చనిపోయిన పిల్లవాణ్ణి ఎలీషా ఎలా బ్రతికించాడో గేహాజీ చెప్తూ ఉండగా ఎలీషా బతికించిన పిల్లవాడి తల్లి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వచ్చింది. అప్పుడు గేహజీ <<నా ప్రభూ, రాజా, ఈమే ఆ స్త్రీ. ఎలీషా బతికించిన పిల్లవాడు వీడే>> అన్నాడు.6రాజు ఆమె కొడుకును గూర్చి ఆమెను అడిగాడు. ఆమె అతనికి అంతా వివరించింది. కాబట్టి రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించాడు. <<ఆమెకు చెందిన ఆస్తిని ఆమెకు ఇచ్చేయండి. ఆమె దేశం వదిలి వెళ్ళిన దగ్గరనుండి ఆమె పొలంలో పండిన పంట అంతా ఆమెకివ్వండి>> అని ఆదేశించాడు.
హజాయేలు రాజు అయ్యాడు

7ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియా రాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు. <<దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడు>> అని రాజుకు చెప్పారు.8రాజు హజాయేలును1 పిలిచాడు. <<నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు. <నాకు నయమౌతుందా లేదా> అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు>> అని చెప్పాడు.9కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. <<సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు>> అన్నాడు.

10అప్పుడు ఎలీషా <<నీవు వెళ్ళు. అతనికి తప్పక నయమౌతుంది అని చెప్పు. కానీ అతడు కచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు చూపించాడు>> అన్నాడు.11ఇలా చెప్పి ఎలీషా హజాయేలు సిగ్గు పడేంతగా అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.12అప్పుడు హజాయేలు <<నా ప్రభూ, మీరెందుకు ఏడుస్తున్నారు?>> అని అడిగాడు. దానికి ఎలీషా <<ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు. వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు. వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు. పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. గర్భవతుల కడుపులు చీరేస్తావు>> అని జవాబిచ్చాడు.

13అందుకు హజాయేలు <<నేను కుక్కలాంటి వాణ్ణి. ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను?>> అన్నాడు. దానికి ఎలీషా <<నీవు సిరియాకు రాజు అవుతావు. నాకు యెహోవా చూపించాడు>> అన్నాడు.14అతడు ఎలీషా దగ్గరనుండి తన రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు <<ఎలీషా నీతో ఏం చెప్పాడు>> అని అడిగాడు. అతడు <<నీకు తప్పకుండా నయమౌతుంది అన్నాడు>> అని జవాబిచ్చాడు.15కాని ఆ తరువాత రోజు హజాయేలు ఒక కంబళి తీసుకుని నీటితో తడిపి దాన్ని రాజు ముఖంపై పరిచాడు. దాంతో రాజు చనిపోయాడు. అతని స్థానంలో హజాయేలు రాజు అయ్యాడు.
యూదా రాజైన యెహోరము
8:16-24; 2 దిన 21:5-10, 20

16అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన అయిదో సంవత్సరంలో యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదా వాళ్ళపై రాజుగా పరిపాలన ప్రారంభించాడు.17అతనికప్పుడు ముప్ఫై రెండేళ్ళు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

18ఇతడు అహాబు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి ఇతడు ఇశ్రాయేలు రాజుల్లాగే వ్యవహరించాడు. అహాబు కుటుంబానికి చెందిన వాడిలా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు.19కానీ యెహోవా తన సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు కనుక యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదు వారసులు యూదా రాజ్యాన్ని ఎన్నటికీ పరిపాలిస్తారని దేవుడు దావీదుకి ప్రమాణం చేశాడు.

20ఈ యెహోరాము పాలించిన రోజుల్లో ఎదోమీయులు యూదా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒక రాజును తమ కోసం నియమించుకున్నారు.21కాబట్టి యెహోరాము తన సైన్యాన్నీ, రథాలన్నిటినీ తీసుకుని ఎదోము సరిహద్దుల్లో ఉన్న జాయీరు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎదోము సైన్యాలు వాళ్ళను చుట్టుముట్టాయి. కానీ యెహోరాము రాత్రివేళ తన సైనికులతో రథాలతో శత్రుసైన్యాల పంక్తులను ఛేదించుకుని తప్పించుకున్నారు. అప్పుడు అతని సైన్యం తప్పించుకుని తమ ఇళ్ళకు చేరుకున్నారు.

22కాబట్టి ఈ రోజు వరకూ ఎదోమీయులు యూదా పై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో లిబ్నా ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు.23యెహోరామును గూర్చిన ఇతర విషయాలకొస్తే, అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.24యెహోరాము చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. దావీదు పట్టణంలో అతని పూర్వీకులతో కూడా అతణ్ణి పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు అహజ్యా రాజు అయ్యాడు.
యూదా రాజైన అహజ్యా
2 దిన 22:1-6

25అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన పన్నెండో సంవత్సరంలో యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా పరిపాలించడం ప్రారంభించాడు.26అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతనికి ఇరవై రెండేళ్ళు. ఇతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలన చేశాడు. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ కూతురు.27అహజ్యా అహాబు కుటుంబానికి అల్లుడు. కాబట్టి అహాబు కుటుంబానికి చెందిన వాడిలాగే ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు.

28అతడు అహాబు కొడుకు యెహోరాముతో కలసి రామోత్గిలాదు దగ్గర సిరియా రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సిరియా సైన్యం యెహోరామును గాయపరిచింది.29యెహోరాము సిరియా రాజు హజాయేలుతో రమా దగ్గర యుద్ధం చేసినప్పుడు తనకు కలిగిన గాయాలను నయం చేసుకోడానికి యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చాడు. యూదా రాజూ, యెహోరాము కొడుకూ అయిన అహజ్యా, అహాబు కొడుకు యెహోరాము జబ్బు పడ్డాడని తెలుసుకుని అతణ్ణి పరామర్శించడానికి యెజ్రెయేలుకి వచ్చాడు.


1 8:8 హజాయేలును రాజు దగ్గర ఉన్న ప్రముఖులో ఒక్కడు

Chapter 9

ఇశ్రాయేలు రాజుగా యెహూ అభిషేకం

1ఆ తరువాత ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల సమాజం నుండి ఒక వ్యక్తిని పిలిచాడు. అతనితో <<ప్రయాణానికి బట్టలు ధరించు. ఈ చిన్న నూనె సీసా పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్ళు.2అక్కడకు చేరుకున్న తరువాత నింషీ మనవడూ, యెహోషాపాతు కొడుకూ అయిన యెహూ కోసం వాకబు చెయ్యి. అతణ్ణి కలుసుకో. అతణ్ణి తన సహచరులనుండి వేరు చేసి లోపలి గదిలో ఏకాంతమైన చోటికి తీసుకు వెళ్ళు.3నూనె సీసా తీసి అతని తలపై నూనె పోసి <ఇశ్రాయేలు రాజుగా నేను నిన్ను అభిషేకం చేసానని యెహోవా చెప్తున్నాడు> అని అతనితో చెప్పు. తరువాత తలుపు తీసి ఆలస్యం చేయకుండా అక్కడ్నించి పారిపో>> అని చెప్పాడు.

4కాబట్టి ప్రవక్త అయిన ఆ యువకుడు రామోత్గిలాదుకి ప్రయాణమయ్యాడు. అతడు చేరుకునేసరికి అక్కడ సేనా నాయకులు కూర్చుని ఉన్నారు.5అప్పుడు ఆ యువకుడు <<నాయకా, నేను నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను>> అన్నాడు. దానికి యెహూ <<ఇంతమందిమి ఉన్నాం. ఆ మాట ఎవరిని గూర్చి?>> అన్నాడు. యువకుడైన ఆ ప్రవక్త <<నాయకా, ఆ మాట నీ కోసమే>> అన్నాడు.6కాబట్టి యెహూ లేచి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ప్రవక్త అతని తలపై నూనె పోశాడు. యెహూతో <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు పైనా దేవుని ప్రజల పైనా నిన్ను రాజుగా అభిషేకించాను.

7నా సేవకులైన ప్రవక్తలనూ, యెహోవా ఇతర సేవకులనూ యెజెబెలు చంపించింది. వారు కార్చిన రక్తానికి నేను ప్రతీకారం తీర్చుకునేలా నీవు నీ రాజు అయిన అహాబు కుటుంబాన్ని అంతం చేయాలి.8అహాబు సంతానం అందరూ నశిస్తారు. వాడు దాసుడైనా స్వతంత్రుడైనా అహాబు సంతానంలో ప్రతి మగవాడినీ నేను సమూలనాశనం చేస్తాను.

9నెబాతు కొడుకు యరొబాము కుటుంబంలా, అహీయా కొడుకు బయెషా కుటుంబంలా అహాబు కుటుంబాన్ని చేస్తాను.10యెజ్రెయేలులో యెజెబెలును కుక్కలు పీక్కు తింటాయి. ఆమెను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు.>> ఈ మాటలు చెప్పి ఆ ప్రవక్త తలుపు తీసుకుని పారిపోయాడు.

11అప్పుడు యెహూ బయటకు తన తోటి రాజ సేవకుల దగ్గరికి వచ్చాడు. వారిలో ఒకడు <<అంతా కుశలమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు?>> అని అడిగాడు. దానికి యెహూ <<వాడూ, వాడి మాటలూ మీకు తెలుసు కదా>>అన్నాడు.12అప్పుడు వారు <<మాకు తెలియదు. చెప్పు>> అన్నారు. అప్పుడు యెహూ <<అతడు నాతో అదీ ఇదీ మాట్లాడాడు. ఆ తరువాత అతనింకా <యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేశాను> అన్నాడు>> అని చెప్పాడు.13వెంటనే వారు తమ బట్టలు తీసి యెహూ దిగుతున్న మెట్ల మీద పరిచారు. భేరీలు ఊది <<యెహూ రాజయ్యాడు>> అని ప్రకటించారు.
యెహూ, యెహోరాము, అహజ్యాను చంపడం

14నింషీ కొడుకు యెహూ ఈ విధంగా యెహోషాపాతు కొడుకు యెహోరాముపై కుట్ర చేశాడు. ఆ సమయంలో యెహోరామూ, ఇశ్రాయేలు వాళ్ళంతా రామోత్గిలాదును సిరియా రాజు హజాయేలు నుండి రక్షించడానికి అక్కడే ఉన్నాడు.15కానీ యెహోరాము సిరియా రాజు హజాయేలుతో చేస్తున్న యుద్ధంలో సిరియా సైన్యం చేసిన గాయాలను బాగు చేసుకోడానికి యెజ్రెయేలుకి తిరిగి వచ్చాడు.

అప్పుడు యెహూ రాజు సేవకులతో <<ఇదే మీ అభిప్రాయమైతే యెజ్రెయేలుకి ఈ వార్త వెళ్ళడానికి వీలు లేదు. ఈ పట్టణం విడిచి ఎవరూ తప్పించుకుని వెళ్ళకుండా చూడండి>> అని చెప్పాడు.

16అక్కడనుండి యెహూ రథంపై యెజ్రెయేలుకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడే యెహోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో యూదా రాజు అహజ్యా యెహోరామును కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు.

17యెజ్రెయేలు ప్రాకారం మీద ఒక కాపలా వాడు కావలి కాస్తున్నాడు. వాడు ప్రాకారం పైనుండి కొంత దూరంలో వస్తున్న యెహూనూ అతనితో వస్తున్న సైనిక దళాన్నీ చూసి <<ఒక సైనిక దళం రావడం నాకు కనిపిస్తుంది>> అన్నాడు. అప్పుడు యెహోరాము <<ఒక గుర్రపు రౌతును పిలవండి. ఆ వచ్చేవాళ్ళను కలుసుకోడానికి అతణ్ణి పంపించండి. అతడు వాళ్ళను <శాంతిభావంతో వస్తున్నారా> అని అడగాలి>> అని చెప్పాడు.18కాబట్టి ఒకడు గుర్రాన్నెక్కి వాళ్ళను కలుసుకోడానికి వెళ్ళి <<మీరు శాంతిభావంతో వస్తున్నారా అని రాజు అడుగుతున్నాడు>> అన్నాడు. దానికి యెహూ <<శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా>> అన్నాడు. కాపలా వారు <<వార్తాహరుడు వాళ్ళను కలుసుకున్నాడు గానీ తిరిగి రావడం లేదు>> అని రాజుకు తెలియజేశారు.

19అప్పుడు రాజు రెండో అశ్వికుణ్ణి పంపాడు. వాడు వాళ్ళ దగ్గరికి వచ్చి <<మీరు శాంతిభావంతో వస్తున్నారా, అని రాజు అడుగుతున్నాడు>> అన్నాడు. దానికి యెహూ <<శాంతిభావం సంగతి నీకెందుకు? వెనక్కు తిరిగి నా వెనకాలే రా>> అన్నాడు.20మళ్ళీ కావలి వాడు <<వీడు కూడా వాళ్ళను కలుసుకుని తిరిగి రావడం లేదు. రథం నడపడం చూస్తే అది నింషీ కొడుకు యెహూ తోలడంలా ఉంది. వెర్రెత్తినట్టు రథం తోలుతున్నాడు>> అన్నాడు.

21కాబట్టి యెహోరాము <<నా రథాన్ని సిద్ధం చేయండి>> అన్నాడు. అతని రథాన్ని సిద్ధం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోరామూ, యూదా రాజు అహజ్యా తమ రథాలపై బయల్దేరి యెహూను కలుసుకోడానికి వెళ్ళారు. యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన భూమి దగ్గర అతణ్ణి ఎదుర్కున్నారు.22అప్పుడు యెహోరాము యెహూతో <<యెహూ, శాంతి భావంతో ఉన్నావా?>> అని అడిగాడు. దానికి యెహూ <<నీ తల్లి యెజెబెలు వ్యభిచారం, మంత్రవిద్యలు ఇంత మితిమీరిపోయి ఉండగా ఇక శాంతి భావం ఎక్కడది?>> అన్నాడు.

23వెంటనే యెహోరాము రథాన్ని మళ్ళించి <<అహజ్యా, మోసం, విశ్వాస ఘాతుకం>> అని అహజ్యాతో చెప్పి పారిపోయాడు.24అప్పుడు యెహూ బాణం తీసి తన శక్తి కొద్దీ ఎక్కుపెట్టి యెహోరాము భుజాల మధ్య గురి చూసి కొట్టాడు. ఆ బాణం అతని గుండెల్లోకి దూసుకు వెళ్ళింది. అతడు తన రథంలోనే కుప్పగూలిపోయాడు.

25అప్పుడు యెహూ తన దగ్గర అధికారి బిద్కరుని పిలిచి <<అతణ్ణి ఎత్తి యెజ్రెయేలు వాడైన నాబోతు పొలంలో పడవేయి. నీకు గుర్తుందా? మనం ఇద్దరం ఇతని తండ్రి అహాబుతో కలసి గుర్రాలెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనికి వ్యతిరేకంగా ఈ ప్రవచనాన్ని పలికించాడు26<యెహోవా చెప్తున్నదేమిటంటే నిన్న నేను నాబోతు రక్తాన్నీ, అతని కొడుకుల రక్తాన్నీ కచ్చితంగా చూశాను. యెహోవాను చెప్తున్నాను. ఇదే నేలపై నేను నీకు ప్రతీకారం చేస్తాను> కాబట్టి ఇప్పుడు నువ్వు యెహోవా మాట ప్రకారం ఇతణ్ణి ఈ పొలంలో పడవేయి>> అన్నాడు.

27జరిగిందంతా చూసిన యూదా రాజు అహజ్యా బేత్ హగ్గాన్ పట్టణం దారిలో తన రథం పై పారిపోయాడు. కానీ యెహూ అతణ్ణి తరిమాడు. <<ఆ రథంలోనే అతణ్ణి చంపండి>> అంటూ తన సేనానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఇబ్లెయాముకు సమీపంలో ఉన్న గూరుకు వెళ్ళే దారిలో అతనిపై బాణాలు వేసి కొట్టారు. అహజ్యా తన రథంలోనే మెగిద్దోకు వెళ్ళి అక్కడ చనిపోయాడు.28అతని సేవకులు అతణ్ణి రథం మీద యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. దావీదు నగరంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి సమాధి చేశారు.

29ఈ అహజ్యా అహాబు కొడుకు యెహోరాము పరిపాలన పదకొండో సంవత్సరంలో యూదాకు రాజు అయ్యాడు.
యెజెబెలు మరణం

30యెహూ యెజ్రెయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలోనుండి బయటకు తొంగి చూసింది.31యెహూ గుమ్మం గుండా లోపలికి వస్తుండగా <<జిమ్రీ వలే యజమానిని చంపినవాడా, శాంతి భావంతో వస్తున్నావా?>> అని అడిగింది.32అతడు తలెత్తి కిటికీ వైపు చూశాడు. <<అక్కడ నా వైపు ఉన్నదెవరు?>> అని అడిగాడు. ఇద్దరు ముగ్గురు నపుంసకులు కిటికీలోనుండి తొంగి చూసారు.

33యెహూ <<ఆమెను కిందకు తోసెయ్యండి>>అన్నాడు. వారు యెజెబెలుని కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడలమీదా, గుర్రాలమీదా చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు.34తరువాత అతడు భవనంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత <<శాపానికి గురైన ఆమె ఒక రాజ కుమార్తె. కాబట్టి వెళ్ళి ఆమెని సమాధి చేయండి>> అని ఆదేశించాడు.

35సేవకులు ఆమెని సమాధి చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆమె పుర్రె, కాళ్ళు, అరచేతులూ తప్ప ఇంకేమీ కనపడలేదు.36వారు వచ్చి యెహూకి ఆ సంగతి చెప్పారు. అప్పుడు అతడు <<ఇది యెహోవా తన సేవకుడూ, తిష్బీ వాడూ అయిన ఏలీయా ద్వారా పలికిన మాట, <యెజ్రెయేలు నేలపై కుక్కలు యెజెబెలు మాంసాన్ని తిని వేస్తాయి.37ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది> ఆ మాట ప్రకారం ఇది జరిగింది>> అన్నాడు,

Chapter 10

అహాబు కుమారులు మరణం

1అహాబుకి షోమ్రోనులో డెబ్భై మంది సంతానం ఉన్నారు. యెహూ షోమ్రోనులో ఉన్న యెజ్రెయేలు అధిపతులకూ, అక్కడి పెద్దలకూ, అహాబు సంతానం సంరక్షకులకూ ఉత్తరాలు రాసి పంపాడు.2ఆ ఉత్తరంలో ఇలా రాశాడు<<మీ యజమాని వారసులు మీ దగ్గరే ఉన్నారు. మీ దగ్గర రథాలూ, గుర్రాలూ, ఆయుధాలూ ఉన్నాయి. అలాగే మీరు బలమైన ప్రాకారాలున్న పట్టణంలో ఉన్నారు.3కాబట్టి ఈ ఉత్తరం మీకు అందిన వెంటనే మీ యజమాని వారసుల్లో శ్రేష్ఠమైన వాణ్ణీ, యోగ్యుణ్ణీ ఎంపిక చేసి అతణ్ణి తన తండ్రి సింహాసనంపై కూర్చోబెట్టండి. మీ యజమాని రాజ వంశం కోసం యుద్ధం చేయండి.>>

4కానీ వారు చాలా భయపడిపోయారు. <<ఇద్దరు రాజులు యెహూ ఎదుట నిలవలేక పోయారు. మనమెట్లా నిలవగలం?>> అని చెప్పుకున్నారు.5అప్పుడు ఆ కుటుంబం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పట్టణం బాధ్యతలు చూస్తున్న వ్యక్తీ, పెద్దలూ, ఆ పిల్లలను పెంచిన వాళ్ళూ కలసి యెహూకి <<మేము మీ సేవకులం. మీ ఆదేశాల ప్రకారమే అన్నీ చేస్తాం. మేము ఎవర్నీ రాజుగా చేసుకోం. మీకేది మంచిగా తోస్తే అదే చేయండి>> అని జవాబు పంపారు.

6అప్పుడు యెహూ రెండోసారి వాళ్లకు ఉత్తరం రాశాడు. దానిలో <<మీరు నా వైపు ఉండి నా మాట వింటే మీ యజమాని వారసుల తలలు నరికి వాటితో రేపటికల్లా యెజ్రెయేలులో నా దగ్గరికి రండి>> అని రాశాడు. రాకుమారులు మొత్తం డెబ్భై మంది ఆ పట్టణం పెద్దల సంరక్షణలో ఉన్నారు.7కాబట్టి ఆ ఉత్తరం అందిన తరువాత వారు ఆ డెబ్భైమందినీ పట్టుకుని చంపేశారు. వాళ్ళ తలలను బుట్టల్లో ఉంచి యెజ్రెయేలులో ఉన్న యెహూ దగ్గరికి పంపించారు.

8ఒక వార్తాహరుడు యెహూ దగ్గరికి వచ్చి <<వారు రాకుమారుల తలలు తీసుకు వచ్చారు>> అని చెప్పాడు. అతడు <<వాటిని ఉదయం వరకూ పట్టణ ద్వారం దగ్గర రెండు కుప్పలుగా వేయండి>> అన్నాడు.9ఉదయం అతడు బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మనుషులను చూసి <<మీరంతా నిర్దోషులు. నేను నా రాజు పై కుట్ర చేసి అతణ్ణి చంపేశాను. అయితే వీళ్ళనెవరు చంపారు?
10తన సేవకుడు ఏలీయా ద్వారా యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటలను ఆయన నెరవేర్చాడు. యెహోవా అహాబు కుటుంబాన్ని గురించి పలికిన మాటల్లో ఏ ఒక్కటీ వ్యర్థంగా పోదని మీరు తెలుసుకోవాలి.>>11ఈ విధంగా యెహూ యెజ్రెయేలులో ఉన్న అహాబు కుటుంబ సభ్యులందర్నీ, అతనితో సంబంధం ఉన్న ప్రముఖమైన వ్యక్తులనూ, అతనికి సన్నిహితమైన స్నేహితులనూ, అతని పూజారులు అందర్నీ చంపివేశాడు. అలాంటి వారు ఇక ఒక్కరు కూడా లేకుండా చేశాడు.

12ఇది జరిగాక అతడు షోమ్రోను పట్టణానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతడు గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు13యూదా రాజు అహజ్యా అన్నదమ్ములు ఎదురయ్యారు. యెహూ వాళ్ళను <<మీరు ఎవరు?>> అని అడిగాడు. వారు <<మేము అహజ్యా అన్నదమ్ములం. మేము రాజు గారి పిల్లలనూ, రాణి యెజెబెలు పిల్లలనూ పలకరించడానికి వెళ్తున్నాం>> అని చెప్పారు.14అతడు<<వాళ్ళను ప్రాణాలతో పట్టుకోండి>> అని తన వాళ్ళను ఆదేశించాడు. దాంతో వారు అందర్నీ సజీవంగా పట్టుకుని నలభై రెండు మందిని గొర్రెల బొచ్చు కత్తెర వేసే ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గర చంపారు. వాళ్ళలో ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు.

15అక్కడనుండి యెహూ ముందుకు వెళ్ళాడు. తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కొడుకు యెహోనాదాబుని చూశాడు. అతనితో మంచీ చెడూ మాట్లాడి <<నా హృదయం నీ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు నీ హృదయం నా విషయంలో ఉందా?>> అని అడిగాడు. దానికి యెహోనాదాబు <<ఉంది>> అన్నాడు. యెహూ <<ఆలాగైతే నా చేతిలో నీ చెయ్యి వేయి>> అన్నాడు. యెహోనాదాబు యెహూ చేతిలో తన చెయ్యి వేశాడు. యెహూ అతణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు.16యెహూ అతనితో <<యెహోవా కోసం నాకు ఎంత ఉత్సాహం ఉందో చూద్దువుగాని రా>> అన్నాడు. తన రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు.17అతడు షోమ్రోను చేరుకుని అక్కడ అహాబుకు చెందిన మిగిలిన రాజవంశీకులందర్నీ చంపివేశాడు. యెహోవా ఏలీయాకు చెప్పిన మాట నెరవేర్చాడు.
బయలు దేవుత భక్తులు వధ

18ఆ తరువాత యెహూ ప్రజలందర్నీ సమకూర్చాడు. వారితో <<అహాబు బయలు దేవుతకి స్వల్పంగానే సేవ చేసాడు. కాని యెహూ ఎంతో గొప్ప సేవ చేయబోతున్నాడు.19కాబట్టి బయలు దేవుడి ప్రవక్తలందర్నీ, ఆరాధకులందర్నీ, పూజారులందర్నీ నా దగ్గరికి పిలుచుకు రండి. బయలు దేవుడికి ఒక మహా బలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను>> అన్నాడు. బయలు ఆరాధకులందర్నీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు.20ఇంకా యెహూ <<బయలు దేవుడికి ఒక ప్రత్యేకమైన పండగ జరుగబోతున్నదని ప్రకటించండి>> అన్నాడు. అతని సేవకులు ఆ విధంగానే ప్రకటించారు.

21యెహూ ఇశ్రాయేలు దేశం అన్ని ప్రాంతాల్లో ఈ ప్రకటన చేయించాడు. బయలు ఆరాధకులందరూ తరలి వచ్చారు. అక్కడకు రానివాడు అంటూ ఎవడూ లేడు. వాళ్ళంతా బయలు గుడిలో ప్రవేశించారు. ఆ పక్క నుండి ఈ పక్క వరకూ ఎక్కడా ఖాళీ లేకుండా గుడి కిక్కిరిసి పోయింది.22అక్కడ పూజారుల దుస్తులను దాచే అధికారిని యెహూ పిలిపించి <<బయలు ఆరాధకులందరికీ ప్రత్యేక దుస్తులు తీసుకు రా>> అని చెప్పాడు. అతడు ఆ దుస్తులను బయటకు తీసి తెప్పించాడు.

23తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబూ బయలు దేవుడి గుడిలో ప్రవేశించారు. అప్పుడు యెహూ <<బాగా వెదకండి. బయలు దేవుడి ఆరాధకులు తప్ప ఇక్కడ యెహోవా సేవకులు ఎవరూ ఉండకుండాా జాగ్రత పడండి>> అంటూ బయలు దేవుడి ఆరాధకులను ఆదేశించాడు.24అప్పుడు వాళ్ళంతా అర్పణలూ, దహనబలులూ చెల్లించడానికి లోపలి వెళ్ళారు. యెహూ తన మనుషుల్లో ఎనభై మందిని ఎంపిక చేసి వాళ్ళను బయట నిలబెట్టాడు. వాళ్ళతో <<నేను మీ చేతికప్పగించిన వాళ్ళను ఎవర్నీ తప్పించుకు పోనివ్వద్దు. అలా ఎవడైనా తప్పించుకుంటే వాడి ప్రాణానికి బదులుగా వాడు తప్పించుకోడానికి కారణమైన వాడి ప్రాణం తీసుకుంటాను>> అని చెప్పాడు.

25దహనబలులు అర్పించడం ముగిసిన తరువాత యెహూ అక్కడి కాపలా వాళ్ళతోనూ, అధికారులతోనూ <<లోపలికి వెళ్లి అందర్నీ చంపేయండి. ఏ ఒక్కడూ బయటకు రావడానికి వీల్లేదు>> అన్నాడు. వారు కత్తులతో అందర్నీ హతమార్చారు. కాపలా వాళ్ళూ, అధికారులూ వాళ్ళను బయటకు విసిరేసి బయలు దేవుడి గర్భగుడి లోకి వెళ్ళారు.26అక్కడ పవిత్రంగా ఎంచే బయలు దేవుడి స్తంభాలను బయటకు లాక్కొచ్చి తగలబెట్టారు.27వారు బయలు దేవుడి విగ్రహాన్ని పగలగొట్టి గుడిని ధ్వంసం చేశారు. ఆ గుడిని చెత్తకుప్పలా చేశారు. అది ఈ రోజు వరకూ అలాగే ఉంది.28ఈ విధంగా యెహూ బయలు దేవుణ్ణి ఇశ్రాయేలులో లేకుండా నాశనం చేశాడు.

29కానీ బేతేలు, దాను అనే స్థలాల్లో బంగారు దూడలను ప్రతిష్టించి, వాటిని పూజించడానికి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము వలె యెహూ కూడా ఆ బంగారు దూడలను పూజించడం మానలేదు.30కాబట్టి యెహోవా యెహూతో <<అహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయంలో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు>> అని చెప్పాడు.31అయితే యెహూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం పూర్ణ హృదయంతో జీవించడంలో ఎలాటి శ్రద్ధా చూపించలేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైన యరోబాము చేసిన పాపాలను వదిలి పెట్టలేదు.

32ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యొర్దాను నదికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఓడించాడు.33గిలాదు ప్రాంతం, అర్నోను లోయలోని అరోయేరు నుండి గాదు, రూబేను, మనష్షె గోత్రాల ప్రజలు నివసించిన గిలాదు, బాషాను ప్రాంతాల్లో వాళ్ళను హజాయేలు ఓడించాడు.

34యెహూ చేసిన మిగిలిన పనులూ, అతణ్ణి గూర్చిన మిగతా విషయాలూ, అతని శూరత్వం గూర్చిన విషయాలూ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంచారు.35తరువాత యెహూ తన పూర్వీకులతో నిద్రించాడు. అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతని కొడుకు యెహోయాహాజు అతని స్థానంలో రాజు అయ్యాడు.36యెహూ షోమ్రోనులో ఇశ్రాయేలును ఇరవై ఎనిమిదేళ్ళు పరిపాలించాడు.

Chapter 11

అతల్యా, యోవాషు
11:1-21; 2 దిన 22:10—23:21

1అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులనందరినీ హతమార్చింది.2యెహోరాము రాజు కూతురూ అహజ్యాకి సోదరి అయిన యెహోషెబ అహజ్యా కొడుకుల్లో ఒకడైన యోవాషును హతమైన రాకుమారులతో కూడా చావకుండా వేరు చేసి అతని ఆయాతో సహా అతణ్ణి దాచిపెట్టింది. ఆమె వారిని పడక గదిలో అతల్యా కంటపడకుండా ఉంచింది.3దేశాన్ని అతల్యా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో రహస్యంగా అతణ్ణి దాచి ఉంచారు.

4ఏడో సంవత్సరంలో యాజకుడైన యెహోయాదా కాపలాదారుల పైనా, కెరీతీయులు అని పిలిచే సంరక్షకుల పైనా ఉండే అనేకమంది శతాధిపతులను పిలిపించాడు. వారు వచ్చినప్పుడు వాళ్ళను యెహోవా మందిరం లోకి తీసుకువెళ్ళాడు.అతడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని యెహోవా మందిరంలో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు. ఆ తరువాత వాళ్ళకు యువ రాజును చూపించాడు.5వాళ్ళతో ఇలా అన్నాడు. <<మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చే వారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఉండాలి.6మరో బృందం సూర్ గుమ్మం దగ్గరా మరో బృందం మందిరం వెనుక ఉన్న ద్వారం దగ్గరా ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి.

7ఇక విశ్రాంతి దినం పరిచర్య లేని వారు రెండు బృందాలుగా రాజు ఉన్న యెహోవా మందిరానికి కాపలా కాయాలి.8మీలో ప్రతి ఒక్కరూ చేతిలో ఆయుధాలు పట్టి రాజు చుట్టూ కంచెలా ఉండాలి. ఎవడైనా మీ పంక్తుల్లోకి చొచ్చుకుని వస్తే, వాణ్ణి చంపేయండి. రాజు ఇంటా బయటా సంచరిస్తున్నప్పుడు మీరు అతని దగ్గర ఉండాలి.>>

9యాజకుడైన యెహోయాదా శతాధిపతులకు ఇచ్చిన ఆదేశాలను వారు తుచ తప్పక పాటించారు. ప్రతి ఒక్కరూ తన మనుషులను తీసుకుని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు. పరిచర్య చేసేవాళ్ళూ, విశ్రాంతి దినం పరిచర్యను ఆపి వేసిన వాళ్ళూ వారిలో ఉన్నారు.10యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న దావీదు ఈటెలనూ, డాళ్లనీ శతాధిపతులకు అందించాడు.

11కాబట్టి కాపలా కాసే వారు తమ చేతుల్లో ఆయుధాలతో నిలిచారు. వారు రాజు చుట్టూ మందిరం కుడి వైపునుండి ఎడమ వైపు వరకూ మందిరానికీ బలిపీఠం వేదికకీ సమీపంలో నిలబడ్డారు.12అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి <<రాజు చిరకాలం జీవించాలి>> అంటూ నినాదాలు చేశారు.

13కాపలా కాసే వాళ్ళూ, ఇంకా ప్రజలందరూ చేస్తున్న శబ్దాలు అతల్యాకు వినిపించాయి. అప్పుడు ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.14రాజు సంప్రదాయ పద్ధతిలో స్తంభం పక్కన నిలబడి ఉండటమూ, అధికారులూ, బూరలు ఊదేవాళ్ళూ రాజు దగ్గర నిలబడి ఉండటమూ చూసింది. దేశ ప్రజలందరూ బూరలు ఊదుతూ సంబరాల్లో మునిగి ఉండటం చూసింది. అప్పుడామె తన బట్టలు చించుకుని <<రాజ ద్రోహం! రాజ ద్రోహం!>> అంటూ కేకలు పెట్టింది.

15అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. <<ఆమెను సైనికుల వరుసల్లోనుండి బయటకు తీసుకు రండి. ఆమె సహాయకులెవరైనా ఆమెతో వస్తే వాళ్ళను కత్తితో చంపండి.>> అతడు అంతకుముందు <<యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు>> అని వాళ్ళను ఆదేశించాడు.16కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజ గృహంలోకి గుర్రాలు వచ్చే దారిగుండా ఆమెను పోనిచ్చారు. ఆమె బయటకు రాగానే ఆమెను పట్టుకుని చంపేశారు.

17అప్పుడు యెహోయాదా <<ప్రజలు యెహోవాకి చెందిన వారు>> అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.18కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్ళారు. దాన్ని ధ్వంసం చేసారు. బయలు గుడిలో బలిపీఠం వేదికలనూ, విగ్రహాలనూ నేలమట్టం చేశారు. బయలు దేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపి వేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు.

19యెహోయాదా శతాధిపతులనూ, కేరేతీయులనూ, కావలి వారిని ఇంకా ప్రజలందర్నీ పిలిపించాడు. వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకు వచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు.20కావలి వారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు.

21యోవాషు పరిపాలన ప్రారంభమైనప్పుడు అతని వయస్సు ఏడేళ్లు.

Chapter 12

యోవాషు సంస్కరణలు
12:1-21; 2 దిన 24:1-14; 24:23-27

1యెహూ పరిపాలనలో ఏడవ సంవత్సరంలో యోవాషు తన పరిపాలన మొదలుపెట్టి యెరూషలేములో 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబా ప్రాంతానికి చెందిన జిబ్యా.2యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంత కాలం అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు.3అయితే పూజా స్థలాలను తీసివేయలేదు. ప్రజలు ఇంకా అలాటి చోట్ల బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.

యోవాషు మందిరాన్ని బాగుచేయడం

4యోవాషు యాజకులతో ఇలా అన్నాడు. <<యెహోవా మందిరంలోకి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువుల వల్ల వచ్చే డబ్బును యెహోవా మందిరంలోకి తేవాలి. ప్రతి మనిషీ చెల్లించే పన్ను మొత్తాన్నీ, ప్రతి మనిషీ యెహోవా ప్రేరణ మూలంగా తన హృదయంలో నిర్ణయించుకుని ఆలయం పని కోసం చెల్లించిన డబ్బును తేవాలి.5యాజకులు ప్రజలు కట్టిన ఆ పన్ను మొత్తాన్ని సేకరించాలి. మందిరం మరమ్మత్తు పని కోసం ఆ డబ్బు వినియోగిస్తూ, మందిరాన్ని మంచి స్థితిలో ఉంచాలి.>>

6అయితే యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరం దాకా యాజకులు మందిరం మరమ్మత్తులను చేపట్టనే లేదు.7అప్పుడు యోవాషు యాజకుడైన యెహోయాదాను, మిగిలిన యాజకులను పిలిపించి <<మందిరంలో శిథిలమైన భాగాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇకపై పన్ను చెల్లించే వారి దగ్గర డబ్బు తీసుకోకండి. మందిరం మరమ్మత్తుల కోసం ఇంత వరకూ సేకరించిన మొత్తాన్ని ఆ పని చేసే వారికే అప్పగించండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు.8కాబట్టి యాజకులు మందిరం మరమ్మత్తు పనులు వారు చూడడం లేదు గనక ఇకపై ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం మానుకున్నారు.

9యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు.10పెట్టె నిండి పోయిన ప్రతిసారీ రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా ఆలయంలోని డబ్బు లెక్క చూసి సంచుల్లో ఉంచారు.

11తరువాత వారు ఆ డబ్బును తూచి యెహోవా మందిరం వ్యవహారాలు చూసుకునే వారికి ఇచ్చారు. వారు యెహోవా మందిరం మరమ్మత్తు పని చేసే వడ్రంగులకు, కట్టే పనివారికి ఆ డబ్బు ఇచ్చారు.12ఇంకా తాపీ పని వాళ్ళకి, రాళ్లు చెక్కే వారికీ యెహోవా మందిరం మరమ్మత్తుకై కలప, చెక్కిన రాళ్ళూ కొనడానికి ఇంకా మందిరం బాగు చేయడానికి అయ్యే ఖర్చు కోసం ఆ డబ్బు ఇస్తూ వచ్చారు.

13యెహోవా మందిరం కోసం వెండి పాత్రల కోసం గానీ, కత్తెరలు, గిన్నెలు, బాకాలు, బంగారు వెండి వస్తువులు మొదలైన వాటి కోసం గానీ ఆ డబ్బు వాడలేదు.14కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మతు పని చేసే వారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు.

15మరమ్మత్తుల కోసం ఆ డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండే వారు నమ్మకస్థులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు.16అపరాధ పరిహార బలుల మూలంగా పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి. ఎందుకంటే అది యాజకులది.

17అటు తరువాత సిరియా రాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు.18యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.

19యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని యితర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా.20అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు.21షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 13

ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు

1యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు.2ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.

3కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు.4అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు.5ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.

6అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి.7అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.

8యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.9యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు

10యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు.11ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.
12యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించీ యూదా రాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరచిన పరాక్రమం గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.

13యెహోయాషు తన పూర్వికులతో కన్నుమూసిన తరవాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు.
ఎలీషా మరణం

14ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ <<నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా>> అని విలపించాడు.

15అప్పుడు ఎలీషా <<విల్లంబులు తీసుకురా>> అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు.16<<నీ చెయ్యి విల్లుపై వెయ్యి>> అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి
17<<తూర్పు వైపు కిటికీ తెరువు>> అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా <<బాణం వెయ్యి>> అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు <<ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు>> అని చెప్పాడు.18ఈసారి ఎలీషా <<బాణాలు పట్టుకో>> అని చెప్పగా అతడు పట్టుకున్నాడు.అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో <<నేలను కొట్టు>> అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.

19అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి <<నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు>> అని చెప్పాడు.

20తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు.21కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.

22యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు.23అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు.24సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.

25యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.

Chapter 14

యూదా రాజైన అమజ్యా
14:1-7; 2 దిన 25:1-4, 11-12
14:8-22; 2 దిన 25:17—26:2

1యెహోయాహాజు కొడుకు యెహోయాషు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న రెండో సంవత్సరంలో యోవాషు కొడుకు అమజ్యా యూదాకు రాజయ్యాడు.2అతడు రాజైనప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 29 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెహోయద్దాను.3ఇతడు తన పూర్వికుడైన దావీదు చేసినట్టు పూర్తిగా చెయ్యకపోయినా, యెహోవా దృష్టిలో నీతి గలవాడిగా ఉండి అన్ని విషయాల్లోనూ తన తండ్రి యోవాషు చేసినట్టు చేశాడు.

4అయితే అతడు ఉన్నత స్థలాలను పడగొట్టలేదు. ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల్లో బలులర్పిస్తూ ధూపం వేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.5రాజ్యంలో తాను రాజుగా స్థిరపడిన తరువాత రాజైన తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయించాడు.

6అయితే<<కొడుకులు చేసిన నేరాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల నేరాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపాని బట్టి వారే మరణ శిక్ష పొందాలి>> అని మోషేకు యెహోవా రాసి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి ఆ హంతకుల పిల్లలను అతడు హతం చేయలేదు.7ఇంకా అతడు ఉప్పు లోయలో యుద్ధం చేసి ఎదోమీయుల్లో 10,000 మందిని హతం చేసి, సెల అనే పట్టణాన్ని జయించి, దానికి యొక్తయేలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దానికి అదే పేరు.

8అప్పుడు అమజ్యా ఇశ్రాయేలు రాజు యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకు యెహోయాషు దగ్గరికి వార్తాహరులను పంపి <<మనం ముఖాముఖి యుద్ధం చేద్దాం రా>> అన్నాడు.9ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదా రాజు అమజ్యాకు ఇలా చెప్పి పంపాడు. <<లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టొకటి <నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వు> అని లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి కబురంపిందట. అంతలోనే లెబానోనులో ఉన్న అడవి మృగం ఒకటి వచ్చి ఆ ముళ్ళ చెట్టును తొక్కేసింది.10నీవు ఎదోమీయులను హతమార్చిన కారణంగా హృదయంలో మిడిసి పడుతున్నావు. నీకు కలిగిన విజయాన్నిబట్టి అతిశయపడు గానీ నీ ఇంటి దగ్గరే ఉండు. నీవు మాత్రమే కాకుండా నీతోబాటు యూదావారు కూడా నాశనం కావడానికి నీవు ఎందుకు కారణం కావాలి?>>

11అమజ్యా ఆ మాట వినలేదు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరి, యూదాకు సంబంధించిన బేత్షెమెషు పట్టణం దగ్గర యూదా రాజు అమజ్యాతో ముఖాముఖీ తలపడ్డాడు.12యూదావారు ఇశ్రాయేలు వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయి అందరూ తమ గుడారాలకు పారిపోయారు.

13ఇంకా, అహజ్యాకు పుట్టిన యోవాషు కొడుకు అమజ్యా అనే యూదారాజును ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేముకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూల గుమ్మం వరకూ యెరూషలేము ప్రాకారం గోడలను 400 మూరల పొడుగున పడగొట్టాడు.14ఇంకా, యెహోవా మందిరంలో, రాజనగరులో కనబడిన వెండి బంగాపాత్రలన్నీ, బందీలను కూడా తీసుకుని షోమ్రోనుకు వచ్చాడు.

15యెహోయాషు చేసిన ఇతర పనులు గురించి, అతని పరాక్రమాన్ని గురించి, యూదారాజు అమజ్యాతో అతడు చేసిన యుద్ధం గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.16యెహోయాషు చనిపోయినప్పుడు, అతని పూర్వీకులతోబాటు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు. ఆ తరువాత అతని కొడుకు యరొబాము అతని స్థానంలో రాజయ్యాడు.

17యూదా రాజు యోవాషు కొడుకు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కొడుకు అయిన యెహోయాషు చనిపోయిన తరువాత 15 సంవత్సరాలు జీవించాడు.18అమజ్యా చేసిన ఇతర పనుల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.19ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని, వారు అతనివెంట కొందరిని లాకీషుకు పంపారు.

20వారు అక్కడ అతన్ని చంపి గుర్రాల మీద అతని శవాన్ని యెరూషలేముకు తెప్పించి దావీదు పట్టణంలో అతని పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు.21అప్పుడు యూదా ప్రజలు 16 సంవత్సరాల వయస్సు ఉన్న అజర్యాను అతని తండ్రి అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేశారు.22ఇతడు రాజైన తన తండ్రి తన పూర్వీకులతోబాటు చనిపోయిన తరువాత ఏలతు అనే పట్టణాన్ని చక్కగా కట్టించి యూదా వాళ్లకు దాన్ని మళ్ళీ అప్పగించాడు.
ఇశ్రాయేలు రాజైన రెండవ యరొబాము

23యూదా రాజు యోవాషు కొడుకు అమజ్యా పరిపాలనలో 15 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము షోమ్రోనులో పరిపాలన ఆరంభించి, 41 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.24ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరించి యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.25ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడు యోనా అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాట చొప్పున ఇతడు హమాతుకు వెళ్ళే దారి మొదలుకుని అరాబా సముద్రం వరకూ ఇశ్రాయేలువాళ్ళ సరిహద్దును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు.

26దాసులుగాని, స్వతంత్రులుగాని, ఇశ్రాయేలు వాళ్లకు సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరు.27కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారు పడిన బాధ ఎంతో ఘోరమైనదిగా ఎంచాడు. ఇశ్రాయేలు అనే పేరు ఆకాశం కింద నుంచి తుడిచి వేయనని యెహోవా చెప్పాడు గనుక యెహోయాషు కొడుకు యరొబాము ద్వారా వాళ్ళను రక్షించాడు.

28యరొబాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని పరాక్రమం గురించి, అతడు చేసిన యుద్ధం గురించి, దమస్కు పట్టణాన్ని, యూదావాళ్లకు ఉన్న హమాతు పట్టణాన్ని ఇశ్రాయేలు కోసం అతడు మళ్ళీ జయించిన సంగతిని గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.29యరొబాము తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులతోబాటు చనిపోయిన తరువాత అతని కొడుకు జెకర్యా అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 15

అజర్యా యూదా రాజు
15:1-7; 2 దిన 26:3-4, 21-23

1ఇశ్రాయేలురాజు యరొబాము పరిపాలనలో 23 వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు.2అతడు 16 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెకొల్యా.3ఇతడు తన తండ్రి అమజ్యా చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించాడు.

4అయితే అతడు ఉన్నత స్థలాలను మాత్రం నాశనం చెయ్యలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు.5యెహోవా ఈ రాజును దెబ్బ కొట్టిన కారణంగా అతడు చనిపోయే వరకూ కుష్టురోగిగా ఉంటూ వేరుగా ఒక భవనంలో నివాసం ఉన్నాడు గనుక యువరాజు యోతాము పట్టణం మీద అధికారిగా దేశ ప్రజలకు న్యాయం తీర్చే వాడిగా ఉన్నాడు.

6అజర్యా చేసిన పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.7అజర్యా చనిపోయినప్పుడు అతణ్ణి తన పూర్వీకులతోబాటు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో పాతిపెట్టిన తరువాత అతని కొడుకు యోతాము అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన జెకర్యా

8యూదారాజు అజర్యా పరిపాలనలో 38 వ సంవత్సరంలో యరొబాము కొడుకు జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఆరు నెలలు పరిపాలించాడు.9ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ, తన పూర్వికులు చేసినట్టే తానూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

10యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.11జెకర్యా చేసిన పనులు గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.12నీ కొడుకులు నాలుగో తరం వరకూ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది.
ఇశ్రాయేలు రాజైన షల్లూము

13యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39 వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి, షోమ్రోనులో నెల రోజులు ఏలాడు.14గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

15షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.16మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.
ఇశ్రాయేలు రాజైన మెనహేము

17యూదారాజు అజర్యా పరిపాలనలో 39 వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు.18ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

19అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు.20మెనహేము, ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి1 వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు గనుక అష్షూరురాజు దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.

21మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.22మెనహేము తన పూర్వీకులతోబాటు తానూ చనిపోయిన తరువాత అతని కొడుకు పెకహ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహ్యా

23యూదారాజు అజర్యా పరిపాలనలో 50 వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు.24ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

25ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.26పెకహ్యా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
ఇశ్రాయేలు రాజైన పెకహు

27యూదా రాజు అజర్యా పరిపాలనలో 52 వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు.28ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.

29ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు.30అప్పుడు ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేసి, అతనిపై దాడి చేసి చంపి అతని స్థానంలో తాను రాజయ్యాడు. ఇది యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20 వ సంవత్సరంలో జరిగింది.31పెకహు చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
యూదా రాజైన యోతాము
15:33-38; 2 దిన 27:1-4, 7-9

32ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో రెండో సంవత్సరంలో యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు.33అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా.

34ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు.35అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు.36యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

37ఆ కాలంలో యెహోవా సిరియా రాజు రెజీనునూ, రెమల్యా కొడుకు పెకహునూ యూదా దేశం మీదికి పంపించడం ఆరంభించాడు.38యోతాము తన పూర్వీకులతోబాటు చనిపోగా, అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానంలో రాజయ్యాడు.


1 15:20 50 తులాల వెండి 570 గ్రాము

Chapter 16

యూదా రాజైన ఆహాజు

1రెమల్యా కొడుకు పెకహు పరిపాలనలో 17 వ సంవత్సరంలో యూదా రాజు యోతాము కొడుకు ఆహాజు పరిపాలన ఆరంభించాడు.2ఆహాజు పరిపాలన ఆరంభించినప్పుడు 27 సంవత్సరాల వయస్సు ఉండి, యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. తన పూర్వికుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తించకుండా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు.

3అతడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ, తన కొడుకును దహన బలిగా అర్పించాడు.4ఇంకా అతడు ఉన్నత స్థలాల్లో, కొండల మీద, అన్ని రకాల పచ్చని వృక్షాల కింద, బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చాడు.

5సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి, అక్కడ ఉన్న ఆహాజును, పట్టణాన్నీ చుట్టుముట్టారు గాని అతన్ని జయించలేక పోయారు.6ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి, ఏలతులోనుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.

7ఇది ఇలా ఉండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనవీ, రాజనగరు సంబంధమైనవీ అయిన సామానుల్లో కనబడిన వెండి బంగారాలను తీసుకుని అష్షూరు రాజుకు కానుకగా పంపి,8<<నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి గనుక నీవు వచ్చి, నా మీద దండెత్తిన సిరియా రాజు చేతిలో నుంచి, ఇశ్రాయేలురాజు చేతిలో నుంచి నన్ను రక్షించాలి>> అని అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు దగ్గరికి వార్తాహరులను పంపాడు.9అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెర పట్టుకుని, రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు.

10రాజైన ఆహాజు అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వచ్చి, దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని పనితనం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.11యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు పట్టణం నుంచి పంపిన నమూనాకు సరిపడిన బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు దమస్కు నుంచి తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.12అప్పుడు రాజు దమస్కు నుంచి వచ్చి బలిపీఠాన్ని చూసి, ఆ బలిపీఠం సమీపించి, ఎక్కి,
13దహన బలి, నైవేద్యం అర్పించి, పానార్పణం చేసి, తాను అర్పించిన సమాధానబలి పశువుల రక్తాన్ని దాని మీద చల్లాడు.14ఇంకా, యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలివేదికను మందిరం ముందున్న స్థలం నుంచి, అంటే, తాను కట్టించిన బలిపీఠానికీ, యెహోవా మందిరానికీ మధ్య నుంచి తొలగించి, తాను కట్టించిన దానికి ఉత్తరం వైపు దాన్ని ఉంచాడు.

15అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ<<ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులూ, సాయంత్రం అర్పించే నైవేద్యాలూ రాజు చేసే దహనబలి, నైవేద్యాలూ, దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు, నైవేద్యాలూ, పానార్పణలూ ఇంకా ఏ దహనబలి జరిగినా, అ బలి పశువుల రక్తాన్ని దాని మీదే చల్లాలి. అయితే, నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఇత్తడి బలిపీఠం ఉండాలి>>అన్నాడు.16యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు.

17ఇంకా, ఆహాజు రాజు కదిలే పీట మీది నుండి తొట్టిని పక్కన ఉండే పలకలను తీయించాడు. కంచు ఎద్దుల మీద ఉన్న గంగాళాన్ని దింపి, రాతి అరుగు మీద దాన్ని ఉంచాడు.18ఇంకా అతడు అష్షూరు రాజుకు భయపడి విశ్రాంతి దినం ఆచరణ కోసం మందిరంలో కట్టి ఉన్న మంటపాన్ని, రాజు ప్రాంగణంలోనుంచి వెళ్ళే దారిని యెహోవా మందిరం నుంచి తీసేశాడు.

19ఆహాజు చేసిన ఇతర పనుల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.20ఆహాజు తన పూర్వీకులతోబాటు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు హిజ్కియా అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 17

ఇశ్రాయేలు చివరి రాజు హోషేయ
17:3-7; 2 రాజులు 18:9-12

1యూదారాజు ఆహాజు పరిపాలనలో 12 వ సంవత్సరంలో ఏలా కొడుకు హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి, తొమ్మిది సంవత్సరాలు ఏలాడు.2అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులు చేసినంత చెడుతనం చెయ్యకపోయినా, యెహోవా దృష్టిలో చెడుతనమే జరిగించాడు.3అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.

4అతడు ఐగుప్తు రాజు సో దగ్గరికి వార్తాహరులను పంపి, ఇంత వరకూ తాను ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు అష్షూరు రాజుకు కప్పం కట్టడం ఆపి వేశాడు. హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి ఖైదు చేశాడు.5అష్షూరురాజు దేశమంతటి మీదకీ, షోమ్రోను మీదకీ వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు.6హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.
పాపం ఇశ్రాయేలు పతనానికి, చెరకు కారణం

7ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచీ, ఐగుప్తు రాజు ఫరో బలం నుంచీ, తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపం చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు.8తమ ఎదుట నిలవ లేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల కట్టుబాట్లూ, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టుబాట్లూ పాటిస్తూ ఉన్నారు.

9ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ, తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీదా ప్రాకారాల మీదా పూజా స్థలాలు కట్టుకున్నారు.10ఎత్తయిన కొండలన్నిటి మీదా, ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు కట్టించారు.
11తమ యెదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ, దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించారు.12<<చెయ్యకూడదు>> అని వేటి గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేస్తూ పూజిస్తూ ఉన్నారు.

13<<అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి>> అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు,

14అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వికుల వలే వారు కూడా తలబిరుసుగా ఉన్నారు.15వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు.<<వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు>> అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.

16వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.17ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.18కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు గనుక యూదా గోత్రం తప్ప ఇంక ఏ గోత్రమూ మిగలలేదు.

19అయితే యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి ఇశ్రాయేలు వారు పెట్టుకొన్న కట్టడలనే అనుసరించారు.20అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి, వాళ్ళను బాధపెట్టి, దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి, వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు.

21ఆయన ఇశ్రాయేలు1 గోత్రాలను దావీదు సంతానం2 నుంచి విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకు యరొబామును రాజుగా చేసుకున్నారు. యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా, వారు ఆయన మీద తిరుగుబాటు చేసేలా చేసి, ఘోరమైన పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు.22ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు.23తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆయన ఇశ్రాయేలు వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్ళగొట్టాడు. అందువల్ల వారు తమ స్వదేశం నుంచి అష్షూరు దేశానికి బందీలుగా వెళ్ళారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
పరదేశులు ఇశ్రాయేల్లో కాపురం ఉన్నారు

24అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అనే తన దేశాల్లో నుంచి మనుషులను రప్పించి, ఇశ్రాయేలు వాళ్లకు బదులుగా షోమ్రోను పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు. వారు షోమ్రోను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ పట్టణాల్లో కాపురం ఉన్నారు.25అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి.26అప్పుడు వారు <<మీరు పట్టుకొన్న షోమ్రోను పట్టణాల్లో మీరు ఉంచిన ప్రజలకు ఆ దేశపు దేవుని ఆచారాలు తెలియదు గనక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని ఆచారాలు వాళ్లకు తెలియని కారణంగా సింహాలు వాళ్ళను చంపుతున్నాయి>> అని అష్షూరు రాజుతో చెప్పారు.

27అష్షూరు రాజు <<అక్కడ నుంచి తెచ్చిన యాజకుల్లో ఒకణ్ణి మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అతడు అక్కడికి వెళ్లి కాపురం ఉండి, ఆ దేశపు దేవుని ఆచారాలను వాళ్లకు నేర్పాలి>> అని ఆజ్ఞాపించాడు.28అప్పుడు షోమ్రోనులోనుంచి వారు పట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు.

29అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొన్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా, వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు.30బబులోను వారు సుక్కో తు బెనోతు దేవుణ్ణి, కూతా వారు నెర్గలు దేవుణ్ణి, హమాతు వారు అషీమా దేవుణ్ణి,31ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.

32ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. అ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు.33ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు.

34ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు.35ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి <<మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు. వాటికి మొక్కకూడదు. పూజ చేయకూడదు. బలులు అర్పించకూడదు.
36ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి గొప్ప బలప్రభావాలతో చాచిన తన బహువుతో బయటికి తెచ్చాడో ఆయన్నే మీరు పూజించాలి. ఆయనకే మొక్కాలి. ఆయనకే బలులు అర్పించాలి.37శాశ్వతంగా మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలు, విధులు, అంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, అన్నీ మీరు పాటించాలి. ఇతర దేవుళ్ళకు భయపడ కూడదు.38నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి.
39మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవుని పైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు>> అని యెహోవా చెప్పాడు.

40అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు.41ఆ ప్రజలు ఆ విధంగా యెహోవా పట్ల భయ భక్తులు కలిగి ఉంటూనే, తమ చెక్కిన విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు. వారి పిల్లలూ, పిల్లల పిల్లలూ అలానే చేశారు. వారి పూర్వికులు చేసినట్టే ఈ రోజు వరకూ చేస్తూనే ఉన్నారు.


1 17:21 ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం
2 17:21 దావీదు సంతానం దక్షిణ రాజ్యం

Chapter 18

యూదా రాజైన హిజ్కియా
18:2-4; 2 దిన 29:1-2—31:1
18:5-7; 2 దిన 31:20-21
18:9-12; 2 రాజులు 17:3-7

1ఇశ్రాయేలు రాజు, ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో మూడో సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు.2అతడు 25 సంవత్సరాల వయస్సులో ఏలడం ఆరంభించి, యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు అబీ. ఆమె జెకర్యా కూతురు.3అతడు తన పూర్వికుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి, యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు.

4ఉన్నత స్థలాలను తొలగించి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు <<నెహుష్టాను1 >> అని పేరు పెట్టి, దానికి ధూపం వేసేవారు.5అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.

6అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు.7కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు.8ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.

9రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు.10మూడు సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో ఆరో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో షోమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది.

11ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు.12అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశానికి తీసుకెళ్ళి, గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు.
సన్హెరీబు యూదా దేశం పై దండెత్తడం

13హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు.14యూదారాజు హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహరులను పంపి <<నావల్ల తప్పు జరిగింది. నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను>> అని వార్త పంపించాడు. అష్షూరురాజు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం యూదా రాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు.15కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.

16ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
సన్హెరీబు సైన్యం యెరూషలేము పైన దాడి

17కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు.18హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.

19అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. <<నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి?20యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?21నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.

22మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా?23కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.

24అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా!25యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? <ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి> అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు>> అన్నాడు.

26రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. <<నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో2 దయచేసి మాట్లాడొద్దు>> అన్నారు.27రబ్షాకే <<ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా>> అని చెప్పాడు.

28అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో <<మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే,29హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు.30యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, <యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు> అని హిజ్కియా చెప్తున్నాడు.

31హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు.32ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.

33వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా?34హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా?35మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?>> అన్నాడు.

36అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.37గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.


1 18:4 నెహుష్టాను ఇత్తడి సర్పాము
2 18:26 యూదుల భాషలో హీబ్రూ భాషలో

Chapter 19

యెరూషలేము విమోచన గురించి యెషయా ముందుగా చెప్పడం
19:1-13; యెషయా 37:1-13

1వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.2గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.

3వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో <<హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు.4జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.>>

5రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు,6యెషయా వాళ్ళతో <<మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.7అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు>> అన్నాడు.

8అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు.9అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.

10<<యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.11చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?

12నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?13హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?>> అని వార్త పంపాడు.
హిజ్కియా ప్రార్థన
19:14-19; యెషయా 37:14-20

14హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,15యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ <<యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.

16యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.17యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి18వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.

19యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు>> అన్నాడు.
యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపడం
19:20-37; యెషయా 37:21-38
19:35-37; 2 దిన 32:20-21

20అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ <<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.21అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.22నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు?
23ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.24నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను.
25నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
27నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు.28నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.

29హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు.30యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.31ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.

32కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.33ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు.34నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.>>

35ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1,85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.36అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు.37అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 20

హిజ్కియా రోగం
20:1-11; 2 దిన 32:24-26; యెషయా 38:1-8

1ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి <<నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు>> అని చెప్పాడు.2హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,3<<యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో>> అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.

4యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,5<<నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.

6ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను>> అన్నాడు.7తరువాత యెషయా <<అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి>> అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.

8<<యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?>> అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా9<<తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?>> అన్నాడు.

10అందుకు హిజ్కియా <<నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి>> అన్నాడు.11ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
హిజ్కియా దగ్గరకు బబులోను రాయబారులు
20:12-19; యెషయా 39:1-8
20:20-21; 2 దిన 32:32-33

12ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.13వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.

14తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి <<ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?>> అని అడిగాడు. హిజ్కియా <<బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు>> అని చెప్పాడు.15<<నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?>> అని అతడు అడిగాడు. హిజ్కియా <<నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను>> అన్నాడు.

16అప్పుడు యెషయా హిజ్కియాతో <<యెహోవా చెప్పే మాట విను.17రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.18ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు>> అన్నాడు.

19అందుకు హిజ్కియా <<నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?>> అని యెషయాతో అన్నాడు.20హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.21హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 21

యూదా రాజైన మనష్షే
21:1-10; 2 దిన 33:1-10
21:17-18; 2 దిన 33:18-20

1మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లిపేరు హెప్సిబా.2అతడు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసినట్లు అసహ్యమైన పనులు చేస్తూ వచ్చాడు.3తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.

4ఇంకా <<నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను>> అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు.5ఇంకా, యెహోవా మందిరానికి ఉన్న రెండు ప్రాంగణాల్లో ఆకాశ నక్షత్రాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు.6అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

7యెహోవా దావీదుకు, అతని కొడుకు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి <<ఈ మందిరంలో ఇశ్రాయేలు గోత్రస్దానాల్లో నుంచి నేను కోరుకున్న ఈ యెరూషలేములో నా పేరు ఎల్లకాలం ఉంచుతాను>> అని దేన్నీ గురించి చెప్పాడో ఆ యెహోవా మందిరంలో తాను చేయించిన అషేరా రూపాన్ని పెట్టాడు.8ఇంకా <<ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన దానంతటినీ నా సేవకుడు మోషే వాళ్లకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్నీ వారు పాటిస్తే, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశంలో నుంచి వాళ్ళ పాదాలు ఇంక తొలగి పోనివ్వను>> అని యెహోవా చెప్పిన మాట వినకుండా9ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడకుండా యెహోవా నాశనం చేసిన ప్రజలు జరిగించిన చెడుతనాన్ని మించిన చెడుతనం చేసేలా మనష్షే వాళ్ళను పురిగొల్పాడు.

10అయితే, యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ,11<<యూదా రాజు మనష్షే ఈ అసహ్యమైన పనులు చేసి, తన ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొన్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు.12కాబట్టి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, వినేవాళ్ళకు రెండు చెవులూ గింగురుమనేంత కీడు యెరూషలేము మీదకీ, యూదావాళ్ళ మీదకీ రప్పిస్తాను.

13నేను షోమ్రోనును కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండు యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెం తుడిచేటప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.14ఇంకా, నా స్వాస్ధ్యంలో మిగిలిన వాళ్ళను నేను తోసివేసి, వాళ్ళ శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను.15వారు తమ పూర్వికులు ఐగుప్తు దేశంలోనుంచి వచ్చిన రోజునుంచి ఈ రోజు వరకూ నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుక వారు తమ శత్రువులందరివల్ల దోపిడీకి గురై నష్టం పొందుతారు.>>

16ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు.17మనష్షే చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని దోషం గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.18మనష్షే తన పూర్వీకులతో బాటు చనిపోయిన తరువాత, ఉజ్జా తోటలో తన ఇంటి దగ్గర అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఆమోను అతని స్థానంలో రాజయ్యాడు.
యూదా రాజైన ఆమోను
21:19-24; 2 దిన 33:21-25

19ఆమోను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండు సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మెషుల్లెమెతు. ఆమె యొట్బ ఊరివాడైన హారూసు కూతురు.20అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

21తన పితరుల దేవుడైన యెహోవాను వదిలిపెట్టి, యెహోవా మార్గంలో నడవకుండా, తన తండ్రి ప్రవర్తించినట్టు తానూ ప్రవర్తిస్తూ,22తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు.23ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు.

24దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వాళ్ళందర్నీ చంపి, అతని స్థానంలో అతని కొడుకు యోషీయాకు పట్టాభిషేకం చేశారు.25ఆమోను చేసిన ఇతర పనుల గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.26ఉజ్జా తోటలో అతనికి ఉన్న సమాధిలో అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు యోషీయా అతని స్థానంలో రాజయ్యాడు.

Chapter 22

ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం
22:1-20; 2 దిన 34:1-2, 8-28

1యోషీయా ఏలడం ఆరంభించినప్పుడు, అతని వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు.2అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.

3రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో,4<<నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.5యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.

6వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు>> అన్నాడు.7ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.

8అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా <<యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది>> అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి9రాజు దగ్గరికి తిరిగి వచ్చి <<మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు>> అని వార్త చెప్పి,10<<యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు>> అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.

11రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.12తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.13<<మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది>> అన్నాడు.

14కాబట్టి యాజకుడైన1 హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.15ఆమె వాళ్ళతో <<మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి.16యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.

17ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.18యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి.19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.

20నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు>> అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.


1 22:14 యాజకుడైన రాజు

Chapter 23

నిబంధనను యోషీయా పునరుద్ధరణ
23:1-3; 2 దిన 34:29-32
23:4-20; 2 దిన 34:3-7, 33
23:28-30; 2 దిన 35:20—36:1

1అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి,2యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు.

3రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు.

4రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.5ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు.

6యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, ఆ బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.7ఇంకా యెహోవా మందిరంలో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు.

8యూదా పట్టణంలో ఉన్న యాజకులందర్నీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెయేర్షెబా వరకూ యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి, పట్టణ ద్వారానికి ఎడమ వైపు పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించాడు.9ఆ ఉన్నత స్థలాలమీద యాజకులుగా ఉన్న వారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చెయ్యడానికి అనుమతి లేకపోయినా, తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది.

10ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్‌ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు.11ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.

12ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు.13యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు.14ఆ రూపాలను ముక్కలుగా కొట్టించి, అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు.

15బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు.16యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు.

17అప్పుడు అతడు <<నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది?>> అని అడిగాడు. పట్టణం వారు <<అది యూదా దేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి>> అని చెప్పారు.18అందుకతడు <<దాన్ని తప్పించండి. ఎవరూ అతని ఎముకలను తీయకూడదు>> అని చెప్పాడు. వారు అతని ఎముకలను, షోమ్రోను పట్టణం నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు.

19ఇంకా, ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఏ ఉన్నతస్థలాల్లో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో, ఆ మందిరాలన్నిటినీ యోషీయా తీసేసి, తాను బేతేలులో చేసినట్టే వాటికీ చేశాడు.20అక్కడ అతడు ఉన్నతస్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి, వాటిమీద మనుషుల ఎముకలను తగలబెట్టించి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

21అప్పుడు రాజు <<నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి>> అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు.22ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం, యూదా రాజుల కాలం వరకూ ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ సమయంలో పస్కా పండగ జరిగింది.23ఈ పండగ రాజైన యోషీయా పరిపాలన 18 వ సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది.

24ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.25అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు.

26అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది.27కాబట్టి యెహోవా <<నేను ఇశ్రాయేలు వాళ్ళను వెళ్లగొట్టినట్టు యూదా వాళ్ళను నా సముఖానికి దూరం చేసి, నేను కోరుకొన్న యెరూషలేము పట్టణాన్నీ, నా పేరును అక్కడ ఉంచుతానని నేను చెప్పిన మందిరాన్నీ నేను విసర్జిస్తాను>> అనుకున్నాడు.

28యోషీయా చేసిన ఇతర పనులు గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.29అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు.30అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి, మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి, అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.

31యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా ఊరి వాడు యిర్మీయా కూతురు.32ఇతడు తన పూర్వికులు చేసినదానంతటి ప్రకారం చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.33ఫరో నెకో ఇతడు యెరూషలేములో పరిపాలన చెయ్యకుండా హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో అతన్ని బంధకాల్లో ఉంచాడు. దేశం మీద 50 మణుగుల వెండినీ, రెండు మణుగుల బంగారాన్నీ కప్పం విధించాడు.

34యోషీయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యోషీయా స్థానంలో నియమించి, అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు.35యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దేశం మీద పన్ను నిర్ణయించి, ఆ వెండి బంగారాలను ఫరోకు చెల్లిస్తూ వచ్చాడు. అతడు దేశ ప్రజల దగ్గర నుంచి వారికి నిర్ణయించిన ప్రకారం వసూలు చేసి ఫరో నెకోకు చెల్లిస్తూ వచ్చాడు.
యూదా రాజైన యెహోయాకీము
23:36—24:6; 2 దిన 36:5-8

36యెహోయాకీము పరిపాలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయస్సు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమా ఊరి వాడు పెదాయా కూతురు.37ఇతడు కూడా తన పూర్వికులు చేసినట్టు చేసి, యెహోవా దృష్టిలో చెడు నడత నడిచాడు.

Chapter 24

1యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.2యెహోవా అతని మీదకి, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదాదేశాన్ని నాశనం చెయ్యడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు.

3మనష్షే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా, యూదావారు యెహోవా సముఖం నుంచి తొలగి పోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది.4అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.

5యెహోయాకీము చేసిన ఇతర పనుల గురించి, అతడు జరిగించిన వాటన్నిటి గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.6యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.

7బబులోనురాజు ఐగుప్తు నదికీ, యూఫ్రటీసు నదికీ మధ్య ఐగుప్తురాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకొన్న తరువాత, ఐగుప్తురాజు ఇక ఏ ప్రాంతం మీదకీ యుద్ధానికి వెళ్ళలేదు.
యూదా రాజైన యెహోయాకీను
24:8-17; 2 దిన 36:9-10

8యెహోయాకీను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. యెరూషలేమువాడు ఎల్నాతాను కూతురు నెహుష్తా అతని తల్లి.9అతడు తన తండ్రి చేసినట్టే చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

10ఆ కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు.11వారు పట్టణానికి ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు, బబులోను రాజు నెబుకద్నెజరు స్వయంగా తానే దాని మీదకి వచ్చాడు.12అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.

13ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.14ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.

15అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్ళను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకు వెళ్ళాడు.16ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.17ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.
యూదా రాజైన సిద్కియా
24:18-20; 2 దిన 36:11-16; యిర్మీయా 52:1-3

18సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు.19అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హమూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.20సిద్కియా బబులోనురాజు మీద తిరుగబాటు చేశాడు. యూదావాళ్ళ మీద, యెరూషలేమువాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖంలోనుంచి వాళ్ళను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.

Chapter 25

యెరూషలేము విధ్వంసం
25:1-12; యిర్మీయా 39:1-10
25:1-21; 2 దిన 36:17-20; యిర్మీయా 52:4-27
25:22-26; యిర్మీయా 40:7-9; 41:1-3, 16-18

1సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు.2ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11 వ సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు,3నాలుగో నెల తొమ్మిదో రోజు అదే సంవత్సరం పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు.

4కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు.5అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు.

6వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు.7సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.

8ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19 వ సంవత్సరంలో ఐదో నెల ఏడో రోజున రాజ దేహసంరక్షకుల అధిపతీ, బబులోనురాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చి9యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.10ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు.

11పట్టణంలో మిగిలి ఉన్న వాళ్ళనూ, బబులోనురాజు పక్షం చేరిన వాళ్ళనూ, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్ళనూ నెబూజరదాను బందీలుగా తీసుకెళ్ళాడు గాని,12పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు.

13ఇంకా యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి సరస్సును, కల్దీయులు ముక్కలుగా కొట్టి, ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు.14సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు.15అగ్నిపాత్రలు, గిన్నెలు, మొదలైన వెండి వస్తువులనూ, బంగారు వస్తువులనూ నెబూజరదాను తీసుకెళ్ళిపోయారు.

16ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది.17ఒక్కొక స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట ఎత్తు మూడు మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలూ, దానిమ్మ పళ్ళూ ఇత్తడివి. రెండో స్తంభం కూడా మొదటి దాని లాంటిదే.

18నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.19ఇంకా, సైన్యం మీద అధికారిగా ఉన్న వాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే ఐదుగురినీ, అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారినీ, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందినీ బందీలుగా పట్టుకున్నాడు.

20నెబూజరదాను వీళ్ళను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు.21బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్ళను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలోనుంచి తీసుకెళ్ళిపోయారు.

22బబులోను రాజు నెబుకద్నెజరు యూదాదేశంలో ఉండనిచ్చిన వాళ్ళమీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కొడుకు గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు.23యూదావాళ్ళ సైన్యాధిపతులందరూ, వాళ్ళ ప్రజలందరూ బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విన్నారు. మిస్పా పట్టణంలో ఉన్న గెదల్యా దగ్గరికి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకు యోహానాను, నెటోపాతీయుడు తన్హుమెతు కొడుకు శెరాయా, ఒక మాయకాతీయునికి పుట్టిన యజన్యా అందరూ కలిసి వచ్చారు.

24గెదల్యా వాళ్ళతో, వాళ్ళ ప్రజలతో ప్రమాణం చేసి <<కల్దీయులకు మనం దాసులం అయ్యామని భయపడొద్దు. దేశంలో నివాసం ఉండి, బబులోను రాజును మీరు సేవిస్తే, మీకు మేలు కలుగుతుంది>> అని చెప్పాడు.

25అయితే ఏడో నెలలో రాజ కుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇష్మాయేలు పదిమంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులనూ, కల్దీయులనూ, అతడు హతం చేశాడు.26అప్పుడు చిన్నవాళ్ళూ, గొప్పవాళ్ళూ, ప్రజలందరూ, సైన్యాధిపతులూ లేచి కల్దీయుల భయం చేత ఐగుప్తు దేశానికి పారిపోయారు.
బందీగా యెహోయాకీను
25:27-30; యిర్మీయా 52:31-34

27యూదారాజు యెహోయాకీను బందీగా ఉన్న 37 వ సంవత్సరంలో 12 వ నెల 27 వ రోజున బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను పరిపాలన ఆరంభించిన సంవత్సరంలో, చెరసాలలో నుంచి యూదా రాజు యెహోయాకీనును బయటకు తెప్పించాడు.

28అతనితో దయగా మాట్లాడి, అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాలకన్నా ఎత్తు చేశాడు.29అతడు తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్ల మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు.30ఇంకా అతడు బ్రతికినంత కాలం, క్రమం తప్పకుండా అతని భోజన భత్యం అతనికి అందుతూ ఉంది.

1 దినవృత్తాంతాలు

Chapter 1

ఆది పితరులు వంశస్థులు
1:5-7; ఆది 10:2-5
1:8-16; ఆది 10:6-20
1:17-23; ఆది 10:21-31; 11:10-27
1:29-31; ఆది 25:12-16
1:32-33; ఆది 25:1-4
1:35-37; ఆది 36:10-14
1:38-42; ఆది 36:20-28

1ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.2ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.3యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.4లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.

5యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.6గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.7యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.

8హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.9కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.10కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.

11ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,12పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.

13కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.14ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,15హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు16అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.

17షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.18అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.19ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.

20యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,21హదోరము, ఊజాలు, దిక్లాను,22ఏబాలు, అబీమాయేలు, షేబా,23ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.

24షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,25ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,26రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,27తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.

28అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.29వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,30మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,31యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.

32అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.33మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.

34అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.

35ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.36వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.37రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.

38శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.39లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.40శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.

41అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.42ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
ఎదోము రాజులు
1:43-54; ఆది 36:31-43

43ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.44బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.45యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.

46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.47హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.48శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.

49షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.50బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.

51హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,52అహలీబామా, ఏలా, పీనోను,53కనజు, తేమాను, మిబ్సారు,54మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.

Chapter 2

ఇశ్రాయేలు
2:1-2; ఆది 35:23-26

1ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,2దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.

యూదా
2:5-15; రూతు 4:18-22; మత్తయి 1:3-6

3యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.4తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.

5పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు.6జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా.7కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.8ఏతాను కొడుకు పేరు అజర్యా.

9హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై.10రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు.11నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.12బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.

13యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా,14నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి,15ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు.

16వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.17అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు.

18హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు1 అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.19అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.20హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు.

21తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.22సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి.

23వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.24హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు - ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.

25హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.26ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి.27యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు.28ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు.

29అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.30నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు.31అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.32షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.33యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు.

34షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు35షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.

36అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.37జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.38ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు.

39అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు.40ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు.41షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు.

42యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.43హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ.44షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు.

45షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.46కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.47యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.

48కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది.49ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.

50ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
51వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు.

52కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే.53కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.

54శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.55యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.


1 2:18 యెరీయోతు అజూబా భార్య

Chapter 3

దావీదు కుటుంబం
3:1-4; 2 సమూ 3:2-5
3:5-8; 2 సమూ 5:14-16; 1 దిన 14:4-7

1దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం.

రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.

2మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు.

నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.

3అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు.

ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.

4ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.

యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

5యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.

6దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,7నోగహు, నెపెగు, యాఫీయ,8ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.

9వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.
సొలొమోను కుటుంబం

10సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.

11యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.

12యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.

13యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.

14మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.

15యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.

16యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.

17యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,18మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.

19పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.

20అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.

21హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.

22షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.

23నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.

24ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.

Chapter 4

యూదా వంశం

1యూదా కొడుకులు పెరెసు, హెస్రోను, కర్మీహూరు, శోబాలు అనేవాళ్ళు.2శోబాలు కొడుకు పేరు రెవాయా. రెవాయాకి యహతు పుట్టాడు. యహతుకి అహూమై, లహదు పుట్టారు. వీళ్ళు జొరాతీయుల తెగల మూల పురుషులు.

3అబీయేతాము సంతానం యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు హజ్జెలెల్పోని.

4ఇక పెనూయేలు గెదోరీయులకు మూలపురుషుడు. ఏజెరు అనేవాడు హూషాయీయులకు మూలపురుషుడు. వీళ్ళంతా హూరు కొడుకులు. హూరు ఎఫ్రాతాకు పెద్ద కొడుకు, బేత్లెహేముకు తండ్రి.

5అష్షూరు తండ్రి తెకోవ. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేళ్ళు హెలా, నయరా.6నయరా ద్వారా అతనికి అహూజ్జాము, హెపెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు.

7హెలా కొడుకులెవరంటే జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు.8వీరిలో కోజు ద్వారా ఆనూబు, జోబేబా, హారుము కొడుకైన అహర్హేలు ద్వారా కలిగిన తెగల ప్రజలూ వచ్చారు.

9యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే <<యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను>> అని చెప్పింది.10ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు. <<నువ్వు నన్ను కచ్చితంగా ఆశీర్వదించు. నా భూభాగాన్ని విశాలం చెయ్యి. నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు.>> దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు.

11షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎష్తోను.12ఎష్తోను కొడుకులు బేత్రాఫా, పాసెయా, తెహిన్నా అనే వాళ్ళు. ఈ తెహిన్నా ఈర్నాహాషుకు తండ్రి. వీళ్ళు రేకాకు చెందిన వాళ్ళు.

13కనజు కొడుకుల పేర్లు ఒత్నీయేలు శెరాయా. ఒత్నీయేలు కొడుకుల్లో హతతు అనే ఒకడుండేవాడు.14మెయానొతైకి ఒఫ్రా పుట్టాడు. శెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతి వృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. ఆ లోయలో ఉన్న వాళ్ళంతా చేతిపనుల వాళ్ళే.

15యెఫున్నె కొడుకైన కాలేబుకు ఈరు, ఏలా, నయం పుట్టారు. ఏలా కొడుకుల్లో కనజు అనే వాడున్నాడు.16యెహల్లెలేలు కొడుకులు జీఫు, జీఫా, తీర్యా, అశర్యే.

17ఎజ్రా కొడుకులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. ఐగుప్తీయురాలూ, ఫరో కూతురూ అయిన బిత్యా ద్వారా మెరెదుకు పుట్టిన కొడుకులు మిర్యాము,, షమ్మయి, ఎష్టెమో, ఇష్బాహు అనేవాళ్ళు. ఈ ఇష్బాహు ఎష్టేమోను వాళ్లకి తండ్రి.18యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన యెరెదు, శోకోకు తండ్రి అయిన హెబెరు, జానోహకు తండ్రి అయిన యెకూతీయేలు పుట్టారు.

19నహము సోదరీ హూదీయా భార్యా అయిన ఆమెకు పుట్టిన కొడుకుల్లో ఒకడు గర్మీ వాడు కెయిలాకు తండ్రి. మరొకడు మాయకాతీయుడైన ఎష్టేమో.20షీమోను కొడుకులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోనులు. ఇషీ కొడుకులు జోహేతు, బెన్జోహేతులు.

21యూదా కొడుకైన షేలహు కొడుకులు ఎవరంటే లేకాకు తండ్రియైన ఏరు, మారేషాకు తండ్రీ, బేత్ ఆష్బియాలో సన్నటి వస్త్రాలు నేసే వారికి మూలపురుషుడైన లద్దాయు,22యోకిం, కోజేబా సంతతి, యోవాషు సంతతి, మోయాబులో ప్రసిద్ధులై బెత్లేహెంకు తిరిగి వచ్చిన శారాపీయులూ.

ఇవన్నీ పూర్వకాలంలోనే రాసి ఉన్న సంగతులే.

23వీళ్ళు కుమ్మరి వాళ్ళు. నెతాయీములోనూ, గెదేరలోనూ వీళ్ళు నివసించారు. వీళ్ళు రాజు కోసం పని చేయడానికి అక్కడ నివసించారు.
షిమ్యోను వంశం
4:28-43; యెహో 19:2-10

24షిమ్యోను కొడుకులు వీళ్ళు. నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు.25వీళ్ళలో షావూలుకు షల్లూము పుట్టాడు. షల్లూముకు మిబ్సాము పుట్టాడు. మిబ్సాముకు మిష్మా పుట్టాడు.26మిష్మా సంతతి వారెవరంటే అతని కొడుకు హమ్మూయేలు, అతని మనవడు జక్కూరు, మునిమనవడు షిమీ.

27షిమీకి పదహారు మంది కొడుకులూ, ఆరుగురు కూతుళ్ళూ పుట్టారు. కానీ అతని అన్నదమ్ములకు ఎక్కువమంది సంతానం కలుగలేదు. యూదా తెగ ప్రజలు వృద్ధి చెందినట్లు వీళ్ళ తెగలు వృద్ధి చెందలేదు.28వీళ్ళు బెయేర్షెబా, మోలాదా, హజర్షువలు అనే ఊళ్లలో నివసించారు.

29వీళ్ళు ఇంకా బిల్హా, ఎజెము, తోలాదు,30బెతూయేలు, హోర్మా, సిక్లగు31బేత్మర్కాబోతు, హాజర్సూసా, బేత్బీరీ, షరాయిము అనే ప్రాంతాల్లో కూడా నివసించారు. దావీదు పరిపాలన మొదలయ్యే వరకూ వీళ్ళు ఈ ఊళ్లలో నివసించారు.

32వాళ్ళ ఐదు ఊళ్ళు ఏవంటే ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను.33వీటితో పాటు బయలు వరకూ ఉన్న గ్రామాలు వాళ్ళ వశంలో ఉండేవి. వీళ్ళు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాలు ఇవి. వీళ్ళు తమ వంశావళి వివరాలను భద్రం చేసుకున్నారు.

34వీళ్ళ తెగల నాయకులు ఎవరంటే మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా,35యోవేలు, అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,36ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా,37షెమయాకు పుట్టిన షిమ్రీ కొడుకైన యెదాయాకు పుట్టిన అల్లోను కొడుకైన షిపి కొడుకైన జీజా అనేవాళ్ళు.38వీళ్ళ కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి.

39వీళ్ళు తమ దగ్గర ఉన్న మందలకు మేత కోసం గెదోరుకు తూర్పు దిక్కున ఉన్న పల్లపు ప్రాంతానికి వెళ్ళారు.40అక్కడ వాళ్ళకు పుష్టిగా, విస్తారంగా మేత ఉన్న ప్రాంతం కనిపించింది. ఆ దేశం విశాలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశం వాళ్ళు నివసించారు.41ఆ వంశావళిలో పేర్లు ఉన్న వీరు యూదా రాజు హిజ్కియా పరిపాలించిన రోజుల్లో అక్కడకు వెళ్ళారు. అక్కడ హాము తెగల నివాసాల పైనా అక్కడే ఉన్న మేయూనిము తెగలపైనా దాడులు చేశారు. వాళ్ళను పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తమ మందలకు సరిపోయినంత మేత అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు.

42షిమ్యోను తెగ నుండి ఐదు వందలమంది శేయీరు పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. వీళ్ళకు ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకులుగా ఉన్నారు.43వీళ్ళు అమాలేకీయుల్లో మిగిలి ఉన్న కాందిశీకులను హతమార్చి అక్కడే ఈ రోజు వరకూ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు.

Chapter 5

రూబేను వంశం

1ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.2తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.3ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.

4యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి.

యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ,

5షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు,

6బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.

7వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా,8యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.

9వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.

10సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
గాదు వంశం

11వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.12వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు.13వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.

14వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
15గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.

16వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు.17యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.

18రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు.19వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.

20యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.21కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.22దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
మనష్షే అర్థగోత్రం

23మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు.24వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.

25కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.

Chapter 6

లేవి వంశం
6:54-80; యెహో 21:4-39

1లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.2కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.3అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

4ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.5అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.6ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.

7మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.8అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.9అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.

10యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.11అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.12అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.

13షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.14అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.15యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.

16లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.17గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.18కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.

19మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,

20గెర్షోను కొడుకు లిబ్నీ,

లిబ్నీ కొడుకు యహతు,

యహతు కొడుకు జిమ్మా.

21జిమ్మా కొడుకు యోవాహు,

యోవాహు కొడుకు ఇద్దో,

ఇద్దో కొడుకు జెరహు,

జెరహు కొడుకు యెయతిరయి.

22కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు.

ఇతని కొడుకు కోరహు,

కోరహు కొడుకు అస్సీరు,

23అస్సీరు కొడుకు ఎల్కానా,

ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు,

ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,

24అస్సీరు కొడుకు తాహెతు,

తాహెతు కొడుకు ఊరియేలు,

ఊరియేలు కొడుకు ఉజ్జియా,

ఉజ్జియా కొడుకు షావూలు.

25ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.

26ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై.

జోపై కొడుకు నహతు,

27నహతు కొడుకు ఏలీయాబు,

ఏలీయాబు కొడుకు యెరోహాము,

యెరోహాము కొడుకు ఎల్కానా.

28సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు1 , మరొకడు అబీయాయు.

29మెరారి కొడుకుల్లో ఒకడు మహలి.

మహలి కొడుకు లిబ్నీ.

లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.

30ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా.

హగ్గీయా కొడుకు అశాయా.

31నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.32సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.

33ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు.

కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.

34సమూయేలు ఎల్కానాకి పుట్టాడు.

ఎల్కానా యెరోహాముకి పుట్టాడు.

యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు.

ఎలీయేలు తోయహుకి పుట్టాడు.

35తోయహు సూపుకి పుట్టాడు.

సూపు ఎల్కానాకి పుట్టాడు.

ఎల్కానా మహతుకి పుట్టాడు.

మహతు అమాశైకి పుట్టాడు.

36అమాశై ఎల్కానాకి పుట్టాడు.

ఎల్కానా యోవేలుకి పుట్టాడు.

యోవేలు అజర్యాకి పుట్టాడు.

అజర్యా జెఫన్యాకి పుట్టాడు.

37జెఫన్యా తాహతుకి పుట్టాడు.

తాహతు అస్సీరుకి పుట్టాడు.

అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు.

ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.

38కోరహు ఇస్హారుకి పుట్టాడు.

ఇస్హారు కహాతుకి పుట్టాడు.

కహాతు లేవికి పుట్టాడు.

లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.

39హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు.

బెరక్యా షిమ్యా కొడుకు.

40షిమ్యా మిఖాయేలు కొడుకు.

మిఖాయేలు బయశేయా కొడుకు.

బయశేయా మల్కీయా కొడుకు.

41మల్కీయా యెత్నీ కొడుకు.

యెత్నీ జెరహు కొడుకు.

జెరహు అదాయా కొడుకు.

42అదాయా ఏతాను కొడుకు.

ఏతాను జిమ్మా కొడుకు.

జిమ్మా షిమీ కొడుకు.

43షిమీ యహతు కొడుకు.

యహతు గెర్షోను కొడుకు.

గెర్షోను లేవి కొడుకు.

44హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు.

కీషీ అబ్దీ కొడుకు.

అబ్దీ మల్లూకు కొడుకు.

మల్లూకు హషబ్యా కొడుకు.

45హషబ్యా అమజ్యా కొడుకు.

అమజ్యా హిల్కీయా కొడుకు.

46హిల్కీయా అమ్జీ కొడుకు.

అమ్జీ బానీ కొడుకు.

బానీ షమెరు కొడుకు.

47షమెరు మహలి కొడుకు.

మహలి మూషి కొడుకు.

మూషి మెరారి కొడుకు.

మెరారి లేవి కొడుకు.

48వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు.
అహరోనూ వంశం

49అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.

50అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు.

ఎలియాజరు కొడుకు ఫీనెహాసు.

ఫీనెహాసు కొడుకు అబీషూవ.

51అబీషూవ కొడుకు బుక్కీ.

బుక్కీ కొడుకు ఉజ్జీ.

ఉజ్జీ కొడుకు జెరహ్య.

52జెరహ్య కొడుకు మెరాయోతు.

మెరాయోతు కొడుకు అమర్యా.

అమర్యా కొడుకు అహీటూబు.

53అహీటూబు కొడుకు సాదోకు.

సాదోకు కొడుకు అహిమయస్సు.

54అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.55దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.56అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.

57అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,58హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.

59అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.60ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.

61కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.

62గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది.

63మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.64ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.65వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.

66కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.67ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,68యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,69అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
70అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
71అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,72ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,73రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
74ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,75హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,76నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.

77ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.78ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,79కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
80అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,81హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.


1 6:28 యోవేలు వషీని

Chapter 7

ఇశ్శాఖారు వంశం

1ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.2తోలాకి ఉజ్జీ, రెఫాయా, యెరీయేలూ, యహ్మయీ, యిబ్శామూ, షెమూయేలూ పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్టులు. ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు.3ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకుల పేర్లు, మిఖాయేలు ఓబద్యా, యోవేలూ, ఇష్షీయా అనేవాళ్ళు. వీళ్ళు ఐదు గురూ తమ తెగల నాయకులు.

4వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.5ఇశ్శాఖారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎనభై ఏడువేలమంది ఉన్నారు.
బెన్యామీను వంశం

6బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.7బెలకు ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు, ఎస్బోనూ, ఉజ్జీ, ఉజ్జీయేలూ, యెరీమోతూ, ఈరీ అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై రెండు వేల ముప్ఫై నల్గురు యుద్ధం చేసే వాళ్ళున్నారు.

8బేకరు కొడుకులు జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు.9తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.10యెదీయవేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.

11యెదీయవేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళలో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు పదిహేను వేల రెండు వందలమంది ఉన్నారు.12ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.
నఫ్తాలీ వంశం

13బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు.

14మనష్షే కొడుకుల్లో అశ్రీయేలు అనే వాడున్నాడు. వాడు అతని ఉంపుడుగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడుగత్తె ఒక అరామీయురాలు. ఈమే గిలాదుకి నాయకుడైన మాకీరుకి కూడా జన్మనిచ్చింది.15మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయకా. మనష్షే రెండో కొడుకు పేరు సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు.16మాకీరు భార్య మయకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరెషు. ఇతని సోదరుడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాము, రాకెము.

17ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనష్షే కొడుకు మాకీరుకి పుట్టిన గిలాదు సంతానం.18మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.19షెమీదా కొడుకులు అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
ఎఫ్రాయిము వంశం

20ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.21తాహతు కొడుకు జాబాదు. ఇతనికి షూతలహూ, ఏజెరూ, ఎల్యాదూ అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు.22వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.

23తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.24అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్‌ హోరోను, దక్షిణ బేత్‌ హోరోను, ఉజ్జెన్‌ షెయెరా పట్టణాలను నిర్మించింది.
25వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను,26తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహూదు, అమీహూదు కొడుకు ఎలీషామా,27ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ.

28వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే, బేతేలూ దాని చుట్టూ ఉన్న గ్రామాలు. ఇంకా తూర్పువైపు ఉన్న నహరానూ, పడమటి వైపు ఉన్న గెజెరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షెకెము, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా, దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకూ వారి నివాస స్థలాలు వ్యాపించాయి.29అలాగే మనష్షీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బేత్షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు వాళ్ళకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళలోనే నివాసమున్నారు.
ఆషేరు వంశం

30ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.31బెరీయా కొడుకులు హెబెరూ, మల్కీయేలూ. మల్కీయేలు కొడుకు బిర్జాయీతు.32హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.

33యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.34అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.35అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.

36జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,37బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు.38ఎతెరు కొడుకులు యెఫున్నె, పిస్పా, అరా.

39ఉల్లా కొడుకులు ఆరహు, హన్నియేలు, రిజెయాలు.40వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు.

Chapter 8

బెన్యామీను వంశం
8:28-38; 1 దిన 9:34-44

1బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,2మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.

3వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,4అబీషూవ, నయమాను, అహోయహు,5గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.

6ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.7ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.

8షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.9అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,10యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.11హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
12ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.13ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.

14బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,

15జెబద్యా, అరాదు, ఏదెరు,

16మిఖాయేలు, ఇష్పా, యోహా.

17ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,

18ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.

19షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,

20ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,

21అదాయా, బెరాయా, షిమ్రాతు.

22షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,

23అబ్దోను, జిఖ్రీ, హానాను,

24హనన్యా, ఏలాము, అంతోతీయా,

25ఇపెదయా, పెనూయేలు.

26ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,

27యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.

28వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.

29గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.30ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,31గెదోరు, అహ్యో, జెకెరు.

32మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.

33నేరుకి కీషు పుట్టాడు.

కీషుకి సౌలు పుట్టాడు.

సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.

34యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.

35మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.

36ఆహాజుకు యెహోయాదా పుట్టాడు.

యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ.

జిమ్రీకి మోజా పుట్టాడు.

37మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.

38ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.

39ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.

40ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు.

వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.

Chapter 9

యెరూషలేములో నివాసం ఉంటున్న ప్రజలు
9:1-17; నెహెమ్యా 11:3-19

1ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.2తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు.3అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు.

4ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో ఊతైయూ ఉన్నాడు.

ఊతైయూ అమీహూదు కొడుకు.

అమీహూదు ఒమ్రీ కొడుకు.

ఒమ్రీ ఇమ్రీ కొడుకు.

ఇమ్రీ బానీ కొడుకు.

బానీ పెరెసు వంశం వాడు.

పెరెసు యూదా కొడుకు.

5షిలోనీ వాళ్ళలో పెద్దవాడు ఆశాయా, అతని సంతానమూ,6జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు.

7ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ,

8యెరోహాము కొడుకైన ఇబ్నెయా, మిక్రి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నీయా కొడుకైన రగూవేలుకి పుట్టిన షెఫట్యా కొడుకైన మెషుల్లామూ ఉన్నారు.

9వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు.

10యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.11అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు.

12అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు.

యెరోహాము పషూరు కొడుకు.

పసూరు మల్కీయా కొడుకు.

ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు.

అదీయేలు యహజేరా కొడుకు.

యహజేరా మెషుల్లాము కొడుకు.

మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు.

మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు.

13వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న ఒక వెయ్యీ ఏడు వందల అరవై మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్ధులు.

14ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు.

షెమయా హష్షూబు కొడుకు.

హష్షూబు అజ్రీకాము కొడుకు.

అజ్రీకాము హషబ్యా కొడుకు.

హషబ్యా మెరారి వంశం వాడు.

15బక్బక్కరూ, హెరెషూ, గాలాలూ, వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు.

మత్తన్యా మీకా కొడుకు.

మీకా జిఖ్రీ కొడుకు.

జిఖ్రీ ఆసాపు కొడుకు.

16ఇంకా ఓబద్యా ఉన్నాడు.

ఈ ఓబద్యా షెమయా కొడుకు.

షెమయా గాలాలు కొడుకు.

గాలాలు యెదూతోను కొడుకు.

నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు.

17ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వీళ్ళ బంధువులూ ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు.18లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజ ద్వారానికి కాపలా కాసేవాళ్ళు.19కోరహు కొడుకైన ఎబ్యాసాపుకి పుట్టిన కోరే కొడుకైన షల్లూము అతని బంధువులూ, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులూ మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు.

20గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.21మెషెలెమ్యా కొడుకైన జెకర్యా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు.

22ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు.23వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు.24ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు.

25గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు.26అయితే లేవీయులైన నలుగురు ప్రముఖ ద్వారపాలకులు మిగిలిన వాళ్ళపై అజమాయిషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులనూ, ఖజానాలనూ భద్రపరచే బాధ్యత వాళ్ళదే.27వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.

28వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు.29మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.

30యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధద్రవ్యాలను, పరిమళ తైలాన్నీ తయారు చేస్తారు.31అర్పణల కోసం రొట్టెను తయారుచేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూముకి పెద్ద కొడుకు.32వాళ్ళ బంధువులైన కహాతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది.

33గాయకులూ లేవీయుల వంశ నాయకులూ పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా సేవ చేయాలి.34వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా, పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు.
సౌలు కుటుంబం
9:34-44; 1 దిన 8:28-38

35గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా.

36ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,37గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు.

38మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు.

39నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.

40యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకి మీకా పుట్టాడు.

41మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనేవాళ్ళు.

42ఆహాజుకి యరా పుట్టాడు. యరాకి ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు.

43మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.

44ఆజేలుకి అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు.

Chapter 10

గిల్బోవ పర్వతం మీద సౌలు మరణం
10:1-12; 1 సమూ 31:1-13; 2 సమూ 1:4-12

1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు.2ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.

3సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.

4అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో <<నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు>> అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.

5సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు.6ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు.
7తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.

8తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు.
9వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు.10తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు.

11ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది.12అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు.

13సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.14మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

Chapter 11

దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికి రాజు
11:1-3; 2 సమూ 5:1-3
11:4-9; 2 సమూ 5:6-10

1ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. <<ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం.2ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో <నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు> అని చెప్పాడు కదా>> అని దావీదుతో అన్నారు.

3ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది.
యెరూషలేమును దావీదు ఆక్రమించడం
11:4-9; 2 సమూ 5:6-10

4ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు.5యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో <<నువ్వు ఇక్కడికి రాలేవు>> అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే <<దావీదు పట్టణం>> అంటారు.

6దానికి ముందు దావీదు <<ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు>> అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు.

7తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి <<దావీదు పట్టణం>> అనే పేరు కలిగింది.8దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు.9దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
దావీదు శూరులు
11:10-41; 2 సమూ 23:8-39

10ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే.11దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.

12ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు.13ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు.14అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.

15ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు.16ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు.17దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. <<బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?>> అన్నాడు.

18కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు.19తరువాత ఇలా అన్నాడు<<నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?>> అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు.

20యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.21ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.

22ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు.23ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.

24ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు.25ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.

26ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను,27హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,28తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,29హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,31బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,32గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,33బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,

34గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను,35హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు,36మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,

38నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,39అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,

42రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,43మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,44ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు,

45షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా,46మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా,47ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.

Chapter 12

దావీదు సహాయకులు

1కీషు కొడుకైన సౌలుకు భయపడి దావీదు ఇంకా దాగి ఉన్నప్పుడు, సౌలు బంధువులైన బెన్యామీనీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది దావీదుకు యుద్ధంలో సాయం చెయ్యడానికి అతని దగ్గరికి సిక్లగుకు వచ్చారు.2వీళ్ళు బాణాలు ధరించి, కుడి ఎడమ చేతులతో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో, బాణాలు వేయడంలో సామర్ధ్యం ఉన్నవాళ్ళు.

3వాళ్లెవరంటే, గిబియావాడు షెమాయా కొడుకులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడు యోవాషు, అజ్మావెతు కొడుకులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,4ముప్ఫైమందిలో పరాక్రమశాలి, ముప్ఫైమందికి పెద్ద ఇష్మయా అనే గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,

5ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,6కోరహీయులు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,7గెదోరు ఊరివాడు యెరోహాము కొడుకులు యోహేలా, జెబద్యా అనేవాళ్ళు.

8ఇంకా, గాదీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది అరణ్యంలో దాగి ఉన్న దావీదు దగ్గర చేరారు. వీళ్ళు డాలు, ఈటె తో యుద్ధం చేయడంలో ప్రవీణులు. వీళ్ళు సింహం ముఖంలాంటి ముఖం ఉన్నవాళ్ళు. కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్త గలిగిన వాళ్ళు.

9వాళ్లెవరంటే, మొదటివాడు ఏజెరు, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలీయాబు,10నాల్గోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా,11ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు,12ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు,13పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి.

14గాదీయులైన వీళ్ళు సైన్యానికి అధిపతులుగా ఉన్నారు. వాళ్ళల్లో అతి అల్పుడైనవాడు, వందమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,15యొర్దాను గట్టుల మీదుగా పొర్లి పారే మొదటి నెలలో, దాన్ని దాటి వెళ్లి తూర్పు లోయల్లో, పడమటి లోయల్లో ఉన్నవాళ్ళందర్నీ తరిమివేసిన వాళ్ళు వీళ్ళే.

16ఇంకా బెన్యామీనీయుల్లో కొంతమంది, యూదావాళ్ళల్లో కొంతమంది, దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చారు.17దావీదు బయల్దేరి వాళ్లకు ఎదురు వెళ్లి వాళ్లతో <<మీరు సమాధానంతో నాకు సాయం చెయ్యడానికి నా దగ్గరికి వచ్చి ఉంటే, నా హృదయం మీతో కలుస్తుంది. అలా కాకుండా నావల్ల మీకు అపకారమేమీ కలుగలేదని తెలిసినా, నన్ను శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే, మన పూర్వీకుల దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించు గాక>> అన్నాడు.

18అప్పుడు ముప్ఫైమందికి అధిపతైన అమాశై ఆత్మవశంలో ఉండి <<దావీదూ, మేము నీవాళ్ళం, యెష్షయి కొడుకా, మేము నీ పక్షాన ఉన్నాం. నీకు సమాధానం కలుగుగాక, సమాధానం కలుగుగాక, నీ సహకారులకు కూడా సమాధానం కలుగుగాక, నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు>> అని పలికినప్పుడు, దావీదు వాళ్ళను చేర్చుకుని వాళ్ళను తన దండుకు అధిపతులుగా చేశాడు.

19మనష్షేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుమీద యుద్ధం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని, వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిష్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి, వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి, ఫిలిష్తీయుల అధికారులు దావీదును పంపివేశారు.

20అప్పుడు అతడు సిక్లగుకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మనష్షే వారు అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అనే వేలమందిమీద అధిపతులు దావీదు పక్షాన చేరారు.

21వాళ్ళందరూ పరాక్రమశాలులూ, సైన్యాధిపతులు. ఆ తిరుగులాడే దండులను హతం చెయ్యడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు.22దావీదు సైన్యం దేవుని సైన్యంలా మహా సైన్యంగా అవుతూ, ప్రతిరోజూ అతనికి సాయం చేసేవాళ్ళు అతని దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు.
హెబ్రోనులో దావీదును కలుసుకొన్నవారు

23యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు వైపుకు తిప్పాలన్న ప్రయత్నంలో యుద్ధానికి ఆయుధాలు ధరించి అతని దగ్గరికి హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఇలా ఉంది.24యూదా వాళ్ళల్లో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు ఆరువేల ఎనిమిది వందలమంది.25షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు ఏడువేల వందమంది.

26లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది.27అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితోపాటు ఉన్నవాళ్ళు మూడువేల ఏడు వందలమంది.28పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని తండ్రి యింటి వాళ్ళైన అధిపతులు ఇరవై ఇద్దరు.

29సౌలు సంబంధులైన బెన్యామీనీయులు మూడు వేలమంది. అప్పటి వరకూ వాళ్ళల్లో చాలామంది సౌలు ఇంటిని కాపాడుతూ ఉన్నవాళ్ళు.30తమ పూర్వీకుల యింటివాళ్ళల్లో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయుల్లో ఇరవైవేల ఎనిమిదివందల మంది.31మనష్షే అర్థ గోత్రం వారిలో దావీదును రాజుగా చెయ్యడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది.

32ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు.33జెబూలూనీయుల్లో అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దావీదు పట్ల నమ్మకంగా స్వామిభక్తి కలిగి యుద్ధం చెయ్య గలవాళ్ళు యాభై వేల మంది.

34నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.35దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది.

36ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నలభై వేలమంది.37ఇంకా యొర్దాను నది అవతల ఉండే రూబేనీయుల్లో గాదీయుల్లో మనష్షేవాళ్ళల్లో సగం మంది, అన్ని రకాల ఆయుధాలు ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలన్న కోరిక కలిగి ఉండి ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు.

38ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ ఏక మనస్సుతో దావీదును రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు.39వాళ్ళ సహోదరులు వాళ్ళ కోసం భోజనపదార్ధాలు సిద్ధం చేసినప్పుడు, వాళ్ళు దావీదుతో కలిసి అక్కడ మూడు రోజులుండి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు.

40ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి పొలిమేరల వరకూ వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్షపళ్ళ గెలలు, ద్రాక్షామధురసం, నూనె, గొర్రెలు, పశువులు, విస్తారంగా తీసుకొచ్చారు.

Chapter 13

దేవుని మందసాన్ని ఓబేదెదోము ఇంటికీ తీసుకువెళ్ళడం
13:1-14; 2 సమూ 6:1-11

1దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో,2<<ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,3మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు>> అన్నాడు.4ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.

5దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.6కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.

7వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు.8దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.

9వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు10యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు.11యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.

12ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి <<దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?>> అన్నాడు.13కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు.14దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.

Chapter 14

యెరూషలేములో దావీదు
14:1-7; 2 సమూ 5:11-16; 1 దిన 3:5-8

1తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.2తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.

3తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.4యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,5ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,6నోగహు, నెపెగు, యాఫీయ,7ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
దావీదు ఫిలిష్తీయులను ఓడించడం
14:8-17; 2 సమూ 5:17-25

8దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.9ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.

10<<ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?>> అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా <<వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను>> అన్నాడు.11వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి <<ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు>> అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.12ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.

13ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.14దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు <<నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.

15కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో>> అని చెప్పాడు.16దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.17కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.

Chapter 15

మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకురావడం
15:25—16:3; 2 సమూ 6:12-19

1దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.2అప్పుడు దావీదు <<మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు>> అని ఆజ్ఞాపించాడు.3అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

4అహరోను సంతతి వారిని, లేవీయులను,

5కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,

6మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,

7గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని,

8ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,

9హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,

10ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.

11అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో12<<లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
13ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి>> అన్నాడు.14అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.15తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.

16అప్పుడు దావీదు <<మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి>> అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.17కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,18వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.

19వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.20జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.21ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.

22లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.23బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,24షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.

25దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.26యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.

27దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.28ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.

29కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.

Chapter 16

దావీదు కృతజ్ఞత పాట
16:8-22; కీర్తన 105:1-15
16:23-33; కీర్తన 96:1-13
16:34-36; కీర్తన 106:1, 47-48

1ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు.2దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు.3పురుషులైనా, స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికీ ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు.

4అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.

5వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు.6బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు.

7ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.
8యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
ఆయన పేరును ప్రకటన చెయ్యండి.
ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.
9ఆయనను గూర్చి పాడండి.
ఆయనను కీర్తించండి.
ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
10ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి.
యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.
11యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి.
ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా,
ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా,
13ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
14ఆయన మన దేవుడు యెహోవా.
ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి.
15ఆయన తను చేసిన నిబంధనను
తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు.
16ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు.
17యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా
ఆయన స్థిరపరిచింది దీనినే.

18ఆయన మాట ఇచ్చాడు. <<నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.>>

19మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే,

అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను.

20వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు,
21ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు.

వారి నిమిత్తం రాజులను గద్దించాడు.

22నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ,

నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు.

23సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి
ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి.
24అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి.
సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.
25యెహోవా మహా ఘనత వహించినవాడు.
ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు.
సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు.
26జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే.
యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.
27ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి.
బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి.
28జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి.
మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి.
29యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి.
నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి.
30భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి.
అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది.
అప్పుడది స్థిరంగా ఉంటుంది.
31యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి.
ఆకాశాలు ఆనందించు గాక.
భూమి సంతోషించు గాక
32సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక.
పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక.
యెహోవా వస్తున్నాడు.
33భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు.
వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.
34యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.
ఆయనను స్తుతించండి.
35దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.
మమ్మల్ని సమకూర్చు.
36మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా
నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా
అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు
అని ఆయన్ను బతిమాలుకోండి.
ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా
యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక.

ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

37అప్పుడు మందసం ముందు నిత్యమూ జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపునూ అతని బంధువులనూ నియమించాడు. ఓబేదెదోమునూ, వాళ్ళ బంధువులైన అరవై ఎనిమిదిమందినీ,38యెదూతూను కొడుకు ఓబేదెదోమునూ, హోసానూ ద్వారపాలకులుగా నియమించాడు.39గిబియోనులోని ఉన్నత స్థలం లో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధుల్లో రాసి ఉన్న ప్రకారం,
40ఉదయం, సాయంత్రాల్లో ప్రతిరోజూ నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు.41యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వీళ్ళతోపాటు హేమానునూ, యెదూతూనునూ, పేర్ల క్రమంలో ఉదాహరించిన మరి కొందరిని నియమించాడు.

42బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వీళ్ళల్లో ఉండే హేమానునూ, యెదూతూనునూ అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు.43తరువాత ప్రజలందరూ తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటివాళ్ళను దీవించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

Chapter 17

దావీదుతో దేవుని ఒడంబడిక
17:1-15; 2 సమూ 7:1-17

1దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో <<నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది>> అని చెప్పాడు.2అప్పుడు నాతాను <<దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి>> అని దావీదుతో అన్నాడు.

3ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు,4<<నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు.5ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను.6నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?

7కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను.8నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.

9ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు.10నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.

11నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.12అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.

13నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను.14నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.>>

15నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.
దావీదు ప్రార్థన
17:16-27; 2 సమూ 7:18-29

16రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. <<దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం?17దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు.18నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు.

19యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు.20యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.21నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.

22నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు.23యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక.24ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.

25దేవా, నీకు సంతానం ఇస్తానని నీ దాసునికి నువ్వు తెలియచేశావు గనుక నీ సన్నిధిలో విన్నపం చెయ్యడానికి నీ దాసునికి ధైర్యం కలిగింది.26యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు.27ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.>>

Chapter 18

దావీదు విజయాలు
18:1-13; 2 సమూ 8:1-14
18:14-17; 2 సమూ 8:15-18

1ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు.2తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.

3తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు.4అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.

5సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు.6తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.

7దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు.8హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.

9దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది.10హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు.11ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.

12ఇంకా సెరూయా కొడుకు అబీషై ఉప్పు లోయలో ఎదోమీయుల్లో పద్దెనిమిది వేలమందిని హతం చేశాడు.13దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.

14ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగించాడు.15సెరూయా కొడుకు యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి.16అహీటూబు కొడుకు సాదోకూ, అబ్యాతారు కొడుకు అబీమెలెకూ యాజకులు. షవ్శా శాస్త్రి.17యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు1 .


1 18:17 సహాయకులు యాజకులు

Chapter 19

దావీదు, అమ్మోనీయుల
19:1-19; 2 సమూ 10:1-19

1ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు.2అప్పుడు దావీదు <<హానూను తండ్రి నాహాషు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయ చూపిస్తాను>> అనుకుని, అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు,3అమ్మోనీయుల అధిపతులు హానూనుతో<<నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు>> అని చెప్పారు.

4హానూను దావీదు సేవకులను పట్టుకుని, వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొల కంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్ళను పంపేశాడు.5ఆ మనుషులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళను గూర్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గు పాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి <<మీ గడ్డాలు పెరిగే వరకూ మీరు యెరికోలో ఉండి, తరువాత రండి>> అని సందేశం పంపాడు.

6అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు.7కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్నీ ముప్ఫై రెండువేల రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మేదెబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు.

8దావీదు ఈ సంగతి విని యోవాబునూ, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు.9అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధపంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు.
10తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి, యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని, అరామీయులకు ఎదురుగా వాళ్ళను బారులు తీర్చి,11మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి, అమ్మోనీయులకు ఎదురుగా మొహరింప జేశాడు.
12<<అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే, నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే, నేను నీకు సాయం చేస్తాను.13ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తమూ మన దేవుని పట్టణాల నిమిత్తమూ శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక>> అన్నాడు.

14ఆ విధంగా యోవాబు అతనితో కూడ ఉన్న సైన్యమూ, అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు, వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు.15అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

16తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి, నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజెరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు.17దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి, వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తీర్చి యుద్ధం చేశాడు.

18అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక, వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో ఏడువేల రథికులనూ, నలభై వేల మంది సైనికులనూ హతం చేసి వారి సేనాని షోపకును చంపాడు.19తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజెరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించ లేదు.

Chapter 20

రబ్బాను ఓడించడం
20:1-3; 2 సమూ 11:1; 12:29-31

1తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.

2దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు.3దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.
ఫిలిష్తీయులతో యుద్ధం
2:4-8; 2 సమూ 21:15-22

4అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు లొంగిపోయారు.5మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపని చేసేవాడి అడ్డకర్ర అంత పెద్దది.

6మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.7అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు.8గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత, అతని సేవకుల చేత హతమయ్యారు.

Chapter 21

దావీదు చేసిన జనసంఖ్య
21:1-26; 2 సమూ 24:1-25

1తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.2అప్పుడు దావీదు యోవాబుకూ ప్రజల అధిపతులకూ <<మీరు వెళ్లి బెయేర్షెబా నుండి దాను వరకూ ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కపెట్టి, జనసంఖ్య నాకు తెలియజేయండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు.3అందుకు యోవాబు <<రాజా నా ప్రభూ, యెహోవా తన ప్రజలను ఇప్పుడున్న వారికంటే వందరెట్లు ఎక్కువమందిగా చేస్తాడు గాక. వాళ్ళందరూ నా ప్రభువుకు దాసులు కారా? నా ప్రభువుకు ఈ వివరం ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇది జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది>> అన్నాడు.

4కాని, యోవాబు మాట చెల్ల లేదు. రాజు మాటే చెల్లింది కాబట్టి యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా తిరిగి యెరూషలేముకు వచ్చాడు.5ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు పదకొండు లక్షలమంది. యూదావాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భైవేలమందిగా లెక్కకు వచ్చారు.

6రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు.7ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు.8దావీదు <<నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను. నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి>> అని దేవునికి మొర్రపెట్టాడు.

9దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా <<నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు,10యెహోవా చెప్పేదేమంటే, మూడు విషయాలు నేను నీముందు ఉంచుతున్నాను. వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకో. దాన్ని నీకు చేస్తాను>> అన్నాడు.

11కాబట్టి, గాదు దావీదు దగ్గరికి వచ్చి,

12<<మూడు సంవత్సరాలు కరువు కలగడం,

లేదా మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక ఓటమి పాలవ్వడం,

లేదా, మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం, అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం.

ఈ మూడింట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి, నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు>> అన్నాడు.

13అందుకు దావీదు <<నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను>> అని గాదుతో అన్నాడు.14కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు.15యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో<<చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో>> అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.

16దావీదు తేరిచూడగా, భూమ్యాకాశాల మధ్యలో నిలిచి, వరలోనుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడ్డాడు. అప్పుడు దావీదూ, పెద్దలూ, గోనెపట్టలు కట్టుకుని, సాష్టాంగపడ్డారు.17దావీదు <<ప్రజలను లెక్కపెట్టమని ఆజ్ఞ ఇచ్చినవాణ్ణి నేనే కదా? పాపం చేసి చెడుతనం జరిగించిన వాణ్ణి నేనే కదా? గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? యెహోవా, నా దేవా, బాధపెట్టే నీ చెయ్యి నీ ప్రజల మీద ఉండకుండాా నా మీద, నా తండ్రి ఇంటివారి మీద ఉండనియ్యి>> అని దేవునికి మనవి చేశాడు.

18<<యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు>> అని యెహోవా దూత గాదుకు చెప్పాడు.19యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు.20అప్పుడు ఒర్నాను గోదుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి అతడు, అతనితోపాటు ఉన్న అతని నలుగురు కొడుకులూ దాక్కున్నారు.

21దావీదు ఒర్నాను దగ్గరికి రాగా అతడు దావీదును చూసి, కళ్ళంలోనుంచి బయటకు వచ్చి, తల నేల వరకూ వంచి దావీదుకు నమస్కారం చేశాడు.22అప్పుడు దావీదు ఒర్నానుతో <<ఈ తెగులు ప్రజలను విడిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న చోట నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి తగిన ఖరీదుకు దాన్ని నాకు అమ్ము>> అన్నాడు.

23ఒర్నాను <<రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో, దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోదుమ పిండి, అన్నీ నేను ఇస్తాను>> అని దావీదుతో అన్నాడు.24అప్పుడు రాజైన దావీదు <<అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకు యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన వెల ఇచ్చి తీసుకుంటాను>> అని ఒర్నానుతో చెప్పి,
25ఆ స్థలం కోసం ఆరువందల తులాల బంగారం అతనికి ఇచ్చాడు.26తరువాత దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టించి, దహనబలులు, సమాధానబలులు అర్పించి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుంచి దహన బలిపీఠం మీదికి అగ్నితో అతనికి జవాబిచ్చాడు.27యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు.

28యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవా తనకు జవాబిచ్చాడని దావీదు చూసి అక్కడే బలి అర్పించాడు.29మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి.30అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.

Chapter 22

1దావీదు <<దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే. ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే>> అని చెప్పాడు.

దేవుని మందిరం కట్టించడానికి సిద్ధపాట్లు

2తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు.
3వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు భారీగా ఇనుమును, తూయడానికి వీలులేనంత ఇత్తడిని,4లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులూ, తూరీయులూ దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకు వస్తూ ఉన్నారు.

5దావీదు<<నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను>> అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు.

6తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.7దావీదు సొలొమోనుతో <<నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకొన్నప్పుడు,8యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు.

9నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరిని నేను తోలివేసి అతనికి శాంతిసమాధానాలు కలగజేస్తాను. ఆ కారణంగా అతనికి సొలొమోను అను పేరు ఉంటుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు, విశ్రాంతి దయచేస్తాను.10అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.

11నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు.12నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకమూ తెలివీ ఇచ్చి, ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక.13యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు.
14చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం మూడు వేల నాలుగు వందల యాభై టన్నుల బంగారం, ముప్ఫై నాలుగు వేల ఐదు వందల టన్నుల వెండీ, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడీ, ఇనుమూ సమకూర్చాను. మానులను, రాళ్లను తెచ్చి పెట్టాను. దీని కన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావు గాక.

15ఇంకా, పని చేయగలిగిన ఎందరో శిల్పకారులూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు.16లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీదగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు>> అన్నాడు.

17దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు.18అతడు వారితో <<మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.

19కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి>> అన్నాడు.

Chapter 23

యాజకులు, లేవీయులు సమావేశం

1దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.2ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులనూ, లేవీయులనూ సమావేశపరచాడు.3అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.

4వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.5నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.6వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.

7గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.

8వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.

9షిమీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు షెలోమీతు, హజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు.

10యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు.

11యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషుకూ బెరీయాకూ కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల యింటివారిలో వారిని ఒక్క వంశంగా లెక్కించారు.

12కహాతు కొడుకులు నలుగురు. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

13అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.14దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.

15మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.

16గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.

17ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.

18ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.

19హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.

20ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.

21మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.

22ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.

23మూషి కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు.
లేవీయుల విధులు

24వీళ్ళు తమ పూర్వికుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్ళకు పెద్దలైన వీళ్ళు ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి, యెహోవా మందిరపు సేవ పని చేసేవారయ్యారు.25అప్పుడు దావీదు <<ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యం యెరూషలేములో నివాసం చేస్తారు.26లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా, దాని సేవకొరకైన ఉపకారణాలనైనా మోసే పని లేదు>> అని చెప్పాడు.

27దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు.28వీళ్ళు అహరోను సంతతివాళ్ళ చేతి కింద పనిచెయ్యాలి. వాళ్ళ వశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో, గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చెయ్యడానికీ, దేవుని మందిర సేవ కొరకైన పనిని పర్యవేక్షించడానికీ వారు ఉన్నారు.29సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్నీ, నూనెలో వేయించిన దాన్నీ, నానారకాలైన పరిమాణాల, కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని.

30ప్రతిరోజూ ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికీ కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో, యెహోవాకు దహనబలులను అర్పించాల్సిన సమయాలన్నిట్లో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు.31సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,
32యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం, వాళ్లకు నియమించిన పని.

Chapter 24

యాజకుల విభజన

1అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.2నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.3దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.

4వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.5ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.

6లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.

7మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,

8మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,

9అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,

10ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,

11తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,

12పండ్రెండోది యాకీముకు,

13పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,

14పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,

15పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,

16పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,

17ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,

18ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.

19ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.

20మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,

21రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,

22ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,

23హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.

24ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,

25ఇష్షీయా సంతానంలో జెకర్యా,

26మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.

27యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.

28మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.

29కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.

30మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.

31రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.

Chapter 25

సంగీతకారుల నియామకం

1దావీదు, మందిరం పనుల కోసం ఏర్పరచిన అధిపతులూ కలిసి, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరచి, సితారాలను, స్వరమండలాలను, కంచు తాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ళ సంఖ్య ఎంతంటే,

2ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.

3యెదూతూను సంబంధుల్లో స్తుతిపాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతికింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అనే ఆరుగురు.

4హేమాను సంబంధుల్లో హేమాను కొడుకులు బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తియెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనేవాళ్ళు.

5వీళ్ళందరూ దేవుని వాక్కు విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చెయ్యడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కొడుకులను, ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.

6వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.

7యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.

8తాము చేసే సేవ విషయంలో చిన్న అనీ, పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా వంతుల కోసం చీట్లు వేశారు.

9మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరట పడింది,

రెండోది గెదల్యా పేరట పడింది. ఇతనూ, ఇతని సహోదరులూ కొడుకులూ పన్నెండుమంది.

10మూడోది జక్కూరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.

11నాలుగోది యిజ్రీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.

12అయిదోది నెతన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

13ఆరోది బక్కీయాహు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

14ఏడోది యెషర్యేలా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

15ఎనిమిదోది యెషయా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

16తొమ్మిదోది మత్తన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

17పదోది షిమీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

18పదకొండోది అజరేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

19పన్నెండోది హషబ్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

20పదమూడోది షూబాయేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

21పదునాలుగోది మత్తిత్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

22పదిహేనోది యెరేమోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

23పదహారోది హనన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

24పదిహేడోది యొష్బెకాషా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

25పద్దెనిమిదోది హనానీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

26పందొమ్మిదవది మల్లోతి పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

27ఇరవయ్యోది ఎలీయ్యాతా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

28ఇరవై ఒకటోది హోతీరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

29ఇరవై రెండోది గిద్దల్తీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

30ఇరవై మూడోది మహజీయోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

31ఇరవై నాలుగోది రోమమ్తీయెజెరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

Chapter 26

ద్వారపాలకుల నియామకం

1ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.

2మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు.

3ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు.

4దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,

5అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు.6అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు.

7షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా.

8ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు.

9మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది.
10మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు.

11రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు.

12ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది.

13చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు.14తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.

15ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది.16షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.

17తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ,18బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు.19కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి.
ధనాగారం ఏర్పాటు

20చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది.21ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది.22యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు.

23ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది.24మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.25ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే,

అతని కొడుకు రెహబ్యా,

రెహబ్యా కొడుకు యెషయా,

యెషయా కొడుకు యెహోరాము,

యెహోరాము కొడుకు జిఖ్రీ,

జిఖ్రీ కొడుకు షెలోమీతు.

26రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు.27యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.28ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు.

29ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.

30ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు.

31ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు.32పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు.

Chapter 27

సైనిక, పురపాలక అధికారులు

1ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.

2మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.3పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.

4రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

5మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.6ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.

7నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

8అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

9ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

10ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

11ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

12తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

13పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

14పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.

15పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
ఇతర అధికారులు

16ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు,

మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,

17కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు,

సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.

18దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు.

మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,

19ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు.

అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.

20అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు.

మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.

21గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు.

బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.

22దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.

23ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.24ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.

25రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది.

అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.

26పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.

27ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ,

ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.

28షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్‌ హనాను నియామకం జరిగింది.

నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.

29షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి,

లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.

30ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు,

గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.

31గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.

32దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు.

హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.

33అహీతోపెలు రాజుకు మంత్రి.

అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.

34అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు.

రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.

Chapter 28

దేవాలయం కట్టడానికి దావీదు ఏర్పాట్లు

1గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు.

2అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి<<నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.>>

3అయితే<<నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు>> అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.

4ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.5యెహోవా నాకు చాలా మంది కొడుకులను దయ చేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద, యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో,

6<<నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నా మందిరాన్నీ, నా ఆవరణాలూ కట్టిస్తాడు.7ఈ రోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలూ, నా న్యాయవిధులూ పాటిస్తే, నేను అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను>> అన్నాడు.

8<<కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.

9సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.10పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు>> అన్నాడు.

11అప్పుడు దావీదు మంటపానికీ, మందిర నిర్మాణానికి, గిడ్డంగులకు, మేడ గదులకూ, లోపలి గదులకూ, ప్రాయశ్చిత్త వేదిక ఉన్న గదికీ, యెహోవా మందిరపు ఆవరణాలకూ,12వాటి చుట్టూ ఉన్న గదులకూ, దేవుని మందిర గిడ్డంగులకు, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు, తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు.

13యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు.14ఇంకా, అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు.

15బంగారు దీపస్తంభాలకూ, వాటి బంగారు ప్రమిదెలకూ, ఒక్కొక్క దీపస్తంభానికీ, దాని ప్రమిదెలకూ కావలసినంత బంగారం తూకం ప్రకారంగా,

వెండి దీపస్తంభాలకూ ఒక్కొక దీపస్తంభానికీ, దాని దాని ప్రమిదలకూ కావలసినంత వెండిని తూకం ప్రకారంగా,

16సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ,

17ముళ్ళ కొంకులకూ, గిన్నెలకూ, పాత్రలకూ కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకూ కావలసినంత బంగారం తూకం ప్రకారం,

వెండి గిన్నెల్లో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని తూకం ప్రకారం,

18ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం తూకం ప్రకారం,

రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కెరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు.

19ఇవన్నీ అప్పగించి <<యెహోవా నాకిచ్చిన అవగాహన, నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసి పెట్టాను>> అని సొలొమోనుతో చెప్పాడు.

20ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో<<నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.21దేవుని మందిర సేవంతటికీ, యాజకులూ, లేవీయులూ వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళూ, మనస్పూర్తిగా పని చేసేవాళ్ళూ, అధిపతులూ, ప్రజలందరూ, నీకు సహాయకులుగా ఉంటారు>> అన్నాడు.

Chapter 29

దేవుని మందిరాని ఇవ్వాల్సిన బహుమతులు

1తరువాత రాజైన దావీదు సంఘంతో <<దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది.

2నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.

3ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను.4గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.

5ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?>> అన్నాడు.
6అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి7మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3,750 మణుగుల ఇనుము ఇచ్చారు.
8తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.9వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.
దావీదు ప్రార్థన

10రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ <<మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు.11యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.
12ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.13మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.

14ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.15మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.

16మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే.17నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.

18అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి.19నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు>> అన్నాడు.

20ఈ విధంగా అన్న తరువాత దావీదు <<ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి>> అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.

21తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు.
సొలొమోను రాజుకు పట్టాభిషేకం
29:21-25; 1 రాజులు 1:28-53

22ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.

23అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు.
24అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు.25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు.
దావీదు మరణం
29:26-28; 1 రాజులు 2:10-12

26యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు.27అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు.28అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు.

29రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి.30అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.

2 దినవృత్తాంతాలు

Chapter 1

జ్ఞనం కోసం సొలొమోను దేవునికి ప్రార్థన
1:2-13; 1 రాజులు 3:4-15
1:14-17; 1 రాజులు 10:26-29; 2 దిన 9:25-28

1దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు.

2సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.3అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.

4దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు.5అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు.
6సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

7ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. <<నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు>> అన్నాడు.

8సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. <<నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు.9కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు.10ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.>>

11అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. <<నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు.
12కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.>>13తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.

14సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు.15రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.

16సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండీ కవే ప్రాంతం నుండీ తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు.17వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండినీ, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండినీ ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకూ, సిరియా రాజులకూ కూడా ఎగుమతి చేశారు.

Chapter 2

దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు
2:1-18; 1 రాజులు 5:1-16

1సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు.2అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3,600 మందిని ఉంచాడు.

3అతడు తూరు రాజు హీరాం1 దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. <<నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు.
4నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.

5మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది.
6అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.

7కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.

8ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది.9కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు.10కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.>>

11దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. <<యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు.12యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక.
13తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను.14అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.

15ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.16మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు>> అని జవాబిచ్చాడు.

17సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1,53,600 అయ్యారు.18వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3,600 మందినీ అతడు నియమించాడు.


1 2:3 హీరాం హురాం

Chapter 3

సొలొమోను దేవాలయాన్ని కట్టించడం
3:1-14; 1 రాజులు 6:1-29

1తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.

2అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు.3దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
4మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.

5మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు.
6ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.7మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.

8దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు.9ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.

10అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.11ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.12రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
13ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.

14అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.15అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు.16గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు.17ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి <<యాకీను>> అనీ, ఎడమ వైపు దానికి <<బోయజు>> అనీ పేర్లు పెట్టాడు.

Chapter 4

మందిరపు ఉపకరణాలు
4:2-6, 10; 5:1; 1 రాజులు 7:23-26, 38-51

1సొలొమోను ఇరవై మూరలు పొడవు, ఇరవై మూరలు వెడల్పు, పది మూరలు ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు.2పోత పోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరినుండి ఈ చివరి వరకూ 10 మూరల వెడల్పు. దాని ఎత్తు ఐదు మూరలు. దాని చుట్టుకొలత 30 మూరలు.3దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను రెండు వరసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు.

4అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. మూడు ఎద్దులు ఉత్తరం వైపు, మూడు పడమర వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటి పైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి.5దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.

6సొలొమోను ఇంకా దహనబలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున ఐదు, ఎడమ వైపున ఐదు మొత్తం పది స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్ళతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు.

7అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు.8అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడి వైపు ఐదు, ఎడమ వైపు ఐదు ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు.
9అతడు యాజకులకు ఒక ఆవరణనూ ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణనూ తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు.10సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడి పక్కగా ముఖాన్ని దక్షిణం వైపుకు తిప్పి ఉంచాడు.

11హూరాము పాత్రలనూ బూడిదెనూ ఎత్తడానికి చేటలనూ తొట్లనూ చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు.12దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పడానికి రెండు అల్లికలు,13ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు.
14మట్లు, వాటిపైన తొట్టెలు,15సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు,16పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు.

17రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు.18తన దగ్గర ఉన్న తూయలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు.
19దేవుని మందిరానికి కావలసిన వస్తువులూ బంగారు పీఠమూ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలూ,20వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలూ,21పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు.22మందిర ద్వారం లోపలి తలుపులూ అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులూ దేవాలయపు తలుపులూ అన్నీ బంగారంతో చేయించాడు.

Chapter 5

1సొలొమోను యెహోవా మందిరానికి తాను చేయించిన పనంతా పూర్తి చేసి, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండినీ బంగారాన్నీ వస్తువులన్నిటినీ దేవుని మందిరం ధనాగారాల్లో ఉంచాడు.

మందసాన్ని దేవాలయానికి తీసుకురావడం
5:2; 6:11; 1 రాజులు 8:1-21

2తరువాత సొలొమోను యెహోవా నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పట్టణం నుండి తెప్పించడానికి ఇశ్రాయేలీయుల పెద్దలనూ ఇశ్రాయేలీయుల వంశాలకు అధికారులైన గోత్రాల పెద్దలందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

3ఏడవ నెలలో పండగ జరిగే సమయానికి ఇశ్రాయేలీయులంతా రాజు దగ్గరికి వచ్చారు.
4ఆ పెద్దలంతా వచ్చిన తరువాత లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు.5సొలొమోను రాజు, ఇశ్రాయేలీయుల సమాజమంతా సమావేశమై, లెక్కించ లేనన్ని గొర్రెలనూ పశువులనూ బలిగా అర్పించారు.

6లేవీయులు, యాజకులు కలిసి, మందసాన్ని, సమాజపు గుడారాన్నీ దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు.
7యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమైన అతి పరిశుద్ధస్థలం లో కెరూబుల రెక్కల కింద ఉంచారు.8మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలనూ చాపి మందసాన్నీ దాని మోత కర్రలనూ కప్పాయి.

9మోతకర్రల కొనలు గర్భాలయం ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం లో కనబడేటంత పొడవుగా ఉన్నాయి గానీ అవి బయటికి కనబడలేదు. ఇప్పటి వరకూ అవి అక్కడే ఉన్నాయి.10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెళ్లిన తరవాత యెహోవా హోరేబులో వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసంలో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానిలో ఇంకేమీ లేవు.

11యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.12ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా, సన్నని నార వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, సితారాలు చేత పట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు.

13వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి <<యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది>> అని స్తోత్రం చేశారు.

14అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

Chapter 6

1అప్పుడు సొలొమోను <<గాఢాంధకారంలో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు.2అయితే నువ్వు ఎల్లకాలం నివసించడానికి నిత్యమైన స్థలంగా నేనొక గొప్ప మందిరాన్ని నీ కోసం కట్టించాను>> అన్నాడు.3తరువాత రాజు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజం అంతా నిలబడి ఉండగా వారిని దీవించాడు.

4అతడు వారితో <<నా తండ్రి దావీదుకు ప్రమాణం చేసి, దాన్ని స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తోత్రం కలుగు గాక.5ఆయన <నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్నీ ఏర్పాటు చేసుకోలేదు, ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషినీ నియమించ లేదు.6ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను> అని చెప్పాడు.

7ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయ వాంఛ.8అయితే యెహోవా నా తండ్రితో <నా నామ ఘనత కోసం మందిరం కట్టాలన్న నీ ఉద్దేశం మంచిది.9కానీ నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు> అని చెప్పాడు.

10యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను.11ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్న మందసాన్ని దానిలో ఉంచాను>> అని చెప్పాడు.
సొలొమోను ప్రతిష్ట ప్రార్థన
6:12-40; 1 రాజులు 8:22-53
6:41-42; కీర్తన 132:8-10

12తరవాత ఇశ్రాయేలీయులంతా సమావేశమై చూస్తుండగా యెహోవా బలిపీఠం ముందు నిలబడి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు.

13సొలొమోను తాను చేయించిన ఐదు మూరల పొడవు, ఐదు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు ఉన్న ఇత్తడి వేదికను ఆవరణంలో పెట్టించాడు. దాని మీద నిలబడి, సమావేశమైన ఇశ్రాయేలీయులందరి ఎదుటా మోకరించి, ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు.

14<<యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయ పూర్వకంగా నిన్ను అనుసరించే నీ భక్తుల పట్ల నీ నిబంధనను నెరవేరుస్తూ కృప చూపే నీలాంటి దేవుడు ఆకాశాల్లో గానీ, భూమి మీద గానీ లేడు.15నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో నువ్వు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నావు. నువ్వు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చావు. ఈ రోజు మేము దాన్ని కళ్ళారా చూస్తున్నాము.
16<నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి, నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు> అని నీవు నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నెరవేర్చు.

17యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక.
18దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా?19దేవా, యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేసే ఈ ప్రార్థననూ విన్నపాన్నీ మన్నించు. నీ సేవకుడిని, నేను చేసే ప్రార్థననూ, నా మొర్రనూ ఆలకించు.20నీ సేవకులు ఈ స్థలం లో చేసే విన్నపాలు వినడానికి, <నా నామాన్ని అక్కడ ఉంచుతాను> అని నువ్వు వాగ్దానం చేసిన స్థలం లో ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి దివారాత్రులు నిలుస్తుంది గాక.
21నీ సేవకుడు, నీ ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరం వైపుకు తిరిగి చేయబోయే ప్రార్థనలు ఆలకించు, అవును, నువ్వు నివసిస్తున్న పరలోకం నుండి ఆలకించి, వారి పాపాలను క్షమించు.

22ఎవరైనా తన పొరుగువాడి పట్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడానికి ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు,23నువ్వు పరలోకం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చు. హాని చేసినవాడి తలపైకి శిక్ష రప్పించు. నీతిపరుని నీతి చొప్పున వాడికి దయచేసి, అతని నీతిని స్థిరపరచు.

24నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ఎదుట పాపం చేయడం వలన తమ శత్రువులను ఎదిరించి నిలవలేక నీ దగ్గరకి తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకుని, ఈ మందిరంలో నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నప్పుడు,25పరలోకం నుండి నువ్వు విని, నీ ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశానికి వారిని మళ్లీ రప్పించు.

26వారు నీ దృష్టికి పాపం చేయడం వలన ఆకాశం మూసుకు పోయి వర్షం కురవనప్పుడు, వారు ఈ స్థలం లో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని, నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే27పరలోకంలో ఉన్న నువ్వు ఆలకించి, నీ సేవకులు, నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి, నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు.

28దేశంలో కరువు, తెగులు కనబడినప్పుడూ అగ్గి తెగులు, బూజు, తగిలినప్పుడూ మిడతలు, చీడపురుగులు దాడి చేసినప్పుడూ, లేదా శత్రువులు ఇశ్రాయేలు ప్రజల పట్టణాలను ముట్టడించినప్పుడూ అరిష్టం, వ్యాధి సోకినప్పుడూ29ఏ ఒక్కడు గానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గానీ హృదయంలో బాధ, కష్టం అనుభవిస్తూ ఉండి, ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలూ ప్రార్థనలూ నీ నివాస స్థలమైన పరలోకం నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు.

30మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ దేశంలో వారు తమ జీవితకాలమంతా నీపట్ల భయభక్తులు కలిగి31నీ మార్గాల్లో నడిచేలా వారి హృదయాలను ఎరిగిన నువ్వు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచెయ్యి. ఎందుకంటే నీవొక్కడివే మానవుని హృదయాన్ని ఎరిగిన వాడివి.

32ఇశ్రాయేలీయులనే నీ ప్రజలకు సంబంధం లేని అన్యులు నీ గొప్ప నామం గూర్చీ నీ బాహుబలం గూర్చీ చాచిన నీ చేతులను గూర్చీ విని, దూరదేశం నుండి ఈ మందిరానికి వచ్చి వేడుకుంటే,33నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి ప్రార్థన అంగీకరించి, ఆ అన్యులు నిన్ను అడిగిన దాన్ని వారికి అనుగ్రహించు. తద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్టుగా ఈ భూప్రజలంతా నీ నామాన్ని తెలుసుకుని, నీలో భయభక్తులు కలిగి, నేను కట్టిన ఈ మందిరానికి నీ నామం పెట్టావని గ్రహిస్తారు.

34నీ ప్రజలు నువ్వు పంపిన మార్గంలో తమ శత్రువులతో యుద్ధానికి బయలుదేరి, నువ్వు ఏర్పరచుకున్న ఈ పట్టణం వైపూ నీ నామానికి నేను కట్టించిన ఈ మందిరం వైపూ చూసి వేడుకున్నప్పుడు,35పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననూ ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి.

36పాపం చేయని వాడెవడూ లేడు కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే, ఆ శత్రువులు వారిని దూరంగా లేక దగ్గరగా ఉన్న తమ దేశాలకు పట్టుకు పోయినప్పుడు,37వారు చెరగా వెళ్ళిన ఆ దేశంలో బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప పడి <మేము పాపం చేసి, దోషులమయ్యాం, మేము భక్తిహీనంగా నడిచాం> అని ఒప్పుకుని38తాము చెరలో ఉన్న దేశంలో తమ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో నీవైపు తిరిగి, తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపూ నువ్వు కోరుకున్న ఈ పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ మనస్సు తిప్పి వేడుకుంటే39నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.

40నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ.41నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక.42దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరచిపోవద్దు.>>

Chapter 7

దేవాలయం ప్రతిష్ట
7:1-10; 1 రాజులు 8:62-66

1సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులనూ ఇతర బలులనూ దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది.2యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు.

3అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి <<యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది>> అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.
4రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు.5సొలొమోను రాజు 22,000 పశువులనూ 1,20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు.6యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు <<యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది>> అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.

7సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకూ నైవేద్యాలకూ కొవ్వుకూ సరిపోక పోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులనూ శాంతి బలిపశువుల కొవ్వునూ అర్పించాడు.
8సొలొమోను, అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశం నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఏడు రోజులు పండగ ఆచరించారు.9ఎనిమిదో రోజు వారు పండగ ముగించారు. ఏడు రోజులూ బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ పండగ ఆచరించారు.

10ఏడవ నెల ఇరవై మూడో రోజున సొలొమోను దావీదుకు, తనకు, తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ, మనసులో ఆనందపడుతూ, ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతినిచ్చి పంపేశాడు.
దేవుడు సొలొమోనుకు కనిపించడం
7:11-22; 1 రాజులు 9:1-9

11ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు.

12అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు <<నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను.
13నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ,14నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.15ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి.
16నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.17నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే,18ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు, అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను.

19అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే,20నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను.21అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, <యెహోవా ఈ దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?> అని అడుగుతారు.22అప్పుడు మనుషులు, <ఈ దేశ ప్రజలు తమ పూర్వికులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారిమీదకి రప్పించాడు> అని చెబుతారు.>>

Chapter 8

సొలొమోను ఇతర ఘన కార్యాలు
8:1-8; 1 రాజులు 9:10-28

1సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత2హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.

3తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.4అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు.
5ఇంకా అతడు ఎగువ బేత్‌ హోరోను, దిగువ బేత్‌ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు.6బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.

7ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని8ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.

9అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు.10వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.

11<<ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి>> అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.

12అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.13అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.

14అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.15ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.

16యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.17సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు.18హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.

Chapter 9

షేబ దేశపు రాణి సొలొమోను సందర్శన
9:1-12; 1 రాజులు 10:1-13

1షేబ రాణి సొలొమోను గొప్పతనం గూర్చి విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని, గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాటలాడింది.2సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది.

3షేబ రాణి సొలొమోను జ్ఞానాన్నీ అతడు కట్టించిన నగరాన్నీ4అతని భోజనపు బల్ల మీది పదార్ధాలు, అతని అధిపతులు కూర్చుండడం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు, వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులు, వీటన్నిటినీ చూసినప్పుడు, ఆమె ఎంతో విస్మయానికి గురైంది.

5ఆమె రాజుతో <<నీ పనులను గురించీ, నీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని, నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకూ వారి మాటలు నమ్మలేదు.6నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదాని కంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది.
7నీ సేవకులెంత భాగ్యవంతులు! ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు.8నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు>> అని చెప్పింది.

9ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలనూ రత్నాలనూ ఇచ్చింది. షేబదేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు.
10అంతే కాక, ఓఫీరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారూ సొలొమోను పనివారూ అక్కడి నుంచి గంధం మానులు, ప్రశస్తమైన రత్నాలు కూడా తెచ్చారు.11ఆ గంధం కొయ్యలతో రాజు యెహోవా మందిరానికి, రాజనగరానికి మెట్లూ, గాయకులకి తంబురలూ సితారాలూ చేయించాడు. అటువంటి చెక్కడపు పని అంతకు ముందు యూదా దేశంలో ఎవ్వరూ చూడలేదు.

12షేబ దేశపు రాణి రాజుకు తీసుకు వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయింది.
సొలొమోను సంపద, జ్ఞనం
9:13-28; 1 రాజులు 10:14-29; 2 దిన 1:14-17

13సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 వేల కిలోలు.14అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు.
15సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి 200 డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు కిలోగ్రాముల బంగారం పట్టింది.16సాగగొట్టిన బంగారంతో 300 కవచాలు చేయించాడు. ఒక్కొక్క కవచానికి మూడు కిలోగ్రాముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబానోను అరణ్యంలో ఉన్న తన అంతఃపురంలో ఉంచాడు.

17సొలొమోను రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి మేలిమి బంగారంతో దాన్ని పొదిగించాడు.18ఆ సింహాసనానికి ఆరు బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి రెండు వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలున్నాయి.
19ఆ ఆరు మెట్ల మీద రెండు వైపులా 12 సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. మరి ఏ రాజ్యంలోనూ అలాటి పని ఎవరూ చేసి ఉండలేదు.

20సొలొమోను రాజుకున్న పానపాత్రలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్యం అంతఃపురంలో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో చేశారు. హీరాము పంపిన పనివారితో కలిసి రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, ఏనుగు దంతం, కోతులు, నెమళ్ళు మొదలైన సరకులతో వచ్చేవి.21సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు.

22సొలొమోను రాజు భూమి పైన రాజులందరికంటే ఐశ్వర్యంలో, జ్ఞానంలో అధికుడయ్యాడు.23దేవుడు సొలొమోను హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులంతా అతనిని దర్శించాలని కోరేవారు.24ఒక్కొక్కరూ ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకు వచ్చారు.

25సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో, తన దగ్గర, యెరూషలేములో, గుర్రాలకు, రథాలకు 4,000 శాలలు ఉండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు.26యూఫ్రటిసు నది మొదలుకుని ఫిలిష్తీయుల దేశం వరకూ, ఐగుప్తు సరిహద్దు వరకూ ఉన్న రాజులందరిపై అతడు పరిపాలన చేశాడు.
27సొలొమోను యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా, దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడివృక్షాలంత విస్తారంగా ఉండేలా చేశాడు.28ఐగుప్తు నుండీ ఇతర అన్ని దేశాల నుండీ సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి.
సొలొమోను మరణం, ఆయన వారసుడు

29సొలొమోను చేసిన కార్యాలన్నిటి గూర్చి నాతాను ప్రవక్త రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథంలో, నెబాతు కొడుకు యరొబాము గూర్చి దీర్ఘదర్శి ఇద్దో గ్రంథంలో రాసి ఉంది.30సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరాలు పరిపాలించాడు.31ఆ తరవాత సొలొమోను తన పూర్వీకులతో కన్నుమూశాడు. అతనిని అతని తండ్రి అయిన దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతనికి బదులుగా అతని కొడుకు రెహబాము రాజయ్యాడు.

Chapter 10

రెహబాము రాజు
10:1—11:4; 1 రాజులు 12:1-24

1రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు.2సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు.

3ప్రజలు అతణ్ణి పిలిపించగా యరొబాము, ఇశ్రాయేలువారు కలిసి వచ్చి రెహబాముతో <<నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు.4నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము>> అని మనవి చేశారు.

5అందుకు అతడు <<మీరు మూడు రోజుల తరవాత నా దగ్గరికి రండి>> అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి <<ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?>> అని వారిని అడిగాడు.7అందుకు వారు <<నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు>> అని అతనితో చెప్పారు.

8అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు.9అతడు <<<నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి> అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి>> అని వారిని అడిగాడు.
10అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు <<<నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి> అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, <నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు.11నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో1 దండిస్తాను> అని చెప్పు.>>

12<<మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి>> అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు.13రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు.14అతడు వారితో <<నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు,
నేను దాన్ని మరింత బరువు చేస్తాను.
నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు.
నేనైతే మిమ్మల్ని కొరడాలతో2 దండిస్తాను>> అని చెప్పాడు.

15యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు.
16రాజు తమ మనవి అంగీకరించక పోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, <<దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదూ, నీ సంతతి వారిని నువ్వే చూసుకో>> అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్లిపోయారు.

17అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు.18రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరకి పంపించాడు. కానీ వారు అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు.19ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు.


1 10:11 కొరడాలతో తేళ్ళతో
2 10:14 కొరడాలతో తేళ్ళతో

Chapter 11

రెహబాము నిర్మించిన ప్రాకారాలు

1రెహబాము యెరూషలేముకు వచ్చిన తరవాత అతడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోడానికి యూదావారిలో నుండీ బెన్యామీనీయుల్లో నుండీ ఎన్నిక చేసిన 1,80,000 మంది సైనికులను సమకూర్చాడు.

2అయితే దేవుని మనిషి షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు,3<<నువ్వు వెళ్ళి యూదారాజు, సొలొమోను కొడుకు అయిన రెహబాముతో, యూదాలో, బెన్యామీనీయుల ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలు వారందరితో ఈ మాట చెప్పు,4<ఇదంతా ఈ విధంగా జరిగేలా చేసింది నేనే> అని యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి మీ ఉత్తరలో ఉన్న యూదా సోదరులతో యుద్ధం చేయడానికి బయలు దేరకుండా మీరంతా మీ మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి.>> కాబట్టి వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయడం మానేసి తిరిగి వెళ్లిపోయారు.

5రెహబాము యెరూషలేములో నివాసముండి యూదా ప్రాంతంలో పురాలకు ప్రాకారాలు కట్టించాడు.6అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ,7బేత్సూరు, శోకో, అదుల్లాము,8గాతు, మారేషా, జీఫు,9అదోరయీము, లాకీషు, అజేకా,10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా, బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు.
11అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి, వాటిలో సైన్యాధికారులను ఉంచి, వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు.12వాటిలో డాళ్ళు, శూలాలు ఉంచి ఆ పట్టణాలను శక్తివంతంగా తయారు చేశాడు. యూదా వారు, బెన్యామీనీయులు అతని వైపు నిలబడ్డారు.

13ఇశ్రాయేలువారి మధ్య నివసిస్తున్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాల సరిహద్దులు దాటి అతని దగ్గరికి వచ్చారు.14యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.

15యరొబాము బలిపీఠాలకు దయ్యాలకు తాను చేయించిన దూడవిగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు.
16ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు.17వారు మూడు సంవత్సరాలు దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే అనుసరించారు. ఆ మూడు సంవత్సరాలూ వారు యూదా రాజ్యాన్ని బలపరచి సొలొమోను కొడుకు రెహబాముకు సహాయం చేశారు.
రెహబాము కుటుంబం

18దావీదు కొడుకు యెరీమోతు కుమార్తె అయిన మహలతును రెహబాము వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కొడుకు ఏలీయాబు కుమార్తె అయిన అబీహాయిలు.19అతనికి యూషు, షెమర్యా, జహము అనే కొడుకులు పుట్టారు.
20తరవాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతులు పుట్టారు.

21రెహబాముకు 18 మంది భార్యలు 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు.

22రెహబాము మయకాకు పుట్టిన అబీయాను రాజుగా చేయాలని ఆలోచించి, అతని సోదరుల మీద ప్రధానిగా, అధిపతిగా అతణ్ణి నియమించాడు.23అతడు మంచి మెలకువతో పరిపాలించాడు. తన కుమారుల్లో మిగిలిన వారిని అతడు యూదా, బెన్యామీనులకు చెందిన ప్రదేశాల్లోని ప్రాకార పురాల్లో అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన ఆస్తినిచ్చి వారికి పెళ్ళిళ్ళు చేశాడు.

Chapter 12

షీషకు యెరూషలేము పై దండయాత్ర
12:9-16; 1 రాజులు 14:21, 25-31

1రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు.

2వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందు వలన రాజైన రెహబాము పాలనలో ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు 1,200 రథాలు, 60,000 మంది గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు.3అతనితో బాటు ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించి ఉన్నారు.4షీషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకార పురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు.

5అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరికీ, షీషకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి <<<మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను> అని యెహోవా సెలవిస్తున్నాడు>> అని చెప్పాడు.6అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజు వినయంగా తల వంచుకుని <<యెహోవా న్యాయవంతుడు>> అని ఒప్పుకున్నారు.

7వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. <<వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను.8అయితే నన్ను సేవించడానికీ, భూరాజులకు దాసులై ఉండడానికీ ఎంత తేడా ఉందో వారు గ్రహించడం కోసం వారు అతనికి దాసులవుతారు.>>

9ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి వచ్చి, యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ధనాగారాలన్నిటినీ దోచుకుని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకు వెళ్ళాడు.10రెహబాము వాటికి బదులు ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రాజనగరం ద్వారాన్ని కాసే సైనికుల అధిపతులకి అప్పగించాడు.
11రాజు యెహోవా మందిరంలోకి ప్రవేశించిన ప్రతిసారీ రక్షక భటులు వచ్చి వాటిని మోసేవారు. ఆ తరువాత వాటిని మళ్లీ గదిలో ఉంచేవారు.12అతడు తనను తాను తగ్గించుకోవడం వలన, యూదావారిలో కొంతమట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన, యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు.

13రెహబాము రాజు యెరూషలేములో స్థిరపడి పాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 41 సంవత్సరాల వయసు వాడు. తన నామాన్ని అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రాల స్థలాలన్నిటిలో నుండి యెహోవా కోరుకొన్న పట్టణమైన యెరూషలేములో అతడు 17 సంవత్సరాలు పాలించాడు, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.14అతడు యెహోవాను వెతకడంలో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు.

15రెహబాము చేసిన ఇతర కార్యాలన్నిటి గురించి ప్రవక్త షెమయా, దీర్ఘదర్శి ఇద్దో రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. వాటిలో ఇంకా వంశావళులూ రెహబాముకూ యరొబాముకూ జరిగిన నిరంతర యుద్ధాల వివరాలున్నాయి.16రెహబాము తన పూర్వీకులతో కూడా కన్నుమూసినవ్పుడు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అప్పుడు అతని కొడుకు అబీయా అతనికి బదులుగా రాజయ్యాడు.

Chapter 13

యూదా రాజైన అబీయా
13:1-2, 22; 14:1; 1 రాజులు 15:1-2, 6-8

1యరొబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరంలో అబీయా యూదావారి మీద రాజయ్యాడు.2అతడు మూడు సంవత్సరాలు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా పట్టణానికి చెందిన ఊరియేలు కుమార్తె.

3అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.
4అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యంలోని సెమరాయిము కొండ మీద నిలబడి ఇలా ప్రకటించాడు,

<<యరొబాము, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా వినండి.

5ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా
6అయినా దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడు, నెబాతు కొడుకు అయిన యరొబాము పనికిమాలిన దుష్టులతో చేతులు కలిపి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.7సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడుగా, అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు.>>

8<<ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.

9మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.
10అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.11వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.>>

12<<ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా, మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికీ బూరలు ఊదడానికీ మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీకు జయం కలగదు.>>

13అంతకుముందు యరొబాము యూదావారి వెనక భాగంలో కొందరు మాటుగాళ్ళను ఉంచదువు. యరోబాము సైన్యం యూదా వారికి ఎదుటా, మాటుగాళ్ళు వారికి వెనకా ఉండేలా చేశాడు.14యూదా వారు, తమకు ముందూ వెనకా యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు ఊదారు.15అప్పుడు యూదా వారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరొబాము, ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుటా యూదావారి ఎదుటా నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బ తీశాడు.

16ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించాడు.17కాబట్టి అబీయా, అతని ప్రజలు వారిని ఘోరంగా హతమార్చారు. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది యుద్ధ వీరులు చనిపోయారు.18ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు.19అబీయా యరొబామును తరిమి, బేతేలునూ దాని గ్రామాలనూ యెషానానూ దాని గ్రామాలనూ ఎఫ్రోనునూ దాని గ్రామాలనూ పట్టుకున్నాడు.

20అబీయా జీవించి ఉన్న కాలంలో యరొబాము మళ్ళీ బలపడలేదు, యెహోవా అతణ్ణి దెబ్బ తీయడం వలన అతడు చనిపోయాడు.21అబీయా అభివృద్ధి చెందాడు. అతనికి 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు.22అబీయా చేసిన ఇతర కార్యాల గురించీ అతని నడవడి, అతని మాటలను గురించీ అతని కాలంలో జరిగిన సంగతుల గురించీ ప్రవక్త ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో రాసి వుంది.

Chapter 14

యూదా రాజైన ఆసా
14:2-3; 1 రాజులు 15:11-12

1అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

2ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు.3అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు.4వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు.
5ఉన్నత స్థలాలనూ సూర్య దేవతా స్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.

6ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు.

7అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు<<మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.>>

కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.

8ఆ కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2,80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు.

9ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.

10వారు మారేషా దగ్గర జెపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు.11ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి<<యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు>> అని ప్రార్థించాడు.

12అప్పుడు యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటా, యూదా వారి ఎదుటా నిలబడనియ్యకుండా వారిని దెబ్బ తీసిన కారణంగా వారు పారిపోయారు.13ఆసా, అతనితో ఉన్నవారూ గెరారు వరకూ వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేతా ఆయన సైన్యం భయం చేతా పారిపోయారు. యూదా వారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు.

14గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదికీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి, వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు.15అక్కడి పశువుల శాలలను పడగొట్టి, విస్తారమైన గొర్రెలనూ ఒంటెలనూ సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు.

Chapter 15

ఆసా సంస్కరణలు
15: 16-19, - 1 రాజులు 15: 13-16

1ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజర్యా మీదికి వచ్చినపుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు.2<<ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు.

3చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి.

4అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదకారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు.5ఆ రోజుల్లో అన్ని దేశాల్లో నివాసముండే వారందరూ గొప్ప కలవరంలో ఉండేవారు. కాబట్టి తమ కార్యాలు చక్కబెట్టుకోడానికి అటూ ఇటూ తిరిగే వారికి శాంతి, సమాధానం లేకుండా ఉంది.
6దేవుడు మనుషులను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు కాబట్టి రాజ్యం రాజ్యానికీ పట్టణం పట్టణానికీ వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలై పోయాయి.7అయితే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలమవుతుంది.>>

8ఒదేదు ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు ఆసా విని, ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకున్న పట్టాణాల్లో నుండి అసహ్యమైన విగ్రహాలన్నిటిని తీసివేసి, యెహోవా మంటపం ముందు ఉండే యెహోవా బలిపీఠం మళ్లీ కట్టించాడు.9అతడు యూదా, బెన్యామీను వారందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రాల్లో నుండి వారి మధ్య నివసిస్తున్న పరదేశులనూ సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయం చేయడం చూసి ఇశ్రాయేలు వారిలో నుండి చాలా మంది ప్రజలు అతని పక్షం చేరారు.

10ఆసా పరిపాలనలో 15 వ సంవత్సరం మూడో నెలలో వారు యెరూషలేములో సమావేశమయ్యారు.11తాము తీసుకు వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ రోజు 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు.
12వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేస్తామనీ,13పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, అందరిలో ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దగ్గర విచారణ చేయని వారికందరికీ మరణశిక్ష విధిస్తామనీ తీర్మానం చేసుకున్నారు.
14వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకా నాదంతో, కొమ్ము బూరశబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు.

15ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదావారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి, పూర్ణమనస్సుతో ఆయనను వెతకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు.

16తన అవ్వ అయిన మయకా అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందుకు ఆమె పట్టపురాణిగా ఉండకుండాా ఆసా రాజు ఆమెను తొలగించి, ఆమె నిలిపిన విగ్రహాన్ని పడగొట్టి, చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు.17ఆసా ఉన్నత పూజా స్థలాలను ఇశ్రాయేలీయుల్లో నుండి తీసివేయలేదు గానీ అతడు బ్రతికిన కాలమంతా అతని హృదయం యథార్థంగా ఉంది.18అతడు తన తండ్రి, తాను ప్రతిష్ఠించిన వెండి, బంగారు ఉపకరణాలను తీసుకు వచ్చి దేవుని మందిరంలో ఉంచాడు.19ఆసా పాలనలో 35 వ సంవత్సరం వరకూ ఎలాటి యుద్ధాలు జరగలేదు.

Chapter 16

ఆసా చివరి సంవత్సరములు
16:1-6; 1 రాజులు 15:17-22
16:11—17:1; 1 రాజులు 15:23-24

1ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు.

2ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు.3<<నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో>> అని అడిగాడు.

4బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు.5బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు.6అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.

7ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. <<నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.8ఇంతకు ముందు లెక్క లేనన్ని రథాలు, గుర్రపు రౌతులు గల ఇతియోపీయులు, లూబీయులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా? అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు.
9తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.>>

10ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.

11ఆసా చేసిన పనులన్నిటిని గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.12ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.

13ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41 వ సంవత్సరంలో చనిపోయాడు.14ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ, పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడె మీద అతణ్ణి ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకొన్న సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు.

Chapter 17

యూదా రాజైన యెహోషాపాతు

1ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు.2అతడు యూదా దేశంలోని ప్రాకార పురాలన్నిటిలో సైన్యాలను ఉంచి, యూదా దేశంలో తన తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలి దండులను ఉంచాడు.

3యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ4బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు.
5కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది.6యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.

7తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు.8వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా అనే లేవీయులనూ, ఎలీషామా, యెహోరాము అనే యజకులనూ పంపించాడు.9వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని యూదావారి మధ్య ప్రకటిస్తూ, యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు.
10యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు.11ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను, 7,700 మేకపోతులను సమర్పించేవారు.

12యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు.13యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.

14వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య.

యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

15అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2,80,000 మంది ఉన్నారు.

16అతని తరువాత జిఖ్రీ కుమారుడు, యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొన్న అమస్యా. అతని దగ్గర 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

17బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.

18అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

19రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు.

Chapter 18

మీకాయా ప్రవచనం
18:1-27; 1 రాజులు 22:1-28

1యెహోషాపాతుకు సంపద, ఘనత, అధికమైన తరవాత అతడు అహాబుతో సంబంధం కలుపుకున్నాడు.2కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతడు షోమ్రోనులో ఉండే అహాబు దగ్గరకి వెళ్ళాడు. అహాబు అతని కోసమూ అతని వెంట వచ్చిన మనుషుల కోసమూ అనేకమైన గొర్రెలనూ, పశువులనూ వధించి విందు చేశాడు. తనతో బాటు రామోతు గిలాదు మీదికి వెళ్ళడానికి అతణ్ణి ప్రేరేపించాడు.

3ఇశ్రాయేలు రాజు అహాబు, యూదా రాజు యెహోషాపాతుతో <<నువ్వు నాతో బాటు రామోతు గిలాదుకు వస్తావా>> అని అడిగినప్పుడు, యెహోషాపాతు <<నేను నీవాణ్ణి, నా ప్రజలు నీ ప్రజలు. మేము నీతోబాటు యుద్ధానికి వస్తాం>> అని చెప్పాడు.

4యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో <<ముందు యెహోవా దగ్గర సంగతి విచారణ చేద్దాం రండి>> అన్నాడు.5ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి <<నేను రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా, వద్దా?>> అని వారిని అడిగాడు. అందుకు వారు <<వెళ్ళు, దేవుడు దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు>> అని చెప్పారు.

6అయితే యెహోషాపాతు <<వీళ్ళు కాకుండా మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా?>> అని అడిగాడు.7అందుకు ఇశ్రాయేలు రాజు <<యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇమ్లా కొడుకు మీకాయా అనేవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నా గురించి మంచి ప్రవచించడు. ఎప్పుడూ కీడునే ప్రవచిస్తున్నాడు కాబట్టి అతడంటే నాకు కోపం>>అన్నాడు. యెహోషాపాతు రాజు <<రాజైన మీరు అలా అనవద్దు>> అన్నాడు.

8అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకణ్ణి పిలిపించి <<ఇమ్లా కొడుకు మీకాయాను త్వరగా రప్పించు>> అని ఆజ్ఞ ఇచ్చాడు.
9ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు షోమ్రోను ఊరు ద్వారం ముందు ఉన్న స్థలం లో తమ రాజవస్త్రాలు ధరించుకుని సింహాసనాల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలంతా వారి ముందు ప్రవచిస్తూ ఉన్నారు.

10అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి <<సిరియనులు అరామీయులు నాశనమయ్యే వరకూ వీటితో వాళ్ళను నువ్వు పొడుస్తావని యెహోవా సెలవిస్తున్నాడు>> అని ప్రకటించాడు.11ప్రవక్తలంతా ఆ విధంగానే ప్రవచిస్తూ <<యెహోవా రామోతు గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి వెళ్ళి జయం పొందు>> అన్నారు.

12మీకాయాని పిలవడానికి పోయిన దూత అతనితో <<ప్రవక్తలు రాజు విషయంలో అంతా మేలునే పలుకుతున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలతో కలిపి మేలునే ప్రవచించు>> అన్నారు.13మీకాయా <<యెహోవా జీవం తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను>> అని చెప్పాడు.14అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకి వచ్చినప్పుడు రాజు అతణ్ణి చూసి <<మీకాయా, రామోతు గిలాదు పైకి మేము యుద్ధానికి వెళ్ళవచ్చా, ఆగిపోవాలా?>> అని అడగ్గా, అతడు <<వెళ్ళి యుద్ధం చేసి జయించండి. వారు మీ చేతికి చిక్కుతారు>> అన్నాడు.

15అప్పుడు రాజు <<యెహోవా నామంలో అబద్ధం కాక సత్యమే చెప్పమని నేను ఎన్నిసార్లు నీ చేత ఒట్టు పెట్టించుకోవాలి?>> అని అతనితో అన్నాడు.16అప్పుడు మీకాయా <<కాపరి లేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు వారంతా పర్వతాల మీద చెదిరిపోవడం నేను చూశాను. <వీరికి యజమాని లేడు. వీరిలో ప్రతివాడూ తన తన ఇంటికి ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలి> అని యెహోవా సెలవిచ్చాడు>> అన్నాడు.

17అది విని ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా అన్నాడు. <<ఇతడు నా విషయంలో కీడునే గాని మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా?>>18అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. <<యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం, పరలోక సైన్యమంతా ఆయన కుడివైపూ ఎడమవైపూ నిలబడి ఉండడం నేను చూశాను.
19<ఇశ్రాయేలు రాజు అహాబు రామోతు గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతణ్ణి ఎవరు ప్రేరేపిస్తారు?> అని యెహోవా అడిగాడు. అప్పుడు, ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు.

20అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, <నేను అతణ్ణి ప్రేరేపిస్తాను> అని చెప్పాడు. యెహోవా, <ఏవిధంగా?> అని అతణ్ణి అడిగాడు.21అందుకు ఆ ఆత్మ, <నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను> అని చెప్పాడు. అందుకు యెహోవా <నువ్వు అతణ్ణి ప్రేరేపించి సఫలమౌతావు. వెళ్ళి అలా చెయ్యి> అని సెలవిచ్చాడు.
22నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.>>

23అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా మీకాయా దగ్గరికి వచ్చి అతణ్ణి చెంప మీద కొట్టి <<నీతో మాటలాడటానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎటు వైపు వెళ్ళాడు?>> అన్నాడు.24అందుకు మీకాయా <<దాక్కోడానికి నువ్వు లోపలి గదిలోకి వెళ్ళే రోజున అది నీకు తెలుస్తుంది>> అని చెప్పాడు.

25అప్పుడు ఇశ్రాయేలు రాజు <<మీరు మీకాయాను పట్టణపు అధికారి ఆమోను దగ్గరికి, రాకుమారుడు యోవాషు దగ్గరికి తీసుకు పోయి వారితో, రాజు మీకిచ్చిన ఆజ్ఞ ఇదే26నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకూ ఇతన్ని చెరలో ఉంచి కొద్దిగా ఆహారం, నీరు మాత్రం ఇవ్వండి>> అన్నాడు.27అప్పుడు మీకాయా <<నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదన్న మాటే. ప్రజలంతా ఆలకించండి>> అన్నాడు.
అహాబు ఓటమి, మరణం
18:28-34; 1 రాజులు 22:29-36

28అప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు యెహోషాపాతు, రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళారు.29ఇశ్రాయేలు రాజు <<నేను మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వు నీ వస్త్రాలనే ధరించు>> అని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకున్నాడు. తరువాత వారు యుద్ధానికి వెళ్ళారు.30సిరియా రాజు <<మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి. పెద్దా చిన్న వారితో చేయవద్దు>> అని తనతో ఉన్న తన రథాల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు.

31కాగా యెహోషాపాతు కనబడగానే రథాధిపతులు <<అడుగో ఇశ్రాయేలు రాజు>> అంటూ అతడిపై దాడి చెయ్యడానికి అతణ్ణి చుట్టుముట్టారు. అయితే యెహోషాపాతు యెహోవాకు మొర్రపెట్టడం వలన ఆయన అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని దగ్గర నుండి వారు తొలగిపోయేలా చేశాడు.32ఎలాగంటే, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతణ్ణి తరమడం మాని తిరిగి వెళ్ళారు.

33అప్పుడు ఎవడో గురి చూడకుండానే విల్లు ఎక్కుబెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజు కవచపు సందుల్లో గుచ్చుకుంది. రాజు తన సారధితో <<నాకు గాయమైంది. వెనక్కి తిప్పి యుద్ధంలో నుండి నన్ను బయటికి తీసుకు వెళ్ళు>> అన్నాడు.34ఆ రోజున యుద్ధం తీవ్రంగా జరిగింది. అయినా ఇశ్రాయేలు రాజు సూర్యాస్తమయం వరకూ సిరియా సైన్యానికి ఎదురుగా తన రథంలో ఆనుకుని నిలబడ్డాడు. పొద్దుగుంకే వేళకి అతడు చనిపోయాడు.

Chapter 19

1యూదారాజు యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములోని తన ఇంటికి తిరిగి వచ్చాడు.2దీర్ఘ దర్శి, హనానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్లి, యెహోషాపాతు రాజుకు ఇలా తెలియచేశాడు. <<నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది.3అయితే, నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలోనుంచి నువ్వు అషేరా దేవతాస్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనస్సు నిలుపుకున్నావు.>>

యెహోషాపాతు న్యాయాధిపతులను ఏర్పరచాడు

4యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్లి, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాడు.5యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరచాడు.

6అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. <<మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.7యెహోవా భయం మీమీద ఉండు గాక. తీర్పు తీర్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు.>>

8యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో యాజకుల్లో ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.9వారికి ఇలా ఆజ్ఞాపించాడు. <<యెహోవా మీద భయభక్తులు కలిగి, నమ్మకంతో, యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి.

10నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.

11ప్రధానయాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతివారికి అధిపతి, ఇష్మాయేలు కొడుకు జెబద్యా, రాజు సంగతుల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి. మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు.>>

Chapter 20

మోయాబీయులు, అమ్మోనీయుల ఓటమి

1ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు.2అంతలో కొంతమంది వచ్చి <<మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు>> అని యెహోషాపాతుకు తెలియచేశారు.

3అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.4యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.

5యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి,6<<మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు.7నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.>>

8<<వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే9నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.

10ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు.11మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.
12మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు>> అని ప్రార్థన చేశారు.13యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

14అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు,15<<యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.

16రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు.17ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.>>

18అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు.19కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.

20వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి<<యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది>> అని చెప్పాడు.

21అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ<<యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.>> అని పలకాలని నియమించాడు.

22వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు.23అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.

24యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు.
25యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది.26నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి <<బెరాకా లోయ>> అని పేరు.

27ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు.28వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.

29ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు.30ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
యెహోషాపాతు మరణం
20:31—21:1; 1 రాజులు 22:41-50

31యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.32అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.

33అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.
34యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.

35ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు.36తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు.37అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు <<నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు>> అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.

Chapter 21

యూదా రాజైన యెహోరాము
21:5-10, 20; 2 రాజులు 8:16-24

1యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.2యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు.3వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.

4యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంత మందినీ చంపేసాడు.5యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు.
6అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు.7అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.

8యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు.9యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు.10కాబట్టి ఇప్పటి వరకూ ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండాా తిరుగుబాటు చేసింది.
11యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు.

12ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. <<నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. <నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా13ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు.14కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు.15నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.> >>

16యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు.17వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు.

18ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు.19రెండేళ్ళ తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు.20అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.

Chapter 22

యూదా రాజైన అహజ్యా
22:1-6; 2 రాజులు 8:25-29
22:7-9; 2 రాజులు 9:21-29

1యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు.

2అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా.3దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు.

4అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు.5వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు.

6అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు.

7యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు.

8యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు.
9తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత <<ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా>> అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు.
అతల్యా, యోవాషు
22:10—23:21; 2 రాజులు 11:1-21

10అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది.11అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి.12ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.

Chapter 23

1ఏడవ సంవత్సరంలో యెహోయాదా, బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజర్యా, యెహోహానాను కొడుకు ఇష్మాయేలూ, ఓబేదు కొడుకు అజర్యా, అదాయా కొడుకు మయశేయా, జిఖ్రీ కొడుకు ఎలీషాపాతూ అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో ఒడంబడిక చేసుకున్నాడు.2వారు యూదా దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలో నుంచి లేవీయులనూ, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలనూ సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు.

3ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు. <<యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం, రాజు కుమారుడు పరిపాలన చేయాలి.>>

4<<కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, విశ్రాంతి దినాన సేవచేయడానికి వచ్చే మీలోని యాజకుల్లోనూ లేవీయుల్లోనూ మూడవ భాగం, ద్వారం దగ్గర కాపలా కాయాలి.5మరొక మూడవ భాగం రాజభవనం దగ్గర ఉండాలి. మిగిలిన మూడవ భాగం పునాది గుమ్మం దగ్గర ఉండాలి. ప్రజలంతా యెహోవా మందిర ఆవరణం దగ్గర ఉండాలి.

6యాజకులు, లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవ్వరూ రాకూడదు. వారు ప్రతిష్టితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి.7లేవీయులంతా తమ తమ ఆయుధాలను చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. మందిరం లోపలికి ఇంకెవరైనా వస్తే, వారిని చంపేయండి. రాజు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అతనితో ఉండాలి.>>

8కాబట్టి లేవీయులు, యూదావారంతా యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టు చేశారు. యాజకుడైన యెహోయాదా ఏ వంతు వారికీ సెలవియ్యలేదు కాబట్టి యాజకులంతా విశ్రాంతి దినాన సేవ చేయాల్సిన వారిని, సేవ చేసి బయటికి వెళ్లవలసిన వారిని తీసుకు వచ్చారు.

9యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో రాజైన దావీదుకు చెందిన ఈటెలనూ, పెద్ద డాళ్ళనూ, చిన్న డాళ్లనూ శతాధిపతులకు అప్పగించాడు.

10అతడు ఆయుధాలు పట్టుకున్న మనుషులందరినీ మందిరపు కుడివైపు నుంచి ఎడమవైపు వరకూ బలిపీఠం పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ ఉంచాడు.11అప్పుడు వారు రాకుమారుడిని బయటికి తెచ్చి, అతని తలపై కిరీటం పెట్టి, ధర్మశాస్త్రాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదా, అతని కొడుకులూ అతనిని అభిషేకించి<<రాజు చిరంజీవి అగు గాక>> అన్నారు.

12రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని, యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.13ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని <<రాజ ద్రోహం! రాజద్రోహం!>> అని అరిచింది.

14అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యం మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను పిలిపించి <<యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు. సైనిక పంక్తుల అవతలకు తీసుకెళ్ళి ఆమె పక్షాన ఉన్న వారిని, ఆమెను కత్తితో చంపాలి>> అని ఆజ్ఞ ఇచ్చాడు.15కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి, రాజ భవనం దగ్గరున్న గుర్రపు ద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు.

16వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు.17అప్పుడు ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్లి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు.

18యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసే వారిని బలులు అర్పించే వారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషంతో సంగీతాలతో సేవ జరిగించారు.

19యెహోవా మందిరంలో ఏ విధంగానైనా మైలబడిన వారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు.

20అతడు శతాధిపతులనూ ప్రధానులనూ ప్రజల అధికారులనూ దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుంచి రాజును తీసుకుని వచ్చాడు. వారు ఎత్తయిన గుమ్మం ద్వారా రాజభవనానికి వెళ్లి రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.21దేశ ప్రజలంతా ఎంతో ఆనందించారు. పట్టణం నెమ్మదిగా ఉంది. వారు అతల్యాను కత్తితో చంపేశారు.

Chapter 24

యోవాషు మందిరాన్ని పునరుద్ధరించడం
24:1-14; 2 రాజులు 12:1-16
24:23-27; 2 రాజులు 12:17-21

1యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.2యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.

3యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్ళి చేశాడు. అతనికి కొడుకులూ, కూతుళ్ళూ కలిగారు.
4ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగుచేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు.5అతడు యాజకులనూ లేవీయులనూ ఒక చోట సమావేశపరచి వారితో ఇలా అన్నాడు<<మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగుచేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగుచేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి.>> మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు.

6అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. <<సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండీ, యెరూషలేములో నుండీ, ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించ లేదు?>> అని అడిగాడు.7ఎందుకంటే దుర్మార్గురాలైన అతల్యా కొడుకులు దేవుని మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణాలన్నిటినీ బయలు దేవుడి పూజకు ఉపయోగించారు.

8కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.9దేవుని సేవకుడైన మోషే, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకు రావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు.10అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి, పెట్టె నిండేంత వరకూ దానిలో వేశారు.

11లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారీ, అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారీ వచ్చి, పెట్టె ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు.12అప్పుడు రాజు, యెహోయాదా, యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాతి పని చేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పనీ, ఇత్తడి పనీ చేసే వారిని కూలికి తీసుకున్నారు.

13ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరమ్మత్తు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరచారు.14వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికీ, యెహోయాదా దగ్గరికీ తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులనూ, సేవకు ఉపయోగపడే వస్తువులనూ, దహనబలికి ఉపయోగపడే వస్తువులనూ, గరిటెలనూ, వెండీ బంగారు ఉపకరణాలనూ చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరంలో దహనబలులను కొనసాగించారు.

15యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు.16అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు.
17యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు.18ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది.19అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.

20అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి<<మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు>>అన్నాడు.21అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు.22ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు <<యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక>> అన్నాడు.

23ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు.24అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు.

25అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు.26అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు.

27యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.

Chapter 25

యూదా రాజైన అమజ్యా
25:1-4; 2 రాజులు 14:1-6
25:11-12; 2 రాజులు 14:7
25:17-28; 2 రాజులు 14:8-20

1అమజ్యా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్లవాడు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెహోయద్దాను.2అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు గాని పూర్ణహృదయంతో ఆయన్ని అనుసరించలేదు.

3రాజ్యం తనకు సుస్థిరం అయ్యాక అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించాడు.4అయితే <<తండ్రులు పిల్లల కోసం, పిల్లలు తండ్రులకోసం చావకూడదు, ప్రతి మనిషి తన పాపం కోసం తానే చావాలి>> అని మోషే గ్రంథం అయిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్న యెహోవా ఆజ్ఞ ప్రకారం అతడు వారి పిల్లలను చంపలేదు.

5అమజ్యా యూదావారందరినీ సమకూర్చి యూదా దేశమంతటా బెన్యామీనీయుల దేశమంతటా వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ నియమించాడు. అతడు 20 ఏళ్ళు మొదలు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిని లెక్కిస్తే, ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగిన యోధులు మూడు లక్షల మంది అయ్యారు.6అతడు ఇంకా లక్ష మందిని మూడు వేల నాలుగు వందల కిలోల వెండి ఇచ్చి జీతానికి కుదుర్చుకున్నాడు.

7దేవుని మనిషి ఒకడు అతని దగ్గరికి వచ్చి <<రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకు పోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారైన ఎఫ్రాయిమీయుల్లో ఎవరికీ తోడుగా ఉండడు.8ఆలా వెళ్లాలని నీకుంటే వెళ్ళు. యుద్ధం బలంగా చేసినా దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను పడగొడతాడు. సహాయం చేయడానికీ పడవేయడానికీ దేవుడు సమర్దుడే గదా>> అని చెప్పాడు.

9అమజ్యా అతనితో <<ఇశ్రాయేలువారి సైన్యానికి నేనిచ్చిన 3,500 కిలోల వెండి సంగతి ఏం చేద్దాం>> అని అడిగాడు. దానికతడు <<దీనికంటే ఇంకా ఎక్కువ యెహోవా నీకు ఇవ్వగలడు>> అని జవాబిచ్చాడు.10అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుంచి తన దగ్గరికి వచ్చిన సైన్యాన్ని వేరుపరచి <<మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళండి>> అని వారికి చెప్పాడు. అందుకు వారికి యూదావారి మీద తీవ్ర కోపం వచ్చింది. వారు మండిపడుతూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారు.

11అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన ప్రజలతో బయలుదేరి, ఉప్పు లోయ స్థలానికి పోయి శేయీరువారిలో 10,000 మందిని హతమార్చాడు.12ప్రాణాలతో ఉన్న మరొక 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని, వారిని ఒక కొండ అంచుకు తీసుకుపోయి అక్కడనుంచి వారిని పడవేస్తే వారు ముక్కలైపోయారు.

13అయితే తనతో యుద్ధానికి రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలు బేత్‌హోరోను వరకూ ఉన్న యూదా పట్టణాల మీద పడి వారిలో 3,000 మందిని చంపి విస్తారమైన దోపిడీ సొమ్ము పట్టుకు పోయారు.

14అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు ప్రజల దేవుళ్ళను తీసుకువచ్చి తనకు దేవుళ్ళుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు.15అందువలన యెహోవా కోపం అమజ్యా మీద రగులుకుంది. ఆయన అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు <<నీ చేతిలోనుంచి తమ ప్రజలను విడిపించే శక్తి లేని దేవుళ్ళ దగ్గర నీవెందుకు విచారణ చేస్తావు?>> అని అమజ్యాతో అన్నాడు.

16అతడు అమజ్యాతో మాటలాడుతుంటే, రాజు అతనితో<<మేము నిన్ను రాజుకు సలహాదారునిగా చేశామా? ఆగు. ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటావు?>> అన్నాడు. ఆ ప్రవక్త ఆగి <<దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడు. ఎందుకంటే నీవు నా సలహా పాటించ లేదు>> అన్నాడు.

17అప్పుడు యూదారాజు అమజ్యా తన సలహాదారులతో ఆలోచన చేసి <<రండి, మనం యుద్ధంలో ఒకరికొకరం తలపడదాం>> అని యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోయాషుకు కబురు పంపాడు.
18కాగా ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా తిరుగు సందేశం పంపాడు. <<<నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యి> అని లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి సందేశం పంపితే లెబానోనులో తిరిగే ఒక అడవి జంతువు ఆ ముళ్ళచెట్టును తొక్కివేసింది.19<నేను ఎదోమీయులను ఓడించాను> అని నీవనుకుంటున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భాలాడేలా చేస్తున్నది. ఇంటి దగ్గరే ఉండు. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వూ నీతో పాటు యూదావారూ ఓడిపోవడం ఎందుకు?>>

20ప్రజలు ఎదోమీయుల దేవుళ్ళ దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి వారి శత్రువుల చేతికి వారు చిక్కేలా దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ సందేశాన్ని అంగీకరించ లేదు.21ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరాడు. యూదాకు చెందిన బేత్షెమెషులో అతడూ యూదా రాజు అమజ్యా ఒకరినొకరు ఎదుర్కొన్నారు.

22యూదావారు ఇశ్రాయేలువారి ముందు నిలవలేక ఓడిపోయారు. ప్రతివాడూ తన గుడారానికి పారిపోయాడు.
23అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోయాషు యెహోయాహాజుకు పుట్టిన యోవాషు కొడుకూ, యూదారాజూ అయిన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకుని యెరూషలేముకు తీసుకు వచ్చి, యెరూషలేము ప్రాకారాన్ని ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూల గుమ్మం వరకూ 400 మూరల పొడుగున పడగొట్టాడు.24అతడు దేవుని మందిరంలో ఓబేదెదోము దగ్గర ఉన్న మొత్తం వెండి, బంగారం పాత్రలన్నీ రాజభవనంలో ఉన్న సొమ్మంతా తీసుకు షోమ్రోనుకు తిరిగి వెళ్లి పోయాడు.

25ఇశ్రాయేలు రాజూ యెహోయాహాజు కొడుకూ అయిన యెహోయాషు చనిపోయిన తరువాత యూదా రాజూ, యోవాషు కొడుకూ అయిన అమజ్యా 15 ఏళ్ళు బతికాడు.26అమజ్యా గురించిన ఇతర విషయాలు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసివున్నాయి.
27అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసిన తరువాత ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేశారు. అతడు లాకీషుకు పారిపోయాడు.28అయితే వారు అతని వెనుక లాకీషుకు మనుష్యులను పంపి అతణ్ణి అక్కడ చంపి, గుర్రాల మీద అతని శవాన్ని ఎక్కించి తీసుకువచ్చి యూదా పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర పాతిపెట్టారు.

Chapter 26

యూదా రాజైన ఉజ్జియా
26:1-4; 2 రాజులు 14:21-22; 15:1-3
26:21-23; 2 రాజులు 15:5-7

1అప్పుడు యూదా ప్రజలంతా 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను అతని తండ్రి అమజ్యాకు బదులు రాజుగా నియమించారు.2ఎలోతు పట్టణాన్ని కట్టించి, అది యూదా వారికి తిరిగి వచ్చేలా చేసింది ఇతడే. ఆ తరువాత రాజు తన పూర్వీకులతో పాటు కన్ను మూశాడు.

3ఉజ్జియా పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 16 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 52 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెకొల్యా.
4అతడు తన తండ్రియైన అమజ్యా చేసిన దాని ప్రకారం యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.5దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జెకర్యా రోజుల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లజేశాడు.

6అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణ ప్రాకారాలను పడగొట్టి, అష్డోదు దేశంలో ఫిలిష్తీయుల ప్రాంతంలో పట్టణాలను కట్టించాడు.7ఫిలిష్తీయులతో, గూర్బయలులో నివసించిన అరబీయులతో, మెయోనీయులతో అతడు యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు.8అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకూ ఐగుప్తు వరకూ వ్యాపించింది.

9ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు.10అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం.

11దీనికి తోడు, ఉజ్జియాకు పోరాడే యోధులున్నారు. వారు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధికారుల్లో కార్యదర్శి మయశేయా, ప్రధానమంత్రి యెహీయేలు వారి లెక్క ఎంతైనది చూసి పటాలాలుగా ఏర్పరచేవారు. వీరు హనన్యా చేతి కింద ఉన్నారు.12వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2,600 మంది.13రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది సైన్యం, వారి చేతి కింద ఉంది.

14ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లనూ, ఈటెలనూ, శిరస్త్రాణాలనూ, కవచాలనూ, విల్లులనూ, వడిసెలలనూ చేయించాడు.15అతడు అంబులనూ పెద్దరాళ్లనూ ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.

16అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు.17యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనివెంట లోపలికి వెళ్ళారు.18వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి<<ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు>> అని చెప్పారు.

19ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వేయడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్టురోగం పుట్టింది.20ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.

21రాజైన ఉజ్జియా చనిపోయే వరకూ కుష్టురోగిగానే ఉన్నాడు. కుష్టురోగిగా యెహోవా మందిరంలోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. అతని కొడుకు యోతాము, రాజ భవనం మీద అధిపతిగా దేశప్రజలకు న్యాయం తీర్చేవాడు.
22ఉజ్జియా గురించిన ఇతర విషయాలు ఆమోజు కుమారుడూ ప్రవక్త అయిన యెషయా రాశాడు.23ఉజ్జియా తన పూర్వీకులతో కూడా కన్ను మూశాడు. అతడు కుష్టురోగి అని రాజులకు చెందిన శ్మశానభూమిలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యోతాము అతనికి బదులు రాజయ్యాడు.

Chapter 27

యూదా రాజైన యోతాము
27:1-4, 7-9; 2 రాజులు 15:33-38

1యోతాము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా.2యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతని కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు.

3అతడు యెహోవా మందిర పై ద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలావరకూ కట్టించాడు.4అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.

5అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు.
6యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యధార్థం ప్రవర్తించాడు కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు7యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్దాలన్నిటినీ గురించి, అతని పద్ధతులను గురించి, ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసివున్నాయి.
8అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు.9యోతాము కన్ను మూసి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు.

Chapter 28

యూదా రాజైన ఆహాజు
28:1-27 - 2 రాజులు 16:1-20

1ఆహాజు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు 20 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతడు తన పూర్వికుడు దావీదులాగా యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించలేదు.2అతడు ఇశ్రాయేలు రాజుల విధానాల్లోనే నడిచి, బయలు దేవుడికి పోతవిగ్రహాలను చేయించాడు.

3బెన్‌ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు.4అతడు ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కింద, బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు.

5అందుచేత అతని దేవుడైన యెహోవా అతణ్ణి అరాము రాజు చేతికి అప్పగించాడు. అరామీయులు అతణ్ణి ఓడించి అతని ప్రజల్లో చాలమందిని బందీలుగా తీసుకుని దమస్కు తీసుకుపోయారు. యెహోవా అతణ్ణి ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఆ రాజు అతణ్ణి ఓడించాడు.6రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1,20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది.

7జిఖ్రీ అనే పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడు రాజ కుమారుడు మయశేయానూ రాజ భవన అధికారి అజ్రీకామునూ రాజు తరువాత ప్రముఖుడు ఎల్కనానూ చంపేసాడు.8ఇశ్రాయేలువారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ 2,00,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు.

9అయితే యెహోవా ప్రవక్త ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఓదేదు. అతడు షోమ్రోనుకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్ళాడు. వారితో ఇలా చెప్పాడు. <<మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించాడు. కాబట్టి ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు మిన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.10ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా?11అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.>>

12అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దల్లో యోహానాను కొడుకు అజర్యా, మెషిల్లేమోతు కొడుకు బెరెక్యా, షల్లూము కొడుకు యెహిజ్కియా, హద్లాయి కొడుకు అమాశా అనేవారు యుద్ధం నుంచి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇలా అన్నారు.13<<యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.>>

14కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు ఆ బందీలనూ కొల్లసొమ్మునూ విడిచిపెట్టారు.15పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు.

16ఆ కాలంలో ఎదోమీయులు మళ్ళీ వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు.17రాజైన ఆహాజు తనకు సహాయం చేయమని అష్షూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు.18ఫిలిష్తీయులు మైదానాల ప్రాంతంలోని పట్టణాలనూ యూదాలోని నెగేవునూ ఆక్రమించారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో దాని గ్రామాలనూ తిమ్నా దాని గ్రామాలనూ గిమ్జో దాని గ్రామాలనూ ఆక్రమించుకుని అక్కడ నివసించారు.

19ఆహాజు యూదాదేశంలో విగ్రహాలను పూజించి యెహూవా పట్ల ద్రోహం చేశాడు కాబట్టి యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దాన్నిబట్టి యూదాను అణచివేశాడు.20అష్షూరురాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి బలపరచడానికి బదులు బాధపరచాడు.21ఆహాజు, యెహోవా మందిరంలో నుంచి, రాజ భవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు, కానీ దాని వల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేక పోయింది.

22తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు.23ఎలాగంటే <<అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను>> అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి.
24ఆహాజు దేవుని మందిరపు సామాను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు.25యూదాదేశంలోని పట్టణాలన్నిటిలో అతడు అన్యుల దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి, తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు.

26అతని గురించిన ఇతర విషయాలు, అతని పద్ధతులను గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి.27ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు, గానీ ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతణ్ణి తేలేదు. అతని కొడుకు హిజ్కియా అతనికి బదులు రాజయ్యాడు.

Chapter 29

హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేయడం
29:1-2; 2 రాజులు 18:2-3

1హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.2అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు.

3అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి,4యాజకులనూ లేవీయులనూ పిలిపించి, తూర్పువైపున రాజవీధిలో వారిని సమకూర్చి5వారికిలా ఆజ్ఞాపించాడు. <<లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసికెళ్ళండి.>>

6<<మన పూర్వీకులు అవిధేయులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయన్ని విసర్జించి, ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు.7వారు వసారా తలుపులు మూసివేశారు. దీపాలు ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలం లో ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయలేదు. దహనబలులు అర్పించలేదు.

8అందుచేత యెహోవా ఉగ్రత యూదామీదా, యెరూషలేము మీదా పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికీ భయానికీ నిందకూ గురి చేశాడు.9అందుకే మన తండ్రులు కత్తి చేత కూలారు, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలయ్యారు.
10ఇప్పుడు మనమీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చేయాలని ఉద్దేశించాను.11నా కుమారులారా, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వేయడానికీ ఆయన ఎదుట నిలబడి సేవచేయడానికీ యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు.>>